బదులిచ్చే ధైర్యం ప్రధానికి లేదు: ఖర్గే | Congress Chief Mallikarjun Kharge slams PM Narendra Modi over speech in Rajya Sabha | Sakshi
Sakshi News home page

బదులిచ్చే ధైర్యం ప్రధానికి లేదు: ఖర్గే

Feb 7 2026 5:16 AM | Updated on Feb 7 2026 5:16 AM

Congress Chief Mallikarjun Kharge slams PM Narendra Modi over speech in Rajya Sabha

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం విమర్శలు గుప్పించారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రధానికి లేదన్నారు. ప్రభుత్వం సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నడపాలనుకోవడం లేదని ఆరోపించారు. పదేపదే అబద్ధాలు చెప్పడమే మోదీ పని అని ఆరోపించారు. 

‘‘రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై మోదీ తన 97 నిమిషాల ప్రసంగంలో ముఖ్యమైన, అవసరమైన విషయం ఒక్కటీ చెప్పలేదు. ఇంకా వందేళ్లు, 75 ఏళ్లు, 50 ఏళ్ల కిందటి సంగతులే మాట్లాడుతున్నారు’’ అని ఎద్దేవా చేశారు. ‘‘లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రస్తావించిన ఆర్మీ మాజీ చీఫ్‌ నరవణే పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదని అధికార పక్షం పార్లమెంటులో చెబుతోంది. తాము ఆ పుస్తకాన్ని బాహాటంగా చూపినా వారికి అర్థం కావడం లేదు. 

ముందుగా వాస్తవాలను శ్రద్ధగా విని, ఆపై సమాధానం చెప్పాలి’’ అని ఖర్గే అన్నారు. రాహుల్, కేంద్ర మంత్రి రవ్‌నీత్‌ బిట్టూ్ట వివాదంపైనా ఆయన స్పందించారు. సభ బయట ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను సిక్కులకు జరిగిన అవమానంగా ముద్ర వేశారని మండిపడ్డారు. ‘‘సిక్కులను కాంగ్రెస్‌ పార్టీ ఎంతో గౌరవిస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా, తర్వాత ప్రధానిగా పనిచేశారు’’ అని గుర్తు చేశారు. 

సిక్కులను, దళితులను, ఆదివాసీలను ఎవరినీ గౌరవించే అలవాటు లేనిది బీజేపీకేనన్నారు. ఇతరు లను ఎలా కించపరచాలా అనే మోదీ ఆలోచిస్తారని ఖర్గే ఆరోపించారు. ‘‘దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించిందే తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ. కానీ మోదీ మాత్రం వాటిని దివాలా తీసే కర్మాగారాలు అని పిలుస్తూ నెహ్రూపై విమర్శలు చేస్తున్నారు. దేశాన్ని నడిపే దార్శనికత  మోదీకి లేదు’’ అన్నారు. 

రాహుల్‌ ఏం ప్రశ్నలు అడుగుతారో, ఎలాంటి వాస్తవాలు బయటపెడతా రోనని మోదీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘లోక్‌సభలో మోదీపై దాడి జరుగుతుందని నిఘా సమాచారముందని చెబుతున్నారు. అంత గొప్ప ఇంటలిజెన్స్‌ పుల్వామా వంటి ఉగ్ర దాడుల సమయంలో ఏమైంది?’’ అని ఖర్గే ప్రశ్నించారు. ‘‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ బయటపడ్డ తరవాత మోదీ ఆందోళనగా ఉన్నారు. అందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు లొంగిపోయి ఆ దేశంతో ఏకపక్ష వాణిజ్య ఒప్పందం కుదుర్చు కున్నారు. తద్వారా మన దేశ రైతులను బలిపశు వులను చేశారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement