కేంద్ర హోం మంత్రి జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జమ్మూ వెళ్లిన ఆయన భద్రతాబలగాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలతో సమీక్ష నిర్వహించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అమిత్షా పర్యటనకు కొద్ది గంటల ముందే జమ్మూ ప్రాంతంలో భద్రతా బలగాలు ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టడం కలకలం రేపింది
అమిత్షాకు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్అబ్దుల్లా ఇతర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం హీరానగర్ సెక్టార్లోని గుర్నామ్, బోబియాన్ పోస్టులను సందర్శించారు. BSF బలగాలకు సంబంధించిన ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రారంభించారు. అనంతరం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి భద్రతా పరిస్థితులపై ఆరా తీశారు. అదేవిధంగా గతేడాది వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాన్ని అమిత్ సందర్శించారు.
రేపు జమ్మూలోని లోక్భవన్లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్సిన్హాతో పాటు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. జమ్ము ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తెలుసుకుంటారు. ఉగ్రవాదుల ఎరివేతకు వారు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రికి అధికారులు వివరించనున్నారు. అనంతరం ఇటీవల ఉగ్రవాదుల దాడుల్లో అమరులైన జవాన్ల కుటుంబాలతో అమిత్షా ప్రత్యేకంగా భేటీ అయి వారికి పరిహారం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా అమిత్షా పర్యటనకు కొద్దిగంటల ముందు కిష్త్వార్, ఉదంపూర్ జిల్లాలలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో పాకిస్థాన్కు చెందిన ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.


