breaking news
Hyderabad Latest News
-
నిర్లక్ష్యపు నిప్పు
జూబ్లీహిల్స్లో భారీ అగ్ని ప్రమాదం బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–36లోని మెట్రోస్టేషన్ సమీపంలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ భవనంలో రెండు నెలల క్రితం వరకు మంగళగౌరీ అనే వస్త్ర దుకాణం కొనసాగింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా షోరూం ముందు భాగంలో గోపురం డెకరేషన్ను, ఎదురుగా ఫుట్పాత్పై ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. షాపు మూసివేసిన తర్వాత ఎవరూ రాకపోవడంతో గోపురం డెకరేషన్ను తొలగించాలని భవన యజమాని టీవీ సురేష్కుమార్ నిర్ణయించి సిరాజ్ అనే కాంట్రాక్టర్కు అప్పగించారు. కొబ్బరి నార అంటుకుని.. ఉదయం 11 గంటల వేళ గోపురం డెకరేషన్కు వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు రావడంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కోసం ఏర్పాటుచేసిన కొబ్బరినార అంటుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెల్డింగ్ చేస్తున్న వారితో పాటు మిగతా కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, హైడ్రా రంగంలోకి దిగి మూడు ఫైరింజన్లతో మంటలను రెండు గంటల పాటు శ్రమించి అదుపులోకి తీసుకువచ్చాయి. రెండు గంటల పాటు ఈ రోడ్డంతా స్తంభించిపోయింది. భవన యజమాని నిర్లక్ష్యం కారణంగానే.. ఈ బిల్డింగ్లో మంగళగౌరీ వస్త్ర దుకాణాన్ని రెండు నెలల క్రితమే మూసివేశారు. ప్రస్తుతం అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. బిల్డింగ్పై యజమాని టీవీ సురేష్కుమార్ ఒక అంతస్తును అక్రమంగా నిర్మించడంతో పాటు సెట్బ్యాక్లో ఒకవైపు జనరేటర్ ఏర్పాటు చేసి, ఇంకోవైపు గదులు నిర్మించారు. దీంతో ఫైర్తో పాటు హైడ్రా సిబ్బంది పైకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భవన యజమాని నిర్లక్ష్యం కారణంగానే అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని జూబ్లీహిల్స్ పోలీసులు భావిస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకున్నా అక్రమ నిర్మాణాలతో పాటు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. భారీగా ఆస్తినష్టం సంభవించిందని అంటున్నారు. అద్దాలు పగులగొట్టుకుని.. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు భవనం అద్దాలు పగులగొట్టుకుని బయటికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఉదయం 11.30 గంటల సమయంలో వీరంతా గ్రౌండ్ ఫ్లోర్లో పని చేస్తుండగా, ప్రధాన ద్వారం వద్ద ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో పక్కనే ఉన్న అద్దాలను పగులగొట్టుకుని వీరు బయటకు పరుగులుతీశారు. స్క్రాప్ గోదాంలో మరో ఘటన.. జీడిమెట్ల: నగరంలో గురువారం మరో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జీడిమెట్ల ఏస్వీ కోఆపరేటివ్ సొసైటీలోని స్క్రాప్ గోదాంలో భారీ ఎత్తున మంటలు అంటుకున్నాయి. మహ్మద్, ఇస్మాయిల్ అనే వ్యక్తులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ కవర్లు, అట్టపెట్టెలు, మెడికల్ వ్యర్థాలు తీసుకువచ్చి గోదాంలో డంప్ చేసి విక్రయిస్తుంటారు. సాయంత్రం 6 గంటలకు గోదాంలో కూలీలు పనులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన కూలీలు బయటికి పరుగులు తీశారు. జీడిమెట్ల ఫైర్ సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. అనుమతులు లేని గోదాంపై పోలీసులు కేసు నమోదు చేశారు. హంగులతో బెంగ వినియోగదారులను ఆకట్టుకొనేందుకు వ్యాపార సంస్థలు చేసే హంగూ ఆర్భాటాలు, ప్రత్యేక అలంకరణలు అగ్ని ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. వస్త్ర దుకాణాలు, వివిధ రకాల షోరూమ్లు భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి ఈ తరహా అలంకరణలకు పాల్పడుతున్నాయి. ఈ తరహా అగ్ని ప్రమాదాలపై జీహెచ్ఎంసీ, హైడ్రా తదితర విభాగాల అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం. తాజాగా గురువారం జూబ్లీహిల్స్లోని మంగళగౌరి వస్త్ర దుకాణం వద్ద జరిగిన ప్రమాదానికి సెట్టింగే కారణమని అధికారులు తేల్చారు. మొదట సెట్టింగ్కు మంటలు అంటుకొని ఆ తర్వాత షోరూమ్లోకి వ్యాపించడంతో భవనం దగ్ధమైంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా అలంకరణలు ఏర్పాటు చేస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. గోపురం డెకరేషన్కు వెల్డింగ్ చేస్తుండగా ఘటన వాణిజ్య భవనంలో ఎగిసిపడిన మంటలు అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది సహాయక చర్యలు ప్రాణం నష్టం జరగకపోవడంతో ఉపశమనం -
ముహూర్తం ఖరారు
సాక్షి, సిటీబ్యూరో: ఏడాదిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వెయ్యి పడకల సామర్థ్యమున్న సనత్నగర్ టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ప్రారంభోత్సవానికి మార్గం సుగమమైంది. వచ్చే నెల 19న దీనిని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఓపీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, ఇన్ వార్డులు, టెస్టింగ్ ల్యాబ్లు సిద్ధమవుతున్నాయి. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ట్యాబ్ టెక్నిషియన్లు, ఇతర సిబ్బందిని 3 నెలల డిప్యుటేషన్పై నియమించారు. గాంధీ, ఉస్మానియా, వనస్థలిపురం ప్రాంతీయ ఆసుపత్రి, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి 40 మంది సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉగాది రోజు నుంచి వైద్య సేవలు షురూ కానున్నాయి. గాంధీ, ఉస్మానియాలకు ఉపశమనం సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గనుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. వెయ్యి పడకల సామర్థ్యం, అత్యాధునిక శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉగాది నుంచి టిమ్స్లో మొదలవుతున్నాయి. నిత్యం నగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు 2,500 నుంచి 3 వేల ఓపీ ఉంటోంది. రోగుల తాకిడితో సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా వైద్య సేవల్లో నాణ్యత తగ్గే ప్రమాదం ఉంటుందని అభిప్రాయం ఉంది. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పిస్తే మెరుగైన వైద్య సేవలకు అవకాశం ఉంటుంది. గుండె చికిత్సలు సులువు సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రి గుండె శస్త్రచికిత్సలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవనుంది. రోగులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హార్ట్ ఆపరేషన్స్ కోసం క్యాత్ ల్యాబ్, అవయవ మార్పిడికి ప్రత్యేకంగా రూపొందించిన 16 ఆపరేషన్ థియేటర్లు, సీటీస్కాన్, ఎంఆర్ఐ, డిజిటల్ ఎక్స్రే, ఇతర అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రారంభం నాటికి 100 శాతం పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. సనత్నగర్ టిమ్స్ 19న ప్రారంభం ఉగాది రోజు నుంచే ఓపీ, ఐపీ, ఓటీ సేవలు డిప్యుటేషన్పై 40 మంది సిబ్బంది -
దొంగ తెలివి
పోలీసులు పట్టుకుంటున్నారు జాగ్రత్త సాక్షి, సిటీబ్యూరో: బతుకుదెరువు కోసం నేపాల్ నుంచి నగరానికి వస్తున్న కొందరు ఇక్కడ నేరాలు చేయడానికే మకాం వేస్తున్నారు. ఓ టార్గెట్ను ఎంపిక చేసుకుని, అవకాశం కోసం ఎదురుచూసి మరీ పంజా విసురుతున్నారు. ఈ ముఠాల్లోని కీలక సభ్యులు తమ లక్ష్యం ఏమిటన్నది నేపాల్లో ఉంటున్న తమ కుటుంబీకులకు చెబుతూ, ఎప్పటికప్పుడు వారి నుంచి అప్డేట్స్ తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్లో ఉన్న నందగిరిహిల్స్లో నివసించే ప్రముఖ వ్యాపారి రవీంద్రశర్మ ఇంట్లో ఈ నెల 5న భారీ చోరీ చేసిన నేపాలీ గ్యాంగ్ విచారణలో దీనికి సంబంధించిన కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న భూపేందర్ సాహి అలియాస్ భువన్ను ఫోన్లో అతడి భార్య పంపిన యూట్యూబ్ లింక్ ఉండటాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. నగరంలో ఉన్న తన భర్త భారీ నేరానికి స్కెచ్ వేస్తున్న విషయం తెలిసిన నేపాల్లోని భువన్ భార్య ఇక్కడ జరిగే నేపాలీ సంబంధిత నేరాలు, వాటిలో అరెస్టులు తదితరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. ఈ వార్తల్ని నేపాల్లో యూట్యూబ్ చానెళ్లు ప్రసారం చేస్తున్నాయి. నేరం పకడ్బందీగా చేయాలని సూచిస్తూ.. గత నవంబర్ 16న కార్ఖానా పోలీసుస్టేషన్ పరిధిలోని గన్రాక్ ఎన్క్లేవ్లో ఓ నేపాలీ గ్యాంగ్ భారీ చోరీ చేసింది. ఈ ముఠాలోని ఐదుగురిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దీనిపై గత డిసెంబర్ 8న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇది నేపాల్లో ఓ యూట్యూబ్ ఛానల్లో ప్రసారమైంది. దీని లింకునే వాట్సాప్ ద్వారా భువన్ భార్య గత నెల్లో అతడికి పంపి... నేరం జాగ్రత్తగా చేయాలని, హైదరాబాద్ పోలీసులు నేరగాళ్లను పట్టుకుంటున్నారని హెచ్చరించింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఇతడి ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఈ లింకు కనిపించింది. జూబ్లీహిల్స్ చోరీ కేసులో నిందితులైన జీవన్, కృష్ణ చాంద్ 2023లో మియాపూర్ పరిధిలో మరికొందరితో కలిసి నేరం చేసినట్లు తేలింది. ఆ ఏడాది అక్టోబర్ 15న రాకేష్ విశ్వనాథ్ తన కుటుంబంతో కలిసి కరీంనగర్లో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. అదే రోజు రాత్రి ఆ ఇంటి వాచ్మెన్గా ఉన్న నవీన్తో పాటు మరో వ్యక్తి రూ.80 లక్షల విలువైన సొత్తు ఎత్తుకుపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి దిగిన సైబరాబాద్ ఎస్ఓటీ టీమ్ నవీన్ సహా ముఠాను పట్టుకోగా... ఈ నేరం వెనుక జీవన్, కృష్ణ చాంద్ ప్రమేయం ఉన్నట్లు తేలింది. మరికొన్ని ఠాణాల్లోనూ కేసులు.. జూబ్లీహిల్స్ చోరీ కేసులో నిందితులపై నగరంలోని మరికొన్ని ఠాణాల్లోనూ కేసులు ఉన్నాయి. దీంతో ఆయా అధికారులు పీటీ వారెంట్లుపై అరెస్టు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. రవీంద్ర శర్మ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్న భువన్ ఈ నెల 3న కృష్ణ, కమల్లను నగరానికి రప్పించాడు. వీళ్లు లక్డీకపూల్లోని ఓ లాడ్జిలో బస చేశారు. దర్యాప్తులో ఈ విషయాలు గుర్తించిన అధికారులు సదరు లాడ్జి నుంచి రికార్డులతో పాటు ఈ ద్వయం దాఖలు చేసిన గుర్తింపు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5 రాత్రి రవీంద్రశర్మ కుటుంబం ఫంక్షన్కు వెళ్లడంతో అదే రోజు నేరం చేయాలని నిర్ణయించిన భువన్... కృష్ణ, కమల్ వేర్వేరుగా బయలుదేరి క్యాబ్స్లో నందగిరిహిల్స్కు చేరుకున్నారు. ఆ క్యాబ్ డ్రైవర్లను గుర్తించిన పోలీసులు వారి వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు చెల్లింపులకు సంబఽందించిన ఆధారాలూ సేకరించారు. మరోపక్క ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గత డిసెంబర్లో నేపాలీ గ్యాంగ్ అరెస్టు అక్కడ యూ ట్యూబ్ చానెళ్లలో ప్రసారమైన నగర నేర వార్తలు లింక్ను భర్తకు షేర్ చేసిన నిందితుడి భార్య జూబ్లీహిల్స్ చోరీ కేసులో వెలుగులోకి కీలకాంశాలు -
మెట్రోకు రుణాలిస్తాం
● సంసిద్ధత వ్యక్తంచేసిన ఐఆర్ఎఫ్ఆర్సీ ● వడ్డీ రేటు తగ్గింపునకు సంప్రదింపులు సాక్షి, సిటీబ్యూరో: మెట్రోకు రుణాలు ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్ఆర్సీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోరైల్ సంస్థకు, ఐఆర్ఎఫ్ఆర్సీకి మధ్య ప్రాథమికంగా అవగాహన ఏర్పడినట్లు సమాచారం. ఐఆర్ఎఫ్సీ అందజేసే రుణాలకు వడ్డీరేటుపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అతి తక్కువ వడ్డీ రేటుకు రుణాలిచ్చే భారతీయ ఆర్థిక సంస్థల్లో ఒకటైన ఐఆర్ఎఫ్సీ నుంచి 3 శాతం వడ్డీకి రుణాలను తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు 3 నుంచి 4 శాతం మధ్య వడ్డీరేటుపై బేరసారాలు కొనసాగుతున్నాయన్నారు. మెట్రో టేకోవర్లో భాగంగా మొత్తం రూ.15 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం చెల్లించాల్సిన విషయం తెలిసిందే. ఇందులో రూ.2 వేల కోట్లు ఎల్అండ్టీ బకాయిల చెల్లింపు కావడం గమనార్హం. కాగా.. 2017 నవంబర్ 28న ప్రధాని మోదీ.. మియాపూర్–ఎల్బీనగర్ రూట్లో మెట్రో సేవలను ప్రారంభించారు. ఆ తర్వాత దీని నిర్వహణలో ఎల్అండ్టీ చేతులెత్తేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం టేకోవర్ చేసిన విషయం విదితమే. -
ఫలితం పదిపోకుండా..
గ్రేటర్ పరిధిలో టెన్త్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం సాక్షి, సిటీబ్యూరో: మహా హైదరాబాద్ పరిధిలో పది ఫలితాల్లో వెనుకబాటుకు చెక్ పెట్టేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. గడిచిన నాలుగేళ్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విద్యా సంవత్సరం ‘వంద శాతం ఉత్తీర్ణత’ లక్ష్యంగా ‘టార్గెట్.. టెన్త్’ పేరుతో విద్యాశాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర గ్రామీణ జిల్లాలు ఫలితాల్లో దూసుకుపోతుంటే, అత్యాధునిక వసతులున్న నగర పరిధిలోని జిల్లాలు మాత్రం వెనుకబడి ఉండటంపై ఆయా యంత్రాంగాలు సీరియస్గా తీసుకున్నాయి. మూడు విభాగాలుగా.. పదో తరగతిలో వంద శాతం ఫలితాల సాధన కోసం విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా వారిని మూడు విభాగాలుగా విభజించి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. పాస్ మార్కులు సాధించడంలో ఇబ్బంది పడే వెనుకబడిన విద్యార్థులకు కనీస అభ్యసన సామగ్రితో పాటు శిక్షణ, సగటు మార్కులతో ఉత్తీర్ణులయ్యే వారిని పై తరగతికి చేర్చేలా ప్రోత్సాహం, ప్రతిభావంతులైన విద్యార్థులకు 10/10 జీపీఏ సాధించేలా ఉన్నత స్థాయి ప్రశ్నపత్రాలతో సాధనకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఉదయం, సాయంత్రం వేళ్లలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతోపాటు గత నాలుగేళ్ల ప్రశ్నపత్రాల విశ్లేషణ, నూతన పరీక్ష విధానంపై అవగాహన కల్పిస్తోంది. జిల్లా 2025 2024 2023 2022 హైదరాబాద్ 88.53 86.76 80.92 79.63 రంగారెడ్డి 87.84 91.01 87.35 90.04 మేడ్చల్–మల్కాజిగిరి 90.76 89.61 90.72 86.31 గత ఏడాది ఇవీ స్థానాలు.. మహా హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు పదో తరగతిలో నాలుగేళ్ల నుంచి వెనుకబాటు తప్పడం లేదు. గతేడాది రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ 30 వ స్థానం, మేడ్చల్–మల్కాజిగిరి 28 వ, రంగారెడ్డి జిల్లా 31వ స్థానానికి దిగజారాయి. -
రాష్ట్రం నుంచి ఇద్దరు,ముగ్గురు ఒలింపియన్లు
బంజారాహిల్స్: తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ (టీఆర్ఏ) ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా నిర్వహించిన స్పోర్ట్స్ షూటింగ్ లీడర్షిప్ కాన్క్లేవ్–2026 విజయవంతంగా ముగిసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని టీఆర్ఏ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. మాజీ ఎంపీ, క్రీడా సలహాదారు జితేందర్రెడ్డి మాట్లాడుతూ... 2032 నాటికి తెలంగాణ నుంచి కనీసం ఇద్దరు, ముగ్గురు ఒలింపియన్లు తయారుచేయగలమనే విశ్వాసం వ్యక్తం చేశారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు కాలికేష్ నారాయణ్సింగ్ మాట్లాడుతూ... మౌలిక వసతుల మెరుగుదల, శాసీ్త్రయ కోచింగ్, ఏఐ ఆధారిత విశ్లేషణపై దృష్టి పెట్టాలని సూచించారు. టీఆర్ఏ అధ్యక్షుడు అమిత్ సంఘి మట్లాడుతూ.. షూటింగ్ క్రీడ ప్రశాంతంగా కనిపించినా అత్యధిక ఒత్తిడి, క్రమశిక్షణ, ఏకాగ్రత అవసరమయ్యే క్రీడ అని పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేష్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డైరెక్టర్, ఎండీ సోనిబాలదేవి తదితర ప్రముఖులు హాజరయ్యారు. -
కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టురట్టు
సాక్షి, సిటీబ్యూరో : జేజే ఫుడ్స్ పేరుతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎస్ మఖ్తా రైల్వే గేట్ సమీపంలోని ఓ ఇంటిపైన నిర్వహించిన దాడుల్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటపడింది.అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, ఆరోగ్యానికి హానికరమైన రీతిలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ తనిఖీల్లో ఆబిడ్స్కు చెందిన జసాని ఇల్యాన్ (21)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘జేజే ఫుడ్స్’ పేరుతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ వ్యాపారం చేస్తున్నాడు.ఈ పేస్ట్ను బహిరంగంగా ప్లాస్టిక్ టబ్బులలో ఉంచడం వల్ల దుమ్ము, ధూళి, ఈగలు వచ్చి చేరాయి. అలాగే ఈ జేజే ఫుడ్స్ కాలం చెల్లిన ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ను కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఈ కల్తీ పేస్ట్ను హోటళ్లు, కిరాణా షాపులకు సరఫరా చేస్తున్నాడు. ఈ తనిఖీల్లో పోలీసులు మొత్తం 4000 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం లేక్ పోలీసులకు అప్పగించారు. ఈ తనిఖీల్లో ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి.రాఘవేందర్, ఎస్ఐ జి. శ్రీకాంత్, లేక్ పోలీస్స్టేషన్ ఎస్ఐ ఎన్. శివ శంకర్,తదితరులు ఉన్నారు. -
త్వరలో అంబేడ్కర్ టవర్ నిర్మాణం
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కవాడిగూడ: లోయర్ ట్యాంక్బండ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవనం స్థానంలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అంబేడ్కర్ టవర్ నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అంబేడ్కర్ టవర్ నిర్మిస్తామని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి వదిలేశారని ఆరోపించారు. గురువారం లోయర్ ట్యాంక్ బండ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవనాన్ని వివిధ దళిత సంఘాల విజ్ఞప్తి మేరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుతోపాటు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వీలైనంత త్వరగా అంబేడ్కర్ టవర్ను నిర్మించే బాధ్యత సాంఘిక సంక్షేమ మంత్రిగా తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంబేడ్కర్ టవర్ నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజలు దళిత సంఘాలు భాగస్వాములై పూర్తి స్థాయిలో సహకరించలని మంత్రి కోరారు. -
నిరుద్యోగులను పట్టించుకోని రేవంత్రెడ్డి
ఖైరతాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల కృషితో ముఖ్యమంత్రి అయి ఇప్పుడు నిరుద్యోగులను మర్చిపోయారని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. గురువారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డీఎస్పీ, 40వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తా నిరుద్యోగం లేకుండా చేస్తా అని చెప్పారు.. కానీ ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారని, ఎంతో మంది జీవితాలు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లిపోయానన్నారు. ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు డీఎస్సీ వేసే వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ర్యాగ అరుణ్కుమార్, నీల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కొక్కరిపై ఒక్కోలా.. ఏఐ ప్రభావం
ఖైరతాబాద్: భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రభావం ప్రతి ఒక్కరిపై వేర్వేరుగా ఉంటుందని, అందుకు అనుగుణంగా విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని టీఆర్అండ్బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్రాజ్ అన్నారు. గురువారం ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో క్యాంపస్ టు కేపబిలిటీ కాన్క్లేవ్–2026 పేరుతో రక్షణ, ఏరోస్పేస్లో విద్య, పరిశ్రమల మధ్య అంతరాన్ని ఎలా తగ్గించాలనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వికాస్ రాజ్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యంతో సమాజానికి ఎలా ఉపయోగపడగలమనే విధంగా ఆలోచించాలన్నారు. మిధాని సీఎండీ ఎస్వీఎస్.నారాయణ మూర్తి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్టారెడ్డి, ఐఈఐ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ రమణానాయక్, గౌరవ కార్యదర్శి మర్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
కార్గోలో ఇన్నొవేటివ్ ఎయిర్పోర్టుగా ఆర్జీఐఏకు అవార్డు
శంషాబాద్: ఎయిర్ కార్గో ఇండియా విభాగంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో విభాగానికి ఇన్నోవేటివ్ ఎయిర్పోర్టుగా అవార్డు దక్కినట్లు ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి. షిప్పింగ్ ట్రాన్స్పోర్టు ఎవియేషన్ ట్రేడ్ (ఎస్టీఏటీ) పబ్లిషింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ అవార్డు దక్కిందని తెలిపారు. ఎయిర్ కార్గోలో జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేక మైలురాళ్లు దాటిందన్నారు. దేశంలో మొదటి సారిగా ఎయిర్సైడ్ టెంపరేచర్ కంట్రోల్ రిఫర్ ట్రక్, అన్ బ్రోకెన్ కోల్డ్ చైన్, ఫ్లైట్ ఇన్పర్మేషన్ డిస్ప్లే కేంద్రం, త్వరిత గతిన రక్షణ చర్యలు సంబంధిత అంశాల్లో జీఎంఆర్ కార్గో అందిస్తున్న సేవలకుగాను ఈ గుర్తింపు దక్కిందన్నారు. -
విశ్వాసం చూపిన శునకం
రామంతాపూర్ : యజమాని మరణించడంతో ఓ పెంపుడు శునకం అతని భౌతికకాయం వద్దే ఉండిపోయింది. అక్కడక్కడే తిరుగుతూ అతనిపై తనకున్న విశ్వాసాన్ని చాటుకుంది. రామంతాపూర్ నెహ్రూనగర్కు చెందిన మాజీ రైల్వే ఉద్యోగి ముత్తినేని లక్ష్మయ్య (93) బుధవారం సాయంత్రం రైల్వే ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన పార్థివ దేహాన్ని ఇంటి ముందు ఫ్రీజర్లో ఉంచినప్పటినుంచీ గురువారం సాయంత్రం అంతిమయాత్ర నిర్వహించే వరకు ఫ్రీజర్ చుట్టూ పెంపుడు శునకం తిరుగుతూ విశ్వాసం చాటుకుంది. తినడానికి ఆహారం పెట్టినా కనీసం అటువైపు కూడా చూడకుండా భౌతికకాయం వద్దే పడుకుంది. అంత్యక్రియలకు హాజరైన వారు ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయారు. -
అనుమానం రాకుండా మైనర్ల వినియోగం!
సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రా–ఒడిశా బోర్డర్ సహా ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి ఉత్పత్తి చేసి, నగరానికి సరఫరా చేసే ముఠాలు తెలివి మీరుతున్నాయి. ఈ రవాణాపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మైనర్లను క్యారియర్లుగా వినియోగిస్తున్నాయి. చార్మినార్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన ముఠాతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం ఏడుగురిని అరెస్టు చేయగా వీరిలో ముగ్గురు బాలురు ఉన్నారని అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు ప్రకటించారు. వీరి నుంచి రూ.16 లక్షల విలువైన 23 కేజీల గంజాయి, వాహనం, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఒడిశాలోని మల్కాన్గిరికి చెందిన కిషోర్ తక్రి అక్కడ గంజాయి పండించే వారి నుంచి సరుకు సేకరించి నగరానికి అక్రమ రవాణా చేసి విక్రయిస్తుంటాడు. రెండు మూడేళ్లుగా ఈ దందా చేస్తున్న ఇతడిని 2024, 2025ల్లో ఒడిశాలోని మోటు పోలీసులు పట్టుకున్నారు. గంజాయి ప్యాకెట్లు తీసుకువస్తుండగా అనుమానించిన అధికారులు తనిఖీ చేసి అరెస్టు చేశారు. దీంతో పోలీసులు అనుమానించని పంథాలో సరుకు రవాణా చేయాలని ఇతగాడు నిర్ణయించుకున్నాడు. దీనికోసం మల్కాన్గిరితో పాటు కోరాపుట్కు చెందిన మైనర్లను ఎంచుకున్నాడు. వీరిని ఒక్కో ట్రిప్నకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. రెండుమూడు రోజులు సాగే ఈ ప్రయాణంలో వారికి అయ్యే ఖర్చంతా కిషోరే భరిస్తాడు. తాను అప్పగించిన గంజాయి నింపిన బ్యాగ్స్ లేదా బాక్సుల్ని హైదరాబాద్ వరకు తీసుకువచ్చి అప్పగించడమే వీరి పని. బస్సు, రైళ్లల్లో వీరితో కలిసే, కొద్దిదూరంలో ఉంటూ ప్రయాణించే ఇతడు పోలీసులకు అనుమానం రాకుండా చూసుకుంటున్నాడు. ఒడిశాకు చెందిన ఇంద్ర మాది, సంజయ్ వద్ద కిలో గంజాయి రూ.4 వేలకు ఖరీదు చేస్తున్న కిషోర్ దాన్ని ధూల్పేట్కు చెందిన శంకర్ సింగ్కు రూ.ఏడు వేలు చొప్పున విక్రయిస్తున్నాడు. గతంలో కొన్నిసార్లు ఇలానే ఖరీదు చేసిన శంకర్ ఆ సరుకును స్థానికంగా ఉన్న పెడ్లర్స్కు మరింత రేటుకు విక్రయిస్తున్నాడు. తాజాగా ధూల్పేట్కు చెందిన వినయ్ సింగ్ తనకు 23 కేజీలు కావాలంటూ శంకర్కు చెప్పాడు. దీంతో ఫోన్ పే ద్వారా రూ.1.40 లక్షలు కిషోర్కు చెల్లించి ఆర్డర్ ఇచ్చాడు. కిషోర్ ఈ గంజాయిని అక్కడే ఉండే బలరాం నుంచి ఖరీదు చేసి 11 ప్యాకెట్లుగా పార్శిల్ చేశాడు. దీన్ని బంధువులైన మహిళలు పన్మతి తక్రి, లక్ష్మి తక్రిలతో పాటు ముగ్గురు మైనర్లకు అప్పగించాడు. వీరిని ఓ కుటుంబం మారిదిగా పేర్కొంటూ ప్రైవేట్ బస్సులో హైదరాబాద్ బయలుదేరాడు. ఈ సరుకు తీసుకోవడానికి శంకర్ ఎంజీబీఎస్ సమీపంలోకి వచ్చాడు. ఈ దందాపై చార్మినార్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ ఎస్.సైదాబాబు నేతృత్వంలో ఎస్సైలు కె.రామారావు, ఎం.మహేష్, ఎం.మధు, కె.స్వామి, కానిస్టేబుల్ హరీష్ కుమార్ వలపన్ని ఏడుగురినీ పట్టుకున్నారు. వీరితో పాటు స్వాధీనం చేసుకున్న సరుకునూ తదుపరి చర్యల నిమిత్తం అఫ్జల్గంజ్ పోలీసులకు అప్పగించారు. వీరి విచారణలో వినయ్ సింగ్ పేరు వెలుగులోకి రావడంతో అతడి కోసం గాలిస్తున్నారు. వెలుగులోకి గంజాయిస్మగ్లర్ల కొత్త ఎత్తులు ప్యాకెట్లు మోసేందుకు బాలుర వినియోగం రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు చెల్లింపు ఏడుగురిని అరెస్టు చేసిన చార్మినార్ టాస్క్ఫోర్స్ -
జలమండలి..చలో బస్తీ
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల తాగునీరు, మురుగునీటి సమస్యల సత్వరమే పరిష్కారమే లక్ష్యంగా జలమండలి సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టనుంది. ‘బస్తీ బాట’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ప్రారంభించనుంది. మేనేజింగ్ డైరెక్టర్ నుంచి వార్డు స్థాయి మేనేజర్ల వరకూ బస్తీబాట పట్టనున్నారు. జల మండలి పరిధిలోని బస్తీ, కాలనీల్లో మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు తాగునీరు, సీవరేజీ సమస్యలు గుర్తిస్తారు. ప్రజలతో మాట్లాడి తాత్కాలిక సమస్యలు తక్షణమే పరిష్కరిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అధికారులు యథావిధిగా కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారు.పర్యటనలో ప్రాధాన్య అంశాలివే..మురుగునీటి సమస్య: మ్యాన్హోల్స్ పరిస్థితి, పైపులైన్ లీకేజీలు, ఓవర్ఫ్లో, డీసిల్టింగ్ పనుల పర్యవేక్షణ.తాగునీటి సరఫరా: నీటి వృథా, లీకేజీలు, లో–ప్రెషర్ సమస్యలు, మోటార్ల అక్రమ బిగింపును అరికట్టడం. నీటి నాణ్యతను స్వయంగా పరిశీలించడం.అవగాహన: భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, ఇంజక్షన్ బోర్వెల్స్ ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం. బస్తీబాట పర్యటన తీరును పరిశీలించేందుకు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్, జాయింట్ ఎండీ, డైరెక్టర్లు, రీజియన్ ఈడీలు, డైరెక్టర్ (ఆపరేషన్)లు, జోన్ సీజీఎం, జనరల్ మేనేజర్లు, సర్కిల్ డీజీఎంలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు.రోజువారీ నివేదికప్రతి వార్డు మేనేజర్ పర్యటన రోజువారీ కార్యక్రమానికి సంబంధించిన నివేదికను ఆన్లైన్ యాప్లో సర్కిల్ డీజీఎంలకు పంపిస్తారు. సర్కిల్ డీజీఎంలు సర్కిల్ వారీగా జోన్లకు, జోన్్ నుంచి రీజియన్కు, రీజియన్ నుంచి కేంద్ర కార్యాలయానికి ఆన్లైన్ నివేదికలు సమర్పిస్తారు. వీటిపై ప్రతి వారం శనివారం సమీక్ష సమేవేశం నిర్వహిస్తారు.మెరుగైన సేవల కోసమే..నగర వాసులకు తాగునీరు, సీవరేజీ సమస్యలు లేకుండా మరింత మెరుగైన సేవలందించేందుకు బస్తీబాట చేపడుతున్నాం. క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటాం.– అశోక్ రెడ్డి, జలమండలి ఎండీ -
విలువల విద్యతో దేశ సమగ్రత
కుత్బుల్లాపూర్: విలువలతో కూడిన విద్య, నైతికత దేశ సమగ్రతకు తోడ్పాటునందిస్తాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. జీడిమెట్లలో బీడీఎల్ ఆధ్వర్యంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ కేంద్రం భవన నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్తో పాటు రెడ్క్రాస్, ఎన్సీసీ వంటి సంస్థలతో భాగస్వామ్యం చేసుకుంటూ దేశ బలోపేతానికి పాటుపడాలని సూచించారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ కేంద్రానికి బాడెన్ పావెల్ మెమోరియల్ హాల్ నామకరణం చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.దానకిషోర్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ బీఎస్శర్మ, బీడీఎల్ డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ గాయత్రి ప్రసాద్, జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) విజయేందర్ రెడ్డి, ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్ కుమారి పాల్గొన్నారు. -
మూసీ భూ సేకరణలో న్యాయం చేస్తాం
రైతులకు ఆర్డీఓ హామీశాస్త్రిపురం: మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం సేకరించే భూములకు సంబంధించి ప్రతి రైతుకూ న్యాయం చేస్తామని రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డి అన్నారు. గురువారం హైదర్గూడలో మూసీ డెవలప్మెంట్ గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాము కోల్పోయిన భూములకు నష్ట పరిహారంగా భూములే ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. వ్యవసాయ భూముల్లో కాయగూరలు, ఆకుకూరలు పండించుకుంటున్నామని, తమకు న్యాయం చేయాలని ఆర్డీవో వెంకట్రెడ్డికి రైతులు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన.. ప్రతి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
సమాంతర ప్రగతి సాధ్యమా?
