ఢిల్లీ: ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి ప్రధాన రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ల్లో ప్రయాణించే వారికి ముఖ్య గమనిక. రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్కు సంబంధించిన డ్రైవర్లు రేపు(శనివారం) దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. దీంతో, రేపు సేవలకు అంతరాయం కలగనుంది. ఈ సమ్మెకు తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్స్ ఫోరమ్ (TADF) పిలుపునిచ్చింది.
అయితే, తమ సమస్యలను పరిష్కరించాలని, కనీస బేస్ ఛార్జీలను ఖరారు చేయాలని ఆయా రైడ్ హెయిలింగ్ ప్లాట్ ఫామ్ డ్రైవర్లు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఛార్జీల విధానాలపై తీవ్ర అసంతృప్తి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై నిరసన వ్యక్తం చేయడమే ఈ సమ్మెకు ప్రధాన కారణం. అలాగే, అస్థిరమైన పని స్థితిగతులు, ప్రభుత్వ నుండి ఎటువంటి సహాయ సహకారాలు, స్పందన లేకపోవడం, ఆర్థిక భద్రత లేకపోవడం వంటి కారణాలతో సమ్మెకు దిగనున్నారు. డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడమే ఈ సమ్మె, నిరసనల ప్రధాన ఉద్దేశమని టీఏడీఎఫ్ పేర్కొంది.
సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్లాట్ఫామ్లు జవాబుదారీతనం లేకుండా పనిచేస్తున్నాయని మండిపడింది. కనీస బేస్ ఛార్జీలను ప్రకటించనందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఈ యూనియన్ విమర్శించింది. దీనివల్ల డ్రైవర్ల సంపాదనను తగ్గించడానికి, కమిషన్ ఛార్జీలను పెంచడానికి ఆయా కంపెనీలకు వీలు లభిస్తోందని అభిప్రాయపడింది.


