2026లో సిద్ధమైన బదిలీ ప్రక్రియ
సమగ్ర విధానంపై ఉపాధ్యాయుల్లో అనుమానాలు
గతేడాది మొత్తం ప్రక్రియ గందరగోళం
అస్పష్టతలను తొలగించకుండానే పదోన్నతులకు సిద్ధమైన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: గతేడాది చోటుచేసుకున్న అస్పష్టత కొనసాగుతున్న నేపథ్యంలోనే తాజాగా పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల రెగ్యులేషన్ చట్టం–2025 ప్రకారం బదిలీలు పదోన్నతులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే జిల్లాల నుంచి ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టీఐఎస్), లీప్ యాప్ వివరాల ఆధారంగా ఈ జాబితాలను రూపొందించారు.
టీఐఎస్, లీప్ యాప్ డేటా ఆధారంగా రూపొందించిన జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతోంది. ఫిర్యాదుల పరిశీలనకు డీఈవో నేతృత్వంలో గ్రీవెన్స్ కమిటీలు ఏర్పాటు చేయగా, ఈ వారంలో తొలి తాత్కాలిక జాబితా విడుదల చేసి, మార్చి 5, 15న సవరణ జాబితాలు, మార్చి 30 నాటికి తుది జాబితా ప్రకటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది జరిగిన బదిలీలకు సంబంధించి అపరిష్కృత అంశాలపై విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త బదిలీల చట్టం ప్రకారం చేపట్టిన అస్తవ్యస్థ బదిలీలతో ఇప్పటికే బోధన కుంటుపడుతుండడం గమనార్హం.
అపరిష్కృత అంశాలు..
⇒ గత ఏడాది మే, జూన్లలో 68 వేల మంది టీచర్లను బదిలీ చేశారు.
⇒ వీరిలో 4,477 మందికి పదోన్నతులతో కూడిన బదిలీలు కల్పించారు.
⇒ అయితే, ఏడాది పూర్తయ్యి, కొత్త బదిలీల ప్రక్రియ ప్రారంభమైనా వారిలో 17 వేల మందికి పైగా ఉపాధ్యాయులు రిలీవర్లు లేక ఇంకా పాత స్థానాల్లోనే డెప్యుటేషన్లపై కొనసాగుతున్నారు.
⇒ సాంకేతికంగా వీరంతా బదిలీ అయిన కొత్త పాఠశాలల్లో రిపోర్టు చేసినా, ఇంకా పాత పోస్టులోనే ఉన్నారు.
⇒ డీఎస్సీ–2025 ప్రక్రియ పూర్తయ్యి కొత్త టీచర్లు వస్తే సమస్య పరిష్కారమవుతుందని ఇప్పటిదాకా చెప్పుకొచ్చారు, అయితే, కొత్త టీచర్లు వచ్చారు గాని బదిలీ ఉపాధ్యాయులు కదిలే పరిస్థితి లేకపోయింది.
⇒ ప్రత్యేకంగా 9,600 మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో ‘ఒక తరగతి–ఒక టీచర్ విధానం అమలు చేస్తామని ప్రకటించినా, నియమితులైన ఉపాధ్యాయులు రిలీవర్లు లేక పాత స్కూళ్లలోనే ఉండిపోవడంతో అనేక చోట్ల హెచ్ఎంలే ఒక్కరే పాఠశాలను నడిపే పరిస్థితి ఏర్పడింది.
⇒ గతేడాది 3–5 తరగతులకు సబ్జెక్టు టీచర్ విధానాన్ని రద్దు చేశారు. దీంతో హైసూ్కళ్లల్లో మిగులు స్కూల్ అసిస్టెంట్లను బలవంతంగా పీఎస్ హెచ్ఎంలుగా సర్దుబాటు చేశారు. ఇలా 4,800 మందిని పంపించారు. తొలుత వీరి కేడర్ను పీఎస్ హెచ్ఎం/ఎస్ఏగా ఇచ్చారు. అనంతరం టీఐఎస్లో పీఎస్ హెచ్ఎంగా మార్చడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. దీంతో దిగొచి్చన విద్యాశాఖ తిరిగి ఎస్ఏను కూడా చేర్చింది. ఈ ఏడాది చేపట్టే బదిలీల్లో వీరికి అవకాశం ఇవ్వడం లేదని తెలుస్తోంది.
⇒ అయితే, గతేడాది తమను బలవంతంగా సర్దుబాటు మాత్రమే చేశారని, తమను కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
⇒ చట్ట ప్రకారం మూడేళ్ల సర్వీసు ఉంటేనే దరఖాస్తు పరిశీలనకు అవకాశం ఉంటుంది. మరీ టపీఎస్ హెచ్ఎంల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
⇒ గతేడాది చేపట్టిన గందరగోళ బదిలీల్లో దాదాపు 6,428 మంది మిగులుగా తేలారు. హేతుబద్ధీకరణ, ఉపాధ్యాయుల సర్దుబాటు అనంతరం 2,754 మందిని క్లస్టర్ మొబలైజ్ టీచర్లుగా ప్రకటించారు. మరో 3,674 మందిని హెచ్వోడీ పూల్లో ఉంచారు. ప్రస్తుత పదోన్నతులు, బదిలీల్లో తమను పరిగణనలోకి తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.