సాక్షి, సిటీబ్యూరో : క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్) పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రజలందరికీ సమాన అభివృద్ధి, సమాన సదుపాయాల కోసమే ఉమ్మడి జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించినట్లు ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ, అది సాధ్యమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మూడు కార్పొరేషన్ల ఆదాయం, చేయాల్సిన పనుల్లో ఎంతో వ్యత్యాసం ఉండటమే ఇందుకు కారణం.ఉమ్మడి జీహెచ్ఎంసీలోనూ కొన్ని జోన్లలో ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ ఆదాయం ఉంది. కానీ, ఎక్కువ పరిధి ఉన్నందున.. ఆదాయం లేని ప్రాంతాల్లో సైతం మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటైనందున ఎక్కడి ఆదాయాన్ని అక్కడే వినియోగించాల్సి ఉంటుంది.జీహెచ్ఎంసీలో..జీహెచ్ఎంసీకి అత్యధిక ఆదాయ వనరు ఆస్తిపన్ను. చార్మినార్ జోన్లో ఈ ఆర్థిక సంవత్సర ఆస్తిపన్ను డిమాండ్ రూ.534 కోట్లు కాగా, గత నెలాఖరు వరకు వసూలైంది కేవలం రూ. 53 కోట్లు మాత్రమే. అదే తరుణంలో శేరిలింగంపల్లి జోన్ డిమాండ్ రూ.675 కోట్లు కాగా, వసూలైంది రూ.306 కోట్లు. ప్రస్తుతం చార్మినార్ జోన్ జీహెచ్ఎంసీలో ఉండగా, శేరిలింగంపల్లి ఎంఎంసీలో ఉండటం తెలిసిందే. గతంలోఉమ్మడి జీహెచ్ఎంసీలో చార్మినార్ జోన్లో సైతం ఇదేతీరున ఆదాయం ఉన్నా, మిగతా జోన్ల మాదిరిగానే పనులు చేసేవారు.వచ్చిన ఆదాయాన్నే అన్ని జోన్లకూ వినియోగించేవారు. ప్రస్తుతం చార్మినార్ జోన్లో పనులు చేయాలన్నా జీహెచ్ఎంసీ పరిధిలోని ఆదాయాన్నే పంచినా జీహెచ్ఎంసీలో ఎక్కువ ఆస్తిపన్ను వసూలయ్యేది ఖైరతాబాద్ జోన్లో మాత్రమే. మిగతా జోన్లలో అంతంతమాత్రమే. ఆ జోన్ల అవసరాలకే అవి సరిపోవు. ఖైరతాబాద్ జోన్లో ఆస్తిపన్ను ద్వారా రూ.330 కోట్లు రాగా, మిగతా జోన్లలో రూ. 100 కోట్ల లోపునే ఉంది. డిమాండ్ దృష్ట్యా చూస్తే ఖైరతాబాద్ జోన్లోనూ వసూలు అంతంతమాత్రమే అని చెప్పక తప్పదు. చార్మినార్ జోన్లో మరీ తక్కువగా ఉన్నందున ఆ జోన్లో పనులు చేయకుండా ఉంటారా ? ఉంటే అక్కడి ప్రజాప్రతినిధులు ఊరుకుంటారా? ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే.ఎంఎంసీలోనూ..ఎంఎంసీలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. అక్కడి మూడు జోన్లలో మల్కాజిగిరి ఆస్తిపన్ను డిమాండ్ రూ.899 కోట్లు కాగా, వసూలైంది మాత్రం రూ.131 కోట్లే. ఈ కార్పొరేషన్లోని మూడు జోన్లలోనూ ఎక్కువశాతం ఆస్తిపన్ను వసూలైంది ఉప్పల్జోన్లో మాత్రమే. మిగతా జోన్లతో పోలిస్తే ఈ జోన్లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాల పనులు ఎక్కువగా ఉన్నాయి.సీఎంసీ బెటర్మూడు కార్పొరేషన్లలోనూ సైబరాబాదే బెటర్. డిమాండ్లో ఎక్కువశాతం ఆస్తిపన్ను వసూలైంది కూడా అక్కడే. అంతేకాదు, ఇప్పటికే ఫ్లై ఓవర్లు, రహదారులు, జంక్షన్లతో సహ ఎక్కువ సదుపాయాలున్నది ఇక్కడే కావడం తెలిసిందే. బహుళ అంతస్తుల నిర్మాణాలు, వాణిజ్య సముదాయాల డిమాండ్ కూడా ఇక్కడే ఎక్కువ కావడంతో భవిష్యత్లోనూ దీనికి నష్టమేం ఉండదు.జీహెచ్ఎంసీకి కష్టంజీహెచ్ఎంసీ లోని గోల్కొండ జోన్లోనూ ఆస్తిపన్ను డిమాండ్ రూ. వెయ్యికోట్లకు పైగా ఉన్నప్పటికీ, వసూలైంది కేవలం రూ.97 కోట్లుమాత్రమే. ఈ నేపథ్యంలో క్యూర్ వరకు సమానాభివృద్ధి సాధ్యమేనా? అంటే, ప్రభుత్వం నిధుల ఆసరా ఇవ్వనిది మాత్రం అసాధ్యమంటున్నారు మున్సిపల్ వ్యవహారాల నిపుణులు. -
ముంచుకొస్తోంది గడువు
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో మొదటి దశ స్వాధీన గడువు ముంచుకొస్తోంది. దీంతో రుణాల చెల్లింపునకు అవసరమైన నిధుల సేకరణపై అధికారులు దృష్టి సారించారు. వివిధ అంశాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికలను అందజేసేందుకు ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీలు కూడా కార్యాచరణను వేగవంతం చేశాయి. నిధుల సమీకరణకు అందుబాటులో ఉన్న మార్గాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్కమిటీకి నివేదికను త్వరలో అందజేయనున్నారు. ఒప్పందం ప్రకారం ఎల్అండ్టీ సంస్థకు రూ.2 వేల కోట్లు చెల్లించాలి. మరో రూ.13 వేల కోట్ల బ్యాంకు రుణాలను ప్రభుత్వం చెల్లించాలి. మార్చి 31లోపు యాజమాన్య బదిలీని పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. దీంతో నిర్ణీత గడువులోపే చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేసి మెట్రో యాజమాన్యం నుంచి వైదొలిగేందుకు తమకు వెసులుబాటు కల్పించాలని ఎల్అండ్టీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలో నిధుల సేకరణే ప్రధాన లక్ష్యంగా అధికార యంత్రాంగం కార్యాచరణ వేగవంతం చేసింది. నిరంతర సంప్రదింపులు సమావేశాలతో బేగంపేట్లోని హెచ్ఎఆర్ఎంఎల్ కార్యాలయంలో హడావుడి నెలకొంది.కన్సల్టెన్సీల అధ్యయనం తుది దశకుమెట్రోరైల్ స్వాధీన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ సంస్థల అధ్యయనం తుదిదశకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలు, హెచ్ఎంఆర్ఎల్ ఆస్తులు, అప్పులు అంశాలపై ఐడీబీఐ అధ్యయనం కొనసాగిస్తుండగా, మూడు కారిడార్లలో రైళ్ల నిర్వహణ, సాంకేతిక వ్యవస్థలు, ఇంధన వ్యయం, సిబ్బంది, తదితర అంశాలపై ఢిల్లీ మెట్రోరైల్ అధ్యయనం చేపట్టింది. ప్రస్తుతం ఈ రెండు సంస్థల నివేదికల ఆధారంగా స్వాధీన ప్రక్రియ సాగనుంది.‘మెట్రోరైల్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం కేటాయించిన సుమారు 249 ఎకరాల భూములు, మాల్స్ తదితర ఆస్తుల విక్రయంతో రుణాలు చెల్లించేందుకు అవకాశం ఉంది. మరోవైపు మొదటి దశ టేకోవర్ పూర్తయితే తప్ప రెండోదశకు కేంద్రం నుంచి అనుమతి, ఆర్థిక సహాయం లభించే అవకాశం లేదు. ఒప్పందం ప్రకారం ఎల్అండ్టీకి రూ.2 వేల కోట్లు చెల్లించి రూ.13 వేల కోట్ల బ్యాంకు రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే అవకాశం ఉంది. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
– రూ.28 లక్షల సొత్తు స్వాధీనం.. బంజారాహిల్స్: నగరంలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడ్డ ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నగర పోలీసు కమిషనర్ టాస్క్ఫోర్స్ (గోల్కొండ జోన్), బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దర్యాప్తులో భాగంగా వారిని అరెస్టు చేసి రూ.28 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తంజీమ్ జాకీర్ అలీ (30), మొహమ్మద్ సద్దాం (32), షానవాజ్ అలియాస్ షానవాజ్ ఖాన్ (29)లు స్నేహితులు. గతంలో ఉత్తరప్రదేశ్లో బట్టల దుకాణంలో పనిచేసే తంజీమ్ అలీ, సద్దాంలకు ఆదాయం సరిపోకపోవడంతో హైదరాబాద్లో చెఫ్గా పనిచేస్తున్న షానవాజ్ఖాన్ సహాయంతో నగరానికి వచ్చారు. వీరు తలాబ్కట్టలో నివాసం ఉంటున్నారు. నగరంలో దొంగతనాలు చేయాలని పథకం వేశారు. తొలుత తుకారాంగేట్ పరిధిలో ఒక బైక్ను దొంగిలించారు. ఆపై ఐరన్రాడ్లు, స్క్రూడ్రైవర్ల సహాయంతో బంజారాహిల్స్, ఎస్ఆర్నగర్, డబీర్పురా పోలీస్స్టేషన్ల పరిధిలో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగిలించిన సొత్తును కొంత తమ నివాసంలో దాచి, మరికొంత భాగాన్ని విక్రయించడానికి యూపీలోని తమ బంధువు రిజ్వాన్కు పంపేవారు. ఫిబ్రవరి 18న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వారిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 160.84 గ్రాముల బంగారు ఆభరణాలు, 666 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.3,28,000 నగదు, ీ ద్విచక్ర వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, ఇమిటేషన్ జ్యువెలరీని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ.28,61,732 ఉంటుందని పోలీసులు తెలిపారు. -
కళాశాల భవనంపైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
రాజేంద్రనగర్: కళాశాల మూడో అంతస్తు నుంచి దూకిన ఓ విద్యార్థిని గురువారం ఆత్మహత్య చేసుకుంది. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన మేరకు..శివరాంపల్లి పోలీసు అకాడమీ కాలనీకి చెందిన శైలేష్ కుమార్ తివారీ కుమార్తె (17) భవానీకాలనీలోని శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయి. గురువారం పరీక్ష రాసిన అనంతరం ఆమె మూడో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి దూకేందుకు యత్నించగా రోడ్డుపై వెళుతున్న వారు దీనిని గమనించి కేకలు వేస్తూ వద్దని వారించినా వినకుండా దూకేసింది. విద్యార్థినికి తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. కాగా విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
త్వరలో ‘టాటా–అంబేడ్కర్ శిక్షణ కేంద్రం’
బంజారాహిల్స్: ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలకు దీటుగా అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులు పోటీ పడుతున్నారని, రానున్న రోజుల్లో ‘టాటా–అంబేడ్కర్ శిక్షణ కేంద్రం’ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వైస్ చాన్సలర్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. టీసీఎస్ అయాన్ భాగస్వామ్య కంపెనీల ద్వారా ఎంపికై న 64 మందికి గురువారం విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని సీఎస్టీడీ భవనం ఆడిటోరియంలో జాబ్ ఆఫర్ లెటర్లను అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ... దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలకు దీటుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పోటీపడుతుందన్నారు. ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)తో కలిసి ఓ ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాన్ని ‘టాటా–అంబేడ్కర్’ పేరిట ఏర్పాటు చేయాలనే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అకడమిక్ డైరెక్టర్ పుష్ప చక్రపాణి, ఓఎస్డీ రవీంద్రనాథ్ సోలమన్ పాల్గొన్నారు. -
జీసీసీ జాబ్స్.. సిటీ వైబ్స్
దేశంలోని 20 శాతం జీసీసీలు భాగ్యనగరంలోనే.. ● ఫ్రెషర్లకు భారీగా ఉద్యోగావకాశాలు.. వేతనాలూ ఎక్కువే ● ప్రొడక్ట్ మేనేజ్మెంట్, డేటా సైన్స్, డేటా ఇంజినీరింగ్ విభాగాల్లో అవకాశాలు మెరుగైన మౌలిక వసతులు, నిపుణుల లభ్యత ప్రధాన కారణం సాక్షి, సిటీబ్యూరో: బహుళజాతి సంస్థల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(జీసీసీ)ల కొలువులకు హైదరాబాద్ నెలవుగా మారుతోంది. బహుళజాతి సంస్థలు తమ జీసీసీల ఏర్పాటుకు నగరాన్నే ఎంచుకుంటున్నాయి. గతంలో సామూహిక ప్రాంగణ నియామకాలకు దూరంగా ఉన్న జీసీసీలు ఇప్పుడు క్రమంగా క్యాంపస్ రిక్రూట్మెంట్ ర్యాలీలు చేపడుతున్నాయి. ప్రతిభ, నైపుణ్యమే కొలమానాలుగా ఫ్రెషర్లకు కూడా భారీ వేతనాలు అందిస్తున్నాయి. 2025–2026లో నగరంలో ప్రాంగణ నియామకాల్లో పాల్గొన్న జీసీసీల సంఖ్య దాదాపు 300 శాతం పెరిగింది. క్యాంపస్ రిక్రూట్మెంట్లలో చెల్లించే దాని కంటే జీసీసీ నియామకాల్లో వార్షిక వేతనాలు మెరుగ్గా ఉంటున్నాయి. సగటున రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షలను అందిస్తున్నాయి. దేశంలో 1,800పైగా జీసీసీలు ప్రస్తుతం దేశంలో 1,800పైగా జీసీసీలు ఉండగా.. వీటిల్లో సుమారు 21.6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కృత్రిమ మేధ(ఏఐ), ఇంజినీరింగ్, పరిశోధన, అభివృద్ధి, డిజిటల్ నైపుణ్యాలకు భారత్ కేంద్రంగా ఉండటంతో 2030 నాటికి జీసీసీల సంఖ్య 2,400లకు, ఉద్యోగుల సంఖ్య 28 లక్షల నుంచి 30 లక్షలకు చేరుతుందని అంచనా. హైదరాబాద్ హాట్ ఫేవరేట్.. జీసీసీలకు హైదరాబాద్ హాట్ ఫేవరేట్గా మారింది. దేశవ్యాప్తంగా జీసీసీల్లో 20 శాతానికిపైగా మన నగరంలోనే ఏర్పాటయ్యాయి. గ్రేటర్లో 355కుపైగా జీసీసీలు ఉన్నాయి. వీటిల్లో 3 లక్షలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత 12 నెలల్లో 35–50 జీసీసీలు నగరంలో కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఎవర్నార్త్ హెల్త్ సర్వీసెస్, ఓప్టమ్ గ్లోబల్, అలైన్ టెక్నాలజీస్, హనీవెల్, బార్క్లెస్, హెచ్ఎస్బీసీ వంటి సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్లపై దృష్టిసారించాయి. సత్తానే ప్రామాణికం.. గతంలో జీసీసీ కేంద్రాలకు సీఈఓ, సీఐఓలుగా ఆయా కంపెనీల కేంద్ర కార్యాలయాల నుంచిగానీ, ఆ కంపెనీల సొంత దేశాలకు చెందిన వారినిగానీ నియమించటం ఆనవాయితీ. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. తన, మన అనే తేడా కాకుండా, సత్తా ఉన్నవారినే జీసీసీల్లో ఉన్నత స్థానాలకు ఎంపిక చేసే సంప్రదాయం మొదలైంది. ప్రొడక్ట్ మేనేజ్మెంట్, జెనరేటివ్ ఏఐ. ఏఐ/ఎంఎల్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ నైపుణ్యాలు ఉన్నవారికి పెద్దపీట వేస్తున్నాయి. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, మానవ వనరులు ఉండటం, తక్కువ జీవన వ్యయం, అనుకూల ప్రభుత్వ విధానాల కారణంగా ఆయా సంస్థలు నగరానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. -
వైభవం.. క్రీడోత్సవం
రాయదుర్గం: 4వ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 బుధవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. పోటీల ప్రారంభం సందర్భంగా డీజీపీ శివధర్రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను అధికారికంగా ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా డీజీపీ గన్ఫైర్ చేసి గాలిలోకి బెలూన్లను ఎగురవేశారు.అనంతరం యంగ్ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. వ్యాయామం నిత్యజీవితంలో భాగం కావాలి గ్లోబల్ సమ్మిట్, అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు, గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల బందోబస్తు, సమ్మక్క సారక్క జాతర వంటి కీలక బాధ్యతలను పోలీసులు అత్యంత నిబద్ధతతో నిర్వహించారని డీజీపీ శివధర్రెడ్డి కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వారిలో నూతనోత్సహాన్ని నింపుతుందన్నారు. క్రీడలు మనలోని నాయకత్వ లక్షణాలను తట్టిలేపడంతోపాటు టీమ్ స్పిరిట్, ఐకమత్యాన్ని పెంచుతాయన్నారు. మహిళా పోలీసుల ప్రాతినిథ్యం ప్రతి విభాగంలోనూ పెరగాలని ప్రతిభతోపాటు నాయకత్వ లక్షణాలను చాటుకోవాలని సూచించారు. సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 2,532 మంది క్రీడాకారులు పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. ఇందులో 300 మంది మహిళా క్రీడాకారులు ఉండడం విశేషమన్నారు. వచ్చే నెలలో సైబరాబాద్ వేదికగా జరుగనున్న అఖిల భారత పోలీస్ ఫుట్బాల్ పోటీలు జరుగుతాయన్నారు. మొత్తం 31 క్రీడా విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. అనంతరం అంతర్జాతీయ వేదికలపై రాణించిన కృష్ణారావు, సంజీవకుమార్, గోపాలకృష్ణ, ఎండీబాబా, అవెను గోపాల్ జయరామ్, లావణ్య తదితర క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. ప్రత్యేక ఆకర్షణగా పోలీస్ ఎక్స్పో పోలీస్ వెల్ఫేర్ అండ్ వెల్నెస్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎక్స్పోను డీజీపీ సతీమణి హేమ శివధర్రెడ్డి ప్రారంభించారు. పోలీసులకు ఉపయోగపడే ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, శారీరక వ్యాయామం, క్రీడా పరికరాలు, వివిధ ఉత్పత్తులు స్టాల్స్ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ జట్లు ఘనంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్ ముఖ్యఅతిథిగా హాజరైన డీజీపీ శివధర్రెడ్డి 33 జిల్లాల నుంచి పాల్గొంటున్న 2,532 మంది క్రీడాకారులు -
స్టార్ట్ .. యాక్షన్ మళ్లీ 100 రోజుల ప్లాన్
మళ్లీ ‘100 రోజుల ప్లాన్’● వివిధ సమస్యల పరిష్కారమే లక్ష్యం ● ప్రజల భాగస్వామ్యంతో.. 3 కార్పొరేషన్ల పరిధిలో కార్యక్రమాలు ● ఈ నెల 23 నుంచి ప్రారంభం సాక్షి, సిటీబ్యూరో గత ప్రభుత్వాల హయాంలో జీహెచ్ఎంసీలో అమలు చేసిన 100 డేస్ యాక్షన్ప్లాన్కు ప్రస్తుత సర్కారు సిద్ధమైంది. మున్సిపల్ పాలన మరింత సమర్థంగా ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్లనుంది. కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) వరకు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు రోజువారీ ప్రణాళికలు రూపొందించాల్సిందిగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లకు సూచించారు. ఈమేరకు మెమో జారీ చేశారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రజలకు సదుపాయాలు మెరుగుపరచాలనే తలంపుతో ప్రభుత్వం ఇందుకు సిద్ధమైంది. ముగ్గురు కమిషనర్ల నుంచి అందిన ప్రణాళికలతో ప్రభుత్వం యాక్షన్ప్లాన్ ఖరారు చేయనుంది. ఈ నెల 23 నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పారిశుద్ధ్యానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అత్యంత ప్రాధాన్యమివ్వడంతో యాక్షన్ ప్లాన్లో ఈ అంశానికి ప్రాముఖ్యత ఇవ్వనున్నారు. దీంతో పాటు దోమల నివారణ, రోడ్లు, మౌలిక వసతులకు ప్రాధాన్యమివ్వనున్నట్లు సమాచారం. గతంలో ఇలా.. గతంలో కాంగ్రెస్ హయాంలో కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రెండు దఫాలు 100 డేస్ యాక్షన్ప్లాన్లో భాగంగా రూ. 500 కోట్ల మేర పనులు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2015, 2016, 2023లలోనూ 100 డేస్ యాక్షన్ప్లాన్ అమలు చేశారు. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎస్ రామకృష్ణారావుప్రస్తుతం కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు కావడంతో వికేంద్రీకరణతో ప్రజలకు సదుపాయాలు మెరుగుపడతాయని చెప్పాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అందుకు 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఉపకరించగలదని భావిస్తోంది. ఇది నాణేనికి ఓవైపు కాగా, వేసవి ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో సైతం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా మున్సిపోల్స్ విజయంతో అదే ఊపుతో మూడు కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించాలనే తలంపుతో ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆలోగా ప్రజలకు కొత్త కార్పొరేషన్లలో పాలన కనిపించాలంటే సరైన యాక్షన్ ప్లాన్ అవసరమని, దీన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో 2016 జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్ పేరిట మరో కార్యక్రమాన్ని నిర్వహించింది. మంత్రులు ప్యాట్రన్లుగా, గవర్నర్ ఐఏఎస్, ఐపీస్ అధికారులు, ఆయా ప్రభుత్వ విభాగాల హెచ్ఓడీలు మెంటార్లుగా నగరాన్ని 425 లొకేషన్లుగా విభజించి కొన్ని రోజులపాటు నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, గవర్నర్ నరసింహన్లు సైతం స్వచ్ఛ హైదరాబాద్లో పాల్గొన్నారు. ప్రజల్నీ భాగస్వాములను చేశారు. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు నగర పరిశుభ్రతపై ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎస్కు వివరించారు. చెత్త సేకరణ విధానం, పరిశుభ్రతా చర్యలు, ప్రజా ఆరోగ్య పరిరక్షణపై తీసుకుంటున్న చర్యలను సీఎస్ సమగ్రంగా పరిశీలించారు. మున్సిపల్ విభాగం ప్రభుత్వంలో కీలకమని, ప్రజల అవసరాలకు తగినట్లుగా బాధ్యతలు నిర్వర్తించాలని, అధికారులు విధులలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. చెత్త సేకరణ (డ్రై, వెట్ వేస్ట్), ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్య పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలో 4500 స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్నాయని, 18 వేల 557 మంది శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నారని తెలిపారు. నగర పరిధిలో రోజుకు 7,800 టన్నుల మేరకు గార్బేజ్ సేకరణ చేస్తున్నామన్నారు. -
బుద్ధం శరణం గచ్ఛామి!
ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ థాయ్లాండ్తో పాటు భారత్కు చెందిన బౌద్ధ భిక్షువులు చేపట్టిన చరిత్రాత్మక మూడో దమ్మ పాదయాత్ర బుధవారం నగరంలోని ఐమ్యాక్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు చేరుకుంది. బుద్ధుడు బోధించిన శాంతి, కరుణ సందేశాలను చాటిచెప్పే లక్ష్యంతో సాగుతున్న ఈ పాదయాత్ర కర్ణాటకలోని సిద్ధార్థ బుద్ధ విహార్ నుంచి ప్రారంభమైంది. మార్చి 1న నాగార్జున సాగర్లోని బుద్ధ వనాన్ని చేరుకుంటుంది. ఈ సందర్భంగా బౌద్ధ భిక్షువులు అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం హుస్సేన్ సాగర్లోని బుద్ధుడి విగ్రహాన్ని సందర్శించారు. -
విద్యుత్ డిమాండ్ ౖపైపెకి..
● ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వినియోగంలోకి.. ● ఒత్తిడి తట్టుకోలేక తరచూ ట్రిప్పవుతున్న ఫీడర్లు పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలతో ఉక్కపోతసాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు చలితో వణికిపోయిన నగరవాసులు.. ప్రస్తుతం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరికి లోనవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోతతో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను మళ్లీ వినియోగంలోకి తీసుకొస్తున్నారు. ఫలితంగా విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగి.. ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఒత్తిడితో ట్రిప్పవుతున్నాయి. అనధికారిక ‘కోత’లకు కారణమవుతున్నాయి. ఉదయం ఇంట్లోని కరెంట్ మోటార్లు, వాటర్ గీజర్లు, మిక్సీలు, ఎలక్ట్రిక్ స్టవ్లన్నీ ఒకే సమయంలో పని చేస్తుండటమే ఇందుకు కారణం. ఈసారి 5 వేల మెగావాట్లు దాటుతుందా..? గత ఏడాది ఫిబ్రవరిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 3,512 మెగావాట్ల వినియోగం (72 మిలియన్ యూనిట్లు) నమోదు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 6న 3509 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డు అయింది. 2025 ఏప్రిల్ 24న రికార్డు స్థాయిలో 4,190 మెగావాట్లు (89.54 మిలియన్ యూనిట్లు) నమోదు కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 5000 మెగావాట్లకు చేరుకోనున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి మించి లోడును ఎదుర్కొంటున్న 11కేవీ, 33 కేవీ ఫీడర్లపై ప్రత్యేక దృష్టిసారించారు. రంగారెడ్డి జోన్లో 965 అదనపు డీటీఆర్లు, మేడ్చల్ జోన్లో 626 డీటీఆర్లు, మెట్రో జోన్లో 297 డీటీఆర్లను ఏర్పాటు చేస్తున్నారు. -
గాయం నుంచి జాతీయ వేదికకు
సనత్నగర్: మోకాలి గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన కబడ్డీ జాతీయ క్రీడాకారిణి రమావత్ నందినిని బేగంపేట కిమ్స్ సన్ షైన్ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కుషాల్, డాక్టర్ ఆదర్శ్ అన్నపరెడ్డి తదితరుల నేతృత్వంలో బుధవారం సన్మానించారు. ఆటగాళ్లకు గాయాలైతే కెరీర్ ఆగిపోకుండా, సరైన వైద్యం అందించి ముందడుగు వేసేలా సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ల బృందం కృషి చేస్తోందని ఈ సందర్భంగా డాక్టర్ ఏవీ గురువారెడ్డి తెలిపారు. 2022లో నందిని కుడి మోకాలిలో ఏసీఎల్ లిగ్మెంట్కు గాయమైంది. దీంతో కిమ్స్ సైన్షైన్ షోల్డర్ అండ్ స్పోర్ట్స్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ను సంప్రదించారు. ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్స తర్వాత కొన్ని నెలల్లోనే ఆమె మైదానంలోకి దిగగా 2024లో మళ్లీ గాయమైంది. ఈసారి మెనిస్కస్ దెబ్బతింది. డాక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలో డాక్టర్ల బృందం సర్జరీ, రిహాబిలిటేషన్ అందించడంతో మూడు నెలల్లోనే కోలుకుంది. 72వ సీనియర్ నేషనల్ ఉమెన్స్ కబడ్డీ చాంపియన్షిప్కు ఎంపికై ందని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. దీంతో డాక్టర్ ఏవీ గురువారెడ్డి నేతృత్వంలో నందినిని సత్కరించారు. క్రీడాకారులకు గాయాలకు సరైన నిపుణుల పర్యవేక్షణలో వైద్యం అందిస్తే కేరీర్కు ఇబ్బంది ఉండదని తెలుసుకోవాలన్నారు. భారత కబడ్డీ మాజీ క్రీడాకారుడు డీఎస్పీ వేణుగోపాల్, తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్రెడ్డి, సీఎస్ఎస్హెచ్ క్లినికల్ హెడ్ డాక్టర్ సుమన్ తడగొండ, హైదరాబాద్ క్రికెట్ అకాడమీ, రంజీ టీం సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ రాజేష్, సెంటర్ ఫర్ స్పైన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్ ఫౌండర్ సీఈవో, పుల్లెల గోపీచంద్ అకాడమీ నరేష్కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో అనుభవాలను పంచుకున్నారు. ● ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్సతో పునరాగమనం ● కబడ్డీ స్టార్ నందినిని సన్మానించిన కిమ్స్ సన్షైన్ -
బదిలీలలెన్నో
● ఒకేసారి సుమారు 96 మందికి స్థానచలనం ● అవినీతి ఆరోపణలున్నవారికి ప్రాధాన్యతా పోస్టింగ్లు ● అధికారుల తీరుపై విమర్శలు నగర విద్యాశాఖలో భారీ ప్రక్షాళనసాక్షి, సిటీబ్యూరో: నగర విద్యాశాఖలో భారీగా బదిలీలు జరిగాయి. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల నుంచి జూనియర్ అసిస్టెంట్ల వరకు స్థాన చలనం కలిగింది. విద్యాశాఖలో ఒకేసారి సుమారు 96 మందిని బదిలీ చేయడం కలకలం సృష్టించింది. మొత్తమ్మీద 12 మంది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు (డిప్యూటీ ఈవో), 24 మంది డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (డిప్యూటీ ఐవోఎస్)లు, 60 జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయ సంఘాల విమర్శలు.. విద్యాశాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు బదిలీల ద్వారా ప్రాధాన్యతా పోస్టింగ్లు, ఎలాంటి మచ్చలేకుండా ఏడాదిలోపు బాధ్యతలు చేపట్టిన వారికి ప్రాధాన్యం లేని ప్రాంతాలకు బదిలీలు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. జిల్లా విద్యాశాఖలో చోటుచేసుకున్న అవినీతి ఆరోపణలపై నేపథ్యంలోనే బదిలీలు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంటూనే ఆరోపణలున్న అధికారులకు ప్రాధాన్యతగల మండలాల్లో పోస్టింగ్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. కోరుకున్న ప్రాంతానికి పోస్టింగ్లు ప్రక్షాళన పేరుతో జరిగిన బదిలీల ప్రక్రియలోనూ ఆమ్యామ్యాలు కొనసాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లు అధికంగా ఉన్న మండలాలు, కార్యాలయాలోని కీలక సెక్షన్లలో పోస్టింగ్లకు భారీగానే ‘డిమాండ్’ పలికినట్లు తెలుస్తోంది. డిప్యూటీ ఈవో స్థాయి పోస్టుల నుంచి కీలక ఫైళ్లు చూసే అసిస్టెంట్ల వరకు అనుకూలమైన చోట పోస్టింగ్లకు కొందరి పైరవీలు ఫలించినట్లు సమాచారం. మచ్చుకు కొన్ని ఘటనలు.. ఇటీవల బండ్లగూడ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఒకరు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఈ ఘటనలో కేవలం ఒక అసిస్టెంట్తో పాటు పైస్థాయి అధికారుల ప్రమేయం కూడా ఉందనే అనుమానంతో విచారణ కొనసాగుతోంది. ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు పునరుద్ధరణ, అగ్నిమాపక భద్రత, భవన సామర్థ్యం వంటి నిబంధనల్లో లోపాలున్నా, వాటిని సరిదిద్దకుండా ’మామూళ్ల’తో ఫైళ్లు క్లియర్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రిటైర్ అయిన ఉపాధ్యాయుల పెన్షన్ ఫైళ్ల క్లియర్, సర్వీస్ రిజిస్టర్లలో ఎంట్రీలు చేయడానికి కొందరు అసిస్టెంట్లు వేలల్లో డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. డబ్బులు ఇవ్వని వారి ఫైళ్లను నెలల తరబడి పక్కన పెట్టడం ద్వారా వారిని వేధిస్తున్న ఉదంతాలు గతంలో అనేకం వెలుగులోకి వచ్చాయి. -
నుమాయిష్ ఓ బ్రాండ్
అబిడ్స్: నగరంలో నిర్వహించే నుమాయిష్ ఓ బ్రాండ్ అని, చార్మినార్, గోల్కొండ, హైదరాబాద్ బిర్యానీ మాదిరిగానే ప్రపంచ వ్యాప్తంగా నాంపల్లి ఎగ్జిబిషన్కు ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర టూరిజం, ఎకై ్సజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు వారి ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఎగ్జిబిషన్ ఒక నిలయంగా మారిందన్నారు. గురువారం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. హైదరాబాద్ సిటీ కాస్మో పాలిటన్ సిటీగా మారిందన్నారు. భారతదేశంలోని అన్ని భాషల ప్రజలు కలిసి మెలిసి ఉండి వ్యాపారాలు, పారిశ్రామిక ప్రదర్శనలు చేసేందుకు ఎగ్జిబిషన్ ఎంతో దోహద పడుతుందన్నారు. నుమాయిష్ను 20 లక్షల మంది సందర్శించడం గొప్ప విషయమని, ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నుమాయిష్లో సాంస్కృతిక, పర్యాటకాన్ని కూడా ప్రమోట్ చేయాలని సూచించారు. ● నుమాయిష్ నుంచి వచ్చే దాదాపు రూ.30 కోట్ల ఆదాయాన్ని విద్యావ్యాప్తి కోసం వెచ్చి స్తుండటం అభినందనీయమన్నారు. అనంతరం ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సుఖేష్రెడ్డి స్వాగతోపన్యాసం చేయగా కార్యదర్శి బీఎన్ రాజేశ్వర్ నివేదిక సమర్పించారు. బహు మతుల ప్రధానోత్సవ సబ్ కమిటీ సలహాదారుడు హరినాథ్రెడ్డి వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి డాక్టర్ సంజీవ్కుమార్, కన్వీనర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతో పాటు పలు శాఖల అధికారులు, స్టాల్ హోల్డర్లకు మంత్రి బహుమతులు అందజేశారు. -
కార్మిక దళం.. ఉద్యమ గళం
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం నగరంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు తదితర ప్రాంతాల్లో ఆటోసేవలు స్తంభించాయి. మరోవైపు వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపం నుంచి ఇందిరాపార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయంటూ నినాదాలు చేశారు. ఆటో మీటర్ చార్జీలను పెంచాలని, రవాణాశాఖ కొత్తగా ప్రవేశపెట్టిన సారథి పోర్టల్ను రద్దు చేయాలని ఆటో సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆటో, ట్రాన్స్పోర్ట్ సంఘాల జేఏసీ నాయకులు బి.వెంకటేశం, ఎ. సత్తిరెడ్డి, లారీ సంఘం నాయకులు రాజేందర్ రెడ్డి, భిక్షపతి యాదవ్, సీహెచ్ జంగయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. – సాక్షి, సిటీబ్యూరో -
‘మొండికుంట’కు హైడ్రా ఫెన్సింగ్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) గురువారం మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలో భారీ ఆపరేషన్ చేపట్టింది. మొండికుంట చెరువులో అక్రమంగా వెలిసిన వందలాది తాత్కాలిక షెడ్లు, పదుల సంఖ్యలో ఉన్న దుకాణాల ను తొలగించింది. ఈ చెరువుతో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమణలు తొలగించిన అధికారులు మొత్తం 11 ఎకరాలకు కంచె వేశారు. దీని మార్కెట్ విలువ రూ.2200 కోట్ల వరకు ఉంటుందని అధికారులు ప్రకటించారు. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నం.53లో ఉన్న మొండికుంటతో పాటు సర్వే నం.55లోని ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించారు. దీనిపై స్థానికులు ప్రజావాణి ద్వారా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. ఫలితంగా దాదాపు 11 ఎకరాలు కబ్జాకు గురైనట్టు తేలింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆలయాన్ని హద్దుగా చూపించిన కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడినట్టు అధికారులు నిర్ధారించారు. ఆలయం హద్దుగా పలు షాపులు, మెకానిక్ షెడ్లు, ఐరన్ అండ్ స్టీల్ షాపు ఇలా పలు రకాల దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇలా 30కి పైగా ఉన్న షాపుల ద్వారా కబ్జా చేసిన వాళ్లు నెలకు రూ.లక్షల్లో అద్దెలు వసూలు చేస్తున్నారు. మొండికుంటతో పాటు అక్కడ ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలపై గత నెల 31న హైడ్రా విచారణ చేపట్టింది. రెవెన్యూ అధికారులతో పాటు కబ్జాలకు పాల్పడిన వారు కూడా ఈ సమవేశంలో పాల్గొన్నారు. వారి సమక్షంలోనే ఆక్రమణలు జరిగినట్టు రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ చిత్రాలను పరిశీలించిగా ఇదే నిర్థారణ అయింది. ఇదే విషయాన్ని అధికారులు కబ్జాదారులకు తెలిపారు. వారికి కొంత సమయమిచ్చిన హైడ్రా గురువారం ఆక్రమణలను తొలగించే పనిని చేపట్టింది. వందల సంఖ్యలో ఉన్న తాత్కాలిక షెడ్లను భారీ బందోబస్తు మధ్య హైడ్రా తొలగించింది. మొత్తం 11 ఎకరాల్లో ఉన్న నిర్మాణాల తొలగింపు దీని మార్కెట్ విలువ దాదాపు రూ.2200 కోట్లు మాదాపూర్ హైటెక్స్ సమీపంలో భారీ ఆపరేషన్ -
సమాజంలో బాధ్యతగా మెలగాలి
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్ మణికొండ: సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలిగాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ అన్నారు. గురువారం సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ ఆ విర్భావ దినోత్సవం సందర్భంగా నార్సింగి సైకిల్ట్రాక్ వద్ద యువతకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించటంతో పాటు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసు శాఖ అనేక భద్రతా చర్యలు, సామాజిక బాధ్యతలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా గాయకులు పాడిన పలు పాటలకు యువకులతో పాటు కమీషనర్ సైతం స్టెప్పులేశారు. అనంతరం యువకులతోతో కలిసి సైక్లింగ్ చేశారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్ శ్రీనివాస్, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, సీఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సాయి మనోహర్, ఏడీసీపీలు, ఏసీపీలు, పోలీసు సిబ్బంది, యువకులు పాల్గొన్నారు. -
యూట్యూబ్లో చూసి..చోరీ చేసి..!
