ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. వీటిలో పాల్గొని ఊరికి వచ్చిన బిహార్ పూర్ణియా నియోజకవర్గ ఇండిపెండెంట్(స్వతంత్ర) ఎంపీని పాట్నా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. శుక్రవారం అర్థరాత్రి దాదాపు మూడు గంటల పాటు ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది. ఎట్టకేలకు పోలీసులు.. 31 ఏళ్ల క్రితం నాటి కేసులో పప్పు యాదవ్ని అరెస్ట్ చేశారు.
కేసు ఏంటి?
1995లో వినోద్ బిహారి లాల్ అనే వ్యక్తికి సంబంధించిన ఇంటిని అద్దెకు తీసుకున్న పప్పు యాదవ్.. తర్వాత దాన్ని కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో వినోద్.. అప్పట్లో పోలీసులని ఆశ్రయించారు. పప్పు యాదవ్పై ఫోర్జరీ, మోసం, బెదిరింపులు తదితర సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులోనే తాజాగా కోర్టు వారెంట్ జారీ చేసింది. దీనిని తీసుకుని పోలీసులు.. శుక్రవారం రాత్రి పాట్నాలోని మందిరి ప్రాంతంలో ఉన్న పప్పు యాదవ్ ఇంటికి వచ్చారు. కానీ అరెస్ట్ చేసేందుకు మూడు గంటలకు పైగానే పట్టేసింది.
50 మంది పోలీసులు వచ్చినప్పటికీ.. పప్పు యాదవ్ అనుచరలు రంగంలోకి దిగడంతో పెద్ద హైడ్రామా నడిచింది. ఎట్టకేలకు భారీ బందోబస్తు నడుమ పప్పు యాదవ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల చేసి అనంతరం పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్లే అవకాశముంది. అయితే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం తనని వేధిస్తోందని.. అరెస్ట్ సమయంలో పప్పు యాదవ్ మండిపడ్డారు.


