breaking news
Hyderabad Latest News
-
టిమ్స్.. ఎప్పుడో?
సాక్షి, సిటీబ్యూరో: నగర ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న సనత్నగర్ టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) ఆస్పత్రి ప్రారంభం మరింత ఆలస్యమవుతుందనే విషయం స్పష్టమవుతోంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 9న ఆస్పత్రిని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. కాగా.. ఆస్పత్రి ప్రారంభానికి సంబంధించి డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)ఉన్నతాధికారుల నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన ఇప్పటికీ రాలేదు. ప్రభుత్వం కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లోనే ఈ ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉంది. పనులు ఆలస్యం కావడంతో ఆస్పత్రి ప్రారంభం వాయిదా పడుతోంది. రూ.2,600 కోట్ల అంచనాతో.. నగరంలోని ఎల్బీనగర్, సనత్నగర్, అల్వాల్లో రూ.2,600 కోట్ల అంచనా వ్యయంతో టిమ్స్ ఆస్పత్రులను నిర్మించాలని ప్రభుత్వం భావించింది. 2025 ఏప్రిల్ మొదటి వారంలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. కాగా.. ఇందులో ఏ ఒక్క ఆస్పత్రి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయలేదు. మరోవైపు నిర్మాణ ఖర్చులు పెరిగాయని అంచనాలను రివిజన్ చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి, అంచనా వ్యయాన్ని తగ్గించినట్లు ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా.. నగరంలోని సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రి పనులు చివరి దశకు రావడంతో ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. అంతా గోప్పంగానే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోవడం, సోనియా గాంధీ పుట్టిన రోజైన డిసెంబరు 9న ఆస్పత్రిని ప్రారంభించాలని నిర్ణయించా రు. గత రెండు నెలల నుంచి నిర్మాణ సంస్థ పను ల్లో వేగం పెంచింది. వైద్య పరికరాలు, వైద్యు లకు అవసరమైన మౌలిక సదుపాయాలు, రోగులకు అవసరమైన వార్డులు, ఓపీ, ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు అయ్యాయా? లేదా? అనేది అంతు చిక్కని ప్రశ్నగానే కనిపిస్తోంది. ఆస్పత్రి ప్రాంగణంలోకి ఇతరులను అనుమతించడంలేదు. టిమ్స్ ఆస్పత్రుల పనులు, నిధులు, వ్యయం అంచనాల రివిజన్ ఇతర అంశాలన్నీ గోప్యంగా ఉంచుతున్నా రు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) నేరుగా వీటిని పర్యవేక్షిస్తున్నారని, తమకు ఎలాంటి సమాచారం లేదని కింది స్థాయి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎల్బీనగర్, అల్వాల్లో మా త్రం మరికొంత సమయం ఎదురుచూడాల్సిందే. నిర్మాణంలో సనత్నగర్ టిమ్స్ భవనంసనత్నగర్ హాస్పిటల్ డిసెంబర్ 9న ప్రారంభిస్తామన్న సీఎం తుది మెరుగులు దిద్దుకుంటున్న భవన నిర్మాణ పనులు ఏర్పాట్ల ఊసెత్తని డీఎంఈ కార్యాలయ అధికారులు -
కొత్త రేషన్ కార్డులు.. నత్తనడకనే!
● క్షేత్ర స్థాయి విచారణలో నిర్లక్ష్యం ● మళ్లీ అందని ద్రాక్షగా మారిన కొత్త రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అయినా పెండింగ్లో దరఖాస్తులు ఎల్బీ నగర్కు చెందిన ఓ నిరుపేద మహిళ మీ–సేవ కేంద్రం ఆన్లైన్ ద్వారా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. రాజేంద్రనగర్లోని పౌరసరఫరాల శాఖలో, సరూర్నగర్ సర్కిల్ ఆఫీస్లో దరఖాస్తు పత్రాలను సమర్పించింది. 6 నెలలు గడిచినా ఇప్పటి వరకు కనీసం క్షేత్ర స్థాయి విచారణ ముందుకు సాగలేదు. స్వయంగా మూడు, నాలుగు పర్యాయాలు సర్కిల్ ఆఫీస్కు వెళ్లినా..సంబంధిత సహాయ పౌరసరఫరాల అధికారి మాత్రం అందుబాటులో లేకుండా పోయారు. అక్కడి సిబ్బందితో కొత్త రేషన్కార్డు దరఖాస్తు పెండెన్సీపై అడిగితే..సరైన సమాధానం లభించలేదు. కొత్త రేషన్ కార్డు పేద కుటుంబానికి అందని ద్రాక్షగా తయారైంది..ఇలాంటి ఉదంతాలు నగరవ్యాప్తంగా అనేకం ఉన్నాయి. సాక్షి, సిటీబ్యూరో: ‘దేవుడు వరం ఇచ్చినా.. పూజారి కరుణించని’ చందంగా తయారైంది కొత్త రేషన్ కార్డుల పరిస్థితి. కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఆచరణలో మంజూరు మాత్రం నత్తలకు నడక నేర్పిస్తోంది. మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో కొత్త దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నా.. వాటిపై క్షేత్ర స్థాయి విచారణ ముందుకు సాగడం లేదు. ఒకవైపు సిబ్బంది కొరత, మరోవైపు నిర్లక్ష్యం పేదల పాలిట శాపంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో కేవలం కేవలం 3.16 లక్షల కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. మరో మూడు లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్లో మగ్గుతున్నాయి. సరిగ్గా గత నాలుగు నెలల నుంచి కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ, ఆమోదం ప్రక్రియ మొక్కుబడిగా తయారైంది. కేవలం మధ్యవర్తుల ప్రమేయం, ఇతరత్రా సిఫార్సు దరఖాస్తులకే మోక్షం లభిస్తోంది. గత నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సర్కిల్ ఆఫీసుల చుట్టూ... పేదలు కొత్త రేషన్ కార్డుల కోసం పౌరసరఫరాల శాఖ సర్కిల్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తుల్లో దాదాపు సగం పెండింగ్లో మగ్గుతున్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే ఎఫ్ఎస్సీ ఆన్లైన్ లాగిన్కు నాలుగేళ్ల తర్వాత మోక్షం లభించినా.. మంజూరు మాత్రం కొందరికే పరిమితమవుతోంది. అర్హత కుటుంబాలు 27 లక్షలపైనే.. మహానగరంలో సుమారు 40 లక్షల కుటుంబాలు ఉండగా అందులో దారిద్య్రరేఖకు దిగువ నున్న కుటుంబాలు 27 లక్షల పైవరకు ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం 20.38 లక్షల కుటుంబాలు మాత్రమే రేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. మిగతా ఏడు లక్షల కుటుంబాలకు లేవు. అందులో మూడు లక్షల కుటుంబాల దరఖాస్తులు పెండింగ్లో మగ్గుతున్నాయి. మరో నాలుగు లక్షల కుటుంబాలు దర ఖాస్తుకు చేసుకోలేదు. ఫలితంగా పేద కుటుంబాలు రేషన్ కార్డులు లేక వివిధ సంక్షేమ పథకాల వర్తింపు కోసం తల్లడిల్లుతున్నాయి. ప్రస్తుతం రేషన్ కార్డుల పరిస్ధితి ఇలా.. జిల్లా కార్డులు యూనిట్లు హైదరాబాద్ 7,98,269 30,42,056 మేడ్చల్–మల్కాజిగిరి 6,10,880 20,94,319 రంగారెడ్డి 6,28,890 21,24,903 -
మన రుచి ‘దశ’దిశలా..
హైదరాబాదీ బిర్యానీకి పదో ర్యాంక్ సాక్షి, సిటీబ్యూరో: బిర్యానీ అనేది ప్రాంతాలకు అతీతంగా విస్తరించిన భోజన ప్రియుల అభి‘రుచి’. కోల్కతా బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ, లక్నోవి బిర్యానీ.. ఇలా వివిధ ప్రాంతాలకు వాటి సొంత ప్రత్యేకతలతో కూడిన బిర్యానీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగానూ, ప్రపంచవ్యాప్తంగానూ అందుబాటులో ఉన్నవాటిలో హైదరాబాదీ బిర్యానే అత్యుత్తమైందని మరోసారి నిరూపితమైంది. తాజాగా ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ చేసిన జాబితాలో 50 ఉత్తమ బియ్యం వంటకాలు– 2025లో హైదరాబాద్ బిర్యానీ స్థానం సంపాదించింది. ప్రపంచవ్యాప్తంగా 10వ ఉత్తమ బియ్యం వంటకంగా ర్యాంక్ పొందింది. జపాన్కి జై.. 50 వంటకాల జాబితాలో జపాన్ స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబర్చింది. మొదటి పది స్థానాల్లో నెగిటోరోడాన్ (1వ స్థానం), సుషి (2), కై సెండన్ (3), ఒటోరో నిగిరి (4), చుటోరో నిగిరి (7), నిగిరి (8), మాకి (9వ స్థానం)లో వరుసగా నిలిచి జపాన్ దేశ రుచికరమైన సముద్ర ఆహార వారసత్వ సత్తాని చాటాయి. -
సింగూరు జలాలకు ఢోకా లేదు
● సింగూరు టెక్నికల్ కమిటీ నిర్ణయం ● వేసవిలో దాహార్తికి ఆటంకం ఉండబోదని భరోసా తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా మరమ్మతులు సాక్షి, సిటీబ్యూరో: మహా నగరానికి తాగునీటిని తరలిస్తున్న సింగూరు జలాలకు ఈ వేసవిలో ఢోకా లేదు. సింగూరు ఆనకట్టకు మరమ్మతు పనుల నేపథ్యంలో జలాశయంలోని నీటిని ఒకేసారి ఖాళీ చేయబోమని, వేసవిలో తాగునీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం ఏర్పడదని సింగూరు టెక్నికల్ కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టులోని 16 టీఎంసీల నీటి నిల్వలో 9 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు రిజర్వ్గా ఉంచి, మిగిలిన నీటిని విడతల వారీగా విడుదల చేస్తూ మరమ్మతులు చేపట్టవచ్చని కమిటీ ప్రతిపాదించింది. మంజీరా నదిపై నిర్మించిన సింగూరు జలాశయం నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా అవుతోంది. రోజువారీగా 40 నుంచి 50 ఎంఎల్డీ (మిలియన్ లీటర్లు) నీరు సరఫరా చేస్తున్నారు. కొన్నేళ్లుగా డ్యామ్ ఆనకట్టల్లో రివిట్మెంట్ డ్యామేజీ, 800 మీటర్ల పొడవునా ఆనకట్ట పగుళ్లతో బలహీన పడింది. దీంతో ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రూ. 19 కోట్లు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. సింగూరు జలాశయాన్ని ఒకేసారి పూర్తిగా ఖాళీ చేయకుండా, దెబ్బతిన్న భాగాలను విడతల వారీగా మరమ్మతులు చేపట్టాలని నీటి నిపుణుల కమిటీ నిర్ణయించడం నగరానికి తాగునీటి సరఫరాకు భరోసా లభించినట్లయింది. ఇటీవల ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ జనరల్ అంజద్ హుస్సేన్ ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ సాంకేతిక నిపుణుల కమిటీ బృందం సింగూరు ప్రాజెక్టును పరిశీలించింది. అనంతరం సమావేశపై తాగునీటికి ఇబ్బందులు లేకుండా నీటిని నిల్వ చేసి మరమ్మతులు చేపట్టేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చించింది. ప్రాజెక్టులో దెబ్బతిన్న భాగాలకు డిసెంబర్ ఒకటి నుంచి పనులు చేపట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్ నగరానికి తాగునీటికి ఇబ్బంది లేకుండా 9 టీఎంసీల నీటిని రిజర్వ్గా ఉంచుతారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 16 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీనిలో 6 టీఎంసీల నీటిని దిగువకు వదిలి 10 టీఎంసీలతో మరమ్మతులు చేపట్టేందుకు ఇరిగేషన్ శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రాజెక్టులో ఏడు టీఎంసీలు నీరు ఉన్నా.. వేసవిలో పూర్తయ్యేవరకు హైదరాబాద్కు నీటిని సరఫరా చేయవచ్చని జలమండలి వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్కు సింగూరు నుంచి వచ్చే నీరు మిషన్ భగీరథ పథకం ద్వారా నిరంతరం సరఫరా అవుతోంది. సింగూర్ ప్రాజెక్టు (ఫైల్) -
ఇక ఇంటింటి క్యాన్ సర్వే
సాక్షి, సిటీబ్యూరో: మహా నగర దాహార్తి తీర్చేందుకు సుదూర ప్రాంతాల నుంచి జలాలను తరలించి.. ఆపై శుద్ధి చేసి సరఫరా చేస్తున్న నీటి వినియోగంపై జలమండలి దృష్టి సారించింది. నీటి వాడకంలో పారదర్శకత, అక్రమ కనెక్షన్ల నియంత్రణ, సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టింది. క్షేత్ర స్థాయిలో నల్లా కనెక్షన్ల పూర్తి వివరాల సేకరణ కోసం ‘ఇంటింటి క్యాన్ సర్వే’ పేరిట వంద రోజుల ప్రణాళికతో స్పెషల్డ్రైవ్కు శ్రీకారం చుట్టింది. ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వెళ్లి నల్లా కనెక్షన్ అక్రమమా? సక్రమమా? కేటగిరీ డొమెస్టికా? కమర్షియలా? తేల్చనున్నారు. పైపులైన్ సైజు, కనెక్షన్ల సంఖ్యను పరిశీలించి అక్కడికక్కడే ప్రత్యేక యాప్ అప్లికేషన్లో పూర్తి వివరాలు నమోదు చేసే విధంగా చర్యలు చేపట్టారు. నివాస యోగ్యానికి నల్లా కనెక్షన్ ఉండి ఆ భవనంలో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగితే వాణిజ్య కేటగిరీలోకి మార్పు చేస్తారు. అక్రమ కనెక్షన్ అయితే నోటీసు జారీ చేస్తారు. ఆ తర్వాత జరిమానా చార్జీలతో క్రమబద్ధీకరించే విధంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే నల్లా కనెక్షన్ల కేటగిరీ, పైపులైన్ సైజు, నెలవారీ నీటి వినియోం, బిల్లింగ్ తదితర వివరాలతో కూడిన జాబితాను రూపొందించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది సెక్షన్ల వారీగా.. జలమండలి పరిధిలోని ప్రతి సెక్షన్లో వంద శాతం కనెక్షన్లపై 100 రోజుల్లో సర్వే పూర్తి చేసేలా మేనేజర్లకు బాధ్యతలు అప్పగించింది. ప్రతి సెక్షన్లో మేనేజర్ సారథ్యంలోని బృందం ఇంటింటికీ వెళ్లి కస్టమర్ నంబర్, మీటర్ వివరాలు, ఇంటి వైశాల్యం, ఎన్ని గదులు, ఎన్ని అంతస్తులు, కనెక్షన్ కేటగిరీ వంటి వాటిపై వివరాలు సేకరిస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా కనెక్షన్ ఉందా లేదా, నల్లా అక్రమ కనెక్షన్ గుర్తింపు, వాటిని క్రమబద్ధీకరణ చేయడం, మీటర్ బిగింపు తదితర చర్యలు చేపడతారు. నల్లా కనెక్షన్ పైపులైన్ సైజు కూడా పరిశీలిస్తారు. సైజులో వ్యత్యాసం ఉంటే బిల్లింగ్లో మార్పులు చేస్తారు. ఒకటి కంటే ఎక్కువగా ఉన్న కనెక్షన్లను గుర్తించనున్నారు. వాణిజ్య కార్యకలాపాలు కొనసాగితే మాత్రం ఆ కేటగిరీలోకి మార్పు కోసం నోటీసులు జారీ చేస్తారు. సర్వే సిబ్బంది తుది నివేదిక వివరాలపై మరోసారి విజిలెన్స్ శాంపిల్స్ రీ సర్వే కూడా ఉంటుందని జలమండలి వర్గాలు పేర్కొంటున్నాయి. 14.36 లక్షల కనెక్షన్లు జలమండలి పరిధిలో దాదాపు 14.36 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 85 శాతం వరకు డొమెస్టిక్ కేటగిరీ కనెక్షన్లు ఉండగా మిగిలిన 15 శాతం వాణిజ్య, ఇండస్ట్రీ, ఇతరత్రా కేటగిరీ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెలా సగటున 10 వేల నుంచి 15 వేల వరకు కొత్త కనెక్షన్లు మంజూరవుతున్నాయి. వాణిజ్య కనెక్షన్లు మాత్రం 54 వేలకు మించలేదు. పలు ప్రాంతాల్లో కొందరు గృహావసరాలకు కనెక్షన్ తీసుకుని వాణిజ్య అవసరాలకు వినియోగించడం , మరికొందరు మీటర్లను పని చేయకుండా చేసి బిల్లులు మొక్కుబడిగా చెల్లి్ంచడం సర్వసాధారణమైంది. దీంతో వాటిపై దృష్టి సారించి క్యాన్ సర్వేతో నిగ్గుతేల్చేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. నల్లా అక్రమ కనెక్షన్దారులకు నోటీసులు కనీసం మూడేళ్ల జరిమానాతో క్రమబద్ధీకరణ జలమండలి వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ జలమండలి పరిధిలో ఇలా.. కేటగిరీ కనెక్షన్ల సంఖ్య డొమెస్టిక్ 9,28,631 డొమెస్టిక్–స్లమ్స్ 2,46,857 డొమెస్టిక్–ఎంయూన్ 1,36,638 డొమెస్టిక్ విత్ ఫ్లాట్స్ 14.835 ఎంఎస్ఏసీ–డొమెస్టిక్ 38,493 కమర్షియల్ 54,301 బల్క్ కమర్షియల్ 82 -
తుపాకీ తాకట్టు?
రికవరీ బంగారం స్వాహా చేసి.. ఆపై కుదువ పెట్టి ● కనిపించకుండాపోయిన సర్వీస్ పిస్టల్ ● కేసు నమోదు.. సస్పెన్షన్ వేటు ● తుపాకీ ఆచూకీ కోసం టాస్క్ఫోర్స్ విచారణ అంబర్పేట్లో పని చేసిన 2020 బ్యాచ్ ఎస్ఐ సాక్షి, సిటీబ్యూరో/అంబర్పేట: నగరంలోని అంబర్పేట పోలీసుస్టేషన్లో క్రైం ఎస్ఐగా పని చేసిన భాను ప్రకాష్రెడ్డి బరితెగించాడు. ఓ కేసులో నిందితుల నుంచి రికవరీ చేసిన బంగారం స్వాహా చేసి తాకట్టు పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా తన సర్వీస్ పిస్టల్ విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అది మిస్సింగ్ అయింది. బంగారం గోల్మాల్ వ్యవహారంలో ఎస్ఐపై కేసు నమోదు చేసిన అంబర్పేట పోలీసులు మాయమైన పిస్టల్ విషయంపైనా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం భాను ప్రకాష్ను టాస్క్ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఇతగాడికి ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్–2 ఉద్యోగం సైతం రావడం గమనార్హం. బంగారం తిరిగి ఇవ్వకుండా తాత్సారం.. 2020 బ్యాచ్కు చెందిన భాను ప్రకాష్ రెడ్డి గతంలో వేర్వేరు ఠాణాల్లో పని చేశాడు. ప్రస్తుతం అంబర్పేట క్రైం ఎస్ఐగా ఉన్న ఈయన ఈ ఏడాది ఏప్రిల్లో నమోదైన ఓ సర్వెంట్ థెఫ్ట్ కేసును దర్యాప్తు చేశాడు. యజమాని ఇంట్లో 5 తులాల బంగారం కాజేసిన పని వాళ్లను అరెస్టు చేసి, సొత్తు రికవరీ చేశారు. ఈ పసిడిని ఫిర్యాదుదారుడు కోర్టు ద్వారా తీసుకోవడానికి ష్యూరిటీలు సమర్పించాల్సి ఉంటుంది. అది ఇష్టం లేని యజమాని తన వద్ద పని చేశారన్న ఉద్దేశంతో నిందితులతో రాజీ చేసుకున్నారు. ఈ మేరకు లోక్ అదాలత్లో పిటిషన్ దాఖలు చేయడంతో కేసు మూసేశారు. ఆ బంగారం తిరిగి ఇవ్వడంలో ఎస్ఐ తాత్సారం చేస్తుండటంతో యజమాని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉండగా మరో ఉదంతం.. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు దీనిపై అంబర్పేట పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో భానుప్రకాష్ రెడ్డి ఆ బంగారాన్ని స్థానిక యువకుడి ద్వారా తాకట్టు పెట్టించాడని, అలా వచ్చిన రూ.3 లక్షలు బెట్టింగ్కు వాడినట్లు తేలింది. ఈ కేసు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు భాను ప్రకాష్పై చర్యలకు ఉపక్రమించారు. ఇది దర్యాప్తులో ఉండగానే మరో విషయం వెలుగులోకి వచ్చింది. భానుప్రకాష్కు పోలీసు విభాగం కేటాయించిన సర్వీస్ పిస్టల్ మాయమైందని తేలడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. లాంగ్ లీవ్లో ఉండగా పిస్టల్ మాయం.. భాను ప్రకాష్ వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఈ ఏడాది మే నుంచి రెండు నెలల పాటు సెలవులో ఉన్నాడు. ఆయుధాల ఆడిటింగ్ అదే మే నెలలో జరిగినప్పుడు తుపాకీ అతడి వద్ద ఉంది. సెలవులో వెళ్లే సమయంలో తన టేబుల్ సొరుగులోనే తూటాలు, తుపాకీ పెట్టానని అతడు చెబుతున్నాడు. ఈ నెల 12న మరోసారి ఆయుధాల ఆడిటింగ్ జరిగింది. ఈ సందర్భంలో ఆ తుపాకీ కనిపించట్లేదని, తూటాలు మాత్రమే ఉన్నాయని అతడు ఉన్నతాధికారులకు చెప్పాడు. తాను పోలీసు పరీక్షలు ముగించుకుని జూన్ ఆఖరులో తిరిగి వచ్చానని, అప్పటి నుంచి తుపాకీ కనిపించట్లేదని పేర్కొన్నాడు. దీంతో షాక్ తిన్న ఉన్నతాధికారులు దీనిపై లోతుగా ఆరా తీశారు. ఓ సందర్భంలో భాను ప్రకాష్ ఆ పోలీసుస్టేషన్ సీసీ కెమెరాల్లోని ఫీడ్ పరిశీలించాలంటూ కోరి ఆద్యంతం చూశాడు. దొరికింది.. దొరకలేదు.. తెలియదు.. ఓవైపు తుపాకీ కోసం విచారణ జరుగుతుండగానే భాను ప్రకాష్ అది దొరికిందని, భద్రత కోసం ఇంటి వద్దే ఉంచానని అధికారులకు చెప్పాడు. ఎన్నిసార్లు కోరినా తీసుకురాకపోవడంతో అనుమానించిన అధికారులు లోతుగా ప్రశ్నించగా కనిపించట్లేదని పేర్కొన్నాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం భాను ప్రకాష్ను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు పొంతన లేని సమాధానాలు చెబుతుండటం.. ఏం జరిగిందో తెలియదని అంటుండటంతో సాంకేతికంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. బంగారం మాదిరిగానే తుపాకీని సైతం భాను ప్రకాష్ తాకట్టు పెట్టి ఉంటాడని, ఆ డబ్బునూ బెట్టింగ్స్కు వాడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇతగాడు త్వరలోనే పోలీసు విభాగం నుంచి రిలీవ్ అయి, ఏపీలో గ్రూప్–2 ఉద్యోగంలో చేరాల్సి ఉందని తెలిసింది. -
నకిలీ పత్రాలతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ ?
సాక్షి, సిటీబ్యూరో: దేశం మొత్తం ఒకే పన్ను వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తీసుకొచ్చింది. ఆన్లైన్ పద్ధతిలో వస్తు సేవా పన్ను రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం వ్యాపారులకు కల్పించారు. అయితే ఈ ఆన్లైన్ ప్రక్రియను కొంత మంది అక్రమార్కులు యథేచ్చగా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్లైన్ రిజి స్ట్రేషన్లోని లొసుగులకు ఆసరాగా చేసుకొని తప్పుడు సమాచారం ఆప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ సులువుగా పొందుతాన్నట్లు తెలుస్తోంది. అధికారులు పరిశీలనలో వేల సంఖ్యలో తప్పుడు సమాచారంతో రిజిస్ట్రేషన్స్ వెలుగులోకి వస్తున్నాయని ఓ ఉన్నతాధికారి సాక్షికి తెలిపారు. ఇలాంటి వాటిని గమనించిన వెంటనే సంబంధిత అధికారులు తొలగిస్తున్నారు.అయితే బూటకపు రిజిస్ట్రేషన్లను గుర్తించడం.. వాటిని పరిశీలించడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. తప్పుడు చిరునామాలతో లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్స్ అవుతున్నా వాణిజ్య పన్ను శాఖ అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే జీఎస్టీ పొర్టల్ కేంద్రం ఆధీనంలో ఉంది. ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్న సమాచారం సరైనదా? కాదా? అని తెలుసుకునే వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఈ సమస్య నెలకొంది.ఫేక్ ఆధార్ నంబర్, పాన్ నంబర్లతో రిజిస్ట్రేషన్లు -
వీడిన కూలీ అదృశ్యం మిస్టరీ
హుస్సేన్సాగర్ నాలాలో పడి మూసీలో తేలాడు అంబర్పేట: చెట్లకు నీరు పడుతుండగా పొరపాటున హుసేన్సాగర్లో పడి.. ఆతరువాత మూసీలో శవమై తేలాడు. పనికి పిలిచిన వ్యక్తి... తోటి కూలీలు అతని అదృశ్యం గురించి పట్టించుకోకుండా మానవత్వాన్ని విస్మరించారు. చివరకు మూసీలో శవమై తేలాక మిస్టరీ వీడింది. ఈ సంఘటన అంబర్పేట పోలీసు స్టేషన్లో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ తెలిపిన మేరకు.. కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని రత్నా నగర్లో పొడగట్టి సైదులు(50) భార్య రేణుక, ఇద్దరు కూతుళ్లు శిరిష, శివానిలతో కలిసి ఉంటున్నాడు. సైదులు ఈ నెల 22న కూలీ కోసం రత్నానగర్ ఎదురుగా ఉన్న ఇసుక, కంకర అమ్మే అడ్డామీదకు వచ్చాడు. రోడ్ల వెంట ఉన్న చెట్లకు నీరు పట్టేందుకు ఓ ట్యాంకర్ యాజమాని మరో ఇద్దరు కూలీలతో కలిసి తీసుకువెళ్లాడు. ఫీవర్ ఆస్పత్రి నాలపై ఉన్న మొక్కలకు నీరు పట్టే క్రమంలో సైదులు హుస్సేన్ సాగర్ నాలాలో పడిపోయాడు. అతను పడిపోయిన విషయాన్ని పట్టించుకోకుండా ఎక్కిడి వారు అక్కడే జారుకున్నారు. రాత్రి వరకు సైదులు కోసం వేచి చూసిన భార్య రేణుక కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగ మంగళవారం సైదులు మృత దేహం గోల్నాక కొత్త బ్రిడ్జి వద్ద లభించడంతో అంబర్పేట పోలీసులు తొలుత గుర్తు తెలియని మృత దేహాంగా స్వాధీనం చేసుకుని పోస్టుమర్టం తరలించారు. బుధవారం విచారణలో మృతుడు సైదులుగా తేలింది. -
బెస్ట్ సిటీ.. హైదరాబాద్ !
సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక నగరంగా అటు చార్మినార్, గోల్కొండ కోటల అందాలు, ఆధునిక నగరంగా ఇటు హైటెక్సిటీ, ఐటీ, ఫార్మా రంగాలు.. ఆర్థికంగా ఉపకరించే స్టార్టప్లు, ఇన్నోవేషన్లు ,తదితరమైనవి కలిసి హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ నగరాల జాబితాలో స్థానం కల్పించాయి. రెసోనెన్స్ కన్సల్టెన్సీ విడుదల చేసిన వరల్డ్స్ బెస్ట్ సిటీస్ ర్యాంకింగ్స్(2025–26)లో హైదరాబాద్కు 82వ స్థానం లభించింది. నగరానికున్న చరిత్రతో పాటు టెక్నాలజీ వినియోగం, జీవనప్రమాణాలు, ఉపాధి అవకాశాలు, తదితరాలు ఇందుకు ఉపకరించాయి. లండన్, న్యూయార్క్, ప్యారిస్, తదితర గ్లోబల్ మెట్రోపాలిటన్లు ఈ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాలు దక్కించుకున్నాయి. మన దేశం విషయానికొస్తే బెంగళూరు, ముంబై, ఢిల్లీలతో పాటు హైదరాబాద్ వాటి సరసన చేరింది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న 270కి పైగా దేశాల్లో అంశాల వారీగానూ ఆయా ర్యాంకింగ్లతో పాటు సిటీల జాబితాలో నగరానికి బెస్ట్సిటీగా 82వ ర్యాంక్ లభించింది. ప్రపంచంలోని టాప్ 100 బెస్ట్ నగరాల్లో హైదరాబాద్ నిలిచింది. లివబిలిటీ, లవబిలిటీ, ప్రాస్పరిటీ ప్రాతిపదికన బెస్ట్సిటీలను ఎంపిక చేశారు. సాంస్కృతిక, చారిత్రక వైభవం హైదరాబాద్ అనగానే మదిలే మెదిలే చారిత్రక,వారసత్వ సంపదలైన చార్మినార్, లాడ్బజార్,గోల్కొండ కోట,మక్కా మసీదు వంటి ఐకానిక్ ప్రదేశాలు సైట్స్అండ్ ల్యాండ్మార్క్స్ విభాగంలో నగరాన్ని టాప్–2గా నిలిపాయి.లాడ్బజార్, ముత్యాలు, నగల దుకాణాలు వంటివి షాపింగ్ విభాగంలో 20వ స్థానంలో ఉంచాయి. టెక్నాలజీ, బిజినెస్ హబ్గా హైటెక్సిటీ, మైక్రోసాఫ్ట్, గూగుల్ క్యాంపస్, అమెజాన్ టెక్స్పేస్లతో పాటు పలు ఫార్చూన్ కంపెనీలు, జీనోమ్ వ్యాలీలోని బయోటెక్, ఫార్మా కంపెనీలు నగరానికి ర్యాంక్ రావడంలో ఉపయోగపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న వ్యాక్సిన్లలో మూడింట ఒకవంతు ఇక్కడే ఉత్పత్తి కావడంతో ఈ రంగంలో గుర్తింపు లభించింది. ఇన్నోవేషన్, స్టార్టప్స్ స్టార్టప్లను ప్రోత్సహిస్తున్న టీ–హబ్ ప్రపంచంలో పేరెన్నికగన్న ఇన్నోవేషన్ క్యాంపస్గా గుర్తింపు పొందింది. భవిష్యత్లో రానున్న ఫార్మాసిటీ ప్రాజెక్స్, మెట్రోరైలు విస్తరణలతో నగరం మరింతగా అభివృద్ధి చెందనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అర్బన్ ప్లానింగ్లో మున్ముందు చోటు చేసుకోనున్న మార్పులు, రవాణా సదుపాయాలు, తదితరమైన వాటితో మరింత అభివృద్ధికి అవకాశం ఉందన్నారు.నగరం ర్యాంక్ బెంగళూర్ 29 ముంబై 40 ఢిల్లీ 54 హైదరాబాద్ 82 ప్రపంచంలోని 100 ఉత్తమ నగరాల్లో ఒకటిగా.. భాగ్యనగరానికి 82వ స్థానంజీవన ప్రమాణాలుమిగతా నగరాలతో పోలిస్తే జీవన వ్యయం తక్కువగా ఉండటం,ఐటీ, నిర్మాణ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఆయా వర్గాల ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఉద్యోగులు, కార్మికుల వలసలు, కాస్మోపాలిటన్ కల్చర్, బిర్యానీతో పాటు ఇక్కడి నోరూరించే వివిధ రకాల వంటకాలు లవబిలిటీ విభాగంలో నగరానికి గుర్తింపు తెచ్చాయి. -
క్రిమినల్ ఖాకీలు!
అనేక నేరాలు, అవకతవకలకు పాల్పడుతున్న కాప్స్ సాక్షి, సిటీబ్యూరో ఓ వ్యక్తిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘరానా మోసగాడు ఉప్పలపాటి సతీష్తో ఒప్పందం చేసుకుని, కస్టడీ నుంచి ఎస్కేప్ కావడానికి సహకరించి టాస్క్ఫోర్స్ ఎస్సై డి.శ్రీకాంత్ గౌడ్ సస్పెండయ్యారు. ● ఓ కేసులో రికవరీ చేసిన బంగారం తాకట్టు పెట్టడంతో పాటు తన సర్వీస్ పిస్టల్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంబర్పేట ఎస్సై భాను ప్రకాష్పై కేసు నమోదు కావడంతో పాటు వేటు పడింది. ● ఈ రెండు ఉదంతాలే కాదు.. ఇటీవల కాలంలో పోలీసులు వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. హోదాలతో సంబంధం లేకుండా ఎవరికి వారుగా రెచ్చిపోతున్నారు. సీనియర్, ప్రమోటీలే కాదు... ఏకంగా డైరెక్ట్ రిక్రూటీలు అవినీతి, అవకతవకల ఆరోపణలు ఎదుర్కొవడం గమనార్హం. అధికారులు, సిబ్బంది ఎంపిక, వారికి ఇచ్చే శిక్షణ విధానాల్లో మార్పులు రావాలని, లేదంటే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ● ఈ వ్యవహారశైలి ఏ ఒక్క స్థాయిలో ఉందనుకుంటే పొరపాటే. కానిస్టేబుల్ (పీసీ) నుంచి ఎస్పీల వరకు ఎవరికి వారుగా రెచ్చిపోతున్నారు. చేతికి అందివచ్చిన, అవకాశం ఉన్న ఏ అంశాన్నీ వదులుకోవట్లేదు. భూ వివాదాల నుంచి నేరగాళ్లతో ములాఖత్ వరకు నచ్చినట్లు చేసుకుపోతున్నారు. ఒకప్పుడు కేవలం సీనియర్లు, ప్రమోటీలే ● ఈ పంఽథాలో వెళ్లే వారు. డైరెక్ట్ రిక్రూటీలు చాలా నిజాయతీగా, ముక్కుసూటిగా ఉండేవారు. ఈ నేపథ్యంలో తమ పరిధిలోని పోలీసుస్టేషన్లు, డివిజన్లు, జిల్లాల్లో డైరెక్ట్ ఎస్సైలు, డీఎస్పీలు, ఎస్పీలకు పోస్టింగ్ ఇవ్వడానికి రాజకీయ నాయకులు అంగీకరించే వాళ్లు కాదు. ఇటీవల కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎవరికి వారు కేవలం ధనార్జనే ధ్యేయంగా దూసుకుపోతున్నారు. వివాదాల్లో ఇరుక్కుని భవిష్యత్తును నాశనం చేసుకోవడంతో పాటు పోలీసు విభాగాన్నీ చులకన చేస్తున్నారు. వీళ్లు చేయడం మరింత ఘోరం.. సాధారణ వ్యక్తులు నేరం చేయడం వేరు... చట్టాన్ని అమలు చేసే పోలీసులు చేయడం వేరన్నది నిపుణులు మాట. చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్లు నేరాలు చేస్తే సాధారణ వ్యక్తులకు విధించే శిక్షకు రెట్టింపు అనుభవించడానికి అర్హులు. పైగా వ్యవస్థలోని ఓ వ్యక్తి చేసిన తప్పు ప్రభావం మొత్తం వ్యవస్థపై ఉంటుంది. ప్రభుత్వంపై ప్రజలకు ఉండే అభిప్రాయానికి పోలీసులే పునాది. అలాంటి విభాగంలో ఇన్ని వివాదాలు చెలరేగడం పరోక్షంగా ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తోంది. ‘జిల్లా, జోన్, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోలీసులు ఎంపిక విధానంలోనే లోపాలు ఉన్నాయి. కేవలం విద్యార్హత, శారీరక దారుఢ్యం, మౌఖికంగా చెప్పే అంశాలనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. వారి వ్యక్తిత్వం, మానసిక స్థితి తదితరాలను పక్కాగా అంచనా వేయలేకపోతున్నారు. ఎంపికై న వారికి ఇచ్చే శిక్షణాంశాల్లోనూ మార్పులు రావాలి’ అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఏడాది వెలుగులోకి వచ్చినవి ఇలా.. ● రికవరీ చేసిన ద్విచక్ర వాహనం మాయం కావడం, హత్య కేసులో భారీగా డబ్బు డిమాండ్ చేయడం వంటి ఆరోపణలపై ఓ ఠాణాలో పని చేసిన ఇన్స్పెక్టర్, ఎస్సైలపై వేటు పడింది. ● వజ్రాల వ్యాపారిని భయపెట్టి రూ.6 లక్షలు వసూలు చేసిన వ్యవహారంలో మరో ఠాణా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు సస్పెండయ్యారు. ● ఓ స్నేహితుడికి అక్రమంగా మరో వ్యక్తి లొకేషన్ ఇచ్చిన ఆరోపణలపై ప్రత్యేక విభాగంలో పని చే సిన ఏసీపీని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ● సివిల్ వివాదాల్లో తలదూర్చారంటూ వరుస వివాదాలు చుట్టుముట్టడంతో ఓ పోలీసుస్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్పై (ఎస్హెచ్ఓ) సస్పెన్షన్ వేటు పడింది. ● ప్రముఖులతో ముడిపడి ఉన్న అత్యాచారం, డ్రగ్స్ కేసుల దర్యాప్తులో అలసత్వం, అనుమానితులకు సహకరించడం ఆరోపణలపై ఓ ఠాణా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయ్యారు. ● ఇవే కాకుండా వరకట్న వేధింపులు, మోసం, మహిళలను వలలో వేసుకోవడం సహా అనేక ఆరోపణలపై ఎంతో మందిపై కేసులు నమోదు కాగా, కొందరు అరెస్టయ్యారు. మొన్న టాస్క్ఫోర్స్ ఎస్ఐ, తాజాగా అంబర్పేట ఎస్ఐ పీసీ నుంచి మొదలు ఎస్పీల వరకు ఇదే పంథా వరుసగా వెలుగు చూస్తున్న వీరి దందాలు ఎంపిక, శిక్షణలో మార్పులు వస్తేనే మార్పు: నిపుణులు -
రెండేళ్ల మనవరాలిపై తాతయ్య లైంగిక దాడి
నిందితుడికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కాచిగూడ: మైనర్ బాలికై న మనుమరాలుపై లైంగిక దాడికి పాల్పడిన సర్ధార్ త్రిలోక్ సింగ్కు నాంపల్లి 12వ అదనపు సెషన్స్ జడ్జి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారని కాచిగూడ ఇన్స్పెక్టర్ టి.జ్యోత్స్న తెలిపారు. ఇన్స్పెక్టర్ తెలిపిన మేరకు..ఓ మహిళ తన భర్త మరణించడంతో రెండేళ్ల కుమార్తెతో కలిసి అత్త మహేందర్ కౌర్ కుటుంబంతో తిలక్నగర్లో నివాసముండేది. అయితే మే 2024లో అమె మరో ఇంట్లోకి మారింది. అప్పుడప్పుడూ తన రెండు సంవత్సరాల కుమార్తెను వారి ఇంటి వద్ద వదిలి వెళ్ళేది. 16 జూన్ 2024న తన కూతురు అన్యమనస్కంగా ఉండటంతో వైద్యులను సంప్రదించగా లైంగిక దాడిజరిగిందని నిర్ధారించారు. మామ సర్దార్ త్రిలోఖ్ సింగ్ను అనుమానించి అతనిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై చార్జ్షీట్ దాఖలు చేశారు. నాంపల్లి 12వ అదనపు సెషన్స్ జడ్జి బుధవారం నిందితుడు సర్దార్ త్రిలోక్ సింగ్ను దోషిగా నిర్ధారించారు. కోర్టు అతనికి 25 సంత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ10వేల జరిమానా విధించిందని పోలీసులు తెలిపారు. నిందితుడు జరిమానా చెల్లించని పక్షంలో మరో 6 నెలల సాధారణ శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపారు. -
అయోధ్య ఆలయానికి మిథాని తయారు చేసిన కిటికీలు
సంతోష్నగర్: కంచన్బాగ్లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) సంస్థలో తయారైన భారతదేశపు తొలి టైటానియం ఆర్కిటెక్చరల్ విండోలను అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి అందజేసినట్లు మిధాని అధికారులు తెలిపారు. మిధాని సంస్థ గత నాలుగు దశాబ్దాలుగా వ్యూహాత్మక అనువర్తనాల కోసం టైటానియం మిశ్రమాలు సరఫరా చేస్తున్నప్పటికీ.. నిర్మాణ రంగంలో టైటానియం వినియోగం మొదటిసారన్నారు. వారసత్వ స్మారక కట్టడంలో నిర్మాణ పదార్థంగా టైటానియంను అమర్చిన భారతదేశపు తొలి సంస్థగా మిధాని నిలిచిందన్నారు. ఆలయ సముదాయంలోని ప్రదక్షణ కారిడార్ కోసం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ విభాగం తయారు చేసిన టైటానియం 31 కీటికీలను తయారు చేసి సరఫరా చేశామన్నారు. -
కటకటాల్లోకి నకిలీ ఐఏఎస్ అధికారి
బంజారాహిల్స్: కారుకు అధికారిక వాహనంలాగ స్టిక్కర్.. సైరన్.. ఇద్దరు బాడీగార్డులు.. నకిలీ గుర్తింపుకార్డు.. వాకీటాకీలు.. డాబూ..దర్పంతో వెలిగిపోతూ తాను ఐఏఎస్ అధికారినని కొన్ని చోట్ల, ఐపీఎస్ అధికారినని మరికొన్ని చోట్ల చెలామణి అవుతూ అమాయకుల నుంచి పనులు చేయిస్తానని లక్షలాది రూపాయలు దండుకున్న నకిలీ ఐఏఎస్ అధికారిని ఫిలింనగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెస్ట్జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కర్నూలు జిల్లా నందికొట్కూర్కు చెందిన బత్తిని శశికాంత్ (39) బీకామ్ వరకు చదివాడు. ఉద్యోగాన్వేషణలో విఫలమయ్యాడు. ఎలాగైనా అధికారిగా బతకాలని, డాబుసరితో చెలామణి అవ్వాలని కోరిక కలిగింది. ఇందుకోసం ఖరీదైన సూటూ.. బూటూ కొనుగోలు చేశాడు. తాను ఐఏఎస్ అధికారినని షేక్పేటలోని గోల్డ్ జిమ్ ఎండీ అలీ హసన్ను పరిచయం చేసుకున్నాడు. పనులు చేసి పెడతానంటూ నమ్మించాడు. తాను ఇండస్ట్రియల్కు చెందిన టీఎస్ఐఐసీలో ఉన్నానని, అక్కడ ఇండస్ట్రియల్ ల్యాండ్ కేటాయిస్తానని రూ.10.50 లక్షలు తీసుకున్నాడు. ఓ కారు కొనుగోలు చేసి దానికి ప్రభుత్వ వాహనమనే స్టిక్కర్ను, నకిలీ గుర్తింపుకార్డు తగిలించాడు. సైరన్ అమర్చాడు. ఇద్దరు బాడీగార్డులను ఏర్పాటుచేసుకున్నాడు. వారికి వాకీటాకీలు ఇచ్చాడు. ఎక్కడికి వెళ్లినా ఐఏఎస్ అధికారిగా డాబుసరి వెలగబెట్టేవాడు. చాలామంది నమ్మారు. కొన్నిచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థలో ఐపీఎస్ అధికారినని చెప్పుకున్నాడు. ఏ పని కావాలన్నా చిటికెలో చేసి పెడతానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి ఫేక్ లెటర్లు ఇచ్చేవాడు. మైనింగ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనర్గా ఉన్నానని మరికొందరిని నమ్మించాడు. అయితే నిందితుడు ఇచ్చిన ల్యాండ్ అలాట్మెంట్ లెటర్ బోగస్ అని తేలడంతో గోల్డ్జిమ్ యజమాని అలీ హసన్ ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ సంతోషం సిబ్బందితో కలిసి పక్కా స్కెచ్ వేసి నిందితుడి కదలికలపై దృష్టి సారించారు. షేక్పేటలోని అపర్ణ ఔరా అపార్ట్మెంట్స్లో నిందితుడు ఖరీదైన ప్లాట్ను అద్దెకు తీసుకుని ఉంటున్నట్లుగా గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున నకిలీ ఐఏఎస్ అధికారి బత్తిని శశికాంత్ను అరెస్టు చేసి ఆయన వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఆరు సిమ్ కార్డులు, రెండు వాకీటాకీలు, ఫేక్ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. బాడీగార్డులుగా చెలామణి అయిన ప్రవీణ్, విమల్ అనే ఇద్దరూ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ ఏసీపీ సామల వెంకట్రెడ్డి, ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ సంతోషం తదితరులు పాల్గొన్నారు.పలువురిని మోసం చేసిన కర్నూలు జిల్లా వాసి -
లెక్కల్లో మార్కులు రావడం లేదని..
భవనం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య లాలాపేట: గణిత శాస్త్రంలో ఎక్కువ మార్కులు రాకపోవడంతో పాటు ఈ విషయమై తండ్రి మందలించినందుకు మనస్తాపానికి లోనైన 10 తరగతి విద్యార్థిని అపార్ట్మెంట్పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్టేషన్ పరిధిలోని హబ్సిగూడలో మంగళవారం చోటు చేసుకుంది. ఓయూ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 1లోని జ్యోతి ఎమరాల్డ్ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్న సాప్ట్వేర్ ఇంజినీరు సుకుమార్రెడ్డి కుమార్తె శ్రీ వైష్ణవి(15) హబ్సిగూడలోని శ్రీ చైతన్య స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. సోమవారం రాత్రి వైష్ణవికి మ్యాథమెటిక్స్లో తక్కువ మార్కులు వచ్చాయని తండ్రి మందలించాడు. మెథమెటిక్స్లో మంచి మార్కులు తెచ్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని బాగా చదువుకోవాలని సూచించారు. దీంతో ఒత్తిడికి లోనైన శ్రీ వైష్ణవి మంగళవారం ఉదయం అపార్టుమెంట్ భవనం నాల్గో అంతస్తు నుంచి కింది దూకింది. తీవ్రంగా గాయడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఓయూ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అనూహ్యం..అనుమానాస్పదం
మిస్టరీగానే శాలిబండ అగ్ని ప్రమాద ఘటనగౌలిపురా: పాతబస్తీ శాలిబండలో సోమవారం రాత్రి గోమతి ఎలక్ట్రానిక్ షోరూంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనలో మిస్టరీ వీడలేదు. భారీ పేలుడుతో పాటు మంటలు చెలరేగడంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. షోరూం యజమాని శివకుమార్ బన్సాల్ 80 శాతం కాలిన గాయాలతో డీఆర్డీవో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుకాణంలో పనిచేసే కార్మికులు గణేష్ విజయ్ కుమార్, కార్తీక్ మహదేవ్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షోరూం ముందు నుంచి ఆటోలో వెళుతున్న డ్రైవర్ మహ్మద్ గౌస్, ప్రయాణికుడు సయ్యద్ సాబెర్, కారు డ్రైవర్ మణికంఠ, మరో ఇద్దరు చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. ప్రమాదానికి సంబంధించి దుకాణ యజమాని బన్సాల్ మంగళవారం తెల్లవారుజామున మొఘల్పురా డీఐ అశోక్కు వాంగ్మూలం ఇచ్చాడు. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో శివకుమార్ కౌంటర్ వద్ద కూర్చుని ఉండగా ఒక్కసారిగా షాప్ లోపలి నుంచి భారీ పేలుడు శబ్ధం వినిపించింది. ఏమిటని ఆరా తీసేలోపే మళ్లీ పేలుళ్లు రావడంతో పాటు ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో తనకు తీవ్ర గాయాలైనట్లు తెలిపాడు. పేలుడు ధాటికి దుకాణం షట్టర్లు 100 మీటర్ల దూరంలోని అవతలి రోడ్డుపై కార్లపై పడిపోయాయి. రోడ్డుపై ఎక్కడ చూసినా పగిలిన గాజు ముక్కలు నిండిపోయాయి. షోరూం సమీపంలో ఉన్న 1904 నాటి క్లాక్ టవర్ సైతం పెచ్చులూడింది. ఆధారాలు సేకరించిన క్లూస్ టీం, ఎన్ఐఏ అధికారులు భారీ పేలుడు నేపథ్యంలో మంగళవారం ఉదయం ఎన్ఐఏ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వీరితో క్లూస్ టీమ్ హైదరాబాద్ ఇన్ఛార్జి వెంకన్న షోరూంను పరిశీలించి శాంపిళ్లను సేకరించారు. ఎలక్ట్రానిక్ షోరూం కావడంతో పేలుడు స్వభావం కలిగిన వస్తువుల కారణంగా ప్రమాదం చోటు చేసుకుందా...? మరేదైనా విద్రోహ కోణం ఉందా...? అనే కోణంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. జాయింట్ పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, దక్షిణ మండలం డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, ఏసీపీ సీహెచ్.చంద్రశేఖర్, మొఘల్పురా ఇన్స్పెక్టర్ శ్రీను, అదనపు ఇన్స్పెక్టర్ అశోక్ పరిస్థితిని సమీక్షించారు. స్థానికుల భయాందోళన గోమతి షోరూంలో పేలుడుతో రోడ్డుపై వెళుతున్న వాహనదారులతో పాటు స్థానికులు భయకంపితులయ్యారు. దాదాపు 100 మీటర్ల వరకు భూమి అదిరిపోయింది. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు వ్యాపించడంతో ఏమి జరుగుతుందో తెలియక బెంబేలెత్తారు. షోరూం వెనుక ఉన్న భవనానికి కూడా మంటలు వ్యాపించడంతో భవనంలోని ప్రజలు అతికష్టంపై కిందికి దిగి దూరంగా పరుగులు తీశారు. కొందరు పక్కన ఉన్న ప్రహరీ దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. కాగా షోరూం వెనుక ఉన్న ఇంటి కుటుంబ సభ్యులు ప్రాణభయంతో పరుగులు తీయగా, ఇంట్లో ఉన్న సెల్ఫోన్లు, నగదు చోరీకి గురయ్యాయని పక్కింటి మహిళలు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. సీఎన్జీ కారులో పేలుడు సంభవించలేదు.. కుషాయిగూడకు చెందిన మోహన్ వంశీ ఎవరెస్ట్ ఫ్లీట్ కంపెనీ వద్ద వ్యాగనార్ కారు ను అద్దెకు తీసుకున్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన మణికంఠను డ్రైవర్గా నియమించుకుని క్యాబ్గా తిప్పుతున్నాడు. శాలిబండ సమీపం వరకు ప్యాసింజర్ను వదిలి....మరో ప్యాసింజర్ కోసం గోమతి షాప్ ముందు ఆగాడు. అదే సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపంచడంతో కారులోనుంచి బయటికి దూకి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు పల్టీ కొట్టి పూర్తిగా కాలిపోవడంతో కారులోని సీఎన్జీ సిలిండర్ పేలి ఉండవచ్చునని పోలీసులు భావించారు. మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీమ్ అధికారులు కారులో సిలిండర్ పేలలేదని నిర్ధారించారు. అర్ధరాత్రి తర్వాత ఒకరి మృతి తొమ్మిది మందికి గాయాలు తీవ్రంగా గాయపడిన యజమాని ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎన్ఐఏ, క్లూస్టీమ్ -
డామిట్.. కథ అడ్డం తిరిగింది..
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లో నివసించే ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంట్లో దోపిడీకి యత్నించిన ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–23లో నివసించే పారిశ్రామికవేత్త అజయ్అగర్వాల్ ఇంట్లో గుంతకల్లుకు చెందిన దయాచంద్ ఏడాదిన్నర కాలంగా సెక్యూరిటి గార్డుగా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ సనత్నగర్లోని ఫ్యాక్టరీ నుంచి డబ్బులు తీసుకుని రాత్రి ఇంటికి వచ్చే యజమాని అజయ్అగర్వాల్ను దయాచంద్ గమనిస్తుండేవాడు. అదంతా బ్లాక్ మనీ అని, దోపిడీ చేసినా ఎవరికీ చెప్పుకోలేడని భావించిన దయాచంద్ తన స్నేహితులతో కలిసి దోపిడీకి స్కెచ్ వేశాడు. ఇందులో భాగంగా గుంతకల్లుకు చెందిన తన స్నేహితులు సాయి అలియాస్ సత్య, షేక్ ఇర్ఫాన్, చరణ్, చైతన్య, కృష్ణకాంత్, గురుస్వామి తదితరులతో ముఠా ఏర్పాటు చేసి యజమాని ఇంట్లో దోపిడీకి పథకం వేశాడు. ప్రతిరోజూ రాత్రి 11 గంటల సమయంలో సనత్నగర్లోని 12 ఫ్యాక్టరీలను మూసివేసి నగదుతో యజమాని అజయ్అగర్వాల్ ఇంటికి వస్తాడని, ప్రతి శుక్ర, శనివారాల్లో యజమాని కొడుకు నితిన్అగర్వాల్ పబ్కు వెళ్తాడని, ఆ సమయంలో ఇంట్లో పని మనుషులను బంధించి భారీగా నగదు, నగలను దోచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి యజమాని కుమారుడు నితిన్ పబ్కు వెళ్లగానే వృద్ధుడైన అజయ్అగర్వాల్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడని, ఇదే సరైన సమయమని, ముందే వేసుకున్న పథకం ప్రకారం స్నేహితులను ఇంటికి పిలిపించాడు. అంతకు ఒక రోజు ముందు వారు యూసుఫ్గూడలో మూడు కత్తులు, నోట్లో కుక్కేందుకు గుడ్డలు, ప్లాస్టర్ను కొనుగోలు చేసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని లాడ్జిలో మకాం వేసి దయాచంద్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. శనివారం రాత్రి దయాచంద్ ఫోన్ చేయగానే జూబ్లీహిల్స్కు చేరుకున్నారు. అజయ్అగర్వాల్ డ్రైవర్తో పాటు ఇంట్లో పనిచేసే నలుగురు పనివాళ్లు వేర్వేరు గదుల్లో పడుకున్నారు. మాస్క్లు ధరించి ముందుగా అజయ్అగర్వాల్ గదిలోకి వెళ్లి అతడిని తాళ్లతో బంధించి నోట్లో గుడ్డలు కుక్కి నోటికి ప్లాస్టర్ వేసేందుకు యత్నించగా ఆయన వారి నుంచి తప్పించుకుని కేకలు వేస్తూ బయటికి పరుగు తీశాడు. దీంతో పనివాళ్లు లేచి అప్రమత్తమయ్యారు. వారిని కూడా తాళ్లతో బంధించేందుకు యత్నించగా సాధ్యం కాలేదు. దీంతో నిందితులందరూ అక్కడి నుంచి పరారు కాగా సెక్యూరిటీగార్డు దయాచంద్ మాత్రం తమకేమీ తెలియనట్లు నటిస్తూ ఉండిపోయాడు. అదే సమయంలో పబ్నుంచి తిరిగి వస్తున్న నితిన్ పారిపోతున్న దొంగలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సెక్యూరిటీగార్డు ఉండే చోట మాస్క్ను గుర్తించిన పోలీసులు ఇదెక్కడిదని ప్రశ్నించారు. అతను పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు వెల్లడించాడు. అతడిచ్చిన సమాచారంతో నిందితులందరినీ రైల్వేస్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. గురుస్వామి అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. మంగళవారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తన యజమాని రోజూ ఫ్యాక్టరీల నుంచి తీసుకు వస్తున్న డబ్బు బ్లాక్మనీ అయ్యి ఉంటుందని, తాము కొల్లగొట్టినా పోలీసులకు చెప్పుకోలేడని భావించి ఈ పథకం వేసినట్లు ప్రధాన నిందితుడు దయాచంద్ పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు. వారి నుంచి మూడు కత్తులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి,సిటీ బ్యూరో: టెక్నికల్ కోర్సు సర్టిఫికెట్ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి ఆర్. రోహిణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్ – ఎంబ్రాయిడరీలలో లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్ష వచ్చే జనవరి, ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోయర్ గ్రేడ్ సర్టిఫికెట్ కు 7 తరగతి ఉత్తీర్ణులు అర్హులని, అలాగే సంబంధిత ట్రేడ్ లో లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికేట్ కలిగిన వారు హయ్యర్ గ్రేడ్ పరీక్షకు అర్హులని తెలిపారు. పరీక్షా రుసుమును ప్రభుత్వ ట్రెజరీ చలాన్ ద్వారా చెల్లించాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు www.bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. డౌన్లోడ్ చేసిన దరఖాస్తు పత్రులను జిల్లా విద్యా అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు.● పారిశ్రామికవేత్త ఇంట్లో దోపిడీకి విఫలయత్నం ● ఐదుగురు నిందితుల అరెస్టు ● పరారీలో మరొకరు -
ఆటో డ్రైవర్లు...డెలివరీ బాయ్స్!
వీళ్లే మనీమ్యూల్స్ను వెతికి పట్టుకునే దళారులుసాక్షి, సిటీబ్యూరో: వివిధ రకాలైన సైబర్ నేరాలు చేసే ఉత్తరాది ముఠాలు నగరంలో ఉన్న ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ను దళారులుగా మార్చుకుంటున్నాయి. వీరి ద్వారా అమాయకులకు ఎర వేసి బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నాయి. సహకరించిన వారికి నామమాత్రపు మొత్తం చెల్లిస్తూ ఆ ఖాతాలను వినియోగించి రూ.కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇలాంటి ఓ ముఠాకు చెందిన ఎనిమిది మంది నిందితులను ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. మంగళవారం అదనపు సీపీ (నేరాలు) శ్రీనివాసులు డీసీపీ, అదనపు డీసీపీలు వి.అరవింద్ బాబు, అందె శ్రీనివాసరావులతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆటో ప్రయాణంతో పరిచయం... బోడుప్పల్కు చెందిన పూజారి జంగయ్య వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. చిలకలగూడ, సికింద్రాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో ఆటో నడుపుతూ ఉంటాడు. రాజస్థాన్కు చెందిన కన్నయ్య 2023 అక్టోబర్లో హైదరాబాద్ వచ్చినప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద జంగయ్య ఆటో ఎక్కాడు. బేగంపేట వరకు ప్రయాణించే క్రమంలో జంగయ్య ఆర్థిక స్థితిగతుల్ని ఆరా తీశాడు. తాను ఆటో డ్రైవర్గా రోజుకు రూ.500 నుంచి 600 వరకు సంపాదిస్తానని అతడు చెప్పడంతో జాలి చూపించాడు. తాము గేమింగ్ యాప్స్ లావాదేవీలు చేస్తుంటామని, దీనికోసం బ్యాంకు ఖాతాలు అవసరం అవుతాయని కన్నయ్య చెప్పాడు. ఓ ఖాతా తెరిచి ఇస్తే రూ.10 వేల చొప్పున చెల్లిస్తామని చెప్పడంతో జంగయ్య అంగీకరించాడు. దీంతో ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. కుటుంబంతో మొదలెట్టి ఏజెంట్ల వరకు.. దాదాపు నెల రోజుల తర్వాత మరోసారి కన్నయ్య నగరానికి రావడంతో ఇద్దరూ ప్యారడైజ్ వద్ద కలుసుకున్నారు. ఆసమయంలో ఓ ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డు ఇచ్చిన అతగాడు ఆ నెంబర్ ఆధారంగా బ్యాంకు ఖాతా తెరిచి ఇవ్వాలన్నాడు. అందుకుగాను జంగయ్యకు రూ.10 వేలు ఇచ్చిన కన్నయ్య ఖాతాకు సంబంధించిన వివరాలు తీసుకున్నాడు. ఆపై జంగయ్య ఇదే పంథాలో తన భార్య, తల్లి, బంధువులు, స్నేహితుల పేర్లతో ఫెడరల్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, ఉత్కర్ష్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, మహావీర్ బ్యాంక్, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ల్లో ఖాతాలు తెరిచి కన్నయ్యకు ఇచ్చి డబ్బు తీసుకున్నాడు. కొన్నాళ్లకు ఈ దందాను వ్యవస్థీకృతంగా చేయాలని నిర్ణయించుకున్న జంగయ్య తన బంధువైన బోడుప్పల్ వాసి గురుదాస్ సునీల్ కుమార్తో కలిసి మరికొందరు అమాయకులను మనీ మ్యూల్స్గా మార్చి ఖాతాలు తెరిచాడు. ప్రధాన సూత్రధారుల పరిచయంతో... తాను అందిస్తున్న బ్యాంక్ ఖాతాలను కన్నయ్య రాజస్థాన్కే చెందిన పూనమ్, రమేష్లకు ఇస్తున్నాడని జంగయ్య తెలుసుకున్నాడు. దీంతో అతడిని పక్కన పెట్టి తానే ఆ ఇద్దరికీ టచ్లోకి వెళ్లాడు. ఆపై కొరియర్ డెలివరీ బాయ్ పర్లపల్లి నిఖిల్, ఆటోడ్రైవర్ గంటి మణిదీప్లతో ముఠా ఏర్పాటు చేశాడు. వీరంతా కలిసి ఆయా ప్రాంత్లాలో ఉన్న చిరుద్యోగులు, నిరుద్యోగులకు ఎర వేసి వారితో బ్యాంకు ఖాతాలు తెరిపించారు. కొన్నాళ్లకు జంగయ్య నుంచి వేరుపడిన నిఖిల్, మణిదీప్ సొంతంగా హార్డ్వేర్ టెక్నీషియన్ బొల్లు బాలు, కొరియర్ డెలివరీ బాయ్ పోలాస్ ప్రవీణ్లతో జట్టు కట్టి దందా కొనసాగించారు. వీరికి కరూర్ వైశ్యా బ్యాంక్లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా పని చేసిన బిలావత్ బాలాజీ నాయక్ సహకరించాడు. సూత్రధారుల నుంచి ఒక్కో ఖాతాకు రూ.10 వేలు తీసుకునే వీరు బ్యాంకు ఖాతా తెరవడానికి తమ ఆధార్, పాన్కార్డులు ఇచ్చే వారికి రూ.6 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. ఇలా మొత్తం 127 బ్యాంక్ ఖాతాలు తెరిచి సూత్రధారులకు అందించారు. అమాయకులకు ఎర వేసి వారితో బ్యాంక్ ఖాతాలు ఉత్తరాదిలో ఉన్న ప్రధాన సూత్రధారులకు సరఫరా గుట్టురట్టు చేసిన ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో మరో ముగ్గురు చిలకలగూడలో దొరికిన ఆధారం... జంగయ్య కొన్నాళ్ల క్రితం చిలకలగూడకు చెందిన ఓ వ్యక్తిని సంప్రదించి బ్యాంకు ఖాతా తెరిచి ఇస్తే రూ.7 వేలు ఇస్తానని చెప్పాడు. ఇతడి ద్వారా విషయం ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్కు చేరింది. దీంతో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలో ఎస్సైలు పి.నాగరాజు, ఎం.అనంతాచారి, ఎస్.కరుణాకర్రెడ్డిలతో కూడిన బృందం రంగంలోకి దిగింది. లోతుగా ఆరా తీసి ఎనిమిది మంది నిందితులను పట్టుకుంది. వీరు ఇచ్చిన బ్యాంకు ఖాతాల్లో బాధితులకు సంబంధించిన రూ.24.10 కోట్లు డిపాజిట్ కాగా... సూత్రధారులు రూ.23.99 కోట్లు డ్రా చేసుకున్నారు. వీటికి సంబంధించి రాచకొండ, రాజేంద్రనగర్లతో పాటు కర్ణాటక, రాజస్థాన్ల్లో ఆరు కేసులు నమోదై ఉన్నాయి. మరో 21 పిటిషన్లు సైబర్ పోర్టల్లో ఉన్నాయి. వీరు అందించిన మ్యూల్ ఖాతాల ద్వారా మరిన్ని నేరాలు జరిగి ఉంటాయని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు అప్పగించారు. -
డీసీసీ అధ్యక్షుడిగా సైఫుల్లా బాధ్యతల స్వీకరణ
సాక్షి,సిటీ బ్యూరో: హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా సయ్యద్ ఖలీద్ సైఫుల్లా మంగళవారం గాంధీభవన్లో బాఽ ద్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. నగరానికి చెందిన సైఫుల్లా ప్రస్తుతం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సీనియర్ డేటా నిపుణుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఏఐసీసీ డేటా అనలిటిక్స్, టెక్నాలజీ సెల్తో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఏఐసీసీ క్రౌడ్ ఫండింగ్ పోర్టల్, మహిళా కాంగ్రెస్, ప్రొఫెషనల్స్ కాంగ్రెస్, సేవాదళ్ వంటి ఫ్రంట్లైన్ సంస్థల కోసం సభ్యత్వ అప్లికేషన్లు, సర్వే సాధనాలు, భారత్ జోడో యాత్ర కోసం ఫొటో, మ్యాచింగ్ ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేశారు. ఆయన ’ఓట్ చోరీ’ గుర్తింపులో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. -
తాగునీరు వృథా చేసినందుకు రూ. 10 వేలు జరిమానా
సాక్షి,సిటీ బ్యూరో: జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన బంజారాహిల్స్లో మంగళవారం చోటు చేసుకుంది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి బంజారా హిల్స్ ప్రధాన రహదారిపై వెళుతుండగా... రోడ్ నం. 12 లో ఓ వ్యక్తి నల్లా నీటితో కారు కడుగుతూ కనిపించారు. దీంతో ఎండీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించవద్దని హెచ్చరించారు. తక్షణమే సదరు వ్యక్తికి నోటీసు అందించి, జరిమానా విధించాలని సంబంధిత మేనేజర్ ను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు సదరు వ్యక్తికి రూ.10000 జరిమానా విధించారు. జలమండలి సరఫరా చేసే తాగునీరు ఇలా ఇతర అవసరాలకు వినియోగించద్ధని ఎండీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే.. తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఇక ‘మహా’ పరిధి ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్
● జీహెచ్ఎంసీ విస్తరణతో తగ్గనున్న హెచ్ఎండీఏ పరిధి ● 80 శాతం వరకు ఆదాయం తగ్గుముఖం ● ఔటర్ వెలుపల నగర విస్తరణకు ప్రణాళికలు సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్రోడ్డు వరకు ఉన్న కోర్సిటీని జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించడంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కార్యకలాపాలు ఇక ఔటర్ వెలుపలకు పరిమితం కానున్నాయి. ఔటర్రింగ్రోడ్డు నుంచి రీజినల్ రింగ్రోడ్డు వరకు హెచ్ఎండీఏ అనుమతులు, అభివృద్ధి కార్యక్రమాలు పరిమితం కానున్నాయి. ప్రస్తుతం నగరశివార్లలోని మున్సిపాలిటీల్లో ఐదు అంతస్తుల నుంచి చేపట్టే భవన నిర్మాణాలకు హెచ్ఎండీఏ నుంచి అనుమతులు లభిస్తున్నాయి. ఈ మున్సిపాలిటీలన్నీ ఇక జీహెచ్ఎంసీలో భాగం కానున్న దృష్ట్యా అన్ని రకాల అనుమతులు జీహెచ్ఎంసీ నుంచి పొందేందుకు అవకాశం ఉంటుంది. అలాగే విలీనమయ్యే మున్సిపాలిటీ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. మరోవైపు ఇటీవల వరకు హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్న ఫ్యూచర్సిటీ అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఒకవైపు జీహెచ్ఎంసీ, మరోవైపు ఫ్యూచర్సిటీ విస్తరణలతో హెచ్ఎండీఏ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.హెచ్ఎండీఏకు వచ్చే ఆదాయం కూడా తగ్గనుంది. వివిధ రకాల నిర్మాణాలపైన ప్రతి నెలా సుమారు రూ.100 కోట్ల వరకు లభిస్తుండగా, శివారు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో ఈ ఆదాయం 80 శాతం వరకు తగ్గనుందని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
అప్పటిదాకా స్పెషలాఫీసర్ పాలన
● జీహెచ్ఎంసీలో యూఎల్బీల విలీనం తర్వాత పునర్విభజన ● సర్కిళ్లు, వార్డుల ఏర్పాటు అనంతరమే.. ఎన్నికలు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చే ఫిబ్రవరి 10తో ముగిసిపోనుంది. ఆలోగా ఎన్నికలు జరిగే అవకాశం లేదని స్పష్టమైంది. ఓఆర్ఆర్ వరకున్న 27 యూఎల్బీల విలీన ప్రక్రియకు ప్రభుత్వం నిర్ణం తీసుకోవడంతో జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగిశాక ఆ ప్రక్రియ మొదలుకానుంది. అనంతరం విలీనమయ్యే యూఎల్బీలతో జీహెచ్ఎంసీ మొత్తం ఒకటిగానే ఉంటుందా.. లేక అంతకంటే ఎక్కువ కార్పొరేషన్లుగా రూపాంతరం చెందనుందా? అన్నదానిపై ఇప్పటికై తే పూర్తి స్పష్టత లేదు. ప్రభుత్వమైతే రెండు నుంచి నాలుగు కార్పొరేషన్లుగా చేసే ఆలోచనను ఉపసంహరించుకోలేదని సమాచారం. ఎన్నికార్పొరేషన్లు అనే సంఖ్యపై మాత్రమే స్పష్టత రావాల్సి ఉంది. రెండు,మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తే ఎలా అనేదానిపై ఇప్పటికే డ్రాఫ్ట్లు సిద్ధమై ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికనుగుణంగా రెండు లేదా మూడు కార్పొరేషన్లు అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాతే వాటికి ఎన్నికలు జరుగుతాయి. అప్పటిదాకా జీహెచ్ఎంసీ మొత్తానికి స్పెషలాఫీసర్ పాలనే సాగనుంది.జీహెచ్ఎంసీని ఎక్కువ కార్పొరేషన్లు చేస్తే సర్కిళ్లు, వార్డుల విభజన జనాభాకనుగుణంగా జరగాల్సి ఉంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యేందుకు ఏడాది సమయం పడుతుందని సంబంధిత అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాలు పరిగణనలోకి.. కొత్తగా ఏర్పాటు కాబోయే కార్పొరేషన్లలో నియోజకవర్గాలు, వార్డుల సరిహద్దుల్లో వివాదాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరోవైపు.. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా భవిష్యత్లో కొత్త నియోజకవర్గాలు కూడా ఏర్పాటు కానున్నందున ఆ అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర నగరాల్లోని పరిస్థితులు మరోవైపు దేశంలోని ముంబై, ఢిల్లీ తదితర మహా నగరాల పరిస్థితులను, అక్కడి కార్పొరేషన్లు, వాటి పనితీరును కూడా పరిగణనలోకి తీసుకొని, తగిన అధ్యయనం చేసి హైదరాబాద్కు అనుగుణంగా ఇక్కడ కార్పొరేషన్లు ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. కొత్త కార్పొరేషన్లు కూడా ప్రస్తుతమున్న తరహాలోనే జోన్లు, సర్కిళ్లు, డివిజన్లుగా ఉంటాయా.. లేక వాటి స్వరూపం మారుతుందా అన్నది తెలియదు. ఈ నేపథ్యంలో, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నందున, అన్నీ పూర్తయి కొత్తపాలకమండళ్లు ఏర్పడ్డానికి ఎంతలేదన్నా ఏడాది పట్టే అవకాశం ఉంది. -
మనమే గ్రేట్
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోనే అతిపెద్ద మహా నగరంగా హైదరాబాద్ అవతరించింది. రాష్ట్ర ప్రభుత్వం శివార్లలోని 27 మున్సిపాలిటీలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నిజాం సిటీతో మొదలైన భాగ్యనగరం 1,982.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 1.69 కోట్ల జనాభాతో దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది. అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ నేపథ్యంలో గ్రేటర్ విస్తరణ అనివార్యమైపోయింది. మన తర్వాతే ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చైన్నె మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం 625 చ.కి.మీ., 1.45 కోట్ల జనాభాగా ఉన్న జీహెచ్ఎంసీ.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా 40.17 చ.కి.మీ, కొత్తగా విలీనమైన 27 మున్సిపాలిటీల విస్తీర్ణం 1,317.73 చ.కి.మీ. జనాభా 20,16,978 మొత్తం కలిపి జీహెచ్ఎంసీ విస్తీర్ణం 1,982.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 1.69 కోట్ల జనాభాతో దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది. అభివృద్ధి విస్తరణ.. ప్రపంచంలో కోటి జనాభా ఉన్న 37 మెగా నగరాలలో.. ఆరు భారత్లోనే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై. చైన్నె, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా నగరాలు కేవలం జనాభా సెంటర్లు మాత్రమే కాదు.. ప్రధాన ఆర్థిక, ఉద్యోగ కేంద్రాలుగా మారాయి. 146 కోట్ల జనాభా ఉన్న దేశంలో దాదాపు 37 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 53 శాతానికి, 87.6 కోట్ల జనాభాకు చేరుతుందని అంచనా. మన మెట్రో నగరాలు ప్రపంచ నగరాలతో పోటీపడుతున్నాయి. విధానపరమైన మార్పులు, స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రపంచీకరణ, శ్రామిక జనాభా పెరుగుదల వంటివి నగరాల అభివృద్ధి, విస్తరణకు ప్రధాన కారణాలు. జీహెచ్ఎంసీ విస్తరణతో ఆ మేరకు కొత్తగా విలీనమయ్యే మున్సిపాలిటీలలో పన్నులు పెరగక తప్పదు. అభివృద్ధి సమాంతరంగా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కొత్తగా విలీనమైన మున్సిపాలిటీలలో భూముల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. వృద్ధి ఎక్కడి నుంచి ఎక్కడికి.. 1990 చివర్లో హైదరాబాద్లో ఫార్మాతో పాటు ఐటీ, ఐటీఈఎస్ రంగం జోరందుకుంది. దీంతో 2000 సంవత్సరాంతంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీలు అప్గ్రేడ్ అయ్యాయి. 2008లో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ప్రపంచ ప్రయాణికులు, కార్గో సేవలతో వృద్ధి రెండింతలైంది. అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనతో నగరం పశ్చిమ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్ను విమానాశ్రయానికి అనుసంధానించింది. దీంతో హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోయింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు గ్రేటర్ నగరం వైపు దృష్టి మళ్లించాయి. బహుళ జాతి సంస్థలు, నైపుణ్య కార్మికులకు నగరం వేదికై ంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలు చేసిన వ్యాపార అనుకూల విధానాలతో ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతమైంది. ఔటర్, మెట్రోలు అందుబాటులోకి రావడంతో నగరంలో కనెక్టివిటీ మరింత పెరిగింది. దీంతో నగరాభివృద్ధి పశ్చిమం వైపు నుంచి దక్షిణం వైపు విస్తరించింది. దేశంలోనే అతిపెద్ద మహా నగరంగా హైదరాబాద్ దేశంలోని పలు మహా నగరాలివీ మున్సిపల్ కార్పొరేషన్ జనాభా విస్తీర్ణం (2011) (చ.కి.మీ)బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 1,24,42,373 437 మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ 1,10,34,555 1,397 బృహత్ బెంగళూరు మహానగర పాలిక 84,43,675 741 అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 55,77,940 464 గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ 46,81,087 426 కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ 44,96,694 206 సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ 44,62,002 462 పుణె మున్సిపల్ కార్పొరేషన్ 31,24,458 516 జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ 30,46,163 467 1,982.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అవతరణ సుమారు 1.69 కోట్ల జనాభా మన తర్వాతే ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చైన్నె మున్సిపల్ కార్పొరేషన్లు -
నిధులజల్లు
ఒక్కో కార్పొరేటర్కు రూ.2 కోట్లు ● మౌలిక సదుపాయాలకు కేటాయింపు ● మూడునెలల గడువులోపు రూ. 300 కోట్లు ● జీహెచ్ఎంసీ పాలకమండలి ఆమోదం ● కార్పొరేటర్ల కంటే ఎమ్మెల్యేలకే ఎక్కువ సమయం సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగియవస్తున్న తరుణంలో కార్పొరేటర్లకు స్పెషల్ ఫండ్ అందింది. ఒక్కో కార్పొరేటర్కు రూ.2 కోట్లు వంతున కేటాయించేందుకు మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. ఇందులో కోటి రూపాయలు కార్పొరేటర్ నేరుగా ప్రతిపాదించిన పనులకు కేటాయిస్తారు. అవి పూర్తయ్యాక మరో కోటి రూపాయల పనులు జిల్లా ఇన్చార్జి మంత్రి అనుమతితో కార్పొరేటర్ సూచించిన పనులకు కేటాయిస్తారు. ఈ నిధులను రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, కాలుష్య నియంత్రణ, వర్షపు నీటి కాల్వలు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్, పబ్లిక్ సౌకర్యాల అభివృద్ధి వంటి అత్యవసర పౌర సదుపాయాల మెరుగుదలకు వినియోగించాల్సిందిగా సూచనలు జారీ అయ్యాయి. మొత్తానికి రానున్న రెండునెలల్లో దాదాపు రూ. 300 కోట్లు ఖర్చు చేయవచ్చన్న మాట. జీహెచ్ఎంసీలో 150 డివిజన్లుండగా, కొన్ని డివిజన్లలో కార్పొరేటర్లు లేకపోవడం తెలిసిందే. రెండు టేబుల్ అజెండాలతో సహ 45 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. ఇటీవల మృతిచెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్, ప్రముఖ కవి, రచయిత అందెశ్రీలకు సభ నివాళులర్పించింది. పాలకమండలి సభ్యులు గ్రూప్ ఫొటో దిగారు. కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ సభకు హాజరయ్యారు. ఎక్స్ అఫీషియోలే ఎక్కువగా.. ఈసారి సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్ల కంటే ఎక్స్అఫీషియో సభ్యులైన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలే ఎక్కువ సమయం మాట్లాడారు. సభ్యుల గలభాతో సభాధ్యక్షత వహించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పలు మార్లు మార్షల్స్ను రప్పించారు. 150 ఏళ్ల సందర్భాన్ని పురస్కరించుకొని వందేమాతరం గీతాలాపనతో సభ ప్రారంభించాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. సభ కొద్దిసేపు వాయిదా వేశాక, వందేమాతరం గీతంతో పాటు రాష్ట్ర గీతమైన జయజయహే తెలంగాణ గీతాన్ని కూడా ఆలపించారు. ఎంఐఎం సభ్యుడు సోహైల్ఖాద్రి వందేమాతరం గీతాన్ని ఆక్షేపిస్తూ, మిగతా సభ్యులంతా లేచి ఆలపించినా, ఆయన మాత్రం నిలబడలేదు. ఈ సందర్భంగా దేశంలో ఉండాలంటే వందేమాతరం ఆలపించాలంటూ బీజేపీ సభ్యులు నినదించడంతో కాసేపు గలభా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన గొడవలో కొందరు కుర్చీలు, టేబుళ్లపైకి ఎక్కడంతో మేయర్ సీరియస్ అయ్యారు. మార్షల్స్ను రప్పించారు. అనంతరం వెనక్కి పంపించారు. భూముల అమ్మకంపై వివాదం ● బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చెబుతూ, ఇండస్ట్రియల్ భూముల అమ్మకం ప్రస్తావన రాగా, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దానికిది వేదిక కాదని, కావాలంటే ప్రత్యేక సమావేశంలో చర్చించవచ్చన్నారు. ఇది జీహెచ్ఎంసీకి సంబంధించిన అంశమే అని మరో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య వాదోపవాదాల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యురాలు మన్నె కవిత వేలు చూపుతున్నారంటూ మేయర్ వారించారు. ఆమె క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యుడు బాబా ఫసియుద్దీన్ డిమాండ్ చేశారు. ● మరో బీఆర్ఎస్ కార్పొరేటర్ సునీత సభకు, చైర్కు కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని మేయర్ మండిపడ్డారు. మేయర్ కూడా కార్పొరేటర్లకు కూడా తగిన గౌరవమివ్వాలని సామల హేమ అన్నారు. మూడు నాలుగు నెలలకోమారు జరిగే సమావేశంలో కార్పొరేటర్లు మాట్లాడేందుకు అవకాశం లేకుండా ఎక్స్అఫీషియోలో ఎక్కువ సమయం తీసుకోవడం సమంజసం కాదని మేయర్ అన్నారు. మీకు సబ్జెక్ట్ లేకే ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తున్నారని మేయర్ వ్యాఖ్యానించారు. కావాలంటే కార్పొరేటర్లకు అవకాశమిస్తానంటూ సునీతను మాట్లాడాల్సిందిగా కోరారు. గందరగోళాలు, వివాదాల తర్వాత పారిశుద్ధ్యం, డెబ్రిస్, కొన్ని ఏజెన్సీలకే టెండర్లు, క్రీడా సదుపాయాలు, తదితర అంశాల్లో ప్రజలు తీవ్ర సమస్యలెదుర్కొంటున్నారని సభ్యులు మండిపడ్డారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని మేయర్ ప్రారంభోపన్యాసంలో వివరించారు. సమావేశం జరిగిందిలా.. సమయం అంశం 10.10: కార్పొరేటర్ల వద్ద ప్లకార్డుల తనిఖీ 11.04: సభలో ప్రవేశించిన మేయర్. సభ ప్రారంభం 11.08: మృతులకు సంతాపాలు 11.40: బేక్. గ్రూప్ ఫొటో షూట్ 12.35: తిరిగి సభ ప్రారంభం. వందేమాతరం గీతాలాపనపై వివాదం. బ్రేక్ 12.57: తిరిగి సభ ప్రారంభం 1–15: టీ బ్రేక్ 1–25: తిరిగి ప్రారంభం 1–25: లంచ్ బ్రేక్ 2.52: తిరిగి ప్రారంభం 4.30: టీ బ్రేక్ తిరిగి ప్రారంభమయ్యాక ముగిసేంత వరకు కొనసాగింది. -
బహుబలి.. బల్దియా
సాక్షి, సిటీబ్యూరో గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) మరింతగా విస్తరించనుంది. ఇప్పటికే దాదాపు 650 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన కార్పొరేషన్ దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల మేరకు పెరగనుంది. జీహెచ్ఎంసీ వెలుపల ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు, దానిని ఆనుకొని ఉన్న 27 యూఎల్బీలను (కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు) జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రభుత్వ ప్రతిపాదనకు మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం పంపిన మెమోను జీహెచ్ఎంసీ యంత్రాంగం పాలకమండలి సమావేశం ముందుంచింది. జీహెచ్ఎంసీ చట్టం–1955 మేరకు ఈ ప్రతిపాదనపై పరిశీలించి, అవసరమైన అధ్యయనం నిర్వహించి జీహెచ్ఎంసీ తన అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా ప్రభుత్వం కోరింది. ఈనెల 21వ తేదీన ప్రభుత్వం జారీ చేసినఈ మెమోను వివరిస్తూ, ఆ మేరకు టేబుల్ అజెండాగా సమావేశం ముందుంచారు. సర్వసభ్య సమావేశం ఈ ప్రియాంబుల్కు ఆమోదం తెలిపింది. ఇక జీహెచ్ఎంసీలో 27 యూఎల్బీల విలీనం కేవలం లాంఛనమే నన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరానికి ఆనుకునే ఉన్నప్పటికీ పలు యూఎల్బీలలో అభివృద్ధి అసమానంగా ఉందని, మౌలిక వసతుల్లో తేడాలున్నాయని, పట్టణీకరణ పెరిగిందని ప్రభుత్వం మెమోలో పేర్కొంది. జీహెచ్ఎంసీని ఆనుకునే ఉన్నప్పటికీ, యూఎల్బీలకు తగిన సేవలందడం లేవని అభిప్రాయపడింది. అందరికీ సమాన సేవలు, సమాన అభివృద్ధి కోసం విలీనం అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడింది. విలీనంతో.. విలీనమయ్యే ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్గా వ్యవహరిస్తున్నారు. విలీనంతో మాస్టర్ ప్లానింగ్, రవాణా కనెక్టివిటీ తదితర మౌలిక వసతులు మెరుగవడంతోపాటు ఆ ప్రాంతం వరకు ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చి అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇంకా, ట్రాఫిక్ పరంగా, పర్యావరణపరంగా ఒత్తిడి తగ్గుతుంది. సమర్థమైన విపత్తు నిర్వహణ సాధ్యమవుతుంది. పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. రోడ్లు, పారిశుద్ధ్యం, నీటిసరఫరా తదితర సదుపాయాలు అందరికీ సమానంగా అందుతాయి. పరిపాలన సామర్థ్యం, డిజిటల్ గవర్నెన్స్ మెరుగవుతాయి. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, పట్టణ ప్రణాళిక ఒకే గొడుగు కిందకు వస్తుందని అంచనా వేస్తోంది. ఇబ్బందులు.. శివారు నగర, పురపాలికలు జీహెచ్ఎంసీలో విలీనం కావడం వల్ల ఆస్తిపన్ను భారం పడే అవకాశముంది. అలాగే ట్రేడ్ లైసెన్స్, ఇతర ఫీజుల వడ్డన కూడా మున్సిపాలిటీలతో పోలిస్తే అధికంగా ఉంటుంది. దీనికితోడు భవన నిర్మాణ అనుమతుల ఫీజులు కూడా పెరిగే అవకాశంలేకపోలేదు. విలీనం వల్ల శివారు యూఎల్బీల్లో రాజకీయ పదవులు తగ్గుతాయి. జీహెచ్ఎంసీలో విలీనం తర్వాత జీహెచ్ఎంసీ మొత్తం ఒకే కార్పొరేషన్గా ఉంటుందో, ఎక్కువ కార్పొరేషన్లుగా మారుతుందో పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఒకే కార్పొరేషన్ అయితే పాలనాపర ఇబ్బందులుంటాయి. ఇప్పటికే ట్రాఫిక్ చిక్కులతో జీహెచ్ఎంసీలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి గంటల సమయం పడుతుండటం తెలిసిందే. మారనున్న జీహెచ్ఎంసీ రూపురేఖలు ఔటర్ వరకు యూఎల్బీలు జీహెచ్ఎంసీలో విలీనం పాలకమండలి ముందుకు అంశం 15 తూంకుంట 16 కొంపల్లి 17 దుండిగల్ 18 బొల్లారం 19 తెల్లాపూర్ 20 అమీన్పూర్ 21 బడంగ్పేట్ 22 బండ్లగూడ జాగీర్ 23 మీర్పేట్ 24 బోడుప్పల్ 25 పీర్జాదిగూడ 26 జవహర్నగర్ 27 నిజాంపేట్ 1 పెద్ద అంబర్పేట్ 2 జల్పల్లి 3 శంషాబాద్ 4 తుర్కయంజాల్ 5 మణికొండ 6 నార్సింగి 7 ఆదిబట్ల 8 తుక్కుగూడ 9 మేడ్చల్ 10 దమ్మాయిగూడ 11 నాగారం 12 పోచారం 13 ఘట్కేసర్ 14 గుండ్లపోచంపల్లి విలీనంతో పెరగనున్న జీహెచ్ఎంసీ పరిధి ప్రాంతం విస్తీర్ణం ఓటర్లు జనాభా (దాదాపు) జీహెచ్ఎంసీ 625 98,74,600 1,45,15,662 కంటోన్మెంట్ 40.17 2,53,636 3,72,844 27 యూఎల్బీలు 1317.73 13,72,094 20,16,978 మొత్తం జనాభా : 1,69,05 485 -
ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే దండనే: సజ్జనర్
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ గురువారం కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకాలు కలిగించినా, వారిపై దాడులకు దిగినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. పోలీసు అధికారులు, ఉపాధ్యా యులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాదు బెదిరింపులకు దిగినా, దాడులు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే భారత న్యాయ సంహితలోని (బీఎన్ఎస్) 221, 132, 121(1) సెక్షన్ల ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామన్నారు. వారిపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని చెప్పారు. ఇలా ఒక్కసారి కేసు నమోదైతే వారి భవిష్యత్ అంధకారమయ్యే ప్రమాదం ఉందని స్పష్టంచేశారు. పాస్పోర్టు జారీకి, ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ఇబ్బందులు వస్తాయన్నారు. క్షణికావేశంలో తప్పు చేసి జీవితాంతం కుమిలిపోవద్దని సజ్జనర్ సూచించారు. -
అభిమాన సంద్రం
స్వాగత హోర్డింగ్లు.. ప్లకార్డుల ప్రదర్శన బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని లోటస్పాండ్లోని తన నివాసానికి వచ్చేముందు జగన్కు అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ప్రధాన చౌరస్తాల్లో స్వాగత హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. వేలాదిగా వచ్చిన జనంతో జగన్ నివాసిత ప్రాంతం కిక్కిరిసిపోయింది. సీఎం జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుమారు గంటన్నర పాటు ఆయన లోటస్పాండ్లో ఉండగా అభిమానులు, కార్యకర్తలు కూడా అంతసేపు అక్కడే ఉండిపోయారు. ఇంటి నుంచి జగన్ తిరిగి ఎయిర్పోర్ట్కు వెళ్లే క్రమంలో కూడా బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ వరకు వేలాదిగా కార్యకర్తలు బారులుతీరారు. అభిమానులకు ఆయన అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సనత్నగర్/నాంపల్లి/బంజారాహిల్స్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలంగాణ గడ్డపై అపూర్వ స్వాగతం లభించింది. ఆయనను కనులారా చూసేందుకు గురువారం వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులతో బేగంపేట్ ఎయిర్పోర్ట్తో పాటు నాంపల్లిలోని సీబీఐ కోర్టు పరిసరాలు, బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని రహదారులు కిక్కిరిసిపోయాయి. జై జగన్.. జైజై జగన్.. సీఎం..సీఎం.. అనే నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనతో దద్దరిల్లాయి. జగన్మోహన్రెడ్డిని చూసేందుకు పోలీసుల తాళ్ల కంచెను సైతం దాటుకుంటూ వెళ్లిపోయారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులను అదుపు చేయడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. ఈ క్రమంలో పోలీసులకు, అభిమానులకు మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు తమ లాఠీలతో కార్యకర్తలను, అభిమానులను అడ్డుకునే ప్రయత్నాలు చేసినా అభిమానం ముందు నిలబడలేదు. దీంతో అశేషంగా తరలివచ్చిన జనం తోసుకుంటూ రావడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. మరోవైపు పెద్ద సంఖ్యలో అభిమానులు బైక్ ర్యాలీలతో ఎయిర్పోర్ట్కు తరలివచ్చారు. జై జగన్ నినాదాలు చేయడంతో బేగంపేట్ రహదారులు హోరెత్తాయి. ఉదయం నుంచే అభిమానుల ఎదురుచూపులు.. సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అభిమానులు, నేతలు భారీగా తరలివచ్చారు. నాంపల్లి కోర్టుకు జగన్ వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఉదయాన్నే నాంపల్లికి చేరుకున్నారు. అభిమాన నాయకుడు రాకకోసం నాంపల్లి రోడ్లపై ఎదురు చూశారు. జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు వస్తున్నారన్న కారణంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ట్రాఫిక్ను మళ్లించారు. అడుగడుగునా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అడుగడుగునా అత్యుత్సాహం ప్రదర్శించారు. నాంపల్లి కోర్టుకు అరకిలో మీటరు దూరంలో చుట్టూ బారికేడ్లను, ముళ్ల కంచెను ఉంచారు. కోర్టుకు వచ్చే దారులన్నింటిని మూసివేశారు. సమీపంలోని వ్యాపార సముదాయాలను సైతం బలవంతంగా మూసివేయించారు. ఉదయం బారికేడ్లను తెరుచుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ కోర్టు ఆవరణలోకి ప్రవేశించింది. భారీగా మోహరించిన అభిమానులకు కాన్వాయ్లోంచి జగన్ అభివాదం చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యానవన శాఖ కార్యాలయం పక్కన ఉన్న గేటు వైపు నుంచి రెడ్హిల్స్, లక్డీకాపూల్ మీదుగా జగన్ కాన్వాయ్ తిరిగి వెళ్లింది. బేగంపేట్ విమానాశ్రయానికి తరలివచ్చిన ప్రజావాహిని బైక్ ర్యాలీలతో హోరెత్తిన రహదారులు అదనపు పోలీసు బలగాలతో భారీ బందోబస్తు నాంపల్లి సీబీఐ కోర్టు వద్ద పెల్లుబికిన ప్రజాభిమానం లోటస్పాండ్లోని నివాసం వద్దా అదే ఉత్సాహం అడుగడుగునా పోలీసుల అత్యుత్సాహం లాఠీచార్జ్తో అభిమానులను భయపెట్టే యత్నం -
నా చావుతోనైనా అధికారుల్లో మార్పు వస్తుందేమో!
చెరువులో దూకి మల్కాజిగిరి కార్పొరేటర్ ఆత్మహత్యాయత్నం మల్కాజిగిరి: ఎన్నిసార్లు చెప్పినా ఇంజినీరింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు.. మేయర్, ఉన్నతాధికారులు వచ్చి ఆదేశాలిచ్చినా అధికారులు అమలు చేయడంలేదంటూ గురువారం మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ సఫిల్గూడ చెరువులో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చెరువులోకి దూకిన ఆయనను స్థానికులు, మున్సిపల్ సిబ్బంది బయటికి తీసుకొచ్చారు. కార్పొరేటర్ శ్రవణ్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘సఫిల్గూడ చెరువును అభివృద్ధి చేయాలంటూ తాను గత కొన్ని నెలలుగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు స్వయంగా వచ్చి చెరువును పరిశీలించారు. దీంతో చెరువు అభివృద్ధికి దాదాపు రూ.2 కోట్లు మంజూరయ్యాయి. పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. ఈ క్రమంలో మల్కాజిగిరి సర్కిల్ ఇంజినీరింగ్ విభాగం అధికారుల తీరు అధ్వానంగా మారింది. నాలుగేళ్లుగా ఈఈ ఇక్కడే తిష్ట వేశారు. పలు ఆరోపణలు ఉన్న డీఈ మహేష్ను బదిలీ చేయాలని అడిగినా పట్టించుకోవడంలేదు. అధికారుల మధ్య సమన్వయం లేదని, తన చావుతోనైనా సమస్య పరిష్కారమవుతుందని.. ఆత్మహత్యా యత్నం చేశాను’ అని శ్రవణ్ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి పనుల్ని అడ్డుకోవడం తగదని హితవు పలికారు. పనులను ఎమ్మెల్యే అడ్డుకున్నా విధి నిర్వహణ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. -
మహా జలమండలికి గ్రీన్ సిగ్నల్
● ప్రస్తుత పరిధి 1450.2 చదరపు కిలోమీటర్లు ● మరో 603 చదరపు మీటర్లలో విస్తరణ ● తాగునీరు, డ్రైనేజీ నెట్వర్క్ కోసం ప్రణాళిక ● త్వరలో డీపీఆర్ రూపకల్పనకు టెండర్లు ఓఆర్ఆర్ వెలుపల పైపులైన్ నెట్వర్క్ విస్తరణసాక్షి, సిటీబ్యూరో: ‘తెలంగాంణ కోర్ అర్బన్ రీజియన్’ ఏర్పాటు కసరత్తులో భాగంగా తాగునీటి, సీవరేజీ నెట్వర్క్ విస్తరణ ప్రణాళిక రూపకల్పన కోసం ప్రభుత్వం నుంచి జలమండలికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పటి వరకు అవుటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) లోపలి ప్రాంతాల వరకు మాత్రమే విస్తరించి ఉన్న నెట్వర్క్ను.. ఓఆర్ఆర్ వెలుపల కూడా విస్తరించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన కోసం జలమండలి కసరత్తు చేస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశంలో నలు దిక్కులా విస్తరిస్తున్న నగర భవిష్యత్ అవసరాలను దృష్టి పెట్టుకొని పెరగనున్న జనాభా అనుగుణంగా సీవరేజీ, వాటర్ వ్యవస్థను విస్తరించేందుకు నివేదిక రూపకల్పన కోసం అధికారులను ఆదేశించారు. తక్షణమే జలమండలి ప్రాథమిక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించగా.. మూడు నెలల్లోగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి సమర్పించాలని ఆదేశించింది. దీంతో డీపీఆర్ రూపకల్పన కోసం టెండర్ పిలిచేందుకు జలమండలి చర్యలకు ఉప్రకమించింది. నెట్వర్క్ విస్తరణ ఇలా... జలమండలి తాగునీటి, డ్రైనేజీ వ్యవస్థ ప్రస్తుతం సుమారు 1450.2 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. దీనిని 2053.2 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించే విధంగా జలమండలి కసరత్తు చేస్తోంది. నగర శివారలోని మున్సిపాలిటీలోని కొన్ని ప్రాంతాలు ఓఆర్ఆర్ లోపల ఉండగా, మరికొన్ని ప్రాంతాలు వెలుపల ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అవతల ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 24 గ్రామ పంచాయితీల పరిధిలోని 190 గ్రామాలకు తాగునీటి పైప్లైన్ వ్యవస్థ విస్తరించి ఉంది. ఓఆర్ఆర్ లోపల ప్రాంతాలకు మాత్రమే తాగునీటి, డ్రైనేజీ వ్యవస్థ విస్తరించి ఉండగా.. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో వెలుపల ప్రాంతాలను సైతం పరిధిలోకి రానున్నాయి. మహా విస్తరణలో భాగంగా వాటర్, సీవరేజ్ పైపులైన్లతో పాటు ఎస్టీపీల నిర్మాణాల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన కోసం జలమండలి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పరిధి.. ప్రస్తుతం ఓఆర్ఆర్ పరిధిలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, మీర్పేట్, బడంగ్పేట్, నిజాంపేట్, బండ్లగూడ కార్పొరేషన్లు, పోచారం, దమ్మాయిగూడ, నాగారం, తుమ్ముకుంట, గుండ్లపోచంపల్లి, జల్పల్లి, తుక్కుగూడ, తుర్కయంజల్, పెద్దంబర్పేట్, ఆదిబట్ల, అమ్మీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం, దుండిగల్, కొంపల్లి, మణికొండ, నార్సింగ్, శంషాబాద్ మున్సిపాలిటీలు, చౌదరిగూడ, కోరెముల, వెంకటాపూర్, కంచవాణిసింగారం, ప్రతాపసింగారం, గోధుమకుంట, తిమ్మాయిపల్లి, నర్సంపల్లి, చేర్యాల్, కరీంగూడ, జాఫర్గూడ , ఆర్సిపురం పటాన్చెరువు, ఐలాపూర్, ఐలాపూర్, ఐలాపుర్ తండా, గండిగూడెం,సుల్తాన్పూర్, కిష్టారెడ్డిపేట్, పటేల్గూడ, శంషాబాద్, బహదుర్గూడ, చిన్నగోల్కొండ, హమీదుల్లానగర్, రషీద్గూడ కుత్బుల్లాపూర్, గౌరెల్లి గ్రామపంచాయతీలు జలమండలి పరిధిలో ఉన్నాయి. కోర్ సిటీ 169.3 చుట్టుపక్కల 518.9 ఓఆర్ఆర్ లోపల 762 ఓఆర్ఆర్ వెలుపల 603 (ప్రతిపాదనలో) ఓఆర్ఆర్కు అటూ ఇటూ ఓఆర్ఆర్ పరిధిలోని కొన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఓఆర్ఆర్ లోపల, వెలుపల ఉన్నాయి. శంషాబాద్, నార్సింగి, తుక్కుగూడ, పెద్దఅంబర్పేట, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీల పరిధి ఓఆర్ఆర్ అటూ ఇటూ విస్తరించి ఉంది. మహా విస్తరణతో ఓఆర్ఆర్ వెలుపల ఉన్న ప్రాంతాలు కూడా జలమండలి పరిధిలోకి రానున్నాయి. -
బీజేపీ కార్పొరేటర్ల బైఠాయింపు పోలీసులతో తరలింపు
సాక్షి, సిటీబ్యూరో: కేవలం అధికార పార్టీ, స్టాండింగ్ కమిటీ సభ్యులకే కాకుండా జీహెచ్ఎంసీలోని అన్ని డివిజన్ల కార్పొరేటర్లకు నిధులు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ కింద విడుదల చేసిన రూ.113 కోట్లతో 38 చెరువులు పునరుద్ధరించాల్సి ఉన్నా.. పనులెందుకు చేయడం లేదని ప్రశ్నిస్తూ బీజేపీ కార్పొరేటర్లు స్టాండింగ్కమిటీ సమావేశానికి ముందు సమావేశ హాల్ ఎదుట బైఠాయించారు. సంవత్సరాలుగా పేరుకుపోయిన పలు సమస్యలపై కార్పొరేటర్లు ఇచ్చిన వినతిపత్రాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు పట్టబట్టడంతో, భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని చిక్కడపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. కనీసం తమ ప్రశ్నలకు సమాధానాలిస్తే తాము వెళ్లిపోతామని చెప్పినా మేయర్ వినిపించుకోలేదని, దాదాపు వందమంది పోలీసులతో కాంగ్రెస్ పార్టీ పాశవికంగా దాడి చేయించిందని మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ఆరోపించారు. కార్యక్రమంలో సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్, గోషా మహల్ కార్పొరేటర్ లాల్ సింగ్ బీజేపీ సీనియర్ నాయకులు గౌలికర్ ఆనంద్, ప్రభు గుప్తా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
మెట్రో రూట్లలో రవాణా ఆధారిత అభివృద్ధి
● మొత్తం 8 కారిడార్లలో టీఓడీకి హెచ్ఎండీఏ సన్నాహాలు ● ప్రజారవాణా సదుపాయాలను ప్రోత్సహించడమే లక్ష్యం 500 మీటర్ల పరిధిలో బహుళ వినియోగ భవనాలు సాక్షి, సిటీబ్యూరో: మెట్రో మార్గాల్లో రవాణా ఆధారిత అభివృద్ధి (టీఓడీ)కి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సన్నాహాలు చేపట్టింది. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజారవాణా సదుపాయాల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా టీఓడీ ప్రాజెక్టులకు ప్రత్యేక అనుమతులనివ్వనున్నారు. ఇందుకోసం హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ ‘హుమ్టా’ ఆధ్వర్యంలో విధివిధానాలు, కార్యాచర ణ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. నివాస,వాణిజ్య భవన సముదాయాలు ఒకే ఆవరణలో అందుబాటులో ఉండేలా బహుళ వినియోగ భవనాలను నిర్మించనున్నారు. మెట్రో కారిడార్లకు రెండు వైపులా 500 మీటర్ల పరిధిలో అందుబాటులో ఉన్న స్థలాల్లో ఈ తరహా భవనాల నిర్మాణాలను ప్రోత్సహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 8 కారిడార్లలో టీఓడీ ప్రాజెక్టులు.. మెట్రో మొదటి దశలోని మూడు కారిడార్లతో పాటు రెండో దశలో నిర్మించనున్న మొదటి ఐదు కారిడార్లలో టీఓడీ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. సుమారు 200 కి.మీ. మార్గంలో అవకాశం ఉన్నచోట నిర్మాణాలను చేపట్టాలనేది ప్రతిపాదన. ఎల్అండ్టీ నుంచి స్వాధీనం చేసుకోనున్న ప్రభుత్వ స్థలాలను లీజు ప్రాతిపదికన తిరిగి ప్రైవేట్ సంస్థలకు అప్పగించడమా? లేక.. వాటిని విక్రయించడం ద్వారా మెట్రో నిర్వహణకు అవసరమైన నిధులను సమకూర్చడమా? అనే అంశాలపై త్వరలో స్పష్టత రానుందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే మెట్రోస్టేషన్లకు రెండు వైపులా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో టీఓడీ ప్రాజెక్టులను ప్రోత్సహించనున్నారు. టీఓడీ అంశం ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉంది. వివిధ నగరాల్లో ఇప్పటికే చేపట్టిన టీఓడీ ప్రాజెక్టులను అధ్యయనం చేస్తున్నాం. త్వరలోనే స్పష్టమైన కార్యాచరణను సిద్ధం చేసే అవకాశం ఉంది’ అని హెచ్ఎండీఏ అధికారి ఒకరు చెప్పారు. కర్కర్దూమా మెట్రో టీఓడీ తరహాలో.. ప్రస్తుతం ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) కర్కర్దుమా మెట్రోస్టేషన్ వద్ద ఈ టీఓడీ ప్రాజెక్టును చేపట్టింది. మిక్స్డ్ అర్బన్ డెవలప్మెంట్ భవనంగా సుమారు 48 అంతస్థులను నిర్మించనున్నారు. మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేవిధంగా 1026 డబుల్ బెడ్రూంలతో ఈ టవర్ 2026 జూలై నాటికి అందుబాటులోకి రానుంది. ఒక్కో ఫ్లాట్ ధర కనిష్టంగా రూ.1.79 కోట్ల నుంచి గరిష్టంగా రూ.2.48 కోట్ల వరకు ఉంటుంది. ఇదే తరహాలో హైదరాబాద్లో అవకాశం ఉన్న మెట్రోస్టేషన్ల వద్ద అన్ని సదుపాయాలతో టవర్లను నిర్మించాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
‘గాంధీ’లో అరుదైన శస్త్రచికిత్స
గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అత్యంత అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించి ఏడేళ్ల బాలుడికి పునర్జన్మ ప్రసాదించారు. వివరాలను గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి, పీడియాట్రిక్ సర్జరీ హెచ్ఓడీ ప్రొఫెసర్ నాగార్జున వెల్లడించారు. మంచిర్యాల జిల్లా అకినేపల్లికి చెందిన అఖిల్ (7)కు మూడు నెలల వయసులోనే హెరిడిటరీ స్ఫెరోసైటోసిస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. పలు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం అందించినా తీవ్రమైన రక్తహీనత, పచ్చకామెర్లు, స్ల్పిన్(ప్లీహం) పెరగడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వారానికోసారి రక్తమార్పిడి చేస్తున్నారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఈ నెల 6న గాంధీ పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో అఖిల్ను చేర్చారు. ప్రొఫెసర్ నాగార్జున నేతృత్వంలో నిపుణులైన వైద్యులు అత్యంత క్లిష్టమైన ల్యాప్రొస్కోపిక్ స్ల్పినెక్టమీ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఇలాంటి వ్యాధుల్లో రక్తస్రావం అధికంగా ఉంటుందని, కొన్నిసార్లు ఓపెన్ సర్జరీ చేయాల్సి వస్తుందని ప్రొఫెసర్ నాగార్జున తెలిపారు. ల్యాప్రొస్కోపిక్ స్ల్పినెక్టమీ సర్జరీతో నొప్పి, ఇన్ఫెక్షన్లు, మచ్చలు తక్కువగా ఉంటాయని, రోగి త్వరగా కోలుకుంటారని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం ఇదే మొదటిసారి అని ప్రొఫెసర్ వాణి తెలిపారు. గాంధీఆస్పత్రి చరిత్రలో ఇదో మైలురాయి అని పేర్కొన్నారు. సర్జరీని నిర్వహించిన వైద్యులు ప్రొఫెసర్ నాగార్జున, మనోజ్కుమార్, విష్ణువర్ధన్రెడ్డి, పవన్రావు, అశ్రితరెడ్డి, హర్ష, సాజిద్, అనస్తీషియా హెచ్ఓడీ ఆవుల మురళీధర్, బబిత, ఓటీ సిబ్బంది అరుణ, సువర్ణను వైద్యశాఖ ఉన్నతాధికారులు అభినందించారు. కోలుకున్న అఖిల్ను గురువారం డిశ్చార్జి చేశారు. తన కుమారుడికి పునర్జన్మ ప్రసాదించిన గాంధీ వైద్యులు, రాష్ట్ర ప్రభుత్వానికి అఖిల్ తండ్రి సురా రవి కృతజ్ఞతలు తెలిపారు. మొదటిసారిగా ప్రభుత్వాస్పత్రిలో ల్యాప్రొస్కోపిక్ స్ల్పినెక్టమీ ఏడేళ్ల బాలుడికి పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు -
సదరన్ ట్రావెల్స్ ‘హంగామా’
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ, అంతర్జాతీయ పర్యటనలకు ప్రత్యేక ప్యాకేజీలతో ‘ట్రావెల్ హంగామా’పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సదరన్ ట్రావెల్స్ సంస్థ ఎండీ కృష్ణమోహన్ తెలిపారు. ఈ ట్రావెల్ హంగామాలో భాగంగా అన్ని దేశీయ, అంతర్జాతీయ పర్యటనలపై ప్రత్యేక రాయితీలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం(నేటి) నుంచి ఈ పథకం ప్రారంభం కానుందని, రూ.60 వేల క్యాష్బ్యాక్ ఆఫర్ కూడా ఉందని, అంతర్జాతీయ పర్యటనలపై ప్రతి టూరిస్టుకు ఒక బహుమతి అందజేయనున్నామని తెలిపారు. ప్యాకేజీ మొత్తాన్ని ఈఎంఐగా చెల్లించే సదుపాయం ఉందని, రూ.5 వేల టోకెన్ అమౌంట్తో టూర్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. యూరోప్, వియత్నాం, శ్రీలంక, దక్షిణాఫ్రికా, దుబాయ్ తదితర దేశాలకు పర్యటన ప్యాకేజీలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేశంలోని అన్ని పర్యాటక, సందర్శక, చారిత్రక ప్రాంతాల కోసం కూడా టూర్ ప్యాకేజీలను రూపొందించినట్లు పేర్కొన్నారు. -
సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడి ఆత్మహత్య
హస్తినాపురం: పురుగుల మందుతాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. సాహెబ్నగర్కు చెందిన పారంద శ్రీకాంత్ (32) గతంలో హయత్నగర్కు చెందిన నలుగురితో రూ.2 లక్షలు తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు శ్రీకాంత్పై ఒత్తిడి తేవడంతో పాటు నువ్వు పెళ్లి ఎలా చేసుకుంటావో చూస్తామని బెదిరించారు. డబ్బులు ఇవ్వకపోతే మీ ఇంటికి తాళాలు వేసి రోడ్డుమీదకు లాగుతామని ఫోన్లో బెదిరించారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన శ్రీకాంత్ సెల్ఫోన్లో సెల్ఫీ వీడియోలో ‘తల్లిదండ్రులు నన్ను క్షమించండి... నాకు చావు తప్ప వేరే మార్గం లేదు. నా చావుకు కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు.. ఇంటికొచ్చి పరువు తీస్తారనే భయంతోనే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నానని’ వీడియోను స్థానిక సాహెబ్నగర్ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడు. గురువారం శ్రీకాంత్ హరిహరపురం కాలనీలోని కప్పలచెరువు కట్టమీద మందులో విషం కలుపుకుని తాగి అక్కడే మృతి చెంది కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. -
టేబుల్అజెండా .. చాటుమాటు ‘దందా’ ?
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో కానీ, సర్వసభ్య సమావేశాల్లో కానీ, అజెండా రూపొందించేనాటికి పొందుపరచని అత్యవసర పనులుంటే, ప్రజల అవసరాల దృష్ట్యా తప్పనిసరి అయితే టేబుల్ అజెండాగా సమావేశంలో అప్పటికప్పుడు ప్రవేశపెడతారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీకి మాత్రం ప్రతిసారీ కొన్ని అంశాలను సాధారణ అజెండాలో ఉంచకుండా టేబుల్ అజెండా పేరిట అప్పటికప్పుడు ఆమోదించడం పరిపాటిగా మారింది. ఇవి ఎవరి స్వప్రయోజనాల కోసమో అంతుపట్టదు. తాజాగా గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ అజెండాలో టేబుల్ అజెండాగా పొందుపరచి ఆమోదించిన అంశాల్లోని కొన్నింటిని పరిశీలిస్తే.. ● జీహెచ్ఎంసీకి చెందిన హిల్లాక్ స్థలాన్ని జూబ్లీహిల్స్లోని ప్రైవేట్ యజమాని భూమితో మార్చుకునేందుకు ఆమోదం. ● కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ ప్రాంగణంలోని గ్యాస్ సంస్థ లీజును మరో మూడు సంవత్సరాలకు పొడిగించేందుకు ఆమోదం. ● కాప్రా సర్కిల్లోని గెలీలియోనగర్ ఖాలీస్థలాన్ని స్పోర్ట్స్ ఎరీనాగా అభివృద్ధి చేసేందుకు ఆమోదం. ● జీహెచ్ఎంసీ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ కోసం సర్వీస్ ప్రొవైడర్ను ఎంపిక చేసేందుకు ఆమోదం. ● ఆబిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్లోని 56 సెల్లార్ దుకాణాల లీజుకు ఆమోదమని తొలుత పేర్కొన్నప్పటికీ, అనంతరం టెండరుగా మార్చారు. ● ఇవి ఎందుకు అత్యవసరమో, ఎవరికి అత్యవసరమో స్టాండింగ్ కమిటీ సభ్యులకే తెలియాలి. ఇవికాక ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా ఉందంటే కాల్సెంటర్ సర్వర్ మౌలిక వసతుల్ని అప్గ్రేడ్ చేయడం, 50 సీట్లతో ఇన్బౌండ్ కాల్సెంటర్ను ఏర్పాటు చేయడం. అయితే ఈ పనులు ఎప్పుడో ముగిశాయి. ఇది తప్ప మిగతా వాటిల్లో ప్రజాసదుపాయాల కంటే ప్రైవేటు ప్రయోజనాలే కనిపించడం గుర్తించవచ్చు. నిబంధనల మేరకే చేసినా ఎందుకంత హడావుడి? సాధారణఅజెండాలో ఎందుకు చేర్చలేదో వారికే తెలియాలి. అజెండాలో.. ● ఇక సాధారణ అజెండాలోని అంశాల్లో మాసాబ్ట్యాంక్ చాచానెహ్రూపార్కులో స్పోర్ట్స్ ప్లే గ్రౌండ్కు ఎలాంటి ఫీజు చెల్లించకుండా ఆక్రమించుకున్నవారిపై తగిన చర్యలు తీసుకునే అంశాన్ని మాత్రం వాయిదా వేశారు. ● ఒక్కరికే జీహెచ్ఎంసీ ఆబిడ్స్ కార్యాలయం సెల్లార్లోని 56 దుకాణాల్ని కట్టబెట్టే పనుల్ని పక్కనపెట్టి, దాన్నే టేబుల్ అజెండాగా చేర్చి టెండర్లకు వెళ్తామన్నారు. ● హైడ్రాకు రూ. 20 కోట్లు ఇచ్చేందుకు కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని ధ్రువీకరించే అంశాన్ని వాయిదా వేశారు. ఇక మిగతా వాటిల్లో ఇప్పటికే టెండర్లు పిలిచిన పనుల్ని ఆమోదం నిమిత్తం ఉంచారు. ● కొన్ని ప్రాజెక్టులకు భూసేకరణలు వంటివి ఉన్నాయి. మిగతా వాటిల్లో సనత్నగర్ లో జెన్ టెక్నాలజీస్ ఇండస్ట్రియల్ ఏరియా ఎదురుగా నీరు నిలవకుండా వరదనీటి కాలువ నిర్మాణానికి పరిపాలన అనుమతి, 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను బకాయిల వడ్డీలపై రాయితీకి ‘వన్ టైమ్ స్కీమ్’ పై తదుపరి ఉత్తర్వులు జారీ చేసేందుకు కమిషనర్ తీసుకున్న నిర్ణయానికి కమిటీ ఆమోదం, తదితరమైనవి ఉన్నాయి. ● సాధారణ అజెండాలో 18 అంశాలు, టేబుల్ అజెండాలో 6 అంశాలు ఆమోదించినట్లు పేర్కొన్నారు. సమావేశానికి మేయర్ విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఆయా విభాగాల ఉన్నతాధికారులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
త్వరలో ‘బస్తీ బాట – ప్రజాపాలన’
సాక్షి,సిటీ బ్యూరో : జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించే విధంగా త్వరలో ప్రత్యేక కార్యాచరణతో ‘బస్తీ బాట –ప్రజా పాలన’ కు సిద్ధమవుతున్నాం. ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అమలు చేసిన విధంగా అభివృద్ధి పనులు, సంక్షేమ ఫలాల సత్వర వర్తింపునకు క్షేత్ర స్థాయికి అధికార యంత్రాంగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజా సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం’’ అని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పష్టం చేశారు. గురువారం ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. సర్కారు ఏకై క ఎజెండా అభివృద్ది మహా హైదరాబాద్గా నగరం విస్తరిస్తోంది. తాగునీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు ప్రాధాన్యత ఇస్తున్నాం. రాబోయే 25 సంవత్సరాలలో పట్టణ జనాభా అవసరాలను పరిగణనలోకి తీసుకుని మౌలిక సదుపాయాల కల్పన కోసం అభివృద్ధి పనులు చేపడుతున్నాం. కుండపోత వర్షం వచ్చినా రోడ్లపై నీరు ఆగకుండా లాగిన్ పాయింట్లను ఏర్పాటు చేశాం. ప్రభుత్వం మెట్రో రైల్ను సైతం టెకోవర్ చేసుకొని రెండో, మూడో దశలను విస్తరించేందుకు చర్యలు చేపట్టాం. రాబోవు మూడేళ్లలో మరింత అభివృద్ధి చేస్తాం. రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు.. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టలన్నదే ప్రభుత్వం లక్ష్యం. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. తమ ప్రాంతాల సమస్యలు, అభివృద్ధి పనులను ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. కొందరు ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. మరి కొందరు పదేళ్ల మాదిరిగా అభివృద్ధి పనులకు దూరం పాటిస్తున్నారు. కేవలం రాజకీయ విమర్శలకు పరిమితమవుతున్నారు. ఇది మంచి పద్దతి కాదు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లు నగరంలోని అర్హులందరికీ దశల వారిగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తాం. నగరంలో స్థలం కొరత కారణంగా కొంత అలస్యం జరుగుతోంది. గృహ నిర్మాణాల విధి విధానాల రూపకల్పన కోసం ఉన్నత స్థాయి కమిటీ కసరత్తు చేస్తోంది. అర్హులందరికి రేషన్ కార్డులు మంజూరు చేశాం. కొత్త కాలనీలకు బస్సు సౌకర్యం నగరంలో కొత్తగా వెలుస్తున్న కాలనీలు, శివార్లలోని విద్యాసంస్థల రూట్లలో ప్రజా రవాణా ఒత్తిడి ఉంటే ఆర్టీసీ సిటీ బస్సు సౌకర్యం కల్పిస్తాం, ఇప్పటికే ఆయా రూట్ల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఓఆర్ఆర్ పరిధిలో ఎలక్ట్రానిక్ బస్సులు అందుబాటులోకి తీసుకోస్తాం. ప్రజల వద్దకు అధికారయంత్రాంగం హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ -
‘ప్యాకెట్ ఆకారం చూసి మోసపోవద్దు’
సాక్షి, సిటీబ్యూరో: నూనె కొనుగోళ్ల సమయంలో ప్యాకెట్ ఆకారం చూసి వినియోగదారులు మోసపోవద్దని జెమిని ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. నూనె ప్యాకెట్ల కొనుగోళ్లలో అవగాహన లోపంతో ఎలా మోసపోతున్నారనే అంశంపై బంజారాహిల్స్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా కంపెనీలు లీటరు ప్యాకెట్ ఆకారంలో తక్కువ నూనె విక్రయిస్తున్నాయని తెలిపారు. ఆయా కంపెనీలు నిబంధనల ప్రకారం వారి ఉత్పత్తులపై నూనె పరిమాణం వివరాలు ముద్రిస్తున్నాయని, వినియోగదారులు వాటిని పరిశీలించకుండా లీటరు అనే అపోహలో కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. వినియోగదారుల అవగాహన కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఫ్రీడం ఆయిల్తోపాటు పలు కంపెనీలు ఒక లీటరు, 910 గ్రాముల నూనె ప్యాకెట్లను విక్రయిస్తున్నాయని, మరికొన్ని కంపెనీలు 800 మి.లీ. నూనె ప్యాకెట్లను లీటరు అన్న భ్రమ కలిగించే ఆకారంలో మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయని తెలిపారు. కొన్ని కంపెనీల ప్యాకెట్లను వేయింగ్ మిషన్పై ఉంచి లైవ్ డెమో చూపించారు. -
22 నుంచి రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’
కంటోన్మెంట్: ‘భారతీయ కళా మహోత్సవం’ సెకండ్ ఎడిషన్కు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వేదిక కానుంది. ఈ నెల 21న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. 22 నుంచి 30వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి నిలయం, కేంద్ర సంస్కృతి, టెక్స్టైల్స్, టూరిజం మంత్రిత్వ శాఖల ప్రతినిధులు వివరాలు వెల్లడించారు. సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్, మూడు మంత్రిత్వ శాఖలతో కలిసి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ మహోత్సవ్లో పశ్చిమ రాష్ట్రాలైన మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, గోవాలతో పాటు డామన్ అండ్ డయ్యూ, దాద్రానగర్ హవేలీకి చెందిన ప్రదర్శనలు ఉంటాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కళాకారులు పాల్గొననున్నారు. సందర్శకులకు ప్రవేశం ఉచితం. అధికారిక టికెట్ బుకింగ్ పోర్టల్ ద్వారా లేదా ఈవెంట్ పోస్టర్లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రపతి నిలయం ఆవరణలోనూ నేరుగా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ప్రతి రోజు 20 వేల నుంచి 25 వేల మంది సందర్శకులు వచ్చే అవకాశమున్నందున ఆ మేరకు పార్కింగ్ ఇతరత్రా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్రపతి నిలయం మేనేజర్ రజనీ ప్రియ, వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు స్వాతి, కుమారీ సందేశ్, ఆస్తా కర్నేకర్ తదితరులు పాల్గొన్నారు. తొమ్మిది రోజుల పాటు సాగనున్న కార్యక్రమాలు 21న ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము -
ఆ భూముల్లో జోక్యం చేసుకోవద్దు
గుట్టలబేగంపేట స్థలాలపై హైడ్రాకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని సర్వే నంబర్ 16లో 10.20 ఎకరాల భూమిలో జోక్యం చేసుకోవద్దని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. తదుపరి విచారణ డిసెంబర్ 23కు వాయిదా వేసింది. తమ పట్టా భూమి సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ హైడ్రా ఫెన్సింగ్ వేయాలని ప్రయత్నిస్తోందని హైదరాబాద్ జూబ్లిహిల్స్కు చెందిన వై.అంతిరెడ్డితోపాటు మరో 8 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది మదన్మోహన్రావు వాదనలు వినిపిస్తూ.. సున్నం చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో భూమి ఉందంటూ ఫెన్సింగ్ వేయడానికి హైడ్రా జేసీబీలను తీసుకొచ్చిందన్నారు. కోర్టు ఆదేశాలున్నాయంటూ భూమిని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారన్నారు. దీంతో పిటిషన్లు హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్ఖాన్ వాదనలు వినిపిస్తూ.. అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని చెప్పేందుకు సమయం కావాలని అడిగారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. 2010, మే 7 నాటి ఆమోదపత్రం మేరకు పిటిషనర్లకు ఆ భూమిపై హక్కు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. తాము తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు 10.20 ఎకరాల్లో జోక్యం చేసుకోవద్దని హైడ్రాతో పాటు మున్సిపల్ అధికారులను ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేశారు. -
బకాయిలపై వడ్డీలే 7,383 కోట్లు
సాక్షి, సిటీబ్యూరో జీహెచ్ఎంసీ ఈ ఆర్థిక సంవత్సర ఆస్తిపన్ను డిమాండ్ రూ.2,109 కోట్లు. పాత బకాయిలు మాత్రం రూ.4,008 కోట్లు. ఈ బకాయిలపై పెనాల్టీలు మరో రూ.7,409 కోట్లు. అంటే అసలు కంటే వడ్డీలే ఎక్కువ. ఇందుకు కారణం ఏమిటంటే.. సకాలంలో ఆస్తిపన్ను చెల్లించకపోవడం. వడ్డీలపై వడ్డీలు పడటం. దాంతో అసలు కంటే వడ్డీ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. అవన్నీ చెల్లింపులు కావు. ఈ పరిస్థితిని నివారించేందుకు గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన మొత్తం ఆస్తిపన్నును ఒకేసారి చెల్లిస్తే బకాయిలపై వడ్డీలను కేవలం పది శాతం చెల్లించే సదుపాయాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అంటే బకాయిల వడ్డీపై 90 శాతం రాయితీ. ఎవరికై నా ఇది ఎంతో గొప్ప ఊరట. తద్వారా తాజా సంవత్సర ఆస్తిపన్ను కూడా ఎక్కువ మంది చెల్లించేందుకు, ఎక్కువ మొత్తం వసూలయ్యేందుకు అవకాశం ఉంటుంది. ● ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో మాదిరిగానే ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఒన్టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీఎస్) కింద బకాయిల వడ్డీలపై 90 శాతం రాయితీకి అవకాశం ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రభుత్వాన్ని కోరారు. ● ఈమేరకు లేఖ రాశారు. జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు స్టాండింగ్ కమిటీ ఆమోదం ఉండాలి కనుక నేడు (గురువారం) స్టాండింగ్ కమిటీ ముందుంచనున్నారు. ఈ ఓటీఎస్ సదుపాయం ఉండటం ద్వారా గత మూడేళ్లలో వెరసీ.. జీహెచ్ఎంసీకి దాదాపు రూ.956 కోట్ల ఆదాయం లభించింది. ఈ సంవత్సరం ఆస్తిపన్ను డిమాండ్ ఆస్తులు: 20,09,485 డిమాండ్: రూ. 2,109 కోట్లు ఇప్పటి వరకు వసూలైంది: రూ.1421 కోట్లు పాత బకాయిలు చెల్లించాల్సిన వారు: 5,46,304 పేరుకుపోయిన బకాయిలు: రూ.3,930 కోట్లు బకాయిలపై వడ్డీలు : రూ.7,383 కోట్లు ● బకాయిలపై వడ్డీ మాఫీ వర్తించాలంటే ఈ ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం ఆస్తిపన్ను చెల్లించాలి. ఈ ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తిపన్ను, వడ్డీలపై పదిశాతం చెల్లింపులు జరుగుతాయి. మొత్తానికి జీహెచ్ఎంసీ ఖజానాకు ఆదాయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. రూ.ఓటీఎస్తో 90 శాతం రాయితీ కావాలి ప్రభుత్వానికి లేఖ రాసిన కమిషనర్ కర్ణన్ తద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లు పెరుగుతాయని అంచనా ఆర్థిక సంవత్సరం ఓటీఎస్ను ఓటీఎస్ ద్వారా వినియోగించుకున్నవారు వసూళ్లు (రూ.కోట్లలో)2022-23 59838 170.00 2023-24 108091 320.00 2024-25 130800 466.40 -
లిఫ్ట్లో ఇరుక్కుని ఐదేళ్ల బాలుడి మృతి
వెంగళరావునగర్: అప్పటిదాకా తన వెంటే ఉన్న కుమారుడు క్షణాల్లోనే విగతజీవిగా మారడంతో ఆ కన్నతల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. లిఫ్ట్లో ఇరుక్కుని ఐదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మధురానగర్ పరిధిలో విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. బల్లి నర్సినాయుడు, ఐశ్వర్య దంపతులు ఎల్లారెడ్డిగూడలోని కీర్తి అపార్ట్మెంట్స్ జి–బ్లాక్లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు చైత్విక్, హర్షవర్ధన్ ఉన్నారు. మధురానగర్ కాలనీలోని శ్రీనిధి స్కూల్లో చైత్విక్ ఒకటో తరగతి, హర్షవర్ధన్ (5) యూకేజీ చదువుతున్నారు. బుధవారం సాయంత్రం తల్లి ఐశ్వర్య కుమారులను స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చింది. కొద్ది సేపటి తర్వాత తల్లి, ఇద్దరు కుమారులు లిఫ్ట్లో పైఅంతస్తుకు వెళ్లారు. ఐశ్వర్య, పెద్ద కుమారుడు చైత్విక్ లిఫ్ట్ దిగి జి–బ్లాక్లోని ఇంట్లోకి వెళ్లారు. హర్షవర్ధన్ మాత్రం లిఫ్ట్ దిగలేదు. ఈ క్రమంలో లిఫ్ట్ ముందుభాగంలో ఏర్పాటు చేసి స్ప్రింగ్ డోర్ మూసుకుపోయింది. అంతలోనే లిఫ్ట్ ఒక్కసారిగా కదిలి కిందికి వెళ్లింది. స్ప్రింగ్ డోర్, ఇనుపగేట్లు మధ్య బాలుడు ఉన్నాడు. అలాగే నాలుగు, ఐదు అంతస్తుల మధ్యకు లిఫ్ట్ వచ్చింది. దీంతో హర్షవర్ధన్ లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు. లిఫ్ట్లో ఇరుక్కుపోవడంతో తొలుత పెద్దగా కేకలు వేశాడు. అనంతరం ఊపిరి ఆడక అచేతనంగా పడిపోయాడు. తల్లి ఐశ్వర్య బయటికి వచ్చి చూడగా హర్షవర్ధన్ రెండు అంతస్తుల మధ్య ఇరుక్కుని ఉన్నాడు. ఆమె కేకలు వేయడంతో సెక్యూరిటీ గార్డు, చుట్టుపక్కల వారు వచ్చి బాలుణ్ని అతికష్టమ్మీద బయటకు తీశారు. 108లో ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు బాలుడు హర్షవర్ధన్ మృతి చెందినట్టు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కొందా‘మంటే’..
భగ్గుమంటున్న కూరగాయల ధరలుసాక్షి, సిటీబ్యూరో: ‘కొనబోతే కొరివి’ అంటే ఇదేనేమో! కూరగాయల ధరలు భగ్గున మండిపోతున్నాయి. గతంలో లేని విధంగా నవంబర్ నెలలో ధరలు భారీ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా బీన్స్ రిటైల్ మార్కెట్లో కిలో రూ.150–160 పలుతోంది. దీంతో పాటు చిక్కుడు, బీరకాయ ధరలు కూడా సెంచరీ దాటాయి. పైగా మార్కెట్కు డిమాండ్కు తగ్గట్టుగా కూరగాయలు సరఫరా కాకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నారు. నవంబర్ మొదటి వారం వరకు వర్షాలు కురవడంతో కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రభావం దిగుబడిపై పడి నగరానికి దిగుమతులు భారీగా తగ్గి ఈ పరిస్థితి ఏర్పడింది. పంటలపై వర్షాల ప్రభావం.. సాధారణంగా నవంబర్లో నగర మార్కెట్లకు సుమారు 3 వేల నుంచి 3.5 వేల టన్నుల కూరగాయలు దిగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం 2.3– 2.5 వేల టన్నులు మాత్రమే దిగుమతి అవుతు న్నట్లు మార్కెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో తెలంగాణ జిల్లాల్లో ఉత్పత్తులు తగ్గితే ప క్క రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతులు పెరిగేవి. ప్రస్తుతం పక్క రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో నగరానికి దిగుమతులు బాగా పడిపోయాయి. వర్షాలతో కూరగాయల సాగుకు తీవ్ర నష్టం జరగడంతోనే మార్కెట్ కూరగాయల దిగుమతులు తగ్గినట్టు మార్కెట్ అధికారులు చెబుతున్నారు. బీన్స్ బిరబిరా.. ట‘మోత’ ప్రత్యేకంగా బీన్స్ దిగుమతులు తగ్గడంతో హోల్సేల్ మార్కెట్లో కేజీ రూ.130–135 వరకు పలికింది. లోకల్ బీన్స్ రాక చిక్బల్లాపూర్తో పాటు కర్ణాటక నుంచి బీన్స్ దిగుమతి కావడంతో దీని ధరలు పెరిగాయని మార్కెట్ అధికారులు చెప్పారు. టమాటా ఈ సీజన్లో గత నెల వరకు కిలో రూ.20 లోపే ఉంది. కానీ ఇటీవల బహిరంగ మార్కెట్లో రూ.40–60కు చేరింది. ప్రతిరోజూ నగర మార్కెట్లకు దాదాపు 100కు పైగా లారీల టమాటా దిగుమతి అయ్యేది. ప్రస్తుతం 50–60 లారీల టమాటా వస్తోందని వారు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు ఇలా.. కిలో రూ.లలో టమాటా 40-60 బెండకాయ 100-120బీన్స్ 120-150బీరకాయ 120చిక్కుడు 120వంకాయ 60-80దొండ 80-100క్యాబేజీ 80పచ్చిమిర్చి 80కాకర 80 బీన్స్ రూ.150.. చిక్కుడు రూ.120 టమాటా రూ.60.. పచ్చిమిర్చి రూ.80 కూరగాయల సాగుపై వర్షాల ప్రభావం నిత్యం 3.5 వేల టన్నులు అవసరం 2.5 వేల టన్నులు మాత్రమే దిగుమతి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వ్యాపారులు -
గాంధీలో ఇంటి దొంగలు!?
మందుల సరఫరా ఏజెన్సీలతో కుమ్మక్కుసాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వాస్పత్రుల్లో ఇంటి దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అందినకాడికి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అక్రమార్జనకు వక్రమార్గాలు వెతుకుతున్నారు. మందుల కొనుగోళ్లలో ప్రైవేటు ఏజన్సీలతో కుమ్మక్కవుతున్నారు. అవసరాలకు మించి మందులు ఆర్డర్ పెట్టడం, నకిలీ బిల్లులతో సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే తరహా వ్యవహారం నగరంలోని గాంధీ ఆస్పత్రిలో హాట్ టాపిక్గా మారుతోంది. ఎవరు చేశారు? ఎలా చేశారంటూ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవల విషయం అధికారులకు తెలిసినా.. సంకట స్థితిలో పడిపోయారు. పెద్దమొత్తంలో మాత్రలు ఆర్డర్ చేసినట్లు.. ఆస్పత్రి అవసరాలకు సరిపడా మందుల సరఫరా కోసం ఏజన్సీలను ఎంపిక చేస్తారు. అత్యవసర మందులు, ఏ రకం మాత్రలు, సిరప్లు, ఇతరాలు ఎన్ని అవసరమో.. వాటిని సరఫరా చేయాలని ఆస్పత్రి నుంచి ఇండెంట్ పెడతారు. దీనికి అనుగుణంగా ఏజెన్సీ నుంచి సరఫరా జరుగుతోంది. ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఆస్పత్రి సిబ్బందికి, సరఫరా ఏజన్సీదారులకు సత్సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో ఏం చేసినా ఎవరికి తెలియదనుకున్నారో ఏమో.. పెద్ద మొత్తంలో మందులు ఆర్డర్ చేసినట్లు చూపించారు. ఉదాహరణకు ఆస్పత్రి అవసరాలకు వెయ్యి మాత్రలు సరిపోతాయంటే 20 వేలు ఇండెంట్ పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ఏజెన్సీలు సుమారు రూ.80 లక్షలకుపైగా బకాయిలు చూపిస్తున్నారని తెలుస్తోంది. అత్యవసర మందులకు తంటాలు ఇదిలా ఉంటే.. కొనుగోలు చేసిన మందుల స్టాక్లోనూ తేడాలున్నట్లు తెలుస్తోంది. ఒక్కో వ్యక్తికి 5 నుంచి 10 మాత్రలు ఇస్తే సరిపోయేదానికి 50 నుంచి 60 మాత్రలు ఇచ్చినట్లు నివేదికల్లో చూపిస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. ఏజెన్సీలతో కుమ్మకై ్క నకిలీ బిల్లులతో సొమ్ము పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన మందుల కొనుగోళ్లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజన్సీలకు అధిక మొత్తంలో బకాయిలు ఉన్నాయంటూ కొత్త ఇండెంట్లను సరఫరా చేయడానికి ససేమిరా అంటున్నారు. పాత బకాయిలు చెల్లిస్తే, కొత్త ఇండెంట్లను సరఫరా చేస్తామని తెగేసి చెబుతున్నారని తెలుస్తోంది. దీంతో అత్యవసర మందుల కొనుగోళ్లు అధికారులకు తలనొప్పి వ్యవహారంగా మారుతోంది. ఆస్పత్రి అవసరాలకు మించి ఇండెంట్ నకిలీ బిల్లులతో రూ.లక్షల్లో స్వాహా రోగులకు భారీ సంఖ్యలో మాత్రలు ఇచ్చినట్లు లెక్కలు -
సీలింగ్ భూములు స్వాహా!
సాక్షి, రంగారెడ్డిజిల్లా /శంషాబాద్ రూరల్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఉన్న ఘాంసిమియాగూడ సర్వే నంబర్ 3, 4లో 400 ఎకరాల సీలింగ్ భూమి ఉంది. ప్రభుత్వం అప్పట్లో కొంత మంది నిరుపేద రైతులకు కొంత అసైన్డ్ చేసింది. ఆయా భూములు సీలింగ్ పట్టాలుగా రికార్డు అయ్యాయి. నిబంధనల ప్రకారం వీటిని అమ్మడం, కొనడం నేరం. రిజిస్ట్రేషన్ చేయొద్దని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ 2025 ఫిబ్రవరి 18న జిల్లా రిజిస్ట్రార్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రే షన్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో 15 ఎకరాల స్థలంలో ఓ కీలక నేత నిర్మాణాలు చేపట్టడాన్ని పరిశీలిస్తే.. అధికార యంత్రాంగం ఎలా దాసోహం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. సుమారు 20 ఎకరాలకు సంబంధించి గత ప్రభుత్వంలోని సీఎంకు లెఫ్ట్..రైట్ అనుకున్న ఓ పెద్దమనిషి ఆ భూములను రైతుల నుంచి కొనుగోలు చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. దీనిపై అప్పట్లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో రేవంత్రెడ్డే స్వయంగా నాగలికట్టి నిరసన తెలిపారు. సదరు భూములు పేదలకు చెందాల్సినవని, క్రయవిక్రయాలకు వీలు లేదు, కొనుగోలు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదే సర్వే నంబర్లో గోల్డ్స్టోన్ కంపెనీ భారీగా భూములు కొనుగోలు చేసింది. దీనిపై నాటి ప్రభుత్వం కోర్టులో కేసు కూడా వే సింది. గోల్డ్స్టోన్ ప్రసాద్ను మాత్రమే కాదు ఎన్నో ఏళ్లుగా ఈ భూములను సాగు చేసుకుంటున్న రైతులను కూడా భూముల్లోకి రాకుండా అడ్డుకుంది. అదే సర్వే నంబర్లోని కొంత భూమిని స్థానికంగా ఉన్న ఓ ప్రజాప్ర తినిధి తక్కువ ధరకు కొనుగోలు చేసి, అందులో భారీ నిర్మాణాలు చేపడుతుండటం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ భూమి నుంచి గోదాం వరకు ఏకంగా మట్టి రోడ్డు వేసుకున్నా పట్టించుకున్న నాథుడు లేడు. వారసుల పేరుతో పాగా వివాదాస్పద ఈ భూములు పైగా వారసులకు చెందినవంటూ కొంతమంది కోర్టు నుంచి తమకు అనుకూలంగా ఆర్డర్లు తెచ్చుకుని పాగా వేశారు. ఏళ్ల నుంచి భూములను సాగు చేసుకుంటున్న రైతులను బెదిరించి, ఎంతో కొంత వారికి ముట్టజెప్పి వారిని బలవంతంగా కబ్జా నుంచి పంపించి వేశారు. ఇదే సమయంలో ఈ భూముల్లో కొంత సీలింగ్ పట్టాలు కలిగిన రైతులు ఉన్నారు. మరికొంత మంది పట్టాదారులు ఉన్నారు. పైగా భూములపై తమకు హక్కులు ఉన్నాయంటూ గోల్డ్ స్టోన్ కంపెనీ అప్పట్లోనే ఇక్కడ కొంత భాగం తమ ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి వరకు సాగు చేసుకుంటున్న రైతులకు ఎకరాకు రూ.5 లక్షలు చెల్లించి.. వారి వద్ద ఉన్న అన్ని రికార్డులు స్వాధీనం చేసుకుంది. ఇదే కంపెనీ నుంచి స్థానికంగా ఉన్న ఓ ప్రజాప్రతినిధి 15 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అప్పటి వరకు నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఆ తర్వాత పట్టా భూములుగా మారిపోయాయి. ఇదిలా ఉండగా ఈ భూములను రెవెన్యూ అధికారులు ఇటీవల రీసర్వే చేశారు. రైతుల వద్ద ఉన్న రికార్డులు, సాగు విస్తీర్ణం మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. ఘాన్సీమియాగూడలోని వివాదాస్పద భూముల విషయంలో కోర్టు నుంచి పలు ఉత్తర్వులు ఉన్నాయి. 2011లోనే సీలింగ్ ఎత్తివేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. తర్వాత 2023లోనూ ప్రభుత్వం మెమో జారీ చేసింది. అప్పటి వరకు ఉన్న సీలింగ్ను తొలగించి, దాని స్థానంలో పట్టా భూమిగా నమోదు చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు సీలింగ్ భూములను పట్టా భూములుగా మార్చాల్సి వచ్చింది. గోదాములు, ఇతర నిర్మాణాలు ఉన్న ప్రదేశానికి 111 జీఓలో మినహాయింపు కల్పించింది. – రవీందర్ దత్తు, తహసీల్దార్, శంషాబాద్ పట్టా భూములుగా.. నిషేధిత జాబితాలోని భూములు 111 జీఓ నిబంధనలకు తూట్లు.. భారీ షెడ్లతో నిర్మాణాలు పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం -
టీజీటీఏ హైదరాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
సాక్షి సిటీ బ్యూరో : తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) హైదరాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక ప్రకటించారు. బుధవారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా ప్రేమ్కుమార్, అసోసియేట్ అధ్యక్షులుగా భిక్షపతి, జి.వెంకట్రామ్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా జ్యోతి, ప్రధాన కార్యదర్శిగా బాలశంకర్, కార్యదర్శిగా సంధ్యారాణి, సంయుక్త కార్యదర్శులుగా పాండు, అసదుల్హా, కృష్ణ కార్తీక, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎన్.సునీత, హేమలత, మమత, కల్చరల్ సెక్రటరీగా నిహరిక, స్పోర్ట్స్ సెక్రటరీగా అన్వర్, కోశాధికారిగా నయ్యూముద్దీన్, కార్యవర్గ సభ్యులుగా ప్రేమలత, రత్నం, అహల్య, పుష్పలత ఎన్నికయ్యారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, టీజీటీఏ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాళ్లు విజయలక్ష్మి, శ్రీదేవి, అసోసియేట్ అధ్యక్షుడు నరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
సర్కార్ నజర్
యాచారం: ప్రభుత్వ, అసైన్డ్ భూములపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఫ్యూచర్సిటీ ఏర్పాటు చేస్తున్న ఆయా మండలాల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయో గుర్తించే పనిలో నిమగ్నమైంది. తాజాగా సర్కార్ అదేశాల మేరకు ఆయా తహసీల్దార్లు తమ మండలాల పరిధిలోని ఏఏ గ్రామాల్లో ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, సీలింగ్ భూములున్నాయో రికార్డులను పరిశీలిస్తున్నారు. వివరాల సేకరణలో అధికారులు ఫ్యూచర్సిటీ ఏర్పాటు చేస్తున్న సమీపంలోని మండలాల్లో భూ బ్యాంకును సిద్ధం చేసే పనిలో అధికారులు తలమునకలయ్యారు. యాచారం, కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మంచాల, కడ్తాల్, మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి తదితర మండలాల్లో భూ బ్యాంకును సిద్ధం చేస్తున్నారు. ఆయా మండలాల్లో 250 ఎకరాలున్న గ్రామాలు, సర్వే నంబర్లను గుర్తిస్తున్నారు. ఎంత మంది అసైన్డ్ రైతులున్నారు.. కబ్జాలో ఉన్న వారెందరు.. ఆ భూములు చదునుగా ఉన్నాయా.. గుట్టలు, రాళ్లు, రప్పలతో ఉన్నాయా అనే విషయాలపై గూగుల్ మ్యాప్లతో నివేదిక సిద్ధం చేస్తున్నారు. చెరువులు, కుంటలున్నాయా.. సాగుకు యోగ్యమైనది ఎంత అనే విషయాలపై భూములను పరిశీలిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో.. ప్రభుత్వం ఫోర్త్సిటీని నిర్మించే విషయంలో ప్రపంచ స్థాయిలో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు కందుకూరు మండల పరిధిలోని మీరాఖాన్పేటలో వచ్చే నెల 8,9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్తలు తమ సంస్థల ఏర్పాటుకు అడిగిన వెంటనే కావాల్సిన భూమిని అప్పగించేందుకు అధికార యంత్రాంగం భూ బ్యాంకును సిద్ధం చేస్తోంది. యాచారం మండల పరిధిలోని యాచారం, మొండిగౌరెల్లి, చింతుల్ల, చింతపట్ల, నల్లవెల్లి, తక్కళ్లపల్లి, మంతన్గౌరెల్లి గ్రామాల్లో వందలాది ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూములున్నట్లు గుర్తించారు. మంచాల, కడ్తాల్, ఆమనగల్లు, మాడ్గుల, ఇబ్రహీంపట్నం మండలాల్లోని పలు గ్రామాల్లో వందలాది ఎకరాలున్నట్లు లెక్కలు వేశారు. భూ బ్యాంకు సిద్ధంపై ఓ రెవెన్యూ అధికారిని శ్రీసాక్షిశ్రీ సంప్రదించగా నిజమేనని తెలియజేశారు. మరోవైపు భూ బ్యాంకు కోసం అధికార యంత్రాంగం ఉరుకులు, పరుగులు పెడుతుండడంతో ఆయా గ్రామాల్లోని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జీవనోపాధి పొందే భూములను సేకరిస్తే బతికేది ఎలా అని ఆందోళన చెందుతున్నారు. యాచారం మండలం నల్లవెల్లి గ్రామంలో గుర్తించిన ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూములపై ప్రత్యేక దృష్టి ఫ్యూచర్ సిటీ సమీపంలోని మండలాలపై ఫోకస్ అడిగిన వెంటనే వివరాలు తెలియజేసేలా.. భూ బ్యాంకును సిద్ధం చేసే పనిలో యంత్రాంగం -
ఓటములే పాఠాంగా..
● మూడో ప్రయత్నంలో నవీన్ జయకేతనం ● కలిసి వచ్చిన మజ్లిస్ మైత్రీ బంధం ● స్థానికత, అభివృద్ధి మంత్రం అదనం సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్కుమార్ యాదవ్ ఘన విజయం సాధించారు. ముచ్చటగా మూడుసార్లు పోటీ చేసిన ఆయన.. ఈసారి మాత్రం ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ఆధిక్యత ప్రదర్శించి విజయబావుటా ఎగుర వేశారు. సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను రెండో స్థానానికి పరిమితం చేశారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్రెడ్డి డిపాజిట్ గల్లంతయింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014లో జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థిగా పోటీ చేసి 41,656 ఓట్లతో రెండో స్థానంలో నిలిచిన నవీన్కుమార్ యాదవ్.. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్తో మైత్రి కారణంగా మజ్లిస్ ఎన్నికల బరిలోకి దిగలేదు. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల ముందు జూబ్లీహిల్స్ అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ ఎంపీ సీటు హామీతో నవీన్ యాదవ్ కాంగ్రెస్లో చేరినా టికెట్ దక్కలేదు. మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ను కాంగ్రెస్ బరిలో దింపింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఏడాది ఆయన అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆది నుంచీ వ్యూహాత్మకంగానే.. కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన నవీన్ యాదవ్కు మజ్లిస్ పాత మైత్రీ బంధం కలిసి వచ్చింది. అధికార కాంగ్రెస్తో సత్సంబంధాల కారణంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మజ్లిస్ దూరం పాటించింది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖరారు కాకముందే మజ్లిస్ అధినేత అసదుద్దీనన్ ఒవైసీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి రంగంలోకి దిగడం లేదు కానీ, సమర్థుడైన యువనేతను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధించడంతో మజ్లిస్ మద్దతు కాంగ్రెస్కేనని చెప్పకనే చెప్పారు. నవీన్ అభ్యర్థిత్వం ఖరారు అనంతరం ఏకంగా మజ్లిస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచార రంగంలో దిగారు. తమకు పట్టున్న డివిజన్లలో విస్తృతంగా పర్యటించి సంప్రదాయ మజ్లిస్ ఓట్లను కాంగ్రెస్కు క్రాస్ చేసేలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మరోవైపు స్థానికత, సామాజిక కార్యక్రమాలు, బీసీ కార్డు, అభివృద్ధి మంత్రం, వామ పక్షాల, బీసీ సంఘాల మద్దతు కూడా నవీన్ను విజయతీరాలకు చేర్చిందనే చెప్పవచ్చు. డివిజన్కో మంత్రి, నలుగు రు ఎమ్మెల్యేలు, మిగతా ప్రజాప్రతినిధులను రంగంలోకి దించడం.. ఆఖరులో సీఎం రోడ్ షో, కార్నర్ మీటింగ్లతో హోరెత్తించడం.. దీనికితోడు అంగ, అర్థబలం కూడా కలిసిరావడంతో నవీన్ అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమమైంది. అజహరుద్దీన్న తప్పించి.. మంత్రి పదవి ఇచ్చి.. నవీన్కు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్.. ఏకంగా అజహరుద్దీన్ను ఉప ఎన్నికల బరి నుంచి తప్పించింది. బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం, స్థానికుడైన నవీన్కు అవకాశం కల్సి వచ్చినట్లయింది. వాస్తవంగా కాంగ్రెస్ అధికార పార్టీ కావడంతో ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు, హేమాహేమీలు టికెట్ కోసం పోటీ పడ్డారు. సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అజహరుద్దీన్ తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చడంతో.. ఆయనను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసి ఎన్నికల బరి నుంచి తప్పించింది. దీంతో నవీన్ యాదవ్కు లైన్క్లియరైంది. ఆ తర్వాత అజహర్కు మంత్రి పదవి కూడా లభించడంతో మైనారిటీ ఓటింగ్తో కాంగ్రెస్కు మరింత కలిసి వచ్చి భారీ విజయం దక్కింది. -
కాలుష్యం ఆగాలి
● నగరంలో క్షీణిస్తున్న వాయు నాణ్యత ● ప్రమాదకర స్థాయిలో సూచీలు ● 250కి చేరువలో పీఎం– 2.5 ● పట్టించుకోని పీసీబీ అధికారులు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వాయు కాలుష్యం గరిష్ట సూచీలను తాకుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గాలిలో ధూళి కణాల సాంద్రత భారీగా వృద్ధి చెందుతోంది. ఒకవైపు తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, మరో వైపు గాలి కాలుష్యం నగర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పీఎం 2.5 (పర్టిక్యులేట్ మ్యాటర్) 242ను సూచిస్తోంది. పీఎం– 10 గణాంకాలు 150 దగ్గరల్లో కదలాడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే శ్వాసకోశ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శీతాకాలం మంచు, చల్లని గాలిలో ధూళి కణాలు 4 నుంచి 8 అడుగుల ఎత్తులో అధిక మోతాదులో ఉంటాయి. దీంతో మనిషి శ్వాసనాళంలోకి సులువుగా చేరుతుంది. ఫలితంగా శ్వాసకోశ రోగాలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందంని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారీ వ్యత్యాసం.. నగరంలో మొత్తం 14 ప్రాంతాల్లో గాలి నాణ్యతను కొలిచే యంత్రాలను కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసింది. అందులో 8 ప్రాంతాల్లో గాలి కాలుష్య తీవ్రతకు అద్దం పట్టే గణాంకాలు నమోదవుతున్నాయి. వాయు నాణ్యత సూచీ 50 కంటే తక్కువగా ఉంటే స్వచ్ఛమైన గాలి అందుతుందని లెక్క, ఏక్యూఐ 100 వరకు మోడరేట్. అదే గాలి నాణ్యత సూచీ 100 దాటితే మాత్రం ప్రమాదం పొంచిఉన్నట్లే అని పీసీబీ చెబుతోంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఒకవైపు నుంచి మంచు, చలిగాలులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇదే సమయంలో కాలుష్యం పెరుగుతుండటం ప్రజల ఆరోగ్యంపై ఆందోళన మొదలవుతోంది. ఇదిలా ఉండగా.. పీసీబీ నివేదికలకు కొన్ని ప్రైవేటు సంస్థల వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) నివేదికలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అనేక రకాలుగా.. నగరంలో వాయు కాలుష్యం నిత్యం పెరుగుతూ వస్తోంది. పరిశ్రమల నుంచి వెలువడే గాఢ వాయువులతో పాటు, రహదారులపై దుమ్మూ ధూళి కణాలు, వాహనాల నుంచి వెలువడే పొగ గాలిలో నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. మరోవైపు నిర్మాణ రంగం జోరుగా ఉన్న ప్రాంతాల్లో ధూళి కణాల సంఖ్య మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఆయా ప్రాంతాల్లో గాలి నాణ్యతను కొలిచే పరికరాలు లేక దాని తీవ్రత ప్రజలకు అర్థం కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. గాలి కాలుష్యాన్ని నియంత్రించడంలో పీసీబీ అధికారులు దృష్టి సారించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాంతం పీఎం– 2.5 పీఎం– 10 మలక్పేట్ 242 122 కంది 223 – పటాన్చెరు 189 158 పాశమైలారం 184 137 జూపార్కు 185 154 సోమాజిగూడ 183 – సనత్నగర్ 183 – కోకాపేట్ – 116 కోల్డ్ వేవ్తో ఆస్తమా, సీఓపీడీ, దీర్ఘకాలికంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ఇటువంటి సమయంలో గాలి కాలుష్యం అంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చల్లని గాలిలో ధూళి కణాల కదలికల్లో చురుకుదనం ఉండదు. సగటు మనిషి ఎత్తులోనే ధూళి కణాలు ఉండటంతో సులువుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. న్యుమోనియా, ఆస్తమా బాధితులు, చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాలి. – డా.ఎం.రాజీవ్, పల్మనాలజిస్ట్ -
హామీలన్నీ నెరవేరుస్తాం: మంత్రి పొన్నం
వెంగళరావునగర్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం పట్ల యూసుఫ్గూడలో పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా యూసుఫ్గూడ, వెంకటగిరి, హైలాంకాలనీ తదితర ప్రాంతాల్లోని ప్రజల ఆదరణ మరువలేనిదని అన్నారు. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలైన డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, మంచినీరు సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించడం జరుగుతుందని హామీనిచ్చారు. ఎమ్మెల్యే నవీవన్ యాదవ్ ఈ ప్రాంతంలో త్వరలోనే పర్యటించి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. ఈ విజయం నియోజకవర్గ ప్రజలందరిదని, అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జి.మురళీ గౌడ్, సంజయ్ గౌడ్, పార్టీ సీనియర్ నేతలు ఫిరోజ్ఖాన్, లక్ష్మీరెడ్డి, రుబీనా, పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
విద్యార్థులు సోషల్ మీడియాకు ఆకర్షితులు కావొద్దు
గచ్చిబౌలి: సోషల్ మీడియాలో వచ్చే అంశాలకు విద్యార్థులు ఆకర్షితులు కావొద్దని, వాటి ప్రతికూల ప్రభావాలు పడకుండా జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రెసోనెన్స్ రెసోఫెస్ట్–2025 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్నెట్ యుగంలో జీవితం టెక్నాలజీపై ఆధారపడి ఉందన్నారు. ఇష్టం ఉన్న వృత్తిని ఎంచుకొని కలలను సాకారం చేసుకోవాలన్నారు. నగరం, గ్రామాల మధ్య అంతరం పెరుగుతుందని, యువత గ్రామీణ, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకులు లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యా ప్రయాణంలో ఇంటర్ ఫైనల్స్తో పాటు ఎంసెట్, జేఈఈ అత్యంత కీలకమన్నారు. పోటీ పరీక్షలలో ఆశించిన ర్యాంక్ రాకపోయినా నిరుత్సాహ పడవద్దని, ఎన్నో అవకాశాలున్నాయని తెలిపారు. శాంతా బయోటిక్స్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ భారత దేశం తత్వశాస్త్రం, విజ్ఞానం, వైద్య, ఆర్థిక రంగాల్లో ప్రపంచంలోనే ముందంజలో ఉందన్నారు. రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ఎండీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, ఆత్మవిశ్వాసం, బాధ్యతతో జీవించే గుణాలను పెంపొందించే సమగ్ర విద్యను తాము అందిస్తున్నామని తెలిపారు. అంతకు ముందు రెసోనెన్స్ కొత్త క్యాంపస్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ రితిరాజ్, సినీ దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ -
వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యం
గన్ఫౌండ్రీ: వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణానికి సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘దివంగత ప్రధాని నెహ్రూ 80వ సైంటిఫిక్ టెంపర్మెంట్ సెలబ్రేషన్స్’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సాంకేతిక అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా పనిచేస్తున్నామన్నారు. వైజ్ఞానికంగా ముందుచూపుతో సమాజాన్ని ముందుకు నడిపించిన పండిట్ నెహ్రూ ఈ దేశానికి తొలి ప్రధానిగా పని చేయడం మన అదృష్టమన్నారు. నెహ్రూ ప్రంచవర్ష ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంతో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. సోషలిజం, ప్రజాస్వామం అంశాలను రాజ్యాంగంలో మేళవించి దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లారని తెలిపారు. ఇంత పెద్ద దేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఎవరు మెజారిటీ సాధిస్తే వారికి ఓ మంచి వాతావరణంలో అధికార బదలాయింపు జరుగుతుంది. అందుకు కారణం నెహ్రూ దార్శనికతతో కూడిన విధానాలే అని భట్టి పేర్కొన్నారు. హోమి బాబా, విక్రమ్ సారాభాయ్ వంటి ప్రముఖులను ఆహ్వానించి ఐఐటీలను స్థాపించి ముందుకు తీసుకువెళ్లారని వివరించారు. సైన్స్, టెక్నాలజీ, డిఫెన్స్ రంగాల్లో హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకొని నెహ్రూ, ఇందిరాగాంధీలు అనేక కేంద్ర సంస్థలను స్థాపించారని, వారి నిర్ణయం ఫలితంగా హైదరాబాద్లో ప్రధాన పరిశ్రమలకు అనుబంధంగా అనేక పరిశ్రమలు వచ్చాయని వెల్లడించారు. యూజీసీ, సెంట్రల్ యూనివర్సిటీ వంటి వాటిని నెలకొల్పారని, అక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం దేశ అవసరాలు తీరుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆపద వస్తే దీపాలు వెలిగించండి, చప్పుళ్లు చేయండి అనడం చూస్తుంటే ఈ దేశం ఎటు వెళ్లిపోతుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్శిటీ పనులను వేగవంతంగా చేపడుతున్నామని, ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక కేంద్రాలుగా మారుస్తున్నట్లు వివరించారు. ఉన్నత పాఠశాలలు, కళాశాలలో విజ్ఞాన ప్రదర్శనలు ప్రారంభించి ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సౌకర్యాలు అందిస్తామని తెలిపారు. అనంతరం విజ్ఞాన ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ జి.రాధారాణి, తెలంగాణ గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ ప్రొఫెసర్ రియాజ్, ట్రైకార్ ఛైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్, విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క -
నమ్మి ఇంటికి రానిస్తే హతమార్చాడు..
● గృహిణి హత్య కేసును చేధించిన పోలీసులు ● నిందితుడు దగ్గరి బంధువే ● అప్పులు తీర్చే మార్గం లేక.. నగల కోసం దారుణం జీడిమెట్ల: జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో ఈ నెల 12న జరిగిన గృహిణి హత్యకేసును పోలీసులు చేధించారు. నిందితుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు శుక్రవారం షాపూర్నగర్లోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సురేష్కుమార్ తెల్పిన మేరకు..ఖమ్మం జిల్లా ఏరుపాలెం మండలం రాజులదేవరపాడు గ్రామానికి చెందిన నిహారిక (21)కు సంవత్సరం క్రితం దేవేందర్రెడ్డితో వివాహం జరిగింది. వీరు జగద్గిరిగుట్టలోని వెంకటేశ్వరనగర్లో ఉంటున్నారు. కాగా వీరి గ్రామానికే చెందిన బంధువు శివమాధవ రెడ్డి(23) ఇంజినీరింగ్ చదివాడు. అప్పుడపుడు నిహారిక ఇంటికి ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు.. శివమాధవరెడ్డి ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి రూ.7 లక్షల వరకు అప్పులు చేశాడు. తాగుడుకు బానిస అయ్యాడు. ఇటీవల ఒత్తిడి పెరగడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక బంధువైన నిహారికను హత్య చేసి ఆమె బంగారాన్ని దొంగిలించాలని పథకం పన్నాడు. ఈ నెల 12న నిహారిక భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో జగద్గిరిగుట్టలోని ఆమె ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపు మాట్లాడి సినిమా చూశాడు. అనంతరం అదును చూసి ఆమె గొంతు నులిమి ఉపిరాడకుండా చేసి హత్య చేశాడు. హత్యను పక్కదారి పట్టించేందుకు మాధవరెడ్డి నిహారిక మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు కిందపడేశాడు. నల్లా విప్పి బకెట్లో నీరు పడుతున్నట్లుగా నల్లా ఓపెన్ పెట్టాడు. బాత్రూం లోపలి నుండి గడియ పెట్టేందుకు ట్రై చేయగా సాధ్యం కాలేదు. అనంతరం నిహారికకు చెందిన నాలుగు తులాల బంగారు నగలు, రూ.2500 నగదు తీసుకుని అక్కడ నుండి ఉడాయించాడు. సాయంత్రం డ్యూటీ నుండి ఇంటికి వచ్చిన భర్త దేవేందర్రెడ్డి నిహారిక బాత్రూంలో మృతిచెంది పడి ఉండటాన్ని గమనించాడు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిహారికకు చెంది న బంగారు నగలు లేకపోవడాన్ని గమనించారు. అదేవిధంగా పోస్టుమార్టం రిపోర్టులో తలకు గాయాలై గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. కాల్డేటా, సెల్ఫోన్ లొకేషన్ వంటి సాంకేతిక ఆధారాలతో శివ మాధవరెడ్డి ఈ హత్య చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తానే నిహారికను హత్యచేసినట్లు విచారణలో శివ మాధవరెడ్డి ఒప్పుకున్నాడు. ఈ మేరకు పోలీసులు శివమాధవ రెడ్డిపె కేసు నమో దు చేసి నిందితుడి నుండి ఒక బుల్లెట్ వాహనం, స్వెటర్, బంగారం కుదవపెట్టిన రశీదు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
గ్లోబల్ సమ్మిట్ ప్రాంతాన్ని పరిశీలించిన సీపీ
కందుకూరు: ఫ్యూచర్సిటీ పరిధిలోని మీర్ఖాన్పేట రెవెన్యూలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను రాచ కొండ సీపీ సుధీర్బాబు శుక్రవారం క్షేత్రస్థాయి లో పర్యవేక్షించారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, బందోబస్తు ఎలా చేపట్టాలి అనే అంశాలపై పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పార్కింగ్ స్థలం, హెలిపాడ్ ప్రదేశం, మీటింగ్ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, డీసీపీ ఎస్బీజీ నరసింహారెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు ఉన్నారు. -
‘మీ డబ్బు–మీ హక్కు’ మంచి అవకాశం
ఇబ్రహీంపట్నం రూరల్: అన్ క్లెయిమ్ డిపాజిట్లకు ‘మీ డబ్బు, మీ హక్కు’ ద్వారా పరిష్కార మార్గం దొరికిందని, ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం మీ డబ్బు, మీ హక్కు అనే థీమ్తో అన్క్లెయిమ్ డిపాజిట్ల పరిష్కారంపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, వాటాలు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా ఆదాయాలు క్లెయిమ్ చేసుకోవాలన్నారు. హక్కుదారులు తమ బ్యాంకులను లేదా ఇతర సంస్థలను సంప్రదించి నిధులు తిరిగి పొందాలని, ప్రచారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్బీఐ డీజీఎం ప్రయబ్రత మిశ్రా మాట్లాడుతూ.. క్లెయిమ్ చేయని డిపాజిట్లు, పెట్టుబడులు వాటి చట్టబద్ధమైన యజమానులకు తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎస్ఎల్బీసీ ఏజీఎం పద్మజారాణి మాట్లాడుతూ.. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, ఆర్థిక పారదర్శతను నిర్ధారించడానికి వారి సంబంధిత కమ్యూనిటీల్లో అవగహనను వ్యాప్తి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. సరైన హక్కు దారులకు సెటిల్మెంట్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎల్డీఎం సుశీల్కుమార్, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, శ్రీలక్ష్మి, రామారావు, ఉష, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
వికసిత్ భారత్ లక్ష్యసాధనకు ఎన్ఎస్ఐ కృషి
లాలాపేట: ఐసీఎంఆర్–జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)లో న్యూట్రిషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఐ) 57వ వార్షికోత్సవ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సంవత్సరం ‘సుపోషిత్ భారత్ ఫర్ ఏ వికసిత్ భారత్’ అనే థీమ్తో ఎన్ఐఎన్ డైరెక్టర్ డా.భారతి కులకర్ణి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఎన్ఎస్ఐ ప్రసిడెంట్ డాక్టర్ శరత్ గోపాలన్ పాల్గొని ముఖ్య ప్రసంగం చేశారు. వికసిత్ భారత్–2047 లక్ష్యాలను సాధించడానికి పోషకాహారం ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఆరోగ్యకరమైన, బలమైన, మంచి పోషకాహారంతో కూడిన భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి న్యూట్రిషన్ సైంటిస్టులు చేస్తున్న కృషి అమోఘమన్నారు. సదస్సులో ఎన్ఐఎన్ మాజీ డైరెక్టర్ డా.హేమలత, ఎన్ఎస్ఐ వైస్ ప్రసిడెంట్ డా.రాజుసింగ్ చిన్నా, ఎన్ఎస్ఐ సెక్రటరీ డా.సుబ్బారావు, ఎన్ఎస్ఐ వైస్ ప్రసిడెంట్ డా.భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం సదస్సు సావనీర్ను ఆవిష్కరించారు. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ వార్షిక సదస్సులో దేశ వ్యాప్తంగా దాదాపు 1300 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. -
ఉరేసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
బన్సీలాల్పేట్: భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్థలతో మానసికంగా కుంగుబాటుకు లోనై ఇంట్లో ఉరేసుకొని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్.ఐ హరీష్ కథనం ప్రకారం..భోలక్పూర్ కృష్ణానగర్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సుర్వి విశాల్ గౌడ్ (28) ఇంట్లో ఎవరూ లేని సమయంలో రూమ్లోకి వెళ్లి లోపలి నుంచి గడియపెట్టుకుని చీరతో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. వెంటనే కుటుంబీకులు గమనించి గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. రెండేళ్ల క్రితం మల్లాపూర్కు చెందిన నవ్యతో విశాల్కు వివాహమైయింది. పెళ్లి అయిన కొద్ది రోజులకే దంపతుల మధ్య విభేదాలు రావడంతో కావ్య పుట్టింట్లోనే ఉంటుంది. ఇటీవల కావ్య భర్త విశాల్గౌడ్పై ఉప్పల్ పోలీసు స్టేషన్లో కేసు పెట్టింది. దీంతో మానసికంగా కుంగిపొయాడని, కావ్య, ఆమె కుటుంబీకుల వేధింపుల కారణంగానే విశాల్గౌడ్ ఉరేసుకున్నాడని కుటుంబీకులు ఆరోపించారు. గాంధీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కల నెరవేరింది
భారత మహిళా క్రికెటర్ అరుంధతిరెడ్డి శంషాబాద్: గతంలో రెండుసార్లు తుది పోరుకు చేరుకుని విఫలమైన వరల్డ్ కప్ (మహిళల క్రికెట్) చేజిక్కించుకోవడంతో భారత మహిళా క్రికెటర్లతో పాటు క్రీడాభిమానుల కలనెరవేరిందని విశ్వవిజేత జట్టులోని సభ్యురాలు అరుంధతిరెడ్డి ఆనందోత్సాహాల మధ్య తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. భారత మహిళా క్రికెట్లోని క్రీడాకారుల్లో ఒకరైన అరుంధతి రెడ్డి విజయోత్సవాల అనంతరం గురువారం రాత్రి నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో కుటుంబసభ్యు లు, క్రీడాకారులు, కోచ్లతో పాటు పలువురు క్రికెట్ అభిమానులు అరుంధతిరెడ్డికి ఘన స్వాగతం పలికా రు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ... వరల్డ్ కప్ సాధించడం అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చిందన్నారు. కష్టపడితే కల నెరవేరుతుందనేదానికి ఈ విజయం ఓ ఉదాహరణ వంటిదని అభివర్ణించారు. ఆమెకు స్వాగతం పలికిన వారిలో తెలంగాణ స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డాక్టర్ సోనిబాలాదేవి తదితరులు ఉన్నారు. విమానాశ్రయంలో అరుంధతిరెడ్డికి స్వాగతం -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు
మూసాపేట: మూసాపేట గూడ్స్షెడ్ రోడ్డులోని కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. నాలుగు జట్లుగా విడిపోయి డాక్యుమెంట్ రైటర్ను, సబ్ రిజిస్ట్రార్ సిబ్బందిని, సబ్ రిజిస్ట్రార్ను విచారించారు. తమపై ఫిర్యాదులు అందడంతో వారి ఆదేశాల మేరకు ఆకస్మిక దాడులను నిర్వహించామని రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. కొన్ని అవకతవకలు ఉన్నాయని, కొన్ని డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నామన్నారు. సబ్ రిజిస్ట్రార్ కె. వేణుగోపాల్ రెడ్డిని, సిబ్బందిని, డాక్యుమెంట్స్ రైటర్స్ని విచారిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి వరకు దాడులు కొనసాగాయి. కుత్బుల్లాపూర్లో.. సుభాష్నగర్: సూరారంలోని కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల సమయంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో సోదాలు జరిపారు. ముందుగా గేట్లను మూసివేసి కార్యాలయంలో 100 మందికి పైగా ఉన్న వారందరిని ప్రశ్నించారు. వీరిలో 15 మంది వరకు డాక్యుమెంట్ రైటర్లను ప్రశ్నించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లతో కలిసి ప్రతిరోజు 144 స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగే కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అదనంగా డబ్బులు తీసుకుంటూ పని చేస్తున్నారని పలు ఫిర్యాదులు రావడంతో సోదాలు జరిపామని తెలిపారు. డాక్యు మెంటర్ల వద్ద అదనంగా కొన్ని డాక్యు మెంట్లు దొరికాయని, వాటిపైన విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఒకవేళ అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలితే ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఆయన పేర్కొన్నారు. -
ఆర్టీఏ ఆఫీసులతో ట్రా‘ఫికర్’!
సాక్షి, సిటీబ్యూరో: రహదారి భద్రతకు సంబంధించిన అంశాలను ట్రాఫిక్ పోలీసులతో పాటు రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) విభాగమూ పర్యవేక్షిస్తుంటుంది. నగరంలోని అనేక ఆర్టీఏ కార్యాలయాలు ట్రాఫిక్ జాంలకు కేరాఫ్ అడ్రస్గా మారాయి. అద్దె భవనాలతో పాటు సొంత భవనాల్లో నడుస్తున్న వాటి పరిస్థితీ ఇంతే. ప్రధాన రహదారులపై ఉన్న కొన్ని కార్యాలయాలకు వచ్చే వాహనాలకు సంబంధించి కొన్ని పరీక్షల్నీ రోడ్డుపై నిర్వహిస్తూ ఆ మార్గంలో ప్రయాణించే వాహన చోదకులకు నరకం చూపిస్తున్నారు. దీనిపై అటు ఆర్టీఏ విభాగం, ఇటు ట్రాఫిక్ పోలీసులు సైతం దృష్టి పెట్టట్లేదు. స్థలం ఉన్నా దళారుల్ని అరికట్టే ఉద్దేశంతో.. నిత్యం ఆర్టీఏ కార్యాలయాలకు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్సు తదితరాలతో పాటు రెన్యువల్స్ కోసం అనేక మంది వస్తుంటారు. రిజిస్ట్రేషన్ వంటి వాహనానికి సంబంధించిన పనులపై వచ్చే వాళ్లు వాహనాలు తీసుకువస్తారు. డ్రైవింగ్ లైసెన్సు సహా ఇతర పనులపై వచ్చే వారిలో కొందరు తమ వాహనాలపై, మరికొందరు ఇతరులతో కలిసి వస్తుంటారు. కొన్నాళ్లుగా దళారులను కట్టడి చేసే ఉద్దేశంతో ఆర్టీఏ విభాగం కేవలం దరఖాస్తుదారుడిని మాత్రమే లోపలికి అనుమతిస్తోంది. దీంతో వారితో వచ్చిన వాళ్లు అనివార్యంగా బయటే ఆగిపోతున్నారు. ఇలా వచ్చే వారి వాహనాలు పెట్టుకోవడానికి అనేక కార్యాలయాల్లో పార్కింగ్ లేదు. ఈ సౌకర్యం ఉన్న వాటిలోకీ సందర్శకులు, కొన్ని సందర్భాల్లో దరఖాస్తుదారుల వాహనాలూ రోడ్డు పక్కనే ఆపాల్సి వస్తోంది. అక్రమ పార్కింగ్ పేరుతో బాదుడు.. ఆర్టీఏ కార్యాలయం వద్ద రోడ్డుపై వాహనాలు ఆపడంతో ఆయా చోట్ల తీవ్ర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. ప్రధానంగా పీక్ అవర్స్గా పిలిచే రద్దీ వేళల్లో ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంటోంది. నగరంలోని ఇతర ఆర్టీఏ కార్యాలయాల కంటే టోలిచౌకి, మూసారాంబాగ్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కొండాపూర్, మేడ్చల్ ప్రాంతాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉంటున్నాయి. వీటిలో కొన్ని కార్యాలయాల వద్ద రహదారిపైనే వాహనాలకు సంబంధించిన ఫిట్నెట్ టెస్ట్లతో పాటు ఛాసిస్, ఇంజిన్ నెంబర్లను సరిచూసే ప్రక్రియలు సైతం నడుస్తుండటం గమనార్హం. అనుమతి లేక, స్థలాభావం వల్లో ఆయా ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చే దరఖాస్తుదారులు, వారి సహాయకుల వాహనాలను రోడ్డు మీదే ఆపాల్సి వస్తోంది. ఆయా మార్గాల్లో ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు ఈ వాహనాల ఫొటోలు తీస్తున్నారు. ఆపై అక్రమ పార్కింగ్ అంటూ ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికీ అనేకం అద్దె భవనాల్లోనే.. నగరంలో కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ కార్యాలయాల్లో అనేకం ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 63 ఆర్టీఏ కార్యాలయాలు ఉండగా వీటిలో 31 అద్దె భవనాల నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అలాగే గ్రేటర్ పరిధిలో 17 కార్యాలయాలు ఉండగా.. వీటిలో ఐదు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. నిత్యం ఆదాయం ఆర్జించే ఆర్టీఏ కార్యాలయాలకు సొంత భవనాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రతి భవనానికీ కచ్చితంగా పార్కింగ్తో పాటు వాహనాల పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేక ప్రదేశం ఉండేలా చర్యలు తీసుకోవాలి. రహదారులపై పార్క్ చేయించాల్సి వచ్చినప్పుడు ఆ మార్గంలో ప్రయాణించే వాహనచోదకులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీఏ అధికారులు స్థానిక ట్రాఫిక్ పోలీసులతో కలిసి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాహనాలపై ఈ–చలాన్లు జారీ కాకుండా చూడాలి. సరైన పార్కింగ్ వసతి లేక రోడ్డుపైనే వాహనాలు ఫలితంగా సమీప రహదారుల్లో నిత్యం ట్రాఫిక్జాంలు ప్రత్యామ్నాయ మార్గాలు పట్టని ప్రభుత్వ విభాగాలు -
బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
భవనంపై నుంచి దూకి ఘట్కేసర్: ఘట్కేసర్ పీఎస్ పరిఽధిలో ఓ ప్రైవేటు కళాశాలలో బీస్సీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గురువారం ఆత్మహత్యాయత్నం చేసింది. కళాశాల యాజమాన్యం, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన మల్లి పూజిత పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో ఉంటూ ఘట్కేసర్ మున్సిపాలిటీ అవుషాపూర్ నీలిమా నర్సింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. ఆమెకు జ్వరంగా ఉండడంతో స్నేహితులతో కలిసి ఆటోలో కళాశాలకు వచ్చి మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. చాలాసేపు ఫోన్లో మాట్లాడిన అనంతరం మూడో అంతస్తు రెయిలింగ్పై ఫోన్ పెట్టి కిందికి దూకింది. గమనించిన స్నేహితులు కళాశాల సిబ్బందితో కలిసి జోడిమెట్లలోని నీలిమా ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలు పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఆమె స్నేహి తులను అడిగి తెలుసుకున్నారు. జర్వం రావడంతో మాత్ర వేసుకొని కళాశాలకు ఆటోలో వచ్చిందని వారు తెలిపారు. పూజిత తన ఫోన్ స్టేటస్లో బుధవారం సాయంత్రం ‘ద ఎండ్’ అని పెట్టుకుందని పోలీసులు తెలిపారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పూజిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూజిత ఆత్మహత్యా యత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఫోన్లో ఎవరితో మాట్లాడింది, మరేదైనా కారణం ఉందా? కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వేగాన్ని వదిలేశారు!
యథేచ్ఛగా ‘స్పీడ్ గవర్నర్స్’ ఉల్లంఘన హైవేలపై గంటకు 80, గ్రేటర్లో 60 కి.మీ వేగ పరిమితి సాక్షి, సిటీబ్యూరో ఆర్టీఏకు వచ్చే ప్రతి రవాణా వాహనానికి వేగనియంత్రణ పరికరం ఉంటేనే ఫిట్నెస్ను ధ్రువీకరించాలి. రోడ్డు భద్రత దృష్ట్యా పదేళ్ల క్రితమే కేంద్రం ఈ నిబంధన తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ నిబంధన సమర్థంగా అమలుకు నోచడం లేదు. వాహన యజమానుల నిర్లక్ష్యం, కొంతమంది ఆర్టీఏ అధికారుల ఉదాసీనత కారణంగా ‘వేగ నియంత్రణ’పై నీలినీడలు కమ్ముకొన్నాయి. దీంతో రవాణా వాహనాలు అన్ని రకాల రహదారులపై యథేచ్ఛగా పరిమితికి మించిన వేగంతో పరుగులు తీస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్లపై రక్తపుటేరులు పారిస్తున్నాయి. ప్రతి ఏటా ఓవర్స్పీడ్ కారణంగా జరుగుతున్న ప్రమాదాల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. రవాణా అధికారులు, పోలీసులు ఎలాంటి పటిష్టమైన చర్యలు చేపట్టడంలేదు. ఇటీవల రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద చోటుచేసుకున్న ఆర్టీసీ బస్సు దుర్ఘటనకు టిప్పర్ ఓవర్లోడ్తో పాటు అతివేగం కూడా కారణమేనని రోడ్డు భద్రతా నిపుణులు పేర్కొంటున్నారు. ఉన్నా, లేకున్నా ఓకే.. అన్ని రకాల రవాణా వాహనాలకు వేగాన్ని నియంత్రించే స్పీడ్ గవర్నర్స్ను 2015 అక్టోబర్ 1వ తేదీ నుంచి కేంద్రప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఆ సంవత్సరం నుంచి తయారయ్యే వాహనాలు స్పీడ్ గవర్నర్లతోనే మార్కెట్లోకి విడుదల కావాలి. అప్పటికే రోడ్డెక్కిన వాహనాలకు మాత్రం తప్పనిసరిగా వేగ నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. 2015 నుంచే ఇది అమల్లోకి వచ్చినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లు ఆలస్యంగా 2019లో ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది. కొత్తగా వచ్చే వాటికి తయారీ సమయంలోనే వేగనియంత్రణ పరికరాలను ఏర్పాటు చేస్తున్నందువల్ల పాత వాహనాలకు ఫిట్నెస్ సమయంలో వేగనియంత్రణ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని షరతు విధించారు. కానీ ఈ నిబంధన అమల్లో పక్కదారి పట్టింది. కొంతమంది అధికారుల అక్రమార్జనకు స్పీడ్గవర్నర్లు ఊతంగా మారాయి. ఆటోమొబైల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ వంటి సాంకేతిక సంస్థలు ధ్రువీకరించిన కంపెనీలకు చెందిన స్పీడ్ గవర్నర్స్ను మాత్రమే వాహనాలకు ఏర్పాటు చేయాలనే నిబంధన విధించారు. ఈ మేరకు 37 సంస్థలకు ఆమోదం లభించింది. కానీ తెలంగాణలో కేవలం 3 కంపెనీలకు చెందిన స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటుకు మాత్రమే రవాణా అధికారులు అనుమతినిచ్చారు. ఆ మూడు సంస్థలతో ఒక అధికారి లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొని పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. సదరు అధికారి అండతో ఆ సంస్థలు సైతం స్పీడ్గవర్నర్ల ధరలను అడ్డగోలుగా పెంచాయి. దీంతో వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. క్రమంగా ఈ పథకం లక్ష్యం నీరుగారింది. ఆ తర్వాత ఫిట్నెస్ పరీక్షల్లో ఈ పరికరాలు ఉన్నా, లేకున్నా సామర్థ్య నిర్ధారణ, ధ్రువీకరణ యథావిధిగా కొనసాగింది. మరోవైపు అధికారుల ఒత్తిడితో స్పీడ్గవర్నర్లను ఏర్పాటు చేసుకొన్న వాహనదారులు ఆ తర్వాత వాటిని తొలగించి యథావిధిగా దూకుడు పెంచారు. గంటకు ్చ80కి.మీ పరిమితం..● కేంద్రమోటారు వాహన చట్టంలోని 118వ నిబంధన ప్రకారం రవాణా వాహనాలు హైవేలపై గంటకు 80 కి.మీ.కంటే ఎక్కువ వేగంతో వెళ్లడానికి వీల్లేదు. గ్రేటర్ పరిధిలో గంటకు 60 కి.మీ. వేగంతో మాత్రమే నడపాలి. ● అంబులెన్సులు, పోలీస్వాహనాలు, ఫైరింజిన్లు, 8 మంది ప్రయాణికులు (3500 కిలోలు) కలిగిన వాహనాలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. ● ఆర్టీసీ, స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులు, క్యాబ్లు, ట్యాంకర్లు, చెత్త తరలింపు వాహనాలు, లారీలు, డీసీఎంలు, తదితర అన్ని రకాల ప్రయాణికుల రవాణా, సరుకు రవాణా వాహనాలు తప్పనిసరిగా నిర్ణీత వేగాన్ని పాటించేలా స్పీడ్ గవర్నర్స్ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ● అపరిమితమైన వేగంతో దూసుకెళ్లే వాహనాలను అదుపు చేయడంలో డ్రైవర్లు విఫలం కావడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ● 2015 తర్వాత తయారైన అన్ని రకాల రవాణా వాహనాలకు వాటి నిర్మాణ సమయంలోనే కంపెనీలు వేగాన్ని నియంత్రించే పరికరాలను ఏర్పాటు చేశాయి. ● 2015 కంటే ముందు తయారైన వాహనాలకు మాత్రం అలాంటి వేగ నియంత్రణ పరికరాలు లేవు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ స్పీడ్ గవర్నర్స్ నిబంధనను తప్పనిసరి చేశారు. గాలికి వదిలేసిన నిబంధనలు వాహన చోదకుల నిర్లక్ష్యం కొందరు ఆర్టీఏ అధికారుల ఉదాసీన వైఖరి రహదారులపై ప్రమాదాలు.. గాల్లో ప్రాణాలు -
కాలుష్య కష్టాలు..ఎవరూ పట్టించుకోరు
● నగరంలో తీరుమార్చుకోని పరిశ్రమలు ● ఘాటైన వాసనలు, రసాయనాల పారబోతపై స్థానికుల ఫిర్యాదులు ● అధికారుల తీరుపై ఆరోపణలు సాక్షి, సిటీబ్యూరో: పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ పరిసర ప్రాంతాలు పర్యావరణ పరంగా తీవ్రంగా నష్టాన్ని మూటగట్టుకుంటున్నాయి. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలతో గాలి, నీరు, భూమి కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులకు పరిశ్రమల కాలుష్యంపై ఫిర్యాదులు అందుతున్నప్పటికి పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా యథారాజ.. తథాప్రజ అన్నట్లు కాలుష్య ంలో కాలం వెళ్లదీయాల్సి వస్తోందని, ఆరోగ్యం చెడిపోయి ఆసుపత్రులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో నిత్యం అవస్థలు పటాన్చెరు, రామచంద్రాపురం, బొల్లారం, జీడిమెట్ల, బాలానగర్, సనత్నగర్, పాశమైలారం, బాచుపల్లి, సనత్నగర్, చర్లపల్లి, కాటేదాన్, నాచారం, కాజీపూర్, కిష్టాయిపల్లి, అమీన్పూర్, బాచుపల్లి, నిజాంపేట్ పరిశర ప్రాంతల్లో కాలుష్యకారక పరిశ్రమలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇందులో అత్యంత ప్రమాదకరమైన రెడ్ కేటగిరీ పరిశ్రమలు వేల సంఖ్యలో ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గుర్తించింది. నక్కవాగు, అమీన్పూర్ చెరువు, సుల్తాన్పూర్, తదితర ప్రాంతాల్లో చెరువుల్లో ప్రమాదకర స్థాయిలో భారీ లోహాలు, ద్రావణాలు, రసాయన అవశేషాలు ఉన్నట్లు తేలింది. రాత్రి వేళల్లో పారిశ్రామిక వ్యర్థాలను నేరుగా వరద కాల్వల్లో విడుస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఘాటైన వాసనకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయి. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాల ప్రభావంతో చెరువుల్లో చేపలు, ఇతర జల చరాలు మృత్యువాతపడుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. నాచారం పారిశ్రామిక ప్రాంతంలో కాలుష్యాన్ని తగ్గించడం, పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణకు హెచ్ఎండీఏ శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పీఎం 2.5, పీఎం10, సల్ఫర్డయాకై ్సడ్, నైట్రోజన్ ఆకై ్సడ్, కార్బన్ మోనాకై ్సడ్, భారీ లోహాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనికి ప్రధానంగా పారిశ్రామిక ఉద్గారాలు కారణంగా కనిపిస్తున్నాయి. ఆపై వాహనాలు, నిర్మాణ వ్యర్థాలు గాలిలో ధూళి కణాల సంఖ్య పెరగడానికి సహకరిస్తున్నాయి. బల్క్డ్రగ్స్ పరిశ్రమలతో ప్రమాదం ప్రపంచ బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో హైదరాబాద్ వాటా సుమారు 40 శాతం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిశ్రమలతో విపరీతమైన కాలుష్యం వెలువడుతోందని అభిప్రాయడపతున్నారు. కాలుష్య వ్యర్థాలను సక్రమ పద్ధతిలో ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించడంలో పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ట్యాంకర్లతో తరలించి మూసీ, వరద కాల్వలు, ఇతర నిర్జన ప్రదేశాల్లో పారబోస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. అమీన్పూర్, నిజాంపేట్, బాచుపల్లి, పాశమైలారం తదితర ప్రాంతాల్లో శ్వాసకోశ, చర్మ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారుల తీరుపై ఆరోపణలు జీడిమెట్ల, బాలానగర్, చర్లపల్లి, బాచుపల్లి, పటాన్చెరు, పాశమైలారం తదతర ప్రాంతల్లో కాలుష్య వ్యర్థాలను నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా పరిశ్రమలు ఆరుబయట పారబోస్తున్నాయని ఫిర్యాదులు చేస్తున్నా పీసీబీ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్ని దఫాలు ఫిర్యాదులు ఇచ్చినా వారి నుంచి ఆశించిన మేరకు స్పందన కనిపించడం లేదంటున్నారు. అడపాదడపా తనికీలు చేపడుతూ మమ అనిపించేస్తున్నారన్నారంటున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు ఇచ్చే తాయిలాలకు ఆశపడి కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని ఆరోపిస్తున్నారు. పీసీబీలో సుమారు 10 నుంచి 15 మంది సిబ్బందిపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
గోమాతకు ఓటేస్తే.. గోవిందుడికి వేసినట్లే..
పంజగుట్ట: ప్రతి హిందువు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గోమాతను కాపాడేందుకు బరిలో నిలిచిన యుగతులసి పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి అన్నారు. గోమాతకు ఓటు వేస్తే గోవిందుడికి ఓటు వేసినట్లేనని ఆయన పేర్కొన్నారు. గోమాతను కాపాడేందుకు యుగ తులసి పార్టీ తరఫున బరిలో ఉన్న కొలిశెట్టి శివకుమార్కు మద్దతుగా సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ.. మన దేశంలో పులులు, నక్కలు, జింకలు, కుక్కలకు చట్టాలున్నాయని, కానీ హిందువులు పూజించే గోమాతకు చట్టం లేకపోవడం బాధాకరమన్నారు. ఇటీవల బీఫ్ ఎగుమతికి జీఎస్టీ రద్దు చేశారని, బీఫ్కు జీఎస్టీ రద్దు చేశారు.. ఆవు నెయ్యికి మాత్రం జీఎస్టీ విధించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా యుగతులసి పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించారు. సమావేశంలో పరివ్రాజక్ స్వామి దయాశంకర్, కృప శ్రీనివాస్, చంద్రస్వామి, రాజగోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. స్వామి పరిపూర్ణానంద -
స్టేటస్ పెట్టి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
– రక్షించిన కాచిగూడ పోలీసులు కాచిగూడ: రైల్వే ట్రాక్పై పడుకుని ఆత్మహత్యకు యత్నించిన ఓ విద్యార్థిని కాచిగూడ పోలీసులు సకాలంలో స్పందించి రక్షించారు. అడ్మిన్ ఎస్ఐ నరేష్ తెలిపిన మేరకు.. నాగోల్ ప్రాంతానికి చెందిన లకన్ కుమార్ (21) హబ్సిగూడలోని ఓమేగా కాలేజ్లో బీసీఏ 3వ సంవత్సరం చదువుతున్నాడు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు గురువారం వాట్సప్ స్టేటస్లో వీడియో పెట్టాడు. గమనించిన స్నేహితురాలు ఉమ ఫోన్ ద్వారా 100కు కాల్ చేసి చెప్పింది. వారు కాచిగూడ పోలీసులను, రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. కాచిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువకుడి మొబైల్ లొకేషన్ను గుర్తించారు. కాచిగూడ లోని ఖాజా గరీబ్నగర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జివద్ద అతడిని పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు. అపస్మారకస్థితిలో ఉన్న అతన్ని పోలీసులు రక్షించి వెంటనే కాచిగూడ లోని సీసీ ష్రాఫ్ ఆసుపత్రికి తరలించారు. -
డ్రగ్స్, గంజాయి దందా.. ఆరుగురి అరెస్ట్
రాజేంద్రనగర్: ఇన్స్ట్రాగామ్ ద్వారా చాటింగ్ చేసి బెంగుళూర్కు వెళ్లి డ్రగ్స్తో పాటు గంజాయిని తీసుకొచ్చిన ముగ్గురు యువకులతో పాటు డ్రగ్స్ను కొనుగోలు చేస్తున్న మరో ముగ్గురిని రాజేంద్రనగర్, మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 17 గ్రాముల ఎండీఎంఏ, 150 గ్రాముల గంజాయి, ఐదు మొబైల్ ఫోన్లు, రూ.9,700 నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కాకినాడకు చెందిన ఎస్.సంతోష్ (26)గతంలో డ్రగ్స్ సరఫరా చేస్తూ ఆంధ్రప్రదేశ్ వడ్డాడి మడుగు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇతనికి బెంగుళూర్కు చెందిన నర్సరీ వ్యాపారం నిర్వహించే గాంధీ సందీప్ (23), రాజమండ్రికి చెందిన లారీ డ్రైవర్ శివ కుమార్ (23) స్నేహితులయ్యారు. వీరంతా కలిసి ఇన్స్ట్రాగామ్లో ఓ వ్యక్తితో చాటింగ్ చేశారు. డ్రగ్స్ కావాలని తెలపడంతో డబ్బు ఆన్లైన్ ద్వారా వేశారు. అనంతరం బెంగుళూర్కు వచ్చి డ్రగ్స్ను తీసుకోవాలని చెప్పడంతో అక్కడికి వెళ్లి ఇన్స్ట్రాగామ్ చాట్ ద్వారా డ్రగ్స్ సప్లాయర్ పోస్టు చేసిన లోకేషన్కు వెళ్లి రోడ్డు పక్కనే భద్రపరిచిన డ్రగ్స్తో పాటు గంజాయిని తీసుకొని నగరానికి పయనమయ్యారు. డ్రగ్స్ విక్రయించిన వ్యక్తి నైజీరియన్ అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయం ఆరాంఘర్ బస్టాపు వద్ద ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా డ్రగ్స్తో పాటు గంజాయి లభ్యమైంది. అప్పటికే వీటిని తీసుకొనేందుకు సాయిబాబా (25), విశాల్ రెడ్డి (28), తన్వీర్ (24) ఆరాంఘర్ వద్దకు వచ్చారు. వీరిని సైతం అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ నిమిత్తం రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. ఆరుగురిపై కేసు నమోదు చేసుకొని రిమాండ్కు తరలించారు. -
అధిక మోతాదులో డ్రగ్స్తీసుకొని యువకుడు మృతి
రాజేంద్రనగర్: అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడంతో ఓ యువకుడు మృతి చెందాడు. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన మేరకు.. శివరాంపల్లి కేన్ హుడ్ అపార్ట్మెంట్ ఫస్ట్ టవర్స్లో సయ్యద్ (28), మమతా బిశ్వాస్ (26), ధారా (26), మహ్మద్ అహ్మద్ (26)లు నివాసముంటున్నారు. పాతబస్తీ జహనుమా ప్రాంతానికి చెందిన మహ్మద్ అహ్మద్ ధారాతో కలిసి సహజీవనం చేస్తున్నారు. వీరి రూమ్ పక్కనే మమతా బిశ్వాస్, సయ్యద్ నివసిస్తున్నారు. మహ్మద్ అహ్మద్ బుధవారం రాత్రి డ్రగ్స్ కొనుగోలు చేసి అపార్ట్మెంట్కు వచ్చాడు. అనంతరం మహ్మద్ అహ్మద్తో పాటు ధారా, సయ్యద్లు డ్రగ్స్ను సేవించారు. అహ్మద్ ఓవర్ డోస్ తీసుకోవడంతో ముక్కు నుండి రక్తం వచ్చింది. దీంతో సయ్యద్ అపార్ట్మెంట్లోని డాక్టర్ను తీసుకొచ్చి చూపించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పంచమానా నిర్వహించి మృతదేహన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ధారా, సయ్యద్లు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. మమతా బిశ్వాస్కు నెగిటివ్ వచ్చింది. మహ్మద్ అహ్మద్ డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చాడు?ఎన్ని రోజుల నుంచి వినియోగిస్తున్నాడు?ఇంకా ఎవరైనా ఇదే రూమ్లో డ్రగ్స్ తీసుకున్నారా ? వీరందరిపై మధ్య సంబంధం ఏమిటని పోలీసులు విచారిస్తున్నారు. -
తెలుగు యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య
నిజాంపేట్: అనుమానస్పద స్థితిలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిఽధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు..జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్కు చెందిన ప్రాంతానికి చెందిన కె. పరుశురాం ( 22 ) బాచుపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్ ఆఫ్ డిజైన్ కోర్సులో 3వ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం హాస్టల్ గదిలో పరుశురాం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
రౌడీషీటర్ హత్య కేసు.. ముగ్గురి రిమాండ్
జీడిమెట్ల: ఓ రౌడీషీటర్ అనుమానంతో మరో రౌడీషటర్ను హత్య చేసిన సంఘట నలో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. గురువారం బాలానగర్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇంచార్జ్ డీసీపి కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు. జగద్గిరిగుట్టకు చెందిన బాలశౌరెడ్డి(22)పై జగద్గిరిగుట్టలో రౌడీషీట్, ఐడీపీఎల్ ప్రాంతంలో నివసించే రోషన్కుమార్సింగ్(25)పై బాలానగర్ పీఎస్లో రౌడీషీట్ ఉంది. రోషన్కు సంబందించిన విషయాలను బాలశౌరెడ్డి పోలీసులకు సమాచారం అందిస్తున్నాడ ని రోషన్ బాలశౌరెడ్డిపై అనుమానం పెంచుకున్నాడు. అదేవిదంగా ఒకానొక దశలో బాలశౌరెడ్డిని హత్య చేయాలని రోషన్ బావించాడని బాలశౌరెడ్డికి తెలిసింది. తనను చంపుతాడెమో అనుకుని.. రోషన్ ఒకవేళ తనను చంపుతాడెమోనని బాలశౌరెడ్డి అనుకున్నాడు. ఎలాగైనా రోషన్ను హత్య చేయాలని అనుకున్న బాలశౌరెడ్డి పఽథకం ప్రకారం ఇన్స్టా ద్వారా రోషన్ను బుధవారం సాయంత్రం 4గంటలకు జగద్గిరిగుట్ట బస్స్టాప్ వద్దకు రప్పించాడు. అదే సమయంలో బాలశౌరెడ్డి అతని మరో ఇద్దరు స్నేహితులైన సయ్యద్ మహ్మద్(23), రేవ అదిత్య(22)లతో కలిసి బుల్లెట్పై బస్టాప్ వద్దకు చేరుకున్నాడు. బస్టాప్ వద్ద ఉన్న రోషన్ను గమనించిన బాలశౌరెడ్డి, అతని స్నేహితుడు సయ్యద్ మహ్మద్తో కలిసి రోషన్ వద్దకు వెళ్లారు. వెంటనే సయ్యద్ మహ్మద్ రోషన్ను పట్టుకోగా బాలశౌరి రోషన్ను కత్తితో విచక్షణరహితంగా చాతి, కడుపు బాగాల్లో ఆరుపోట్లు పొడిచాడు. తీవ్ర గాయాలైన రోషన్ అక్కడ నుండి తప్పించుకుని పరుగులు తీయగా బాలశౌరెడ్డి, సయ్యద్ మహ్మద్, అదిత్య బుల్లెట్పై ఎక్కి అక్కడ నుండి పరారయ్యారు. చికిత్సపొందుతూ మృతిచెందిన రోషన్.. విషయం తెలుసుకున్న పోలీసులు తీవ్రగాయాలపాలైన రోషన్కు ప్రథమ చికిత్సం చేయించి గాంధీ అస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో రోషన్ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. రోషన్ స్నేహితుడు మనోహర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నిందితులు ముగ్గురుని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి గురువారం రిమాండుకు తరలించారు. సమావేశంలో ఎస్ఓటి డీసీపీ శోభన్కుమార్, అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్, బాలానగర్ ఏసీపీ నరేష్రెడ్డి, జగద్గిరిగుట్ట ఇన్స్పెక్టర్ వెంకటేష్, బాలానగర్ ఏస్వోటి ఇన్స్పెక్టర్ శివ పాల్గొన్నారు.బాధితుడు, నిందితుడు ఇద్దరూ రౌడీషీటర్లే -
స్మార్ట్ కార్డుల్లేవ్
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏలో స్మార్ట్కార్డుల కొరత మళ్లీ మొదటికొచ్చింది. నగరంలోని పలు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో రెండు నెలలుగా స్మార్ట్కార్డుల రూపంలో జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల పంపిణీ నిలిచిపోయింది. కార్డులను ముద్రించి వాహనదారులకు అందజేసేందుకు అవసరమైన రిబ్బర్ కొరత వల్లే కార్డుల ప్రింటింగ్ ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు. 2 నెలల క్రితమే ఈ సమస్య తలెత్తినప్పటికీ.. ఇప్పటి వరకు పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో సాక్షాత్తు రవాణా కమిషనర్ కొలువుదీరే ఖైరతాబాద్ కేంద్ర కార్యాలయంతో పాటు నగరంలోని పలు ఆర్టీఓ కేంద్రాల్లో వేల సంఖ్యలో స్మార్ట్ కార్డుల పంపిణీ నిలిచిపోయినట్లు సమాచారం. మరోవైపు డ్రైవింగ్ పరీక్షలకు హాజరైన వాళ్లు, కొత్తగా వాహనాలను నమోదు చేసుకొన్న వాహనదారులు ఈ రెండు నెలలుగా తమ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ కార్డు (ఆర్సీ)ల కోసం పడిగాపులు కాస్తున్నారు. పదే పదే ఎందుకిలా? ● స్మార్ట్కార్డుల కోసం వినియోగించే రిబ్బన్, ప్రింటింగ్ పేపర్ తదితర సామగ్రిని రవాణా శాఖ ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎంపికై న సంస్థలు ఈ ముడిసరుకులను అందజేస్తున్నాయి. కానీ కాంట్రాక్ట్ సంస్థలకు సకాలంలో నిధులు చెల్లించకపోవడంతో కార్డులప్రింటింగ్కు అవసరమైన వస్తువులు దిగుమతి కావడం లేదు. దీంతో ఆకస్మాత్తుగా కొరత సమస్య తతెత్తుతోంది. గత ఐదేరాళ్లలో పలు సంస్థలతో రవాణాశాఖ ఒప్పందం ఏర్పాటు చేసుకుంది. నిధులు చెల్లించినప్పటికీ ప్రింటింగ్ వస్తువుల సరఫరాలో నిర్లక్ష్యం చూపిన సంస్థలతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అయినప్పటికీ స్మార్ట్కార్డుల కొరత సమస్య పదే పదే తలెత్తుతూనే ఉంది. ● గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్పేట్, నాగోల్, ఉప్పల్, మణికొండ, కొండాపూర్, మెహిదీపట్నం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, బండ్లగూడ తదితర ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రతిరోజు సుమారు 2,500కుపైగా డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు, ఇతర డాక్యుమెంట్స్ ప్రింట్ చేసి వాహనదారులకు పోస్టు ద్వారా అందజేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం రిబ్బన్తో పాటు ఇతర వస్తువులు నిల్వ ఉన్న చోట కార్డుల ప్రింటింగ్, పంపిణీ కొనసాగుతోంది. ఇవి నిల్వలేని చోట కొరత కొనసాగుతోంది. అడ్డగోలుగా అమ్మకాలు ఒకవైపు స్మార్ట్కార్డుల కోసం డిమాండ్, కొరత సమస్య ఇలా ఉండగా.. కొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో సిబ్బంది యథేచ్ఛగా చేతివాటం ప్రదర్శించడం గమనార్హం. నిబంధనల మేరకు వాహనదారులకు స్మార్ట్కార్డులను స్పీడ్పోస్టు ద్వారా అందజేయాల్సి ఉంటుంది. రికార్డుల్లో సదరు డాక్యుమెంట్లను పోస్టు చేసినట్లుగా నమోదు చేస్తున్నారు. తర్వాత దళారుల ద్వారా వాహనదారులకు విక్రయిస్తున్నారు. ఇబ్రహీంపట్నం, సికింద్రాబాద్, బండ్లగూడ తదితర కార్యాలయాల్లో స్మార్ట్కార్డుల దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో కార్డుకు రూ.200 నుంచి రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. ఇదో వ్యవస్థీకృత కార్యకలాపంగా జరుగుతున్నప్పటికీ రవాణాశాఖ ఉన్నతాధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రెండు నెలలుగా నిలిచిపోయిన డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు రిబ్బన్ కొరత కారణంగా కార్డుల ప్రింటింగ్కు కటకట ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ వాహనదారుల ప్రదక్షిణలు -
గేటెడ్ ఓటర్లకు గాలం!
జూబ్లీహిల్స్ జోరందుకున్న ఎన్నికల ప్రచారంసాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. శాసన సభ ఉప ఎన్నికకు ఇంకో వారం రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు జోరు పెంచారు. సామాజిక సమీకరణాల ఆధారంగానే ప్రచారం కొనసాగిస్తున్నారు. జూబ్లీహిల్స్లో బస్తీలతో పాటు ఉన్నత వర్గాల ఓటర్లు కూడా ఉండటంతో అన్ని వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. షేక్పేట, వెంగళరావునగర్, బోరబండ వంటి ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీలలో విభాగాల వారీగా తాయిలాలతో గంపగుత్తగా ఓట్లర్లను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. వీకెండ్, కిట్టీ పార్టీలు.. జూబ్లీహిల్స్లో 3.98 లక్షల మంది ఓటర్లున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన ఉప ఎన్నిక కావడంతో అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలన్న కృతనిశ్చయంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రధానంగా నియోజకవర్గంలోని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల ఓటర్లకు గాలం వేస్తున్నారు. తటస్థులను తమ వైపు తిప్పుకొ నేందుకు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో వీకెండ్ పార్టీలు, మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు కిట్టీ పార్టీలను నిర్వహిస్తున్నాయి. సంఘాలలో సీసీ టీవీలు.. జూబ్లీహిల్స్ బరిలో దిగిన అభ్యర్థుల తరఫున ప్రచార బాధ్యతలు తలకెత్తుకున్న మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల నివాసిత సంఘాలు, కాలనీల సంక్షేమ సమితిల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయా సంఘాలకు అవసరమైన వస్తువులు ఇస్తామని హామీలు ఇస్తున్నాయి. తాయిలాలతో వారిని ఆకర్షించే యత్నాలు చేస్తున్నారు. కాలనీలు, నివాసిత సంఘాల భద్రత కోసం ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరో గేటెడ్ కమ్యూనిటీలోని సీనియర్ సిటిజెన్ల ఓట్లను ఆకర్షించేందుకు ఆయా ఓటర్లకు యోగా, మెడిటేషన్ హాల్ వంటివి కట్టిస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అపార్ట్మెంట్లలో వీకెండ్, కిట్టీ పార్టీల నిర్వహణ కాలనీలు, సంఘాలలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు గంపగుత్త ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థుల ఎత్తుగడ -
నగరంలో భారీ వర్షం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఆదివారం రాత్రి వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సెలవురోజు కావడంతో బయటికి వచ్చిన నగర వాసులను తీవ్ర అవస్థలకు గురిచేసింది. రాత్రి 8 గంటల వరకు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కాగా, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. బంజారాహిల్స్, పంజాగుట్ట, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, యూసుఫ్గూడ, బోరబండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, బేగంపేట్, ముషీరాబాద్, లింగంపల్లి, గచ్చిబౌలి, కూకట్పల్లి, మూసాపేట్, ఎర్రగడ్డ, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. బేగంపేట్లో.. -
రామలింగేశ్వరుడి సేవలో శృంగేరి పీఠాధిపతి
కీసర: దక్షిణామ్మాయ శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీవిధుశేఖర భారతి మహాస్వామి ఆదివారం కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా కీసరగుట్ట సందర్శనకు విచ్చేసిన శ్రీ విధుశేఖర భారతి మహాస్వామివారికి ఆలయ చైర్మన్ తటాకం నారాయణ, ఈఓ కట్ట శేఖర్రెడ్డి, అర్చకులతో కలిసి పూర్ణకుంభ స్వాగతం ఫలికారు. మహాస్వామి శ్రీ రామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం, శ్రీ భవానీ శివదుర్గా అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం పున: నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ను శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి పరిశీలించారు. ఈ క్షేత్రంతో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. బాల్యంలో మహాశివరాత్రి పర్వదినాలలో వైదిక కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారికి అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం శ్రీ విధుశేఖర భారతి మహాభారతి మహాస్వామి శ్రీ అన్నపూర్ణా బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రాన్ని, తాను బాల్యంలో వేద విద్యను అభ్యసించిన తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాలను సందర్శించారు. -
త్రాసు.. తిర‘కాసు’
● పదోన్నతులు, పోస్టింగ్ల్లో చేతివాటం ● రెగ్యులర్ కంట్రోలర్ లేక ఇష్టారాజ్యం ● ప్రభుత్వ ఆదాయానికి సైతం గండి ● పట్టించుకోని సంబంధిత శాఖ మంత్రిసాక్షి, సిటీబ్యూరో: తూనికలు, కొలతల శాఖలో తూకం మోసాలపై జరిమానాల వసూలుతో పాటు ఉద్యోగుల సీనియారిటీ నిర్ధారణ, పోస్టింగ్, పదోన్నతుల్లో నిబంధనల ఉల్లంఘన రాజ్యమేలుతోంది. రాష్ట్ర శాఖకు రెగ్యులర్ కంట్రోలర్ పోస్ట్ ఉన్నా.. ప్రతిసారీ పౌరసరఫరాల శాఖ కమిషనర్కు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ)గా నియమిస్తున్న తీరు చేతివాటం ప్రదర్శించే అక్రమ అధికారులకు కలిసివస్తోంది. ఇటీవల బదిలీపై వెళ్తున్న రాష్ట్ర కంట్రోలర్పై బాహాటంగానే స్వామి భక్తిని చాటుకున్న తూ.కొ. అధికారుల తీరు ఇందుకు బలం చేకూర్చుతోంది. గత కొనేళ్లుగా ఈ శాఖ పరిపాలన యంత్రాంగం తీరు నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు అన్న చందంగా తయారైంది. అవినీతి ఆరోపణలు, విజిలెన్స్ విచారణలు కొనసాగుతున్నా.. పనితీరు మాత్రం మెరుగుపడటం లేదు. ఇటీవల పరిపాలన విభాగం బాధ్యుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉద్యోగుల సీనియారిటీని తిమ్మినిబమ్మిని చేయడం.. తాజాగా న్యాయస్థానం సరిదిద్దేందుకు ఆదేశాలు ఇవ్వడం ఆ శాఖ పని తీరును బహిర్గతం చేస్తోంది. మరోవైపు కాంపౌండింగ్లో చేతివాటం ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతోంది. సంబంధిత పౌర సరఫరాల శాఖ మంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కంచే చేను మేస్తే.. తూ.కొ. శాఖలో పరిపాలన విభాగం కంచే చేను మేసే విధంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలల క్రితం వరకు ఏసీ (అడ్మిన్) హెడ్ క్వార్టర్గా పనిచేసిన అధికారి తన స్వీయ పదోన్నతి కోసం సీనియారిటీ జాబితాలో సీనియార్లను వెనక్కి నెట్టి తన పేరును పైవరసలోకి తెచ్చుకొని ఏకంగా రాష్ట్ర కంట్రోల్ ఆమోదం పొందటం విస్మయానికి గురి చేసింది. జాబితాలో వెనకబడిన అధికారి ఒకరు కోర్టును ఆశ్రయించి ఆదేశాలు పొందడంతో దిద్దుబాటుకు తూ.కొ.శాఖ తర్జనభర్జన పడుతోంది. మచ్చుకు కొన్ని ఉల్లంఘనలు.. ● కరీంనగర్ డీఎల్ఎంను నిజాబాబాద్ ఏసీగా పదోన్నతి కల్పించారు. సదరు ఉద్యోగి గతంలో గుర్తింపు లేని రాజస్థ్రాన్ రాష్ట్రానికి చెందిన డీమ్డ్ యూనివర్సిటీ నుంచి ధ్రువీకణ సమర్పించి ఇన్స్పెక్టర్ డీఎల్ఎంగా పదోన్నతి పొందినట్లు ఆరోపణలున్నాయి. ● బదిలీల నిషేధ కాలంలో నల్లగొండ డీఎల్ఎంను మేడ్చల్కు బదిలీ చేసి తాజాగా ఏసీగా పదోన్నతి కల్పించి రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. ● పెద్దపల్లి ఇన్స్పెక్టర్ను హన్మకొండ డీఎల్ఎంఓగా పదోన్నతి కల్పించారు. సదరు ఉద్యోగిపై ఏసీబీ కేసు పెండింగ్లో ఉంది. ● మహబూబాబాద్ ఇన్స్పెక్టర్కు ఆదిలాబాద్ డీఎల్ఎంఓగా పదోన్నతి కల్పించారు. శాఖాపరమైన పార్ట్–2 పరీక్ష పాస్ కాకముందే పదోన్నతి లభించింది. ● కొత్తగూడెం ఇన్స్పెక్టర్కు వరంగల్ డీఎల్ఎంఓగా పదోన్నతి లభించింది. సదరు ఉద్యోగిపై 2022 నుంచి విజిలెన్స్ విచారణ పెండింగ్లో ఉంది. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. తూ.కొ.శాఖలో నిబంధనలు బేఖాతరు అంతా ఇష్టారాజ్యమే.. ఈ ఏడాది కాలంలో జరిగిన పలు పదోన్నతులు, పోస్టింగ్, బదిలీల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలున్నాయి. కొత్త పోస్టింగ్లో చేరిన కొద్ది నెలలకు కొందరిని కోరుకున్న స్థానాలకు బదిలీ చేయడం అనుమానాలకు తావిచ్చింది. ఇటీవల వరకు ఇన్చార్జి ఏసీ అడ్మిన్ హెడ్ క్వార్టర్గా వ్యవహరించిన అధికారి ఒకరు.. రెగ్యులర్ అధికారి రావడంతో బాధ్యతల నుంచి తప్పుకొన్నా వరసగా రెండు నెలల పాటు చాంబర్ వదలకుండా కొన్ని పోస్టింగ్ల్లో, పదోన్నతుల్లో సైతం చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలున్నాయి. -
గోల్ఫ్ టోర్నీ నిర్వహణ ఎంతో గర్వకారణం
– మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి సిటీబ్యూరో: తొలిసారిగా భారత్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక 60వ ఐజీఎఫ్ఆర్ వరల్డ్ గోల్ఫ్ చాంపియన్ షిప్ను గచ్చిబౌలి పరిధిలోని హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ వేదిక కావడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ వరల్డ్ గోల్ఫ్ చాంపియన్ షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ గోల్ఫ్ కోర్సులు హైదరాబాద్లో ఉండడం ఎంతో సంతోషించదగిన అంశమని చెప్పారు. టూరిజం అభివృద్ధి క్రీడలతోనూ ముడిపడి ఉందని, ముఖ్యంగా విదేశీ పర్యాటకలకు అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వడం తమ బాధ్యతగా చెప్పుకొచ్చారు. వారం రోజులు.. 24 దేశాలు.. 180 మంది క్రీడాకారులు వారం రోజుల పాటు జరిగే గోల్ఫ్ చాంపియన్ షిప్లో 24 దేశాలకు చెందిన 180 మంది రోటరీ గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. పలు సేవాకార్యక్రమాలను నిర్వహించే రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ గోల్ఫింగ్ ఫెలోషిప్ ఆఫ్ రోటారియన్స్ (ఐజీఎఫ్ఆర్) సహకారంతో ప్రసూతి, శిశు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతీ ఏడాది దీనిని నిర్వహిస్తోంది. -
కోహెడలో తాత్కాలిక మార్కెట్ నిర్మించాలి
సాక్షి, సిటీబ్యూరో: బాటసింగారంలో కొనసాగుతున్న తాత్కాలిక మార్కెట్కు ప్రతి నెలా రూ.80 లక్షలు అద్దెలు చెల్లిస్తున్నారని, తద్వారా రూ.50 కోట్లు మార్కెట్ ఆదాయం వృథా అయ్యాయని తెలంగాణ ఫ్రూట్ మార్కెట్ కమీషన్ ఏజెంట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు క్రాంతి ప్రభాత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ఆదివారం మీడియాతోమాట్లాడుతూ కోహెడలోని మార్కెట్ స్థలంలో తాత్కాలిక మార్కెట్ నిర్మించి అద్దె భారాన్ని తగ్గించాలని సూచించారు. మార్కెట్పై ఆధారపడిన 20 వేల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు. ప్రస్తుతం బాటసింగారం మార్కెట్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవని, దీంతో రైతులు, కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కోహెడలో రూ.10–15 కోట్లు వెచ్చించి అన్ని సౌకర్యాలతో మార్కెట్ నిర్మించవచ్చని, అలా చేస్తే నెలకు రూ.80 లక్షలు అద్దె మిగులుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైవేట్ స్థలంలో ఉందని, ఈ స్థలాలు స్థానిక కమీషన్ ఏజెంట్లు, వారి బంధువులవేనని ఆయన ఆరోపించారు. మామిడి సీజన్ కోసం స్థలాలు తీసుకుని మూడు రెట్లు అధికంగా అద్దె చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు ఇబ్బందులే
–ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ‘ఫేస్ టు ఫేస్’లో వక్తలు హిమాయత్నగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల హామీలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని, అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని విమర్శించారు. ఆదివారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫేస్ టు ఫేస్’కార్యక్రమంలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో గన్ కల్చర్ పెరిగి, లాఅండ్ఆర్డర్ భ్రష్టు పట్టిపోయిందని అన్నారు. మహిళలు, చిన్నారులపై హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ ఓడిపోతామోననే భయంతో మైనార్టీల ఓట్ల కోసం అజహరుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టారని ఆరోపించారు. అనంతరం ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారం చేపట్టి 23 నెలలు గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా నెరవేర్చలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ డివిజన్లోని ఎర్రగడ్డ, బోరబండ ప్రాంతాలు ఎన్నో ఏళ్ల నుంచి అభివృద్ధికి ఎందుకు నోచుకోవడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. -
ఎజాజ్ ‘పిలిస్తే’ నైజీరియన్లూ ‘పలుకుతారు’!
నల్లజాతీయులకు నమ్మిన బంటుగా ఉన్న ఎజాజ్సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరాదిన ఉన్న మెట్రో నగరాల్లో డ్రగ్స్ సప్లయర్స్గా ఉన్న నైజీరియన్లు ఏ పెడ్లర్కీ కనిపించరు. కేవలం సోషల్మీడియా సంప్రదింపులతో, డెడ్ డ్రాప్ విధానంలో పని పూర్తి చేస్తారు. అయితే బెంగళూరులో స్థిరపడిన ఘరానా పెడ్లర్ ఎజాజ్ అహ్మద్కు ఉన్న డిమాండే వేరు. ఇతడు ఫోన్ చేస్తే పెద్ద పెద్ద సప్లయర్స్గా ఉన్న నల్లజాతీయులు ఇంటికి వచ్చి మరీ సరుకు ఇచ్చి వెళ్తారు. నగరంలో ఉన్న కస్టమర్కు డ్రగ్స్ డెలివరీ చేయడానికి వచ్చిన ఈ పెడ్లర్ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్కు (హెచ్–న్యూ) చిక్కినట్లు డీసీపీ వైవీఎస్ సుధీంద్ర ఆదివారం వెల్లడించారు. ఇతడి నుంచి రూ.12 లక్షల విలువైన నాలుగు రకాలైన మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బీటెక్ చదువు మధ్యలో ఆపేసి... బిహార్కు చెందిన ఎజాజ్ తండ్రి బడా సివిల్ కాంట్రాక్టర్. ఈ నేపథ్యంలోనే వీరి కుటుంబం కర్ణాటక–గోవా సరిహద్దుల్లో ఉన్న కార్వార్ ప్రాంతంలో స్థిరపడింది. బీటెక్ విద్యనభ్యసించడం కోసం ఎజాజ్ బెంగళూరుకు వచ్చారు. ఫోర్త్ ఇయర్ చదువుతూ మధ్యలోనే మానేసిన ఇతగాడు సివిల్ కాంట్రాక్టర్గా మారాడు. కొన్నాళ్లు సజావుగా సాగిన ఈ వ్యాపారంతో విలాసవంతమైన జీవనశైలికి అలవాటుపడ్డాడు. ఆపై నష్టాలు రావడంతో తన తండ్రితో కలిసి ఆయన కాంట్రాక్టులు చూసుకున్నాడు. 2020లో అమలైన లాక్డౌన్ సందర్భంలో స్నేహితుల రూమ్కు పరిమితమయ్యాడు. అక్కడ వారితో కలిసి డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించాడు. కస్టమర్ నుంచి పెడ్లర్గా మారి... కొన్నాళ్లకు తానే స్వయంగా నైజీరియన్ల వద్ద నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగించడం ప్రారంభించాడు. అప్పటికే తన విలాసాలకు అవసరమైన డబ్బు తేలిగ్గా సంపాదించడానికి అనువైన ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. అప్పుడే ఇతడికి తానే పెడ్లర్గా మారి కస్టమర్లకు సరఫరా చేస్తే లాభాలు ఉంటాయనే ఆలోచన వచ్చింది. ఇతడు కస్టమర్గా ఉండగా ఫోన్ చేసిన వెంటనే నైజీరియన్లు డ్రగ్స్ తీసుకువెళ్లి ఇంటి వద్ద ఇచ్చి వచ్చే వాళ్లు. అదే విధానం కొనసాగిస్తూ మాదకద్రవ్యాలు ఖరీదు చేస్తూ... బెంగళూరుతో పాటు హైదరాబాద్లో ఉన్న కస్టమర్లకు విక్రయిస్తున్నాడు. సోషల్మీడియా ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ తానే నేరుగా వచ్చి ‘క్యాష్ ఆన్ డెలివరీ’ విధానంలో లేదంటే కొరియర్ ద్వారా సరఫరా చేసేవాడు. బస్టాండ్లో ఉండి బైక్ ట్యాక్సీల ద్వారా... కొన్నిసార్లు సరుకుతో హైదరాబాద్ వచ్చే ఎజాజ్ తాను బస్సు దిగిన చోటే ఉండేవాడు. అక్కడ నుంచి కస్టమర్కు బైక్ ట్యాక్సీ ద్వారా సరుకు పంపిస్తుండేవాడు. కొరియర్ చేయాల్సి వస్తే వివిధ కాగితాల మధ్యలో ఈ డ్రగ్ ఉంచి పంపేవాడు. నగదు లావాదేవీలన్నీ ఆన్లైన్లో జరిగేవి. ఇతడు సరుకు తీసుకుని నగరానికి వస్తున్నాడని హెచ్–న్యూకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ జీఎస్ డానియేల్ నేతృత్వంలో ఎస్ఐ సి.వెంకట రాములు తమ బృందంతో మాసబ్ట్యాంక్ వద్ద కాపుకాశారు. ఎండీఎంఏ, కొకై న్, ఓజీ ఖుష్, ఎక్స్టసీ పిల్స్తో వచ్చిన ఎజాజ్ను మాసబ్ట్యాంక్ పోలీసుల సాయంతో పట్టుకున్నారు. ఇతడు బెంగళూరులో ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఓ గెటెడ్ కమ్యూనిటీలోని ఫ్లాట్లో నెలకు రూ.70 వేల అద్దెకు నివసిస్తున్నాడు. నైకీ బూట్లు, బఫెల్లో జీన్స్లు, ఎడిడాస్ టీషర్టులు మాత్రమే వాడుతుంటాడు. ఇతడి వినియోగదారులతో పాటు సప్లయర్లుగా ఉన్న నైజీరియన్లను గుర్తించడంపై హెచ్–న్యూ దృష్టి పెట్టింది. నగరానికి నాలుగు రకాలైన మాదకద్రవ్యాల సరఫరా డెలివరీ కోసం వచ్చి హెచ్–న్యూకు పట్టుబడిన వైనం రూ.12 లక్షల విలువైన 7.7 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం విద్యార్థులు, ఉద్యోగుల్లో అనేక మంది మాదకద్రవ్యాల వినియోగానికి అలవాటుపడి... అందుకు అవసరమైన డబ్బు కోసం వాళ్లే పెడ్లర్స్గా మారుతున్నారు. ఇలాంటి వారి వల్ల సమాజానికి పెను ముప్పు పొంచి ఉంది. ఇలాంటి వారిపై కన్నేసి ఉంచాలని కోరుతున్నాం. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మాదకద్రవ్యాల వినియోగం, క్రయవిక్రయాలపై సమాచారం తెలిస్తే 8712661601కు ఫోన్ చేసి తెలపండి. ఇలా సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతాం. – వైవీఎస్ సుధీంద్ర, డీసీపీ -
అంచనాలకు మించి!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మెట్రోజోన్ సహా మేడ్చల్, రంగారెడ్డిజోన్ల పరిధిలో ప్రస్తుతం 60 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 53 లక్షల గృహ, ఎనిమిది లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. కోర్సిటీలో పెద్దగా నిర్మాణాలు లేవు. కొత్త కనెక్షన్ల కోసం వస్తున్న దరఖాస్తులు కూడా అంతంతే. శివారులోని అమీన్పూర్, పటాన్చెరు, మేడ్చల్, కీసర, జీడిమెట్ల, హబ్సీగూడ, సరూర్నగర్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఇబ్రహీంబాగ్, షాద్నగర్ డివిజన్ల పరిధిలో కొత్తగా అనేక విల్లాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు, పరిశ్రమలు పుట్టకొస్తున్నాయి. వీరంతా విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. గ్రేటర్ జిల్లాల నుంచి ప్రతి నెలా 35 వేల మంది కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. మల్టీ స్టోరేజ్ భవనాలు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల కోసం పెద్ద సంఖ్యలో ఎల్టీఎం (లో టెన్షన్ మీటరింగ్) దరఖాస్తులు వస్తుంటాయి. 20 కిలోవాట్ల సామర్థ్యం మించితే విధిగా ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలనే నిబంధన ఉంది. 20 కిలోవాట్లు దాటిన ఏదైనా ఒక బహుళ అంతస్తుల భవనానికి విద్యుత్ కనెక్షన్ కావాలంటే ముందు డిస్కంకు దరఖాస్తు చేసుకోవాలి. లైన్ ఇన్స్పెక్టర్, ఏఈలు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎగ్జిస్టింగ్ లైన్కు కొత్తగా నిర్మించే భవనానికి మధ్య ఉన్న దూరం సహా అంత స్తులు, అందులోని ఫ్లాట్ల విస్తీర్ణం, భవిష్యత్తు విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అంచనాలు రూపొందిస్తారు. ఒకే తరహా పనికి ఒక్కో ఇంజనీర్ ఒక్కో విధంగా ఎస్టిమేషన్లు వేస్తున్నారు. ముందే అడిగినంత ముట్టజెప్పిన వారికి తక్కువ ఖర్చుతో, నిరాకరించిన వారికి ఎక్కువ ఖర్చుతో ఎస్టిమేషన్లు వేస్తున్నారు. దీనిలో పది శాతం సూపర్ వైజింగ్ చార్జీని డిస్కంకు చెల్లించి.. వినియోగదారుడే స్వయంగా ఆ పనిని ప్రైవేటు కాంట్రాక్టర్లతో చేయించుకోవాల్సి ఉంది. అడ్డగోలు వ్యవహారాలు క్షేత్రస్థాయిలోని కొంత మంది ఏఈలు వర్క్ ఎస్టిమేషన్ల పేరుతో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నారు. చేయి తడిపితే ఒకలా.. లేదంటే మరోలా అంచనాలు తయారు చేస్తున్నారు. ఆశించిన విధంగా ఎస్టిమేషన్ తయారు చేయాలంటే ముందే ఏఈకి రూ.20 వేలు, ఏడీఈ రూ.10 వేలు, డీఈకి రూ.10 వేలు, ఎస్ఈకి రూ.10 వేలు చెల్లించాల్సి వస్తోంది. తర్వాత వర్క్ఆర్డర్కు ఏఈ, ఏడీఈలకు రూ.10 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇలా ఒక్కో పనికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. మెటీరియల్ ధరల్లోనూ భారీ వ్యత్యాసాలు ఉండటం ఇబ్బందిగా మారింది. బహిరంగ మార్కెట్లో రూ.10 వేలకు లభించే వస్తువుకు.. డిపార్ట్మెంట్లో రూ. 15 వేలకుపైగా ఖర్చవుతోంది. తీరా పని పూర్తయిన తర్వాత డీటీఆర్ చార్జింగ్ సమయంలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లకు లింకు పెట్టి లైన్ ఇన్స్పెక్టర్ మొదలు ఉన్నతాధికారుల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అదనపు చెల్లింపులు భారంగా మారుతుండటంతో విధిలేని పరిస్థితుల్లో వినియోగదారులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఇటీవల ఎక్కువగా ఏడీఈలు, ఏఈలు, లైన్ ఇన్స్పెక్టర్లు ఏసీబీకి పట్టుబడుతుండమే దీనికి నిదర్శనం. ఇప్పటికే ఒకసారి పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లు రెండోసారి కూడా ఇదే కేసులో పట్టుబడుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. పెద్ద అంబర్పేట్ లైన్ ఇన్స్పెక్టర్ సహా మెదక్ డీఈ కూడా రెండు సార్లు ఏసీబీకి చిక్కిన వాళ్ల జాబితాలో ఉండటం గమనార్హం. శివారు ప్రాంతానికి చెందిన ఓ వినియోగదారుడు తనకున్న మూడు వందల గజాల్లో నాలుగు అంతస్తుల భవనం నిర్మించాడు. ఒక్కో ఫ్లోర్లో రెండు ఫ్లాట్ల చొప్పున మొత్తం ఎనిమిది త్రీఫేజ్ విద్యుత్ మీటర్లకు దరఖాస్తు చేసుకున్నాడు. ఒక్కో మీటర్ ఐదు కిలోవాట్ల చొప్పున మొత్తం 40 కిలోవాట్లు డిమాండ్ ఉన్న ఈ భవనానికి ఎగ్జిస్టింగ్ మీటర్తో కలిపి విద్యుత్ డిమాండ్ 45 కిలోవాట్లకు చేరింది. ఇందుకు 63 కేవీఏ సామర్థ్యంతో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, 35 స్క్వైర్ ఎంఎం సామర్థ్యంతో 11 కేవీ కేబుల్, ఒక పోలు, ఒక ఏబీ స్విచ్, ఫ్యూజ్ సర్క్యూట్, డీటీఆర్ బాక్స్, ఐదు ఎర్తింగ్ ఫిట్స్, డీటీఆర్ నుంచి ప్యానల్ బోర్డు వరకు కేబుల్, ఒక ప్యానల్ బోర్డు అవసరం. ఇందుకు సుమారు రూ.2.50 లక్షలు ఖర్చవుతుంది. అవగాహన లేమి, అడిగినంత ఇవ్వలేదనే సాకుతో సదరు ఇంజినీరు ఇదే పనికి అంచనాలకు మించి ఎస్టిమేషన్ వేసినట్లు తెలిసింది. ఒకే పనికి భిన్నంగా ఎస్టిమేషన్లు ఒక్కో ఇంజినీరు ఒక్కో విధంగా రూపకల్పన అడిగినంత ఇస్తే కాస్ట్ తగ్గింపు.. లేదంటే పెంపు వర్క్ ఆర్డర్లు, ఎన్ఓసీల పేరుతో అడ్డగోలు వసూళ్లు ఏఈ నుంచి ఎస్ఈ వరకు చేయి తడపాల్సిందే.. డిస్కంలో అవినీతి తంతుశివారులోని కాటేదాన్, హిమాయత్సాగర్, శంషాబాద్, చిలుకూరు, మోకిల, శంకర్పల్లి, మొయినాబాద్, జీడిమెట్ల, కీసర, మేడ్చల్, షాపూర్నగర్, ప్రగతినగర్, బోయినపల్లి, నారపల్లి, వనస్థలిపురం, పెద్ద అంబర్పేట్, తుర్కయంజాల్ వంటి శివారు సెక్షన్ల పరిధిలోని ఇంజనీర్లు ఎస్టిమేషన్లు, వర్క్ ఆర్డర్ల పేరుతో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఒకరి తర్వాత మరొకరు ఏసీబీకి పట్టుబడుతున్నారు. ఆరు నెలల తర్వాత తిరిగి అదే పోస్టులో చేరి.. మళ్లీ ఏసీబీకి చిక్కుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
● ముగ్గురు యువకులకు గాయాలు ● బీబీనగర్లో ఘటనబీబీనగర్, రాజాపేట: రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపేట మండల కేంద్రానికి చెందిన గర్ధాసు నర్సింహులు, మహేశ్వరి దంపతుల కుమారుడు గర్ధాసు ప్రశాంత్(32)కు వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం తీగారం గ్రామానికి చెందిన ప్రసూన(28)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వారు ప్రస్తుతం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్లోని టెలిఫోన్ కాలనీలో నివాసముంటున్నారు. ప్రశాంత్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం భార్యాభర్తలిద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై భువనగిరి వైపు వస్తూ.. బీబీనగర్ పెద్ద చెరువు వద్ద హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి పక్కన ఆగారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న మహేంద్ర థార్ వాహనం వారిని ఢీకొట్టింది. దీంతో ప్రసూన బైక్తో పాటు చెరువులో పడిపోగా ప్రశాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చెరువులో పడిన ప్రసూనను బయటకు తీయగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహేంద్ర థార్ వాహనంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ షణ్ముఖ్తో పాటు డోర్నాల భార్గవ్, కొండ సైరిత్కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గర్ధాసు ప్రశాంత్ మృతితో రాజాపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. హిమాయత్నగర్: మానవీయ సమాజం కోసం జీవితకాలమంతా పోరాడిన వ్యక్తి ప్రొఫెసర్ సాయిబాబా అని, ఈ విషయంపై సమాజంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ప్రొ.సాయిబాబా స్మారకోపన్యాసంలో భాగంగా ‘అసమ్మతి గళాలు–సాహిత్యం, ప్రజాస్వామ్య వరివర్తనలు రచయితల పాత్ర’ అనే అంశంపై చర్చా కార్యక్రమం ప్రొఫెసర్ హరగోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కవి, రచయిత్రి మీనా కందస్వామి, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి, ఆర్ధికవేత్త డి.నరసింహారెడ్డి హాజరై మాట్లాడారు. ముందుగా హరగోపాల్ అధ్యక్షోపన్యాసం చేస్తూ తాను నమ్మిన విశ్వాసం కోసం ప్రొఫెసర్ సాయిబాబా తన జీవితాన్ని ధారపోశారని అన్నారు. పదేళ్ల పాటు జైలులో ఉన్నా అధైర్య పడలేదన్నారు. జైలు నుంచి బయటకొచ్చాక సమాజానికి చాలా సేవ చేయాల్సిన దశలో సాయిబాబా మన మధ్య లేకపోవడం విషాదకరమని అన్నారు. ఈ సమావేశంలో సాయిబాబా మెమోరియల్ కమిటీ సభ్యులు రాందేవ్, కాత్యాయని విద్మహే, సాయిబాబా కూతురు మంజీర తదితరులు పాల్గొన్నారు. నాలుగో అంతస్తు పైనుంచి కిందపడి...కవాడిగూడ: ఓ భవనానికి పెయింటింగ్ వేస్తూ నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ పెయింటర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ స్ట్రీట్ నెంబర్ 5 రత్నం రేఖ అపార్ట్మెంట్ వద్ద చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎండీ అంజద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం..ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన బానోతు వీరన్న (45) వృత్తిరిత్యా పెయింటర్. ఆదివారం ఉదయం 10.30 గంటలకు రత్నరేఖ అపార్ట్మెంట్లో నాలుగోఅంతస్తులో పెయింటింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద జారిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న దోమలగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందిన వీరన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. -
జూబ్లీహిల్స్లో పేదలకోసం పనిచేసే వ్యక్తికే ఓటు వేయండి
● జస్టిస్ చంద్రకుమార్ పంజగుట్ట: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కాకుండా వామపక్ష, సెక్యులర్ భావాలు ఉండి, పేద ప్రజలకోసం ఆలోచించే వారికి ఓటు వెయ్యాలని జాగో తెలంగాణ వ్యవస్థాపకుడు జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మతతత్వ బీజేపీ, 10 సంవత్సరాల పాటు తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్కు ఓటు వెయ్యరాదని తాము ప్రచారం చేసి, కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ఎంతో తోడ్పాటు ఇచ్చామని పేర్కొన్నారు. కానీ గెలిచిన తరువాత రేవంత్ ప్రభుత్వం అదానీకి కాంట్రాక్ట్లు ఇవ్వడం, మతతత్వ పార్టీ అయిన ఎంఐఎంను దగ్గరకు తియ్యడం, రైతులనుంచి భూములు లాక్కోవడం వంటి చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జాగో తెలంగాణ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లో మన స్టాండ్ ఎటు అనే అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. కేంద్రం కార్పొరేట్ కంపెనీలకు అనుకూల విధానాన్ని అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో కేవలం 350 కుటుంబాల వద్ద 167 లక్షల కోట్ల ఆస్తి ఉండటమే ఇందుకు నిదర్శనమని అన్నారు. సీఎం రేవంత్రెడ్డికి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. -
మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకం
● ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, ఐద్వా వ్యవస్థాపకుల్లో ఒకరైన మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకమని ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతి కొనియాడారు. మల్లు స్వరాజ్యం జీవితానికి సంబంధించిన ‘నా మాట తుపాకి తూటా’ ఆంగ్ల అనువాదం ‘ది ఫైర్ ఆఫ్ డెఫియెన్స్’ పుస్తకాన్ని పుణ్యవతి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. వీరోచిత పోరాటానికి మారు పేరుగా నిలిచిన మల్లు స్వరాజ్యం జీవితాన్ని ప్రపంచమంతా తెలుసుకునేలా ఆమె జీవితం, ఉద్యమ చరిత్రను ఆంగ్లంలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఐద్వా జాతీయ అధ్యక్షురాలు ఆర్.అరుణ జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఉపాధ్యక్షురాలు టి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. సందడిగా తెలుగు–వెలుగు ఖైరతాబాద్: యువ భారతి, ఐఐఎంసీ కళాశాల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం లక్డీకాపూల్లోని ఐఐఎంసీ కళాశాలలో తెలుగు వెలుగు కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి మొదట ఆచార్య ఫణీంద్ర రచించిన భారత భారతి, డాక్టర్ కె.వి. కృష్ణ కుమారి రచించిన భద్రా కళ్యాణం గ్రంథాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మహాభారతం మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దే మహాకావ్యమని అన్నారు. యువభారతి వ్యవస్థాపక సమావేశకర్త, ఐఐఎంసీ కళాశాల చైర్మన్ వంగపల్లి విశ్వనాథం మాట్లాడుతూ తెలుగు భాషా సాహిత్యాలను వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో తెలుగు వెలుగు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువభారతి ప్రధాన సంపాదకులు బి.జయరాములు తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడున్నారు.. ఎందరున్నారు?
సిటీ పోలీసులో మ్యాన్పవర్ ఆడిటింగ్ సాక్షి, సిటీబ్యూరో: మానవ వనరుల కొరత ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఉన్న సిబ్బందినే సద్వినియోగం చేసుకుంటాం. దీనికోసం మ్యాన్పవర్ ఆడిటింగ్ నిర్వహిస్తాం. ప్రస్తుతం నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ అదే పని చేస్తున్నారు. సిటీ కమిషనరేట్లో ఉన్న ఆయా సెక్షన్లతో పాటు అక్కడ పని చేస్తున్న సిబ్బందిపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గురువారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వెలుగులోకి వచ్చిన అంశాలతో కీలక ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్లో తీవ్ర కొరత.. ప్రస్తుతం నగర పోలీసు విభాగంలో కేటాయించిన పోస్టుల్లో 29 శాతం ఖాళీగానే ఉన్నాయి. దీనికితోడు హోంగార్డుల సేవల్ని వినియోగించాల్సిన చోట కానిస్టేబుళ్లను నియమించారు. మరికొందరు కానిస్టేబుళ్లకు మినిస్టీరియల్ స్టాఫ్ విధులు అప్పగించడంతో ఆ పని చేయాల్సిన వాళ్లు ఖాళీగా ఉంటున్నారు. అనేక సెక్షన్లలో సక్రమంగా విధులకు హాజరు, సమయపాలన, బాధ్యతల నిర్వహణ, వాల్యూ ఎడిషన్ వంటివి లోపించాయని కొత్వాల్కు ఫిర్యాదులు అందాయి. గడచిన నెల రోజుల పరిశీలనలోనూ ఆయన ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో పరిస్థితుల్లో మార్పు తీసుకురావడంతో పాటు మ్యాన్పవర్ ఆడిటింగ్లో భాగంగా ఆయన గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కమిషనరేట్లోని ప్రతి ఫ్లోర్లో ఉన్న సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించాలని, వాటిని కమిషనర్ ఛాంబర్కు అనుసంధానించాలని స్పష్టం చేశారు. హోంగార్డులకు బదులు కానిస్టేబుళ్ల వినియోగం.. అధికారులకు సహకరించే, రోజువారీ విధుల్లో హోంగార్డులు ఉండాల్సిన చోట కానిస్టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు కొత్వాల్ గుర్తించారు. ఈ కారణంగా వివిధ ఠాణాల్లో పని చేయాల్సిన కానిస్టేబుళ్లు ఎటాచ్మెంట్పై కమిషనరేట్లో ఉంటున్నారు. సంఖ్యాపరంగా ఆ ఠాణాలోనే పని చేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వాస్తవాలు వేరుగా ఉంటున్నాయి. మరోపక్క అడ్మినిస్ట్రేషన్ విధుల్లో కానిస్టేబుళ్లు ఉండటంతో ఆ పని చేయాల్సిన మినిస్టీరియల్ స్టాఫ్లో కొందరు ఖాళీగా ఉంటున్నారు. దీనికి పరిష్కారంగా సజ్జనర్ గురువారం కీలక ఆదేశాలు ఇచ్చారు. 74 పోస్టుల్లో పని చేస్తున్న కానిస్టేబుళ్లను వారివారి పోస్టింగ్స్ ఉన్న ఠాణాలకు తక్షణం పంపాల్సిందిగా స్పష్టం చేశారు. మినిస్టీరియల్ బాధ్యతల్లో ఉన్న వారిని దశల వారీగా బదిలీ చేయాలని పేర్కొన్నారు మినిస్టీరియల్ సిబ్బంది సైతం సద్వినియోగం.. ● మినిస్టీరియల్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించడం, వారి సేవల్ని వినియోగించుకోవడంలోనూ కొన్ని లోపాలు ఉన్నట్లు కొత్వాల్ గుర్తించారు. ఎంఏ ఇంగ్లిష్ చదివి, మంచి డ్రాఫ్టింగ్ నైపుణ్యం ఉన్న వారు సాధారణ ఫైల్స్ పర్యవేక్షించే విధుల్లో ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఎంబీఏ, ఎంసీఏ తదితర ఉన్నత విద్య అభ్యసించిన వారి సేవల్నీ అవసరమైన ప్రాంతాల్లో వినియోగించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందికి కూడా సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, తక్కువ సమయంలో.. తేలిగ్గా ఎక్కువ ఫైల్స్ క్లియర్ చేయడం తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ● నగర వ్యాప్తంగా గస్తీ నిర్వహించే పెట్రోలింగ్ వాహనాలన్నీ ప్రధాన కంట్రోల్రూమ్తో అనుసంధానించి ఉంటాయి. ఈ విభాగాన్నీ పరిశీలించిన కొత్వాల్ సజ్జనర్ ఆ వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించారు. వీటిని సరిచేయడంతో పాటు గస్తీ నిర్వహించాల్సిన సమయంలో ఏదైనా వాహనం ఆగి ఉంటే వెంటనే అలర్ట్ వచ్చేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలని సూచించారు. అన్ని స్థాయిల్లోని సిబ్బంది, అధికారుల పని తీరును తానే స్వయంగా మదిస్తూ ఉంటానని, ఉత్తమ పనితీరును ప్రశంసించడంతో పాటు నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. . మానవ వనరుల సద్వినియోగంపై కొత్వాల్ దృష్టి విభాగాల వారీగా సిబ్బంది వివరాల సేకరణ వివిధ సెక్షన్లలో ఆకస్మిక తనిఖీలు కమిషనర్ ఛాంబర్కు సీసీ కెమెరాల అనుసంధానం పలు సర్దుబాట్లకు వీసీ సజ్జనర్ ఆదేశాలు -
ముష్కి చెరువులో ఆక్రమణలు తొలగిస్తాం
హైడ్రా కమిషనర్ రంగనాథ్ మణికొండ: నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల సరిహద్దులోని ముష్కి చెరువులోని ఆక్రమణలను తొలగిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన కార్యాలయంలో చెరువు సమీప ప్రాంతాల నివాసితులు, రైతులు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెరువు పరిరక్షణకు పోరాటం చేస్తున్న నివాసితుల ప్రతినిధి గౌతంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వారం రోజుల్లో చెరువును పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారన్నారు. ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలో పట్టా భూములు ఉంటే పరిహారం ఇచ్చి వాటిని స్వాధీనం చేసుకుని చెరువును రికార్డుల ప్రకారం 60 ఎకరాలలో పునరుద్ధరిస్తామన్నారు. అనంతరం చెరువును సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన తత్త్వ ఆర్గనైజేషన్ వారికి అప్పగిస్తామని, వారు అభివృద్ధి పనులు చేపడతారన్నారు. అంతలోపు చెరువు కట్ట అభివృద్ధి పనులను చేపట్టాలని వారికి కమిషనర్ సూచించారన్నారు. రైతులతో పాటు పక్కనే ఉన్న సంకట హర హనుమాన్ దేవాలయ భూములకు హద్దులు నిర్ణయిస్తామన్నారు. సమావేశంలో ఇరిగేషన్ డీఈ రమాదేవి, ఏఈ నరేంద్ర, రైతులు బట్ట సత్యనారాయణ, బట్టరాజు, నివాసితులు గౌతంరెడ్డి, లింగరాజు, రవీంద్రచారి పాల్గొన్నారు. -
మైనారిటీలతోనే మెజారిటీ!
సాక్షి,సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనారిటీలు కీలకపాత్ర పోషించనున్నారు. వీరి మద్దతు ఏ అభ్యర్థికై తే ఉంటుందో వారు గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిర్వహించిన సమగ్ర కుటుంబ (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల) సర్వే మేరకు నియోజకవర్గంలో మైనారిటీల జనాభా దాదాపు 24 శాతం ఉన్నట్లు సమాచారం. అందుకే ఇప్పుడు అన్ని పార్టీలూ మైనారిటీ ఓట్లపై కన్నేశాయి. వీరు ఎవరి వైపు ఉంటే వారిదే విజయమనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అజహరుద్దీన్కు మంత్రి పదవి.. దానిపై ఎన్నికల సంఘానికి బీజేపీ నేతల ఫిర్యాదు.. ప్రతిగా కాంగ్రెస్ ఎదురుదాడి.. తదితరమైనవి సైతం మైనారిటీ ఓట్ల దృష్టితోనే అని తెలుస్తోంది. పెద్ద నేతలే కాదు.. డివిజన్ స్థాయిలో అంతోఇంతో పేరు, పలుకుబడి ఉన్న వారు సైతం ఓట్లను ప్రభావితం చేయగలరనే అభిప్రాయాలున్నాయి. అందుకే అన్నిపార్టీలూ వారి ఓట్లను తమ విజయావకాశాలకు కీలకమైనవిగా భావిస్తున్నాయి. ● ఇటీవలి కాలంలోనే మైనారిటీల్లో మంచి పేరున్న, పేదలకు సహాయం చేస్తారనే గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్, తదితర నేతలు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీలోని మైనారిటీ నేతల సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ వైఫల్యాలు, బీఆర్ఎస్లో వీరికి జరిగిన మేలు గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. అంతేకాదు, ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా కేటీఆర్.. తాను ఆటోలో ప్రయాణించిన మష్రత్ అలీకి గతంలో రెండు ఆటోలుండగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ రెండు ఆటోలు అమ్మి ఆటోడ్రైవర్ కూలీగా పని చేస్తున్నట్లు చెప్పడం తెలిసిందే. ఆటో కార్మికుల్లోనూ మైనారిటీలు గణనీయంగా ఉండటంతో వారు కూడా గెలుపు ఓటములను ప్రభావితం చేయగలరని భావిస్తున్నారు. బీఆర్ఎస్ మైనారీటీల మద్దతు కూడగడుతున్న నేపథ్యంలో మంత్రి సీతక్క బీఆర్ఎస్ డివిజన్ స్థాయి మైనారిటీ నాయకుడు సయ్యద్ సిరాజుద్దీన్ను కాంగ్రెస్ వైపు రప్పించారు. మైనారిటీలపై పార్టీలు చూపుతున్న శ్రద్ధకు ఇవి కొన్ని ఉదాహరణలు. ఈ నియోజకవర్గంలో బీసీ జనాభా కూడా ఎక్కువే అయినప్పటికీ, బీసీలు కులాల వారీగా చీలిపోయే అవకాశాలున్నాయి. మైనారిటీల్లోనూ బీసీలున్నారు. ఈ నేపథ్యంలోనే మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింల ఆశీస్సులున్న అభ్యర్థికే ఓట్ల మెజారిటీ లభిస్తుందని పలువురు భావిస్తున్నారు. వీరిపైనే ప్రధాన రాజకీయ పార్టీల నజర్ ఈ వర్గం ఓట్లతోనే ఆధిక్యతకు అవకాశం ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ యత్నాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తాజా చిత్రంకార్పొరేటర్లుగా వీరే.. నియోజకవర్గంలో ఆరు వార్డులు (కార్పొరేటర్ డివిజన్లు) ఉండగా, గత జీహెచ్ఎంసీ పాలకమండలి ఎన్నికల్లో మూడు డివిజన్ల నుంచి కార్పొరేటర్లుగా గెలిచింది కూడా మైనారిటీ అభ్యర్థులే కావడం గమనార్హం. వీరిలో ఎర్రగడ్డ కార్పొరేటర్ షాహీన్బేగం, షేక్పేట కార్పొరేటర్ మహ్మద్ రాషేద్ ఫరాజుద్దీన్లు ఎంఐఎం నుంచి గెలవగా, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ నుంచి గెలిచి, అనంతరం కాంగ్రెస్లో చేరారు. బాబా ఫసియుద్దీన్ గత పాలకమండలిలో డిప్యూటీ మేయర్గా పనిచేయడం తెలిసిందే. ఎర్రగడ్డ కార్పొరేటర్ షాహీన్బేగం మృతితో ఆ వార్దుకు తిరిగి ఎన్నిక జరగక ఇంకా ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలోనూ నియోజకవర్గంలో మైనారిటల ప్రభావం ఎక్కువేనని తెలుస్తోంది. -
ఫైళ్లు పంపండి.. పనులు చేసుకోండి!
ఏసీబీకి చిక్కకుండా అప్రమత్తంగా ఉండాలి సాక్షి, సిటీబ్యూరో: ‘ఉదయం ఫైళ్లు పంపించండి. సాయంత్రం సైలెంట్గా వచ్చి ‘పనులు’ పూర్తి చేసుకోండి. కానీ ఆర్టీఏ ఆఫీస్లో మాత్రం మీ కద లికలు కనిపించొద్దు’. ఏసీబీ తనిఖీల నేపథ్యంలో ఓ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ఇన్చార్జి ఆర్టీఓగా వ్యవహరిస్తున్న ఓ అధికారి దళారులకు ఇచ్చిన ఉపదేశం ఇది. ఏజెంట్లు, దళారుల కార్యకలాపాలకు, తమ అక్రమార్జనకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా నిర్విఘ్నంగా కొనసాగేందుకు సదరు అధికారి అమలు చేసిన సరికొత్త సందేశం ఇది. ఈ మేరకు ఆయన ఏకంగా తమ కార్యాలయం పరిధికి చెందిన ఏజెంట్లతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. ఉదయం అందజేసిన ఫైళ్లపై సాయంత్రం కార్యాలయ వేళలు ముగిసిన తర్వాత పనులు పూర్తి చేసుకొని వెళ్లాలని సూచించారు. లెర్న్గింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు, పర్మిట్లు, ఫిట్నెస్లు వంటి ప్రతి పనికి ఒక ధర నిర్ణయించి పౌరసేవలు అందజేసే అధికారులు కొన్ని చోట్ల గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్న వ్యవహారం ఇది. సికింద్రాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో పాటు ఇటీవల పలు చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలను నిర్వహించారు. దీంతో సదరు అధికారులు అప్రమత్తమై సరికొత్త పద్ధతిని అనుసరించడం గమనార్హం. ఏజెంట్ల మధ్య ఘర్షణ... ఒకవైపు పైకి ఏజెంట్లను అనుమతించకుండా కట్టడి విధిస్తున్నట్లు చెబుతున్న అధికారులు.. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా ఫైళ్లను తెప్పించుకొని పనులు చేసి పెడుతున్నారు. దీంతో అందరికీ అవకాశాలు లభించడం లేదని, ఆర్టీఏ సిబ్బందికి, ఎంవీఐలకు ‘టచ్’లో ఉండేవాళ్లకు మాత్రమే ప్రాధాన్యం లభిస్తోందని కొందరు దళారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ఏజెంట్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం గమనార్హం. ‘ఇక్కడ కనీసం 70 నుంచి 80 మంది ఏజెంట్లు ఉన్నారు. అందరి దగ్గర నుంచి ఆర్టీఏ కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఫైళ్లు సేకరించి తీసుకెళ్తున్నారు. కానీ అందరికీ తగినవిధంగా ప్రాధాన్యం లభించడం లేదు’అని ఓ ఏజెంట్ విస్మయం వ్యక్తం చేశాడు. ‘దరఖాస్తుదారుల నుంచి లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులకు కనీసం రూ.5000 వసూలు చేస్తే అందులో సగానికి పైగా అధికారులకే చెల్లించాల్సివస్తోందని, తమకు దక్కేది తక్కువేనని’ పేర్కొన్నాడు. గీతలుంటే రూ.3000 అదనం.. కార్లు, తదితర రవాణా, వ్యక్తిగత వాహనాల ఫిట్నెస్, రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణపై కొందరు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు వేధింపులకు పాల్పడుతున్నారని సికింద్రాబాద్ తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన ఓ ఏజెంట్ ఆరోపించారు. అధికారుల డిమాండ్ మేరకు ప్రతి బండికి నిర్ణీత ధర ప్రకారం కమీషన్ చెల్లించినప్పటికి బండికి చిన్న సొట్ట కనిపించినా, గీత ఉన్నా రూ.2000 నుంచి రూ.3000 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు చెప్పారు. రెట్టింపు వసూళ్లు.. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, చిరునామా మార్పులు, డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్స్, వాహనాల ఫిట్నెస్లు, రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ వంటి వివిధ రకాల పౌరసేవలపై రవాణాశాఖ విధించిన ఫీజులకు సుమారు రెట్టింపు చొప్పున దరఖాస్తుదారుల నుంచి ఏజెంట్లు వసూలు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్సుల్లో మార్పులు, చేర్పులకు: రూ.2000 కొత్తగా లెర్నింగ్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్లకు: రూ.5000 వాహనాల రీ–రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్కు: రూ.3000. దళారులకు ఆర్టీఏ అధికారుల సూచనలు గతంలో సికింద్రాబాద్తో పాటు పలు చోట్ల ఏసీబీ సోదాలు ఈ నేపథ్యంలో కొందరు అధికారుల సరికొత్త పంథా -
ఔటర్పై ‘నో పార్కింగ్’
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగురోడ్డుపై ప్రమాదాలను అరికట్టేందుకు ఐఆర్బీ ‘గోల్కొండ ఎక్స్ప్రెస్వే’ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘ఓఆర్ఆర్పై నో పార్కింగ్’ అనే ప్రచారం చేపట్టింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), ట్రాఫిక్ పోలీసులు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్)తో కలిసి నెల రోజుల ప్రచారం కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ‘ఓఆర్ఆర్పై పార్కింగ్ సురక్షితం కాదు’ అనే కీలకమైన సందేశాన్ని అందరికీ చేరవేయడం ఈ ప్రచారం లక్ష్యం. హైస్పీడ్ కారిడార్ మీద అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వాహనదారులకు అవగాహన కల్పించేందుకే దీన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ● 158 కిలోమీటర్ల పొడవున్న ఓఆర్ఆర్పై గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో కొన్నిచోట్ల వాహనాలను పార్కింగ్ చేయడంతో తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలావరకు లారీలు, ట్రక్కులను ఇలా పార్క్ చేయడంతో ఇవి వేగంగా వచ్చే వాహనదారులకు ప్రమాదకరంగా మారుతున్నట్లు గుర్తించారు. ప్రమాదాన్ని సూచించే లైట్లు లేదా రిఫ్లెక్టివ్ వార్నింగ్ పరికరాలు ఏవీ లేకుండానే ఇలా అక్రమంగా భారీ వాహనాలను పార్కింగ్ చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని భద్రతాధికారులు, నిపుణులు హెచ్చరించారు ఇది పార్కింగ్ జోన్ కాదు... హెచ్జీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తూ.. ఔటర్ రింగురోడ్డుపై వాహనాలు వేగంగా వెళ్లడానికే.. పార్కింగ్ కోసం కాదన్నారు. ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్ వే డైరెక్టర్ మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ అంతర్జాతీయ మొబిలిటీ కారిడార్ అని, అది హైదరాబాద్ వృద్ధి, సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. నెలరోజుల పాటు నిర్వహించే ఈ ప్రచారంలో ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్, దాని భాగస్వాములు కలిసి క్షేత్రస్థాయిలో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు, డిజిటల్ ప్రచారాలు, వాణిజ్య డ్రైవర్లతో, లాజిస్టిక్ సంస్థల నిర్వాహకులు, ప్రైవేటు వాహనాల యజమానులతో సెషన్లు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్వే ప్రచారం రహదారి భద్రతపై అవగాహన జీరో డెత్ కారిడార్ లక్ష్యంగా కార్యక్రమాలు -
నేటి నుంచి సీఎం రోడ్ షో
సాక్షి, సిటీబ్యూరో/వెంగళరావునగర్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్లలో ప్రసంగించనున్నారు. మొత్తం మూడు విడతలుగా వరుసగా రెండు రోజుల చొప్పున ఆరు రోజుల పాటు రోడ్ షో నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం వెంగళరావునగర్ డివిజన్ నుంచి రోడ్ షో ప్రారంభించనున్నారు. సాయంత్రం 7 గంటలకు యూసుఫ్గూడ చెక్పోస్ట్ ప్రధాన రహదారి నుంచి నిమ్స్ మీదుగా వెంగళరావునగర్ డివిజన్లో రోడ్ షో సాగుతుంది. రహమత్నగర్ చౌరస్తాలోని పీజేఆర్ విగ్రహం వద్ద సీఎం ఓపెన్ టాప్ వాహనంపై చేపల మార్కెట్ ప్రధాన రహదారి (జీటీఎస్ టెంపుల్కు వెళ్లే మార్గం) నుంచి జవహర్నగర్ అడ్డరోడ్డుకు చేరుకుంటారు. అక్కడ నుంచి జవహర్నగర్ మెయిన్్ రోడ్డు మీదుగా సాయిబాబా దేవాలయం సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహం (కృష్ణకాంత్ పార్క్ పక్కన) వద్దకు చేరుకుని అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సిద్ధార్థనగర్ కాలనీ, సిద్ధార్థనగర్ పార్కు మీదుగా వెంగళరావునగర్ కాలనీ, అయ్యప్పగ్రౌండ్, అక్కడ నుంచి మధురానగర్ కాలనీలోని వెల్లండి ఫుడ్స్, అనంతరం ఆల్సబ హోటల్ మీదుగా మైత్రీవనం చేరుకుంటారు. అక్కడి నుంచి ఎస్ఆర్నగర్ సిగ్నల్స్, ఇమేజ్ హాస్పిటల్, సాలిటేర్ బిల్డింగ్స్ సమీపంలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం రోడ్ షో సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కార్తీక దీపోత్సవం
ఇబ్రహీంపట్నం: కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకొని గురువారం పట్నంలోని భవాని నాగలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయంత్రం దీపోత్సవాన్ని నిర్వహించారు. శివలింగం, స్వస్తిక్, ప్రమిదల రూపాలను పూలతో అలంకరించి, అఖండ దీపాన్ని, ప్రమీదల్లోని దీపాలను భక్తులు భక్తి శ్రద్ధలతో వెలిగించారు. ఉసిరిక, మట్టి దీపాన్ని, వస్త్ర దానాలు శ్రావణ నక్షత్రం రోజు చేస్తే కోటి సోమవారాల వృత ఫలితం దక్కుతుందన్న విశ్వాసం భక్తుల్లో ఉంది. శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు చేసి, దీపాలను ఆలయంలోని అయ్యగారికి దానం చేశారు. -
‘లక్కీభాస్కర్ల’కు సిండికేట్ల ఒత్తిడి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: లక్కీ డ్రాలో వైన్షాపులు దక్కించుకున్నవారి నుంచి ఆయా షాపులను సొంతం చేసుకునేందుకు సిండికేట్లు రంగంలోకి దిగారు. ఈ వ్యాపారంలో కనీస అనుభవం లేని, తొలిసారిగా టెండర్లలో పాల్గొన్న లక్కీ భాస్కర్లను టార్గెట్ చేసుకుంటున్నారు. వారికి పలు ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఏడాదికి రూ.కోటి సహా దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలతో పాటు రెండేళ్లు గుడ్విల్ చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఇచ్చేందుకు నిరాకరిస్తున్న వాళ్లకు ఈ సిండికేట్ల నుంచి ఒత్తిడి మొదలైంది. ఆఫర్లకు తలొగ్గని వారికి తప్పని ఒత్తిళ్లు హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సరూర్నగర్, శంషాబాద్, వికారాబాద్ ఎకై ్సజ్ డివిజన్ల పరిధిలో 693 మద్యం షాపులకు టెండర్లు పిలువగా మొత్తం 36,266 మంది పోటీ పడ్డారు. టెండర్లు దాఖలు చేసిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. అత్యధిక దరఖాస్తులు సరూర్నగర్, శంషాబాద్ ఎకై ్సజ్ డివిజన్ల నుంచే వచ్చాయి. అయితే ఇప్పటికే ఈ లిక్కర్ వ్యాపారంలో అనుభవం ఉన్న వాళ్లు పెద్ద సంఖ్యలోనే దరఖాస్తు చేసుకున్నప్పటికీ..అదృష్టం వరించకపోవడంతో ఇతరులపై ఆధారపడాల్సి వచ్చింది. కొత్తగా షాపులు దక్కించుకున్న వాళ్లను గుర్తించి, వారికి పలు ఆఫర్లు ఇస్తున్నారు. అయినా ఇచ్చేందుకు నిరాకరించిన వాళ్లకు స్థానిక నేతలు, రాజకీయ అనుచరుల నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు. చేసేది లేక కొంత మంది సరెండర్ అవుతుండగా, మరికొంత మంది వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అయితే అంతర్గతంగా ఇంత జరుగుతున్నా.. ఆయా ఎకై ్సజ్ డివిజన్ల అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తుండటం కొసమెరుపు. ఇదిలా ఉంటే దుకాణాలను దక్కించుకున్న వాళ్లకు షాపింగ్ కాంప్లెక్స్ల యజమానులు చుక్కలు చూపిస్తున్నారు. అప్పటి వరకు రూ.10 వేల లోపే ఉన్న నెలవారి అద్దెలను అమాంతం పెంచేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ● ‘శేరిలింగంపల్లికి చెందిన ఓ మద్యం వ్యాపారి ఎప్పటిలాగే ఈ సారి కూడా వేర్వేరు క్లస్టర్లలోని పది మద్యం దుకాణాలకు పది టెండర్లు వేశాడు. లక్కీడ్రాలో ఆయనకు ఒక్క షాపు కూడా దక్కలేదు. పదేళ్లుగా ఇదే వ్యాపారంలో ఉండటం, వేరే వ్యాపారంలోకి వెళ్లేందుకు ఇష్టం లేకపోవడంతో ఎలాగై నా ఏదో ఒక షాపును చేజిక్కించుకోవాలని భావించాడు. మద్యం వ్యాపారంలో ఇప్పటి వరకు ఎలాంటి అనుభవం లేక పోయినా టెండర్ దాఖలు చేసి, లక్కీడ్రా లో షాపును దక్కించుకున్న వ్యక్తికి ఏటా రూ.కోటి ఆఫర్ చేయడంతో పాటు దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలతో పాటు గుడ్విల్ చె ల్లింపులకు సిద్ధమయ్యారు. ఇందుకు నిరాకరించిన సదరు లక్కీభాస్కర్ను ఎలా గైనా లొంగదీసుకోవాలని భావించి చివరకు స్థానికంగా ఉన్న ఓ కీలకనేత ద్వారా బెదిరింపులకు దిగాడు. మద్యం అమ్మకాలపై అనధికారిక ఆంక్షలు విధించాడు. చేసేది లేక చివరకు ఆయన సిండికేట్కు తలొంచాల్సి వ చ్చింది’ ● ‘సికింద్రాబాద్కు చెందిన ఓ మద్యం వ్యాపారి పలువురి పేరున జాతకం చూపించి మరీ టెండర్లు దాఖలు చేశారు. ఫీజుల రూపంలో రూ.కోటి వరకు ఖర్చు చేశారు. అదృష్టానికి బదులు..ఆయన్ను ఈ సారి దురదృష్టం వెంటాడింది. లక్కీడ్రాలో ఒక్క షాపు కూడా దక్కలేదు. అయితే లాటరీలో మద్యం షాపును దక్కించుకున్న వ్యక్తిని కలిశారు. ఆ షాపులో అంత ఆదాయం వచ్చే అవకాశం లేక పోయినా కేవలం వ్యాపారానికి దూరంగా ఉండలేక లక్కీ భాస్కర్ పెట్టిన డిమాండ్లకు తలొగ్గాల్సి వచ్చింది.షాపులు దక్కించుకున్న వారితో బేరసారాలు ఒక్కో షాపునకు ఏడాదికి రూ.కోటి చొప్పున ఆఫర్ అప్లికేషన్ ఫీజు సహా రెండేళ్లు గుడ్విల్ ఇచ్చేందుకు అంగీకారం -
వ్యూస్ కోసం విలువలు వదిలేస్తారా?
వ్యూస్, లైక్స్తో పాటు సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్తును ఫణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం? ఇది విలువలను వదిలేయడంతో సమానం. మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించొద్దు. అలా చేయడం బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు..చట్టరీత్యా నేరం. బాలబాలికల్ని ఇలాంటి కంటెంట్లో భాగం చేయడం చైల్డ్ ఎక్స్ప్లాయిటేషనే అవుతుంది. ఇప్పటికే ఉన్న కంటెంట్ను తొలగించకున్నా, భవిష్యత్తులో అప్లోడ్ చేసినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఇలాంటి వీడియోలు, రీల్స్ గమనిస్తే 1930కు ఫోన్ చేసి లేదా (cybercrime. gov.in) ద్వారా ఫిర్యాదు చేయండి. పిల్లల బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం కూడా తల్లిదండ్రుల బాధ్యతే. – వీసీ సజ్జనర్, నగర కొత్వాల్ -
జూబ్లీహిల్స్లో గెలుపే లక్ష్యం
తెలంగాణకు కేసీఆర్ కుటుంబం ద్రోహం చేసింది ● తెలంగాణ ఇచ్చింది సోనియానే.. ● ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ వెంగళరావునగర్: రాష్ట్రం కోసం ఎంతో మంది బలిదానాలు చేశారని, వాటిని గుర్తించిన సోనియా గాంధీ చివరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. యూసుఫ్గూడ డివిజన్ పరిధిలోని మహమ్మద్ ఫంక్షన్హాల్, సోమాజిగూడ డివిజన్ పరిధిలోని శాలివాహననగర్ ఫంక్షన్హాల్లో గురువారం జరిగిన బూత్కమిటీ సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. తెలంగాణను అభివృద్ధి చేస్తారని నమ్మి ప్రత్యేక రాష్ట్రం ఇస్తే..కేసీఆర్ కుటుంబం ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. సన్నబియ్యం ఇచ్చింది, కేవలం మన రాష్ట్రంలో మాత్రమేనని, ఈ ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో చివరి ఓటరు ఓటు వేసే వరకు బూత్ కమిటీ ఇన్చార్జిలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈవీఎంలకు తాళాలు వేసిన తర్వాతనే రిలాక్స్ కావాలని సూచించారు. జూబ్లీహిల్స్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంది.. పీసీసీ అధ్యక్షులు మహేష్కుమార్ గౌడ్ మాట్లాడుతూ జనాభా నిష్పత్తిని బట్టి తెలంగాణాలో బీసీలకు 42 రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు. చివరి వరకు కూడా తాము ఇచ్చిన మాటకు నిలబడి ఉంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధిని చూసి తట్టుకోలేకనే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తుందని అన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్కు లక్ష మెజార్టీ రావాలంటే కనీసం 70 శాతం ఓటింగ్ జరిగేలా చూడాలని, ప్రతి ఇంటికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేయాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని ఆయా పార్టీలను నమ్మవద్దన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఓట్లు అడగానికి వస్తే తమకేమి చేశారని, ఎందుకు మీకు ఓటు వేయాలని ప్రశ్నించాలని మంత్రులు సూచించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్యాదవ్ మాట్లాడుతూ అధిష్టానం తనపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చిందని, అధిస్టానం గౌరవం నిలబెట్టాలంటే ఇక్కడ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలని చెప్పారు. గత పదేళ్ళలో జూబ్లీహిల్స్లో అభివృద్ధి మాట దేవుడెరుగు నేతలు, కార్యకర్తలకు, ప్రజలకు అన్యాయమే ఎక్కువగా జరిగిందన్నారు. శుక్రవారం జరగనున్న నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అనిల్కుమార్ యాదవ్, పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, కార్పొరేటర్లు సి.ఎన్.రెడ్డి, విజయారెడ్డి, మాజీ కార్పొరేటర్ సంజయ్గౌడ్, సీనియర్ నాయకులు భవానీశంకర్, నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఓట్చోర్ సంతకాల సేకరణ పత్రాలను పంపిణీ చేశారు. -
రోడ్ సేఫ్టీపై స్పెషల్ డ్రైవ్
● రాత్రింబవళ్లు కొనసాగుతున్న పనులు 16 వేల పాట్హోల్స్కు మరమ్మతులు సాక్షి, సిటీబ్యూరో: ఇటీవలి వర్షాలకు దారుణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై జీహెచ్ఎంసీ సీరియస్గా దృష్టిసారించింది. రోడ్డు భద్రతను దృష్టిలో పెట్టుకుని రాత్రింబవళ్లు మరమ్మతు పనులు ముమ్మరంగా చేస్తోంది. వర్షాలు తెరిపినివ్వడంతో పగలూ రేయీ పనులు చేస్తున్నట్లు, మిషన్మోడ్లో పనులు జరుగుతున్నాయని ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు 18 వేలకు పైగా పాట్హోల్స్ గుర్తించగా, ఇప్పటి వరకు దాదాపు 16 వేల పాట్హోల్స్ పనులు పూర్తయినట్లు చీఫ్ ఇంజినీర్ రత్నాకర్ సహదేవ్ (మెయింటనెన్స్) తెలిపారు. నగర ప్రజల ప్రయాణం సాఫీగా సాగేందుకు, ట్రాఫిక్ జామ్లు లేకుండా ఉండేందుకు రోడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్లో భాగంగా పగలూ రేయీ పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశాలకనుగుణంగా, తిరిగి వర్షాలు రాకముందే వందశాతం పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాట్హోల్స్ పూడ్చివేతల పనులతోపాటు క్యాచ్పిట్స్ రిపేర్లు, దెబ్బతిన్న మూతల మార్పిడి, సెంట్రల్ మీడియన్ల మరమ్మతులు సైతం జరిగేలా చీఫ్ ఇంజినీర్ వరకు క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు 805 క్యాచ్ పిట్స్ రిపేర్లు, 388 మూతల మార్పిడితో పాటు పలు ప్రాంతాల్లో సెంట్రల్ మీడియన్ పనులు కూడా జరిగినట్లు ఇంజినీర్లు పేర్కొన్నారు. జోన్ల వారీగా వివరాలు.. ఎల్బీనగర్ జోన్లో 3042 పాట్హోల్స్, చార్మినార్ జోన్లో 2415, ఖైరతాబాద్ జోన్లో 24539, శేరిలింగంపల్లి జోన్లో 1763, కూకట్పల్లి జోన్లో 2508,సికింద్రాబాద్ జోన్లో పాట్హోల్స్ మరమ్మతులు పూర్తయినట్లు కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు. ప్రజలకు ఇళ్ల నుంచి పని ప్రదేశాలకు రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తకుండా , ట్రాఫిక్ జామ్లు కాకుండా రోడ్ల మరమ్మతు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బుద్ధి చెప్పాలి
శ్రీనగర్కాలనీ: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ప్రజలను మోసం చేసిందని, ప్రజలను అభివృద్ధికి దూరంగా ఉంచిన కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రజలు తగు బుద్ది చెప్పాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఎర్రగడ్డలో బీజేపీ బూత్స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాంటే బీజేపీకి అధికారాన్ని ఇవ్వాలని కోరారు. బీజేపీతోనే దేశం సుభిక్షంగా ఉందని, నియోజకవర్గంలో ప్రజలందరూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తూ, అవినీతిని అధికం చేసే కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లో చేరుతారని, కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరి పార్టీ ఫిరాయింపులతో వారి అవినీతిని కాపాడుకుంటున్నారని కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. మజ్లిస్ పార్టీకి అభివృద్ధి, ప్రజా సమస్యలు అవసరం లేదని, కేవలం మత రాజకీయాలు మాత్రమే చేస్తుందని ఆరోపించారు. ఎవరు అధికారంలో ఉంటే వారికి వత్తాసు పలికే పార్టీ మజ్లిస్ అని అన్నారు. జూబ్లీహిల్స్లో భారతీయ జనతాపార్టీ అభ్యర్థి దీపక్రెడ్డిని గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్రెడ్డి, స్టేట్ జనరల్ సెక్రటరీ గౌతమ్రావు, సారంగపాణి, ఎర్రబల్లి ప్రదీప్రావు, డాక్టర్ చేకూరు హనుమంతనాయుడు, విజయ్కుమార్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం.. కార్యకర్తల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి -
అమీర్పేటలో ముంపు సమస్యకు చెక్
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలో ఏమాత్రం వర్షం కురిసినా రహదారులన్నీ జలమయం అవుతాయి. అమీర్పేట చుట్టుపక్కల ప్రాంతాల విషయం విడిగా చెప్పక్కర్లేదు. ఇక్కడి సమస్యల్ని అధ్యయనం చేసిన హైడ్రా నాలాల పూడిక తీతే తొలి పరిష్కారంగా గుర్తించింది. జీహెచ్ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ అధికారులతో కలిసి ముందుకు వెళ్లింది. ఫలితంగా మైత్రీవనంతో పాటు గాయత్రినగర్ చుట్టపక్కల ప్రాంతాల్లో ముంపు సమస్య తప్పింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం ఆయా ప్రాంతాల్లో పర్యటించి పనులను పర్యవేక్షించారు. జూబ్లీహిల్స్, గాయత్రీ హిల్స్, యూసుఫ్గూడ, కృష్ణానగర్, మధురానగర్, శ్రీనివాసనగర్ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు అమీర్పేట నుంచి ముందుకు వెళ్లడానికి అనేక అడ్డంకులు ఉండేవి. దీంతో ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల రహదారిపై భారీగా నిలిచిపోయేవి. అమీర్పేట జంక్షన్లో సారథీ స్టూడియోస్, మధురానగర్ వైపు నుంచి వచ్చే పైపులైన్లు కలుస్తాయి. దీంతో ఎగువ నుంచి వరదతో పాటు భారీ మొత్తంలో చెత్త కూడా వాటి ద్వారా అక్కడకు చేరుతోంది. అలా దశాబ్దాలుగా చేరిన చెత్తతో అమీర్పేట జంక్షన్లో ఆరు పైపులైన్లు పూడుకుపోయాయి. దీంతో కొంత మొత్తంలోనే వరద నీరు ముందుకు సాగేది. శ్రీనివాస నగర్ వైపు వరద కాలువ పైన కాంక్రీట్తో వేసిన పైకప్పు తెరచి పూడిక తీత పనులను హైడ్రా చేపట్టింది. పరుపులు, దిండ్లు ఇలా చెత్తతో మూసుకుపోయిన పైపులైన్లను తెరచింది. ఇప్పటి వరకూ దాదాపు 45 ట్రక్కుల మట్టిని తొలగించింది. దీంతో ఇటీవల అక్కడ 10 సెంటీమీటర్ల వర్షం పడినా ఇబ్బంది కలగలేదు. మరో మూడు పైపు లైన్లలో కూడా పూడికను తొలగిస్తే 15 సెంటీమీటర్ల వర్షం పడినా అమీర్పేటలో వరద ముంచెత్తదని అధికారులు చెప్తున్నారు. ఇదే మాదిరి నగరంలోని ముంపు సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో కల్వర్టులు, అండర్గ్రౌండ్ పైపు లైన్లలో పూడికను తొలగించి పరిష్కారం చూపాలని రంగనాథ్ సూచించారు. అమీర్పేటలో వరద ముప్పు తప్పించేందుకు అనుసరించిన విధానం నగరంలోని అనేక ప్రాంతాలకు అనుసరణీయమని తెలిపారు. పూడుకుపోయిన నాలాలను ఇదే మాదిరి తెరిస్తే చాలావరకు వరద సమస్యకు పరిష్కారం అవుతుందని అన్నారు. పనులు పర్యవేక్షిస్తున్న రంగనాథ్నాలాల్లోని పూడిక తొలగించడంతో తీరిన ఇబ్బంది ఊపిరి పీల్చుకున్న మైత్రీవనం, గాయత్రి నగర్... -
పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
వెంగళరావునగర్: త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లకు అన్ని సౌకర్యాలను కల్పించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి అధికారి ఆర్.వి.కర్ణన్ తెలియజేశారు. యూసుఫ్గూడ డివిజన్ పరిధిలోని యూసుఫ్గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మారుతీనగర్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాల, ఇంజనీరింగ్స్ కాలనీలోని దక్ష స్కూల్స్లో ఏర్పాటు చేసిన 18 పోలింగ్ స్టేషన్లను ఆయన నిశితంగా పర్యవేక్షించారు. అనంతరం కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. కమిషనర్ వెంట జూబ్లీహిల్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ రజినీకాంత్రెడ్డి తదితర సిబ్బంది ఉన్నారు. -
భర్త మృతిని తట్టుకోలేక..
దశదినకర్మలోపే భార్య మృతి అబ్దుల్లాపూర్మెట్: భర్త దశదిన కర్మ రోజే భార్య అంత్యక్రియలు నిర్వహించిన విషాద ఘటన అబ్దుల్లాపూర్మెట్లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అబ్దుల్లాపూర్మెట్లో నివాసముంటున్న సీనియర్ జర్నలిస్ట్ మేడపాటి బాబ్జీ(62) ఈనెల 5న గుండెపోటుతో చనిపోయారు. భర్త మరణాన్ని తట్టుకోలేకపోయిన జయప్రద(58) మనోవేదనతో అస్వస్థతకు గురైంది. ఈక్రమంలో ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా 14న చనిపోయింది. తెల్లవారితే తండ్రి దశదినకర్మ చేయాల్సిన పిల్లలు తల్లి అంత్యక్రియలు నిర్వహించారు. సీనియర్ జర్నలిస్ట్ మామిడి సోమయ్య తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. -
పోలీసు అమరవీరుల స్థూపం పనుల పరిశీలన
గన్ఫౌండ్రీ: గోషామహల్ పోలీస్ స్టేడియంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ అమరవీరుల స్థూపం నిర్మాణ పనులను గురువారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి.శివధర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమరవీరుల స్థూపం నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. డీజీపీ వెంట అదనపు డీజీ పీ మహేష్ భగవత్, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఎం.రమేష్, నగర జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్ తదితరులు ఉన్నారు. పనులు పరిశీలిస్తున్న డీజీపీ శివధర్రెడ్డి -
గల్లీ గల్లీ మోత మోగాల్సిందే..
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక నేపథ్యంలో ఇక గల్లీ గల్లీ ప్రచార హోరు కొనసాగనుంది. ఇందుకోసం ప్రత్యేక రథాలు సిద్ధమయ్యాయి. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ప్రచార రథాలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచార రథ చక్రాలు కదం తొక్కనున్నాయి. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, పాలనను కీర్తిస్తూనే, మరోవైపు ప్రత్యర్థి పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రత్యేకంగా రూపొందించిన పాటలతో ఈ రథాలు ప్రజల్లోకి వెళ్లనున్నాయి. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం కార్యకర్తలు ప్రచార రథాల్లో తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించేలా వ్యూహం రూపొందిస్తున్నారు. అలాగే సీనియర్ నేతలు కూడా ప్రచార రథాలపైనే కదన రంగంలోకి దూకుతారని తెలుస్తోంది. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ప్రచార రథాలు.. -
ప్రైవేట్ బస్సు బీభత్సం
రాజేంద్రనగర్: హిమాయత్సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం ఉదయం ఓ ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. 100 కిలో మీటర్ల వేగంతో వెళుతున్న బస్సు టైర్ పేలిపోవడంతో బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలిపై వైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. అటుగా వస్తున్న బొలేరో వాహనాన్ని ఢీకొట్టి 10 మీటర్ల దూరం లాక్కెళ్లింది. ఈ ఘటనలో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగపూర్ నుంచి నగరానికి వస్తున్న ప్రైవేట్ బస్సు గచ్చిబౌలి ప్రాంతంలో ప్రయాణికులను దింపి ఔటర్ మీదుగా ఎగ్జిట్ 17 నుంచి రాజేంద్రనగర్ ఆరాంఘర్ చౌరస్తాకు వెళ్లాల్సి ఉంది. ఉదయం అప్పా నుంచి హిమాయత్సాగర్కు వస్తుండగా బస్సు టైర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో వాహనం అదుపుతప్పింది. డ్రైవర్ వాహనాన్ని నియంత్రించే క్రమంలో ఫుట్పాత్ను ఢీకొట్టి విద్యుత్ స్తంభంతో పాటు చెట్లను ఢీకొని రోడ్డు అవతలివైపు దూసుకెళ్లింది. అదే సమయంలో శంషాబాద్ కూరగాయల మార్కెట్లో కూరగాయలు అన్లోడ్ చేసి వెళుతున్న బొలెరోను ఢీకొట్టి రోడ్డుపై నుంచి ఈడ్చుకెళ్లింది. రోడ్డు పక్కనే ఉన్న బారికేడ్లను ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్తో పాటు బస్సు డ్రైవర్ అందులోని 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటన జరిగిన వెంటనే గాయాలతో ఉన్న డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. బొలెరో డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేస్తున్నారు. ● టైర్ పేలడంతో ఘటన ● డివైడర్ అవతలి వైపు ఉన్న బొలెరోను ఢీకొట్టిన వైనం -
డీసీసీలో యువతకు పెద్దపీట
చందానగర్: నిబద్ధత, క్రమశిక్షణ, సమర్ధత ఉన్న నాయకుడినే డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తామని ఏఐసీసీ సభ్యుడు తిరునెల్వేలి పార్లమెంట్ సభ్యుడు రాబర్ట్ బ్రూస్ అన్నారు. గురువారం శేరిలింగపల్లి నియోజకవర్గ ఇన్చార్జి జగదీశ్వర్గౌడ్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన హఫీజ్పేట్ డివిజన్ పరిధి హుడా కాలనీ ఎంఎస్పీ కన్వెన్షన్ సెంటర్లో అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యుడు, తిరునెల్వేలి ఎంపీ రాబర్ట్ బ్రూస్, పీసీసీ ఉపాధ్యక్షుడు కోటంరెడ్డి వినయ్రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రతీ కార్యకర్త అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ శక్తిని పునరుద్ధరించేందుకు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ యువతకు ప్రాధాన్యత ఇస్తుందని.. డీసీసీ కమిటీలోనూ వారికి పెద్దపీట వేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, దొడ్ల వెంకటేశ్ గౌడ్, నియోజకవర్గ కోఆర్డినేటర్ రఘునందన్రెడ్డి, మాజీ కార్పొరేటర్ అశోక్గౌడ్, నియోజకవర్గ సీనియర్ నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. -
45 రోజుల్లో 1061 ఫోన్లు రికవరీ
గచ్చిబౌలి: చోరీకి గురైన, అనుకోకుండా పోగొట్టుకున్న ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్నారని క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి అన్నారు. 45 రోజుల్లో 1061 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. గురువారం సైబరాబాద్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రికవరీ సెల్ ఫోన్లను బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే సీఈఐఆర్ ఫోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం పోర్టల్లో పొందుపరిచి ఫోన్ను రికవరీ చేసేందుకు వీలుంటుందన్నారు. వ్యక్తి గత, ఆర్థిక సమాచారం ఫోన్లలోనే ఉంటుందని, ఆలస్యం చేస్తే నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. త్వరగా ఫిర్యాదు చేయకపోతే ఆ ఫోన్ను తప్పుడు పనులకు వాడితే మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందన్నారు. సైబర్ క్రైమ్ బారిన పడకుండా జగ్రత్తగా ఉండాలంటే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు 13,423 ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. 45 రోజుల్లో రూ.3.20 కోట్ల విలువైన 1061 ఫోన్లను సీఈఐఆర్ ఫోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు తెలిపారు. మాదాపూర్ సీసీఎస్ 240, బాలానగర్ సీసీఎస్ 188, మెడ్చెల్ సీసీఎస్ 195, రాజేంద్రనగర్ సీసీఎస్ 233, శంషాబాద్ సీసీఎస్ పోలీసులు 205 ఫోన్లను రికవరీ చేసినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో క్రైమ్స్ ఏడీసీపీ రాంకుమార్, సీసీఎస్ ఏసీపీ నాగేశ్వర్ రావు, ఇన్స్పెక్టర్లు సంజీవ్, రవి కుమార్, రాజేష్, సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అద్దెకు తీసుకుని అమ్మేస్తారు..
చిలకలగూడ : ఎక్కువ అద్దె చెల్లిస్తామని నమ్మించి కార్లను అద్దెకు తీసుకుంటారు. రెండు నెలలు సక్రమంగా అద్దె చెల్లించి, ఆపై వాటిని అక్రమంగా తక్కువ ధరకు విక్రయించడమేగాక వాహన యజమానులపై బెదిరింపులకు పాల్పడుతున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి రూ.80 లక్షల విలువైన ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ ఠాణాలో గురువారం అడిషనల్ డీసీపీ నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ శశాంక్రెడ్డి, ఎస్హెచ్ఓ అనుదీప్లతో కలిసి ఈస్ట్జోన్ డీసీపీ బాలస్వామి వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ నామాలగుండు ఉప్పరిబస్తీకి చెందిన సంగిశెట్టి ప్రవీణ్కుమార్ డ్రైవర్గా పని చేసేవాడు. జల్సాలకు అలవాటు పడిన అతను సులువుగా డబ్బులు సంపాదించేందుకు తార్నాకకు చెందిన అమరేందర్, మహ్మద్ రిజ్వాన్తో జత కట్టాడు. శ్రీలక్ష్మీ లాజిస్టిక్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. కార్ల యజమానులను సంప్రదించి తమకు వాహనాలు అద్దెకు ఇస్తే సెవెన్ సీటర్కు నెలకు రూ.25వేలు, ఫైవ్ సీటర్కు రూ. 20 వేలు అద్దె చెల్లిస్తామని ప్రచారం చేసుకున్నారు. రెండు నెలల పాటు సక్రమంగా అద్దె చెల్లించి ఆ తర్వాత మొహం చాటేస్తారు. సదరు వాహనాలను తక్కువ ధరకు విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవారు. నెల అద్దె లేదా వాహనం ఇవ్వాలని అడిగిన యజమానులపై బెదిరింపులకు దిగేవారు. అంబర్పేటకు చెందిన జ్ఞానేశ్వర్ తన ఎర్టిగా కారును మూడు నెలల క్రితం వారికి అద్దెకు ఇచ్చాడు. అద్దె డబ్బులు, వాహనం తిరిగి ఇవ్వకపోవడంతో మోసయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు ఇదే తరహాలో పలువురి నుంచి అద్దెకు తీసుకున్న వాహనాలను తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు సంగిశెట్టి ప్రవీణ్కుమార్, అమరేందర్లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించారు. వారి నుంచి సుమారు రూ.80 లక్షల విలువైన ఏడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు మహ్మద్ రిజ్వాన్ కోసం గాలిస్తున్నారు. కేసును చేధించిన చిలకలగూడ ఎస్హెచ్ఓ అనుదీప్, ఎస్ఐలు రవికుమార్, ఆంజనేయులు, సిబ్బందిని డీసీపీ అభినందించి రివార్డులు అందించారు. ఇద్దరు నిందితుల రిమాండ్ పరారీలో మరొకరు ఏడు వాహనాలు స్వాధీనం -
గ్లోబల్ టూరిస్టులను ఆకర్షించేలా ప్రత్యేక పాలసీ
లాలాపేట: గ్లోబల్ టూరిస్టులను ఆకర్షించేలా ప్రత్యేక పాలసీ అమలు చేసి తెలంగాణ టూరిజాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఉస్మానియా యూనివర్సిటీలోని కామర్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ‘ గ్లోబల్ టూరిజం ఏ న్యూ అవెన్యూస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ‘ అంశంపై చేపట్టిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిఽథులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో విద్యార్థులు, అధ్యాపకుల పాత్ర ఎనలేనిదన్నారు. ఉద్యోగాల కల్పనలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పిస్తున్నామన్నారు. ఉద్యోగాల కల్పనలో టూరిజం పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు. టూరిజంలో దేశం, తెలంగాణ వెనుకబడి ఉన్నాయన్నారు. సింగపూర్, దుబాయ్తో పోటీ పడి టూరిజాన్ని ప్రమోట్ చేయడం ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు దక్కుతాయన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో చారిత్రక కట్టడాలు, సుందరమైన ప్రదేశాలు, నదీ జలాలు, అటవీ ప్రాంతాలు ఉన్నాయి. టూరిజంలో మౌలిక వసతులు లేక అభివృద్ధికి నోచుకోలేదన్నారు. హైదరాబాద్ నగరంలో ఇటీవల నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేడానికి కొంత ఉపయోగపడిందన్నారు. పదేళ్లుగా టూరిజం పాలసీ లేదు. గత 64 ఏళ్ల కాలంలో 22 మంది ముఖ్యమంత్రులు పాలనలో రాష్ట్రంలో ఉన్న రూ. 70 వేల కోట్లు అప్పులు ఉంటే, గత ప్రభుత్వ హయాంలో రూ. 8 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. గడచిన పదేళ్ల కాలంలో రాష్ట్రంలో టూరిజం పాలసీ లేదని సీఎం రేవంత్రెడ్డి హయాంలో ప్రత్యేక టూరిజం పాలసీని రూపొందించామన్నారు. ప్రస్తుతం టూరిజం ద్వారా వస్తున్న ఆదాయం రూ.12 కోట్లు మాత్రమే అన్నారు. టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నామన్నారు. తద్వారా పర్యాటక రంగాన్ని, తెలంగాణ సంస్కృతి, కళలను అభివృద్ది చేస్తామన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రముఖ ప్రాత పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేసేలా నూతన విధానలను ఆవిష్కరించాలని కోరారు. వారంలో రెండు రోజుల పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శించి అక్కడ రీల్స్ చేసి సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అనంతరం తెలంగాణ టూరిజంపై రూపొందించిన హిందీ పాటను స్వయంగా తన సెల్ఫోన్ ద్వారా విద్యార్థులకు వినిపించారు. ● మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణలో ప్రకృతి ప్రసాదించిన ఆకుపచ్చ తెలంగాణ, సస్యశ్యామలమైన తెలంగాణగా పేర్కొన్నారు. తెలంగాణ పర్యాటక రంగాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి ఓయూ విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. పర్యాటక ప్రాంతాలపై సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేసేలా ఓ ప్రత్యేకమైన ఆధునిక విధానాన్ని రూపొందించాలని కోరారు. ఎమ్మెల్సీ డా. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ఓయూ ఆర్ట్స్ కళాశాలను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం సదస్సు సావనీర్ను ఆవిష్కరించారు. ఓయూ వైస్ చాన్సలర్ ప్రొ కుమార్ అధ్యక్షతన జరిగిన ఐపీఈ డైరెక్టర్ ప్రొ శ్రీనివాసమూర్తి, సదస్సు చైర్మన్ ప్రొ గంగాధర్, కాన్ఫరెన్స్ డైరెక్టర్ ప్రొ. డి. చెన్నప్ప, కన్వీనర్లు కృష్ణచైతన్య, ఇంద్రకాంతి శేకర్, ప్యాట్రిక్, వివిధ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. పర్యాటకరంగం అభివృద్ధితోప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన ఓయూ విద్యార్థులు టూరిజాన్ని ప్రమోట్ చేయాలి -
మిగతా ఐదు చెరువులకూ పునరుజ్జీవం తేవాలి
సాక్షి, సిటీబ్యూరో: బతుకమ్మకుంటను సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకువచ్చిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఇప్పుడు మిగిలిన ఐదు చెరువులపై దృష్టి పెట్టింది. వీటి అభివృద్ధి, పునరుజ్జీవం నవంబర్ నాటికి పూర్తి కావాలంటూ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన శుక్రవారం క్షేత్రస్థాయిలో రెండు చెరువుల వద్ద జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువు, కూకట్పల్లిలోని నల్లచెరువుల వద్దకు వెళ్లిన ఆయన పలు సూచనలు చేశారు. ఈ రెండు చెరువులు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శిల్పారామం, మెటల్ చార్మినార్ వైపుల నుంచి తమ్మిడికుంటలోకి వచ్చే ఇన్లెట్లకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు. శిల్పారామం వద్ద వరద నీరు నిలవకుండా వాటిని అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువు చుట్టూ బండ్, బయట వైపు రిటైనింగ్ వాల్ నిర్మించాలని... చెరువు లోపలి వైపు రాతి కట్టడం పటిష్టంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. వేలాది నివాసాల మధ్య ఉన్న కూకట్పల్లి నల్లచెరువు వద్ద స్థానికులు సేదతీరేలా అభివృద్ధి చేయాలని రంగనాథ్ సూచించారు. మురుగునీటిని డైవర్ట్ చేసేందుకు నిర్మిస్తున్న కాలువ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జలమండలి అధికారులను కోరారు. గతంలో 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నల్ల చెరువు ఆక్రమణలను తొలగించిన తర్వాత 27 ఎకరాలకు పెరిగిందని వివరించారు. సిబ్బందికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు తమ్మిడికుంట, నల్లకుంట చెరువు పనుల పరిశీలన -
బాణాసంచా అక్రమ నిల్వలపై టాస్క్ఫోర్స్ కన్ను
రూ.18 లక్షల సరుకు స్వాధీనం చేసుకున్న టీమ్ సాక్షి, సిటీబ్యూరో: దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో బాణాసంచా అక్రమ నిల్వలపై టాస్క్ఫోర్స్ అధికారులు కన్నేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నగర వ్యాప్తంగా నిఘా ముమ్మరం చేశారు. ఫలితంగా ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ బృందానికి రూ.18 లక్షల విలువైన సరుకు చిక్కినట్లు అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు. బొగ్గులకుంటకు చెందిన శ్యామ్ కుమార్ సుగంధి సిద్ధ అంబర్బజార్లో ఓ గోదాం నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు, ముందు జాగ్రత్త చర్యలు లేకుండా అందులో భారీగా బాణాసంచా నిల్వ ఉంచారు. జనావాసాల మధ్య ఈ గోదాం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసినా అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. నగర వ్యాప్తంగా ఉన్న బాణాసంచ అక్రమ నిల్వలపై టాస్క్ఫోర్స్ పోలీసులు కొన్ని రోజులుగా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈస్ట్జోన్ బృందానికి శ్యామ్ కుమార్ గోదాంపై సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్ నేతృత్వంలో ఎస్సైలు ఎం.అనంతాచారి, ఎస్.కరుణాకర్రెడ్డి, పి.నాగార్జున తమ బృందాలతో దాడి చేసి శ్యామ్ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ.18 లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసుకుని కేసును అఫ్జల్గంజ్ పోలీసులకు అప్పగించారు. -
ప్రభాకర్ పనేనా..?
సాక్షి, సిటీబ్యూరో: అబ్దుల్లాపూర్మెట్లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో గురువారం రాత్రి చోటు చేసుకున్న భారీ చోరీ వెనక ‘కాలేజీ దొంగ’ బత్తుల ప్రభాకర్ పాత్ర ఉందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అవకాశాన్ని కొట్టపారేయలేమని చెప్తున్న రాచకొండ పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంతరాష్ట్ర ఘరానా దొంగ గత నెల 22న ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా దుద్దుకూరు వద్ద పోలీసు ఎస్కార్ట్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఇళ్లతో పాటు కాలేజీలను టార్గెట్గా చేసుకుని చోరీలు చేసే ఇతడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో 86 కేసులు ఉన్నాయి. ప్రభాకర్ ఎస్కేప్పై అక్కడి దేవరపల్లి పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఇతగాడి కోసం ఏపీ పోలీసులు దాదాపు పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ప్రభాకర్ సుదీర్ఘకాలం హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఖరీదైన నివాసాల్లో జీవించాడు. ఇక్కడ ఉన్న విద్యార్థులతో పాటు అనేక మందితో సన్నిహితంగా మెలిగాడు. కాలేజీలను టార్గెట్గా చేసుకుని వరుసపెట్టి చోరీ చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద ఇతడి కదలికలు పసిగట్టిన సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఆ సందర్భంలో పోలీసులపై కాల్పులకు కూడా తెగపడ్డాడు. ఏపీలోనూ ఇతడిపై కేసులు ఉండటంతో పీటీ వారెంట్పై అక్కడి పోలీసులు తీసుకువెళ్లారు. గత నెల్లో పోలీసు ఎస్కార్ట్ నుంచి తప్పించుకున్న ఇతగాడు నగరానికి వచ్చి మళ్లీ కాలేజీలను టార్గెట్ చేశాడా? అనే కోణంలో రాచకొండ పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు కీలక ఆధారాలు లభించినట్లు తెలిసింది. ఫిబ్రవరిలో గచ్చిబౌలి ప్రాంతంలో అరెస్టు గత నెల్లో పోలీసు ఎస్కార్ట్ నుంచి ఎస్కేప్ -
రక్షణ రంగం సాంకేతికతతో పురోగమిస్తున్న భారత్
మణికొండ: రక్షణ రంగంలో మన దేశం సాంకేతికతను విరివిగా వినియోగించి రాణిస్తున్నదని డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ (నావల్ సిస్టమ్స్, మెటీరియల్స్) అన్నారు. గండిపేటలోని చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీబీఐటీ) కళాశాలలో శుక్రవారం చైతన్య ఆస్ట్రా, సీబీఐటీ ఏరోస్పేస్ క్లబ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే కాస్మోకాన్–2025ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సాంకేతికతను రక్షణరంగం పూర్తి స్థాయిలో వినియోగిస్తుందన్నారు. డీఆర్డీఓ లాంటి సంస్థలలో అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయన్నారు. భవిష్యత్తు ఇంజనీర్లు మరింత ఉన్నత సాంకేతికతను కనుగొనేందుకు పరిశోధన చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన తన అనుభవాలు, ఆలోచనలు, వృత్తి జీవితానుభవాలను పంచుకున్నారు. విద్యార్థుల ఆసక్తిని పరీక్షించేలా వారికి పలు ప్రశ్నలను సందించి సమాధానాలను రాబట్టారు. అంతకు ముందు డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ వర్చువల్గా తన సందేశాన్ని ఇచ్చారు. ప్రిన్సిపాల్ సీవీ నరసింహులు మాట్లాడుతూ... పరిశోధన, నవీనత పట్ల సీబీఐటీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. కాస్మోకాన్ కన్వీనర్ ఆకాశ్ కోటి, ఆస్ట్రా అధ్యక్షుడు టి.జై సాయి దిపేష్, ఉపాధ్యక్షుడు హర్షిత్ వర్మ, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్ రాహుల్లు ఇప్పటి వరకు కొనసాగించిన పరిశోధనలు, సాధించిన విజయాలను వివరించారు. డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్వీ హరప్రసాద్ -
‘బ్రిలియంట్’లో రూ.1.07 కోట్ల చోరీ
అబ్దుల్లాపూర్మెట్: నగర శివారులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో భారీ చోరీ జరిగింది. ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ.1.07 కోట్లు అపహరణకు గురయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ విద్యాసంస్థకు చెందిన మూడు కాలేజీల్లో సిబ్బంది నాలుగు రోజులుగా ఫీజు డబ్బులు వసూలు చేశారు. అకౌంటెంట్ సెలవులో ఉండటంతో రూ.1.07 కోట్ల నగదును గురువారం కాలేజీ ఆవరణలోని ఆఫీసు బీరువాలో భద్రపర్చి, ఎప్పటిలాగే తాళాలు వేసి సాయంత్రం 6 గంటలకు ఇళ్లకు వెళ్లారు. శుక్రవారం ఉదయం 8.45 గంటలకు వచ్చిచూడగా మెయిన్ డోర్ ధ్వంసం చేసి ఉండటాన్ని గమనించారు. ఆఫీసు రూమ్ వద్దకు వెళ్లగా బీరువా తలుపులు తెరిచి ఉండటం, అందులోని డబ్బు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై కళాశాల ఏఓ కేశినేని కుమార్తో పాటు పీఎస్కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన ప్రాంతంతో పాటు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఇదిలా ఉండగా చోరీకి పాల్పడిన దుండగులు మెయిన్ డోర్ను ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. సీసీ కెమెరాలతో పాటు డీవీఆర్ బాక్స్ను సైతం ఎత్తుకెళ్లారు. ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ సీఐ అశోక్రెడ్డి కాలేజీకి చేరుకుని పలువురు సిబ్బందిని విచారించారు. చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కాలేజీలో పెద్ద మొత్తంలో డబ్బు చోరీకి గురికావడం చర్చనీయాంశంగా మారింది. ఫీజు డబ్బులను కాలేజీ ఆఫీసులోభద్రపర్చిన సిబ్బంది బీరువా తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన దుండగులు -
దుబాయి ఎయిర్పోర్టులో తెలంగాణ వాసికి అస్వస్థత
లక్డీకాపూల్: ముంబై నుంచి సౌదీ అరేబియాకు బయలుదేరిన నిజామాబాద్ వాసి ఒకరు దుబాయ్ ఎయిర్పోర్టులో అస్వస్థతకు గురయ్యారు. అతన్ని ఆదుకోవాలంటూ భార్య సీఎం ప్రవాసీ ప్రజావాణిలో విన్నవించింది. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ పట్టణం మహబూబ్ బాగ్కు చెందిన సయ్యద్ బాబా(38) అనే వ్యక్తి గల్ఫ్లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3న ముంబై నుంచి సౌదీ అరేబియాలోని అభా నగరానికి వెళుతూ మార్గమధ్యంలో దుబాయ్ ఎయిర్పోర్టులో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే స్పందించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది అతన్ని రషీద్ హాస్పిటల్లో చేర్పించి మానవత్వం ప్రదర్శించారు. కాగా అతన్ని ఇండియాకు తిరిగి రప్పించాలని బాబా భార్య సమీనా బేగం సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమానికి సోదరుడు చోటుతో కలిసి వచ్చిన ఆమె ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రధాన కార్యదర్శి బీఎల్ సురేంద్రనాథ్ వారికి మార్గదర్శనం చేశారు. సయ్యద్ బాబా అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుసుకున్నారు. దుబాయిలో ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన నయీమ్, కొట్టాల సత్యం, నారా గౌడ్లు రోగి బాగోగులు చూసుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. -
బాలిక సాహసం..ఉడాయించిన దొంగ
సాక్షి, సిటీబ్యూరో: తమ పొరుగింట్లో చోరీకి యత్నించిన దొంగను ఓ బాలిక తరిమికొట్టింది. దొంగతనాన్ని నివారించి అందరి ప్రశంసలు అందుకుంది. వివరాల్లోకి వెళ్తే..చింతల్, భగత్సింగ్ నగర్, రోడ్ నంబర్ 12లోని ఓ ఇంట్లో కావలి భవానీ అనే 13 ఏళ్ల బాలిక కుటుంబంతో కలిసి నివసిస్తోంది. తమ కింద పోర్షన్లో ఉమా మహేశ్వరి, చంద్రశేఖర్ దంపతులు నివసిస్తుండగా..వారు గురువారం రాత్రి బయటకు వెళ్లడం చూసి ఓ 20 ఏళ్ల యువకుడు దొంగతనం కోసం ఇంట్లోకి ప్రవేశించాడు. కిందింట్లో అలికిడి గమనించిన భవానీ అక్కడికి వెళ్లి ఎవరు నువ్వు అని నిలదీయడంతో యువకుడు బయటకు పరుగెత్తాడు. భవాని అంతటితో వదిలి పెట్టకుండా కేకలు పెడుతూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తూ దుండగుడిని వెంబడించింది. వీధి చివర ప్రణవ్ ఇంటర్నేషనల్ స్కూల్ వరకు తరుముతూ వెళ్లింది. సీసీ కెమెరా రికార్డు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులతోపాటు కాలనీ వాసులు భవానిని ప్రశంసించారు. -
జలమండలి ఖాతాలో మరో పురస్కారం
సాక్షి, సిటీబ్యూరో: జలమండలికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వరల్డ్ వాటర్ అవార్డు, ఉత్తమ ఎస్టీపీ, ఉత్తమ యాజమాన్య అవార్డులు అందుకున్న జలమండలి.. మరో పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆర్టీఐ కేసుల్లో ఉత్తమ సేవలకు తెలంగాణ సమాచార కమిషన్ ఉత్తమ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పురస్కారాన్ని ప్రకటించింది. గురువారం రవీంద్ర భారతిలో జరిగిన కార్యాక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో పర్సనల్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సిబ్బంది మెడపై..‘ఈవీ’ కత్తి!
గ్రేటర్ పరిధిలో త్వరలో రోడ్డెక్కనున్న 275 అద్దె బస్సులు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో దశలవారీగా రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ సిబ్బంది మనుగడకు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. కాలుష్యరహిత, పర్యావరణహితమైన, ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాన్ని అందజేసే ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)లు వేలాదిమంది సిబ్బంది మెడపై కత్తిగా వేలాడనున్నాయి. ప్రస్తుతం 265 ఎలక్ట్రిక్ బస్సులు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. త్వరలో మరో 275 వరకు రోడ్డెక్కనున్నాయి. వచ్చే రెండేళ్లలో 2,800 బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ బస్సుల కోసం కొత్తగా పది డిపోలను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉంది. మరోవైపు రెండేళ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ బస్సుల చార్జింగ్ పేరిట ఆర్టీసీ ఇప్పటికే ప్రయాణికులపై చార్జీల భారాన్ని మోపింది. ఈ క్రమంలోనే దశలవారీగా సిబ్బందికి సైతం ఉద్వాసన పలికే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ– బస్సులతో గ్రేటర్ హైదరాబాద్లోని 25 డిపోల్లో వివిధ స్థాయిల్లో పని చేసే సుమారు 15,000 మందికి పైగా ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ బస్సు ల పేరిట జరిగే ప్రైవేటీకరణ చర్యలను వ్యతిరేకించేందుకు కార్మిక సంఘాలు ఆందోళనకు సన్నద్ధమవుతున్నాయి. ఒక బస్సుతో ఐదుగురికి నష్టం.. ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ (పీఎం ఈ– డ్రైవ్) పథకంలో భాగంగా ఎలక్ట్రిక్ అద్దె బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ప్రైవేట్ సంస్థలకు చెందిన డ్రైవర్లే ఈ బస్సులను నడుపుతారు. దీంతో ఆర్టీసీకి ప్రత్యేకంగా డ్రైవర్ల అవసరం ఉండదు. మెకానిక్లు, టెక్నీషియన్లు తదితర సిబ్బంది అవసరం కూడా ఉండదు. కండక్టర్ల అవసరం మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం ఒక బస్సుకు ఐదుగురు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. ఒక డ్రైవర్, ఒక కండక్టర్తో పాటు మెకానిక్, టెక్నీషియన్, సూపర్వైజర్లు ఉన్నారు. ఈ లెక్కన నగరంలోని అన్ని డిపోల్లో 15,000 మంది పని చేస్తున్నారు. వీరిలో సుమారు 6,000 మంది డ్రైవర్లే. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల పెద్ద సంఖ్యలో నష్టపోయేది కూడా డ్రైవర్లే కావడం గమనార్హం. ఆ తరువాత మెకానిక్లు, టెక్నీషియన్ల ఉద్యోగాలకు కూడా ప్రమాదం పొంచి ఉండనుంది. ● ఈ క్రమంలో హైదరాబాద్లో పని చేసే సిబ్బందిని జిల్లాల్లో సర్దుబాటు చేయడంతో పాటు, ఉద్యోగ విరమణకు దగ్గర్లో ఉన్న వారిని స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం ఒత్తిడి చేసేలా ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ డిపోలు కూడా ప్రైవేట్ బస్సుల నిర్వహణకు పరిమితం కానున్నాయి. ప్రస్తుతం హెచ్సీయూ డిపోను పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం వినియోగిస్తున్నారు. కంటోన్మెంట్, రాణిగంజ్, కూకట్పల్లి, హయత్నగర్ తదితర డిపోల్లో చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. త్వరలో అన్ని డిపోల్లోనూ హైటెన్షన్ విద్యుత్ సదుపాయం కలిగిన చార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఈ డిపోలన్నీ ఎలక్ట్రిక్ బస్సుల చార్జింగ్, పార్కింగ్ అవసరాలకు వినియోగిస్తారు. అప్పుడు వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బంది అవసరం ఉండదు. కేంద్రం సబ్సిడీ ప్రైవేటుకేనా? ● ప్రజారవాణా రంగంలో ఈవీలను ప్రోత్సహించేందుకు ఈవీ బస్సులపై కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. పీఎం –ఈ డ్రైవ్లో భాగంగా ఒక్కో బస్సుపై సుమారు రూ.35 లక్షల వరకు రాయితీ లభిస్తుంది. రూ.కోటికిపైగా ఖరీదైన ఈ– బస్సులను కొనుగోలు చేసే ప్రైవేట్ సంస్థలకే రాయితీ లభిస్తుందని, దీనివల్ల ఆర్టీసీకి పెద్దగా ప్రయోజనం ఉండబోదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. ● ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్టీసీయే చార్జింగ్, పార్కింగ్ సదుపాయాన్ని అందజేస్తోంది. ప్రయాణికుల నుంచి చార్జీల రూపంలో వచ్చే ఆదాయంలో మాత్రం కిలోమీటర్కు సుమారు రూ.57 చొప్పున ప్రైవేట్ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఏ విధంగానూ ఆర్టీసీకి లాభదాయకం కాదని, అద్దె ప్రాతిపదికన నడపడం కంటే సొంతంగా ఈవీలను సమకూర్చుకోవడం వల్ల ఆదాయం పెరుగుతుందని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకన్న తెలిపారు. మరోవైపు ప్రస్తుతం నగరంలో సుమారు 22 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు.వీరిలో 16 లక్షల మంది వరకు మహిళలే ఉన్నారు. వారి ఉచిత ప్రయాణాలపై ప్రభుత్వం చెల్లించే రీయింబర్స్మెంటే ఆర్టీసీకి ప్రధాన ఆదాయం. నగదు రూపంలో లభించేది తక్కువే. ఉచిత ప్రయాణాలపై ప్రభుత్వ చెల్లింపులు నిలిచిపోయినా, ఆలస్యమైనా ఆర్టీసీ దారుణంగా నష్టపోతుంది. ప్రభుత్వ కుట్రలను సహించబోం.. ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీని నమ్ముకొని బతుకుతున్న కార్మికులను బయటకు పంపించేందుకు ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోంది. ఈ పరిణామాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం. కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని ప్రజా క్షేత్రంలో దోషిగా నిలబెడతాం. – ఈదరి వెంకన్న, ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రెండేళ్లలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులకు ప్రణాళికలు ప్రశ్నార్థకంగా 15,000 మంది ఉద్యోగుల భవిష్యత్ దశలవారీగా ఆర్టీసీ సొంత బస్సులకు ఉద్వాసన ఎలక్ట్రిక్ వాహనాల కోసమే ఏర్పడనున్న కొత్త డిపోలు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ -
ఆగేనా! అంతర్గత పోరు
సాక్షి, సిటీబ్యూరో: అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. యువనేత నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. కానీ.. పార్టీ కొత్త, పాత శ్రేణుల్లో ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలు పార్టీకి పెను సవాల్గా మారాయి. ఈ పరిస్థితితో పార్టీ నేతలతో పాటు కేడర్ స్థాయిలోనూ గందరగోళం నెలకొంది. రెండు నెలలుగా మంత్రులు రంగంలోకి దిగి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేరిట సుడిగాలి పర్యటనలు చేసినప్పటికీ.. పాత, కొత్త కేడర్ను ఏకతాటిపై తేచ్చేందుకు ప్రయత్నించకపోవడంతో విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అంశంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కుతారోనని రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.ఎడమొహం.. పెడమొహమే..జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమై.. రాజకీయ వాతావరణం వేడేక్కి మూడు, నాలుగు మాసాలు కావస్తునప్పటికీ.. కాంగ్రెస్లోని కొత్త, పాత కేడర్లో సఖ్యత లేకుండా పోయింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ఉప ఎన్నిక కావడంతో చాలెంజ్గా తీసుకొని ముందస్తుగానే గెలుపు మార్గాలను సుగమం చేసుకునేందుకు క్షేత్ర స్థాయిలో ముగ్గురు మంత్రులు, 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లను రంగంలోకి దింపింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కొత్త, పాత క్యాడర్ మధ్య ఆధిపత్య పోరు కోసం అమాత్యుల ముందే అమీతుమీలకు దిగడం వంటి ఘటనలు కొనసాగాయి. ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి కనబర్చిన ఆశావహులు సైతం మంత్రుల పర్యటన కార్యక్రమాలకు పరిమితమై కనీసం పలకరింపు కూడా లేకుండా ఎవరికి వారే యమునా తీరే విధంగా వ్యవహారించడం విస్మయానికి గురిచేసింది. అభ్యర్థిత్వం ఖరారు అనంతరం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది.ఆశావహుల్లో అసంతృప్తి..జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి కనబర్చిన ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. వీరిలో కాంగ్రెస్లో కొత్తగా చేరిన నేతలతో పాటు దశాబ్దాలుగా పార్టీ జెండా మోస్తున్న నేతలు కూడా ఉన్నారు. మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి , విద్యావేత్త భవానీ శంకర్ తదితరుల టికెట్ ఆశించి విఫలమయ్యారు. వీరి అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా తయారైందన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
వైద్యం ముసుగులో గంజాయి దందా
సాక్షి, సిటీబ్యూరో: వైద్యం కోసమంటూ మెడికల్ వీసాపై వచ్చిన ఓ నైజీరియన్ గంజాయి దందా ప్రారంభించాడు. వీసా గడువు ముగిసినా, పాస్పోర్టు ఎక్స్పైర్ అయినా ఇక్కడే తిష్ట వేశాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఎలాంటి మాదకద్రవ్యం లభించకపోవడంతో డిపోర్టేషన్ విధానంలో బలవంతంగా తిప్పి పంపినట్లు డీసీపీ వైవీఎస్ సుధీంద్ర గురువారం వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఓనురా సోలమన్ చిబుజ్ కొన్నాళ్లు తన స్వస్థలంలో చిరు వ్యాపారిగా బతికాడు. 2014 ఆగస్టు 14న మెడికల్ వీసాపై ఢిల్లీ వచ్చాడు. ఆ ఏడాది సెప్టెంబర్ 23 వరకే వీసా గడువు ఉంది. పాస్పోర్టు సైతం 2016 జనవరి 16న ఎక్స్పైర్ అయిపోయింది. అయినప్పటికీ ఢిల్లీలోని ఓ రెస్టారెంట్లో మూడేళ్ల పాటు పని చేశాడు. గత ఏడాది సెప్టెంబర్లో హైదరాబాద్ వచ్చి అత్తాపూర్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. పుణె, ముంబైల్లో ఉన్న డ్రగ్ పెడ్లర్స్ నుంచి తక్కువ ధరకు గంజాయి ఖరీదు చేసుకుని వచ్చేవాడు. ఆ సరుకును నగరంలో ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవడం మొదలెట్టాడు.ఇటీవల టోలిచౌకి ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న సోలమన్ను హెచ్–న్యూ అదుపులోకి తీసుకుంది. ఇన్స్పెక్టర్ జీఎస్ డానియేల్, ఎస్సై సి.వెంకట రాములు నేతృత్వంలోని బృందం విచారించింది. వీసా, పాస్పోర్టు లేవని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. దీంతో ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) సహకారంతో డిపోర్టేషన్ చేసింది. -
చలో బస్భవన్.. ఉద్రిక్తత
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: పెంచిన చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ చేపట్టిన చలో బస్ భవన్ ఉద్రిక్తంగా మారింది. ఉదయం 8గంటల నుంచే పోలీసులు భారీ ఎత్తున మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. బస్భవన్ నలువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. అటు వీఎస్టీ నుంచి, ఇటు చిక్కడపల్లి, సికింద్రాబాద్, ఇందిరాపార్కు తదితర ప్రాంతాల నుంచి ఆందోళనకారులు బస్భవన్ వైపు రాకుండా చర్యలు చేపట్టారు. దీంతో సాధారణ ప్రజల రాకపోకలకు సైతం ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉదయం 10.30 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్రావు ఆర్టీసీ క్రాస్రోడ్స్కు చేరుకున్నారు. ఆర్టీసీ బస్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా పోలీసులను, బారికేడ్లను దాటుకొని బస్భవన్ వైపు దూసుకెళ్లడంతో ఉద్రిక్తత ఏర్పడింది. నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకున్నాయి.పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లకు తరలించారు. కేటీఆర్, హరీష్రావులతో చిక్కడపల్లి ఏసీపీ రమేష్, గాంధీనగర్ ఏసీపీ యాదగిరిలు మాట్లాడి బస్భవన్లో ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం అందజేసేందుకు లోపలికి పంపించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దేవీ ప్రసాద్ పాల్గొన్నారు. -
స్థిరమైన, సమగ్ర పర్యాటకాభివృద్ధే లక్ష్యం
రాయదుర్గం: రాష్ట్రంలో స్థిరమైన, సమగ్ర పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి క్రాంతి అన్నారు. ‘టూరిస్ట్ పోలీస్ ఓరియంటేషన్ అండ్ సెన్సిటైజేషన్’ అంశంపై వారం రోజుల పాటు గచ్చిబౌలిలోని ‘నిథమ్’ క్యాంపస్లో టూరిజమ్ పోలీసులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గురువారం ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని కీలక పర్యాటక ప్రదేశాలలో పర్యాటకులకు పూర్తి స్థాయి భద్రత కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. అందులో భాగంగా టూరిజమ్ పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నిథమ్ ప్రిన్సిపల్ ఎంకెగణేష్, నిథమ్ ఫ్యాకల్టీడాక్టర్ నీరజ్గోయల్, మిషెల్లీ జే ఫ్రాన్సిస్, యాదగిరి, ఇతర అధికారులు, టీఎస్టీడీసీ అధికారులు, శిక్షణ పొందిన టూరిజమ్ పోలీసులు పాల్గొన్నారు. -
ఆత్మస్థైర్యంతో కేన్సర్ను జయించొచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: ఆత్మ స్థైర్యంతో కేన్సర్ను జయించొచ్చునని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అపోలో కేన్సర్ సెంటర్ ఆసుపత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజీ, డైరెక్టర్ డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి కేన్సర్పై రాసిన ‘ఐ యామ్ సర్వైవర్’(నేను కేన్సర్ను జయించాను) అనే పేరుతో పుస్తకాన్ని రచించారు. హిందీ అనువాద ‘మైనే కేన్సర్ కో జీతా హూ’ పుస్తకావిష్కరణ సభ బుధవారం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో జరిగింది. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్(ఢిల్లీ) శివకుమార్ పట్టాభిరామన్, విజయ్ ఆనంద్ రెడ్డిలతో కలసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వైద్య వృత్తిలో 30 ఏళ్ల అనుభవాన్ని ఈ పుస్తక రూపంలో ప్రజలకు తెలపడం అభినందనీయమన్నారు. కేన్సర్ పేరు చెబితే భయపడే పరిస్థితుల నుంచి, వ్యాధిని ఎలా జయించొచ్చు అనే విషయాలను పుస్తకంలో స్పష్టంగా వివరించడం మంచి పరిణామన్నారు. ఆత్మ స్థైర్యంతో కేన్సర్ను జయించొచ్చు అనే నిజాన్ని ఈ పుస్తకం ద్వారా ప్రజలకు తెలిపినందుకు అభినందనలు అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేన్సర్ మహమ్మారిపై దండయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేసి, రోగులకు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఈ పుస్తకం ద్వారా ప్రతి రోగి ఆత్మవిశ్వాసంతో ముందుకెళతారని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి అన్నారు. ఈ పుస్తకంలో కేన్సర్ను జయించిన 108 మంది విజయగాథలను, వారి అనుభవాలను పొందుపరిచినట్లు పుస్తక రచయిత డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి తెలిపారు. రోగుల జీవితంపై ప్రేమను ప్రతిబింబించాలనే ఉద్దేశ్యంతో ఈ పుస్తకాన్ని రాసినట్లు పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో ‘ఐ యామ్ సర్వైవర్’ పుస్తకావిష్కరణ -
శుభకార్యానికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో చోరీ..
కంటోన్మెంట్: శుభకార్యానికి వెళ్లి వచ్చేలోగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చోరీకి పాల్పడిన సంఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోయిన్పల్లి కంసాలి బజార్లో బి. ప్రవీణ్ కమార్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసంఉంటున్నాడు. బంధువుల ఇంట్లో బర్త్డే వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 6న కుటుంబంతో కలిసి మహబూబ్నగర్కు వెళ్లారు. బుధవారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలు తెరిచి ఉన్నాయి. 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.40వేలు విలువ చేసే పంచలోహ విగ్రహం, రూ.40 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బేగంపేట ఏసీపీ గోపాల కృష్ణ మూర్తి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. -
సంస్కృతి,సంప్రదాయాలను పరిరక్షించాలి
బన్సీలాల్పేట్: భారత దేశ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అసలైన దేశ చరిత్రను నేటి తరం తెలుసుకోవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సికింద్రాబాద్ పద్మారావునగర్ సుప్రసిద్ధమైన స్కందగిరి దేవాలయంలో జరుగుతున్న శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ రజతోత్సవ వేడుకలకు గురువారం రాత్రి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో గొప్పవని ఆవి మన వేద విజ్ఞానంతో ముడిపడి ఉన్నాయన్నారు. సనాతన ధర్మం వేదంతో ముడిపడి ఉందన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు దశాబ్ధాలుగా ఎన్నో ఆటుపోట్లకు తట్టుకొని నిలబడిందని దానికి వేదమే ప్రమాణికమన్నారు. ఇతర దేశస్తులు మన సంపదను దోచుకొని పొయారు గాని మన జీవన ప్రమాణానికి ఆధారమైన వేదజ్ఞానాన్ని మన నుంచి విడదీయలేకపొయారన్నారు. వేద పాఠశాలతో పాటు ఆధునిక విజ్ఞానాన్ని అందిస్తున్న శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ను అభినందిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. వేదాలు, శాస్త్రాలను గౌరవిస్తూ విద్యార్ధులు తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షతన వహించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను వివరించారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ట్రస్ట్ రజతోత్సవాల సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో చైర్మెన్ తూములూరి శాయినాథ్ శర్మ, ప్రధాన కార్యదర్శులు పసుమర్తి బ్రహ్మానంద శర్మ, చింతపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ -
మధురం..56 ఏళ్ల జ్ఞాపకం
గురువును సత్కరించిన పూర్వ విద్యార్థులు అంబర్పేట: విద్యాబుద్ధులు నేర్పిన గురువును ఆత్మీయంగా సత్కరించారు. 56 ఏళ్లు గడిచినా విద్య నేర్పిన గురువును వారు విస్మరించలేదు. 1969లో కేశవ్ మెమోరియల్ స్కూల్లో పాఠాలు చెప్పిన మాస్టారు కె.యాదవరెడ్డి (ప్రముఖ కవి నిఖిలేశ్వర్)ని శిష్యులు సత్కరించి ఆత్మీయతను పంచారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఇందుకు శివంరోడ్ లోని ఓ హోటల్ వేదికై ంది. గురువారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో 1969 బ్యాచ్ విద్యార్థులు ప్రొఫెసర్ రుద్ర సాయిబాబా, డాక్టర్ భగవత్ రెడ్డి, సత్యనారాయణ, డి.ఎస్.ఎన్ మూర్తి, మల్లాది రాఘవ, జగన్రావుతో పాటు మరో 25 మంది పాల్గొన్నారు. -
అపార్ట్మెంట్ రెండో అంతస్తులో కొండ చిలువ
నిజాంపేట్: బాచుపల్లిలోని రెడ్డీస్ ల్యాబ్ సమీపంలోని ఒక అపార్ట్మెంట్లోని రెండో అంతస్తులో భారీ కొండ చిలువు ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. ఈ నెల 8న రెండో అంతస్తులోని ఓ గదిలో కొండ చిలువును గుర్తించిన అపార్ట్మెంట్ వాసులు స్నేక్ టీమ్కు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి కొండ చిలువను బంధించారు. అనంతరం దానిని సమీపంలోని అడవిలో వదిలేశారు. నిందితుడిపై కేసు నమోదు సైదాబాద్: మద్యం మత్తులో ఓ యువకుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...ఐఎస్సదన్ డివిజన్ పరిధిలో ఓ బాలిక కుటుంబంతో సహా నివాసం ఉంటోంది. వారి ఇంటి సమీపంలో ఓ యువకుడు (24) ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం బాలిక తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లగా బాలిక తన సోదరుడితో కలిసి ఇంట్లో ఉంది. అదే అదనుగా భావించిన సదరు యువకుడు ఆమెను తన గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్: పరిమితికి మించి బంగారం, వెండి ఆభరణాలతో పట్టుబడిన ఓ ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి హైదరాబాద్ వచ్చిన బిన్సన్ డేవిస్ అనే ప్రయాణికుడి కదలికలను గమనించిన సీఐఎస్ఎఫ్ అధికారులు చేతి సంచి క్షుణ్ణంగా పరిశీలించడంతో అందులో 2.80 కేజీల బంగారు ఆభరణాలు, 3 కేజీల వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి. ప్రయాణికుడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి భువనేశ్వర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు గుర్తించారు. సీఐఎస్ఎఫ్ అధికారులు ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఐటీ అధికారులు ఎయిర్పోర్టుకు చేరుకుని వారిని విచారిస్తున్నారు. కుత్బుల్లాపూర్: ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. తూర్పు గోదావరి జిల్లా, చింతపల్లికి చెందిన వినయ్దుర్గ (19) మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ చదువుతూ వర్సిటీ హాస్టల్లోనే ఉంటున్నాడు. గురువారం మధ్యాహ్నం హాస్టల్ వార్డెన్ రాజేంద్ర గదులను తనిఖీ చేస్తుండగా 010 గది లోపల నుంచి గడియపెట్టినట్లు గుర్తించాడు. దీంతో గది తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో వెంటిలేటర్ నుంచి చూడగా వినయ్ దుర్గ టవల్తో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో తలుపులు బద్దల కొట్టి వినయ్దుర్గను సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తుపాకీ విక్రయానికి పండ్ల వ్యాపారుల యత్నం
పట్టుకున్న సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్ సాక్షి, సిటీబ్యూరో: ఝార్ఖండ్ నుంచి వలస వచ్చి నగరంలో పండ్ల వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి తేలిగ్గా డబ్బు సంపాదించడానికి తుపాకీ విక్రయానికి యత్నించాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సీసీఎస్ స్పెషల్ జోనల్ క్రైమ్ టీమ్ అతడితో పాటు మరొకరిని పట్టుకున్నట్లు అదనపు సీపీ (నేరాలు) ఎం.శ్రీనివాసులు బుధవారం వెల్లడించారు. ఝార్ఖండ్కు చెందిన విజయ్ యాదవ్ నగరానికి వలసవచ్చి లింగంపల్లిలో నివసిస్తున్నాడు. వివిధ బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపుల వద్ద పండ్లు విక్రయిస్తూ జీవస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించిన ఇతగాడు నాటు తుపాకుల్ని తీసుకువచ్చి విక్రయించాలని భావించాడు. మూడు నెలల క్రితం బీహార్ వెళ్లి అక్కడి సోను కుమార్ నుంచి రూ.58 వేలకు 0.7 ఎంఎం క్యాలిబర్ నాటు పిస్టల్ ఖరీదు చేసుకువచ్చాడు. దీన్ని నగరంలోని అసాంఘిక శక్తులకు అమ్మడానికి సహకరించాల్సిందిగా సంతోష్నగర్లో ఉంటున్న తోటి పండ్ల వ్యాపారి బుంటి కుమార్ యాదవ్ను కోరారు. కొన్ని రోజులుగా ఇతగాడు ఆ అక్రమ ఆయుధం అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏసీపీ జి.వెంకటేశ్వర్రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బి.బిక్షపతి నేతృత్వంలోని బృందం ఫలక్నుమా ప్రాంతంలో వలపన్ని బుంటి కుమార్ను పట్టుకుంది. విజయ్ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి తుపాకీ, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం ఫలక్నుమా పోలీసులకు అప్పగించింది. -
ఆగాలి కాలుష్యం
నగరంలో ప్రమాదకర స్థాయిలో వాయు నాణ్యత సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గాలి నాణ్యత ప్రమాదకర స్థితికి చేరింది. ఫలితంగా కన్ను, ఊపిరితిత్తుల వ్యాధులు ప్రబలుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ఎన్నిరకాల కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ గాలి నాణ్యతను పెంచడంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), ప్రభుత్వ అధికార యంత్రాంగం విఫలమవుతోంది. నగర దారులపై పాదచారులు, మోటారు సైకిల్, బస్సుల్లో ప్రయాణించే వారికి నరకప్రాయంగా మారుతోంది. కాలుష్య నియంత్రణ మండలి నివేదికలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. నిర్మాణ, పారిశ్రామిక ప్రాంతాల్లో అవస్థలు ఇటీవల కురుస్తున్న వర్షాలతో నగరంలోని రహదారులు ఇసుక, మట్టిదిబ్బలతో దర్శనమిస్తున్నాయి. ఉదయం సమయంలో కాస్త ఎండ కాయడంతో తడారిపోయి వాహనాలు వెళ్లినపుడు ఇసుక, మట్టి, ధూళి కణాలు సాధారణ ప్రయాణికుల కళ్లలో పడుతున్నాయి. ఎల్బీనగర్, కోకాపేట్, ఉప్పల్, మాదాపూర్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో నిర్మాణ రంగం జోరుగా ఉన్న ప్రాంతాల్లో ఇది మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. పటాన్చెరు, పాశమైలారం, బొల్లారం వంటి పారిశ్రామిక వాడల్లోనూ వాయు కాలుష్యం గరిష్ట స్థాయిలను సూచిస్తోంది. సాధారణంగా పీఎం10 ధూళి కణాలు 0 నుంచి 50 ఉండాల్సి ఉండగా, నగరంలోని కోకాపేట్ ప్రాంతంలో బుధవారం 232గా నమోదయ్యింది. పీఎం2.5 సోమాజిగూడలో 200గా ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. నిర్మాణ రంగం వృద్ధిలో ఉన్న ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటోంది. పెద్ద సంఖ్యలో లారీలు మట్టి, ఇసుక, గ్రావెల్, సిమెంట్, ఇతరాలు తరలించే క్రమంలో కనీస నిబంధనలు పాటించడంలేదు. దీనిపై అటు జీహెచ్ఎంసీ, ఇటు కాలుష్య నియంత్రణ మండలి ఎవరూ పట్టించుకోవడం లేదు. చర్యలు అంతంతే.. వాయు కాలుష్యానికి కారణమవుతున్న వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకోవడంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఉదారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశ్రామిక ప్రాంతాల్లో అడపదడప తనిఖీలు చేపట్టడం, నోటీసులిస్తున్నారు. అరుదైన సందర్భాల్లో మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అనంతరం కొన్నాళ్లకు తిరిగి అదే పరిశ్రమ రీఓపెన్కు ఎన్ఓసీ జారీ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో అధికారుల తీరు పై బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. పనిచేయని పరికరాలు.. వాయు నాణ్యత కొలతల కోసం కాలుష్య నియంత్ర ణ మండలి ఏర్పాటు చేసిన పరికరాలు కొన్ని చోట్ల పనిచేయడం లేదు. బుధవారం నాచారం, ఐఐటీహెచ్ కంది ప్రాంతాల్లో గాలి నాణ్యత నివేదికలే అందుబాటులో లేవు. నగరం నడిబొడ్డున ఉన్న సన త్నగర్లో పీఎం 10 వివరాలు నమోదు చేయలేదు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు.. గాలిలో దూళికణాల సంఖ్య పెరిగినపుడు సీఓపీడీ, క్రానిక్ బ్రాంకై టిస్, ఆస్తమా జబ్బుల ప్రభావం పెరుగుతుంది. ఊపిరితిత్తుల సమస్య ఉన్న వారికి ఎక్కువ ఇబ్బంది. చల్లని కాలం, ఆపై గాలిలో నాణ్యత తగ్గితే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి సైతం ఈ గాలి ప్రమాదమే. తొలుత జలుబు చేసి, అది న్యుమోనియాగా మారొచ్చు. ధూళి కణాలు కళ్లలో పడినా ఇబ్బందికరమే. మోటారు సైకిల్పై వెళ్లే సమయంలో కళ్లజోడు ధరించడం మంచిది. – ప్రొ.టి. ప్రమోద్ కుమార్, పల్మనాలజిస్టు ఇటీవల వర్షాలతో రోడ్లపై పేరుకుపోయిన ఇసుక, మట్టి కళ్లల్లోకి దుమ్ము, ఇసుక రేణువులు శ్వాసకోశ వ్యాధులు వస్తాయంటున్న వైద్యులు వాహనదారులు, బస్సు ప్రయాణికులకు ఇబ్బందులు -
ఎన్నికల ప్రవర్తన నియమావళి.. ‘జూబ్లీహిల్స్’ వరకే
షేక్పేట తహసీల్దార్ ఆఫీస్లో ఆర్ఓ కార్యాలయం సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను తప్పక పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ప్రవర్తన నియమావళి)పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రవర్తన నియమావళికి లోబడే ఎన్నికల ప్రచారం నిర్వహించాలన్నారు. నియమావళి ఉల్లంఘిస్తే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రాపర్టీలపై ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఏర్పాటు చేయవద్దన్నారు. ప్రైవేట్ ప్రాపర్టీ లపై ప్రచార ప్రకటనలు పెడితే అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే తొలగించిన ప్రదేశాలలో అనుమతి లేకుండా మళ్లీ ప్రచార ప్రకటనలు పెడితే బాధ్యులపై కేసులతో పాటు వాటిని తొలగించేందుకయ్యే ఖర్చును కూడా బాధ్యుల పార్టీ ఖాతాల్లో వేస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే .. ఎన్నిక జరిగే అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర రాజధాని లేదా మెట్రోపాలిటన్ నగరాలు లేదా మున్సిపల్ కార్పొరేషన్లలో ఉంటే ఎన్నికల ప్రవర్తన నియామవళి కేవలం ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే వర్తిస్తుందన్న నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘం వెలువరించిందన్నారు. ఈ నిబంధనల ప్రకారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర రాజధానితో పాటు మెట్రోపాలిటన్ నగరంలో ఉన్నందున కేవలం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. షేక్పేట తహసీల్దార్ ఆఫీస్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేసినట్లు కర్ణన్ తెలిపారు. ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణకు పటిష్ట భద్రత చర్యలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ఉప ఎన్నికలో ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, ఎన్నికల అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, డీసీపీ అపూర్వ రావు, రిటర్నింగ్ అధికారి పి.సాయిరాం, రాజకీయ పార్టీల తరఫున కె.నందేశ్ కుమార్ (బీఎస్పీ), కొల్లూరు పవన్ కుమార్, ఎల్.దీపక్ (బీజేపీ), విజయ్ మల్లంగి (ఆప్), ఎం. శ్రీనివాసరావు (సీపీఐఎం), పి.రాజేశ్ కుమార్, మహ్మద్ వాజీద్ హుస్సేన్, ఎ.రాఘవేందర్ (కాంగ్రెస్), ఎ. శ్రీనివాస్ గుప్తా, కె. మాధవ్, కిషోర్ గౌడ్ (బీఆర్ఎస్), ప్రశాంత్ రాజ్ యాదవ్ (టీడీపీ), సయ్యద్ ఖలీలుద్దీన్ (ఎంఐఎం) పాల్గొన్నారు. 13 నుంచి నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ప్రచార ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి తప్పనిసరి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో రాజకీయ ప్రచార ప్రకటనలకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ,జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని సీపీఆర్వో విభాగంలో ఎంసీఎంసీ, మీడియా కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. -
‘పోస్ట్’ చేసే ముందు ఒక్క క్షణం!
● మనోభావాలను దెబ్బతీయొద్దని హితవు ● తప్పుడు సమాచార ప్రచారం వద్దని హెచ్చరిక డిజిటల్ అవేర్నెస్ చేపడుతున్న కొత్త కొత్వాల్ సాక్షి, సిటీబ్యూరో: కొత్త కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా డిజిటల్ అవేర్నెస్కు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి హ్యాష్ట్యాగ్ పాస్ బిషోర్ పోస్టు (పోస్టు చేసే ముందు ఒక్కక్షణం) అంటూ ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన బుధవారం కీలక సందేశాన్ని పోస్టు చేశారు. సోషల్మీడియా ప్రతి ఒక్కరినీ శక్తిమంతుల్ని చేసిందని, సమాచారాన్ని పంచుకోవడానికి, ఎదుటి వారిని ప్రేరేపించడానికి, ప్రభావితం చేయడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదైనా ఓ విషయాన్ని లేదా సమాచారాన్ని సెండ్ (పంపడం)... షేర్ చేయడానికి ముందు ఒక్క క్షణం ఆగి మూడు విషయాలను ఆలోచించాలని సజ్జనర్ స్పష్టం చేశారు. ఈ పోస్టు ఎవరినైనా బాధ పెడుతుందా..? ఇందులోని సమాచారం నిజమైనదేనా? సోషల్మీడియాలో ఓ వ్యక్తిని ఉద్దేశించి పెట్టే సమాచారం ఆయన ఎదురుగానూ వ్యాఖ్యానించగలవా? అనేవి సరి చూసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని సూచించారు. నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా షేర్ చేసిన కొన్ని అంశాలు ఎదుటి వారి కీర్తి ప్రతిష్టలు, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయనే విషయం మరిచిపోవద్దని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ డిజిటల్ రెస్పాన్స్బుల్గా ఉండాలని, ఏదైనా షేర్ చేసేముందు కచ్చితంగా ఆలోచించాలని సజ్జనర్ స్పష్టం చేశారు. వారంలో 85 లక్షల వ్యూస్.. సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే సజ్జనర్ తన ఖాతాలను తానే స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. యువతకు సైతం దగ్గర కావాలనే ఉద్దేశంతో ‘ఎక్స్’తో పాటు ఇన్స్ట్రాగాంలోనూ తనదైన పాత్రను పోషిస్తున్నారు. గతంలో హ్యాష్ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్ పేరుతో ఓ ఉద్యమాన్నే నడిపి ప్రత్యేక చట్టం కావడానికి తన వంతు కృషి చేశారు. యువతను ఈయన సొంత ఇన్స్ట్రాగాం ఖాతాను గడిచిన వారం రోజుల్లో 85 లక్షల మంది వీక్షించారు. నగర పోలీసు కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న ఫొటోకు ఇన్స్ట్రాగాంలో 12 లక్షలు, ‘ఎక్స్’లో 2 లక్షల వ్యూస్ వచ్చాయి. సజ్జనర్ ‘ఎక్స్’ ఖాతాకు వారం రోజుల్లో 15 లక్షల మంది రియాక్ట్ అయ్యారు. సోషల్మీడియా ద్వారా తన దృష్టికి వచ్చే ప్రతి అంశాన్ని నగర పోలీసు అధికారిక హ్యాండిల్స్కు ట్యాగ్ చేస్తున్న ఆయన ఆద్యంతం పర్యవేక్షిస్తున్నారు. చార్మినార్ వద్ద ఓ విదేశీ మహిళను వేధించిన వీడియో ఇటీవల వైరల్గా మారింది. దీన్ని క్షేత్రస్థాయి అధికారులకు పంపిన సజ్జనర్ పూర్తి స్థాయి విచారణ చేయించి మూడేళ్ల క్రితం నాటిదిగా నిర్ధారించారు. -
కోడ్ కూసింది!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో క్షేత్ర స్థాయిలో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. జూబ్లీహిల్స్తో పాటు ఖైరతాబాద్ నియోజక వర్గంలోని ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లను బల్దియా సిబ్బంది తొలగిస్తున్నారు. బుధవారం రాజకీయ నేపథ్యమున్న విగ్రహాలను దుస్తులతో మూసివేశారు. ఆయా కూడళ్లలోని పార్టీ జెండాలను సైతం తొలగించారు. ఇప్పటికే బస్టాప్లలో ఉన్న ఫ్లెక్సీలను, బస్తీల్లో ఉన్న రాజకీయ నేతల ఫ్లెక్సీలను కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. మరో వైపు గోడలపై రాసిన రాతలను చెరిపేసేందుకు రంగులను తీసుకొచ్చి సిబ్బంది శ్రమిస్తున్నారు– ఫిలింనగర్ జూబ్లీహిల్స్లో.. -
నకిలీ గేమింగ్ యాప్తో మోసం
● ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: నకిలీ గేమింగ్ ఫ్లాట్ఫామ్లతో అమాయకులను మోసం చేస్తున్న ఐదుగురు సైబర్ నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్కు తరలించారు. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ శోభన్ కుమార్తో కలిసి సైబర్ క్రైమ్ డీసీపీ సాయి శ్రీ బుధవారం వివరాలు వెల్లడించారు. నవీన్కుమార్, సందీప్ కుమార్, పృథ్వీ రామరాజు, పవన్ వెంకట నాగభరద్వాజ్, రామాంజనేయులు ముఠాగా ఏర్పడి టెలిట్రాం, వాట్సాప్ గ్రూప్లలో డాడ్జ్ బుక్777 అనే నకిలీ గేమింగ్ ఫ్లాట్ఫామ్ను ఫ్లాట్ఫామ్లను నిర్వహించేవారు. బాధితులను నుంచే కాజేసే సొమ్మును నిర్వహించేందుకు అవసరమైన బ్యాంక్ ఖాతాల కోసం ఈ ముఠా నకిలీ పేర్లు, చిరునామా, ఆధార్ కార్డ్లతో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్లలో 120కు పైగా బ్యాంక్ అకౌంట్లను తెరిచారు. గేమింగ్ ఫ్లాట్ఫామ్లలో నకిలీ లాభాలను చూపించి, బాధితుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్మును వసూలు చేసేవారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వివిధ ఖాతాలలో ఉన్న రూ.14 లక్షల సొమ్ముతో పాటు రెండు ల్యాప్టాప్లు, 30 సెల్ఫోన్లు, చెక్ బుక్స్, ఏటీఎం కార్డ్లు, సిమ్కార్డ్లను స్వాధీనం చేసుకున్నారు. -
రోడ్డు మధ్యలో ఆగిన బస్సు
గంటన్నర పాటు ట్రాఫిక్ జామ్ బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ చౌరస్తాలో బుధవారం ఉదయం ఓ ప్రైవేట్ బస్సు నిలిచిపోవడంతో సీవీఆర్ న్యూస్ వైపు నుంచి వచ్చే వాహనాలతో పాటు జర్నలిస్టు కాలనీ వైపు వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రోడ్ నెం. 45 జంక్షన్లోని బారికేడ్లను తొలగించి కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్ళే వాహనాలను ముందుకు పంపించారు. బస్సును టోయింగ్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అది కదలకపోవడంతో మెకానిక్ను తీసుకొచ్చి బస్సుకు రిపేర్ చేయించి తరలించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సీఐ నర్సింగ్రావు ఘటనా స్థలానికి వచ్చి బస్సును పంపించే వరకు ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. -
పరిహారంతో పాటు ఇంటి స్థలం
ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్మినేడులో టీజీఐఐసీకి భూములు కోల్పోయిన రైతులకు పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు ఇస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. భూ సేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, టీజీఐఐసీ అధికారుల సమక్షంలో బుధవారం భూనిర్వాసితుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలను సేకరించారు. పరిహారం పూర్తి స్థాయిలో ఇవ్వాలని బాధితులు కోరారు. పరిహారం తీసుకున్న వారి జాబితాలో కొంత మంది అనర్హులు ఉన్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్మినేడులో వెంచర్ ఏర్పాటు చేసి పరిహారంతో పాటు ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లీగల్ టీం సభ్యుడు శ్రావన్, ఎల్మినేడు భూ కమిటీ నాయకులు శ్రీకాంత్రెడ్డి, మహేందర్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
గ్లెండేల్ అకాడమీ విద్యార్థులకు సీఎం అభినందన
బండ్లగూడ: సింగపూర్లో ఇటీవల జరిగిన గ్లోబల్ ఎక్సలెన్స్ డే(జీఈడీ) 2025లో మిడిల్ స్కూల్ విభాగంలో సన్సిటీలోని గ్లెండేల్ అకాడమీ విద్యార్థులు బంగారు పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యార్థులను అభినందించి సన్మానించారు. గ్రీన్ గ్లెన్ గార్డియన్స్ బృందంలో ఆరాధ్య దుద్దిళ్ల శ్రీపాదరావు(6వ తరగతి), నిగమా పెన్మెట్సా(6వ తరగతి), సయ్యద్ అలిజా జైఆమా(6వ తరగతి), రాహిని సమ్హిత వర్మ దంతులూరి(7వ తరగతి), జేడెన్ డి రోజారియో(7వ తరగతి) ఉన్నారు. ఈ బృందం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 11 పాఠశాలల నుంచి 200 మందికి పైగా విద్యార్థులతో పోటీపడ్డారు. ది గుడ్ ఫుడ్ మూవ్మెంట్ అనే తమ ప్రాజెక్టును కై జెన్ (నిరంతర అభివృద్ధి) అనే అంశం కింద ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వారు సేంద్రియ వ్యవసాయం, స్ధిరమైన వ్యవసాయ విధానాల ప్రాముఖ్యతను వివరించారు. రసాయనాలపై ఆధారపడిన వ్యవసాయం వల్ల కలిగి హానికర ప్రభావాలు, పర్యావరణపరమైన బాధ్యతాయుత పద్ధతుల అవసరం, పర్యావరణ అవగాహన పెంపు కోసం ప్రాక్టికల్ లెర్నింగ్ ప్రాముఖ్యత తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ... తమ ఆవిష్కరణాత్మక ఆలోచనలతో స్థిరమైన అభివృద్ధి పట్ల కట్టుబాటుతో తెలంగాణను ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఈ విద్యార్థులు రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ మిను సలూజా తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్పై ఫిర్యాదు
పహాడీషరీఫ్: ముస్లింల ఆరాధ్య దైవం మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సయ్యద్ ఖాజా పాషా కోరారు. ఈ మేరకు బుధవారం పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కలిసి మెలసి ఉంటున్న ప్రజల నడుమ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రాజాసింగ్ యత్నిస్తున్నారన్నారు. ఇప్పటికీ ఎన్నో మార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్స్పెక్టర్ను కలిసిన వారిలో పార్టీ నాయకులు అబ్దుల్ ఖదీర్, మహ్మద్ ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు. -
మహా అడుగులు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్థమైంది. హెచ్ఎండీఏ పరిధి ట్రిపుల్ ఆర్ వరకు పెరిగిన దృష్ట్యా అందుకనుగుణంగా కార్యకలాపాల నిర్వహణ కోసం జోనల్ వ్యవస్థను విస్తరించనున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగర అవసరాలను దృష్టిలో ఉంచుకొని హెచ్ఎండీఏ సేవలను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో సంస్థాగతమైన పునర్వ్యవస్థీకరణకు చర్యలు చేపట్టారు. ఈమేరకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి సమగ్రమైన నివేదికను అందజేసేందుకు కన్సల్టెన్సీ నియామకం కోసం ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించారు. హెచ్ఎండీఏ పరిధిని 7,257 చ.కి.మీ. నుంచి 10,526 చ.కి.మీ. వరకు విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 11 జిల్లాలు, 104 మండలాలు, 1,359 గ్రామాలు హెచ్ఎండీఏలో విలీనమయ్యాయి. ఈ మేరకు ప్రణాళికాబద్ధమైన మహానగరం నిర్మాణం, అభివృద్ధి దృష్ట్యా కార్యకలాపాలను వికేంద్రీకరించనున్నారు. ప్రస్తుతం ఘట్కేసర్, శంషాబాద్, శంకర్పల్లి–1, శంకర్పల్లి–2, మేడ్చల్–1, మేడ్చల్–2 జోన్ల పరిధిలో హెచ్ఎండీఏ ప్రణాళికా విభాగం సేవలను అందజేస్తోంది. కొత్తగా పెరిగిన పరిధిని దృష్టిలో ఉంచుకొని మరో నాలుగు జోన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటి పరిధిలోకి వచ్చే ప్రాంతాలను కూడా పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇందుకనుగుణంగా అధ్యయనం చేసి నివేదికను అందజేసేందుకు కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. లక్ష్యాలు ఇలా.. ● అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హెచ్ఎండీఏను సంస్థాగతంగా పునర్వ్యవస్థీకరించనున్నారు. ● జోనల్ వ్యవస్థలను విస్తరించడంతో పాటు జోనల్స్థాయి కమిషనర్లను కూడా నియమించనున్నారు. తద్వారా అన్ని రకాల నిర్మాణరంగ అనుమతులు, లే అవుట్లు జోనల్ స్థాయిలోనే అందజేస్తారు. దీంతో మెట్రోపాలిటన్ కమిషనర్ వ్యూహాత్మక ప్రణాళిక, విధాన రూపకల్పనపై ప్రధానంగా దృష్టి సారించేందుకు అవకాశం లభిస్తుంది. ● హెచ్ఎండీఏలోని వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ను ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. మహానగర అభివృద్ధే ధ్యేయం.. పునర్వ్యవస్థీకరణ, జోనల్ స్థాయిలో సేవల వికేంద్రీకరణ ద్వారా హైదరాబాద్ మహా నగరాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించేందుకు అవకాశం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ గ్రీన్ఫీల్డ్ రోడ్లు,ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధివంటి ప్రధానమైన కార్యకలాపాలపై కమిషనర్ దృష్టి కేంద్రీకరించనున్నారు. మరోవైపు సమర్థ ల్యాండ్పూలింగ్ పథకాన్ని అమలు చేయడంతో పాటు, ఏకీకృత బిల్డింగ్, డెవలప్మెంట్ కోడ్ను రూపొందించడం, మాస్టర్ప్లాన్–2050 రూపకల్పన, డిజిటల్ ట్విన్ టెక్నాలజీ వంటి లక్ష్యాల దిశగా కార్యాచరణ చేపట్టనున్నారు. హెచ్ఎండీఏ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం ట్రిపుల్ ఆర్ వరకు జోనల్ వ్యవస్థ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి కన్సల్టెన్సీ సాంకేతిక, ఆర్థిక బిడ్లపై దరఖాస్తులకు ఆహ్వానం కన్సల్టెంట్ల ఎంపిక ఇలా.. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్ల కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)ని ఆహ్వానించారు. కన్సల్టెంట్ ఎంపిక క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ (క్యూసీబీఎస్) పద్ధతిలో 80:20 నిష్పత్తిలో జరుగుతుందని అధికారులు తెలిపారు. ఆర్ఎఫ్పీలో పేర్కొన్న అర్హత ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అర్హత సాధించిన బిడ్డర్ల ఫైనాన్షియల్ బిడ్లను మాత్రమే తెరిచి తుది ఎంపిక చేపడతారు. -
‘సోషల్’ వార్.. పొలిటికల్ పోరు!
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రాజకీయ యుద్ధం ఇప్పుడు మరింత తీవ్రం కానుంది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ చానెళ్లను పెయిడ్ చానెళ్లుగా మార్చిన పార్టీలు.. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో వైరి పార్టీపె విమర్శలు, ప్రతివిమర్శల్ని మరింత ముమ్మరం చేయనున్నాయి. ఓవైపు తమ పార్టీలో జరుగుతున్న కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలు.. ప్రత్యర్థి పార్టీ లోపాల్ని అంతకంటే వేగంగా ఎండగడుతున్నాయి. వాయువేగంతో అవి వాట్సప్ గ్రూపు ల్లోనూ షేర్ అవుతుండటంతో ఏ కామెంట్ ఎప్పుడు వైరల్గా మారుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య సునీతను ప్రకటించింది. కాంగ్రెస్లో అభ్యర్థి ఎవరో ఇంకా తెలియదు. నామినేషన్ల దాఖలుకు కూడా ఇంకా సమయముంది. ఇంతెందుకు ఎన్నికల షెడ్యూలు వెలువడకముందే.. ఇప్పటికే కొంతకాలంగా బీఆర్ఎస్, కాంగెరస్ ఒకదానిపై మరొకటి సోషల్మీడియా వేదికగా తీవ్ర యుద్ధమే చేస్తున్నాయి. తమ పార్టీల పేరిట, పార్టీ సైన్యాల పేరిట ప్రత్యర్థులపై ఇవి విసురుతున్న విమర్శనాస్త్రాలు ప్రజల అరచేతిలోని మొబైల్కు తీరిక లేకుండా చేస్తున్నాయి. ఎవరి సత్తా వారిదే.. అధికార పార్టీ కాంగ్రెస్ తాము చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తదితరాల అప్డేట్స్ను చేరవేయడంతో పాటు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన విధ్వంసాలు, నిర్వాకాలు అంటూ రూపొందించిన దృశ్యాల్ని ప్రజల్లోకి వెళ్లేలా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటినుంచో బలంగా ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ను తూర్పారబడుతోంది. ‘అప్పుడెట్లుండె పాలన.. ఎప్పుడేమైంది? అంటూ ప్రజల్లో కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోంది. అంతేకాదు.. ప్రజాభిప్రాయాల పేరిట అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండూ వేటికవిగా తమ అనుకూల చానెళ్ల ద్వారా తమ పార్టీకే ప్రజలు మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. సొంతంగా వాట్సప్ చానెళ్లనూ నిర్వహిస్తున్నాయి. ఇన్ఫ్లూయెన్సర్లు, పెయిడ్ క్యాంపెయిన్లు, కంటెంట్ క్రియేషన్, రాజకీయ వ్యూహాల్లో ప్రధాన భాగమయ్యాయి. రీల్స్తో రిప్లయ్లు.. వీడియోలతో ప్రచారం, రీల్స్తో రిప్లయ్లు, ట్రెండ్గా మారాయి. ఇక ఆ పార్టీల సోషల్మీడియా టీమ్స్, వారియర్స్ నిర్విరామంగా పని చేస్తున్నాయి. ఇదంతా రూ.కోట్ల మేర ప్రచారమని సంబంధిత రంగం గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఈనేపథ్యంలో సగటు ఓటర్లు సైతం సోషల్మీడియాకు ప్రభావితమవుతున్నారు. ఏ పార్టీ ప్రచారం విస్తృతంగా ఉంటే దాని వలలో పడే పరిస్థితి ఏర్పడింది. పార్టీలకు సైతం గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ కంటే సోషల్ మీడియా కామెంట్ సెక్షన్, ఫీడ్బ్యాక్, లైక్స్, కీలకంగా మారాయి. ఈ పరిణామాలతో జూబ్లీహిల్స్ రాజకీయాలు హ్యాష్ట్యాగ్స్తో జరుగుతున్నాయి. ఓటర్లు స్క్రోల్స్, థంబ్నెయిల్స్తో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి పార్టీల తొందర నామినేషన్లు ప్రారంభం కాకున్నా,అభ్యర్థులెవరో తెలియకున్నా.. క్షేత్రస్థాయి కంటే సోషల్ మీడియాలో ముమ్మరం రాజకీయ వ్యూహంలో రీల్స్, పెయిడ్ క్యాంపెయిన్లు దూసుకుపోతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ -
సెల్ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తే...
ఇక కఠిన చర్యలు తప్పవు సాక్షి, సిటీబ్యూరో: సెల్ఫోన్ డ్రైవింగ్ కారణంగా 2023లో 23 రోడ్డు ప్రమాదాలు జరగ్గా... ముగ్గురు అసువులు బాశారు. మరో 26 మంది క్షతగాత్రులయ్యారు. ఒకప్పుడు కేవలం సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపే డ్రైవర్లు మాత్రమే రోడ్లపై కనిపించే వాళ్లు. అయితే ప్రసుత్తం మారిన పరిస్థితుల నేపథ్యంలో సెల్ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేసే వారి సంఖ్యా పెరిగింది. ఈ విషయాన్ని గమనించిన నగర కొత్వాల్ సజ్జనర్ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లో వీడియోలు చూసే, ఇయర్ ఫోన్లు వినియోగించే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులకు స్పష్టం చేశారు. తప్పనిసరిగా మారిపోయిన సెల్ఫోన్... మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహనం నడిపే సమయంలో సెల్ఫోన్ వినియోగించడం తీవ్రమైన ఉల్లంఘన. ఒకప్పుడు ఈ ఉల్లంఘనలను గుర్తించడం, బాధ్యుతలపై చర్యలు తీసుకోవడం ట్రాఫిక్ పోలీసులకు తేలిగ్గా సాధ్యమయ్యేది. అయితే ఇటీవల కాలంలో యాప్ ఆధారంగా నడిచే బైక్ ట్యాక్సీలు, క్యాబ్లు, గిగ్ వర్కర్లు వచ్చిన తరవాత పరిస్థితులు మారిపోయాయి. వీరి కార్యకలాపాలకు సంబంధించి బుకింగ్ దగ్గర నుంచి డెలివరీ వరకు, పికప్ దగ్గర నుంచి డ్రాపింగ్ వరకు అంతా యాప్ ఆధారంగానే సాగుతుంది. దీంతో ఈ రంగంలో ఉన్న ప్రతి డ్రైవర్ సెల్ఫోన్ను చూడటం, మాట్లాడటం అనివార్యంగా మారిపోయింది. దూరప్రాంతాల సర్వీసుల్లో వెళ్లే ఆర్టీసీ డ్రైవర్లు సైతం తమ ప్రయాణికులతో సంప్రదింపులు జరపడానికి సెల్ఫోన్ వినియోగించాల్సి వస్తోంది. ఇలాంటి అనేక కారణాల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు సైతం చాలా సందర్బాల్లో సెల్ఫోన్ డ్రైవింగ్ను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ‘ఇయర్’తో ఇంకో సమస్య వస్తోంది... నగర వ్యాప్తంగా ఇయర్ ఫోన్ డ్రైవింగ్ సైతం సాధారణ అంశంగా మారిపోయింది. ప్రధానంగా యువతే ఈ రకంగా వాహనాలు నడుపుతున్నారు. ఇయర్ ఫోన్లు, బ్లూటూత్, బడ్స్, పోర్డ్స్ చెవిలో పెట్టుకుని ముందుకుసాగుతుంటారు. బైక్ ట్యాక్సీలు, క్యాబ్లు, గిగ్ వర్కర్లు కూడా ఇది తప్పనిసరిగా మారిపోయింది. సెల్ఫోన్ డ్రైవింగ్ కన్నా ఇలాంటి ఇయర్ ఫోన్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో చార్జ్షీట్లు సైతం దాఖలు చేసినా... ఒకప్పుడు సెల్ఫోన్ డ్రైవింగ్, ఇయర్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ చిక్కిన వారికి ట్రాఫిక్ పోలీసుల కేవలం జరిమానా మాత్రమే విధించే వారు. సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనల్ని మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనం నడిపే వ్యక్తికి ప్రమాదకరంగా మారేవి, ఎదుటి వ్యక్తికి ప్రమాదకరంగా పరిగణించేవి, వాహనం నడిపే వారితో పాటు ఎదుటి వారికీ ముప్పు తీసుకువచ్చేవి. సెల్/ఇయర్ ఫోన్ డ్రైవింగ్కు ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ మూడో కేటగిరీలోకి చేర్చారు. ఈ ఉల్లంఘనులకు కేవలం జరిమానా విధించడం కాకుండా కోర్టుల్లో అభియోగపత్రాలు దాఖలు చేయాలని 2018లో నిర్ణయం తీసుకున్నారు. సెల్ఫోన్ డ్రైవింగ్ కంటే ప్రమాదకరమైంది కావడంతో తొలిదశలో ఇయర్ ఫోన్ డ్రైవింగ్పై దృష్టి పెట్టారు. కోర్టులో చార్జ్షీట్లు దాఖలు చేయడానికి అనువుగా దీనికంటూ ఎంవీ యాక్ట్లో ప్రత్యేక సెక్షన్ లేదు. దీంతో ప్రమాదకరంగా వాహనం నడపటం (సెక్షన్ 184) కింద అభియోగపత్రాలు దాఖలు చేశారు. కాలక్రమంలో ఆ విధానం అటకెక్కడంతో మళ్లీ జరిమానాలకే పరిమితం అయ్యారు. సిటీలో సెల్ఫోన్ డ్రైవింగ్ కేసులు ఇలా.. ఏడాది నమోదైన కేసులు 2014 13,008 2015 27,333 2023 58,056 2024 78,108 ‘బ్లూటూత్’ను ఎలా గుర్తిస్తారో? అప్పట్లో ట్రాఫిక్ పోలీసులు ‘ఇయర్ ఫోన్’ డ్రైవింగ్ చేస్తున్న వారిని పట్టుకున్నారు. వీరి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకున్న అధికారులు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) కౌన్సిలింగ్ అనంతరం చార్జ్షీట్ దాఖలు చేస్తూ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆరుగురిని రెండు రోజుల చొప్పున జైలు శిక్ష కూడా విధించింది. ద్విచక్ర వాహన చోదకుడు ఇయర్ఫోన్/సెల్ఫోన్ డ్రైవింగ్ చేస్తుంటే గుర్తించడం తేలికే. వీరితో పాటు కార్లలో వెళ్తున్న వారు బ్లూటూత్స్, బర్డ్స్ వాడుతున్న వారిని పట్టుకోవడం ఎలా అన్నదే ప్రధాన సమస్య. మరోపక్క బైక్ ట్యాక్సీలు, క్యాబ్లు, ఆటోలు, గిగ్ వర్కర్లకు ఈ సెల్ఫోన్ అనివార్యమైన సాధనంగా మారిపోయింది. ఇలాంటి వాళ్లు ఆ ఫోన్ను తమ వృత్తికోసమే వాడుతున్నారా? వీడియోలు చూస్తున్నారా? అనేది గుర్తించడం కష్టసాధ్యం. ఇటీవల కాలంలో కార్లలో బ్లూటూత్స్ వినియోగిస్తున్న నేపథ్యంలో వారిని ఎలా పట్టుకుంటారు? ఇలాంటి వాహనాల్లో తిరుగుతూ పెద్ద ఎత్తున మ్యూజిక్ వినే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనేది కీలకంగా మారింది. -
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఈ–వీల్చైర్
శంషాబాద్: శారీరక ఇబ్బందులతో నడవలేని ప్రయాణికుల కోసం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ–(ఎలక్ట్రానిక్) వీల్చైర్ను మంగళవారం నుంచి ఎయిర్పోర్టు నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రెస్టో ఎయిర్సర్వీసెస్ ఆధ్వర్యంలో ఈ–వీల్చైర్లు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. డిపార్చుర్ ఫోర్కోర్ట్ నుంచి ఎస్హెచ్ఏ వద్ద నున్న డీఎఫ్ఎండీ పాయింట్ వరకు వీటి సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. తనిఖీల అనంతరం అక్కడి నుంచి బోర్డింగ్ పాయింట్ వరకు ప్రయాణికులకు వీటి సేవలు అందుబాటులో ఉంటాయని ఎయిర్పోర్టు అధికారులు వెల్లడించారు. -
హీటెక్కిన జూబ్లీహిల్స్
ఉప ఎన్నికల నేపథ్యంలో గరం.. గరం ● ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం ● అంతర్గత కుమ్ములాటలతో సతమతం ● తుది దశకు చేరుకున్న అభ్యర్థుల ఎంపికసాక్షి, సిటీబ్యూరో: ఉప ఎన్నికల నేపథ్యంలో జూబ్లీహిల్స్ హీటెక్కింది. ఈ నియోజకవర్గంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ప్రధాన రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంటోంది. మరోవైపు సొంత పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు కేడర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకరి బలహీనతలను మరొకరు బయట పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రధాన పక్షాలు రంగంలోకి దిగి ఒకరి వైఫల్యాలను మరొకరు ఎండగడుతూ ఓటర్లను ఆకర్షించేందుకు పడరాని పాట్లు పాడుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నువ్వా.. నేనా? అన్న విధంగా పోరు కోసం సిద్ధమయ్యాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఖరారు కాగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపిక కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ చేతిలో బీసీ కార్డు.. అధికార కాంగ్రెస్ ఉప ఎన్నికలో బీసీ కార్డు ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బీసీ అభ్యర్థినే బరిలోకి దింపుతామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమా ర్ గౌడ్ ప్రకటించారు. మరోవైపు అధిష్టానానికి పంపిన షార్ట్ లిస్ట్లో ముగ్గురు బీసీలు, ఒకరు ఓసీ ఉన్నారు. బీసీ అభ్యర్థిత్వం ప్రాధాన్య క్రమంలో ఓసీ అభ్యర్థి బరి నుంచి తప్పించినట్లయింది. ము గ్గురు బీసీల్లో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాత్రం తాను టికెట్ రేసులో లేనంటూనే.. అధి ష్టానం నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రచార దూకుడు.. అభ్యర్థి ఎంపికలో మిగతా పార్టీల కంటే బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ప్రచారానికి దిగింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత అభ్యర్థిత్వం ఖరారు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రచార బాధ్యతలను తన భుజాల మీద వేసుకొని రంగంలోకి దిగారు. అధికార కాంగ్రెస్పై వ్యతిరేకత. మాగంటి గోపీనాథ్ సేవలు, మహిళా సానుభూతి పవనాలు గెట్టేక్కిస్తాయని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. సిట్టింగ్ స్థానం కావడంతో చేజారకుండా ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుంది. బలోపేతానికి బీజేపీ కసరత్తు.. భారతీయ జనతాపార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం పార్టీని ఇప్పటి నుంచే బలోపేతం చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉండడంతో ఆ పార్టీకి ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైనప్పటికీ.. రాష్ట్రంలో పెరిగిన బలంతో ఈసారి కాంగ్రెస్సే తమకు పోటీ అని భావిస్తోంది. ఇప్పటికే కమలనాథులు రంగంలోకి దిగి సుడిగాలిలా పర్యటిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డితో పాటు జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, ఆర్.రామకృష్ణ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అభ్యర్థిత్వం ఖరా రు కోసం ఆ పార్టీ అభిప్రాయ సేకరణ చేస్తోంది. -
యాక్ట్..బిగ్ బాస్కెట్!
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యాక్ట్ ఫైబర్..నిత్యావసరాల డెలివరీ సంస్థ బిగ్ బాస్కెట్ పేర్లు చెప్పి సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఇద్దరికి టోకరా వేశారు. మొత్తం రూ.3.06 లక్షలు కోల్పోయిన బాధితులు సోమ, మంగళవారాల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బహదూర్పురకు చెందిన యువకుడు (30) ఈ నెల ఒకటిన వైఫై సేవల కోసం గూగుల్లో సెర్చ్ చేశాడు. అందులో యాక్ట్ ఫైబర్ కస్టమర్ కేర్ పేరుతో కనిపించిన నెంబర్కు ఫోన్ చేశాడు. దీన్ని అందుకున్న వ్యక్తి మరో నెంబర్ ఇచ్చి దానికి కాల్ చేయమని చెప్పారు. యువకుడు ఫోన్ చేయడానికి ముందే ఆ నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. యాక్ట్ ఫైబర్ ప్రతినిధిగా మాట్లాడిన అవతలి వ్యక్తి వైఫై రిజిస్ట్రేషన్ కోసం గూగుల్ పే ద్వారా రూ.2 చెల్లించాలని కోరాడు. ఆపై రిజిస్ట్రేషన్ను ఖరారు చేయడానికి 90500, 8500 కోడ్స్ టైప్ చేయాలని సూచించాడు. నిజమే అని నమ్మిన బాధితుడు అలానే చేయగా..గూగుల్ పే ద్వారా అతడి ఖాతా నుంచి రూ.90,500, రూ.8,500 సైబర్ నేరగాడి ఖాతాలోకి వెళ్లిపోయాయి. దీనిపై ఫోన్ ద్వారా బాధితుడు అవతలి వ్యక్తిని ప్రశ్నించాడు. అది పొరపాటున జరిగి ఉంటుందని, 24 గంటల్లో రీఫండ్ కావడానికి పేస్యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. బాధితుడు అలా చేయగానే..దాని ద్వారా సైబర్ నేరగాడు మరో రూ.10 వేలు స్వాహా చేశాడు. వెంటనే అప్రమత్తమైన బాధితుడు తన బ్యాంకు ఖాతా ఫ్రీజ్ చేయించి, సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించాడు. ఇదిలా ఉండగా... యూసుఫ్గూడకు చెందిన మరో వ్యక్తికి (36) గత నెల 30న ఓ వెబ్సైట్లో అతి తక్కవ ధరలకు నిత్యావసరాల సరఫరా పేరుతో ఉన్న ప్రకటన చూశాడు. దాని ద్వారా తనకు అవసరమైన కొన్ని సరుకులు ఆర్డర్ చేశాడు. ఈ నెల 2న బాధితుడికి ఓ ఫోన్కాల్ వచ్చింది. నిత్యావసరాల సరఫరా సంస్థ బిగ్ బాస్కెట్ కస్టమర్ కేర్ ప్రతినిధిగా అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఆర్డర్ చేసిన వస్తువులు పంపడానికి నగదు చెల్లించాలని సూచించాడు. దీనికోసం ఏపీకే ఫైల్ను వాట్సాప్ ద్వారా పంపి క్లిక్ చేయమని కోరారు. బాధితుడు అలా చేయడంతో ఆ ఫైల్ అతడి ఫోనులో నిక్షిప్తమై, దాని యాక్సస్ మొత్తం సైబర్ నేరగాడి చేతికి వెళ్లిపోయింది. ఆపై బాధితుడు నిత్యావసరాల నిమిత్తం చెల్లించాల్సిన రూ.360 ఆన్లైన్లో పే చేశాడు. ఫోన్ యాక్సస్ మొత్తం సైబర్ నేరగాడి చేతిలో ఉండటంతో ఈ ఓటీపీలు, పిన్ నెంబర్లు అతడు సంగ్రహించగలిగాడు. ఆ వివరాలను వినియోగించుకున్న సైబర్ నేరగాడు బాధితుడి ఖాతా నుంచి రూ.1.97 లక్షల కాజేశాడు. ఈ రెండు ఉదంతాలపై కేసులు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేస్తున్నారు.ఈ పేర్లతో ఇరువురిని మోసం చేసిన నేరగాళ్లు ఇద్దరు బాధితుల నుంచి రూ.3.06 లక్షలు స్వాహా సైబర్ క్రైమ్ ఠాణాలో వేర్వేరుగా కేసులు నమోదు -
జిల్లా ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు: ఆర్వీ కర్ణన్
లక్డీకాపూల్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లా ఫిర్యాదుల కమిటీనీ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున జిల్లా పరిధిలో ప్రయాణం చేసే పౌరులు పరిమిత మొత్తంలో నగదు లేదా విలువైన వస్తువులు మాత్రమే తీసుకెళ్లాలని ఆయన సూచించారు. నగరంలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్లు (ఎఫ్ఎస్టీ), స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్లు (ఎస్ఎస్టీ) నిరంతరం తనిఖీలు చేపడుతూ.., అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుంటాయన్నారు. సరైన ఆధారాలు చూపకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. నగదు జప్తుకు సంబంధించి జిల్లా ఫిర్యాదుల కమిటీకి తగిన ఆధారాలు పౌరులు చూపితే ఎన్నికల నిబంధనల మేరకు పరిశీలించి జప్తు చేసిన నగదును తిరిగి అందజేస్తామన్నారు. జిల్లా ఫిర్యాదుల కమిటీ సభ్యులు, వారి మొబైల్ నంబర్లు ఇలా ఉన్నాయి.. కేఏ మంగతాయారు, అదనపు కమిషనర్ (ఎస్టేట్స్), జీహెచ్ఎంసీ, 91776 08271, (కమిటీ చైర్ పర్సన్), ఎస్.వెంకటేశ్వర్రెడ్డి, చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్, ఎన్నికల వ్యయం పర్యవేక్షణ నోడల్ ఆఫీసర్ 91212 40116, (కమిటీ కన్వీనర్), వసుంధర, డిప్యూటీ డైరెక్టర్, డీటీఓ, 98490 44893, (సభ్యురాలు). జిల్లా ఫిర్యాదుల కమిటీ కార్యాల యం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం (3వ అంతస్తు, ట్యాంక్ బండ్)లోని అదనపు కమిషనర్ (ఎస్టేట్స్) చాంబర్లో ఉంటుందని, ఫిర్యాదుదారులు, పౌరులు ఈ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆర్వీ కర్ణన్ సూచించారు. -
మెట్రో కిటకిట
సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికుల రాకపోకలతో సోమవారం నగరంలోని పలు మెట్రోస్టేషన్లు, మెట్రోరైళ్లు కిటకిటలాడాయి. దసరా సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లిన ప్రయాణికులు నగరానికి తిరిగి చేరుకోవడంతో వివిధ ప్రాంతాల్లో మెట్రోస్టేషన్లలో రద్దీ నెలకొంది. విజయవాడ వైపు నుంచి పలు ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్నవాళ్లు ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు బయలుదేరారు. దీంతో ఎల్బీనగర్ మెట్రో వద్ద ఉదయం నుంచి ఇంచుమించు మధ్యాహ్నం వరకు ప్రయాణికుల సందడి నెలకొంది. అలాగే నగరంలోని ప్రధాన మెట్రో స్టేషన్లైన నాగోల్, ఉప్పల్, సికింద్రాబాద్ ఈస్ట్, అమీర్పేట్, రాయదుర్గం, లక్డీకాపూల్, ఖైరతాబాద్, కూకట్పల్లి, మియాపూర్ తదితర స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరోవైపు దసరా అనంతరం శని, ఆదివారాలతో పాటు సోమవారం కూడా నగరవాసులు సొంత ఊళ్ల నుంచి పెద్ద సంఖ్యలో నగరానికి చేరుకున్నారు. తిరుగుప్రయాణం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ డిమాండ్ మేరకు అందుబాటులో లేకపోవడం వల్ల జిల్లా కేంద్రాల్లో గంటల తరబడి పడిగాపులు కాయాల్సివచ్చిందని పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న రైళ్లతో సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి, లింగంపల్లి స్టేషన్లలో సందడి కనిపించింది. సొంత వాహనాల్లోనూ జనం పెద్ద ఎత్తున నగరానికి చేరుకున్నారు. దీంతో విజయవాడ, వరంగల్, కరీంనగర్, తదితర ప్రధాన రహదారుల్లోని శివారు ప్రాంతాల్లో భారీ రద్దీ కారణంగా వాహనాలు స్తంభించాయి. -
అక్రమ లేఔట్లు... రహదారుల ఆక్రమణలు!
సాక్షి, సిటీబ్యూరో: అనుమతి లేని లేఔట్లతో పాటు ఆక్రమణలకు గురవుతున్న రహదారులపై పలువురు హైడ్రాను ఆశ్రయిస్తున్నారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ద్వారా 41 ఫిర్యాదులు అందాయి. బొల్లారం మున్సిపాలిటీలోని ఎన్రిచ్ ప్రాంతంలోని సర్వే నం.83లో ఉన్న వరకుంట చెరువు కబ్జాల నిరోధించాలని, నిజాంపేట సర్వే నం.233/15లో ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. మాజీ సైనికోద్యోగికి జవహార్నగర్లో ప్రభత్వం ఇచ్చిన భూమిని కొందరు కబ్జా చేశారని ఫిర్యాదు చేరని ఆయన కుమారుడి ద్వారా ఫిర్యాదు అందింది. అయ్యప్ప సొసైటీలో 28వ ప్రధాన రహదారి 60 అడుగుల వెడల్పుతో ఉండాల్సి ఉండగా ఆక్రమణలకు గురైందని, అక్కడి డబ్బాలను తొలగించాలని హైకోర్టు ఆదేశాలున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. గతంలో ఖాళీ చేయించినా మళ్లీ డబ్బాలు పెట్టారని, వీటిని తీయమంటే రూ. 40 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. బౌరంపేటలోని సర్వే నం. 166/3లోని ప్రభుత్వ భూమిలో ఎగువన ఉన్న వెంచర్ల కోసం రహదారి నిర్మిస్తున్నారని ఫిర్యాదు అందింది. హయత్నగర్ మండలంలోని ఆదిత్యనగర్–బాలాజీ నగర్ మధ్య రెండు లింకు రోడ్లు ఆక్రమణకు గురయ్యాయని, పార్కు స్థలం కూడా కబ్జా అయిందని ఆదిత్యనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైడ్రాను కోరింది. మేడిపల్లి మండలం సాయిప్రియానగర్లో 2500 ప్లాట్లతో లే ఔట్ వేశారు. ఇందులో 2 వేల గజాల్లో ఉండాల్సిన పార్కును కూడా ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు.హైడ్రాను అభినందించిన హైకోర్టు...హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పని తీరును హైకోర్టు అభినందించిందని అధికారులు సోమవారం ప్రకటించారు. తమ విభాగం చెరువుల అభివృద్ధిని యజ్ఞంలా చేస్తోందని కితాబిచ్చినట్లు పేర్కొన్నారు. బతుకమ్మకుంటను అభివృద్ధి చేసిన తీరు హర్షణీయమని జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి సోమవారం వ్యాఖ్యానించినట్లు ప్రకటించింది. బతుకమ్మకుంట ఆ పరిసర ప్రాంతాలకు వరద ముప్పు తప్పించడమే కాకుండా భూగర్భ జలాలను కూడా పెంచిందని, గచ్చిబౌలిలోని మల్కం చెరువును చూసినా ఆహ్లాదంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించినట్లు హైడ్రా పేర్కొంది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఇంటి స్థలాలు, భూములు ఉంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) కింద వారికి సరైన నష్టపరిహారం ఇవ్వాలని సూచించినట్లు పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వం సమగ్ర విధానాన్ని తీసుకురావాలని హైకోర్టు అభిప్రాయపడినట్లు తెలిపారు. మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువు పరిధిలోని రెండు ఎకరాలకు సంబంధించిన టీడీఆర్ కేసు విచారణ సందర్భంలో ఇది చోటు చేసుకుందని హైడ్రా తెలిపింది. -
హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లపై నకిలీ దందా!
సాక్షి, సిటీబ్యూరో: వాహనాల హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ)లపై నకిలీ వెబ్సైట్లు దందా కొనసాగిస్తున్నాయి. కొత్తగా నమోదయ్యే వాహనాలతో పాటు పాతవాహనాలకు సైతం హెచ్ఎస్ఆర్పీని కచ్చితంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. ఈ మేరకు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చర్ (ఎస్ఐఏఎం–సయామ్) అనే సంస్థకు ఆ బాధ్యతలను అప్పగించారు. హైసెక్యూరిటీ నెంబర్ప్లేట్ల ఏర్పాటు పైన 15 రాష్ట్రాల్లో ఈ సయామ్ సంస్థ సేవలందజేస్తోంది. వాహనదారులు సయామ్ వెబ్సైట్లో హెచ్ఎస్ఆర్పీ కోసం దరఖాస్తు చేసుకున్న అనంతరం నిర్ణీత గడువు మేరకు కొత్త నెంబర్ప్లేట్లను అందజేస్తారు. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రం షోరూమ్లలోనే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. కేరళ, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, ఏపీ తదితర రాష్ట్రాల్లో సయామ్ ద్వారా పెండింగ్ వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను అందజేస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం మాత్రం హెచ్ఎస్ఆర్పీపైన ఇప్పటి వరకు ఎలాంటి తుదిగడువును విధించలేదు. అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు ‘సయామ్’ పేరిట నకిలీ వెబ్సైట్లను సృష్టించి ఇటీవల వాహనదారులకు పెద్ద ఎత్తున నోటీసులు అందజేశారు. హైసెక్యూరిటీ నెంబర్ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలపైన భారీ ఎత్తున జరిమానా విధించనున్నట్లు ‘ఆర్టీఏ చలాన్ల’ పేరిట వాహనదారులకు నోటీసులు ఇచ్చి గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో రవాణాశాఖ అప్రమత్తమైంది.హెచ్ఎస్ఆర్పీ కోసం తాము ఎలాంటి నోటీసులు ఇవ్వడం లేదని పేర్కొంది. అయినప్పటికీ వాహనదారుల్లో ఇంకా ఈ గందరగోళంకొనసాగుతూనే ఉంది. ‘సయామ్’ వెబ్సైట్ను పోలిన విధంగా ఒకటి, రెండు అక్షరాలను మార్చి మాయాజాలం సృష్టిస్తున్నారని, అలాంటి వెబ్సైట్ల నుంచి వచ్చే మెసేజ్లను చూసి మోసపోవద్దని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.గ్రేటర్లో 45 లక్షలకు పైగా పెండింగ్...వాహనాల భద్రతను దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు హెచ్ఎస్ఆర్పీని తప్పనిసరి చేసింది. ఈ మేరకు 2013లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం దీన్ని అమల్లోకి తెచ్చింది. కానీ ఈ పథకం ఏళ్లకు ఏళ్లుగా నత్తనడకన సాగుతుంది. తెలంగాణలో సుమారు 65 లక్షలకు పైగా వాహనాలు పెండింగ్లో ఉన్నట్లు అంచనా. వాటిలో 45 లక్షల వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. 2019 వరకు నమోదైన అన్ని వాహనాలకు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి హెచ్ఎస్ఆర్పీని అమర్చాలని సుప్రీంకోర్టు మరోసారి ఆదేశించింది. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో ఈ పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. కానీ నగరంలో మాత్రం ఈ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం నుంచి తమకు ఇంకా ఎలాంటి ఆదేశాలు అందలేదని, దీంతో తాము ఇప్పటి వరకు ఎలాంటి తుది గడువును విధించలేదని ఆర్టీఏ అధికారులు తెలిపారు. మొదట్లో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఏర్పాటు చేసుకోవాలంటూ వెలువడిన ఒక ఉత్తర్వు వాహనదారులను గందరగోళానికి గురిచేసింది. దీంతో చాలామంది ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లి అధికారులను సంప్రదించారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ‘సయామ్’ ద్వారా ఈ పథకం అమలు జరుగుతున్న క్రమాన్ని అవకాశంగా తీసుకొని నకిలీవెబ్సైట్లు రంగంలోకి దిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.ఇప్పటికీ తప్పనిసరి కాదు...‘హెచ్ఎస్ఆర్పీపైన ప్రభుత్వం ఇంకా ఎలాంటి గడువు విధించలేదు. భవిష్యత్తులో గడువు విధించే వరకు హెచ్ఎస్ఆర్పీ కోసం ఎలాంటి వెబ్సైట్లను ఆశ్రయించవలసిన అవసరం లేదు. దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత మాత్రమే స్పష్టమైన విధివిధానాలను విడుదల చేస్తాం. అప్పటి వరకు వాహనదారులు ఎలాంటి గందరగోళానికి, ఆందోళనకు గురికావలసిన అవసరం లేదు’. అని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేశారు.నాణ్యతపై సందేహాలు....హైసెక్యూరిటీ నెంబర్ప్లేట్లలో నాణ్యత లేకపోవడం వల్ల కూడా వాహనదారులు విముఖత చూపుతున్నారు.తెలుపురంగు ప్లేట్లపై నెంబర్లను ఎంబోజింగ్ చేసి నలుపురంగు పెయింట్ వేస్తారు.కానీ ఈ రంగు ఎక్కువ కాలం ఉండడం లేదు.ప్లేట్లు కూడా నాసిరకంగా ఉండి తొందరగా దెబ్బతింటున్నాయి. సొట్టలు పడుతున్నాయి. విరిగి ముక్కలవుతున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.ఈ నెంబర్ ప్లేట్లు ఆకర్షణీయంగా లేకపోవడం కూడా మరో కారణం.రూ.లక్షల ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసి ఇలాంటి నాసిరకం ప్లేట్లు అమర్చుకునేందుకు అయిష్టత చూపుతున్నారు.కానీ 2019 నాటికి నమోదైన అన్ని వాహనాలకు హెచ్ఎస్ఆర్పీ తప్పనిసరి అన్న సుప్రీంకోర్టు ఆదేశాల దృష్ట్యా కదలిక వచ్చింది. -
నగరా మోగింది!
రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతోపాటు నగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 13న నోటిఫికేషన్ జారీ కానుండగా, నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఉప ఎన్నికకు సంబంధించిన వివరాల్ని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్తో కలిసి సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంతోపాటు హైదరాబాద్ జిల్లా పరిధి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అది వెంటనే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నప్పటికీ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మాత్రం ఎన్నికల కోడ్ వర్తించదు. –సాక్షి, సిటీబ్యూరోనోటిఫికేషన్: 13 అక్టోబర్ (సోమవారం)నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఒక్కో పోలింగ్ కేంద్రానికి దాదాపు 980 మంది ఓటర్లుంటారునియోజకవర్గంలోని అర్హులైన ఓటర్లు ఓటరు జాబితాలో తమ పేరున్నదీ, లేనిదీ ఈఆర్ఓ కార్యాలయంలోకానీ, బూత్లెవెల్ అధికారి వద్ద కానీ, ఓటర్ హెల్ప్లైన్ యాప్లోకానీ, సంబంధిత వెబ్సైట్లలో కానీ పరిశీలించుకోవాల్సిందిగా కర్ణన్ సూచించారు.జాబితాపై ఏవైనా అభ్యంతరాలున్నా, జాబితాలో పేరు లేకున్నా నామినేషన్ల చివరి రోజుకు పదిరోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం కోసం 1950 టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయవచ్చునని తెలిపారు.ఎపిక్ కార్డుతో పాటు ప్రభుత్వం గుర్తించిన, ఫొటో కలిగిన 12 రకాల ఐడీల్లో ఏదైనా ఒకదాన్ని వినియోగించుకోవచ్చునన్నారు.ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బందినోడల్ ఆఫీసర్లు: 19 మందిసెక్టార్ ఆఫీసర్లు: 38 సెక్టార్లకు 55 మంది నియామకంతోపాటు రిజర్వులో కొందరిని ఉంచారు.రిజర్వుతోసహ మొత్తం పోలింగ్ సిబ్బంది: 2,400వీరిలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు: 600 మంది, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు 600 మంది, ఇతర సిబ్బంది 1200 మంది.ఈవీఎంలు, వీవీప్యాట్లుకంట్రోల్ యూనిట్లు: 826, బ్యాలెట్ యూనిట్లు: 1494, వీవీప్యాట్లు: 837.రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇప్పటికే మొదటిదశ తనిఖీ పూర్తయిందన్నారు.ప్రవర్తన నియమావళి (ఎంసీసీ)షెడ్యూలు జారీతోనే ఎన్నికలప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని, హైదరాబాద్ నగర పోలీసులతో యాక్షన్ప్లాన్ రెడీ అయిందని పేర్కొన్నారు.ఎన్ఫోర్స్మెంట్ కోసం 9 ఫ్లై యింగ్ స్క్వాడ్స్, 9 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, 2 వీడియో సర్వేలెన్స్ టీమ్స్తో పాటు ఇతరత్రా టీమ్స్ ఉన్నాయని, అవసరాల కనుగుణంగా టీమ్స్ పెంచుతామన్నారు. ఫిర్యాదులకోసం కాంటాక్ట్ నెంబర్ 1950 , కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తాయన్నారు. సీజ్ చేసిన నగదు పరిశీలించి విడుదల చేసేందుకు జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఇంకా..శారీరక వికలాంగులు, 80 ఏళ్ల వయసు పైబడిన వారికి వీల్చైర్ సదుపాయం, వాలంటీర్ల ద్వారా ఇళ్లనుంచి పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి, తిరిగి ఇళ్లవద్ద దింపే సదుపాయం.పోటీ చేసే అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు వార్తాపత్రికలు, టీవీల్లో మూడు పర్యాయాలు ప్రకటించాలి.రాజకీయ పార్టీలు ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాల్ని 48 గంటల్లో వెబ్సైట్, సోషల్మీడియా,పత్రికలు, టీవీల ద్వారా వెల్లడించాలి. ‘నో యువర్ క్యాండిడేట్స్’ యాప్ ద్వారా కూడా ప్రజలు అభ్యర్థుల వివరాలు తెలుసుకోవచ్చు.మీడియా ఫేక్న్యూస్ ప్రచారం చేయొద్దు. సంబంధిత అధికారుల నుంచి నిర్ధారణ చేసుకోవాలి. వదంతుల్ని ప్రచారం చేయవద్దు.ఆర్డీఓ ఆఫీసులో నామినేషన్లుజిల్లా ఎన్నికల అధికారిగా జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ వ్యవహరిస్తుండగా, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్గా సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరామ్ బాధ్యతలు నిర్వహిస్తారు. నామినేషన్లను ఆర్డీవో కార్యాలయంలో స్వీకరిస్తారు. జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఈఆర్ఓగా వ్యవహరిస్తారు. జాయింట్ పోలీస్ కమిషనర్ నోడల్ఆఫీసర్గా వ్యవహరిస్తారు. ఓట్ల లెక్కింపు కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో జరగనుంది.ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీ సజ్జనర్ తెలిపారు. లైసెన్సుడు ఆయుధాలు కలిగిన వారు డిపాజిట్ చేయాలని సూచించారు.407 పోలింగ్ కేంద్రాలు139 భవనాల్లోని 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది.పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్లు, టాయ్లెట్స్, తాగునీరు, లైటింగ్, పోలింగ్ కేంద్రమని సూచించే బోర్డులు, వీల్చైర్లు, తదితర సదుపాయాలుంటాయన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు ఆయా పార్టీల నుంచి బూత్లెవెల్ ఏజెంట్లున్నారన్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి 219 మంది, కాంగ్రెస్ నుంచి 132 మంది ఉన్నారని, ఇతర పార్టీలవి పెండింగ్లో ఉన్నాయన్నారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించి 407 మంది బీఎల్ఓలు, 38 మంది సూపర్వైజర్లను నియమించినట్లుపేర్కొన్నారు.21,003 ఎపిక్ కార్డులు జనరేట్ కాగా, 8,491 కార్డుల ముద్రణ పూర్తయిందని, మిగతావి ఆయా దశల్లో ఉన్నాయన్నారు. 8,491 కార్డుల్ని పోస్టు ద్వారా పంపిణీ చేసినట్లు కర్ణన్ తెలిపారు. -
‘హైడ్రా’మా నేనా?
సాక్షి, సిటీబ్యూరో: సెప్టెంబర్ 21: గాజులరామారంలోని సర్వే నెం.307లో ఉన్న రూ.15 వేల కోట్ల విలువైన 317 ఎకరాల స్థలం ప్రభుత్వానిదని ప్రకటించిన హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీకి ఆధీనంలో ఉన్న 11 ఎకరాల చుట్టూ ఉన్న షీట్లను తొలగించి ఫెన్సింగ్ వేసింది.సెప్టెంబర్ 23:ఆ స్థలం తనదేనని, పట్టా భూమి కొనుగోలు చేశానని ప్రకటించిన ఆరికపూడి గాంధీ హైడ్రా అక్కడ వేసిన ఫెన్సింగ్ తొలగించారు. దాని స్థానంలో గతంలో మాదిరిగానే బ్లూషీట్లు ఏర్పాటు చేశారు. హైడ్రా చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.అక్టోబర్ 1:ఆరికపూడి గాంధీ చెరలో ఉన్న ప్రభుత్వం భూమినీ పరిరక్షించాలంటూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా సహా వివిధ విభాగాలకు దరఖాస్తులు ఇచ్చారు. ఆ స్థలం తనదేనని, ఆరోపణలు చేస్తే కోర్టు కీడుస్తానంటూ గాంధీ ప్రకటించారు. హైడ్రా మాత్రం ఈ భూమి విషయంలో మిన్నకుండిపోయింది.పక్షం రోజులు సాగిన ఈ ఎపిసోడ్లో నష్టపోయింది మాత్రం 260 నిరుపేద కుటుంబాలే. గాజులరామారంలోని సర్వే నెం.307లో ఉన్న ప్రభుత్వ భూమిలోని వెంచర్లు, లే ఔట్లకు సంబంధించిన ఈ నిర్మాణాలను హైడ్రా గత నెల 21న తొలగించింది. ప్రగతినగర్ వైపు కబ్జా చేసిన వారిలో రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ సంస్థల యజమానులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నట్లు ప్రకటించింది. ఈ సర్వే నెంబర్లో 317 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో దీన్ని ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పొరేషన్కు నాటి సర్కారు అప్పగించింది. రాష్ట్ర విభజన తర్వాత ఫైనాన్స్ కార్పొరేషన్ ఆస్తుల పంపకాల్లో జాప్యం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు ఆక్రమణలకు పాల్పడ్డారు. ఈ విషయంపై హైడ్రాకు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఆరు నెలల పాటు సాగిన విచారణలో భాగంగా రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులతో ఐదారుసార్లు సమావేశమై అనేక విషయాలు గుర్తించింది.బాధ్యులపై చర్యలేవి?ఈ భూమిలో ప్రగతినగర్ వైపు బడాబాబులు వెంచర్లు, లే ఔట్లు వేశారని, సర్వే నంబర్లు 329/1, 342ల్లో ఉన్న భూమిని 60 గజాలు, 120 గజాల చొప్పున ప్లాట్లు వేసిన రౌడీషీటర్లు, స్థానిక నేతలు పేదలకు విక్రయించారు. జగద్గిరిగుట్ట పోలీసుస్టేషన్లో రౌడీషీటర్గా ఉన్న షేక్ అబిద్... లక్ష్మి మురళి హుస్సేన్ పేరుతో ఈ విక్రయాలు జరిపారు. బోడాసు శ్రీనివాస్ (డాన్ శీను), ఏసుబాబు, సయ్యద్ గౌస్ బాబు, మనీష్, దేవా తదితరులూ భూమిని ఆక్రమించి, ప్లాట్లుగా అమ్మేశారు. వీరికి స్థానిక రెవెన్యూ అధికారులు సహకరించారు. వీటిలో నిర్మించిన గదులను కొందరు అద్దెలకు కూడా ఇచ్చారు. ఇలా ఆ ప్రభుత్వ భూమిలో ఉన్న 12 ఎకరాల వెంచర్తో పాటు 20 ఎకరాల లే ఔట్ను హైడ్రా తొలగించింది. నిర్మాణాలను కూల్చివేసిన అందుకు బాధ్యులైన అధికారులపై మాత్రం చర్యలు తీసుకోలేదు.హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆర్ఎల్ఆర్...హైడ్రా కూల్చివేతలు చేపట్టిన భూమిలో 11 ఎకరాలు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ బంధువుల పేర్లపై ధరణిలో చేర్చింది ప్రభుత్వ భూమి అంటూ బీఆర్ఎస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి (ఆర్ఎల్ఆర్) హైకోర్టులో పిటిషన్ వేశారు. తమ పేరిట ఉన్న 11 ఎకరాలను ఎప్పుడో విక్రయించి వెళ్లిపోయిన జాహెద్ బేగం, షేక్ ఇమామ్, ఇశాన్ అమీన్ను తీసుకొచ్చి వారి పేరిట భూమిని కొన్నట్లు చూపించారని ఆరోపించారు. గత బుధవారం హైడ్రా కమిషనర్కు కలిసిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ భూ ఆక్రమణకు పాల్పడిన ఆరికపూడి గాంధీపై ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు గత నెల 21న తమ భూమిలో చేపట్టిన కూల్చివేతలపై తాము హైకోర్టును ఆశ్రయించామని ఆరికపూడి గాంధీ అదే రోజు ప్రకటించారు. దీనిపై హైడ్రా ఆ భూమిలోకి ప్రవేశించకుండా ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. తనపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పుడు హైడ్రా వ్యూహం ఎలా ఉంటుందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. చంచల్గూడ నివాసి మృతి
చాదర్ఘాట్: అమెరికాలోని చికాగో ఇవన్స్టంగ్ ప్రాంతంలో నివాసముంటున్న చంచల్గూడకు చెందిన సిరాజ్ మొతీబ్ మహ్మద్ (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికులు తెలిపిన మేరకు.. కుటుంబ సభ్యులు పది సంవత్సరాల క్రితం అక్కడే సెటిలయినట్లు స్థానికులు తెలిపారు. వరుస సంఘటనలతో అమెరికాలో ఉంటున్న విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.చెరువులో పడి మహిళ మృతిమోతీనగర్: మతిస్థిమితం లేని ఓ మహిళ సున్నం చెరువులో పడి మృతి చెందింది. ఈ సంఘటన అల్లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సామల వెంకట్రెడ్డి తెలిపిన మేరకు.. బోరబండ సైట్ 3లో మానిక్కర్ ఆండాళు (49) నివాసముంటోంది. ఈ నెల 4న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుమారుడు నవీన్కుమార్ బంధువులు, మిత్రులు, పరిసర ప్రాంతాల్లో విచారించినా జాడ తెలియరాలేదు. దీంతో 5న బోరబండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలించగా అల్లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సున్నం చెరువులో ఆమె మృత దేహం లభించింది.వేడుకల్లో విషాదం..చిన్నారి మృతిఅమీర్పేట: నూతన గృహ ప్రవేశ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఓ చిన్నారి మృతి చెందింది. ఎస్ఆర్నగర్ పోలీసులు తెలిపిన మేరకు.. సనత్నగర్ ఉదయ్నగర్ కాలనీలో శ్రీరాములు భార్య మానస, కుమార్తెలు మేఘన(8),ప్రణవితో కలిసి ఉంటున్నాడు. సుభాష్నగర్లో ఉండే సమీప బంధువు వెంకటస్వామి గృహ ప్రవేశానికి శ్రీరాములు ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు.రాత్రి ఎనిమిది గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్లో భోజనాలు చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురు పిల్లలు టెర్రస్పై ఆడుకుంటున్నారు. ప్రమాదవశాత్తు ఇంటి డెకరేషన్ లైట్ల తీగలు తాకి మేఘన స్పృహ కోల్పోయింది. వెంటనే సనత్నగర్లోని ప్రైయివేటు ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.డివైడర్ ఢీకొని వ్యక్తి మృతిమల్లాపూర్: స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి ద్విచక్రవాహనంపై వస్తుండంగా డివైడర్ను ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు.ఈ సంఘటన నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రభాకర్రెడ్డి తెలిపిన మేరకు.. చెంగిచర్ల గణేష్నగర్ కాలనీకి చెందిన చేర్యాల హైమావతి చిన్న కుమారుడు దిలీప్కుమార్ (31) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం స్నేహితుడి బర్త్డే వేడుకలకు వెళ్లాడు. ఇంటికి ఆలస్యంగా వస్తానని తల్లికి చెప్పాడు. సోమవారం తెల్లవారుజామున ఉదయం 4.25 ఐఐసీటీ గేటు వద్ద యాక్టీవా పై(టీఎస్08జీఏ9032) వస్తుండగా ఫుట్పాత్ను ఢీ కొట్టాడు. దీంతో దిలీప్ కుమార్ తలకు తీవ్ర గాయ కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకోని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.నగరంలో ఫేక్ డాక్టరేట్ల కలకలం– నిందితుడి అరెస్ట్లక్డీకాపూల్ : నకిలీ డాక్టరేట్ సర్టిఫికెట్లు ఇస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రవీంద్రభారతి వద్ద పెద్దిటి యోహాన్ను వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫాబాద్ పోలీసులు తెలిపిన మేరకు..గుంటూరు జిల్లా గురుజాలకి చెందిన పెద్దిటి యోహాన్ గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ పేరిట గత కొంత కాలంగా డాక్టరేట్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన కవులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో వాట్సప్ గ్రూప్ను ఏర్పాటు చేశాడు. ఆ గ్రూప్ ద్వారా డాక్టరేట్లు ఇస్తామని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.15 వేల నుంచి రూ.20 వేలు తీసుకుంటున్నాడు. ఆదివారం సాయంత్రం రవీంద్రభారతిలో పలువురికి ఫేక్ డాక్టరేట్లను ప్రదానం చేశారు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని యోహాన్ను అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. యోహాన్పై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు సైఫాబాద్ పోలీసులు తెలిపారు. -
నగరం.. రోడ్లు ఛిద్రం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అసలే నాసిరకం పనులు.. ఆపై ఏకధాటి వర్షాలు.. వరదలు.. ఇంకేముంది గ్రామీణ రహదారులను ఛిద్రం చేశాయి. మారుమూల గ్రామీణ రోడ్లే కాదు.. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారులు సైతం ధ్వంసమయ్యాయి. ఇటు ఎల్బీనగర్ నుంచి అటు బాటసింగారం వరకు విజయవాడ రహదారిపై అడుగుకో గుంతతేలింది. అష్ట వంకరలు తిరిగి.. అనేక మలుపులతో నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్న బీజాపూర్ జాతీయ రహదారి (అప్పా జంక్షన్ నుంచి చేవెళ్ల వరకు) పూర్తిగా దెబ్బతింది. శంషాబాద్ నుంచి షాద్నగర్ వరకు ఉన్న బెంగళూరు జాతీయ రహదారి సహా పహడీషరీఫ్ నుంచి ఆమనగల్లు వరకు విస్తరించి ఉన్న శ్రీశైలం జాతీయ రహదారి, బీఎన్రెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా మాల్ వరకు విస్తరించి ఉన్న నాగార్జునసాగర్ రోడ్డు, షాద్నగర్ నుంచి తాండూరు వెళ్లే మార్గం, కోకాపేట నుంచి శంకర్పల్లి మీదుగా చేవెళ్ల వెళ్లే మార్గం ఎక్కడికక్కడ గుంతలు తేలాయి. దెబ్బతిన్న రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సిన రోడ్ల భవనాలశాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలు అటు వైపు దృష్టిసారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రాకపోకలకు ఇబ్బందులుఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లపై నిలిచి ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పాటు రోజుల తరబడి నీరు నిల్వ ఉండటంతో రోడ్డుపై ఉన్న తారు, సీసీ దెబ్బతిని కంకర తేలుతోంది. దెబ్బతిన్న ఈ రోడ్లపై వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. -
అడిగిన సమాచారం ఇవ్వండి
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో ఉన్న 179 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకునేవారికి అవసరమైన సమాచారాన్ని వెంటనే అందజేయాలని ఎక్సైజ్శాఖ హైదరాబాద్ డిఫ్యూటీ కమిషనర్ అనిల్కుమార్రెడ్డి సూచించారు. ఈ మేరకు సంబంధిత ఎకై ్సజ్ స్టేషన్లు సిద్ధంగా ఉండాలని తెలిపారు. సోమవారం అబ్కారీ భవన్ సమావేశ మందిరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని 11 ఎక్సైజ్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, ఎస్సైలు, ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్ టీమ్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం దుకాణాలకు సంబంధించిన రిజర్వేషన్లు, రెండేళ్లలో మద్యం అమ్మకాల వివరాలను దరఖాస్తుదారులకు ఇవ్వాలని చెప్పారు.అలాగే దరఖాస్తుల సమూనాలో తప్పులు లేకుండా సహకరించాలన్నారు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను అబ్కారీ భవన్లోని మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్న కౌంటర్లో దాఖలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయని రోజువారిగా డిస్ప్లే చేయాలని ఎకై ్సజ్సూపరింటెండెంట్ పంచాక్షరి సూచించారు.26న ప్రెస్క్లబ్ ఎన్నికలులక్డీకాపూల్ : హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 26న క్లబ్ కార్యవర్గానికి ఎన్నికలు జరుగుతాయని ప్రెస్క్లబ్ప్రధాన కార్యదర్శి రవికాంత్ రెడ్డి చెప్పారు. 2025–27 సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోనున్నట్టు చెప్పారు. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్గా దొడ్డా శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తారు. ఈ నెల 9వ తేదీ నాటికి సభ్యత్వ రెన్యువల్, అన్ని బకాయిలు చెల్లించిన రెగ్యులర్ సభ్యులు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులని చెప్పారు. కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీకి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు(జనరల్), ఉపాధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి, ఇద్దరు సంయుక్త కార్యదర్శుల పదవులతో పాటు కోశాధికారి, పది మంది కార్యనిర్వాహక సభ్యులు (8 మంది సాధారణ సభ్యులు, రెండు మహిళా రిజర్వ్ స్థానాలు) ఎన్నికలు జరుగుతాయన్నారు.గాలిలో పల్టీలు కొట్టిన కారు● ఫ్లైఓవర్పై స్తంభాన్ని ఢీకొట్టి..మరోకారుపై పడి...● ఐదుగురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమంకేపీహెచ్బీకాలనీ: జేఎన్టీయూ–హైటెక్ సిటీ రోడ్డులో అతివేగంగా వెళ్తూ ఓ కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడమే కాకుండా గాలిలోకి పల్టీలు కొట్టి రోడ్డుకు అవతలి వైపు వెళ్తున్న మరో కారుపై పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ జోధ్పూర్ ప్రాంతానికి చెందిన వికాస్శర్మ, శాంతను స్నేహితులు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ల రోడ్డులో నివాసం ఉండే శాంతను సాఫ్ట్వేర్ ఉద్యోగి. వికాస్శర్మ ఇంటీరియర్ డిజైనర్. ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి మియాపూర్ ప్రాంతంలో మద్యం తాగారు. సోమవారం తెల్లవారుజామున జేఎన్టీయూ వైపు నుంచి హైటెక్ సిటీ వైపు టాటా కర్వ్ కారులో ఇరువురూ వెళ్తున్నారు. ఆ సమయంలో వికాస్శర్మ డ్రైవింగ్ చేస్తున్నాడు. నెక్సెస్ మాల్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్న వీరు ఫ్లైఓవర్ దిగే క్రమంలో అతివేగంగా వెళ్లి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టారు. వీరు ప్రయాణిస్తున్న కారు గాల్లోకి ఎగిరి హైటెక్ సిటీ వైపు నుంచి–జేఎన్టీయూ వైపు వెళ్తున్న టాటా సిట్రాన్ ఎలక్ట్రిక్ కారుపై పడింది. ఈ కారులో నానక్రాంగూడలోని ఐసీఐసీఐ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్న ప్రియను దింపేందుకు సంస్థకు చెందిన కారును అఖిల్రెడ్డి నడుపుతుండగా సెక్యూరిటీగార్డ్గా వచ్చిన సాహిల్కుమార్ కూడా ఉన్నారు.ఈ ఘటనలో స్నేహితులు వికాస్శర్మ, శాంతన్తో మరో కారులోని అఖిల్రెడ్డితో పాటు అందులో ఉన్న ప్రియ, సాహిల్కుమార్లు తీవ్రంగా గాయపడ్డారు.కార్లను నడుపుతునన వికాస్శర్మ,అఖిల్రెడ్డిల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐదుగురూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.నేడు పలుచోట్ల నీటి సరఫరాకు అంతరాయంసాక్షి,సిటీ బ్యూరో: హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరాచేసే సింగూరు జలాశయం సింగాపూర్ నుంచి ఖానాపూర్ వరకు ఉన్న 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ కు మణికొండ కల్వర్టు వద్ద పీఎస్సీ పైపు లైన్ దెబ్బతిని ఏర్పడిన భారీ లీకేజీ మరమ్మతులు పనులు నేపథ్యంలో మంగళవారం ఉదయం కొన్ని ప్రాంతాల్లో ప్రెజర్ తో నీటిసరఫరా, మరికొన్ని ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి వర్గాలు తెల్పాయి. మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలు, షేక్ పేట్, హకీంపేట్, తౌలిచౌకి, కాకతీయ నగర్ లోని కొన్ని ప్రాంతాలు, మెహిదీపట్నం, ఆసిఫ్ నగర్, కార్వాన్, ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. -
మద్యం మత్తులో భార్యను కొట్టిన భర్త
గౌలిపురా: మద్యం మత్తులో భర్త కొట్టడంతో నలుగురు పిల్లలతో కలిసి ఓ గృహిణి అదృశ్యమైంది. ఈ సంఘటన భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. భవానీనగర్ తలాబ్కట్టా సిద్దిఖీనగర్ సమద్ హోటల్ ప్రాంతానికి చెందిన సయీద్ ఉన్నీసా (28), మహ్మద్ ఫెరోజ్ ఖాన్లు దంపతులు. వీరికి నలుగురు పిల్లలు. కాగా ఫెరోజ్ ఖాన్ తరచూ మద్యం తాగి వస్తుండటంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. గత నెల 30న ఫెరోజ్ ఖాన్ మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య మందలించింది. దీంతో ఫరోజ్ ఖాన్ భార్య సయీద్ ఉన్నీసాను కొట్టాడు. ఈక్రమంలో మరుసటిరోజు (ఈ నెల 1న) సాయంత్రం సయీద్ ఉన్నీసా తన నలుగురు పిల్లలను తీసుకొని కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటికి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఫెరోజ్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
గొడవ వద్దన్నందుకు దాడి..వ్యక్తి మృతి
ఘట్కేసర్: పిల్లలను గొడవపడొద్దు అన్నందుకు ఓ పిల్లాడి తండ్రి అతడిపై దాడిచేశాడు. ఈ సంఘటనలో బాధితుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఘట్కేసర్ పీఎస్ పరిధిలోని అవుషాపూర్లో ఆదివారం జరిగింది. ఇన్స్పెక్టర్ బాలస్వామి తెలిపిన మేరకు.. అవుషాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ అమీర్ (34) రాళ్లు కొట్టుకుంటు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఇంటిలో ఉండగా సమీపంలో నివసించే షన్ను పిల్లలు అసీనా, అజ్మెద్, సయ్యద్ అలీ కుమారుడు అబు గొడవ పడ్డారు. శబ్దం విన్న సయ్యద్ అమీర్ బయటకు వచ్చిన గొడవ పడొద్దని అబుకు సూచించాడు.గొడవ వద్దన్నందుకు...గొడవ పడొద్దన్నాడనే విషయాన్ని అబు తన తండ్రి సయ్యద్ అలీకి చెప్పడంతో అతడొచ్చి సయ్యద్ అమీర్పై దాడికి దిగాడు. చుట్టు పక్కల వారు ఇరువురిని శాంత పరిచి ఇంటికి పంపించి వేశారు. అనంతరం అర్థగంట తర్వాత ఛాతి నొప్పితో పాటు వాంతులు కావడంతో కుటుంబీకులకు సయ్యద్ అమీర్ తెలిపాడు. అతడి శరీరానికి చెమటలు పట్టడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.జాతీయ రహదారిపై నిరసన...అకారణంగా దాడి చేసి ప్రాణం తీసిన సయ్యద్ అలీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు బాఽధితులు పోస్ట్మార్టం అనంతరం జాతీయ రహదారిపై మృతదేహాన్ని ఉంచి నిరసన తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నచ్చచెప్పి పంపించి వేశారు. కాగ ఇరు వర్గాల మధ్య ఓ ఒప్పంధం జరిగినట్లు సమాచారం. -
ఓయూలో ఎన్నికల హోరు
జోరందుకున్న ఉద్యోగ సంఘాల ప్రచారం లాలాపేట: ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగాల సంఘాల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నెల 27న పలు ఉద్యోగ సంఘాల ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో గురువారం ఎన్జీఓస్ స్టాఫ్ అసోసియేషన్ అబ్దుల్ ఖదీర్ ఖాన్, బి. వెంకటేష్ ప్యానెల్ 43 హామీలతో రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఓయూలోని నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్జీఓస్ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్ష అభ్యర్థి అబ్దుల్ ఖదీర్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అభ్యర్థి బి.వెంకటేష్లు మాట్లాడుతూ.. తమ ప్యానెల్లోని 9 మందిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. తాము గెలిస్తే ఉద్యోగుల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు పాటుపడతామన్నారు. ఉద్యోగులందరికి హెల్త్ కార్డులు, సీపీఎస్, ఓపీఎస్ విధానం అమలు చేయిస్తామన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. -
బతుకమ్మకుంట ప్రారంభోత్సవం నేడు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన బతుకమ్మ కుంటను శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం బతుకమ్మ కుంటను ఓ పిక్నిక్ స్పాట్గా అభివృద్ధి చేసి.. చుట్టూ పిల్లల ప్లే ఏరియాతో పాటు అనేక ఆకర్షణలు అందుబాటులోకి తెచ్చారు. వృద్ధులు సేద దీరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. వాకింగ్ చేసే వారి కోసం చెరువు చుట్టూ నడక దారి, ఆక్రమణలకు తావు లేకుండా చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ చెరువు వరద నీటితో నిండు కుండను తలపిస్తుండటంతో బోటు షికారు కూడా అందుబాటులోకి వచ్చింది. బతుకమ్మకుంటను సీఎం నగర ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు. బతుకమ్మ ఉత్సవాలను సైతం నిర్వహిస్తున్నారు. ఈ కుంట అభివృద్ధికి హైడ్రా తీసుకున్న చొరవకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. విద్యుద్దీపాల మధ్య బతుకమ్మ కుంట -
మద్యం దుకాణాలకు టెండర్లు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మద్యం దుకాణాలకు ఔత్సాహిక వ్యాపారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ గురువారం నోటిఫికేషన్ వెలువడింది. రెండేళ్ల కాలానికి డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు కొత్త లైసెన్సులు మంజూరు చేయనున్నారు. ఈసారి కూడా షాపుల కేటాయింపులో ఎస్సీ (10శాతం), ఎస్టీ (5శాతం), గౌడ (15 శాతం) కులస్తులకు రిజర్వేషన్లు కేటాయించారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒక్కో దరఖాస్తు రుసుం రూ.3 లక్షలు. అక్టోబర్ 23న షాపుల వారీగా లక్కీ డ్రా తీస్తారు. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. సరూర్నగర్ ఎకై ్సజ్ పరిధిలో 138 మద్యం షాపులు ఉండగా, వీటిలో 25 గౌడ కులస్తులకు, 11 ఎస్సీలకు, ఎస్టీలకు 2 ఖరారు చేశారు. మిగిలిన షాపులను జనరల్ కేటగిరీలో ప్రకటించారు. శంషాబాద్ ఎకై ్సజ్ పరిధిలో 111 మద్యం షాపులు ఉండగా.. 9 గౌడ్స్కు, 6 ఎస్సీలకు కేటాయించారు.


