న్యూఢిల్లీ: లోక్సభలో వి పక్షాల ఆందోళనలు శుక్రవారం కూడా నిర్నిరోధంగా కొనసాగాయి. దాంతో కార్యకలాపాలేవీ సాగించకుండానే సభ మరోసారి వాయిదాపడింది. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు పలు అంశాలపై ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. స్పీకర్ ఓం బిర్లా వారించినా లాభం లేకపోయింది. దాంతో, ఇలాంటి అంతరాయాలతో ఈ సమావేశాల్లో ఇప్పటికే ఏకంగా 19 గంటల విలువైన సభా సమయం వృథా అయిందంటూ ఆయన ఆవేదన వెలిబుచ్చారు.
కాంగ్రెస్ సభ్యురాలు ప్రియాంకగాంధీ అడగాల్సిన ప్రశ్న కూడా జాబితాలో ఉందని తెలిపారు. అయినా లాభం లేకపోవడంతో, ఇటువంటి సభను తాను నడపలేనంటూ స్పీకర్ ఆగ్రహం వెలిబుచ్చారు. నాలుగు నిమిషాలకే సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సమావేశమయ్యాక కూడా అవే దృశ్యాలు కన్పించాయి. సభ్యులు నినాదాల నడుమ తిరిగి వెల్లోకి దూసుకెళ్లారు. తమ స్థానాల్లోకి తిరిగి వెళ్లాల్సిందిగా ప్యానెల్ స్పీకర్ కృష్ణప్రసాద్ తెన్నేటి పదేపదే విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
వారం రోజులుగా...
లోక్సభ గత సోమ వా రం నుంచీ విపక్షాల నిరసనలలో అట్టుడు కుతోంది. పలు అంశాలపై అధికార, విపక్షాలు నడుమ నువ్వా, నేనా అన్నట్టు తలపడుతున్నాయి. 2020 భారత్–చైనా ఘర్షణకు సంబంధించి నాటి ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణె రాసిన పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు రాహుల్ చేసిన ప్రయత్నం వివాదానికి దారి తీయడం తెలిసిందే. దానిపై మొదలైన రగడ కొనసాగుతూనే ఉంది. దాంతో రాష్ట్రప తి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని గత 22 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని సమాధానం లేకుండానే సభ ఆమోదించింది.
కాంగ్రెస్ నిరసన
లోక్సభ వాయిదా పడ్డాక పార్లమెంటు ప్రాంగణంలో మకరద్వారం వద్ద కాంగ్రెస్తో పాటు పలు ఇతర పారీ్టల ఎంపీలు నిరసనకు దిగారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, నరవణె పుస్తకం, 8 మంది ఎంపీల సస్పెన్షన్ తదితరాలపై నినాదాలతో హోరెత్తించారు. ‘వాణిజ్య వల’అంటూ అమెరికా ఒప్పందంపై బ్యానర్ ప్రదర్శించారు. ప్రియాంక, సస్పెండైన ఎంపీలతో పాటు పలువురు వీటిలో పాల్గొన్నారు.


