‘లడ్డూ’పై బాబు సర్కారు ఏకసభ్య కమిటీ.. నేడు ‘సుప్రీం’లో విచారణ | Tirupati Laddu case to be heard in Supreme Court on February 23 | Sakshi
Sakshi News home page

‘లడ్డూ’పై బాబు సర్కారు ఏకసభ్య కమిటీ.. నేడు ‘సుప్రీం’లో విచారణ

Feb 23 2026 5:33 AM | Updated on Feb 23 2026 5:51 AM

Tirupati Laddu case to be heard in Supreme Court on February 23

ప్రతివాదిగా సీఎం చంద్రబాబు

ఏకసభ్య కమిటీ నియామకాన్ని సవాల్‌ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి ‘పిల్‌’

సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ సీఎం హోదాలో చంద్రబాబు రాజకీయ దురుద్దేశాలతో నిరాధార ఆరోపణలు చేయడం... దీనిపై స్వయంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సీబీఐ సిట్‌ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి, సొంత విచారణకు చంద్రబాబు ఏకసభ్య కమిటీని నియమించటాన్ని సవాల్‌ చేస్తూ బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు రానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది.

సీఎం అబద్ధాలు ప్రచారం చేశారు
రాజకీయ దురుద్దేశాలతో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లే­కుం­డా సీఎం చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేశారని, భక్తుల మనో­భావాలను దెబ్బ తీశారని తన పిటిషన్‌లో సుబ్రహ్మణ్య స్వా­మి తీవ్రంగా ఆక్షేపించారు. దీనిపై రాజకీయ కుట్రలు, వాస్తవాల­ను వెలికి తీసేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా స్వతంత్ర నిపుణుల కమిటీతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారు.

స్వయంగా ‘సుప్రీం’ పర్యవేక్షిస్తున్నా ఏకసభ్య కమిటీనా..? 
లడ్డూ ప్రసాదం విషయంలో నిగ్గు తేల్చేందుకు స్వయంగా సుప్రీంకోర్టు ఇప్పటికే జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ సిట్‌ విచారణ కొనసాగుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ దినేష్‌ కుమార్‌తో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయడం పట్ల సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, న్యాయ ప్రక్రియను పక్కదోవ పట్టించే యత్నమని పిటిషన్‌లో నివేదించారు.

కుట్ర బెడిసికొట్టడంతో కమిటీ పన్నాగం!
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని ఇప్పటికే ప్రతిష్టాత్మక ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ లాబ్‌లు స్పష్టం చేయగా సీబీఐ దర్యాప్తులోనూ అదే విషయం స్పష్టమైంది. దీనిపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఏ ఒక్క వైఎస్సార్‌సీపీ నేత పేరును ప్రస్తావించలేదు. దీంతో చంద్రబాబు దుష్ప్రచారం బెడిసికొట్టడంతో మరో కొత్త కుత్రంత్రానికి తెర తీశారు. తమకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకోవాలనే రాజకీయ కుట్రతో దినేష్‌ కుమార్‌ కమిటీని నియమించారు.

బాబు సర్కారుపై ‘సుప్రీం’ ఘాటు వ్యాఖ్యలు..
చంద్రబాబు సర్కారు దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకోవడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘కనీసం దేవుడినైనా మీ రాజకీయాలకు దూరంగా ఉంచండి..’ అంటూ చంద్రబాబునుద్దేశించి గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడం, ఏకంగా సుప్రీంకోర్టునే ధిక్కరిస్తూ చంద్రబాబు సర్కారు తాజాగా ఏకసభ్య కమిటీని నియమించడంపై దాఖలైన పిటిషన్‌ నేడు విచారణకు రానుండటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

స్వామి పిటిషన్‌లో ఆరుగురు ప్రతివాదులు వీరే..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం 
చంద్రబాబు (ఏపీ సీఎం)
సిట్‌ (రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు బందం)
సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ)
టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement