మీరా భయందర్: మహారాష్ట్రలోని మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ డింపుల్ మెహతా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఆమె ఎన్నికను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్), మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరాఠీ మాట్లాడే నేతలను మాత్రమే మేయర్గా నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 95 మంది కార్పొరేటర్లు ఉండగా, బీజేపీ 78 స్థానాలతో తిరుగులేని శక్తిగా నిలిచింది. ఇతర పార్టీల పరంగా చూస్తే.. కాంగ్రెస్కు 13 మంది, శివసేన (షిండే వర్గం) కు ముగ్గురు కార్పొరేటర్లు ఉన్నారు. అలాగే ఒక బీజేపీ రెబల్ అభ్యర్థి అనిల్ పాటిల్ విజయం సాధించారు. అతను బీజేపీకే మద్దతు ప్రకటించడంతో డింపుల్ మెహతా విజయం మరింత సులభమయ్యింది.
మేయర్ ఎన్నికల్లో బీజేపీ బలాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, శివసేన (షిండే వర్గం) చేతులు కలిపాయి. ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించాయి. బీజేపీ తరపున సీనియర్ నేత నరేంద్ర మెహతా మరదలు డింపుల్ మెహతా పోటీ చేయగా, ఆమెకు సవాల్ విసురుతూ కాంగ్రెస్-శివసేన కూటమి రుబినా ఖాతూన్ను తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. బలాబలాల పరంగా బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, విపక్షాలు ఏకమై పోటీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. అటు ప్రాంతీయ భాషా వాదం, ఇటు రాజకీయ వ్యూహాల మధ్య సాగిన ఈ ఎన్నికల్లో చివరికి బీజేపీ తన పట్టు నిలుపుకుంది. డింపుల్ మెహతా గెలుపుతో మీరా భయందర్లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి: ముంబై మేయర్ పీఠం: ‘మహాయుతి’లో ముదిరిన పేచీ


