బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై దాడి జరిగింది. గుర్తు తెలియని ఓ దుండగుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ముంబై జుహులోని రోహిత్ శెట్టి నివాసంపై అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగుడు.. వెంటనే బైక్పై పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో ఐదు బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్న ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
అయితే ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో, చుట్టుపక్కల భారీ భద్రతను మోహరించారు. ముంబయి పోలీసు కమిషనర్ దేవన్ భారతి ఈ సంఘటనను ధృవీకరించారు. అయితే రోహిత్ శెట్టి కుటుంబం ఈ సంఘటనపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.
సినిమా కెరీర్..
కాగా.. రోహిత్ శెట్టి.. జమీన్, గోల్మాల్, సింగం, చెన్నై ఎక్స్ప్రెస్, సింగం రిటర్న్స్, సూర్యవంశీ, సర్కస్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. చివరగా సింగం అగైన్ సినిమా తీశాడు. అజయ్ దేవ్గణ్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, దీపికా పదుకుణె, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.370 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం రోహిత్ శెట్టి 'గోల్మాల్' ఫ్రాంచైజీలో 5వ సినిమా తీస్తున్నాడు.


