బెంగాల్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
చొరబాటుదార్లను కచ్చితంగా అడ్డుకుంటాం
అవినీతిపరులను కఠినంగా శిక్షిస్తాం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పషీ్టకరణ
బెంగాల్లో బీజేపీ కార్యకర్తలతో సమావేశం
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. చొరబాటుదార్లను కాపాడుతోందని, అవినీతిని వ్యవస్థీకృతంగా మార్చిందని, ఎన్నికల్లో లబ్ధి కోసం సరిహద్దుల్లో భద్రతను ఉద్దేశపూర్వకంగా గాలికొదిలేసిందని మండిపడ్డారు. దేశ భద్రత కోసం బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం అత్యవసరం అని తేల్చిచెప్పారు.
ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారక్పూర్లో శనివారం బీజేపీ కార్యకర్తల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది రాజకీయపరమైన అంశం కాదని.. దేశ భద్రత కోణంలో పార్టీని గెలిపించుకోవాలని స్పష్టంచేశారు.
చొరబాటుదార్లను ముద్దు చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ను చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి భూమి కేటాయించాలని కోర్టు ఆదేశించినా మమతా బెనర్జీ ప్రభుత్వం లెక్కచేయడం లేదని ఆరోపించారు. చొరబాటుదార్లను ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని, అంతిమంగా దేశ భద్రతకు ప్రమాదం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.
పొరుగుదేశం నుంచి పశ్చిమ బెంగాల్లోకి విచ్చలవిడిగా అక్రమ వలసలు కొనసాగుతున్నాయని చెప్పారు. చొరబాటుదార్లను అడ్డుకోవడానికి బెంగాల్ ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. చొరబాటుదార్లు బెంగాల్లో సులువుగా లభిస్తున్న ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొని దేశమంతటా విస్తరిస్తున్నారని చెప్పారు.
నేను హామీ ఇస్తున్నా..
‘‘సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహకరించడం లేదని సాక్షాత్తూ కలకత్తా హైకోర్టు తప్పుపట్టింది. బీఎస్ఎఫ్కు భూమి ఇవ్వడం లేదని ఆక్షేపించింది. కోర్టు ఆదేశాల ప్రకా రం మార్చి 31వ లోగా ప్రభుత్వం భూమి కేటాయించాలి. ప్రభుత్వం స్పందించినా స్పందించకపోయి నా.. నేను హామీ ఇస్తున్నా. ఏప్రిల్లో బీజేపీ ముఖ్యమంత్రి కొలువుదీరడం తథ్యం.
బీజేపీ ప్రభుత్వం రాగానే 45 రోజుల్లోగా కంచె నిర్మాణం పూర్తిచేస్తాం. హామీలు అమలు చేయడంలో రికార్డులు సృష్టించిన ఘనత బీజేపీదే. అస్సాంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక చొరబాటుదార్లను కట్టడి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్రమ వలసలు యథేచ్ఛగా జరిగాయి. బీజేపీ రాగానే పరిస్థితి మారిపోయింది. అస్సాం తరహాలో బెంగాల్లోనూ చొరబాట్లను అడ్డుకోవడం ఖాయం.
ఓటర్ల జాబితా ప్రక్షాళన జరగాల్సిందే
బెంగాల్లో కేవలం చొరబాటుదార్ల ఓట్ల కోసమే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను మమతా బెనర్జీ గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు. ఎవరికి నచ్చినా నచ్చకున్నా సరే ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదార్ల పేర్లు తొలగించక తప్పదు. ఓటర్ల జాబితా ప్రక్షాళన జరగాల్సిందే. బెంగాల్లో మతువా, నామశూద్ర సామాజిక వర్గాలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వేధింపులకు గురిచేస్తోంది.
ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో త్వరలో రాబోతున్న బీజేపీ ప్రభుత్వం మీకు రక్షణ కల్పిస్తుంది. మమతా బెనర్జీ పాలనలో అవినీతి వ్యవస్థీకృతంగా మారింది. అవినీతి మంత్రులకు ఎన్నికల్లో టికెట్లు నిరాకరించే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? బీజేపీ వచ్చాక అవినీతిపరులను కఠినంగా శిక్షిస్తాం. వందేమాతర గీతంపై పార్లమెంట్లో చర్చ చేపట్టడాన్ని తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించింది.
చొరబాటుదార్లను బుజ్జగించడానికే ఆరాటపడింది. అందుకే ఆ పార్టీని కూకటివేళ్లతో సహా పెకిలించివేయాలి. దేశభక్తులు, జాతీయవాదుల ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలి. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 50 శాతానికి పైగా ఓట్లు సాధించి అధికారంలోకి వస్తుంది. 2026 సంవత్సరం తృణమూల్ కాంగ్రెస్కు టాటా, బైబై చెప్పే సంవత్సరం’’అని అమిత్ షా స్పష్టంచేశారు.


