ప్రారంభించిన హోం మంత్రి అమిత్ షా
మూడేళ్లలో దేశవ్యాప్తంగా సేవలు
న్యూఢిల్లీ: సహకార రంగంలో దేశంలోని మొట్టమొదటిసారి యాప్తో పనిచేసే రైడ్ ఆధారిత ‘భారత్ ట్యాక్సీ’రవాణా సేవలు గురువారం దేశ రాజధాని ఢిల్లీ–ఎన్సీఆర్(దేశ రాజధాని ప్రాంతం)లో ప్రారంభమయ్యాయి. ఈ సేవలను హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. వచ్చే మూడేళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఆయన వివరించారు. అముల్ వంటి దేశంలోని టాప్–8 సహకార సంస్థలు కలిసి ఈ వేదికను ఏర్పాటు చేశాయి.
ఈ వేదిక సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ నిర్వహణలో ఉంటుందని, దీనిని ఇఫ్కో, నాబార్డ్, అమూల్, క్రిభ్కో వంటి ప్రముఖ సంస్థలు ప్రమోట్ చేస్తున్నాయని మంత్రి వివరించారు. ఎస్బీఐ, ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, ఎయిర్పోర్ట్ అథారిటీ, ఇఫ్కో టోకియో ఇన్సూరెన్స్ వంటి సంస్థలతో భారత్ ట్యాక్సీ ఎంవోయూలను కుదుర్చుకుందన్నారు.
భారత్ ట్యాక్సీ ద్వారా డ్రైవర్ల ఆదాయం మరింతగా పెరగడంతోపాటు యజమానులుగా మారే అవకాశం కూడా వారికి రానుందన్నారు. యాప్ ఆధారిత ఇతర రైడింగ్ ఆధారిత రవాణా వేదికలు డ్రైవర్లకు తక్కువ ప్రతిఫలం అందిస్తున్నాయని చెప్పారు. లాభాలను భారత్ ట్యాక్సీతో సంబంధమున్న డ్రైవర్లందరికీ నేరుగా పంచుతామన్నారు. భారత్ ట్యాక్సీ వేదికలో మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తామన్నారు. ఈ యాప్లోనే సారథి దీదీ అనే ప్రత్యేక విండో అందుబాటులోకి రానుందన్నారు.
ఈ విండోలో బుక్ చేసుకున్న మహిళలను సారథి దీదీలే వచ్చి పికప్ చేసుకుంటారని అమిత్ షా వివరించారు. ప్రస్తుతం ఉబర్, ఓలా, రాపిడోల ప్రాబల్యమున్న ఈ రంగంలో మూడేళ్లలోనే భారత్ ట్యాక్సీ అగ్రస్థానానికి ఎదుగుతుందని, కశ్చిర్ నుంచి కన్యాకుమారి వరకు, ద్వారక నుంచి కామాఖ్య వరకు డ్రైవర్ల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతుందన్నారు. డిసెంబర్ 2 నుంచి ప్రయోగాత్మకంగా మొదలైన భారత్ ట్యాక్సీలో ఢిల్లీ–ఎన్సీఆర్లో 2.5 లక్షల మంది డ్రైవర్లు చేరారని, మరో 8.5 లక్షల మంది ప్రయాణికులు ఇందులో ఉన్నారని అమిత్ షా చెప్పారు.