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్లో ఉన్న నందగిరిహిల్స్లో నివసించే ప్రముఖ వ్యాపారి రవీంద్రశర్మ ఇంట్లో ఈ నెల 5న భారీ చోరీ చేసిన నేపాలీ గ్యాంగ్ విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆద్యంతం పక్కా పథకం ప్రకారం వ్యవహరించిన ఈ ముఠా రవీంద్ర ఇంట్లో ఉన్న లాకర్ ఎలా పగులకొట్టాలనే అంశాన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసింది. అందులో పేర్కొన్నట్లే రాడ్లు వినియోగించి పగులకొట్టడంతో పాటు అందులో ఉన్న రూ.1.2 కోట్ల సొత్తు, సొమ్ము ఎత్తుకుపోయింది. ఈ గ్యాంగ్లోని నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. కీలకంగా వ్యవహరించిన భార్యభర్తలు.. నేపాల్కు చెందిన జీవన్ చాంద్, తన భార్య బీమ్లాతో కలిసి కొన్నేళ్లుగా నగరంలో నివసిస్తున్నాడు. గతంలో పని మనిషిగా చేరి ఆ ఇంట్లోనే చోరీలు చేసిన చరిత్ర ఇతడికి ఉంది. నేపాల్కు చెందిన భూపేందర్ సాహి అలియాస్ భువన్ను నగరానికి పిలిపించే జీవన్... కోకాపేటకు చెందిన మదన్ ఖత్రి ద్వారా రవీంద్ర శర్మ ఇంట్లో గత నెల 18న పని మనిషిగా చేరుస్తాడు. నేపాల్ నుంచి వచ్చి నవీ ముంబైలో నివసిస్తున్న లలిత్ బహదూర్ వద్ద ఉంటున్న నేపాలీలు కృష్ణ కాంత్, కమల్ చాంద్లతో భువన్కు పరిచయం ఉంటుంది. జీవన్, బీమ్లా సూచనల మేరకు రవీంద్ర శర్మ ఇంటిని రెక్కీ చేసిన భువన్ చోరీ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయాన్ని కృష్ణ, కమల్లకు చెప్పి ఇంటితో పాటు పరిసరాలను వీడియో తీసి షేర్ చేస్తాడు. ఈ వీడియోలో వారింట్లో ఉన్న లాకర్ను చిత్రీకరిస్తాడు. లక్డీకపూల్లోని లాడ్జిలో మకాం.. రవీంద్ర శర్మ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్న భువన్ ఈ నెల 3న కృష్ణ, కమల్లను నగరానికి రప్పించాడు. లక్డీకపూల్లోని ఓ లాడ్జిలో బస చేసిన ఈ ద్వయం విషయాన్ని జీవన్కు చెప్పింది. తనపై అనుమానం రాకుండా ఆ వెంటనే అతగాడు నేపాల్ వెళ్లిపోయాడు. అక్కడకు వచ్చాక సొత్తు పంచుకుందామని వీరికి చెప్పాడు. ఈ నెల 5 రాత్రి రవీంద్రశర్మ కుటుంబం ఫంక్షన్కు వెళ్లడంతో అదే రోజు నేరం చేయాలని నిర్ణయించుకుంటారు. భువన్ నుంచి సమాచారం అందుకున్న కృష్ణ, కమల్ వేర్వేరుగా బయలుదేరి నందగిరిహిల్స్కు చేరుకుని భువన్ను కలుస్తారు. రెండు క్యాబ్లు మారి అక్కడకు వస్తారు. మార్గమధ్యంలో రవీంద్ర ఇంట్లో ఉన్న లాకర్ లాంటి వాటిని ఎలా పగులకొట్టాలో యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు. చికెన్లో సాధ్యం కాక జ్యూస్లో.. ఆ సమయంలో రవీంద్ర ఇంట్లో ఉన్న వాచ్మెన్తో పాటు అతడి భార్యకు మత్తుమందు ఇవ్వాలని ఈ త్రయం పథకం వేస్తుంది. కొన్ని మత్తు మాత్రలు సంగ్రహించిన వీళ్లు తొలుత చికెన్లో కలిపి ఇవ్వాలని భావిస్తారు. దీనికోసం ఆ సమీపంలోని ఓ దుకాణాకి వెళ్లే ముగ్గురూ చికెన్ కొంటారు. దుకాణదారుడికి చెల్లించడానికి తమ వద్ద సొమ్ము లేకపోవడంతో దుకాణంలో స్కానర్ను ఫొటో తీసే భువన్ దాన్ని లలిత్కు పంపగా అతడు చెల్లిస్తాడు. చివరకు జ్యూస్లో కలిపిన మత్తు మందు ఇస్తారు. నేరం చేసిన తర్వాత భువన్ ఒకవైపు, మిగిలిన ఇద్దరూ మరో వైపు పారిపోయి నవీ ముంబై చేరతారు. దీనిపై సమాచారం అందుకున్న బీమ్లా సైతం నేపాల్ పారిపోతుంది. ఇలా పారిపోయే ప్రయత్నాల్లో నందగిరిహిల్స్లోనే భువన్ ఫోన్ పడిపోయింది. ఇటీవల జూబ్లీహిల్స్లోనేరం చేసిన గ్యాంగ్ స్కానర్ ఇచ్చిన క్లూ ఆధారంగా కేసు కొలిక్కి పోలీసుల దర్యాప్తులోవెలుగులోకి కీలకాంశాలు ఈ ఫోన్ స్వాధీనం చేసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు అందులో ఉన్న స్కానర్ ఫొటో ఆధారంగా లలిత్ ఆచూకీ కనిపెడతారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కథ మొత్తం బయటకు వస్తుంది. దీంతో నేపాల్ సరిహద్దుల్లో కాపుకాసిన నగర అధికారులు ఎస్ఎస్బీ సహకారంతో నిందితులను పట్టుకుంటుంది. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న జీవన్, బీమ్లా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వీళ్లు ప్రస్తుతం నేపాల్లో ఉండటంతో ఇక్కడకు రప్పించే మార్గాలను అన్వేషిస్తున్నారు. లలిత్ను పట్టుకోగా గుట్టురట్టు... -
బ్రహ్మోత్సవం.. భక్తగణం
నేటి నుంచి కీసరగుట్టలో ఉత్సవాలు ప్రఖ్యాత శైవక్షేత్రం కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 వరకు ఆరు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల జాతరకు సుమారు ఐదారు లక్షల మంది యాత్రికులు వస్తారని అంచనా. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు ఆలయ చైర్మన్ తటాకం వెంకటేష్ తెలిపారు. ఇప్పటికే 50 వేల లడ్డూ ప్రసాదాలను సిద్ధంగా ఉంచామని ఆయన పేర్కొన్నారు. – కీసర -
పంపకాలు అప్పుడే తిప్పలు
జీహెచ్ఎంసీ నుంచి సీఎంసీ, ఎంఎంసీకి నిధులుసాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నుంచి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లకు రూ.500 కోట్లు వాటి ఖాతాలకు జమ చేయనున్నారు. ఉమ్మడి జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగిశాక మూడు కార్పొరేషన్ల ఏర్పాటు అనంతరం గురువారం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు కార్పొరేషన్లకూ స్పెషలాఫీసరైన జయేశ్రంజన్ వరుసగా సీఎంసీ, ఎంఎంసీ, జీహెచ్ఎంసీ అధికారులతో స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో రూ.500 కోట్ల వంతున రెండు కార్పొరేషన్లకు ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా అవసరమైన పనులు, ఇతరత్రా నిర్మాణ పనులు చేసేందుకు ఈ నిర్ణయించారు. పంపిణీకి టాస్క్ఫోర్స్ కమిటీ అప్పులు, ఆస్తులు, సిబ్బంది పంపిణీకి సంబంధించి సీజీజీ నేతృత్వంలో టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు స్పెషల్ ఆఫీసర్ జయేశ్ రంజన్ తెలిపారు. స్టాండింగ్ కమిటీ సమావేశానంతరం ఆయన మాట్లాడుతూ.. అనుభజ్ఞులైన టాస్క్ఫోర్స్ కమిటీ సిఫార్సులకనుగుణంగా అప్పులు, ఆస్తుల పంపినీకి తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. టాస్క్ఫోర్స్ కమిటీ అధ్యయనానికి దాదాపు పది రోజుల సమయం పడుతుందన్నారు. ప్రజల అవసరాలకనుగుణంగా కార్యాచరణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఆమోదించిన అంశాలు రెండు కార్పొరేషన్లకు రూ. 500 కోట్ల వంతున కేటాయింపుతో పాటు కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పునర్వ్యవస్థీకరణ, సైబరాబాద్, మల్కాజిగిరి, గ్రేటర్ హైదరాబాద్గా మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు, శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగింపు, ప్రతి కార్పొరేషన్కు ప్రత్యేక కార్పొరేట్ హోదా, చట్టబద్ధ హక్కులు, సైబరాబాద్, మల్కాజిగిరి, కార్పొరేషన్లకు సిబ్బంది కేటాయింపు. ఆకాంక్షలకనుగుణంగా.. టీ క్యూర్లోని మూడు కార్పొరేషన్లు ప్రజల ఆకాంక్షల కనుగుణంగా పనిచేయాలని స్టాండింగ్ కమిటీ సమావేశంలో అధికారులను జయేశ్ రంజన్ ఆదేశించారు. ఆరు నెలల్లో సర్కిల్, వార్డు స్థాయిలో స్పష్టమైన మార్పులు కనిపించాలన్నారు. కార్పొరేషన్ల మధ్య పోటీ నిర్వహించనున్నట్లు తెలిపారు. బల్దియాపై మొత్తం రూ.4,877 కోట్ల రుణభారం సాక్షి, సిటీబ్యూరో: కొత్త కార్పొరేషన్లు అవతరించి కుదురుకోక ముందే నెత్తిన భారం పడనుంది. ఇప్పటివరకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు ఉన్న రూ.4,877 కోట్ల అప్పులను పరిధుల వారీగా పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నగర శివార్లలోని 27 పట్టణ, స్థానిక సంస్థలను జీహెచ్ంఎసీలో విలీనం చేసిన తర్వాత హైదరాబాద్ మహానగరాన్ని జీహెచ్ఎంసీ, సైబరాబాద్ నగరపాలక సంస్థ (సీఎంసీ), మల్కాజిగిరి నగరపాలక సంస్థ (ఎంఎంసీ) మూడు కార్పొరేషన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం మహానగర పరిధి 2,054 చదరపు కిలోమీటర్లు (చ.కి.మీ.), 300 వార్డులకు విస్తరించింది. దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించింది. మౌలికం కోసం రుణాలు.. గ్రేటర్లో రహదారులు, ఫ్లైఓవర్లు, అండర్పాస్లు వంటి మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, నీటి కాలువల ప్రాజెక్ట్లు తదితర అభివృద్ధి పనుల కోసం నిధుల అవసరమయ్యాయి. వ్యూహాత్మక రహదారి అభివద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ), సమగ్ర రోడ్డు నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ), నీటి కాలువ ప్రాజెక్టులు ఇతర పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఎక్కువగా రుణాలను సమీకరించింది. ఇందుకోసం మున్సిపల్ బాండ్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీఐ), హడ్కో వంటి వివిధ మార్గాల ద్వారా రూ.4,877 కోట్ల రుణాలను తీసుకుంది. తాజాగా గ్రేటర్ మూడు నగరపాలక సంస్థలుగా విభజన జరగడంతో ఈ రుణ మొత్తాన్ని ఎవరు భరిస్తారనే ప్రశ్న తలెత్తింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా అభివృద్ధి పనులు జరిగిన ప్రాంతాన్ని బట్టి రుణ విభజన, చెల్లింపుల బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించింది. అప్పులతో పాటు ఆయా కార్పొరేషన్ల పరిధిలోని ఆస్తులను కూడా సంబంధిత బల్దియాకే అప్పగించేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. సమావేశంలో కర్ణన్, జయేశ్రంజన్ అప్పులు, ఆస్తుల పంపిణీకి టాస్క్ఫోర్స్ కమిటీ స్పెషల్ ఆఫీసర్ జయేశ్రంజన్ స్పష్టీకరణ మూడు కార్పొరేషన్ల స్టాండింగ్ కమిటీ సమావేశాలు మూడు కార్పొరేషన్ల మధ్య అప్పుల విభజన అభివృద్ధి పనుల ప్రాంతాన్ని బట్టి పంపకాలు విధాన ప్రక్రియను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం శానిటేషన్, వెటర్నరీ విభాగాల్లో ఉద్యోగుల కొరత -
ఆదాయంహైరైజ్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నుంచే బహుళ అంతస్తుల భవనాలు, లే అవుట్లు, నిర్మాణ రంగ అనుమతులు లభించనుండటంతో.. కొత్తగా అవతరించిన మున్సిపల్ కార్పొరేషన్లు, హెచ్ఎండీఏ మధ్య డెలిగేషన్ ఆఫ్ వపర్స్ (అధికారాల బదిలీ)లో స్పష్టత వచ్చినట్లయింది. ఓటర్ వరకు విస్తరిత మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పది అంతస్తుల భవనాల వరకు మున్సిపల్ కార్పొరేషన్ల నుంచే అనుమతులను అందజేస్తారు. పదకొండో అంతస్తు నుంచి నిర్మించే వాటికి హెచ్ఎండీఏ నుంచి అనుమతులను పొందాల్సి ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ట్రిబుల్ ఆర్ వరకు లే అవుట్ అనుమతులను కూడా హెచ్ఎండీఏ నుంచే అందజేస్తారు. ప్రస్తుతం రీజినల్ రింగ్ రోడ్డు వరకు రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లు తదితర ప్రాజెక్టులను హెచ్ఎండీఏ చేపట్టింది. ఆ రెండింటితో ఏటా రూ.1200 కోట్లు.. హెచ్ఎండీఏ ప్రణాళికా విభాగం ఇచ్చే నిర్మాణ అనుమతులు, లే అవుట్ల ద్వారానే ఏటా రూ.1200 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. భూములు, సొంత లే అవుట్ల విక్రయంతో వచ్చే రాబడీ కీలకమే. ఈ రెండు ఆదాయ మార్గాలను దృష్టిలో ఉంచుకొనే నగరంలో ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లైఓవర్లు, గ్రీన్ఫీల్డ్ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఈ ఆదాయ మార్గాలనే బ్యాంకు రుణాలను చెల్లించేందుకు గ్యారంటీలుగా చూపుతూ రూ.30 వేల కోట్ల రుణాల సేకరణకు చర్యలు చేపట్టింది. కొత్త ప్రాజెక్టులు ఇవే.. బుద్వేల్ ఇంటర్చేంజ్ ట్రంపెట్ రోడ్డుకు రూ.488 కోట్లతో ప్రణాళికలకు రూపకల్పన. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని ఐసీసీసీ నుంచి శిల్పా లేఅవుట్ వరకు రూ.1656 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్. శంకర్పల్లి రోడ్లోని ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు 3.57 కి.మీ పొడవున పైపులైన్ రోడ్డు అభివృద్ధికి రూ.110 కోట్లు. నానక్రామ్గూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్ఆర్కు ఎడమవైపున రహదారి విస్తరణ చేపట్టనున్నారు. 75 మీటర్ల రైట్ ఆఫ్ వేత్ (ఆర్ఓడబ్ల్యూ)తో రూ.26.50 కోట్లతో చేపట్టనున్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు రూ.1,650 కోట్లతో చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులు కొనసాగుతున్నాయి. జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు రూ.2,500 కోట్లతో చేపట్టనున్న స్టీల్ బ్రిడ్జి ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులతో భారీ నిధులు అధికారాల బదిలీతో మరింత బలోపేతం బాండ్ల రూపంలో రూ.30 వేల కోట్ల సేకరణ నగరాభివృద్ధిలో హెచ్ఎండీఏది కీలకం -
ఆస్తిపన్నులోనే చెత్త చార్జీలు
సాక్షి, సిటీబ్యూరో: పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. మూడు కార్పొరేషన్ల విభజనతో పాటే పారిశుద్ధ్యం మెరుగయ్యేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. స్వచ్ఛ ఆటోల పనితీరు సవ్యంగా ఉండేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించింది. చెత్త నిర్వహణ పేరిట పేదలపై భారం ఉండకుండానూ శ్రద్ధ తీసుకుంది. మురికివాడల్లో 500 చదరపు అడుగుల విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణంతో ఉన్న నివాస గృహాల నుంచి ఎలాంటి చార్జీ తీసుకోరాదని నిర్ణయించింది. చెత్త సేకరణ చార్జీలను ఆస్తిపన్నులో కలపాలని భావిస్తోంది. మార్గదర్శకాలిలా.. ● వార్డులోని అన్ని ప్రాంతాల్లో వందశాతం ఇళ్ల నుంచి చెత్త సేకరణ జరగాలి. నిర్ణీత సమయాలు పాటించాలి. చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ల వద్ద వ్యర్థాలు తూకం వేయాలి. ● అన్ని చెత్తసేకరణ ఆటోలకూ జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ అమలు చేయాలి. ● కొత్తగా వినియోగించే వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఉండాలి. పాత వాటిని రీట్రోఫిట్ చేయాలి. ● గార్బేజ్ వల్నరబుల్ ప్రాంతాలు (జీవీపీ), హాట్స్పాట్లలో ఏడాది వరకు డంపర్బిన్లు ఉంచాలి. ఈ ప్రాంతాల్లో చెత్త తరలింపు పనులు నగరంలో చెత్త నిర్వహణ పనులు చేస్తున్న రాంకీ సంస్థ చేయాలి. సదరు ప్రాంతాల్లో చెత్త వేయకుండా ఉండేందుకు సెల్ఫ్హెల్ప్ గ్రూపుల మహిళ ద్వారా అవగాహన కల్పించాలి. అందుకు వారికి తగిన ప్రోత్సాహకాలివ్వాలి. ఇళ్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో హోమ్ కంపోస్టింగ్ ప్రోత్సహించాలి. ఇళ్లలోనే తడి–పొడి వేరు చేసేందుకూ ప్రోత్సాహకాలివ్వాలి. ● కొత్త విలీన ప్రాంతాల్లో , చెత్త సేకరణ సవ్యంగా జరగని ప్రాంతాల్లో రాంకీ ద్వారా వాహనాలు సమకూర్చాలి. ● బల్క్ వేస్ట్ తరలింపు రాంకీ ద్వారా జరగాలి. ● పారిశుద్ధ్యం మెరుగయ్యేందుకు బాగా పనిచేసే స్వచ్ఛ ఆటో కార్మికులకు ప్రోత్సాహకాలు. పనిచేయని వారికి పెనాల్టీల విధింపు. ● వీటితోపాటు నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల తరలింపునకు మార్గదర్శకాలు సూచించింది. వీటి అమలు కోసం రెండు వారాల్లో తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పెషలాఫీసర్ జయేశ్రంజన్ సూచించారు. పేదలకు మినహాయింపు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కొత్త మార్గదర్శకాలు జారీ -
72 ఏళ్ల వృద్ధురాలికి..అరుదైన శస్త్రచికిత్స
రాంగోపాల్పేట్: మిట్రల్ వాల్వ్ లీకేజీ సమస్యతో బాధపడుతున్న ఓ 72 ఏళ్ల వృద్ధురాలికి అరుదైన మినిమల్ ఇన్వేసిస్ చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు సికింద్రాబాద్ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు. బుధవారం ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రమోద్కుమార్ ఈ వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలు శ్వాస, అలసట సమస్యలతో బాధపడుతుంది. పరిస్థితి విషమించి గుండె వైఫల్యంతో మెడికవర్ ఆస్పత్రికి వచ్చారు. మిట్రల్ వాల్వ్లో తీవ్రమైన లీకేజ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో విదేశాల్లోనే చేసే మినిమల్ ఇన్వేసిస్ చికిత్స చేయాలని నిర్ణయించి విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం వృద్ధురాలు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ భుయార్, డాక్టర్ ఎన్ శివప్రసాద్ నాయుడు, అమరేందర్ కుమార్ సింగ్, డాక్టర్ వరుణ్ గౌతమ్, డాక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
ఓటెత్తిన పట్టణం
రంగారెడ్డిలో 78.99 శాతం, మేడ్చల్లో 83.99 శాతం పోలింగ్ సాక్షి, సిటీబ్యూరో: నగర శివారులోని 9 మున్సిపాలిటీల్లో 194 వార్డులకు జరిగిన ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ స్వల్ప సంఘటనలు మినహాయించి ఎలాంటి వివాదాలు తలెత్తలేదు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలోని ఐదో వార్డులో ఒక పార్టీ అభ్యర్థి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వెండి నాణేలు పంపిణీ చేయగా, అవి నకిలీ అని తేలటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. రావల్కోల్లో ఓ పార్టీ అభ్యర్థికి సంబంధించిన బంధువు అల్లరితో తలెత్తిన వివాదం పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో స్వల్ప ఉద్రిక్త సంఘటనలు మినహా ఎలాంటి వివాదాలు తలెత్తలేదు. మేడ్చల్–మల్కాజిగిరిలో 83.99, రంగారెడ్డి జిల్లాలో 78.99 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని ఎన్నికల అధికారులతోపాటు ఆయా జిల్లాల కలెక్టర్లు మనుచౌదరి, నారాయణరెడ్డి పర్యవేక్షించారు. బ్యాలెట్ బాక్సులను పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. 106 టేబుళ్ల అధికారులు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల కల్లా ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నెల 16న చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. స్ట్రాంగ్రూమ్లకు బ్యాలెట్ బాక్స్లు రేపు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు మధ్యాహ్నం 2 కల్లా ఫలితాలు 16న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక -
పెళ్లన్నాడు.. రూ.35 లక్షలు కొల్లగొట్టాడు
● యువతిని నమ్మించిమోసగించిన సైబర్ నేరగాడు ● పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్ మ్యాట్రిమోనీలో గుర్తు తెలియని వ్యక్తితో ఆ యువతికి పరిచయమైంది. రోజూ ఫోన్లో జరిపిన చాటింగ్లు పెళ్లి వరకు వెళ్లాయి. జాతకాలు కలవలేదని తల్లిదండ్రులు నిరాకరించినా ససేమిరా అన్నారు. సీన్ కట్ చేస్తే.. సైబర్ నేరస్తుడి వలలో చిక్కుకున్న ఆ యువతి ఏకంగా రూ.35 లక్షలు మోసపోయింది. మల్కాజిగిరి సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. వివరాలు ఇలా.. కమిషనరేట్ పరిధిలోని ఓ యువతి మ్యాట్రిమోనియల్ ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంది. సైబర్ నేరస్తుడు (40) ఆమె ప్రొఫైల్ను యాక్సెప్ట్ చేసి, తాను బాగా చదువుకున్నానని, వ్యాపారవేత్తనని పరిచయం పెంచుకున్నాడు. తక్కువకాలంలోనే వారి మధ్య చనువు ఏర్పడింది. ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. చాటింగ్లు చేసుకునేవారు. పథకం ప్రకారం సైబర్ కేటుగాడు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. దీన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు.. జాతకాలు సరిచూపించి అనుకూలంగా లేవని పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించారు. అయినప్పటికీ బాధితురాలు నిందితుడితో టచ్లోనే ఉంది. ఆమె తన వలలో పడిపోయిందని నిర్ణయించుకున్న నిందితుడు.. వ్యాపారాలను విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఆమె కోసం వజ్రాలు తీసుకున్నానని నమ్మించాడు. వ్యాపార విస్తరణకు డబ్బు కావాలని కోరాడు. దీంతో యువతి సొమ్మును నిందితుడు సూచించిన ఖాతాలకు బదిలీ చేసింది. ఇంకా కావాలనడంతో.. కుటుంబ సభ్యులతో పాటు ఆమె బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి మరీ బదిలీ చేసింది. తర్వాత నిందితుడు స్పందించలేదు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. -
హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ షురూ
సాక్షి, సిటీబ్యూరో: 23వ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ (అర్బన్రైజ్ కప్) బుధవారం అట్టహాసంగా ఆరంభమైంది. దేశవ్యాప్తంగా 300 మందికిపై క్రీడాకారులు పోటీపడుతున్న ఈ టోర్నమెంట్ను హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ (హెచ్ఓటీఏ) నిర్వహిస్తోంది. జూబ్లిహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్, ఫిల్మ్నగర్ క్లబ్, జిహెచ్ఎంసీ టెన్నిస్ కోర్టుల్లో బుధవారం సింగిల్స్, డబుల్స్ మ్యాచ్లు మొదలయ్యాయి. జేహెచ్ఐసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన పురుషుల 55 ప్లస్ సింగిల్సలో నంద్యాల నరసింహారెడ్డి శుభారంభం చేశారు. రాజారామ్ మోహన్ రాయ్పై 9–2తో నరసింహారెడ్డి గెలుపొందారు. మెన్స్ 60 ప్లస్ సింగిల్స్లో గంగాధర్ 9–5తో వెంకట రత్నంపై విజయం సాధించాడు. ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో అన్ని విభాగాల్లో ఫైనల్స్ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. -
ఉదయం స్నాచింగ్... మధ్యాహ్నం అరెస్ట్
గన్ఫౌండ్రీ: నగరంలో మరో చైన్ స్నాచింగ్ ఉదంతం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం అబిడ్స్ పరిధిలో ఒంటి మహిళ మెడ నుంచి బంగారం గొలుసులాక్కువెళ్లాడు.. దీన్ని సవాల్గా తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు కేవలం ఆరు గంటల్లో నిందితుడిని పట్టుకున్నారు. అబిడ్స్ చాపల్ రోడ్డులోని ఓ హాస్టల్లో నివసిస్తున్న శిరీష (24) ఆ సమీపంలోని మల్లారెడ్డి హాస్పిటల్లో నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం నైట్ డ్యూటీ చేసిన ఈమె విధులు ముగించుకుని బుధవారం ఉదయం హాస్టల్కు వెళ్తున్నారు. అదే సమయంలో బైక్పై ఆమె వెనుక వైపు నుంచి వచ్చిన ఓ దొంగ పంజా విసిరాడు. శిరీష గమనించే లోపే ఆమె మెడలో ఉన్న 2.5 తులాల బంగారు గొలుసును లాక్కున్నాడు.బాధితురాలు అతడిని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఈ పెనుగులాటలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ స్నాచర్ కోసం టాస్క్ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. స్నాచింగ్ జరిగిన ప్రాంతం నుంచి మొదలు పెట్టిన టాస్క్ఫోర్స్ అధికారులు నిందితుడు వచ్చిన, వెళ్లిన మార్గాల్లో ఉన్న 40 సీసీ కెమెరాల్లో ఫీడ్ అధ్యయనం చేశారు. అలా వచ్చిన సమాచారం ఆధారంగా ముందకువెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే ఇతడి తొలి నేరమని, గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదని తెలుస్తోంది. కేవలం తనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, పెరిగిన పసిడి ధరల నేపథ్యంలోనే ఈ స్నాచింగ్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా నిందితుడు సల్మాన్ పాషా యాకుత్పుర ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తేలింది. -
ఆటోల్లో ‘ఆపత్కాల బృందాలు’
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నిలక బందోబస్తు విధుల్లో స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు ఓ భాగం. తాత్కాలిక ప్రాతిపదికన గస్తీ విధుల కోసం వీటిని ఏర్పాటు చేస్తారు. ఎక్కడా శాంతిభద్రతల సమస్య, ఘర్షణలు, ఆందోళనలు తలెత్తితే వెంటనే రంగంలోకి దిగి అదుపు చేయడం, ఆందోళనకారుల్ని ముందస్తు అరెస్టు చేయడం వీరి విధి. ఇప్పటి వరకు ఈ రెండు రకాలైన బృందాలను కారు, సుమో తదితర వాహనాలు కేటాయించే వారు. వీటివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయని గమనించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.రమేష్ తొలిసారిగా ట్రాలీ ఆటోలు కేటాయించారు. ఈ కమిషనరేట్ పరిఽధిలో పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ బృందాలు ఆటోల్లోనే గస్తీ, బందోబస్తు నిర్వహించాయి. ఈ వాహనాల్లో తిరగడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు వీరికి స్పష్టంగా కనిపిస్తాయి. అక్కడి పరిస్థితుల్ని పక్కాగా అంచనా వేయవచ్చు. ఈ బృందాల వెంట ఉండే లాఠీలు, స్టోర్ గార్డ్, హెడ్ గార్డ్లతో పాటు రైట్ గేట్ మొత్తాన్ని తరలించడమూ తేలిక. అత్యవసరం అయినప్పుడు వాటిలో నుంచి దిగటానికీ సమయం పట్టదు. అవసరమైతే ఆందోళనకారుల్ని తమ ఆటోలోనే తీసుకుని మరో ప్రాంతానికి తరలించవచ్చు. ఈ కారణాల వల్ల సైబరాబాద్ సీపీ ఈ రెండు తరహాలైన బృందాలకు ట్రాలీ ఆటోలు కేటాయించారు. ఎన్నికల విధుల్లో స్ట్రైకింగ్,స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లు తొలిసారిగా ఆటోలను కేటాయించిన సైబరాబాద్ సీపీ -
మూసీలో ముందడుగు
● నిర్వాసితులకు టీడీఆర్ రూపంలో పరిహారం ● తొలిదశలో 21 కి.మీ. మేర సుందరీకరణ పనులు ● ఫేజ్–1 ఏలో హిమాయత్ సాగర్– గాంధీ సరోవర్ ● ఫేజ్–1 బీలో ఉస్మాన్సాగర్– గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి 55 ఎకరాల భూ సమీకరణకు సర్కారు నిర్ణయం సాక్షి, సిటీబ్యూరో: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ మూసీ అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిన భూ సమీకరణకు మార్గం సుగమమైంది. నది సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ ప్రక్రియను ప్రారంభించింది. హైదరాబాద్ జిల్లాలోని గోల్కొండ మండలం, రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలో సుమారు 55 ఎకరాల భూములను సేకరించనుంది. ఈమేరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) నోటిఫికేషన్ను విడుదల చేసింది. భూ నిర్వాసితులకు భూ బదలాయింపు హక్కు (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్–టీడీఆర్) రూపంలో పరిహారం అందించాలని నిర్ణయించారు. పట్టా భూములకు టీడీఆర్ సర్టిఫికెట్ల ● సుందరీకరణలో సీఎం రేవంత్ లక్ష్యానికి అనుగుణంగా.. బాపూఘాట్ ప్రాంతాన్ని గాంధీ సరోవర్గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలి దశలో జంట జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ల నుంచి బాపూఘాట్ వరకు అభివృద్ధి చేయనున్నారు. ఫేజ్–1ఏలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కి.మీ, ఫేజ్–1బీలో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ చేపట్టి.. నదికి రెండు వైపులా మొత్తం 21 కి.మీ. మేర అభివృద్ధి చేయనున్నారు. పరీవాహక ప్రాంతంలో సరైన రెవెన్యూ పత్రాలు, పట్టా భూములున్న వారికి టీడీఆర్ సర్టిఫికెట్లను అందజేయనున్నారు. సుందరీకరణ ఇలా.. ఘన, జల వ్యర్థాలతో నిండిపోయిన నదిని మొదట శుభ్రం చేస్తారు. 2 మీటర్ల లోతు వ్యర్థాలు, పూడిక తీస్తారు. ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తారు. చుట్టూ మురుగునీటి శుద్ది కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను మళ్లించి.. 24/7 నదిలో పారేలా సుందరీకరిస్తారు. నడక మార్గాలు, సైకిల్ ట్రాక్లు, భూగర్భ జలాల రీచార్జ్ కోసం పార్క్లు, వర్షపు తోటలు, గ్రీన్రూఫ్లు, బ్యాటరీ వాహనాలు, ఎలక్ట్రిక్ రిక్షాలు వంటివి ఉంటాయి. నైట్ ఎకానమీలో భాగంగా అమ్యూజ్మెంట్పార్క్, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్స్ వాటర్ స్పోర్ట్స్, వీధి వర్తకుల వ్యాపార సముదాయాలు, వంతెనలు, వినోద కేంద్రాలు, రెస్టారెంట్లు, క్రీడా సౌకర్యాలు, వాణిజ్య, రిటైల్ స్థలాలను అభివృద్ది చేస్తారు. -
రూ.వెయ్యి కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్.. అక్కడ స్థలం విలువ గజం రూ.2 లక్షలు.. అలాంటి ప్రాంతంలో పార్కును 150 గజాల మేర కబ్జా చేశాడో ప్రబుద్ధుడు. అలాగే హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్కు చేరువలోని ఖానామెట్ ప్రాంతం.. అక్కడ ఎకరం రూ.200 కోట్లు. ఐదెకరాల వెలమ సంఘానికి గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమి విలువ రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా. ఆ కేటాయింపులపై కొంతమంది అభ్యంతరం చెప్పడంంతో కోర్టు స్టే ఇచ్చింది. ఇదే అదునుగా ఆక్రమణల పర్వానికి తెరదీశారు. కబ్జారాయుళ్లు ఈ రెండు కబ్జాలపై హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులు అందాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో హైడ్రా అధికారులు పరిశీలించారు. కబ్జాలను నిర్థారించుకుని బుధవారం ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ వేశారు. ఇలా మొత్తం రూ.1,003 కోట్ల ప్రభుత్వ ఆస్తిని హైడ్రా కాపాడింది. కబ్జా చేసిన కిరాయిదారుడు.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి ఔట్గేటు ఎదురుగా రెండెకరాల మేర పార్కు ఉంది. అక్కడ ఓ ఇంటిని కిరాయికి తీసుకుని లేడీస్ హాస్టల్ నడుపుతున్న వ్యక్తి కన్ను ఆ పార్కు స్థలంపై పడింది. ఇంకేముంది.. 150 గజాల మేర పార్కును ఆక్రమించాడు. కాంపౌండ్ దాటి పార్కులోకి 50 గజాల మేర జరిగి పాత భవనానికి ఆనుకుని మరో నిర్మాణం చేపట్టాడు. ఒక్కో అంతస్తులో గదులు నిర్మించాడు. ఇంటి యజమాని కూడా ఈ కబ్జాలపై మౌనంగా ఉన్నాడు. పార్కు వైపు గేటు పెట్టి 100 గజాల మేర ఫార్మ్హౌస్ మాదిరి సొంత పార్కును అభివృద్ధి చేసుకుని వాడుకుంటున్నాడు. అక్కడ చుట్టుపక్కల నివాసితులు అభ్యంతరం వ్యక్తంచేశారు. హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు కూడా చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో హైడ్రా పరిశీలించింది. పార్కులోకి 50 గజాల మేర జరిగి నిర్మాణం చేపట్టినట్లు నిర్థారించుకుంది. మరో 100 గజాల మేర హద్దులు వేసుకుని ఆక్రమణ చేసినట్టు స్పష్టం చేసుకుంది. ఈ మేరకు బుధవారం మూడంతస్తుల నిర్మాణాన్ని తొలగించారు. పార్కు కబ్జా ప్రయత్నాలకు ఫుల్స్టాఫ్ పెట్టి ఫెన్సింగ్ వేశారు. కబ్జాకు పాల్పడిన వారిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఖానామెట్లో ఐదెకరాలు.. హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు సమీపంలోని ఖానామెట్లో ఆల్ ఇండియా వెలమ సంఘానికి ఐదెకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలం చుట్టూ ప్రీకాస్ట్ వాల్లో ప్రహరీ నిర్మిస్తుండగానే, కుల సంఘాలకు స్థలాలు కేటాయించడంపై కొంతమంది కోర్టుకెక్కడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఇదే అదునుగా ఆ స్థలాన్ని వెనుక వైపు నుంచి అక్కడ ఉన్న స్థానికులు మట్టిపోస్తూ కబ్జా చేస్తున్నారని, అదేమని అడిగితే వాచ్మెన్పై దాడి చేస్తున్నారని ఆ సంఘం ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కోర్టు తీర్పును బట్టి నిర్ణయం ఉంటుంది. ఈ లోగా అక్కడి స్థలం కబ్జాకు గురికాకుండా చూడాలని హైడ్రాను కోరారు. ఈ మేరకు పరిశీలించి ఐదెకరాల మేర ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటుచేసింది. జూబ్లీహిల్స్లో పార్కు స్థలం,ఖానామెట్లో ఐదెకరాల ప్రభుత్వ భూమికి రక్షణ -
సీఎం నివాసం ముట్టడికి యత్నం
బంజారాహిల్స్: బంజారాల ఆరాధ్యదైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠను హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో బుధవారం ‘చలో సీఎం రేవంత్రెడ్డి ఇంటి ముట్టడి’ కార్యక్రమం నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి బంజారా సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకుని వాహనాల్లో స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సంఘం జాతీయ అధ్యక్షుడు కొర్ర మోతీలాల్నాయక్, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సక్రిబాయిలు మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని నల్లమల అటవీ ప్రాంతమైన నాగర్కర్నూల్ జిల్లా మద్దిమడుగు ప్రాంతంలో ప్రతిష్టించడం అంటే లంబాడీలను అవమానపరిచినట్లేనన్నారు. ప్రభుత్వానికి లంబాడీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే నగరంలో గానీ, నగర పరిసర ప్రాంతాల్లో గానీ విగ్రహంతో పాటు సేవాలాల్ మందిరం నిర్మించాలన్నారు. సేవాలాల్ బంజారా సంఘం నేతల అరెస్టు -
నేపాల్లో స్కెచ్.. జూబ్లీహిల్స్లో అమలు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లోని నందగిరి హిల్స్లో ప్రముఖ పారిశ్రామికవేత్త రవీంద్ర శర్మ నివాసంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో నేపాలి గ్యాంగ్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. చోరీ ప్లాన్ నేపాల్ లో వేయగా అమలు జూబ్లీహిల్స్ లో జరిగింది. స్కెచ్ వేసిన జీవన్ చాంద్ 2021 అక్టోబర్ 16న ఖైరతాబాద్లోనిహిల్స్ కాలనీలో యజ్ఞ అగర్వాల్ అనే వ్యాపారవేత్త ఇంట్లో రూ.80 లక్షలు విలువచేసే వజ్రాభరణాలు దొంగిలించి పరారయ్యాడు. అప్పటినుంచి సైఫాబాద్ పోలీసులు ఈ దొంగ కోసం వెతుకుతుండగా ఇంకా పరారీ లోనే ఉన్నాడు. జీవన్ మధ్యలో ఒకసారి హైదరాబాదుకు వచ్చి మరో దొంగతనం చేసి పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యాడు. తాజాగా నందగిరిహిల్స్లో రవీంద్ర శర్మ నివాసంలో దొంగతనానికి నేపాల్లోనే జీవన్ పక్కా స్కెచ్ వేసి భూపేంద్ర షాహి అనే వ్యక్తిని వంట మనిషిగా పెట్టించాడు. రెండు వారాల వ్యవధిలోనే భూపేంద్ర షాహి తన అనుచరుడు నేపాల్ కు చెందిన కృష్ణ చాంద్, రమేష్ తో కలిసి రెక్కీ నిర్వహించి గత శుక్రవారం రూ.1.30కోట్ల విలువచేసే వజ్రాలు దొంగిలించి పరారయ్యాడు. భూపేంద్రశాహి, కృష్ణ చాంద్ ఇద్దరూ కలిసి ముంబైలో నేపాల్కు చెందిన తమ స్నేహితులు లలిత్, కిషన్ సాయి వద్ద ఆశ్రయం పొందారు. దొంగతనం చేసిన సమయంలో అక్కడ పడిపోయిన సెల్ఫోన్ ఆధారంగా పోలీసులు వీరి జాడ కనిపెట్టారు. భూపేంద్ర షాహి, కృష్ణ చాంద్ ఇద్దరు నేపాల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్లో రమేష్ పరారీలో ఉన్నాడు. భూపేంద్ర షాహిని వంట మనిషిగా మాట్లాడిన మదన్ లాల్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు నేపాల్ బార్డర్ దాటకముందే హైదరాబాద్ పోలీసులకు చిక్కారు ప్రధాన నిందితుడు జీవన్ ను హైదరాబాదుకు రప్పించేందుకు పోలీసులు ఇంటర్ పోల్ ను ఆశ్రయించాలని నిర్ణయించారు. మొత్తానికి జూబ్లీహిల్స్ లో జరిగిన దొంగతనం వల్ల 2021 లో సైఫాబాద్ లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడు బయటపడ్డాడు. పరారీలో ప్రధాన నిందితుడు.. గతంలో నగరంలోనూ చోరీ మరో ఇద్దరి రిమాండ్ -
‘ముద్ర రుణం’ పేరిట మోసం
సాక్షి, సిటీబ్యూరో: ‘ముద్రా లోన్ సర్వీసెస్’ పేరుతో రుణాలు ఇస్తామంటూ ఎర వేసి మోసాలకు పాల్పడుతూ ఢిల్లీలో స్థిరపడిన ఐదుగురు రాష్ట్ర వాసుల్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీళ్లు లోన్ ఆఫీసర్లుగా నటిస్తూ టోకరా వేశారని డీసీపీ వి.అరవింద్బాబు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఈ స్కామ్కు పాల్పడే సూత్రధారులు తెలుగు వారిని మోసం చేయడానికి వీరిని వినియోగించుకున్నట్లు ఆయన వివరించారు. ఫేస్బుక్ ప్రెండ్స్తో జట్టుకట్టి.. వరంగల్ జిల్లాకు చెందిన బోచు అరుణ్, గడ్డం భరత్, సామర్ల తిరుపతి, వెల్పుగొండ తరుణ్, చుక్క శ్యామ్ స్నేహితులు. వీళ్లు తమ చదువును మధ్యలోనే ఆపేసి కూలీ పనులు ప్రారంభించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఫేస్బుక్ ప్రకటనల ద్వారా పరిచయమైన ఢిల్లీ వాసి రాహుల్తో జట్టుకట్టారు. అతడి ద్వారా ఢిల్లీ, కోల్కతాల్లో ఉన్న అక్రమ కాల్ సెంటర్లలో చేరారు. కిట్టు అనే మేనేజర్ వీరికి కొన్నాళ్లు కోల్కతాలో వసతి కల్పించి, మోసం చేసే విధానంపై శిక్షణ ఇచ్చాడు. సూత్రధారులు ముద్రా లోన్లు, ఇతర రుణాల పేరుతో సోషల్మీడియాలో ప్రకటన ఇచ్చేవారు. ఎటువంటి వడ్డీ, ముందస్తు చెల్లింపులు లేకుండానే మంజూరు చేస్తామని నమ్మించారు. ఆసక్తి చూపిన వారి డేటాను సేకరించి, రాష్ట్రాల వారీగా విభజించి, తెలుగు డేటాను ఈ ఐదుగురికీ ఇచ్చేవాడు. వీరిలో ఒక్కోక్కరూ ప్రతిరోజూ 180 నుంచి 200 కాల్స్ చేస్తూ బాధితులను నమ్మించే వారు. ఆపై ప్రాసెసింగ్ ఫీజు, టీడీఎస్, ఇన్కమ్ టాక్స్ చార్జీల పేరుతో డబ్బులు వసూలు చేసేవారు. అలా దోచుకున్న మొత్తం నుంచి ఈ నిందితులకు 30 శాతం కమీషన్ లభించేది. ఇన్స్ట్రాగామ్లో లోన్ ప్రకటన చూసి.. నగరానికి చెందిన ఓ మహిళ (36) గత ఏడాది నవంబర్ 6న ఇన్స్ట్రాగామ్లో లోన్ ప్రకటన చూసి ఆసక్తి చూపారు. మరుసటి రోజు ఆమెకు ఓ ఫోన్ వచ్చింది. ‘ముద్రా లోన్ సర్వీసెస్’ అధికారి కిలా పవనర్ కుమార్గా పరిచయం చేసుకున్న మోసగాడు... ఆమె పేరు మీద రూ.3 లక్షల రుణం మంజూరైందని చెప్పాడు. ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు అవసరం లేదని నమ్మించి, అర్హత కోసం ఆధార్, పాన్కార్డ్ వివరాలు తీసుకున్నాడు. ఆపై ఇన్సూరెన్స్ ఛార్జీల పేరుతో రూ.7,200, టీడీఎస్ పేరుతో రూ.15 వేలు డిమాండ్ చేశాడు. ఇలా రకరకాల పేర్లు చెప్పి రూ.1,08,274 వసూలు చేశాడు. దీంతో బాధితురాలు తనకు లోన్ వద్దని... ఇప్పటికి ఇచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వాలని కోరగా, క్యాన్సిలేషన్ ఫీజు పేరుతో మరింత మొత్తం డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఇన్స్పెక్టర్ పి.శివచంద్ర నేతృత్వంలోని బృందం ఐదుగురినీ అరెస్టు చేసింది. వీరి నుంచి ఎనిమిది ఫోన్లు, పది సిమ్కార్డులు స్వాధీనం చేసుకుంది. సైబర్ సూత్రధారుల దందా గుట్టురట్టు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు -
గల్లీగల్లీలో గస్తీ
● సైబరాబాద్లో విజిబుల్ పోలీసింగ్ సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసులు విజిబుల్ పోలిసింగ్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడంతో పాటు అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చేతిలో లాఠీలతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గురువారం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) హరికృష్ణా రెడ్డి సిబ్బందితో కలిసి 9 ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. అలాగే జన సమర్దం అధికంగా ఉన్న ప్రాంతాలు, అలీజాపూర్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెయిన్ బో విస్టా జంక్షన్ వద్ద సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. అలాగే ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. నిరంతర పెట్రోలింగ్, వాహన తనిఖీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తామని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్ రెడ్డి ప్రజలకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం విజిబుల్ పోలీసింగ్ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు -
చంద్రహాస్పై మరో కేసు
బంజారాహిల్స్: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు సినీహీరో చంద్రహాస్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కె.వెంకటేశ్వరరెడ్డి తెలిపిన మేరకు.. చంద్రహాస్ హీరోగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వారం క్రితం జూబ్లీహిల్స్లోని దస్పల్లా హోటల్లో నిర్వహించారు. వేడుకల్లో చంద్రహాస్ అసభ్య పదజాలంతో పాటపాడాడు. దీంతో చంద్రహాస్ ఉపయోగించిన భాష సరికాదని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ నితీష్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని చంద్రహాస్ కోసం గాలింపు చేపట్టారు. మాదాపూర్ పీఎస్లో కూడా ఇతనిపై కేసు నమోదైంది. 12.7 తులాల బంగారు నగలు చోరీవిజయనగర్కాలనీ: ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో దొంగలు 12.7 తులాల బంగారు నగలు చోరీచేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఆసిఫ్నగర్ హుడా కాలనీలో నివాసముండే ప్రభాకర్ రెడ్డి (58) గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్థానిక విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కు వెళ్లాడు. ఓ గంట తరువాత తిరిగి ఇంటికి రాగా 2వ ఫ్లోర్లోని ఇంటి తాళం ధ్వంసమై ఉంది. లోపలకు వెళ్లి చూడగా అల్మార పగులగొట్టి అందులోని 12.7 తులాల బంగారును దొంగలు చోరీ చేసినట్లు గుర్తించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాంకేతిక సమస్య.. విమానం ఆలస్యం శంషాబాద్: బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఓ విమానం సాంకేతిక కారణాలవల్ల రెండుగంటలు ఆలస్యంగా బయలుదేరింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్రాంక్ఫర్ట్కు బయలుదేరేందుకు లుఫ్తాన్సా ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ప్రయాణికులు ఎక్కికూర్చున్నారు. గురువారం తెల్లవారు జామున 3.40 గంటలకు టేకాఫ్ తీసుకునే సమయంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మరమ్మతుల అనంతరం రెండుగంటలు ఆలస్యంగా బయలుదేరింది. మత్తులో ఉన్న ప్రయాణికుడి దించివేత శంషాబాద్: మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడిని విమానంలోంచి దించివేసిన సంఘటన ఎయిర్పోర్టులో చోటు చేసుకుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం ఢిల్లీకి వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడు మద్యం మత్తులో స్పృహ లేకుండా ఉండిపోయాడు. దీంతో ఎయిర్లైన్స్ అధికారులు కిందికి దించివేశారు. లిఫ్ట్ అడిగి చోరీకి యత్నం లంగర్హౌస్: ఓ యువకుడు ద్విచక్రవాహనదారుడిని లిఫ్ట్ అడిగి చోరీకి యత్నించాడు.ఈ సంఘటన లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మొయినాబాద్లో నివాసముందే రాము గురువారం ఉదయం గుడిమల్కాపూర్ నుంచి ఇంటికి బయల్దేరాడు. సంగం వద్ద బీహార్కు చెందిన యువకుడు లిఫ్ట్ ఇవ్వాలని ఆపాడు. ట్రాఫిక్ పోలీసులు తన ద్విచక్ర వాహనాన్ని లాక్కున్నారని, తాను అత్యవసరంగా వెళ్లాలని రామును కోరాడు.దీంతో రాము అతనికి లిఫ్ట్ ఇచ్చాడు. ఆ తరువాత వెనుక కూర్చున్న యువకుడు రాము జేబు కట్ చేసి డబ్బు చోరీచేయబోయాడు.గమనించిన రాము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని స్థానికుల సహకారంతో పోలీసులకు అప్పగించబోయాడు. ఈ క్రమంలో ఆ దొంగ.. రాము కాళ్లు , చేతులు రక్తం వచ్చేలా కొరికి పరారయ్యాడు. దీంతో స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆటోను ఢీ కొట్టిన టిప్పర్ ● ఆటోలో ఏడుగురు విద్యార్థులు ● పాఠశాలకు వెళుతుండగా ప్రమాదం జియాగూడ: విద్యార్థులను పాఠశాలను తీసుకెళుతున్న ఓ ఆటోను ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థితోపాటు ఆటో డ్రైవర్ గాయపడ్డాడు. కుల్సుంపురా ఇన్స్పెక్టర్ రాములు తెలిపిన మేరకు.. జియాగూడకు చెందిన సందీప్ (35) గురువారం ఉదయం జియాగూడ నుండి అత్తాపూర్లోని శ్రీ చైతన్య స్కూల్కు చెందిన ఏడుగురు విద్యార్థులను ఆటోలో తీసుకువెళుతున్నాడు. ఈ క్రమంలో పాత బస్తీకి చెందిన షఫీ వేగంగా టిప్పర్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆటోను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థితోపాటు, డ్రైవర్ సందీప్ గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధిక పనిగంటలతో అధ్యాపకుల్లో ఒత్తిడి సాక్షి,సిటీ బ్యూరో: ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాలలో బోధన, మానిటరింగ్ పేరుతో అధిక పని గంటల విధానం తొలగించాలని తెలంగాణ రెసిడెన్నియల్ డిగ్రీ కాలేజ్ ఎంపవరింగ్ అసోసియోషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ తట్ల సాంబలక్ష్మి, డాక్టర్ రమాదేవి డిమాండ్ చేశారు. ఉదయం 8.45 నుండి సాయంత్రం 5 గంటలు విధులు నిర్వహించడంతోపాటు పాటు వారానికి రెండు నుండి మూడు నైట్ డ్యూటీలు చేయాల్సి వస్తోందన్నారు. రాత్రి డ్యూటీ చేసిన రోజు అధ్యాపకులు ఉదయం నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు నిర్విరామంగా కళాశాలలోనే ఉంటున్నారన్నారు. దీంతో 28 గంటలు ఏకధాటిగా కళాశాలలో పనిచేయడం వల్ల మానసిక ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమన్నారు. -
ఇంటర్ బోర్డు ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన
గన్ఫౌండ్రీ : ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు రజనీకాంత్ మాట్లాడుతూ... కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థుల నుంచి ప్రత్యేకంగా నగదు వసూలు చేసి వాటిని ఇంటర్ బోర్డు అధికారులకు అందజేసి మాస్ కాపీయింగ్కి పాల్పడ్డారని ఆరోపించారు. సీసీ కెమెరాలు సైతం పనిచేయకుండా చేసి చిట్టీలు పెట్టి మరి పరీక్షలు రాయించారని మండిపడ్డారు. అనంతరం ఇంటర్ బోర్డు అధికారికి వినతి పత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, సహాయ కార్యదర్శి మమత, జిల్లా కార్యదర్శి అశోక్రెడ్డి, పాల్గొన్నారు. -
తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి జాతీయ అక్రిడిటేషన్
● వైద్య సేవా ప్రమాణాల మెరుగుదలకు మరింత కృషి ● సూపరింటెండెంట్ డాక్టర్ శైలజా మూర్తి సాక్షి, సిటీబ్యూరో: తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఏబీహెచ్) గుర్తింపు లభించింది. నాణ్యమైన వైద్యసేవలు, రోగి ఆరోగ్య భద్రతను నిర్ధారించే దిశగా ఆసుపత్రి చేస్తున్న నిరంతర కృషికి ఇదో మైలురాయిగా నిలువనుంది. అధునాతన క్రిటికల్ కేర్ సేవలు, మాడ్యులర్ సూపర్ స్పెషాలిటీ ఆపరేషన్ థియేటర్లు, పూర్తిస్థాయి క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు, వివిధ రకాల చికిత్సలు తార్నాక ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. ఈ సదుపాయాలు రోగులకు ప్రత్యేక వైద్య సేవలను అందించడానికి సహాయపడుతున్నాయి. ఆసుపత్రి విద్యా, శిక్షణ కార్యక్రమాలను కూడా విస్తరించింది. 100 సీట్ల బీఎస్సీ నర్సింగ్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, శస్త్రచికిత్స, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్లలో డీఎన్బీ పీజీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎన్ఏబీహెచ్ గుర్తింపు లభించడం పట్ల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ మూర్తి, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ పి. శ్రీనివాస్ , ఇతర వైద్య బృందాన్ని ఆర్టీసీ సీఎండీ నాగిరెడ్డి అభినందించారు. వైద్యుల సమష్టి కృషి, పట్టుదల, అత్యుత్తమైన ఆరోగ్య సేవల్ని సాధించాలనే అచంచలమైన సంకల్పానికి ఇది నిదర్శనమని కొనియాడారు. టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు, అర్హులైన వారి కుటుంబ సభ్యులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రతిష్టాత్మకమైన ఎన్ఏబీహెచ్ సర్టిఫికేషన్ దక్కడం సంతోషంగా ఉందని, ఇది అందరి కృషితోనే సాధ్యమైందని సూపరింటెండెంట్ శైలజామూర్తి పేర్కొన్నారు. మెరుగైన వైద్య సేవలు, నాణ్యత ప్రమాణాలకు ఇది ఒక గుర్తింపుగా నిలుస్తుందన్నారు. -
నల్ల చెరువు ఆక్రమణలను త్వరలోనే తొలగిస్తాం
● హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉప్పల్: రూ.20 కోట్లతో నల్ల చెరువును అభివృద్ధి చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఈ మేరకు గురువారం ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జి పరమేశ్వర్ రెడ్డి తో కలిసి నల్ల చెరువును సందర్శించారు. నల్ల చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులను ఏకకాలంలో సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. చెరువు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు కబ్జాకు గురైనట్లు గుర్తించామని. త్వరలోనే వాటిని తొలగించి నల్ల చెరువును రక్షిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంజయ్య, లింగంపల్లి రామకృష్ణ, తుమ్మల దేవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేషనల్ డ్రోన్ ఇన్నొవేషన్ ఛాలెంజ్లో సార్క్స్ హవా
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ స్థాయిలో గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన నిడార్ 2026 నేషనల్ డ్రోన్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో నగరానికి చెందిన సార్క్స్ (సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్స్పీడీషన్) బృందం టాప్–5లో నిలిచి సత్తా చాటింది. నగరంలోని గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కి చెందిన ఈ బృందం ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం రూపొందించిన వారి డ్రోన్ పరిష్కారం, విపత్తుల సమయంలో ప్రాణాలను రక్షించే సాంకేతికత ఎలా ఉండాలనే ప్రయత్నానికి దేశ వ్యాప్తంగా ఆదరణ లభించింది. ముగిసిన జాతీయ బాక్సింగ్ పోటీలు బొల్లారం : బొల్లారంలోని ఎల్ఆర్ఎంజీ గ్రౌండ్లో నిర్వహించిన ఓపెన్ నేషనల్ బాక్సింగ్ అండ్ సిలంబం (కర్రసాము) పోటీలు గురువారం ముగిశాయి. పోటీల్లో హరియాణ, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జట్లు పాల్గొన్నాయి. మొత్తం 200కిపైగా బాలబాలికలు బాక్సింగ్ పోటీల్లో, 50 మంది సిలంబం పోటీల్లో పాల్గొన్నారు. తమిళనాడు జట్టు విజయం సాధించగా..తెలంగాణ ద్వితీయస్థానం, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం దక్కించుకున్నాయి. బ్లూ వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ నరసింహన్ కన్నన్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. బ్లూ వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నవీన్ రాజ్, ఉపాధ్యక్షుడు జి. అరవింద్ పాల్గొన్నారు. సంతోష్నగర్: కంచన్బాగ్ డీఆర్డీఎల్ ప్రధాన రహదారిపై గురువారం కారు టైర్ ఊడిపోవడంతో అదుపుతప్పి డివైడర్ మీదుగా పల్టీ కొట్టి రోడ్డుపై పడి అటుగా వచ్చిన మరో కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రోడ్డుపై చోటు చేసుకోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్నాక్స్ సెంటర్లోకి దూసుకెళ్లిన రెడిమిక్స్ వాహనం మియాపూర్: మియాపూర్ జేపీఎన్నగర్ కాలనీలో స్నాక్స్ సెంటర్లోకి రెడిమిక్స్ మిషన్ వాహనం దూసుకెళ్లింది.స్థానికులు తెలిపిన మేరకు.. గురువారం జేసీబీ వాహనానికి మిని రెడిమిక్స్ మిషన్ వాహనాన్ని వెనక భాగంలో తగిలించుకొని వెళుతున్నారు. ఈ క్రమంలో హుక్ ఊడిపోవడంతో రెడిమిక్స్ మిషన్ స్నాక్స్ సెంటర్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో లోపల ముగ్గురు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ప్రమాదం జరగలేదు. -
హాస్టల్, హోటల్లో అగ్ని ప్రమాదాలు
ముషీరాబాద్ గాంధీనగర్లోని ఓ హాస్టల్, బంజారాహిల్స్లోని ఓ హోటల్లో గురువారం అగ్ని ప్రమాదాలు జరిగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎక్కడా ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిక్కడపల్లి : గాంధీనగర్లో సుధామ పీజీ ఉమెన్స్ హాస్టల్లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం జరిగినప్పడు హాస్టల్లో మ్గుగురు విద్యార్థులు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అర్పి వేశారు. ప్రమాదం జరిగినపుడు మొదటి ఫ్లోర్లో ఉన్న ఇద్దరు విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. రెండో అంతస్తు మంటల్లో చిక్కుకున్న ఓ విద్యార్థిని ఇద్దరు యువకులు సాహసోపేతంగా బయటికి తీసుకొచ్చి రక్షించారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో విద్యార్థినుల సర్టిఫికెట్లు మొత్తం కాలిపోయాయి. అగ్ని ప్రమాదం గీజర్ వల్లే జరిగిందని సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ జోగుల నర్సయ్య, చిక్కడపల్లి ఏసీపీ రమేష్కుమార్ తెలిపారు. యువతిని కాపాడిన ఆంజనేయులు, అరుణ్లను పోలీసులు అభినందించారు. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ముఠాగోపాల్ పరిశీలించారు. హోటల్లో .. బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్–3లోని లెవెంట్ హోటల్లో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిమ్నీలో నుంచి ఒక్కసారిగా పొగలు, మంటలు రావడంతో స్థానికులు భయాభ్రాంతులకు గురయ్యారు. హోటల్లో ఉన్న వారంతా బయటకు పరుగులు తీశారు.అగ్నిమాపక సిబ్బంది గంటపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. కొంత ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా నాంపల్లి ఘటనతోనైనా అధికారులు మేల్కొనలేదు. బంజారాహిల్స్లో అగ్ని ప్రమాదం జరిగిన లెవెంట్ హోటల్కు ఫైర్ సేఫిటీ లేదని అధికారులు గుర్తించారు. ఎంట్రీ సరిగా లేదు. కిచెన్ పరిస్థితి భయానకంగా ఉంది. -
ఇంటిలిజెంట్ అడుగు..
నగరంలో అమలవుతున్న ‘ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్’ ● కొత్త విధానంతో భవిష్యత్తులో సమస్యలకు అవకాశం ● దీంతో కేసుల విచారణపై ఏ ప్రభావమూ పడకుండాపోలీసుల కార్యాచరణ ● ప్రత్యేకంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఏర్పాటు ● త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు విధానం (ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్) అమలవుతోంది. మొత్తం తొమ్మిది రకాలైన నేరాల్లో బాధితులుగా మారిన వారికి ఈ విధానం వర్తింపజేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. న్యాయస్థానంలో ట్రయల్పై ప్రభావం లేకుండా ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బాధితుల ఇళ్ల వద్ద నమోదు చేసే ఎఫ్ఐఆర్ల కోసం ప్రత్యేకంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే దీన్ని అమలులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కేసుకు ‘పునాది’ ఫిర్యాదే... ఏ కేసు అయినా బాధితుడి ఫిర్యాదు ఆధారంగానే నమోదవుతుంది. కేసు డైరీలు, అభియోపత్రాలకు సైతం ఫిర్యాదే పునాది. ఫిర్యాదు ఎంత పటిష్టంగా ఉంటే బాధితులకు అంత మేలు. చాలా మంది అన్యాయాన్ని పోలీసులకు వివరంగా చెప్పినా.. ఆ స్థాయిలో రాసివ్వలేరు. ఈ సందర్భాల్లో వారు ఠాణాకు వస్తే పూర్తిస్థాయిలో వినే సీనియర్ రైటర్లు, ఎస్సైలు, ఇన్స్పెక్టర్లు తగిన సలహాలు, సూచనలిస్తారు. పకడ్బందీ ఫిర్యాదుకు సహకరిస్తారు. గస్తీ సిబ్బందికే ఆ బాధ్యతలు.. ప్రస్తుతానికి నగర పోలీసులు ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ వంటి ఘటనల్లో ‘ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్’ అమలు చేస్తున్నారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. అనుభవం, నైపుణ్యమూ తక్కువే.. ఇప్పటి కానిస్టేబుళ్లు విద్యాధికులే అధికం. ఫిర్యాదు రూపొందించడం, కేసు నమోదుతో అనుభవం, నైపుణ్యం సైతం అవసరం. గస్తీ సిబ్బందిలో అత్యధికులు కొత్త కానిస్టేబుళ్లే ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారికి ఈ అంశాలపై పట్టు లేకపోవడం, బాధితులు అంత పక్కాగా ఫిర్యాదు రాసి ఇవ్వలేకపోయే అవకాశం ఉంది. దీని ప్రభావం ఇప్పుడు కేసు నమోదుపై లేకపోయినా.. భవిష్యత్తులో కేసు విచారణ సందర్భంలో కచ్చితంగా ఉంటుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అందులోని లోపాల కారణంగా కేసులు వీగిపోయి, తప్పు చేసిన నిందితులూ బయటకు వచ్చేసే ప్రమాదం లేకపోలేదు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు ఏఐపై దృష్టి పెట్టారు. -
మార్కుల వేట.. అక్రమాల బాట
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ యథేచ్ఛగా సాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులకు గరిష్ట మార్కులు తెప్పించేందుకు అక్రమ మార్గాలను ఎంచుకున్నాయి. నిఘా నుంచి తప్పించుకునేందుకు యాజమాన్యాలు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఉద్దేశపూర్వకంగా ఆపేస్తుండగా, మరికొన్ని చోట్ల కెమెరా కంటికి ఆనని రీతిలో విద్యార్థులను కూర్చోబెట్టి తతంగాన్ని నడిపిస్తున్నాయి. ల్యాబ్ అసిస్టెంట్లు స్వయంగా రీడింగ్స్ రాసివ్వడం, సైగల ద్వారా సమాధానాలు చెప్పడం, రికార్డులు అందిస్తూ రాయించడం వంటి దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమారు 65 శాతం మంది ఎగ్జామినర్లు ప్రైవేట్ రంగం వారే కావడంతో పరస్పర అవగాహనతో ఈ వ్యవహారం సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు విద్యార్థులకు జంబ్లింగ్ విధానం అమలవుతోంది. విద్యార్థులు తమ సొంత కళాశాలల్లో కాకుండా ఇతర కళాశాలలకు వెళ్లి పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లోని ల్యాబ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అన్ని జిల్లాల పరీక్ష కేంద్రాలను సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సంబంధిత విద్యాధికారికి సమాచారం అందించి నిమిషాల వ్యవధిలోనే ఫ్లయింగ్ స్క్వాడ్ను అక్కడికి పంపించేలా చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలకు అడ్డంగా దొరికి.. నగరంలోని కొన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు స్వయంగా సిబ్బందే సమాధానాలు చెప్పడం, ల్యాబ్ అసిస్టెంట్లు రికార్డులను పక్కన పెట్టుకుని రాపిస్తుండటం వంటి దృశ్యాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిఘాతో బయటపడ్డాయి. దీనిపై స్పందించిన ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘించిన 14 మంది ఎగ్జామినర్లు, ల్యాబ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించి బ్లాక్ లిస్టులో పెట్టింది. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే కాలేజీల గుర్తింపును రద్దు చేస్తామని బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే విద్యార్ధులతోపాటు సిబ్బందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అక్రమాలను అరికట్టేందుకు తనిఖీలను ముమ్మరం చేయనున్నట్లు అధికారులు చెప్పారు. కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో మాస్ కాపీయింగ్ పట్టుబడ్డ 14 మంది ఎగ్జామినర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాయాజాలం -
అపాయింట్మెంట్ లేకుండానే అందుబాటులో ఉంటా
మధ్యాహ్నం 2 తర్వాత నన్ను కలవవచ్చు: సీపీ సజ్జనర్ సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి సమస్య, సందేహం, ఫిర్యాదు ఉన్నా ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా నేరుగా తనను కలవవచ్చని నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ గురువారం ప్రకటించారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల తర్వాత బంజారాహిల్స్లోని ఐసీసీసీ భవనంలో తాను అందుబాటులో ఉంటానన్నారు. శుక్రవారం పాతబస్తీ చెత్తబజార్లోని కొత్వాల్ హౌస్కు రావాల్సి ఉంటుందని ఆయన వివరించారు. సీపీ సార్.. నేనూ పోలీసింగ్ చేస్తా.. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో గురువారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన షీల్డ్–2026 కార్యక్రమానికి నగర సీపీ సజ్జనర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ కొలువుదీరిన రోబోతో ఆయన సరదాగా ఇలా కరచాలనం చేశారు. తానూ పోలీసింగ్ చేస్తానని ఆ రోబో అన్నట్లు ఉంది కదూ ఈ చిత్రాన్ని చూస్తే! -
అల.. ప్రచార పురంలో..
