ఢిల్లీ: ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో న్యాయవ్యవస్థపై అవినీతి పాఠం ఉండటంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సుమోటోగా కేసు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం న్యాయవ్యవస్థపై దాడి జరుగుతోందని వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థ అవినీతిమయమని బోధిస్తున్నారా ? అని సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పుస్తకంలోని ఆ చాప్టర్ ను ఉపసంహరించినా పుస్తకాలు ఆన్లైన్, మార్కెట్లోనే ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ఈ విచారణ నేపధ్యంలో ఎన్సీఈఆర్టీ క్షమాపణలు తెలిపింది. కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ, ఎన్సీఈఆర్టీ చైర్మన్లకు ధర్మాసనం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దానిలో కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని కోరింది. ఈ చాప్టర్కి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర , రాష్ట్ర విద్యాశాఖలు సమన్వయంతో వ్యవహరించి సర్క్యులేషన్ లో ఉన్న పుస్తకాలను సీజ్ చేయాలని తెలిపింది.
ఫిజికల్, డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో ఈ పాఠాన్ని తొలగించాలని, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దీనికి వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. అన్ని రాష్ట్రాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఈ ఆదేశాలను అమలు చేయాలి, అఫిడవిట్ దాఖలు చేయాలి. ఈ వివాదాస్పద కంటెంట్ ను తయారు చేసిన రచయితల పేర్లను, వివరాలు ఇవ్వాలని ధర్మాసనం కోరింది. న్యాయవ్యవస్థ పై దాడి జరుగుతోందని వ్యాఖ్యానించింది.


