16వ ఆర్థిక సంఘం సిఫారసులకు కేంద్రం ఆమోదం
పార్లమెంటులోనూ ప్రవేశపెట్టిన వైనం
నష్టాల్లో కూరుకుపోయిన పంపిణీ సంస్థలను వదిలించుకోవాలన్న ఆర్థిక సంఘం
కొనుగోలు చేసే సంస్థల కోసం ఎస్పీవీ ఏర్పాటు చేయాలని సూచన
ప్రస్తుత నష్టాలను ఆ ఎస్పీవీకి మళ్లించి రుణాల పునర్వ్యవస్థీకరణ చేయాలని స్పషీ్టకరణ
ఆర్థిక సంఘం సిఫారసుల ఆధారంగా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.21,517 కోట్లు
సరిగా పనిచేయని ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయాలన్న ఫైనాన్స్ కమిషన్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కమ్)ల ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా డిస్కమ్లను ప్రైవేటీకరించాలని 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయి భారంగా మారిన డిస్కమ్లను వదిలించుకోవాలని స్పష్టం చేసింది. అదే సమయంలో డిస్కమ్లను కొనుగోలు చేసే సంస్థలు నష్టాల్లో ఉన్నట్టయితే అవి మరింత నష్టాల్లోకి వెళ్లకుండా.. ఇప్పటికే ఉన్న నష్టాల కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేయాలని సూచించింది.
ప్రస్తుత నష్టాలను ఆ ఎస్పీవీకి మళ్లించి రుణాల పునర్వ్యవస్థీకరణ చేయాలని, ఆ రుణాల చెల్లింపులు వెంటనే చేయాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించాలని పేర్కొంది. ఇందుకోసం 16వ ఆర్థిక సంఘం కింద వచ్చే మూలధన పెట్టుబడి ప్రత్యేక ఆర్థిక సాయం నిధులు వినియోగించుకోవాలని సూచించింది. అయితే ఈ ప్రత్యేక ఆర్థిక సాయం నిధులను డిస్కమ్లను ప్రైవేటీకరించిన తర్వాత మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. 16వ ఆర్థిక సంఘం చేసిన ఈ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడమే కాకుండా, పార్లమెంట్లోనూ ప్రవేశపెట్టింది. రాష్ట్ర డిస్కమ్లు దాదాపు రూ.25 వేల కోట్ల మేరకు నష్టాల్లో ఉన్నట్లు సమాచారం.
ఈ తరహా పీఎస్యూలనూ వదిలించుకోవాలి
మూడు నాలుగేళ్ల నుంచి వరుస నష్టాల్లో ఉంటూ.. సరిగా పనిచేయని ప్రభుత్వ రంగ సంస్థలను సమీక్షించి వాటిని మూసివేయాలని లేని పక్షంలో వదిలించుకోవాలంటూ 16వ ఆర్థిక సంఘం మరో కీలక సిఫారసు చేయడం గమనార్హం. రాష్ట్రాల్లో ఇలా సరిగా పనిచేయని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు 308 ఉన్నట్లు ఫైనాన్స్ కమిషన్ గుర్తించింది. ఆయా సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు విధానాన్ని రూపొందించుకోవాలని కమిషన్ సిఫారసు చేసింది.
మూడునాలుగేళ్లుగా నష్టాల్లో ఉన్న, పనితీరు సరిగా లేని మరిన్ని సంస్థలను గుర్తించి అవి కేంద్రానివైతే కేంద్ర మంత్రివర్గం ముందుకు, రాష్ట్రాలకు చెందినవైతే రాష్ట్రాల మంత్రివర్గాల ముందుకు తీసుకుని రావాలని సూచించింది. ఆయా మంత్రివర్గాలు వాటిని మూసేయడమా? ప్రైవేటీకరించడమా? వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్నవాటిని కొనసాగించడమా? ఏదో ఒకటి చేయాలని స్పష్టం చేసింది.
సబ్సిడీల వ్యయం హేతుబద్ధీకరణ
రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీల వ్యయంపై సమీక్షలు నిర్వహించాలని, సబ్సిడీలను హేతుబద్ధం చేయాలంటూ ఆర్థిక సంఘం స్పష్టమైన సిఫారసు చేసింది. షరతులు లేని కొన్ని పథకాల్లో నగదు బదిలీ కారణంగా నిధులు దురి్వనియోగం అవుతున్నాయని వెల్లడించింది. ఏ వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలో అందుకు తగిన విధంగా కఠిన తరమైన సమీక్షలు నిర్వహించాలని, ప్రత్యేకమైన ప్రాతిపదికన అమలు చేయాలని సూచించింది.
బడ్జెటేతర రుణాలు తీసుకుని ఆర్థిక సబ్సిడీలకు వినియోగించుకునే విధానాన్ని వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల సబ్సిడీలు, వాటిని బదిలీలకు సంబంధించి ఒకేరకమైన విధానం లేదని ఆక్షేపించింది. ఈ సబ్సిడీ నిధులను సహాయం, గ్రాంట్లు, ఇతర వ్యయంగా చూపిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్డీపీలో వార్షిక ద్రవ్యలోటు మూడు శాతానికి మించి ఉండరాదని స్పష్టం చేసింది. బడ్జెటేతర రుణాలను కూడా ఇకపై బడ్జెట్లో తప్పనిసరిగా చూపించాలని తెలిపింది.
నిబంధనలు పాటిస్తేనే నిధులు!
రానున్న ఐదేళ్లలో రాష్ట్రానికి పంచాయతీరాజ్, మునిసిపల్ స్థానిక సంస్థలు, ప్రకృతి విపత్తుల నిర్వహణ కింద 16వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రూ.21, 517 కోట్లు రానున్నాయి. ఆర్థిక సంఘం నిధుల్లో 50 శాతం ప్రాథమిక వినియోగానికి, మరో 50 శాతం విధిగా పారిశుధ్యం, ఘనవ్యర్థాల నిర్వహణకు, తాగునీటి సౌకర్యం కోసం వినియోగించాలనే నిబంధన పెట్టింది. స్థానిక సంస్థల పనితీరు ఆధారంగా వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.
పంచాయతీరాజ్ స్థానిక సంస్థలకు ప్రాథమిక నిధుల కింద రూ.7,974 కోట్లు, గ్రామీణ స్థానిక సంస్థల పనితీరుకు రూ.997 కోట్లు, రాష్ట్ర పనితీరుకు రూ.997 కోట్లు కేటాయించింది. పట్టణ సంస్థలకు సంబంధించి రూ.9,239 కోట్లు ప్రాథమిక సౌకర్యాలకు, పట్టణ సంస్థల పనితీరుకు రూ.1,155 కోట్లు, రాష్ట పనితీరుకు రూ.1,155 కోట్లు కేటాయించింది. జనాభా నియంత్రణకు పనిచేసిన రాష్ట్రాలకు వెయిటేజీ ఉంటుందని 16వ ఆర్థిక సంఘం పేర్కొంది.
స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించడంతో పాటు అన్ని స్థానిక సంస్థల ఆడిటింగ్ పూర్తి చేస్తే ఆర్థిక సంఘం నిధులు అందుతాయని వెల్లడించింది. అలాగే రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించాల్సి ఉంటుందని తెలిపింది.