శివారు మున్సిపాలిటీల్లో రంజుగా రాజకీయం సాక్షి, రంగారెడ్డిజిల్లా: నగర శివారులోని మున్సిపాలిటీల ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. రంగారెడ్డి జిల్లాలోని మెజారిటీ స్థానాల కై వసమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు అభ్యర్థుల గెలుపునకు ప్రచారం ముమ్మరం చేశారు. ఉదయం ఇంటింటా ప్రచారం చేసి, మధ్యాహ్నం పట్టణ కేంద్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం కుల సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, కార్మిక సంఘాలతో భేటీ అవుతున్నారు. గురువారం చేవెళ్లలో డీసీసీ చీఫ్ చల్లా నరసింహారెడ్డి అధ్యక్షతన మాజీ ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి భీంభరత్ సన్నాహక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ కో ఆర్డినేటర్ల నియామకం బలమైన అభ్యర్థులను బరిలోకి దించిన అధికార పార్టీ తాజాగా ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో ఆర్డినేటర్ను నియమించింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కోఆర్డినేటర్గా వి.జగదీశ్వర్గౌడ్, చేవెళ్లకు ఎన్.భూపతిరెడ్డి, మొయినాబాద్కు ఎంఏ ఫయీం, శంకర్పల్లికి బొంతు శ్రీదేవి, షాద్నగర్కు టి.ప్రకాష్గౌడ్, ఆమనగల్లు మున్సిపాలిటీకి పి.విజయారెడ్డిని ఇన్చార్జిలుగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అనుచరుల గెలుపు కోసం బీఆర్ఎస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇప్పటికే మున్సిపాలిటీల వారీగా ఇన్చార్జిలను నియమించింది. వీరంతా ప్రచార రంగంలోకి దిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో అన్నీ తానై వ్యవహరిస్తుండగా, మాజీమంత్రి సబితారెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాద్నగర్లో, మరో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆమనగల్లులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు నాలుగు రోజులే ఉండటంతో అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రచారం ముమ్మరం చేశాయి. తాయిలాలకు తెరలేపారు.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇల్లిల్లూ తిరుగుతున్నారు. బీజేపీ తరఫున మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ తరఫున డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్రెడ్డి గురువారం మూడు చింతలపల్లి, ఎల్లంపేట, అలియాబాద్ మున్సిపాలిటీల పరిధుల్లో ప్రచారం సాగించారు. గెలుపే ధ్యేయంగా పార్టీల వ్యూహం ఇన్చార్జిలను నియమించిన బీఆర్ఎస్ తాజాగా కాంగ్రెస్ జాబితా ప్రకటన రంగంలోకి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు -
చూపు ప్రసాదించారు
మూణ్నెల్ల శిశువుకు వెలుగులు ● చెక్ రిపబ్లిక్ పసికందు కళ్లకు శస్త్రచికిత్స ● విజయవంతంగా చేసిన ఎల్వీ ప్రసాద్ వైద్యులు బంజారాహిల్స్: పుట్టుకతోనే చూపులేని పసికందుకు నగరంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల వెలుగులు ప్రసాదించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన ఇమాద్ అనే మూడు నెలల పసివాడు ‘పీటర్స్ అనోమలీ’ అనే అరుదైన కంటి సమస్యతో బాధపడుతున్నాడు. కనుపాపలు పూర్తిగా తెల్లబడి చూపు లేకుండాపోయింది. ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల కల్లం అంజిరెడ్డి క్యాంపస్ వైద్యులు బాలుడిని పరిశీలించి.. రెండు కళ్లకూ ‘కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్న్’ (నల్ల గుడ్డు మార్పిడి శస్త్ర చికిత్స) విజయవంతంగా నిర్వహించారు. ఎడమ కన్ను మరింత క్లిష్టంగా ఉండడంతో అందులో గ్లకోమా (కంటి ఒత్తిడి) సమస్య కూడా ఉంది. దీనిని అదుపు చేసేందుకు ‘ట్రాన్స్స్కెరల్ సైక్లో ఫోటోకోగ్యులేషన్’ అనే పద్ధతిని, మందులను ఉపయోగించారు. శస్త్ర చికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న శిశువులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. బాలుడు వస్తువులను గుర్తుపట్టడం, చూపును స్థిరంగా ఉంచడం వంటి సానుకూల లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలకు చెందిన పీడియాట్రిక్ కార్నియా నిపుణులు డాక్టర్ మురళీధర్ రామప్ప మాట్లాడుతూ.. పీటర్స్ అనోమలీ వంటి క్లిష్టమైన సమస్యల్లో ఫలితాలను కచ్చితంగా చెప్పలేమన్నారు. సరైన సమయంలో శస్త్ర చికిత్స చేయడం, నిరంతర పర్యవేక్షణ ద్వారా చూపు వచ్చే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు ఆనందాన్ని పంచుకుంటూ.. బిడ్డ మొదటిసారి తమను చూస్తూ కళ్లల్లో కళ్లు పెట్టి నవ్వినప్పుడు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేమన్నారు. -
రెండు కొత్త పైపులైన్లు
● మంజీరా పథకానికి గ్రీన్సిగ్నల్ ● వారం రోజుల్లో గండిపేటకు ఆమోదం ● తాగునీటి వృథా కట్టడికి చర్యలు సాక్షి, సిటీబ్యూరో మహానగర దాహార్తిని తీర్చే మంజీరా, గండిపేట నీటి సరఫరా పథకాల పురాతన ప్రధాన పైపులైన్లకు ప్రత్యామ్నాయంగా మరో రెండింటిని ఏర్పాటు చేసేందుకు జలమండలి సిద్ధమైంది. దశాబ్దాల కాలం నాటి ప్రధాన పైపులైన్లు శిథిలావస్థకు చేరి తరచూ పగిలిపోవడం, 30 శాతం నీరు లీకేజీలతో వృథా అవుతోంది. సమస్య శాశ్వత పరిష్కారానికి పైపులైన్లను ఆధునికీకరించడంతో పాటు పాతలైన్ల వెంట సమాంతరంగా కొత్తవాటిని నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు (డీపీఆర్) నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. సీఎం నుంచి మంజీరా పైపులైన్ పథకానికి గ్రీన్సిగ్నల్ లభించగా, మరో వారం రోజుల్లో గండిపేట (ఉస్మాన్ సాగర్) పథకం రెండో పైపులైన్కు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. తరచూ అంతరాయం.. మంజీరా నీటి సరఫరా ప్రధాన పైపులైన్ దెబ్బతింది. నెలలో కనీసం రెండు మూడుసార్లు షట్డౌన్ (నీటి సరఫరా నిలిపివేత) తప్పడం లేదు. మరమ్మతుల కారణంగా సనత్ నగర్, ఖైరతాబాద్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, కార్వాన్, నాంపల్లి, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, పటాన్చెరుు, ఆర్సీపురం, రాజేంద్రనగర్, మహేశ్వరం, కుత్బుల్లాపుర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాపై కనీసం 24 నుంచి 72 గంటల వరకు ప్రభావం పడుతోంది. శాశ్వత పరిష్కారం కోసం ప్రధాన పైపులైన్ మరమ్మతులు, సమాంతరంగా రెండో పైపులైన్ వేసేందుకు జలమండలి సిద్ధమైంది. త్వరలో టెండర్లు పిలవనుంది. కాండూట్ మార్గంలో గ్రావిటీ ద్వారా.. వందేళ్ల క్రితం గండిపేట (ఉస్మాన్సాగర్) జలాశయం నుంచి ఆసిఫ్నగర్ వరకు నేచురల్ స్లోప్తో రాతి కాలువ (కాండూట్) మార్గం ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. కాగా.. పైపులైన్ లీకేజీలతో వృథాగా నేల పాలవుతోంది. 45 ప్రాంతాల్లో లీకేజీలతో 8 నుంచి 10 ఎంజీడీలు మాత్రమే వినియోగదారులకు సరఫరా చేరుతున్నాయి. శాశ్వత పరిష్కారం కోసం గండిపేట జలాశయం నుంచి ఆసిఫ్నగర్ రిజర్వాయర్ వరకు మరో పైపులైన్ ఏర్పాటుకు జలమండలి సిద్ధమైంది. ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించింది. రెండు మూడు రోజుల్లో గ్రీన్ సిగ్నల్ లభించనుందని సమాచారం. గండిపేట తాగునీటి పథకం మంజీరా.. -
బాధలు తట్టుకోలేక బలవన్మరణం
వేర్వేరుచోట్ల ఐదుగురి ఆత్మహత్యఇంట్లో గొడవలతో వివాహిత.. కీసర: ఇంట్లో గొడవల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కీసర పోలీసులు తెలిపిన మేరకు.. తమిళనాడుకు చెందిన కార్తీక్, భార్య సుభాషిణి (30), ఇద్దరు పిల్లలతో కలిసి కీసరలో నివసిస్తున్నారు. కొంత కాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం కార్తీక్ తల్లికి సుభాషిణికి మధ్య గొడవ జరిగింది. ఇంట్లో గొడవ జరుగుతోందని భర్తకు ఫోన్ చేసినా రాలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సుభాషిణి తన సోదరుడికి మెసేజ్ పంపింది. సోదరుడు వచ్చేలోపు ఇంట్లో ఉరివేసుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పని ఒత్తిడితో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మియాపూర్ : పని ఒత్తిడి తట్టుకోలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మియాపూర్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ తెలిపిన మేరకు.. ఉండ్రు సతీష్(31) దంపతులు మియాపూర్ బీకే ఎన్క్లేవ్ కాలనీలో నివాసముంటున్నారు. వీరితోపాటు సతీష్ తమ్ముడు వెంకటకృష్ణ కూడా ఉంటున్నాడు. సతీష్ గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సంక్రాంతి పండుగకు భార్య ఊరికి వెళ్లింది. బుధవారం ఉదయం 9 గంటలైనా సతీష్ బెడ్ రూమ్ తలుపులు తీయకపోవడంతో తమ్ముడు వెంకటకృష్ణ తలుపు తట్టినా స్పందించలేదు. దీంతో తలుపులు బద్దలు కొట్టి వెళ్లి చూడగా సతీష్ ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించాడు. మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పని ఒత్తిడి కారణంగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. భవనం పైనుంచి దూకి మహిళ.. కేపీహెచ్బీకాలనీ: ఓ మహిళ తాను పనిచేసే ల్యాబ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన శ్రీనివాసులు, అనిత భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కూతురు ఉంది. ఐదేళ్ల క్రితం వీరికి వివాహమైంది. బాచుపల్లి ప్రాంతలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాసులు ఫార్మా కంపెనీలో పని చేస్తుండగా అనిత (23) కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతంలోని సీబీసీఐడీ కాలనీలోని ల్యాబ్లో పనిచేస్తోంది. బుధవారం మధ్యాహ్నం సమయంలో ల్యాబ్ భవనం మూడో అంతస్తు నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు గమనించి వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. కేపీహెచ్బీ పోలీసులు భర్త శ్రీనివాసులును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనిత తల్లిదండ్రులు వచ్చిన తరువాత ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. రోజూ తమకు ఎదురయ్యే బాధలు తట్టుకోలేక ఐదుగురు వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. కీసర పోలీస్ స్టేషన్పరిధిలో వివాహిత, మియాపూర్ పీఎస్పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి, నిరుద్యోగి, కూకట్పల్లి పరిధిలో యువకుడు, కేపీహెచ్బీ పరిధిలో ఓ మహిళ బలవన్మరణం చెందారు. గడ్డిమందు తాగి యువకుడు.. మియాపూర్: కడప జిల్లా, బద్వేల్కు చెందిన వెంకటేష్ (30) ఉద్యోగం కోసం ఈ నెల 3న మియాపూర్కు వచ్చాడు. అదే రోజు రాత్రి 10.30 గంటలకు మియాపూర్ మాతృశ్రీనగర్ కాలనీలోని బొమ్మరిల్లు సమీపంలో గడ్డి మందు తాగాడు. ఆ తరువాత అతనే స్వయంగా 108 కు ఫోన్ చేసి చెప్పాడు. సిబ్బంది వచ్చి శ్రావణీ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం మాదాపూర్లోని ఆస్పత్రి మెయిన్ బ్రాంచ్కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడు బావమరిది వెంకటసుబ్బయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
ఇక చరిత్రలోనే..
● కాలగర్భంలో కలిసిపోనున్న మూడు వారసత్వ కట్టడాలు ● ఎంజీబీఎస్– ఫలక్నుమా వరకు మెట్రో పనులు చకచకా చార్మినార్: దారుషిఫాలోని ఓల్డ్ ఎంసీహెచ్ భవనం.. శాలిబండ క్లాక్ టవర్.. అలియాబాద్ సరాయ్.. ఈ మూడు వారసత్వ (హెరిటేజ్) కట్టడాలు కాలగర్భంలో కలవనున్నాయా? వీటి స్థానంలో మెట్రో స్టేషన్లు ఆవిర్భవించనున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఔను అనే వస్తున్నాయి. పాతబస్తీలో మెట్రో రైలు పరుగులు తీయడానికి అవసరమైన ఏర్పాట్లు చకచకా జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు విస్తరణతో పాటు ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో స్టేషన్ల కోసం ఇప్పటికే స్థలాలను ఎంపిక చేశారు. ఇందులో ఈ మూడు హెరిటేజ్ కట్టడాలను తొలగించి వాటి స్థానంలో మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. ఈ వారసత్వ కట్టడాల చరిత్రను ఒకసారి అవలోకనం చేస్తే.. అలియాబాద్ సరాయ్.. శాలిబండ నుంచి ఫలక్నుమా వెళ్లే ప్రధాన రోడ్డులో షంషీర్గంజ్ కన్నా ముందు అలియాబాద్ సరాయ్ చారిత్రక ప్రాంతం ఉంది. హెరిటేజ్ కట్టడమైన అలియాబాద్ సరాయ్లో ప్రస్తుతం వివిధ రకాల వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మరో మెట్రో స్టేషన్ రానుంది. నిజాం కాలంలో నగరానికి ఉన్న 13 దర్వాజాల్లో అలియాబాద్ కూడా ఒకటి. ఈ దర్వాజా పక్కనే యాత్రికుల సౌకర్యార్థ్యం విశ్రాంతి గదులను నిర్మించారు. కుతుబ్ షాహీల కాలంలో నగరానికి వచ్చే యాత్రికులు రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకోవడం కోసం చార్మినార్ నుంచి 2.5 కిలో మీటర్ల దూరంలో అలియాబాద్ సరాయ్ను నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ మెకానిక్, టైలర్, గార్మెంట్స్.. ఇలా దాదాపు 60 దుకాణాల వరకు కొనసాగుతున్నాయి.చార్మినార్ నుంచి చాంద్రాయణగుట్టకు వెళ్లే ప్రధాన రహదారిలో శాలిబండ ఏరియా ఉంది. ఈ ఏరియా క్లాక్ టవర్ పేరుతో ఫేమస్. ఇక్కడే మరో మెట్రో స్టేషన్ ఏర్పడనుంది. రాజా రాయ్ రాయన్స్ బహదూర్, రాజా చందూలాల్.. వీరిరువురు కుతుబ్ షాహీల కాలంలో రెవెన్యూ, అడ్మినిష్ట్రేషన్ పనులు చూసేవారు. శాలిబండ వద్ద రాజా రాయ్ రాయన్స్ ప్యాలెస్ ఉండేది. అప్పటి స్థానికుల సౌకర్యార్థం సమయం తెలియడం కోసం 1904లో యురోపియన్ స్టైల్లో ఈ క్లాక్ టవర్ నిర్మితమైంది. నలువైపులా గడియారాలను ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, రోమన్ భాషల్లో గంటల శబ్దంతో నిర్మించారు. 18వ శతాబ్దంలో మిలిటరీ క్వార్టర్స్ ఉండగా.. 19వ శతాబ్దానికల్లా నగరం విస్తరించడంతో నివాస ప్రాంతంగా రూపాంతరం చెందింది. ఎంజీబీఎస్ నుంచి మొదలయ్యే మెట్రో రైలుకు మొదటి మెట్రో స్టేషన్గా దారుషిఫాలోని పాత బల్దియా కార్యాలయాన్ని ఎంపిక చేశారు. జీహెచ్ఎంసీ ఏర్పాటుకు ముందు ఎంసీహెచ్ (మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్)గా ఉండేది. ఎంసీహెచ్ ప్రధాన కార్యాలయం దారుషిఫాలో ఉండేది. కౌన్సిల్ సమావేశాలు ఇక్కడే జరిగేవి. జీహెచ్ఎంసీ ఏర్పడిన అనంతరం ఈ భవనాన్ని కులీకుతుబ్ షా నగరాభివృద్ది సంస్థ(కుడా)కు అప్పగించారు. పాతబస్తీ అభివృద్ది కోసం ప్రత్యేకంగా ఏర్పడిన కుడా భవనం స్థలంలో ఇప్పుడు మెట్రో స్టేషన్ రానుంది. ఈ భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా కుడా అధికారులకు నోటీసులు జారీ చేశారు. -
మరికొన్ని బిల్లులు కామన్
● ట్రేడ్లైసెన్స్, అడ్వర్టయిజ్మెంట్ ఫీజులు సైతం.. ● కార్యాచరణకు సిద్ధమవుతున్న యంత్రాంగం సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆలోచనకనుగుణంగా ఆస్తిపన్ను, వాటర్/డ్రైనేజీ, కరెంట్ బిల్లులు ఒకే చోట నుంచి ఒకేసారి చెల్లించే సదుపాయం కోసం ఇప్పటికే ప్రాథమిక చర్యలు చేపట్టిన అధికారులు.. మరికొన్ని అంశాలను కూడా సంబంధిత ప్లాట్ఫామ్లో పొందుపరచాలని భావిస్తున్నారు. ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య (పీటీఐఎన్)కు సంబంధించిన యజమానుల ఫోన్ నంబర్లను అప్డేట్ చేయడంతో పాటు విద్యుత్ మీటర్లకు సంబంధించిన ఫోన్నంబర్ల మ్యాపింగ్ కూడా చేయనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకే ప్లాట్ఫామ్లో ఇతరత్రా చెల్లింపులకు సంబంధించిన అంశాలను కూడా చేర్చాలని భావించిన వారు జీహెచ్ఎంసీకి సంబంధించి ఇంకా దుకాణాలు నిర్వహించే వారి ట్రేడ్లైసెన్సులు, ప్రకటనల పన్నులు, ఆయా ఉల్లంఘనలకు సంబంధించి చలానాల ద్వారా విధించే పెనాల్టీలను సైతం అదే ప్లాట్ఫామ్లో చేర్చేందుకు సిద్ధమయ్యారు. దుకాణాలు నిర్వహించేవారు ట్రేడ్లైసెన్సులు తీసుకోవాలి.. అలాగే దుకాణాల ముందు ఏర్పాటు చేసే బోర్డులకు ప్రకటనల ఫీజు కూడా చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు రోడ్లపై చెత్త వేసినా, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసినా విధించే పెనాల్టీలు సైతం అందులోనే పొందుపరచాలనుకుంటున్నారు. సొంత ఇళ్ల యజమానులకే పీటీఐఎన్లుండటం తెలిసిందే. అవి ఉండి నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు, పెనాల్టీలను కూడా అదే ప్లాట్ఫామ్లో పొందుపరుస్తారు. మిగతా వారి నుంచి సాధారణ పద్ధతుల్లోనే వసూలు చేస్తారు. రవాణాశాఖకు సంబంధించిన ఉల్లంఘనల పెనాల్టీలను సైతం అదే ప్లాట్ఫామ్లో చేర్చాలని భావిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పీటీఐఎన్, విద్యుత్మీటర్ల నంబర్ల మ్యాపింగ్ ద్వారా నివాస కేటగిరీలో ఉండి వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న భవనాలను గుర్తించనున్నారు. గ్రేటర్ పరిధిలో దాదాపు 9.15 లక్షల విద్యుత్ మీటర్లు వాణిజ్య కేటగిరీలో ఉండగా, వాణిజ్య కేటగిరీలో ఆస్తిపన్ను చెల్లింపులు మాత్రం ఆమేరకు లేవు. ఈ నేప థ్యంలో క్షేత్రస్థాయి సర్వే, మొబైల్ నంబర్ల మ్యాపింగ్తో నివాస కేటగిరీలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాలను గుర్తించి వాణిజ్య కేటగిరీకి మారుస్తారు. తద్వారా జీహెచ్ఎంసీకి ఎంతో ఆదాయం పెరగనుంది. -
దాసారం బస్తీలో ఉద్రిక్తత
సనత్నగర్: దాసారం బస్తీ గుడిసెలకు సంబంధించి కోర్టు స్టే ఆర్డర్ వచ్చిన కొద్దిరోజులకే కొందరు వ్యక్తులు అక్కడి గుడిసెవాసులపై దాడులకు తెగబడ్డారు. దీంతో తమపై దాడి చేసినందుకు నిరసగా ఇద్దరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దాసారం బస్తీ గుడిసెవాసులకు మద్దతుగా కోర్టులో స్టే ఆర్డర్ పత్రాలను ఇటీవల ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ వారికి అందజేశారు. అయితే కొందరు బయటి వ్యక్తులు బుధవారం తెల్లవారుజామున గుడిసెవాసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. తమను ఇక్కడ బతకనివ్వరా..? అంటూ ఇద్దరు వ్యక్తులు ఏకంగా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేయగా నీళ్లు పోసి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం అందరూ కలిసి ఆందోళనకు దిగారు. ఎస్సార్నగర్ పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే వారు దాదాపు గంటల పాటు గుడిసెల ముందు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని.. బలవంతంగా ఖాళీ చేయించుకునేందుకు కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపించారు. విషయం తెలుసుకున్న సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి అక్కడికి చేరుకుని గుడిసెవాసులను పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గుడిసెవాసుల జోలికి వెళ్లవద్దని ఇటీవల కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన కాపీని ఇన్స్పెక్టర్కు ఎమ్మెల్యే అందజేశారు. గుడిసెవాసులపై రాళ్ల దాడి పెట్రోల్ పోసుకుని ఇద్దరి ఆత్మహత్యాయత్నం -
‘డిజిటల్ అరెస్టు’ కేసులో ఢిల్లీ వాసి!
సాక్షి, సిటీబ్యూరో: అమాయకులను డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టి అందినకాడికి దండుకుంటున్న ముఠాలో కీలక పాత్రధారిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో నమోదైన రూ.1.07 కోట్ల మోసం కేసులో ఇతడు నిందితుడని డీసీపీ వి.అరవింద్ బాబు బుధవారం వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఢిల్లీ నివాసి గురుదీప్ సింగ్ అలియాస్ లక్కీ నారంగ్ (42) ను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓవృద్ధుడికి (62) గత ఏడాది అక్టోబర్ 16న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరుతో ఫోన్ వచ్చింది. బాధితుడి ఆధార్ కార్డు వినియోగించిన కొందరు అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారని, దీనిపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేయనున్నామని బెదిరించారు. తీవ్రంగా భయపడ్డ బాధితుడికి వీడియో కాల్ చేసిన నిందితులు డిజిటల్ అరెస్టు చేశామని, నిరంతరం తమ పర్యవేక్షణలో ఉండాలని చెప్తారు. అరెస్ట్ ముప్పు తప్పాలంటే తాము చెప్పిన బ్యాంకు ఖాతాల్లోకి వెరిఫికేషన్ కోసం నగదు డిపాజిట్ చేయాలని నమ్మించారు. ఇలా విడతల వారిగా బాధితుడి నుంచి రూ.1.07 కోట్లు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ కె.ప్రసాదరావు కేసు దర్యాప్తు చేశారు. ఈ నగదు వెళ్లిన బ్యాంకు ఖాతాలను అధ్యయనం చేసిన పోలీసులు గతంలో దీపక్ గెహ్లావత్, ప్రశాంత్ కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి విచారణ నేపథ్యంలోనే ఢిల్లీకి చెందిన గురుదీప్ సింగ్ పేరు వెలుగులోకి వచ్చింది. అక్కడ ట్రావెల్, మనీ ఎక్స్ఛేంజ్ వ్యాపారం నిర్వహించే ఇతగాడు మరికొందరితో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. అమాయకులకు ఎర వేసి, వారి పేరు... వివరాలతో కరెంట్ బ్యాంక్ ఖాతాలను తెరుస్తుంటాడు. బాధితుల నుండి వచ్చే డబ్బును ఈ ఖాతాల్లోకి మళ్లించి డ్రా చేయడం ద్వారా ప్రధాన నిందితులకు అందిస్తుంటాడు. తమ బ్యాంకు ఖాతాలను గురుదీప్కు ఇచ్చినట్లు ఇద్దరు నిందితులు చెప్పడంతో ఇతడినీ అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నారు. నగర వ్యక్తి నుంచి రూ.1.07 కోట్లు స్వాహా రిమాండ్కు తరలించిన సైబర్ క్రైమ్ కాప్స్ -
నిర్లక్ష్యమైతే నిప్పే
● ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాల్సిందే ● ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు ● హైడ్రా కమిషనర్ మార్గదర్శకాలు ● నగరంలో అవగాహన కార్యక్రమాలు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఉదంతాలు.. సమీపిస్తున్న వేసవి.. పరిశీలనలో వెలుగులోకి వచ్చిన అంశాలు.. వెరసీ.. ఫైర్ సేఫ్టీ నిబంధనలపై హైడ్రా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. త్వరలో ఉల్లంఘనులపై చర్యలకు ఉపక్రమిస్తున్న నేపథ్యంలో నిబంధనలు, మార్గదర్శకాలను కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం విడుదల చేశారు. రాజధానిలోని వాణిజ్య భవనాలు, వ్యాపారులు వీటిని కచ్చితంగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నగర వ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న హైడ్రా బృందాలు ఉల్లంఘనులపై మార్చి నుంచి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సెల్లార్లను గోదాంలుగా మార్చకూడదు.. భవనాల సెల్లార్లు కేవలం వాహనాల పార్కింగ్ కోసమే. వీటిని గోదాంలుగా మార్చడం, అక్కడ ఉన్న వస్తువులు పోతాయనే ఉద్దేశంతో గ్రిల్స్ ఏర్పాటు చేసి తాళాలు వేయకూడదు. అక్కడ చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. సెల్లార్లలో వాచ్మెన్ల నివాసాలు, క్యాంటిన్లు, వంట గదులు ఉండకూడదు. సెల్లార్లతో పాటు ర్యాంపులు, కారిడార్లు, మెట్ల మార్గాలు ఖాళీగా ఉంచాలి. వ్యాపారాలకు సంబంధించిన వస్తువులు ఆయా చోట్ల నిలువ ఉంచకూడదు. ఏదైనా జరిగితే ఎటువైపు నుంచి సులభంగా బయటకు వెళ్లగలరనే ఎగ్జిట్ మార్గాలను సూచిస్తూ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. లిఫ్ట్లు ఉన్నా సరే.. మెట్ల మార్గాలను మూసేయకూడదు. షార్ట్ సర్క్యూట్కు అవకాశం లేకుండా... అగ్ని ప్రమాదాలకు ఎక్కువగా షార్ట్ సర్క్యూట్లే కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఉన్న కరెంటు వైర్లు, స్విచ్ బోర్డులు, ప్యానెల్స్నే వాడాలి. విద్యుత్ లైన్లకు ఎర్తింగ్ సరిగా ఉందో లేదో చూసుకోవాలి. భవన విద్యుత్ వినియోగానికి తగ్గట్టు పవర్ కనెక్షన్లు తీసుకోవాలి. కరెంటు స్తంభం నుంచి వచ్చే వైర్లు, వ్యాపార సముదాయానికి విద్యుత్ను సరఫరా చేసే వైర్లను అనుసంధానం చేసే ప్యానల్ బోర్డు వద్ద పొరపాటున నిప్పురవ్వలు పడినా వెంటనే మంటలు అంటుకోకుండా కంకరతో ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేయాలి. ఓవర్లోడ్, వైర్లలో జాయింట్లు లేకుండా చూసుకోవాలి. ఇప్పటికే ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్న హైడ్రా.. ఇకపై శనివారాల్లోనూ ఫోన్–ఇన్ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ వారం నుంచి ఇది ప్రారంభం కానున్నట్లు బుధవారం ప్రకటించింది. సెలవు రోజులు మినహా ప్రతి శనివారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని ప్రజలు 040-29565750, 040-29565759 లకు ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అప్రమత్తం చేసే స్మోక్ డిటెక్టర్లు, మానవ ప్రమేయం లేకుండా మంటలను ఆర్పే వాటర్ స్ప్రింక్లర్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు అందుబాటులో ఉండాలి. అవి పక్కాగా పని చేస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. అక్కడ పని చేసే ప్రతి ఒక్కరికీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగం అవగాహన కల్పించాలి. ప్రమాదం జరిగితే వెంటనే అప్రమత్తం చేసేలా ఫైర్ అలారం రెడ్ బటన్ అందుబాటులో అమర్చాలి. షాపు అలంకరణకు ఉద్దేశించిన వైర్ల జాయింట్లు, సీరియల్ బల్బులు, ఫాల్ సీలింగ్ లైట్లు అమర్చేటప్పడు షార్ట్ సర్క్యూట్కు అవకాశం లేకుండా చూసుకోవాలి. అపార్టుమెంట్లు కింది భాగంలో కార్యకలాపాలు సాగించే సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా, ఎక్కడైనా ఫైర్ నిబంధనల ఉల్లంఘనలు గుర్తిస్తే.. హైడ్రా కంట్రోల్ రూం 90001 13667కు సమాచారం ఇవ్వాలి. -
అన్ని స్థాయిల్లో ప్రక్షాళన
● ఔట్సోర్సింగ్ ఆపరేటర్లకూ బదిలీలు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధి విస్తరణ అవసరాలకనుగుణంగా అధికారులు, సిబ్బంది బదిలీలు చేపట్టిన కమిషనర్ ఆర్వీ కర్ణన్.. ప్రక్షాళన చర్యలకూ శ్రీకారం చుట్టారు. దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అడిషనల్ కమిషనర్లు సహా జాయింట్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, సీనియర్.. జూనియర్.. రికార్డు అసిస్టెంట్ల వరకు భారీ స్థాయిలో బదిలీ చేశారు. అంతేకాదు.. చివరకు ఔట్సోర్సింగ్పై పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను సైతం మూకుమ్ముడిగా బదిలీ చేశారు. జీహెచ్ఎంసీలోని చాలా విభాగాల్లో అధికారుల కంటే ఈ ఆపరేటర్ల ప్రభావమే ఎక్కువ. ఫైళ్లన్నీ ఈ–ఆఫీస్లోనే నడుస్తుండటంతో అవకాశాల్ని ఆసరా చేసుకొని ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడటం గతంలో ఎన్నో సందర్భాల్లో బయటపడింది. కొందరు అధికారుల డిజిటల్ కీలు సైతం ఆపరేటర్ల వద్దే ఉంటాయి. ఆఫీసర్లు చేయాల్సిన పనుల్ని వీరే చేస్తారు. బర్త్, డెత్ సర్టిఫికెట్లు, టెండరు నోటిఫికేషన్లను సైతం జారీ చేసే ఆపరేటర్లున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని.. అలవాటు పడిన స్థానంలో కంటే వేరే ప్రాంతానికి బదిలీచేస్తే.. కొంతకాలమైనా అక్రమాలు ఆగవచ్చనే తలంపుతో వందల సంఖ్యలో ఆపరేటర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. -
కల్లు తాగించి వృద్ధురాలి దారుణహత్య
దుండిగల్: రెండు రోజుల క్రితం జరిగిన వృద్ధురాలి దారుణ హత్య కేసు మిస్టరీని దుండిగల్ పోలీసులు ఛేదించారు. ఓ మహిళ బంగారం కోసం వృద్ధురాలికి కల్లు తాపించి దారుణంగా హత్యచేసింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం ఏసీపీ శంకర్రెడ్డి వివరాలను వెల్లడించారు. చర్చి గాగిల్లాపూర్ ప్రాంతానికి చెందిన సుశీలమ్మ(85)కు ఐదుగురు సంతానం. అందరూ వివిధ ప్రాంతాల్లో ఉంటుండగా సుశీలమ్మ తన మనవడు జీవన్తో కలిసి నివాసముంటోంది. వీరికి ఐదు దుకాణాలు ఉన్నాయి. జీవన్ ఎప్పటిలాగే ఈ నెల 2న ఉద్యోగానికి వెళ్లాడు. ఆరోజ మధ్యాహ్నం ఓ యువకుడు దుకాణం అద్దెకు అడగడానికి సుశీలమ్మ ఇంటికి రాగా రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశాడు. కేసు విచారణలో భాగంగా పోలీసులు స్థానికంగా ఉండే శ్రీకర్రెడ్డి తన ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న సీసీ ఫుటేజీలో సుశీలమ్మ ఇంటికి ఓ మహిళ వచ్చి వెళ్లడాన్ని గుర్తించారు. తలను గోడకేసి బాది.. ఆపై రాయితో మోది.. అదే ప్రాంతానికి చెందిన పి.కవిత(36) గతంలో వృద్ధురాలి ఇంట్లో 15 రోజుల పాటు కూలీగా పని చేసింది. సుశీలమ్మకు కల్లు తాగే అలవాటు ఉండడంతో తరుచూ కల్లు తీసుకువచ్చి ఇస్తుండేది.ఈ క్రమంలో సుశీలమ్మ ఒంటిపై ఉన్న బంగారంపై కవిత కన్ను పడింది. ఈనెల 2న మధ్యాహ్నం కల్లు తీసుకువచ్చిన కవిత సుశీలమ్మతో కలిసి తాగింది.ఆ తరువాత సుశీలమ్మ మైకంలోకి వెళ్లగానే ఆమె తలను గోడకేసి బాదింది. అయినా ఆమె స్పృహలోనే ఉండడంతో రాయితో తలపై మోది హత్య చేసింది. అనంతరం బంగారు చెవి కమ్మలు, ఉంగరం, ముక్కుపుడక (5 గ్రాములు) తీసుకుని పరారైంది. సీసీ కెమెరా ఆధారంగా కవితను గుర్తించి రెండు రోజుల వ్యవధిలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న శ్రీకర్రెడ్డిని ఏసీపీ అభినందించారు. వీడిన హత్య మిస్టరీ బంగారం కోసం ఘాతుకం 5 గ్రాముల నగలు మాయం నిందితురాలి అరెస్ట్ -
ముగిసిన అహ్మద్ పాషా ఖాద్రీ అంత్యక్రియలు
చార్మినార్: అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ అంత్యక్రియలు బుధవారం పాతబస్తీ నూర్ఖాన్బజార్లో ముగిసాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మంత్రి అజారుద్దీన్, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, మీర్ జుల్ఫీకర్ అలీ, మేరాజ్ హుస్సేన్, కౌసర్ మోహియుద్దీన్, మోబిన్, ఎమ్మెల్సీలు మీర్ రియాజుల్ హసన్ హాఫంది, మీర్జా రెహ్మత్ బేగ్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ తదితరులు కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. పాషా ఖాద్రీ అంత్యక్రియలకు వేలాదిమంది హాజరయ్యారు. -
సిటీకి ‘ఔటర్’ టచ్
పునర్వ్యవస్థీకరణ తర్వాత నగరంలోకి కొన్ని ఠాణాలు సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోని పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో హైదరాబాద్ పరిధిలోకీ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వచ్చింది. ఈ ఎక్స్ప్రెస్వే ఒకప్పుడు సైబరాబాద్, రాచకొండల్లో మాత్రమే విస్తరించి ఉండేది. తాజా మార్పుచేర్పులతో దాదాపు 50 కిలోమీటర్లు నగర కమిషనరేట్లోకి వచ్చింది. మరోపక్క కొత్తగా ఆదిభట్లలో ఓ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో పాటు ఇప్పటికే రాజేంద్రనగర్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుస్టేషన్ను అధికారికంగా నోటిఫై చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. అలా విస్తరించి.. 2016 ఆగస్టు వరకు ఔటర్ రింగ్ రోడ్డంతా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిఽధిలోనే ఉండేది. దీని నుంచి వేరు చేస్తూ నగరానికి తూర్పు భాగంలో సైబరాబాద్ ఈస్ట్ ఏర్పడింది. తర్వాత ఇది అధికారికంగా పని చేయడం ప్రారంభమై.. రాచకొండగా పేరు మారింది. అప్పటి నుంచి ఓఆర్ఆర్ సైబరాబాద్తో పాటు రాచకొండలోనూ విస్తరించినట్లయింది. సిటీ పరిధిలోకి రావడంతో.. ‘గ్రేటర్’లోని పోలీసు కమిషనరేట్లు, ఇతర యూనిట్లను గత ఏడాది డిసెంబర్లో పునర్వ్యవస్థీకరణ చేశారు. కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేయడంతో పాటు సైబరాబాద్, రాచకొండల నుంచి కొన్ని ప్రాంతాలను తీసుకువచ్చి హైదరాబాద్లో కలిపారు. ఆదిభట్ల, రాజేంద్రనగర్, శంషాబాద్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్ వచ్చి నగరంలో కలిశాయి. దీంతో వీటి పరిధిలో ఉండే ఓఆర్ఆర్ నగర పరిధిలోకి వచ్చినట్లయింది. మరోపక్క ఓఆర్ఆర్ విస్తరించి ఉన్న కమిషనరేట్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న శాంతిభద్రతలు, ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు హైదరాబాద్లో కలిశాయి. ఇప్పటి వరకు ఆదిభట్ల ప్రాంతం ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ ఠాణా పరిధిలో ఉండేది. తాజా మార్పుచేర్పుల నేపథ్యంలో అక్కడ మరో ట్రాఫిక్ ఠాణా ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అవే పాయింట్లు... అక్కడి సిబ్బందే.. రాజేంద్రనగర్లో కొన్నేళ్లుగా ట్రాఫిక్ ఠాణా ఉన్నప్పటికీ అది అధికారికం కాదు. అవసరాలకు తగ్గట్టు ఉన్నతాధికారులు సర్దుబాటుతో ఏర్పాటు చేశారు. ఈ కారణంగా దానికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సిబ్బంది కేటాయించలేదు. ఇది దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు దాన్ని నోటిఫై చేయించాలని నిర్ణయించారు. అలా అధికారికంగా మారితే దానికీ పోస్టులు మంజూరై సిబ్బంది సంఖ్య పెరుగుతుంది. ఈ రెండు అంశాలతో కూడిన ప్రతిపాదనల్ని నగర అధికారులు ప్రభుత్వానికి పంపారు. సైబరాబాద్, రాచకొండ నుంచి వచ్చి నగరంలో కలిసిన ప్రాంతాల్లోని గతంలో ఉన్న ట్రాఫిక్ పాయింట్లు కొనసాగించనున్నారు. ఏ ప్రాంతం నుంచి ఈ పాయింట్ వచ్చి కలిసిందో ఆ కమిషనరేట్ నుంచే అవసరమైన సంఖ్యలో సిబ్బందినీ నగరానికి కేటాయించనున్నారు. ఇప్పటివరకు అవి సైబరాబాద్. రాచకొండ పరిధుల్లోనే.. కొత్తగా ఆదిభట్లలో పోలీసుస్టేషన్, రాజేంద్రనగర్ నోటిఫై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు -
రూ. 3,405 కోట్లు స్టాండింగ్ కమిటీ ఆమోదించిన పనుల అంచనా వ్యయం ఇది
● 12 రోజుల్లో ముగియనున్న బల్దియా పాలకమండలి గడువు ● అజెండాలో మొత్తం 53 అంశాలు చేర్చగా.. 52కు అంగీకారం సాక్షి, సిటీబ్యూరో: రూ. 3,405 కోట్లు. ఇది ఏ కార్పొరేషన్ బడ్జెటో కాదు. త్వరలో గడువు ముగియనున్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించిన పనుల అంచనా వ్యయం. జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీన ముగిసిపోనున్న తరుణంలో దాదాపు రూ.3,405 కోట్ల పనులకు గురువారం జరిగిన స్టాండింగ్కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం 53 అంశాలను అజెండాలో చేర్చగా ఎగ్జిబిషన్ సొసైటీకి స్థలం అద్దె తగ్గింపు వ్యవహారం తప్ప మిగతావాటిని ఆమోదించింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు, కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. ● పనుల్లో రూ. 3 కోట్ల కంటే ఎక్కువ విలువైన వాటిని కౌన్సిల్ ఆమోదానికి పంపించి అనంతరం ప్రభుత్వానికి నివేదిస్తారు. ● బర్కత్పురా జంక్షన్లో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహం ఏర్పాటు. బైరామల్గూడ ఫ్లైఓవర్ సమీప రోడ్డుకు ఇటీవల మృతిచెందిన కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి పేరు. సమయం లేదు మిత్రమా.. పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులను ప్రారంభోత్సవ కార్యక్రమాలలో తప్పనిసరిగా భాగస్వాముల్ని చేయాలన్నారు. అంతుచిక్కని ఆంతర్యం.. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిన మొత్తం పనుల్లో సీఆర్ఎంపీ–2 కింద రోడ్ల నిర్వహణకు రూ.3,145 కోట్లు అత్యధిక మొత్తం అంచనా వ్యయం కాగా, మిగతావి దాదాపు డజను పనుల అంచనా వ్యయం. 12 రోజుల అధికారమే ఉన్నా.. ఇన్ని పనులకు ఆమోదం వెనుక ఆంతర్యమేమిటో అంతుచిక్కని రహస్యమే. పదేళ్ల కాల పరిమితి పనులకు కూడా ఆమోదం తెలపడమే విచిత్రం. రూ. కోట్ల అంచనా వ్యయమున్న పనుల్లో సీఆర్ఎంపీ కింద రోడ్ల నిర్మాణం, నిర్వహణ అంచనా భారీ మొత్తంలో ఉండగా, కోట్లలో అంచనా వ్యయమున్న వాటిలో మౌలాలీ ఆర్ఓబీ పునరుద్ధరణ, సనత్నగర్, ఫతేనగర్ ప్రాంతాల్లో వరద కాలువలు, సివరేజి లైన్లు, పటేల్నగర్ ఎస్టీపీ నుంచి డీమార్ట్ వరకు రోడ్డు వెడల్పు పనులు ఉన్నాయి. అలాగే.. హయత్నగర్ సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణం, అల్వాల్ సర్కిల్లోని సెలెక్ట్ టాకీస్ నుంచి మచ్చబొల్లారం వరకు రోడ్డు మరమ్మతులు, మసీదుబండ నుంచి బొటానికల్ గార్డెన్ వరకు రహదారి అభివృద్ధి తదితర పనులున్నాయి. -
రోడ్డు భద్రత.. పిల్లలకూ బాధ్యత
రహదారి నిబంధనలపై ట్రాఫిక్ పార్కులతో పాఠాలు సాక్షి, సిటీబ్యూరో రోడ్డుపై ఎలా వెళ్లాలి? భద్రతకు సంబంధించిన నిబంధనలు ఎలా పాటించాలి? పరిమితికి మించిన వేగం వద్దు. సీట్బెల్ట్, హెల్మెట్ ధరించాలి.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయొద్దు. సిగ్నల్ జంపింగ్ చేయొద్దు. మద్యం తాగి బండి నడపొద్దు.. బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.. ఇలా ఎన్నో అంశాలపై పిల్లలకు పెద్దలు రహదారి భద్రత పాఠాలు చెబుతుంటారు. కానీ.. అదే పెద్దలకు పిల్లలతో రోడ్డు భద్రత నియమాలను వివరించేందుకు రవాణా శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. రోడ్డు భద్రతపై పిల్లలే పెద్దలకు పాఠాలు చెప్పేలా ట్రాఫిక్ పార్కుల ఏర్పాటును చేపట్టింది. వీటితో ఒకవైపు చిన్నారుల్లో అవగాహన కల్పిస్తూనే మరోవైపు తమ ఇళ్లల్లో పెద్దలకు జాగ్రత్తలు చెప్పేలా ప్రోత్సహిస్తారు. నగరంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక పార్కు చొప్పున ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. త్వరలో నాంపల్లిలోని ఆలియా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ట్రాఫిక్ పార్కుల ఏర్పాటు కోసం విద్యాసంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ పార్కులు ఎందుకంటే.. ట్రాఫిక్ పార్కులు ఉపయోగపడతాయి. ఒకవైపు పిల్లలకు అవగాహన కల్పిస్తూనే మరోవైపు పెద్దలకు హెచ్చరిలు అందజేస్తాయి. ట్రాఫిక్ నియమాలపై ప్రయోగాత్మకంగా అవగాహన కలిగించేందుకు ట్రాఫిక్ పార్కులు దోహదం చేస్తాయి. రోడ్డు వాతావరణాన్ని ప్రతిబించేలా రూపొందించిన ట్రాఫిక్ పార్కుల్లో వాహనాల రాకపోకలకు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలను పాటించాలో చెబుతారు. ఆర్టీఏ, ట్రాఫిక్ విభాగాలకు చెందిన అధికారుల ద్వారా పిల్లలకు ప్రయోగాత్మక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. పదో తరగతి వరకు చదువుకొని బయటకు వెళ్లే సమయానికి ప్రతి విద్యార్థికి రోడ్డు నియమాలపై అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తల్లిదండ్రుల నుంచి వాగ్దాన పత్రాలు.. రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా ఈసారి రవాణాశాఖ మరో కార్యక్రమాన్ని కూడా విస్తృతంగా చేపట్టింది. అమ్మానాన్న, కుటుంబసభ్యులు రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని, హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరిస్తామని’ పేర్కొంటూ పిల్లల ద్వారా వాగ్దాన పత్రాల సేకరణ చేపట్టింది. ట్రాఫిక్ పార్కులో విద్యార్థులకు రహదారి భద్రతపై పాఠాలు బోధిస్తున్న ఆర్టీఏ సిబ్బంది చిన్నారులే ఇంటి పెద్దలకు జాగ్రత్తలు చెప్పేలా ప్రోత్సాహం రవాణా శాఖ అధికారుల ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ పార్కుల ఏర్పాటుకు విస్తృత కార్యాచరణఏం నేర్పిస్తారంటే... ట్రాఫిక్ నియమాలను సరదాగా, ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. రోడ్డు సూచనలు, సిగ్నల్స్, క్రాసింగ్లను అర్థం చేసుకొనేలా శిక్షణనిస్తారు. రోడ్డు దాటే సమయంలో సురక్షితంగా నడవడం, సైకిల్ తొక్కడం వంటివి అభ్యాసం చేయిస్తారు. చిన్న వయసులోనే బాధ్యతాయుతమైన రోడ్డు వినియోగదారులుగా మారేందుకు అవకాశం కల్పిస్తాయి. ట్రాఫిక్ పార్కులు ప్రతిరోజూ పిల్లలు తమను తాము రక్షించుకొనేలా, భవిష్యత్తులో సురక్షిత డ్రైవర్లుగా, పౌరులుగా తయారయ్యేందుకు దోహదపడతాయి. -
నిరంతర సంస్కరణలతోనే రైల్వే మనుగడ
బన్సీలాల్పేట్: రైల్వే అభివృద్ధి, మనుగడకు నిరంతర సంస్కరణలు, నైపుణ్యాలు కీలక భూమిక పొషిస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీ వాస్తవ అన్నారు. సికింద్రాబాద్ బోయిగూడ రైల్ కళారంగ్లో గురువారం దక్షిణ మధ్య రైల్వే 70వ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు ఉత్పత్తి వంటి కీలక రంగాల్లో నిర్ణీత కాల పరిమితితో కూడిన సంస్కరణలు అవసరమన్నారు. కాలానుగుణంగా సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతూ సంస్థ పురోభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఈ సందర్భంగా జీఎం ..రైల్వే ఉత్తమ సేవలందించిన సిబ్బంది,అధికారులకు సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు జనరల్ మేనేజర్ సత్యప్రకాష్, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఆశిష్ మెహ్రోత్రా పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎంసంజయ్కుమార్ శ్రీ వాస్తవ -
తుది దశకు ‘తరలింపు’
● ప్రభుత్వ భవనాల్లోకి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ● ‘మార్పు’పై స్థానికుల అభ్యంతరాలుసాక్షి, సిటీబ్యూరో: నగర పరిధిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల తరలింపు వ్యవహారం తుదిదశకు చేరుకుంది.అద్దె భవనాల భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అధికారులు కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు నాయకులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. స్థానికంగానే కార్యాలయాలు ఉండాలని కోరుతున్నారు. ● ఇప్పటికే అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లోకి మారనున్నాయి. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆఫీసులను ప్రభుత్వ భవనాల్లోకి మార్చడానికి ప్రభుత్వం విధించిన గడువు శుక్రవారంతో ముగియనుంది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నాయి. ఒక్కో కార్యాలయానికి నెలకు రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ప్రభుత్వం అద్దె చెల్లిస్తోంది. ఇలా ఏటా కోట్లాది రూపాయల ప్రజాధనం ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తుండటంతో ఆర్థిక శాఖ అప్రమత్తమైంది. ఫిబ్రవరి 1 నుంచి ప్రైవేట్ భవనాలకు అద్దెలు చెల్లించబోమని స్పష్టం చేసింది. దీంతో అందుబాటులో ఉన్న సర్కారీ భవనాల్లోకి ఆఫీసులను తరలిస్తున్నారు. నిరసన సెగలు స్థానికంగా అందుబాటులో ఉన్న ఆఫీసులను 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు తరలించడంపై సామాన్యులు మండిపడుతున్నా రు. ఒకవైపు స్థానికంగా అందుబాటులో ఉన్న ఆఫీసులు దూరంగా తరలించవద్దంటూ.. మరోవైపు తమ ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయవద్దంటూ ఆందోళనకు దిగుతున్నారు. ఇబ్రహీంపట్నం కార్యాలయాన్ని మంఖాల్ తుక్కుగూడ సమీపానికి తరలించే ఆలోచనను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కిలోమీటర్ల మేర ప్రయాణం భారమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల తరలింపు ప్రక్రియతో కొన్ని కొత్త చిరునామాలకు మారిపోయాయి. మరికొన్ని తరలింపునకు సిద్ధమవుతున్నాయి. ఎస్ఆర్ నగర్, బాలానగర్ కార్యాలయాలు వెంగళరావునగర్లోని ఆరోగ్య శాఖ భవనంలోకి మార్చారు. బంజారాహిల్స్, గోల్కొండ ఆఫీస్లను తాత్కాలికంగా షేక్పేట ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాంగణాలకు తరలించారు. పాతబస్తీలోని చార్మినార్, ఆజంపురా, దూద్బౌలి ఆఫీస్లు మలక్పేట గంజ్లోని రెవెన్యూ భవనంలోకి తరలించారు. హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని నాంపల్లిలోని గృహకల్ప భవనంలోకి మారింది. మేడ్చల్ పరిధిలోని ఉప్పల్, ఘట్కేసర్ ఆఫీసులను బేగంపేటలోని పాత విమానాశ్రయం సమీపంలో ఉన్న ప్రభుత్వ భవన సముదాయంలోకి లేదా కండ్లకోయకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శేరిలింగంపల్లి, గండిపేట వంటి ఆఫీసులను గచ్చిబౌలిలోని ‘తాలిమ్’ భవనంలోకి తరలించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
‘హెల్మెట్ లేకపోతే.. యమపురికే’
● రహదారి భద్రతపై ఆర్టీఏ వినూత్న ప్రచారం నాగోలు : ‘తస్మాత్ జాగ్రత్త..హెల్మెట్ లేకుండా బండి నడిపితే నేరుగా యమలోకానికే వెళ్తారు..’ సాధారణంగా రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు అక్కడక్కడా కనిపించే నినాదం ఇది. అయితే యముడి రూపంలో ఓ వ్యక్తి.. హెల్మెట్ లేకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురైతే తీసుకెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరిస్తూ వినూత్న ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ ఆర్టీఏ నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై గురువారం అలాంటి వినూత్నమైన ప్రచారాన్ని నిర్వహించారు. డాక్టర్ గురువారెడ్డి సారథ్యంలోని సర్వేజన ఫౌండేషన్ సంస్థకు చెందిన కళాకారులు ఈ ప్రచారాన్ని నిర్వహించింది. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నాగోల్లో ఏర్పాటు చేశారు. -
సైబర్ క్రైం అధికారినంటూ మోసం
● అమాయకులనుంచి డబ్బు వసూలు ● నిందితుడి అరెస్ట్ అమీర్పేట: సైబర్ క్రైమ్ పోలీసు అధికారినంటూ అమాయకులను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న అంతర్రాష్ట్ర నేరగాడిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 44 కేసులు నమోదయ్యాయి. ఎస్ఆర్నగర్ ఏసీపీ రాఘవేంద్రరావు తెలిపిన మేరకు.. వరంగల్ జిల్లా పరకాల పులిగిల్లకు చెందిన జాల సాయిరామ్రెడ్డి బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడు. ప్రస్తుతం కరీంనగర్లో ఉంటున్న సాయిరామ్ రాపిడో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు సైబర్ నేరాల బాట పట్టాడు.సోషల్ మీడియా కేంద్రంగా అమ్మాయిల పేరుతో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి యువకులకు వలవేస్తాడు. వారి ఫోన్ నెంబర్లు సేకరించి.. ఆ తరువాత సైబర్ క్రైమ్ పోలీసు అధికారినంటూ ఫోన్ చేస్తాడు. ఆన్లైన్లో అసభ్యకర పనులు చేస్తున్నారు..మీపై కేసు నమోదైందని భయపెట్టి అరెస్టు కాకుండా ఉండాలంటే ఫైన్ కట్టాలని డిమాండ్ చేసి డిజిటల్ మార్గాల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఆపై డిజిటల్ ఆధారాలు దొరక్కుండా వారి ఫోన్లను రీ సెట్ చేయిస్తాడు. తాజాగా ఎస్ఆర్నగర్లో ఓ విద్యార్థిని భయపెట్టి రూ.97,540 వసూలు చేయడంతో బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన ఎస్ఆర్నగర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నింధితుడిని ఎట్టకేలకు అరెస్టు చేశారు. -
పారిశ్రామిక రంగంలో యువతకు ప్రోత్సాహం
అఖిల భారత ఆర్య వైశ్య పారిశ్రామికవేత్తల ఫోరం హిమాయత్నగర్: దేశ ఆర్థికాభివృద్ధికి రెండు దశాబ్దాలకు పైగా కృషి చేస్తున్న అఖిల భారత ఆర్య వైశ్య పారిశ్రామికవేత్తల ఫోరం (ఏఐఎవీఐఎఫ్) రజతోత్సవాలను ఫిబ్రవరి 1న నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ‘ప్రధాన్ కన్వెన్షన్’లో నిర్వహించనున్నట్లు ఏఐఎవీఐఎఫ్ అధ్యక్షుడు రాంబాబు పబ్బిశెట్టి తెలిపారు. గురువారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... 25 ఏళ్లుగా యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో రానున్న రోజుల్లో యువతకు పారిశ్రామిక రంగంలో మెళకువలు నేర్పించడంతో పాటు ఎంఎస్ఏంఈలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. వేడుకలకు తెలంగాణ, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టి.జి.భరత్, నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. ఇందులో పారిశ్రామిక రంగం పట్ల యువతలో ఆసక్తిని పెంపొందించేందుకు 50 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఫోరం నేతలు శ్రీనివాస్ బత్తుల, కాశీవిశ్వనాథం చింత, విజయ ప్రసాద్ గుంపల్లి, మంచి రాజశేఖర్, ఎర్రం బాలకృష్ణ పాల్గొన్నారు. -
జలమండలి ఎండీకి వినతిపత్రం
సాక్షి, సిటీబ్యూరో: వాటర్బోర్డు పరిధిలోని ఔట్సోర్సింగ్ మీటర్ రీడర్ల పోస్టుల మంజూరుపై ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. గురువారం జలమండలి ప్రధానం కార్యాలయం ముందు సుమారు 673 మంది ఔట్సోర్సింగ్ మీటర్ రీడర్ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు ఎండీ అశోక్రెడ్డి, ఈడీ మాయంక్ మిట్టల్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన వారు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఔట్ సోర్సింగ్జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మందాల బాలకష్ణ రెడ్డి ,దేశపాక శ్రీనివాస్, టీజేఎస్ పార్టీ నాయకులు,రమేష్,ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
‘కండల ఇంజెక్షన్ల’పై నిఘా !
సాక్షి, సిటీబ్యూరో: కండల కోసం జిమ్లకు వెళ్తున్న యువతను టార్గెట్గా చేసుకుని, వైద్యుల సిఫార్సు లేకుండా, అక్రమంగా స్టెరాయిడ్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న ముఠాలపై హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా ఉంచారు. గత వారం ఓ వ్యక్తి చిక్కగా తాజాగా పశ్చిమ మండల అధికారులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. ఇతడి నుంచి రూ.1.20 లక్షల విలువైన 120 బాటిళ్ల మెఫెంటైర్మెన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ గురువారం వెల్లడించారు. జిర్రాకు చెందిన రషీద్ మత్లూబ్ ఖాన్ వృత్తి రీత్యా జిమ్ ట్రైనర్. ఇతగాడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బాడీ బిల్డింగ్ చేసే యువతను లక్ష్యంగా చేసుకున్నాడు. కండలు త్వరగా పెరగాలని కోరుకునే యువకులకు ఎలాంటి లైసెన్స్, డాక్టర్ సలహా, సిఫార్సు లేకుండా ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ విక్రయిస్తున్నాడు. వీటిని గుజరాత్లోని సూరత్ నుంచి ’ఇండియా మార్ట్’ ఖరీదు చేస్తున్నాడు. తన భార్య పేరుతో కొరియర్ ద్వారా నగరానికి రప్పిస్తున్నాడు. ఇతగాడు ఎక్కువగా మెఫెంటైర్మెన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్నాడు. వీటిని సాధారణంగా లోబీపీ ఉన్న వారికి చికిత్స కోసం వాడతారు. యువత వీటిని బాడీ బిల్డింగ్ కోసం వాడి ప్రాణాంతకమైన గుండె, కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమాచారం అందుకున్న వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ యుగంధర్, ఎస్సై ఎండీ జాహెద్లతో కూడిన బృందం వలపన్ని రషీద్ను పట్టుకుంది. కొన్నాళ్లుగా ఇదే దందా చేస్తున్న ఇతడిపై అత్తాపూర్, అబిడ్స్, టప్పాచబుత్రా పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 20 ఇంజక్షన్ బాటిళ్లు స్వాధీనం.. చాంద్రాయణగుట్ట: స్టెరాయిడ్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న యువకుడిని దక్షిణ మండలం టాస్క్ఫోర్స్, ఫలక్నుమా పోలీసులు గురువారం సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నగర టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసారావు తెలిపిన మేరకు..ఫలక్నుమాకు చెందిన అబ్దుల్ గఫార్ ఖాన్(30) బార్కాస్ ప్రాంతానికి చెందిన అహ్మద్ నహదీ అనే వ్యక్తి వద్ద ‘మెఫెంటైర్మెన్ సల్ఫేట్’ అనే స్టెరాయిడ్స్ను తక్కువ ధరకు కొనుగోలు చేసి, త్వరగా కండలు పెరగాలని కోరుకునే యువతకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.ఆదిరెడ్డి, ఎస్ఐలు ఎస్.శేషు, ఎం.మహేష్ల బృందం ఫలక్నుమా పోలీసులతో కలిసి నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.24 వేల విలువజేసే 20 ఇంజక్షన్ బాటిళ్లు, ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు నహదీ పరారీలో ఉన్నాడు. -
ఇదేం పద్ధతి.. కిందకూర్చోబెట్టి చదివిస్తారా?
బంజారాహిల్స్: ‘‘ఈ రోజుల్లో కూడా పిల్లల్ని కింద కూర్చొబెట్టి ఎలా చదివిస్తున్నారు.. అధికారులు అసలు ఏం చేస్తున్నారు?’’ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని ఉదయ్నగర్లోని ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే దానం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలు నేలపై కూర్చొని పాఠాలు వింటున్న విద్యార్థులను చూసి చలించిపోయారు. వెంటనే హెచ్ఎంను రావాలని కోరారు. అయితే హెచ్ఎం.. సమావేవానికి వెల్లారని టీచర్లు చెప్పారు. దీంతో డీఈఓ రోహిణికి వీడియో కాల్ చేసి పిల్లల పరిస్థితిని వివరించారు. ‘‘మేడం ఈ పిల్లల పరిస్థితిని చూడండి.. కింద కూర్చొని చదువుతున్నారు’’ అని పేర్కొన్నారు. కనీసం స్కూల్లో గ్రీన్ బోర్డులు లేవు, తాగునీటి వసతి లేదు అని మండిపడ్డారు. తాను ఈ స్కూల్ గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడానని అయినా కూడా అధికారులకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. పిల్లలను కిందకూర్చొపెట్టి ఎలా చదువు చెబుతున్నారని.. వాళ్ళను చూస్తుంటే చాలా బాధగా ఉందని అన్నారు. వెంటనే విద్యార్థుల కోసం తాత్కాలికంగా షెడ్డు అయినా నిర్మించాలని కోరారు. అందుకు నిధుల విడుదలలో జాప్యం ఉంటే తన మిత్రులతో మాట్లాడి సీఎస్ఆర్ నిధులు కానీ లేదంటే తానే స్వయంగా ఇస్తానని అన్నారు. వెంటనే షెడ్డు నిర్మాణంతో పాటు స్కూల్లో గ్రీన్బోర్డులు, మంచినీటి కోసం ఆర్వో మిషన్ను ఏర్పాటు చేయాలని డీఈవోకు సూచించారు. డీఈవోకు వీడియో కాల్ చేసిన దానం ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం -
తవ్వేస్తే.. తొవ్వేదీ !
ఇళ్ల ముందే గుంతలు..ఎన్నడు తీరేనో చింతలుఅంబర్పేట్ డివిజన్ నింబోలిఅడ్డాలోని రహదారి ఇది. కొన్ని నెలల క్రితమే ఇలా తవ్విపోశారు. ఇప్పటికీ మళ్లీ కొత్తగా రోడ్డు వేయలేదు. దీంతో ఈ దారిలో ఓ టిఫిన్ సెంటర్తో పాటు ఇతర దుకాణాలు మూతపడ్డాయి. వ్యాపారాలు దెబ్బతిన్నాయని, ఉపాధి కోల్పోయామని పలువురు లబోదిబోమంటున్నారు. యూసుఫ్ గూడ గణపతి కాంప్లెక్స్ నుంచి మధురానగర్ వెళ్లే రోడ్డును మూడు నెలల క్రితం తవ్వి మరమ్మతుల మాటే మరిచారు. డ్రైనేజీ నీరు బయటకు వచ్చి ఈ రోడ్డంతా గుంతలతో అధ్వానంగా మారింది.దుండిగల్ సర్కిల్ బౌరంపేట్ డివిజన్లోని సుకృతి హోమ్స్ పరిధిలోని రహదారిని ఏడాది కిత్రం అండర్ గ్రౌండ్ నిర్మాణం కోసం తవ్వేసి వదిలేశారు. అధికారులు పత్తా లేకుండా పోయారు. ఇళ్ల ముందే గుంతలు ఉండటంతో చిన్నారులు, మహిళలు కిందపడి గాయాల పాలవుతున్నారు. వెంటనే వీటిని పూడ్చి తమ వెతలు తీర్చాలని స్థానికులు వేడుకుంటున్నారు. దుకాణాల ఎదుట దిబ్బ.. ఉపాధిపై దెబ్బ -
24 డివిజన్లు, 73 ఠాణాలు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. ప్రాథమిక జాబితాలో స్వల్ప మార్పుచేర్పులతో ఖరారైన తుది జాబితాను ఉన్నతాధికారులు గురువారం విడుదల చేశారు. సిటీలో ఏడు జోన్లు, 24 డివిజన్లు, 73 పోలీసుస్టేషన్లు ఉండనున్నాయి. ఒకప్పుడు నార్త్జోన్, ప్రస్తుతం సికింద్రాబాద్ జోన్లో మార్కెట్ ఠాణాను కొనసాగించనున్నారు. తాజా మార్పుచేర్పులతో 15 పోలీసుస్టేషన్లతో చార్మినార్ జోన్ పెద్దదిగా... 5 ఠాణాలతో శంషాబాద్ చిన్నదిగా మారింది. జోన్లు, డివిజన్లు, ఠాణాలు ఇలా... ● చార్మినార్ జోన్లో.. చార్మినార్, మలక్పేట, మీర్చౌక్, సైదాబాద్, సంతోష్నగర్ (ఐదు) డివిజన్లు... వీటి పరిధిలో చార్మినార్, హుస్సేనిఆలం, మొఘల్పుర, శాలిబండ, మలక్పేట, చాదర్ఘాట్, డబీర్పుర, మీర్చౌక్, భవానీనగర్, రెయిన్బజార్, మాదన్నపేట, సైదాబాద్, సంతోష్నగర్, ఐఎస్ సదన్, ఛత్రినాక (15) ఠాణాలు. ● గోల్కొండ జోన్లో.. ఆసిఫ్నగర్, గోషామహల్, కుల్సుంపుర, టోలిచౌకి (నాలుగు) డివిజన్లు... వీటిలో ఆసిఫ్నగర్, మెహదీపట్నం, హబీబ్నగర్, మాసబ్ట్యాంక్, బేగంబజార్, ఆఫ్జల్గంజ్, గోషామహల్, మంగళ్హాట్, గుడిమల్కాపూర్, కుల్సుంపుర, టప్పాచబుత్ర, గోల్కొండ, టోలిచౌకి, లంగర్హౌస్ (14) పోలీసుస్టేషన్లు. ● జూబ్లీహిల్స్ జోన్లో.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్సార్నగర్ (మూడు) డివిజన్లు... వీటి పరిధిలో మధురనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, ఎస్సార్నగర్, బోరబండ, సనత్నగర్ (ఆరు) ఠాణాలు. ● ఖైరతాబాద్ జోన్లో.. అబిడ్స్, పంజగుట్ట, సైఫాబాద్, సుల్తాన్బజార్ (నాలుగు) డివిజన్లు... వీటిలో నాంపల్లి, అబిడ్స్, ఖైరతాబాద్, పంజగుట్ట, లేక్, సైఫాబాద్, నారాయణగూడ, సుల్తాన్బజార్ (ఎనిమిది) ఠాణాలు. ● రాజేంద్రనగర్లో.. చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, రాజేంద్రనగర్ (మూడు) డివిజన్లు... వీటి పరిధిలో చాంద్రాయణగుట్ట, ఫలక్నుమ, బండ్లగూడ, కంచన్బాగ్, కామాటిపుర, బహదూర్పుర, కాలాపత్తర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, రాజేంద్రనగర్ (పది) ఠాణాలు. ● సికింద్రాబాద్లో.. చిక్కడపల్లి, చిలకలగూడ, గాంధీనగర్, మహంకాళి, ఉస్మానియా యూనివర్శిటీ (ఐదు) డివిజన్లు... చిక్కడపల్లి, ముషీరాబాద్, కాచిగూడ, లాలాగూడ, చిలకలగూడ, వారాసిగూడ, దోమలగూడ, గాంధీనగర్, రామ్గోపాల్పేట్, మహంకాళి, మార్కెట్, అంబర్పేట, ఓయూ, నల్లకుంట (14) ఠాణాలు. ● శంషాబాద్లో.. ఆదిభట్ల, ఆర్జీఐఏ (రెండు) డివిజన్లు... ఆదిభట్ల, బాలాపూర్, బడంగ్పేట్, పహాడీషరీఫ్, ఆర్జీఐఏ (ఐదు) పోలీసుస్టేషన్లు.నగర కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ పూర్తి పెద్ద జోన్గా చార్మినార్, చిన్నదిగా శంషాబాద్ -
25 ఆర్టీసీ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు
ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని 25 ఆర్టీసీ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో టీజీఎస్ఆర్టీసీ సీఎండీ వై.నాగిరెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీలు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఆర్టీసీ గ్రేటర్ జిల్లాల్లో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని భావిస్తోంది. వీటి కోసం ఆర్టీసీ డిపోల్లో ఈవీ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు 124 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అంచనా వేసింది. చార్జింగ్ పాయింట్ల కోసం ఆర్టీసీ నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించి, ఫిబ్రవరి 1లోగా అంచనాలు రూపొందించాలని సీఎండీ ముషారఫ్ ఫారూఖీ సంబంధిత అధికారులను ఆదేశించారు. -
హీటెక్కిన మీటర్..
గ్రేటర్లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ వేసవి కార్యాచరణలో టీజీఎస్పీడీసీఎల్ సాక్షి, సిటీబ్యూరో గ్రేటర్ జిల్లాల్లో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. సాధారణంగా మార్చి మొదటి వారంలో నమోదు కావాల్సిన విద్యుత్ డిమాండ్ జనవరి మూడో వారంలోనే వెలుగు చూస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే.. ఏప్రిల్ చివరి నాటికి గ్రేటర్ ఫీక్ విద్యుత్ డిమాండ్ 5 వేల మెగా వాట్లకు చేరుకోనున్నట్లు డిస్కం అంచనా వేసింది. వేసవి కార్యాచరణలో భాగంగా ఇప్పటికే ఓవర్ లోడుతో ఉన్న సబ్స్టేషన్లు/ ఫీడర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి, ఆ మే రకు వాటి సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రతి నెలా 35 వేల కొత్త కనెక్షన్లు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 67.95 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 55.98 లక్షల గృహ, 9.15 లక్షల వాణిజ్య, 38 వేల పారిశ్రామిక, 1.53 లక్షల వ్యవసాయ, మరో 90 వేలకుపైగా ఇతర కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ప్రతి నెలా కొత్తగా మరో 35 వేల కనెక్షన్లు ఉంటున్నాయి. ఈసారి వేసవి ఎండలు భగ్గున మండే అవకాశం ఉండటంతో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు డిస్కం అంచనా వేసింది. సబ్స్టేషన్లలోని పీటీఆర్లు, ఫీడర్లు, డీటీఆర్ల సామర్థ్యం పెంచే పనిలో నిమగ్నమైంది. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా చూస్తున్నామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ స్పష్టంచేశారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో చేపట్టే అదనపు పనులు జోన్ల వారీగా.. అంశం మెట్రో మేడ్చల్ రంగారెడ్డి కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 716 1483 1158 పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు 36 58 69 కొత్తగా ఏర్పాటు చేయనున్న 11 కేవీ ఫీడర్లు 122 187 218 కొత్తగా ఏర్పాటు చేయనున్న 33 కేవీ ఫీడర్లు 37 28 53 తేదీ మెగావాట్లు 18 2675 19 3196 20 3345 21 3385 22 3375 -
వికేంద్రీకృత జల నిర్వహణతోనే నగర భవిష్యత్
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సాక్షి, సిటీబ్యూరో: మహా నగరానికి దీర్ఘకాలిక జల భద్రత, వరదల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా వికేంద్రీకృత జల నిర్వహణ కీలకమని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. గురువారం జీహెచ్ఎంసీ, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ)తో కలిసి సీఐఐ (సోహ్రాబ్జీ గ్రీన్ బిజినెస్ సెంటర్)లో నీటి విడుదల, మురుగు నీరు, వర్షపు నీటి నిర్వహణపై స్టేక్హోల్డర్ ఇంటరాక్షన్ అండ్ బ్రెయిన్స్టార్మింగ్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా జీహెచ్ ఎంసీ వరద కాలువలు, సీవరేజ్ వ్యవస్థ బలోపేతం, నాలాల అభివృద్ధిపై భారీగా నిధులు వెచ్చించిదన్నారు. పెరుగుతున్న నగరీకరణ, మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో మౌలిక వసతుల విస్తరణ మాత్రమే సరిపోదని వెల్లడైందని చెప్పారు. డీసెంట్రలైజ్డ్ విధానంలో నీటిని నిల్వ చేసి పునర్వినియోగం చేయడమే వరద ముప్పునకు మొదటి రక్షణ కవచం కానుందన్నారు. -
‘హైదరాబాద్ వన్’.. ఈజీ జర్నీ
● లాస్ట్మైల్ కనెక్టివిటీ లక్ష్యంగా కాంబీ టికెట్ ● హెచ్ఎండీఏ అనుబంధ హుమ్టా ప్రణాళికలు ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్లకు ఒకే టికెట్సాక్షి, సిటీబ్యూరో: రైలు, బస్సు, మెట్రో ఏదైనా సరే టికెట్ మాత్రం ఒకటే. జేబులో డబ్బులున్నా.. లేకున్నా.. ఈ టికెట్ ఉంటే చాలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకై నా ఈజీగా ప్రయాణం చేయొచ్చు.అప్పటికప్పుడు ఏది అందుబాటులో ఉంటే అందులో ఎక్కేయొచ్చు. వివిధ రకాల ప్రజారవాణా సదుపాయాలను ప్రయాణికులకు సమగ్రంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదించిన కాంబినేషన్ టికెట్ త్వరలో వినియోగంలోకి రానుంది. ‘హైదరాబాద్ వన్’ కాంబినేషన్ టికెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. త్వరలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) కోసం టెండర్లను ఆహ్వానించనున్నట్లు హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ హుమ్టా అధికారులు తెలిపారు. ‘హైదరాబాద్ వన్ టికెట్ ’ కాంబినేషన్గా ప్రవేశపట్టాలా లేక మొబైల్ యాప్ రూపంలో అందుబాటులోకి తీసుకురావాలా? అనే అంశంపైన స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో నగరంలోని 51 ఎంఎంటీఎస్ స్టేషన్లకు సిటీబస్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మెట్రో నుంచి సిటీబస్సుల్లోకి మారేందుకు పలు స్టేషన్ల వద్ద సదుపాయం ఉన్నప్పటికీ కాంబినేషన్ టిక్కెట్ లేకపోవడంతో ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక సదుపాయాన్ని మాత్రమే వినియోగించుకుంటున్న క్రమంలో లాస్ట్మైల్ కనెక్టివిటీ సదుపాయం లభించడం లేదు. వివిధ రకాల సర్వీసుల మధ్య కనెక్టివిటీని పెంచడంతో పాటు ‘హైదరాబాద్ వన్’ కాంబి టికెట్ను ప్రవేశపెడితే ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. -
చుక్కేశారు..చిక్కారు
● ‘స్పెషల్ డ్రైవ్’లో పట్టుబడ్డ 270 మంది సాక్షి, సిటీబ్యూరో: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి చెక్ చెప్పడానికి గత నెల 24 నుంచి 31 వరకు ఇవి కొనసాగాయి. ఈ తనిఖీల్లో చిక్కిన ‘నిషా’చరుల్లో 270 మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు సిటీ ట్రాఫిక్ చీఫ్ బి.జోయల్ డెవిస్ గురువారం వెల్లడించారు. స్పెషల్ డ్రైవ్లో చిక్కిన వారికి ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో (టీటీఐ) అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆపై న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న కోర్టు 270 మందిని దోషులుగా నిర్ధారిస్తూ జైలు శిక్ష విధించింది. దీంతో ట్రాఫిక్ విభాగం అధికారులు వారిని జైలుకు తరలించారని జోయల్ డెవిస్ తెలిపారు. వీళ్లు పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు, వారు విద్యనభ్యసిస్తున్న విద్యా సంస్థలకు లేఖలు రాస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కోరతామని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి నాగోలు/జీడిమెట్ల : నగరంలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. నాగోలు, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ సంఘటనలు జరిగాయి. ● నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపిన మేరకు.. హయత్నగర్ రవి నారాయణ రెడ్డి నగర్ కాలనీకి చెందిన సిద్ధులు (34) బుధవారం రాత్రి ఆటోలో ఇంటికి వెళుతున్నాడు. భారత్ పెట్రోల్ బంక్ వద్ద గౌరెల్లి వైపు నుండి వచ్చిన మరో ఆటో వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో సిద్దులు తీవ్రంగా గాయపడగా 108 అంబులెన్స్లో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఢీకొట్టిన ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ● ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికి అక్కడే మృతిచెందాడు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ తెలిపిన మేరకు.. జగద్గిరిగుట్ట పాపిరెడ్డినగర్కు చెందిన విష్ణువర్ధన్రెడ్డి (23) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు బుధవారం రాత్రి విష్ణువర్ధన్రెడ్డి స్నేహితుడు దిలీప్రెడ్డితో కలిసి షాపూర్నగర్ నుండి చింతల్ వైపు బైక్పై వెళ్తున్నాడు. ఈక్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో విష్ణువర్ధన్రెడ్డి అక్కడికి అక్కడే మృతిచెందాడు.తీవ్రంగా గాయపడ్డ దిలీప్రెడ్డి అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంటి యజమానిని గొడ్డలితో నరికి.. ● గౌడవెల్లిలో దారుణ హత్య మేడ్చల్ రూరల్: ఇంటి యజమానినే గొడ్డలితో నరికి చంపాడో వ్యక్తి. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని గౌడవెల్లి గ్రామానికి చెందిన గోమారం లక్ష్మారెడ్డి (42) పెయింటర్గా జీవనం సాగిస్తున్నాడు. ఇతని ఇంట్లో మలిగ లింగం (50) అద్దెకు ఉంటున్నాడు. ఇద్దరూ కలిసి బుధవారం రాత్రి ఇంట్లో మద్యం తాగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఉన్న లింగం అందుబాటులో ఉన్న గొడ్డలితో లక్ష్మారెడ్డిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆయన తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి, నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. కటకటాల్లోకి భార్యాహంతకుడు రహమత్నగర్: భార్యను కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని బోరబండ పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బోరబండ ఎస్హెచ్ఓ సురేందర్ గురువారం ఈ వివరాలను వెల్లడించారు. రహమత్నగర్ డివిజన్ రాజీవ్గాంధీనగర్లో సోమవారం ఆంజనేయులు అనే వ్యక్తి రోకలి బండతో కొట్టి భార్యను హత్య చేసి అదే రాత్రి షోలాపూర్ పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు ముగ్గురితో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. షోలాపుర్ నుంచి తన సొంత గ్రామమెన చింతకుంటకు ఆంజనేయులు వచ్చాడన్న సమాచారంతో పోలీసుల బృందం అక్కడికి చేరుకుని ఆదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆంజనేయులును గురువారం రిమాండ్ తరలించామని ఎస్హెచ్ఓ సురేందర్ వెల్లడించారు. -
గంటలోపే పట్టేశారు
● స్నాచర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్: గొలుసు దొంగతనం జరిగిన గంట వ్యవధిలోనే పోలీసులు వల పన్ని స్నాచర్ను పట్టుకున్నారు. ఈ ఘటన ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహావీర్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న ఉమా(37) తన భర్తతో కలిసి గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సోమాజిగూడ నుంచి పంజగుట్ట వైపు వెళ్తున్నారు. మెట్రో పిల్లర్ నెంబర్ ఏ–1156 వద్ద వెనుక నుంచి బైక్పై వచ్చిన ఓ యువకుడు ఉమా హ్యాండ్బ్యాగ్ను లాక్కొని పరారయ్యాడు. అందులో మొబైల్ ఫోన్తో పాటు రూ. 7,000 నగదు ఉంది. బాధితురాలు వెంటనే ఖైరతాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో డీఐ సైదులు స్పందించి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ కె.శిల్పవల్లి, పంజగుట్ట ఏసీపీ పి.మురళీకృష్ణ కూడా అక్కడికి చేరుకుని వివరాలు ఆరా తీసి పోలీసులకు తగిన సూచనలు జారీ చేశారు. ఖైరతాబాద్ డీఎస్ఐ ప్రణీత్తో పాటు క్రైమ్ సిబ్బంది రంగంలోకి దిగి సీసీ ఫుటేజీలు పరిశీలించి బైక్ నెంబర్ గుర్తించి నిందితుడిని కనిపెట్టారు. దీంతో గంట వ్యవధిలోనే నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడు కొంతం సాయికిరణ్(22)గా తేలింది. కుషాయిగూడకు చెందిన నిందితుడు మద్యం కొనుగోలు చేసేందుకు ఉదయం నుంచే బైక్పై తిరుగుతూ ఈ స్నాచింగ్ చేశాడని విచారణలో తేలింది. ఖైరతాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నో పార్కింగ్ ప్లీజ్ !
