ప్రధాని సమాధానం లేకుండానే.. లోక్‌సభలో తీర్మానం ఆమోదం  | Motion of Thanks passed in Lok Sabha without PM Narendra Modi speech | Sakshi
Sakshi News home page

ప్రధాని సమాధానం లేకుండానే.. లోక్‌సభలో తీర్మానం ఆమోదం 

Feb 6 2026 2:17 AM | Updated on Feb 6 2026 2:17 AM

Motion of Thanks passed in Lok Sabha without PM Narendra Modi speech

22 ఏళ్ల తర్వాత అరుదైన పరిణామం 

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభ ఆమోదం తెలిపింది. పార్లమెంట్‌ చరిత్రలో గత 22 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధాని మోదీ బుధవారమే సమాధానం ఇస్తారని భావించినప్పటికీ, నినాదాలు, నిరసనల కారణంగా సభ గురువారానికి వాయిదా పడిన విషయం తెల్సిందే. 

గురువారం ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభమైన సభ కూడా కొద్దిసేపటికే వాయిదా పడింది. తిరిగి 12 గంటలకు సభ ఆరంభమయ్యాక సైతం ప్రధాని మోదీతో పాటు కేంద్రప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇండియా కూటమి ఎంపీలు నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాం«దీకి మాట్లాడే అవకాశం నిరాకరించారంటూ ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

‘నరేంద్ర–సరెండర్‌’ అంటూ ప్రధాని మోదీ వ్యతిరేక నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వెల్‌లోకి వెళ్లారు. కాశీలో మణికరి్ణక ఘాట్‌ వ్యవహారంపై బ్యానర్లు ప్రదర్శిస్తూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు.. టీఎంసీ, ఇతర ఇండియా కూటమి సభ్యులు కూడా వారికి జత కలిశారు. ఈ గందరగోళం మధ్యే జనవరి 28న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్‌ సభలో చదివి వినిపించారు. ఆ తీర్మానాన్ని మూజువాణి ఓటు ద్వారా సభ ఆమోదించింది. తీర్మానానికి ప్రతిపక్షాలు చేసిన సవరణలను స్పీకర్‌ తిరస్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement