బాధలు తట్టుకోలేక బలవన్మరణం
వేర్వేరుచోట్ల ఐదుగురి ఆత్మహత్య
ఇంట్లో గొడవలతో వివాహిత..
కీసర: ఇంట్లో గొడవల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కీసర పోలీసులు తెలిపిన మేరకు.. తమిళనాడుకు చెందిన కార్తీక్, భార్య సుభాషిణి (30), ఇద్దరు పిల్లలతో కలిసి కీసరలో నివసిస్తున్నారు. కొంత కాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం కార్తీక్ తల్లికి సుభాషిణికి మధ్య గొడవ జరిగింది. ఇంట్లో గొడవ జరుగుతోందని భర్తకు ఫోన్ చేసినా రాలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సుభాషిణి తన సోదరుడికి మెసేజ్ పంపింది. సోదరుడు వచ్చేలోపు ఇంట్లో ఉరివేసుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
పని ఒత్తిడితో సాఫ్ట్వేర్ ఉద్యోగి..
మియాపూర్ : పని ఒత్తిడి తట్టుకోలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మియాపూర్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ తెలిపిన మేరకు.. ఉండ్రు సతీష్(31) దంపతులు మియాపూర్ బీకే ఎన్క్లేవ్ కాలనీలో నివాసముంటున్నారు. వీరితోపాటు సతీష్ తమ్ముడు వెంకటకృష్ణ కూడా ఉంటున్నాడు. సతీష్ గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సంక్రాంతి పండుగకు భార్య ఊరికి వెళ్లింది. బుధవారం ఉదయం 9 గంటలైనా సతీష్ బెడ్ రూమ్ తలుపులు తీయకపోవడంతో తమ్ముడు వెంకటకృష్ణ తలుపు తట్టినా స్పందించలేదు. దీంతో తలుపులు బద్దలు కొట్టి వెళ్లి చూడగా సతీష్ ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించాడు. మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పని ఒత్తిడి కారణంగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
భవనం పైనుంచి దూకి మహిళ.. కేపీహెచ్బీకాలనీ: ఓ మహిళ తాను పనిచేసే ల్యాబ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన శ్రీనివాసులు, అనిత భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కూతురు ఉంది. ఐదేళ్ల క్రితం వీరికి వివాహమైంది. బాచుపల్లి ప్రాంతలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాసులు ఫార్మా కంపెనీలో పని చేస్తుండగా అనిత (23) కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతంలోని సీబీసీఐడీ కాలనీలోని ల్యాబ్లో పనిచేస్తోంది. బుధవారం మధ్యాహ్నం సమయంలో ల్యాబ్ భవనం మూడో అంతస్తు నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు గమనించి వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. కేపీహెచ్బీ పోలీసులు భర్త శ్రీనివాసులును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనిత తల్లిదండ్రులు వచ్చిన తరువాత ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
రోజూ తమకు ఎదురయ్యే బాధలు తట్టుకోలేక ఐదుగురు వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. కీసర పోలీస్ స్టేషన్పరిధిలో వివాహిత, మియాపూర్ పీఎస్పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి, నిరుద్యోగి, కూకట్పల్లి పరిధిలో యువకుడు, కేపీహెచ్బీ పరిధిలో ఓ మహిళ బలవన్మరణం చెందారు.
గడ్డిమందు తాగి యువకుడు..
మియాపూర్: కడప జిల్లా, బద్వేల్కు చెందిన వెంకటేష్ (30) ఉద్యోగం కోసం ఈ నెల 3న మియాపూర్కు వచ్చాడు. అదే రోజు రాత్రి 10.30 గంటలకు మియాపూర్ మాతృశ్రీనగర్ కాలనీలోని బొమ్మరిల్లు సమీపంలో గడ్డి మందు తాగాడు. ఆ తరువాత అతనే స్వయంగా 108 కు ఫోన్ చేసి చెప్పాడు. సిబ్బంది వచ్చి శ్రావణీ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం మాదాపూర్లోని ఆస్పత్రి మెయిన్ బ్రాంచ్కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడు బావమరిది వెంకటసుబ్బయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.


