ప్రభుత్వ అధికారి ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టలు | Odisha Mines Official Arrested, Vigilance Recovers Record ₹4.27 Crore In Cash, More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ అధికారి ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టలు

Feb 26 2026 10:55 AM | Updated on Feb 26 2026 11:14 AM

Record Rs 4 Crore Cash Seized From Arrested Odisha Officer

భువనేశ్వర్‌: కటక్‌ సర్కిల్, గనుల డిప్యూటీ డైరెక్టర్‌ను అరెస్టు చేసి అక్రమ ఆర్జన ఆరోపణ కింద రూ. 4.27 కోట్లు విజిలెన్స్‌ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. విజిలెన్సు చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక నగదు స్వాదీనంగా విజిలెన్సు అధికారులు బుధ వారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. కటక్‌ సర్కిల్, కటక్‌లోని గనుల డిప్యూటీ డైరెక్టర్‌ దేబబ్రత మహంతిని రాష్ట్ర విజిలెన్స్‌ బుధవారం అరెస్టు చేశారు. అనంతరం స్థానిక విజిలెన్స్‌ విభాగం ప్రత్యేక కోర్టు ప్రవేశ పెట్టారు. అవినీతి నిరోధక (సవరణ) చట్టం, 2018 కింద ఆయన వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి, కటక్‌ సర్కిల్, కటక్‌లోని గనుల డిప్యూటీ డైరెక్టర్‌ దేబబ్రత మహంతిని ఒడిశా విజిలెన్స్‌ అరెస్టు చేసినట్లు ప్రకటించారు. లైసెన్స్‌ పొందిన బొగ్గు విక్రేత బొగ్గు డిపో నిర్వహణ, బొగ్గు రవాణాకు అనుమతి ఇవ్వడానికి బదులుగా రూ. 30,000 లంచం గుంజుతుండగా విజిలెన్సు వలలో చిక్కారు.  

 స్థానిక శ్రీ విహార్, పటియా ప్రాంతం నేచర్స్‌ క్రెస్ట్‌ అపార్ట్‌మెంట్‌లో నిందితుని అద్దె భవనం, భద్రక్‌ మఠ సాహిలోని అతని కార్యాలయ ఛాంబర్‌పై ఏకకాలంలో సోదాలు జరిగాయి. విజిలెన్సు అధికారులు నిర్వహించిన సోదాల్లో  305.40 గ్రాముల బంగారు ఆభరణాలు, 600 గ్రాముల వెండి ఆభరణాలు స్వా«దీనం చేసుకున్నారు. సోదాల సమయంలో అతడి అద్దె భవనంలో ట్రాలీ బ్యాగులు, బీరువాల్లో దాచిపెట్టిన రూ. 4,27,13,600 నగదు బయటపడింది. దీన్ని విజిలెన్సు వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆయన ఆఫీస్‌ టేబుల్‌ డ్రాయర్, ఆయన వద్ద నుంచి రూ. 1.20 లక్షల నగదును అదనంగా స్వా«దీనం చేసుకున్నారు. సోదాల సమయంలో స్థానిక పొహలో వద్ద సుమారు 2,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక 2 అంతస్తుల భవనం ఉన్నట్లు గుర్తించారు. పెట్టుబడులు, డిపాజిట్లు, బీమా, పొదుపులు తదితర లావాదేవీలుకు సంబంధించి ఆరా తీస్తున్నారు. ఆర్జనకు మించిన ఆస్తుల గుర్తింపు కోణంలో తదుపరి విచారణ జరుగుతోంది.  

1968 మే 7న జన్మించిన దేబబ్రత మహంతి 2004 ఆగస్టు 9న బొలంగీర్‌లోని మైనింగ్‌ కార్యాలయంలో జూనియర్‌ మైనింగ్‌ ఆఫీసర్‌ (సీనియర్‌ సర్వేయర్‌)గా ప్రభుత్వ సేవలో చేరారు. ఆ తర్వాత ఆయన 2006 నుంచి 2008 వరకు బరిపదలో, 2009 నుంచి 2011 వరకు బరంపురం, 2011 నుంచి 2014 వరకు కటక్, 2014 నుంచి 2018 వరకు భువనేశ్వర్‌లోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అదే హోదాలో పని చేశారు. ఆయన మార్చి 2018లో అసిస్టెంట్‌ మైనింగ్‌ ఆఫీసర్‌ (చీఫ్‌ సర్వేయర్‌) హోదాకు పదోన్నతి పొంది సంబల్‌పూర్‌లో చేరారు. ఏప్రిల్‌ 2022 నుండి డిసెంబర్‌ 2025 వరకు ఫుల్బాణిలో మైనింగ్‌ ఆఫీసర్‌గా ఫుల్బణి, బౌధ్, నయాగఢ్‌ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించారు. 2026 జనవరి 7న కటక్‌ సర్కిల్‌లో కటక్, కేంద్రాపడా జిల్లాల పరిధితో గనుల డిప్యూటీ డైరెక్టర్‌గా చేరి ఇప్పటి వరకు కొనసాగుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement