ఢిల్లీ: లోక్సభలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంతవరకు సస్పెన్షన్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, గుర్జీత్ ఓజ్లా, రాజా వారింగ్, హిబి ఈడెన్, చామల కిరణ్కుమార్రెడ్డి ఉన్నారు. స్పీకర్ తీరుకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో సస్పెండ్ అయిన ఎంపీల ఆందోళనకు దిగారు.
రాహుల్ గాంధీ ‘చైనా’ కామెంట్స్పై ఉదయం నుంచి లోక్సభలో చర్చ జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. భారత్-చైనా సరిహద్దు వివాదానికి సంబంధించి మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవాణే ఇంకా ప్రచురించని పుస్తకం ఆధారంగా వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ.. భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభలో వ్యాఖ్యలు చేయడంతో వివాదం నెలకొంది.
విపక్ష సభ్యులు.. సభాపతి చైర్ వైపు కాగితాలను విసిరేయడంతో గందరగోళం నెలకొంది. 8 మంది ప్రతిపక్ష ఎంపీలను లోక్సభ సస్పెండ్ చేసింది. ఈ వ్యాఖ్యల్ని హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. అనంతరం లోక్సభ కార్యకలాపాలు రేపటికి వాయిదా పడ్డాయి.
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభలో 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని.. 8 మందిలో తానూ ఉన్నానని తెలిపారు. స్పీకర్.. రాహుల్ గాంధీ మైక్ను కట్ చేయడాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేశారు. రాహుల్ గాంధీ ఎన్నో సందర్భాలలో వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేస్తే సమావేశాన్ని వాయిదా వేసే విధంగా ప్రవర్తించారు. దేశ ప్రజల ముందు కాంగ్రెస్ ఎంపీల వలనే సభ వాయిదా పడుతున్నట్టు బీజేపీ ప్రచారం చేస్తున్నారు.
నరేంద్ర మోదీ ట్రంప్కు సరెండర్ అయ్యారు. రాష్ట్రపతి ప్రసంగంపై జరుగుతున్న డిబేట్లో రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే ఆయన మైకు కట్ చేశారు. ఆయన మైక్ కట్ చేస్తే మేము ఎందుకు కట్ చేశారని అడిగేందుకు స్పీకర్ పోడియం ముందుకు వెళ్లాం. 8 మందిపై కావాలనే సస్పెన్షన్ వేటు వేశారు. మా నోరు మూయించాలనే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. మిగతా ఎంపీలందరూ మా తరఫున రేపు సభలో ప్రశ్నిస్తూనే ఉంటారు. రేపు పార్లమెంట్ ఆవరణలో సస్పెన్షన్ గురైన ఎనిమిది మంది ఎంపీలం ఆందోళన చేస్తాం.
స్పీకర్ అనే వ్యక్తి ఏ కులానికి చెందినవారనేది మేము చూడలేదు. మాకు అవకాశం ఇవ్వకపోవడంతోనే ఆందోళన చేశాం. మేం మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తున్నారు. బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుంది’’ అని కిరణ్ కుమార్రెడ్డి మండిపడ్డారు.


