బైకర్‌పై దూకి.. లాక్కెల్లి చంపిన పెద్దపులి | Arunachal Pradesh Tiger Attack Constable Bike Video Viral | Sakshi
Sakshi News home page

బైకర్‌పై దూకి.. లాక్కెల్లి చంపిన పెద్దపులి

Feb 6 2026 4:15 PM | Updated on Feb 6 2026 4:30 PM

Arunachal Pradesh Tiger Attack Constable Bike Video Viral

అరుణాచల్ ప్రదేశ్‌లో అరుదైన విషాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌పై పెద్దపులి దాడి చేసి ప్రాణం తీసింది. అయితే ఈ ఘటన జరిగిన రెండ్రోజులకే ఓ పులి అనూహ్యంగా తుపాకీ తూటా గాయంతో చనిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో ఇది కానిస్టేబుల్‌ మరణానికి ప్రతీకార దాడినా? లేదంటే వేటగాళ్ల పనా? అనే అనుమానాలు తలెత్తాయి. 

అరుణాచల్ ప్రదేశ్ పోలీస్‌ విభాగంలో చిక్సెంగ్‌ మాన్‌పుంగ్‌ రేడియో ఆపరేటర్‌గా విధులు నిర్వహించాడు. లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లా మయోడియాలో ఆయన డ్యూటీ నిర్వహించేవాడు. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం అనిని నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో.. రోయింగ్ రహదారిపై ఘోరం జరిగింది. బైక్‌పై వెళ్తున్న టైంలో ఓ పెద్దపులి హఠాత్తుగా ఆయనపై దాడి చేసింది. 

ఆ దారిన వెళ్లే వాహనదారులు.. రోడ్డు పక్కన బైక్‌ పడి ఉండడం చూసి యాక్సిడెంట్‌ కావొచ్చని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. తెల్లవారి అటుగా వెళ్లిన వాళ్లకు.. పక్కన పొదల్లో రక్తపు మడుగులో ఆయన మృతదేహం కనిపించింది. వాళ్లు పోలీసులకు సమాచారం అందించగా.. అది పెద్దపులి చేసిన దాడిగా నిర్ధారించుకున్నారు. చిక్సెంగ్‌ మరణంతో పోలీస్‌ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 

ఈ ఘటన తర్వాత అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓ ఆడపులి మూడు కూనలతో ఆ ప్రాంతంలో సంచరిస్తుందని గుర్తించారు. కూనల్ని రక్షించుకునే క్రమంలోనే అది దాడి చేసి చంపి ఉంటుందని భావించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో మనుషులపై పులులు దాడులు చేయడం అత్యంత అరుదు. దీంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించింది. 
 

 
ఈ ఘటనతో మయోడియా ప్రాంతంలో రాత్రి పూట ద్విచక్ర ప్రయాణాలపై నిషేధం విధించారు. అయితే.. రెండు రోజుల తర్వాత అదే ప్రాంతంలో ఒక పులి మృతదేహం తుపాకీ గాయాలతో కనుగొన్నారు. ఇది ప్రతీకార చర్య కావచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అదే సమయంలో వేటగాళ్ల దాడి అయ్యి ఉండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

ఈ మధ్యకాలంలో మయోడియా–మెహావో వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం పరిసరాల్లో పులుల సంచారం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే.. చిక్సెంగ్‌ మాన్‌పుంగ్‌ను చంపింది చనిపోయిన పులినేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

మరోవైపు.. సోషల్ మీడియాలో రోడ్డు మీద పులులు రాత్రి పూట సంచరించడం, వాహనాలను వెంబడించడం వైరల్‌ అవుతోంది. బైకర్ల మీదకు పులి దూకిన వీడియోను చిక్సెంగ్‌ మాన్‌పుంగ్‌ దాడి వీడియో అంటూ వైరల్‌ చేస్తున్నారు. అటుగా ఓ వాహనంలో వెళ్లే వాళ్లు ఆ వీడియో తీసినట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే అధికారులు ఇవేం అధికారిక వీడియోలు అని చెప్పడం లేదు.  వైరల్ అవుతున్న పులి వీడియోలు ఏఐవి కావని.. వేరే సందర్భాల్లో తీసినవని తెలుస్తోంది.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement