సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో ఆస్తిపన్ను వసూళ్లు పెంచుకునేందుకు జీహెచ్ఎంసీ చర్యలకు సిద్ధమైంది. రెడ్ నోటీసుల జారీకి శ్రీకారం చుట్టింది. తొలుత జోన్లు, సర్కిళ్ల పరిధిలో భారీ బకాయిలున్న వారిని గుర్తిస్తున్నారు. ఇంకా ఆస్తిపన్ను చెల్లించని వారందరికి కూడా వీటిని జారీ చేయనున్నారు. కొన్ని సర్కిళ్లలో ఇప్పటికే రెడ్ నోటీసుల జారీ ప్రారంభం కాగా, మిగతా సర్కిళ్లలోనూ సిద్ధమవుతున్నారు. రెడ్ నోటీసుల్లో పేర్కొన్న గడువులోగా ఆస్తిపన్ను చెల్లించని వారిపై చట్ట ప్రకారం దుకాణాలు సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకునే వీలుంది.
పరిష్కారమేదీ?
గతంలో ఫిబ్రవరి నుంచి మార్చి దాకా ప్రతి ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒకపూట ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం (పీటీపీ) పేరిట జీహెచ్ఎంసీ అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేవారు. ప్రజలు ఆస్తిపన్నుకు సంబంధించి వాస్తవ విస్తీర్ణం కన్నా తమకు ఎక్కువ ఆస్తిపన్ను పడినా ఇతరత్రా వ్యత్యాసాలున్నా, ఆస్తిపన్ను చెల్లించినప్పటికీ, రికార్డుల్లో నమోదు కాకపోయినా, తదితర సమస్యల్ని అధికారుల దృష్టికి తెచ్చేవారు. సంబంధిత ట్యాక్స్ సెక్షన్ అధికారులతో పాటు డిప్యూటీ, జోనల్ కమిషనర్లు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సందేహాలను నివృత్తి చేసి ఇబ్బందులు తీర్చేవారు.
ఈ ఫిబ్రవరిలో ఒక ఆదివారం ముగిసిపోయినా, ఇప్పటి వరకు ఇంకా పీటీపీ ప్రకటించలేదు. పీటీపీ నిర్వహిస్తే ప్రజలు తమ సందేహాలు తీర్చుకునేందుకు వీలుంటుంది. కానీ అధికారులు ఇంతవరకు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. రెండేళ్లుగా ఈ అంశంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రెండు నెలలు నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని 2024లో కేవలం మార్చిలో నిర్వహించారు. గత ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచి నిర్వహించారు. ఈ సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారో.. అసలు నిర్వహిస్తారో లేదో తెలియని పరిస్థితి.