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరభివృద్ధి పనుల్లో భాగంగా ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు వాహనాల పార్కింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికులు తమ వాహనాలను 10వ నెంబర్ వద్ద పార్క్చేయాలని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ సూచించారు. స్టేషన్ ప్రాంగణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఒకటో నెంబర్ వద్ద పార్కింగ్ను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ తక్కువ సమయంలో వాహన రాకపోకలను( పికప్ అండ్ డ్రాప్) సదుపాయాన్ని అనుమతించనున్నారు. పదో నెంబర్ వైపు అనధికార పార్కింగ్, వాహనాల అడ్డంకులను నివారించేందుకు యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ను అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు ప్రయాణికులకు 15 నిమిషాల వరకు ఉచిత పికప్ అండ్ డ్రాప్ సదుపాయం కల్పించారు. ఇదిలా ఉండగా మరోవైపు పదో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు బేస్మెంట్లో నాలుగు చక్రాల, ద్విచక్ర వాహనాలకు తగిన పార్కింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. డిసెంబర్ పనులు పూర్తి... ప్రస్తుతం సికింద్రాబాద్ రీడెవపల్మెంట్ పనులు 50 శాతం పూర్తయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో పనులను వేగంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు మల్టీలెవెల్ కార్ పార్కింగ్, 10వ నెంబర్ వైపు బేస్మెంట్ పార్కింగ్ సదుపాయం అందుబాటులోకి రానున్నాయి. ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద పార్కింగ్ నిలిపివేత ప్లాట్ఫామ్–10 వద్ద పార్కింగ్ సదుపాయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద మార్పులు -
అడ్మిషన్స్ ఫర్ సేల్
అప్పుడే కార్పొరేట్ స్కూళ్లలో అడ్మిషన్ల జాతర షురూమహానగరంలో అడ్మిషన్ల జాతర మొదలైంది.. ఆఫర్లు..డిస్కౌంట్ల పేరుతో తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ కార్పొరేట్ పాఠశాలలు బుట్టలో వేసుకుంటున్నాయి. లక్షల రూపాయల ఫీజు చెప్పి.. ఆ తరువాత ఆఫర్ల పేరిట నామమాత్రం తగ్గిస్తూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కార్పొరేట్ మాయాజాలంలో పడ్డ అమాయక తల్లిదండ్రులు నిలువునా మోసపోతున్నారు. – సాక్షి, సిటీ బ్యూరో మహానగరంలో విద్యా వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. వార్షిక పరీక్షల సందడి మొదలవ్వకముందే వచ్చే విద్యా సంవత్సరానికి (2026–27) కార్పొరేట్ పాఠశాలలు అడ్మిషన్ల జాతరను ప్రారంభించాయి. ‘వసంత పంచమి’ని కూడా మార్కెటింగ్ అస్త్రంగా మార్చుకుంటూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. అప్పుడే విద్యా సంస్థల మధ్య పోటీ పతాక స్థాయికి చేరింది. ● సాధారణంగా వేసవి సెలవుల్లో మొదలవ్వాల్సిన అడ్మిషన్ల ప్రక్రియ ఈసారి జనవరి నుంచే ముమ్మరమైంది. సిలబస్ పూర్తి కాకముందే సీట్ల వేటలో పడి తల్లిదండ్రులను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. కొత్త విద్యా సంవత్సర ప్రారంభం కావడంతో ‘న్యూ ఇయర్ డ్రైవ్’ పేరుతో రంగంలోకి దిగిన కొన్ని విద్యా సంస్థలు, ఇప్పుడు ‘వసంత పంచమి స్పెషల్ డ్రైవ్’ అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నాయి. ‘నో డొనేషన్్ – ఫ్రీ అడ్మిషన్న్‘ వంటి ఆకర్షణీయమైన స్లోగన్లతో హోరెత్తిస్తున్నాయి. ఇపుడే అడ్మిషన్ పొందితే ట్యూషన్న్ ఫీజులో 20 శాతం రాయితీ ఇస్తామంటూ బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇది విద్యాబోధనలా కాకుండా, ఏదో షాపింగ్ మాల్ సేల్ను తలపిస్తోందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. గుర్తింపు లేకున్నా.. ఆగని ప్రచారం ● విద్యాశాఖ నిబంధనలను బేఖాతరు చేస్తూ కొన్ని సంస్థలు చెలరేగిపోతున్నాయి. ఒక విద్యా సంస్థకు అనుమతి లేదని, అందులో ప్రవేశాలు తీసుకో వద్దని ఏకంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల విధ్యాశాఖాధికారులు అధికారికంగా ప్రకటించినప్పటికీ అడ్మిషన్ల ప్రచారంలో మాత్రం తగ్గేదేలే అంటున్నాయి. ● నగర కూడళ్లలో భారీ హోర్డింగ్లు , ఫ్లెక్సీలు, మెట్రోరైళ్లలో ప్రకటనలు. సోషల్ మీడియా, టీవీ ఛానళ్లలో అడ్మిషన్ల ప్రకటనల వెల్లువ మాత్రం ఆగడం లేదు. నిబంధనల ప్రకారం వార్షిక పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాతే (ఏప్రిల్,మే) అడ్మిషన్లు ప్రారంభించాల్సి ఉంటుంది. ● జనవరిలో అడ్మిషన్లు చట్టవిరుద్ధం. ప్రతి పాఠశాల తన రిజిస్ట్రేషన్న్ నంబర్, గుర్తింపు పత్రాన్ని నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.’క్యాపిటేషన్న్ ఫీజు’ డొనేషన్లు వసూలు చేయవద్దు, పాఠశాల మేనేజ్మెంట్ ఏకపక్షంగా ఫీజులు పెంచకూడదు. పాఠశాల ప్రాంగణంలోనే పుస్తకాలు, యూనిఫాంలు కొనాలని తల్లిదండ్రులను బలవంతం చేయకూడదు. కానీ, ఇందుకు భిన్నంగానే ప్రక్రియ సాగుతోంది. ప్రై’వేటు‘ వైపే మొగ్గు ● గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో ప్రైవేటు పాఠశాలల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 70 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లోనే విద్యనభ్యసిస్తున్నారు. ● 7,451 ప్రైవేటు పాఠశాలలుండగా అందులో 4,550 బడ్జెట్ పాఠశాలలు, 1,900 కార్పొరేట్, వాటి అనుబంద, 1,001 మిషనరీ పాఠశాలలున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థల ప్రభావంతో సాధారణ, దిగువ మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే బడ్జెట్స్కూళ్లు తగ్గు ముఖం పట్టాయి. ● ఇప్పటికే సుమారు 400 పైగా ప్రైవేటు (బడ్జెట్) పాఠశాలలు ఆర్థిక కారణాల వల్ల మూతపడగా, ఆ స్థానాలను కార్పొరేట్ స్కూళ్లు ఆక్రమిస్తున్నాయి. తల్లిదండ్రుల్లో అయోమయం ● తమ పిల్లల బంగారు భవిష్యత్తు దృష్ట్యా మంచి స్కూల్లో సీటు దొరకదేమోనన్న భయంతో చాలామంది తల్లిదండ్రులు ‘ముందస్తు అడ్మిషన్ల’ ఉచ్చులో పడుతున్నారు. ● రాయితీల ఆశతో వేల రూపాయలు అడ్వాన్సు చెల్లిస్తున్నారు. విద్యా సంవ్సత్సరం ప్రారంభమయ్యాక అదనపు ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్ పేరుతో స్కూళ్లు అసలు రంగు బయటపెడుతున్నాయని బాధితులు వాపోతున్నారు. పట్టని విద్యాశాఖాధికారులు అనుమతులు లేని పాఠశాలలు ప్రచారం చేసుకుంటున్నా, నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ప్రకటనలు జారీ చేసి చేతులు దులుపుకోకుండా, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి అక్రమ అడ్మిషన్లను అడ్డుకోవాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మహానగర పరిధిలో ప్రైవేటు స్కూళ్ల వివరాలు జిల్లా పేరు మొత్తం బడ్జెట్ స్కూల్స్ కార్పొరేట్ ఇంటర్నేషనల్/మిషనరీ హైదరాబాద్ 2,885 1,800 650 435 రంగారెడ్డి జిల్లా 2,711 1,650 700 361 మేడ్చల్ – మల్కాజిగిరి 1,855 1,100 550 205 -
అంబేడ్కర్ వర్సిటీ విద్యార్థులకు బంగారు భవిష్యత్
● వీసీ ఘంటా చక్రపాణి బంజారాహిల్స్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ– టీసీఎస్ అయాన్ జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంతో విద్యార్థుల భవిష్యత్ బంగారు బాటగా మారనుందని అంబేడ్కర్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపొందించిన టీసీఎస్ అయాన్–జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగాంను ఆదివారం ఆయన ప్రారంభించారు. యూనివర్సిటీ చేపట్టిన ఈ సరికొత్త ప్రోగ్రాం గురించి తెలంగాణ వ్యాప్తంగా అన్ని అధ్యయన కేంద్రాల్లో సిబ్బందికి, విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా దూరవిద్య ద్వారా ఉన్నత విద్య అభ్యసించేవారికి టీసీఎస్ అయాన్తో కలిసి ఈ కోర్సును అందించడం ఇదే మొదటిదని వెల్లడించారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులను మొదటి సెమిస్టర్ నుంచే కార్పొరేట్ కంపెనీలకు అవసరమయ్యేలా తీర్చిదిద్దుతూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని కార్పొరేట్ సంస్థల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ కోర్సును రూపొందించినట్లు వెల్లడించారు. ఈ కోర్సును డిగ్రీ చదువుతూనే ఏకకాలంలో పూర్తి చేయవచ్చన్నారు. వృత్తి– నైపుణ్యం–శిక్షణ కార్యక్రమాలతో విద్యార్థులకు రానున్న రోజుల్లో విస్తృత అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు. విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ పుష్పా చక్రపాణి, ఈఎంఆర్ఆర్సీ డైరెక్టర్ రవీంద్రనాథ్ సాలమన్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి, టీసీఎస్ అయాన్–జాబ్ అఛీవర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లీనా టిప్రే, విశ్వవిద్యాలయ అధికారులు పల్లవీ ఆబ్డే, ప్లేస్మెంట్ అధికారి వేణుగోపాల్రెడ్డి, విద్యార్ధి సేవల విభాగం డైరెక్టర్ వై.వెంకటేశ్వర్లు, సిద్దిపేట అధ్యయన కేంద్రం ప్రిన్సిపాల్ సునీత, బానోత్ ధర్మా పాల్గొన్నారు. -
డివైడర్ ఢీకొని కారు బోల్తా
ఫిలింనగర్: మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న ఓ కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది.ఈ ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. పుప్పాలగూడ అల్కాపూర్ టౌన్షిప్లో నివసించే బోడ సచిన్(34) ఆదివారం ఉదయం చింతల్ బస్తీ నుంచి తన ఇంటికి వెళుతున్నాడు. ఫిలింనగర్లోని శంకర్ విల్లాస్ చౌరస్తాలో కారు అదుపు తప్పడంతో డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో సచిన్ స్వల్ప గాయాలతో బయటపడి భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును స్టేషన్కు తరలించారు. ఈ కారు బోడ స్వర్ణలత అనే పేరు మీద ఉండగా, సచిన్ కారు నడుపుతూ ప్రమాదానికి కారకుడయ్యాడు. సచిన్ను పోలీసులు స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. డ్రంకన్ అండ్ డ్రైవ్ నిర్వహించగా జీరో అని వచ్చింది. అయితే కారులో మాత్రం ఆరుకు పైగా విస్కీ బాటిళ్లు లభ్యమయ్యాయి. నిందితుడు రాత్రంతా మద్యంతాగి ఆదివారం మధ్యాహ్నం పట్టుబడడంతో డ్రంకన్ డ్రైవ్లో జీరో నమోదైనట్లు తెలుస్తున్నది. కారు డివైడర్ను ఢీకొట్టిన సమయంలో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడం, బోల్తా పడడంతో కారు నడుపుతున్న సచిన్ ప్రాణాలతో బయటపడ్డట్లుగా పోలీసులు గుర్తించారు. నిర్లక్ష్యానికి కారకుడైన సచిన్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. -
గోవా విమానంలో గంజాయి పట్టివేత
శంషాబాద్: గోవా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఓ విమానంలో సీటు కింద దాచి ఉంచిన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం రాత్రి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఐఎక్స్–2746 విమానం గోవా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ప్రయాణికులు దిగిన అనంతరం విమానాన్ని ఎయిర్పోర్టు సెక్యూరిటీ, సిబ్బంది పరిశీలిస్తున్న సమయంలో సీటు కింద రెండు నల్లటి టేపులతో ఉన్న ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వాటిని కస్టమ్స్ అధికారులకు అందించగా నార్కోటిక్ బ్యూరో అధికారులను రప్పించి పరిశీలించారు. మొత్తం 1.100 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిగా అధికారులు నిర్ధారించారు. గంజాయి విలువ 1.10 కోట్లు ఉందని తెలిపారు. గంజాయి తీసుకొచ్చిన వ్యక్తులు ఎయిర్పోర్టులో ఉన్న విస్తృత తనిఖీల కారణంగా దానిని అందులోనే వదిలి వేశారా? లేదా అదే విమానం కనెక్టివిటిలో మరో ప్రాంతానికి చేరవేసేందుకు ప్రయత్నించారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
నేటి నుంచి సర్పంచులకు శిక్షణ
సాక్షి, రంగారెడ్డిజిల్లా/యాచారం: కొత్తగా ఎన్నికై న సర్పంచులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఐదు విడతల్లో రంగారెడ్డి జిల్లాలోని 525 మంది సర్పంచులకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. సభ్యులకు గ్రామ పంచాయతీల పాలన, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణభారతి ట్రస్టులోని రెండు సమావేశ మందిరాలను సిద్ధం చేశారు. గ్రామ స్వరూపం, ఇంటి నిర్మాణాలకు అనుమతుల జారీ, ఆస్తి పన్ను వసూళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధిలైట్లు, పార్కుల పరిరక్షణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు, వాటిని సద్వినియోగం చేసుకునే అంశం, ప్రభుత్వాలు పేదల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందేలా చూడటం వంటి అంశాలపై వివరించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటి విడతలో 109 మందికి.. ఈనెల 19 నుంచి 23 వరకు మొదటి విడతలో షాబాద్ మండల పరిధిలోని 41 పంచాయతీలు, మొయినాబాద్ మండల పరిధిలోని 19, చేవెళ్ల మండల పరిధిలోని 25, శంకర్పల్లి మండల పరిధిలోని 24 పంచాయతీల సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు. రెండో విడతలో 103 మందికి.. మాడ్గుల మండల పరిధిలోని 34 మంది సర్పంచులు, ఆమనగల్లు మండల పరిధిలోని 13 మంది, తలకొండపల్లి మండల పరిధిలోని 32 మంది, కడ్తాల్ మండల పరిధిలోని 24 మంది సర్పంచులకు ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు నిర్వహించే రెండో విడతలో శిక్షణ ఇవ్వనున్నారు. మూడో విడతలో 113 మందికి.. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు కందుకూరు మండల పరిధిలోని 35 మంది సర్పంచులు, నందిగామ మండల పరిధిలోని 19 మందికి, మహేశ్వరం మండల పరిధిలోని 30 మందికి, కేశంపేట మండలంలోని 29 మంది సర్పంచులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. నాలుగో విడతలో 105 మందికి.. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు నాలుగో విడత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఫరూఖ్నగర్ మండల పరిధిలోని 47 మంది, కొత్తూరు మండలంలోని 12 మంది, కొందుర్గు మండలంలోని 22 మంది, జిల్లెడ్ చౌదరిగూడ మండల పరిధిలోని 24 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఐదో విడతలో 96 మందికి.. ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు చివరి విడతగా నిర్వహించే శిక్షణ తరగతుల్లో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని సర్పంచులకు అవగాహన కల్పించనున్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని 14 మంది సర్పంచులు, ఇబ్రహీంటపట్నం మండల పరిధిలోని 14 మంది, మంచాల మండల పరిధిలోని 23 మందికి, యాచారం మండల పరిధిలోని 24 మందికి, శంషాబాద్ మండల పరిధిలోని 21 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 27 వరకు ఐదు విడతల్లో ప్రత్యేక తరగతులు గ్రామ పంచాయతీ పాలన..పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన ముచ్చింతల్లో ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు జిల్లాలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు ప్రతి ఒక్కరూ కచ్చితంగా హాజరయ్యేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి ఆయా మండలాల ఎంపీడీఓ, ఎంపీఓలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండలం నుంచి అన్ని గ్రామాల సర్పంచులు హాజరయ్యే విధంగా పర్యవేక్షణ చేయడం కోసం జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ అధికారిని నియమించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. శిక్షణ పొందనున్న సర్పంచులకు నిత్యం ఆన్లైన్ పోర్టల్లో హాజరు నమోదు, చివరి రోజు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. -
ప్రీ యాక్టివేషన్పై యాక్షన్
సాక్షి, సిటీబ్యూరో: నేరగాళ్లతో పాటు అసాంఘిక శక్తులు, ఉగ్రవాదులకు కలిసి వస్తున్న ప్రీ యాక్టివేషన్ దందాకు చెక్ చెప్పడానికి నగర పోలీసు విభాగం సిద్ధమైంది. ఇందులో భాగంగా సీసీఎస్ అధీనంలోని స్పెషల్ టీమ్ పోలీసులు నగర వ్యాప్తంగా నిఘా ఉంచారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్లోని కడప నుంచి వీటిని తీసుకువచ్చి, నగరంలో విక్రయించడానికి ప్రయత్నించి ఇద్దరు పట్టుబడ్డారు. వీరి నుంచి రెండు సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన 184 సిమ్కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని నాంపల్లి పోలీసులకు అప్పగించారు. ఇకపై ఈ తరహా సిమ్కార్డుల విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. నిబంధనలు పట్టించుకోని ఔట్లెట్స్.. సెల్ఫోన్ వినియోగదారు ఏ సర్వీసు ప్రొవైడర్ నుంచి అయినా సిమ్కార్డు తీసుకోవాలంటే ఫొటోతో పాటు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలు, వేలిముద్రలు కచ్చితంగా ఇవ్వాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ) నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనేక మంది సిమ్కార్డుల విక్రేతలు తమ వద్దకు వచ్చే సాధారణ వినియోగదారులకు తెలియకుండా వారి నుంచి గుర్తింపులు తీసుకుంటున్నారు. వేలిముద్రల సేకరణ సమయంలో మొదటి ప్రయత్నం విజయవంతమైనా... అలా కాలేదంటే మరోసారి ఫింగర్ ప్రింట్స్ తమ వద్ద ఉండే మిషన్లో తీసుకుంటున్నారు. మొదటి ప్రయత్నంతో యాక్టివేట్ చేసినవి వినియోగదారుడికి ఇచ్చేసి పంపిస్తున్నారు. ఆపై రెండో ప్రయత్నంతో యాక్టివేట్ చేసుకున్నవి తమ వద్ద ఉంచుకుంటున్నారు. ఇద్దరు కలిసి పదుల సంఖ్యలో.. ఏపీలోని కడప జిల్లా భద్రిపల్లికి చెందిన నేనావత్ దినేష్ కుమార్ నాయక్ కడపలో లావణ్య ఎంటర్ప్రైజెస్ సిమ్స్ డిస్ట్రిబ్యూటర్ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. అదే జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ప్రణపల్లి సాయి ప్రదీప్ ఓ సర్వీస్ ప్రొవైడర్ సంస్థలో సిమ్కార్డ్స్ ప్రమోటర్గా పని చేస్తున్నారు. ప్రీ–యాక్టివేటెడ్ సిమ్కార్డులకు ఉన్న డిమాండ్ తెలుసుకున్న ఈ ఇద్దరు దాన్ని క్యాష్ చేసుకోవాలని పథకం వేశా రు. దీంతో కొన్నాళ్లుగా లావణ్య ఎంటర్ప్రైజెస్కు సిమ్కార్డ్స్ కోసం వచ్చే వినియోగదారుల్ని టార్గెట్ చేశారు. వారికి తెలియకుండా గుర్తింపులు, వేలిముద్రలు తీసుకుని సిమ్కార్డుల్ని యాక్టివేట్ చేస్తున్నారు. వీటికి హైదరాబాద్లో డిమాండ్ ఎక్కువగా ఉందని భావించి విక్రయించడానికి వచ్చారు. దీనిపై సీసీఎస్ స్పెషల్ టీమ్కు సమాచారం అందింది. ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటేనే కట్టడి... ఏసీపీ జి.వెంకటేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ డి.బిక్షపతి నేతృత్వంలోని బృందం ఆదివారం నాంపల్లి ప్రాంతంలో వల పన్ని ఈ ఇద్దరు నిందితులను పట్టుకుని 184 ప్రీ–యాక్టివేటెడ్ సిమ్కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాను పూర్తి స్థాయిలో అరికట్టాలంటే సిమ్కార్డ్ జారీ తర్వాత, యాక్టివేషన్కు ముందు సర్వీస్ ప్రొవైడర్లు కచ్చితంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే విధానం ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. పోస్ట్పెయిడ్ కనెన్షన్ మాదిరిగానే ప్రీ–పెయిడ్ను పూర్తిస్థాయిలో వెరిఫై చేసిన తర్వాతే యాక్టివేట్ చేసేలా ఉంటేనే ఫలితాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ప్రతి వినియోగదారుడూ తన పేరుతో ఎన్ని సిమ్కార్డులు జారీ అయ్యాయో తెలుసుకునే అవకాశం ఉంది. కేంద్రం అధీనంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన అధికారిక వెబ్సైట్ (https:// tafcop. sancharsaathi. gov. in/ telecomUser) ద్వారా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ఇందులోకి ప్రవేశించిన తర్వాత అక్కడ కోరిన వివరాలు పొందుపరిచి, ఓటీపీ ఎంటర్ చేస్తే మీ పేరుతో ఎన్ని ఫోన్లు ఉన్నాయో కనిపిస్తాయి. అక్కడ కనిపిస్తున్నవన్నీ మీకు సంబంధించినవి కాకపోతే ప్రీ–యాక్టివేటెడ్విగా భావించవచ్చు. దీనిపై అదే లింకులో రిపోర్ట్ చేయడం ద్వారా వాటిని బ్లాక్ చేయించవచ్చు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సైతం గ్రూప్ ఎస్సెమ్మెస్లు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. సిమ్కార్డుల అక్రమ దందాపై సీసీఎస్ నజర్ వీటిని తరచూ వినియోగిస్తున్న అసాంఘిక శక్తులు ఏపీ నుంచి తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయం ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసిన స్పెషల్ టీమ్ -
పుస్తక పఠనం ద్వారానే జ్ఞానం సాధ్యం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చంటి ప్రసన్న కేంద్రం ఆధ్వర్యంలో పలువురు రచయితలు రూపొందించిన తెలంగాణ ఉమెన్ ఎంపవర్మెంట్ పుస్తకావిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాంతి సిన్హా మాట్లాడుతూ.. మహిళలు సాధికారత సాధించినప్పుడే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళల సాధికారతే దేశానికి శ్రీరమరక్ష అని చెప్పారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్. రాములు, డాక్టర్ వనమాల, నవతెలంగాణ బుక్ హౌస్ ఎడిటర్ ఆనందాచారి, డాక్టర్ అరుణ పరందాములు తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ కరెన్సీ మార్పిడి వ్యవహారంలో ముగ్గురి అరెస్ట్
అబిడ్స్: నకిలీ కరెన్సీని మార్పిడి కేసులో ముగ్గురు నిందితులను గుడిమల్కాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ బి.రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కెన్యా దేశానికి చెందిన హవేస్ హెర్సి సలాద్ (30) నగరానికి వచ్చి టోలిచౌకీ ప్యారామౌంట్ కాలనీలో ఉంటున్నాడు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బాబులాల్ జట్కుక్నా (23), ధరమ్వీర్ (22)లతో ఇతడికి నకిలీ కరెన్సీ మార్పిడి వ్యవహారంపై సయోధ్య కుదిరింది. ఆదివారం రాజస్థాన్ నుంచి నకిలీ నోట్లు తెచ్చిన బాబులాల్ జట్కుక్నా, ధరమ్వీర్లు గుడిమల్కాపూర్ రింగ్రోడ్డు చౌరస్తాలో హవేస్ హెర్సి సలాద్కు ఇచ్చేందుకు పిలిపించారు. ముగ్గురి మధ్య నోట్ల మార్పిడి వ్యవహారంలో వాగ్వాదం చోటుచేసుకుంది. రోడ్డుపైనే పట్టపగలు ముగ్గురు ఒకరిపై ఒకరు దూషించుకోవడంతో స్థానికులు గమనించి వెంటనే గుడిమల్కాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ రాజు ఆధ్వర్యంలో ఎస్.ఐ.నరేష్, సిబ్బందితో వెళ్లి ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ చేయగా తొమ్మిది రూ.500 నోట్ల నకిలీ బెండళ్లను రాజస్థాన్ నుంచి తెచ్చి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. కేసును గోల్కొండ జోన్ డీసీపీ జి.చంద్రమోహన్ పర్యవేక్షణలో గోషామహల్ ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో గుడిమల్కాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
స్నాక్స్@ సర్కార్ స్కూల్..
సాక్షి, సిటీబ్యూరో: పదవ తరగతి పరీక్షలు దగ్గరకొస్తున్నాయి..ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చదువులపై ఉపాధ్యాయులు దృష్టిసారించారు. ఈ క్రమంలో ప్రత్యేక తరగతులు కూడా ప్రారంభించారు. విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడకుండా సాయంత్రం వేళ అల్పాహారం అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నిధులు కూడా విడుదలచేసింది. ● 19 రోజుల పాటు ... గత సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం 38 రోజుల పాటు అల్పాహారం అందించారు. అయితే ఈ ఏడాది 19 రోజులే అందించనుంది. సంక్రాంతి సెలవుల అనంతరం రెండు పూటలా తరగతుల నిర్వహణకు మేడ్చల్ జిల్లా విద్యాశాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ● పూటకు రూ.15 మాత్రమే మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 108 ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 8 వేల మంది పదోతరగతి విద్యార్థులు చదువుతున్నారు. మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి రోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండగ అనంతరం ఉదయం 8.15 నుంచి 9.15 గంటల వరకు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు (సెలవులు కాకుండా) మాత్రమే సాయంత్రం పూట నిర్వహించే ప్రత్యేక తరగతులకు రోజుకు రూ.15తో ఒక్కో విద్యార్ధికి అల్పాహారం అందించేందుకు నిధుల విడుదల ఉత్తర్వులు జారీ అయ్యాయి. పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో సర్కారు బడుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చాలామంది విద్యార్థులు ఉదయం అల్పాహారం తినకుండానే పాఠశాలలకు హాజరవుతున్నారు. వీరికి మధ్యాహ్న భోజనమే దిక్కవుతోంది. సాయంత్రం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల అనంతరం ఇంటికి వెళ్లేసరికి ఆలస్యం అవుతోంది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పలు స్వచ్చంద సంస్థలు,దాతలు ముందుకొచ్చి అల్పాహారం అందిస్తే మేలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులు కూడా స్పందిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఒక్కో విద్యార్థికి రూ.15 ఖర్చు మేడ్చల్ జిల్లాలో 8 వేల మంది టెన్త్ విద్యార్థులు -
పండక్కి వెళ్లి.. సిటీకి మళ్లీ ..
సొంతూళ్ల నుంచి తిరుగు పయనంసాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లినవారు చాలావరకు ఆదివారం నగరానికి చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కిక్కిరిసిన రద్దీతో బయలుదేరిన బస్సులు, రైళ్లు నగరానికి చేరుకున్నాయి. మరోవైపు సొంత వాహనాల్లోనూ జనం పెద్ద ఎత్తున బయలుదేరి రావడంతో ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ పోటెత్తింది. మరోవైపు సంక్రాంతి సందర్భంగా రిటర్న్ జర్నీ కోసం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపింది. కాకినాడ, విశాఖ, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి బయలుదేరిన రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శబరిమలకు వెళ్లిన అయ్యప్ప భక్తులు కూడా ప్రత్యేక రైళ్లలో నగరానికి బయలుదేరారు. దీంతో వివిధ మార్గాల్లో రైళ్లలో రద్దీ భారీగా పెరిగింది. సంక్రాంతి రాకపోకలను దృష్టిలో ఉంచుకొని సుమారు 51 రైళ్లను ఏర్పాటు చేశారు. తిరుగు ప్రయాణికుల రద్దీతో సికింద్రాబాద్, చర్లపల్లి, లింగంపల్లి తదితర స్టేషన్లలో సందడి నెలకొంది. ఆర్టీసీ ఏర్పాట్లు.. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 6,400 బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. కానీ ప్రయాణికుల డిమాండ్ మేరకు 5,375 ప్రత్యేక బస్సులను నడిపినట్లు అధికారులు తెలిపారు. రిటర్న్ జర్నీ కోసం ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. విజయవాడ, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనాల రద్దీ భారీగా పెరిగింది. టోల్గేట్ల వద్ద గంటల తరబడి నిలిచిపోయాయి. దీంతో ప్రయాణ సమయం విపరీతంగా పెరిగింది. మరోవైపు సోమవారం కూడా పలు జిల్లాల నుంచి రద్దీకనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాము చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చినట్లు పేర్కొన్నారు.తిరుగు ప్రయాణంలో కూడా ఆర్టీసీ బస్సులకు పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొన్నట్లు చెప్పారు. రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ తదితర ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనపు సిబ్బందిని నియమించారు. సొంత వాహనాల్లోనూ.... ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో పాటు సొంత వాహనాల్లోనూ సిటీ జనులు పల్లెల నుంచి నగరానికి తరలారు. దీంతో అన్ని వైపులా రహదారులు పోటెత్తాయి. వివిధ మార్గాల్లో సుమారు 30 లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు తరలివెళ్లినట్లు అంచనా. ప్రస్తుతం వారంతా నగరానికి చేరుకుంటున్నారు. మరోవైపు దూరప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు, రైళ్లలో నగరానికి చేరుకున్న వాళ్లు ఇళ్లకు చేరుకొనేందుకు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–రాయదుర్గం, జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్లలో మెట్రో రైళ్లలో రద్దీ కనిపించింది. రాజధానికి పోటెత్తిన నగర వాసులు ప్రయాణికులతో బస్సులు, రైళ్లు కిటకిట అదనపు సర్వీసులతో ఉపశమనం -
305 మంది ‘నిషా’చరులకు చెక్!
సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై నగర ట్రాఫిక్ విభాగం అధికారులు వీకెండ్స్తో ప్రత్యేక డ్రైవ్లు కొనసాగిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో నగర వ్యాప్తంగా చేపట్టగా... 305 మంది మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ అధికారులకు పట్టుబడ్డారని ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్ ఆదివారం వెల్లడించారు. సమయం, ప్రాంతం, సందర్భాలతో సంబంధం లేకుండా ఆకస్మికంగా డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు చేశారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సైతం అనేక ప్రాంతాల్లో చేపట్టారు. వీటిలో పట్టుబడిన 305 మందిలో 242 మంది ద్విచక్ర, 26 మంది త్రిచక్ర, 35 మంది తేలికపాటి వాహనాల చోదకుల అని ట్రాఫిక్ చీఫ్ పేర్కొన్నారు. వీరందరికీ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. సైబరాబాద్ పరిధిలో 231 మంది.. రాయదుర్గం: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ‘వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్’లో 231 మంది పట్టుబడ్డారు. 187 ద్విచక్రవాహనదారులు, 15 త్రీవీలర్లు, 29 నాలుగు చక్రాల వాహనదారులు ఉన్నారు. ● మాదాపూర్ పీఎస్పరిధిలో 17 మంది, గచ్చిబౌలి–21, నార్సింగి–14, రాయదుర్గం–19, మియాపూర్–29, కూకట్పల్లిలో అత్యధికంగా 35 కేసులు, బాలానగర్–10, జీడిమెట్ల–10, పటాన్చెరు–29, కేపీహెచ్బీ–11, మేడ్చెల్–14, ఆర్సీపురం పరిధిలో 22 మందిపట్టుబడ్డారు. -
ఉత్సాహంగా సాగినసీఎం కప్ టార్చ్ ర్యాలీ
ఖైరతాబాద్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహర నుంచి తెలంగాణ సచివాలయం మీదుగా ఎల్బీ స్టేడియం వరకు సీఎం కప్ 2025–26 టార్చ్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలపై అవగాహన పెంచడంతో పాటు అన్ని గేమ్స్ పట్ల ఆదరణ పెంపొందించి, వీటి అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కృషి చేస్తున్నాయని తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. టార్చ్ ర్యాలీలో జాతీయ స్థాయి స్కేటర్లు, స్విమ్మర్లు, క్రీడాకారులు, అభిమానులు పాల్గొన్నారు. -
యువకుడి దారుణ హత్య
చాంద్రాయణగుట్ట: వైన్ షాప్ ముందు ఓ యువకుడు ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఛత్రినాక పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. కర్ణాటకకు చెందిన సతీష్ చావ్లే (35) శంషీర్గంజ్లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై శంషీర్గంజ్లోని తుల్జా భవానీ వైన్స్లో మద్యం ఆగేందుకు వచ్చాడు. మద్యం తాగే క్రమంలో మరో వ్యక్తితో గొడవ జరిగింది. ఇద్దరు గల్లా పట్టుకొని బయటికి వచ్చారు. రోడ్డుపైకి వచ్చాక మరో వ్యక్తి తన స్నేహితుడికి ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో కడుపు, మెడ భాగాలలో తీవ్రంగా పొడిచాడు. సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు గాయపడ్డ వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వైన్స్లో గుర్తు తెలియని వ్యక్తితో అనుకోకుండా గొడవ జరిగిందా...? ఏదైనా ముందస్తు పథకంలో భాగంగా జరిగిందా..? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. -
మారిన ఆహారపు అలవాట్లతో స్థూలకాయం
● కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ● ఉత్సాహంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ గచ్చిబౌలి: మారిన ఆహారపు అలవాట్ల కారణంగానే యువత స్థూలకాయం బారిన పడి అనేక సమస్యలు ఎదుర్కొంటోందని బొగ్గు, కేంద్ర గనుల శాఖమంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా 57వ ఎడిషన్ ‘సండేస్ ఆన్ సైకిల్’ను జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ స్థూలకాయం కారణంగా యువతతో పాటు అనేక మంది ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఐటీ, ఫార్మా, హెల్త్ రంగంలో ప్రపంచంలోనే భారత్ మేటిగా ఉందన్నారు. దేశంలో స్థూలకాయం కారణంగా యువత దేశానికి సరైన సేవచేయలేకపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. స్మార్ట్ఫోన్లు యువశక్తిని నిర్వీర్యం చేస్తాయని, ఫిట్నెస్పై యువత దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్ వాడకంలో పది శాతం తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుఇచ్చారని కిషన్రెడ్డి గుర్తుచేశారు. ఆరోగ్య భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం 30 నిమిషాలకు మించి వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆరోగ్యవంతమైన యువత మేధస్సే దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అనంతరం పలు విన్యాసాలు ప్రదర్శించారు. సైక్లింగ్లో విజేతలు, పాల్గొన్న వారికి బహమతులు అందజేశారు. కార్యక్రమంలో ఫిట్ ఇండియా ప్రతినిధులు, క్రీడాకారులు, ఐటీ కంపెనీల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురి అరెస్టు
మూసాపేట: బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసినట్లు కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరీంనగర్కు చెందిన గంపా శ్రీహర్ష (31), కూన రాజు చందు(22) బాచుపల్లి మల్లంపేటలో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. శ్రీహర్ష వ్యాపారి. చందు డ్రైవర్. ఈ నెల 5న మల్లంపేట రోడ్డులోని హైరైజ్ ప్యారడైజ్ విల్లాస్లో శ్రీహర్ష ఎండీఎంఏ డ్రగ్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని విచారించగా చందుతోపాటు కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సంజప్ప అలియాస్ నితిన్(32) డ్రగ్స్ విక్రయించినట్లు చెప్పాడు. జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్న సంజప్ప బెంగుళూరు నుంచి అక్రమంగా సింథటిక్ ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకువచ్చి చందుతో కలిసి విక్రయించేవాడు. ఈ క్రమంలో ఈ నెల 7న డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేశారు. 11.34 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు పెడ్లర్లుగా మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరితో సంబంధమున్న మరో ఇద్దరు ఇనావో షైజా, యశ్వంత్ పరారీలో ఉన్నారు. -
హైదరాబాద్లో ఫిన్నిష్ క్యాంపస్ ప్రారంభం
సాక్షి,సిటీ బ్యూరో: హోరిజన్ ఎక్స్పీరియన్సియల్ వరల్డ్ స్కూల్ సౌత్ ఇండియాలో మొదటి ఫిన్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్కూల్ను గురువారం హైదరాబాద్లోని కొల్లూరులో ప్రారంభించింది. టీసీసీ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో టీ–హబ్ మాజీ సీఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇన్నోవేషన్ను ఒకే కాలేజీ కోర్సులో నేర్పలేమని, ప్రైమరీ స్కూల్ దశ నుంచే విద్యార్థులకు దానిపై కనీస అవగాహన ఉండాలని అన్నారు. ఫిన్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సీఈఓ డా. జోహన్ స్టోర్గార్డ్ మాట్లాడుతూ ‘ఫిన్లాండ్లో పిల్లలకు సబ్జెక్టులు మాత్రమే నేర్పమని, ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తామని అన్నారు. హై–ట్రస్ట్, లో–స్ట్రెస్ వాతావరణంలో విద్యాబోధన ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్టూడియో చింతల ఫౌండర్ దివాకర్ చింతల, పాంగేయా ట్రేడ్ (వైస్ ప్రెసిడెంట్ రైతా మోచెర్ల, పీడియాట్రీషియన్, డా. లావణ్య తదితరులు పాల్గొన్నారు. పెళ్లి పేరిట నమ్మించి.. డబ్బులు కాజేసి.. ఫిలింనగర్: వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని లైంగిక వేధించడంతోపాటు రూ.75 లక్షలు తీసుకుని మోసగించిన వ్యక్తిపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ సదరన్ మోగా టౌన్షిప్లో నివాసం ఉండే రాణా ప్రతాప్రెడ్డి వివాహం చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి శారీరంగా లోబర్చుకున్నాడు. వ్యాపారం కోసం ఆమె వద్ద రూ.75 లక్షలు తీసుకున్నాడు. పెళ్లి మాట ఎత్తితే మొహం చాటేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారణాసి విమానం రద్దు.. మరొకటి వెనక్కి.. ● ప్రతికూల వాతావరణమే కారణం శంషాబాద్: వారణాసిలో ప్రతికూల వాతావరణం కారణంగా శంషాబాద్ విమానాశ్రయ నుంచి వెళ్లాల్సిన విమానాల్లో ఒకటి పూర్తిగా రద్దు కాగా, మరొకటి మార్గమధ్యంలోంచి తిరిగి వెనక్కి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇండిగో 6719 విమానం గురువారం సాయంత్రం ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకునే ముందు వారణాసిలో ప్రతికూల వాతావరణం ఉందనే సమాచారం వచ్చింది. దీంతో సంబంధిత ఎయిర్లైన్స్ సంస్థ విమానాన్ని రద్దు చేసింది. ప్రయాణికులకు షెడ్యూల్ మార్పులున్నట్లు వెల్లడించింది. అర్ధాంతరంగా తిరిగి వచ్చిన విమానం.. వారణాసి బయలుదేరిన మరో విమానం మార్గమధ్యలోంచి తిరిగొచ్చింది. ఇండిగో 6ఈ–307 విమానం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి 231 మంది ప్రయాణికులతో గురువారం సాయంత్రం బయలుదేరింది. వారణాసిలో ప్రతికూల వాతావరణం ఉన్న కారణంగా అర్ధాంతరంగా విమానం తిరిగి రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరింది. ప్రయాణికులకు ఎయిర్లైన్స్ వర్గాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాయి. -
మహీంద్రా సరికొత్త మోడల్స్ ఆవిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో: మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన రెండు ఐకానిక్ మోడళ్లు ఎక్స్యూవీ 7ఎక్స్ఓ, ఎక్స్ఈవీ 9ఎస్లను గురువారం సోమాజిగూడలోని ది పార్క్ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఎక్స్యూవీ 7ఎక్స్ఓ 2021లో ప్రారంభమైనప్పటి నుంచి 3 లక్షల మందికి పైగా కస్టమర్లను సొంతం చేసుకుందని, దీని ప్రారంభ ధర రూ.13.66 లక్షలు (ఎక్స్–షోరూమ్) ఉందని నిర్వాహకులు తెలిపారు. ఎక్స్ఈవీ 9ఎస్ ప్రారంభ ధర రూ.19.95 లక్షల (ఎక్స్–షోరూమ్)తో భారతదేశపు బిగ్ న్యూ ఎలక్ట్రిక్గా అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్ఈఏఎల్ జోనల్ మేనేజర్ అభిషేక్ కుమార్, ఆటో డివిజన్ రీజినల్ మేనేజర్ స్వాతిక్, ఎమ్ఈఏఎల్ రీజినల్ మేనేజర్ నవేద్ ఖాన్తో పాటు డీలర్ భాగస్వాములు ఆటోమోటివ్ మహీంద్రా సీఈఓ నారాయణ, వీవీసీ మహీంద్రా ఎండీ వీరెన్, ల్యాండ్మార్క్ సీఈఓ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
హష్ ఆయిల్ విక్రయిస్తుండగా ఇద్దరి అరెస్టు
శంషాబాద్ రూరల్: హష్ ఆయిల్ విక్రయించేందుకు యత్నిస్తుండగా ఇద్దరిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి కథనం ప్రకారం... ఏపీలోని విశాఖపట్నం ఓల్డ్ గాజువాకకు చెందిన డింబకేశ్వర నాగప్రణవ్(26) నగరానికి వచ్చి డ్రైవర్గా పనిచేస్తూ ఊట్పల్లిలోని బంధువుల ఇంట్లో నివాసముంటున్నాడు. ఇతను కొన్నాళ్ల కిందట జైలులో ఉన్నప్పుడు గంజాయి కేసులో శిక్ష అనుభవిస్తున్న విశాఖపట్నం చౌడవరం నివాసి యశ్వంత్తో పరిచయం ఏర్పడింది. ప్రణవ్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2024లో శ్రీకాకుళం ఇచ్ఛాపురంవాసి యెర్ర శ్రీనివాసులు(21)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి పాతబస్తీలో గంజాయిని కొనుగోలు చేసి సేవించేవారు. గత డిసెంబర్ 30న యశ్వంత్ ద్వారా ప్రణవ్ గోవాకు వెళ్లి రెండు సీసాల హష్ ఆయిల్ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ఊట్పల్లిలోని తన నివాసానికి సమీపంలో కొంతమంది గంజాయి, హష్ ఆయిల్ సేవిస్తున్నట్లు గమనించాడు. ఈ క్రమంలో ఈ నెల 7న వారి వద్దకు శ్రీనివాసులతో కలిసి వెళ్లి హ్యష్ ఆయిల్ను విక్రయిస్తామనంటూ బేరసారాలకు దిగాడు. అప్పటికే అక్కడ నిఘా వేసిన పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న హష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్టీపీల నిర్మాణంలో వేగం పెంచాలి
సాక్షి,సిటీ బ్యూరో: కొత్త సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ) నిర్మాణ పనుల్లో వేగం పెంచి ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అన్నారు.ఈ మేరకు గురువారం ఆయన ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో అమృత్– 2.0 పథకంలో భాగంగా నిర్మించనున్న 39 ఎస్టీపీల పనుల పురోగతిపై ఎస్టీపీ విభాగ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఓఆర్ఆర్ పరిధిలో సుమారు రూ.3,849.10 కోట్ల వ్యయంతో రెండు ప్యాకేజీ – 2 కింద నిర్మిస్తున్న ఎస్టీపీల పనుల పురోగతి గురించి అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ అనుమతులు లభించిన స్థలాల్లో భూసార పరీక్షలు పూర్తి చేసి వెంటనే ఎస్టీపీ నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. భూమికి సంబంధించిన సమస్యలు ఉన్న ప్రాంతాల్లో త్వరగా సమస్యలు పరిష్కరించి, అనుమతులు మంజూరు చేయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించారు. ప్రతి ఎస్టీపీకి సంబంధించి 15 రోజులకు ఒకసారి చేయాల్సిన పనులపై చెక్ లిస్ట్ రూపొందించుకుని, గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. వాటి వివరాలు జలమండలి అధికారుల వద్ద, సైట్ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధుల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. భూ వివాదాలుంటే... భూ వివాదాలు ఉన్న ప్రాంతాల్లో కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని ఎస్టేట్ ఆఫీసర్కు సూచించారు. మరోవైపు భూ వివాదాలు ఉన్న ప్రాంత ఎస్టీపీల నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా భూమిని గుర్తించాలన్నారు. వివాదాలు లేకుండా భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఎస్టీపీల నిర్మాణానికి ప్లాన్లను వెంటనే ఖరారు చేయాలని ఆదేశించారు. స్థలాభావం ఉంటే తక్కువ స్థలంలో ఎక్కువ సామర్థ్యంతో నిర్మించే అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు. పనులు మొదలు పెట్టినప్పటినుంచి తుదివరకు ఎస్టీపీ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి టైం లైన్లను నమోదు చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా సాయిల్ టెస్టులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, సైట్ ఇంజనీర్లు పాల్గొన్నారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి -
మూడోసారి..ఏమౌనోమరి!
సాక్షి, సిటీబ్యూరో: రెండేళ్ల క్రితం జీహెచ్ఎంసీలో కోట్లాది రూపాయల పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కానీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్టు పని కూడా ఇంకా ప్రారంభం కాలేదు. ఫ్లై ఓవర్ల సంగతి అటుంచితే.. కనీసం రహదారుల విస్తరణ పనులు కూడా ప్రారంభం కాలేదు. కొన్నింటికి కాంట్రాక్టర్ల ఎంపిక పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. మరికొన్నింటికి ఇప్పటివరకూ టెండర్లు కూడా పిలవలేదు. ఇంకా కొన్ని పనులకు ఒకటి, రెండు పర్యాయాలకు మించి టెండర్లు పిలిచినా, పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అందుకు తాజా ఉదాహరణ ఓల్డ్సిటీలోని తులసీనగర్ నుంచి గౌస్ నగర్ వరకు 100 అడుగుల రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు. ఈ పనుల అంచనా వ్యయం రూ.88 కోట్లు. నిధులు మంజూరు చేసినా.. ● హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలనే తలంపుతో పాతబస్తీలోనూ పలు పనులు చేసేందుకు ప్రభుత్వం పలు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసింది. ఫ్లై ఓవర్లతోపాటు ఆయా ప్రాంతాల్లో రహదారులను 100 అడుగుల వెడల్పుతో విస్తరించి అభివృద్ధి చేయాలని భావించింది. అందులో భాగంగా ఆయా పనులకు టెండర్లు పిలుస్తున్నా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. తులసీనగర్– గౌస్ నగర్ వరకు పనులకు టెండర్లు ఆలస్యంగా పిలిచారు. అయినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు మొదలుకాలేదు. ● ఇప్పటికే రెండు పర్యాయాలు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో తాజాగా మూడోసారి టెండర్లు ఆహ్వానించారు. ఈసారైనా కాంట్రాక్టర్లు ముందుకు వస్తారో, రారో తెలియని పరిస్థితి. రహదారి అభివృద్ధిలో భాగంగా వెడల్పుగా మాత్రమే కాకుండా పాదచారులకు ఫుట్పాత్లు, మీడియన్లలో గ్రీనరీ తదితరమైనవి ఉండాలనేది లక్ష్యం. కానీ.. రెండు పర్యాయాలు ఎవరూ రాలేదు. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులు లేనందునే కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. పాతబస్తీలో రహదారి అభివృద్ధి పనులు ఈసారైనా కాంట్రాక్టర్లు ముందుకొస్తారా? అంచనా వ్యయం రూ.88 కోట్లు -
సాగర్ తీరం.. ఆనంద రాగం!
బుద్ధ పూర్ణిమ పునరభివృద్ధికి ప్రణాళికలు సాక్షి, సిటీబ్యూరో: బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పునరభివృద్ధికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కార్యాచరణ చేపట్టింది. పర్యాటకులను, సందర్శకులను ఆకట్టుకొనేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు సమగ్రమైన మాస్టర్ప్లాన్ రూపొందించనుంది. ఇందుకోసం కన్సల్టెన్సీని ఎంపిక చేసేందుకు సంస్థల నుంచి ఆసక్తుల వ్యక్తీకరణకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ త్వరలో బిడ్డింగ్ వెలువరించే అవకాశం ఉంది. శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, అంబేడ్కర్ మహా విగ్రహం, తెలంగాణ అమరుల స్మారకం, బుద్ధ విగ్రహం వంటి చారిత్రక కట్టడాలతో విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాంతంగా హైదరాబాద్ సంస్కృతి, తెలంగాణ కళలు ప్రతిబింబించేలా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. పర్యాటకులను ఆకట్టుకొనే నైట్ బజార్ కూడా ఏర్పాటు చేయాలని అప్పట్లో భావించారు. ఈ ప్రణాళికలు ఇప్పటివరకు అమలు కాలేదు. ఈ క్రమంలోనే బుద్ధపూర్ణిమ రీ డెవలప్మెంట్కు హెచ్ఎండీఏ తాజాగా ప్రణాళికలు రూపొందించింది. అందంగా.. ఆహ్లాదంగా.. సుమారు 1,300 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న హుస్సేన్సాగర్ పరీవాహక ప్రాంత అభివృద్ధి కోసం అప్పటి ఉమ్మడి ప్రభుత్వం హెచ్ఎండీఏకు అనుబంధంగా బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసింది. 2004 నుంచి బీపీపీ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్కు, లేక్వ్యూపార్క్, సంజీవయ్య పార్క్, ఎకోపార్క్, పీవీ జ్ఞానభూమి, పీపుల్స్ప్లాజా, ఎకో కన్జర్వేషన్ జోన్ తదితర ప్రాంతాలు ప్రస్తుతం బీపీపీలో భాగంగా ఉన్నాయి. వీటి నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా లభిస్తోంది. బీపీపీ పునరభివృద్ధిలో భాగంగా ఈ పార్కులు అంతర్జాతీయ హంగులను సంతరించుకుంటాయి. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని, ఆహ్లాదాన్ని అందజేస్తాయి. మరోవైపు రిక్రియేషన్ కార్యకలాపాల విస్తరణలో భాగంగా పర్యాటకులకు 24 గంటల పాటు ఎంటర్టైన్మెంట్ లభించే నైట్బజార్ను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉందని అధికారులు చెప్పారు. హుస్సేన్సాగర్ చెరువులోకి స్కైవాక్ సైకిల్ వే నిర్మించాలని హుమ్టా ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం అంబేడ్కర్ విగ్రహాన్ని ఆనుకొని ఐమాక్స్ థియేటర్ వద్ద ఉన్న విశాలమైన స్థలం, ఎకో కన్జర్వేషన్లో ఉన్న మరికొన్ని ప్రాంతాలను సద్వినియోగం చేసుకోవడం పునరభివృద్ధి ప్రాజెక్టు లక్ష్యం. ఈ మాస్టర్ప్లాన్ రూపకల్పనపై కన్సల్టెన్సీ ని ఎంపిక చేసేందుకు ఓ ప్రైవేట్ సంస్థకు బాధ్యతలను అప్పగించినట్లు అధికారులు తెలిపారు. -
2027 డిసెంబర్ నాటికి గోదావరి పనులు పూర్తి
జలమండలి ఎండీ అశోక్రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్–2–3 ప్రాజెక్ట్ పనులను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో గోదావరి నిర్మాణ పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లన్న సాగర్ నుంచి ఘన్పూర్ వరకు.. అక్కడి నుంచి ఉస్మాన్ సాగర్ వరకు నిర్మించాల్సిన పైపులైన్ విస్తరణ పనులు, ఘన్ పూర్ వద్ద నిర్మించనున్న 80 మిలియన్ లీటర్ల మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఘన్పూర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల వద్ద నిర్మించే నీటిశుద్ధి కేంద్రాల పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్–1 కింద.. నగర ప్రజల నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీల నీరు తరలిస్తోందని, మరో రెండు దశల ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 20 టీఎంసీల నీరు తరలించేందుకు పనులు ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తలించే మొత్తం నీటిలో 17.5 టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు పోగా, మూసీ ప్రక్షాళనలో భాగంగా.. జంట జలాశయాలను పునరుజ్జీవనం చేసేందుకు మిగిలిన 2.5 టీఎంసీలను ఉపయోగించనున్నారు. సమావేశంలో ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎం మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చైనా మాంజాకు చెక్
ఈ దారంతో పతంగులు ఎగురవేసే వారిపై కేసులు సాక్షి, సిటీబ్యూరో ‘వినియోగదారులు ఉన్నంత వరకు విక్రయాలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే నిషేధిత చైనా మాంజా రవాణా చేసే, అమ్మే వారితో పాటు దీంతో పతంగులు ఎగుర వేసే వారిపైనా కేసులు నమోదు చేయాలని నిర్ణయించాం’ అని నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ స్పష్టం చేశారు. దీనికోసం సంక్రాంతి ముగిసే వరకు ప్రత్యేక బృందాలతో నిఘా తనిఖీలు ఉంటాయని పేర్కొన్నారు. గురువారం బంజారాహిల్స్లోని ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పండగ నేపథ్యంలో బృందాలుగా చేరి పతంగులు ఎగుర వేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఆకస్మికంగా తనిఖీలు చేసే ప్రత్యేక బృందాలు వాళ్లు చైనా మాంజా వాడుతున్నట్లు తేలితే బీఎన్ఎస్తో పాటు పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేయనున్నారు. వీటిలో నేరం నిరూపణ అయితే గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానాలకు ఆస్కారం ఉందని కొత్వాల్ పేర్కొన్నారు. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు చైనా మాంజా వినియోగాన్ని పోత్సహించవద్దని ఆయన సూచించారు. నెల రోజుల ముందే అప్రమత్తం.. ● పతంగుల పండగ నేపథ్యంలో చైనా మాంజా విక్రయంపై నగర పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. దీని వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2016లో, జాతీయ హరిత ట్రైబ్యునల్ 2017లో నిషేధించింది. అయినప్పటికీ విచ్చలవిడిగా సాగుతున్న విక్రయాలతో పక్షులు, మనుషులకు ముప్పు వాటిల్లుతోంది. ప్రధానంగా ద్విచక్ర వాహనచోదకులు, పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. దీంతో నెల రోజులుగా నిఘా ఉంచిన అధికారులు ఇప్పటి వరకు 103 కేసులు నమోదు చేసి, 143 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.24 కోట్ల విలువైన 6226 బాబిన్ల మాంజా స్వాధీనం చేసుకున్నారు. ● ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ల్లో తయారవుతున్న ఈ మాంజాపై పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు ముద్రించి రవాణా చేస్తున్నా రు. దీనికి సహకరిస్తున్న పార్సిల్, కొరియర్ సంస్థల పైనా చర్యలు తప్పవని సజ్జనర్ హెచ్చరించారు. విక్రేతలతో పాటు గోదాములపైనా దాడులు చేస్తున్న స్థానిక, టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ మాంజా మూలాలు కనిపెట్టడంపై దృష్టి పెట్టారు. ప్రతి ఏడాదీ మాంజా విక్రయాలపై దాడులు చేసినా పంగుల ముగిసిన తర్వాత అంతా మిన్నకుండిపోతారు. ఈసారి మాత్రం సంక్రాంతి తర్వాత కూడా ఈ కేసుల దర్యాప్తును పర్యవేక్షిస్తామని సజ్జనర్ స్పష్టం చేశారు. మాంజా బాబిన్లను చూపిస్తున్న సీపీ సజ్జనర్ తదితరులుఈ–కామర్స్ వెబ్సైట్ల ద్వారానూ అమ్మకాలు... నగర పోలీసు విభాగానికి చెందిన ఓ ఎస్సై చేపట్టిన డెకాయ్ ఆపరేషన్తో ఈ మాంజా విక్రయాలు ఈ–కామర్స్ సైట్ల ద్వారానూ జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయా సైట్లలోని క్రయవిక్రయాలను ఆరా తీసిన పోలీసులు కొందరికి నోటీసులు సైతం జారీ చేశారు. ప్రస్తుతం ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్మీడియా సైట్లపై నిఘా ఉంచారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈ మాంజా తయారు చేస్తున్న సంస్థల వివరాలు కనిపెట్టడంతో పాటు అవసరమైతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయడం ద్వారా వాటిని సీజ్ చేయించాలని సజ్జనర్ నిర్ణయించారు. ‘తాజా పరిణామాల నేపథ్యంలో హ్యష్ట్యాగ్ సే నో టు చైనీస్ మాంజ క్యాంపెయినింగ్ చేపడుతున్నాం. తల్లిదండ్రులూ బాధ్యతగా వ్యవహరించి నూలు దారం వినియోగాన్ని ప్రోత్సహించాలి. సంక్రాంతి ముగిసిన తర్వాత వైర్లు, రహదారులపై ఉన్న మాంజాను తొలగించడానికి జీహెచ్ఎంసీ, అటవీ అధికారులతో కలిసి పని చేస్తాం. చైనా మాంజాపై సమాచారం ఉంటే ‘100’కు కాల్ చేసి లేదా 94906 16555కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలి’ అని కొత్వాల్ సజ్జనర్ సూచించారు. నేరం నిరూపితమైతే ఐదేళ్ల వరకు జైలుశిక్ష వెల్లడించిన నగర కమిషనర్ వీసీ సజ్జనర్ -
తటాక పతంగోత్సవం
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలో హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు ఉత్సవాలకు వేదికలు అవుతున్నాయి. గతేడాది బతుకమ్మ ఉత్సవాలు అంబర్పేటలోని బతుకమ్మకుంట వద్ద జరగ్గా.. ఈ ఏడాది సంక్రాంతి నేపథ్యంలో కై ట్ ఫెస్టివల్కు మరికొన్ని చెరువులు ముస్తాబయ్యాయి. మాదాపూర్లోని తమ్మిడికుంట, కూకట్పల్లిలోని నల్లచెరువు, పాతబస్తీలోని బుమ్రుక్ ఉద్ దౌలా చెరువులు దీనికోసం సిద్ధమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులు, మిగిలిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. నగరంలో చెరువులు 60 శాతం వరకూ కనుమరుగయ్యాయి. మిగిలిన చెరువులు చాలా వరకు ఆక్రమణలు, వ్యర్థాలు, మురుగు నీటితో నిండిపోయాయి. దీనిపై దృష్టి పెట్టిన హైడ్రా దశల వారీగా చెరువుల్ని అభివృద్ధి చేయడంతో పాటు వాటికి పునరుజ్జీవం కల్పిస్తోంది. ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు తమ్మిడికుంట, నల్ల చెరువు, బుమ్రుక్ ఉద్ దౌలా చెరువుల వద్ద జరుగనున్న కై ట్ ఫెస్టివల్కు వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించనున్నారు. తమ్మిడికుంట వద్దకు ఐటీ ఉద్యోగులు, కూకట్పల్లి నల్లచెరువు వద్దకు సినీ ప్రముఖులు, బుమ్రుక్ ఉద్ దౌలా చెరువు వద్దకు క్రీడా కారులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో హైడ్రా పర్యాటక శాఖతో కలిసి అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆక్రమణలతో 14 ఎకరాలకు కుంచించుకుపోయిన తమ్మిడికుంటను 30 ఎకరాలకు, నల్ల చెరువును 16 ఎకరాల నుంచి 30 ఎకరాలకు, బుమ్రుక్ ఉద్ దౌలా చెరువును 4.12 ఎకరాల నుంచి 17 ఎకరాలకు విస్తరించిన హైడ్రా వీటికి పునరుజ్జీవలం కల్పించింది. హైడ్రా మొదట విడత చేపట్టిన ఆరు చెరువుల అభివృద్ధిని చేపట్టింది. వీటిలో బతుకమ్మకుంట ఇప్పటికే ప్రారంభం కాగా.. మరో మూడు సిద్ధమయ్యాయి. మాదాపూర్లోని సున్నం చెరువు, ఉప్పల్లోని నల్ల చెరువుల అభివృద్ధి వివిధ దశల్లో ఉంది. ముస్తాబైన కూకట్పల్లి నల్ల చెరువు ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు నిర్వహణ అభివృద్ధి చేసిన చెరువుల వద్ద కై ట్ ఫెస్టివల్ ఏర్పాట్లు చేపట్టిన హైడ్రా -
‘మత్తు’ దందాకు చెక్..!
నగరంలో మత్తు దందా నిర్వహిస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్, గంజాయి కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నిందితులు వారి కళ్లుగప్పి సరఫరా చేసేందుకుప్రయత్నిస్తున్నారు. కొత్త కొత్త దారుల్లో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారు. ఓ యువకుడైతే ఏకంగా బహిరంగ ప్రదేశాల్లో గంజాయి మొక్కలు పెంచుతుండగా.. మరో యువతి డ్రగ్స్ విక్రయిస్తోంది. ఇక ఇద్దరు యువకులు కొకై న్ తరలిస్తుండగా పట్టుబడ్డారు. రాజేంద్రనగర్: తన గుడారం పక్కనే గంజాయి మొక్కలను పెంచుతున్న యువకుడిని రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన మేరకు.. బిహార్కు చెందిన రాజేందర్ (30) తల్లిదండ్రులు, సోదరితో కలిసి రోడ్లపై వన మూలికలను విక్రయిస్తున్నాడు. ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంతంలో తాత్కాలిక గూడారాలను వేసుకొని నివసిస్తున్నాడు. కిస్మత్పూర్లోని ఖాళీ స్థలంలో కొద్ది రోజులుగా గుడారాలను వేసుకొని నివస్తున్నాడు. తన గుడారం పక్కనే గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరిగాయి. గంజాయి మొక్కలు కనిపించకుండా పరదాలను ఏర్పాటు చేశారు. ఈ విషయమై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెళ్లి తనిఖీలు చేపట్టగా అవి గంజాయి మొక్కలుగా నిర్ధారించారు. దీంతో వాటిని ధ్వంసం చేసి రాజేందర్ను అదుపులోకి స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. డ్రగ్స్తో పట్టుబడ్డ యువతి బంజారాహిల్స్: వెకేషన్ కోసమో, హాలిడే ట్రిప్ కోసమో చాలా మంది గోవాకు వెళ్తుంటారు. అందరిలాగా హైదరాబాద్కు చెందిన ఓ మహిళ గోవాకు వెళ్లింది. అయితే ట్రిప్ ఎంజాయ్ చేసి రాలేదు. డ్రగ్ పెడ్లర్స్తో పరిచయాలు పెంచుకుని దందాలోకి దిగింది. గుట్టుచప్పుడు కాకుండా గోవా నుంచి సిటీకి డ్రగ్స్ సరఫరా చేస్తూ వ్యాపారాన్ని విస్తరించింది. న్యూ ఇయర్ కోసం చేసిన ప్లాన్ బెడిసికొట్టడంతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితురాలిని అరెస్టు చేశారు. నిందితురాలిని బంజారాహిల్స్కు చెందిన హస్సాగా గుర్తించారు. గోవా నుంచి ఎండీఎంఏ, ఎల్ఎస్డీ సరఫరా చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు నైజీరియన్ సరఫరాదారుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. హస్సా 2024 డిసెంబర్లో గోవా పర్యటనలో భాగంగా డ్రగ్స్ పెడ్లర్స్తో పరిచయం పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాగటర్ క్లబ్లో ఎండీఎంఏ వినియోగించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు చెప్పారు. 2025 మార్చి నుంచి పలుమార్లు గోవాకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. హస్సా డిసెంబర్ 26న సియోలిమ్, మాపూసాలో ఎండీఎంఏ, ఎల్ఎస్డీ అందజేసినట్లు తేలింది. హైదరాబాద్కు చెందిన మరికొందరితో కలిసి డ్రగ్స్ విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. గోల్కొండ పోలీస్స్టేషన్లో ఎన్డీపీఎస్ కేసులో గతంలో అరెస్టయినట్లు చెప్పారు. -
‘ఈ మార్కులు అప్పట్లో చాలా కష్టం’
● డీజీపీ శివధర్రెడ్డి, కొత్వాల్ సజ్జనర్ సాక్షి, సిటీబ్యూరో: ‘మా రోజుల్లో నూటికి 40, 50 శాతం రావడమే గగనమయ్యేది. ఆ స్థాయిలో మార్కులు వస్తే చాలని పరితపించే వాళ్లం. అయితే నేటి తరం విద్యనభ్యసించడంలో పోటీ పడుతోంది. అందుకే 90 నుంచి 95 శాతం మార్కులు సాధించగలుగుతోంది’ అని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్రెడ్డి అన్నారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్టుల పిల్లలకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం స్కాలర్ షిప్స్, ప్రశంసా పత్రాలు అందిస్తూ ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జలవిహార్లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ... ‘కష్టపడి ప్రతిభను చాటిన వారికి ఇచ్చే ఇలాంటి గౌరవం వారికి మరింత ప్రోత్సాహంగా నిలుస్తుందన్నారు. ఈ విద్యార్థులు భవిష్యత్తులోనూ ఉన్నత విజయాలు సాధించాలని పేర్కొన్నారు. నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ మాట్లాడుతూ... జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ క్లబ్ చూపుతున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, సీఎస్బీ ఐఏఎస్ అకాడెమీ నిర్వాహకురాలు బాల లత, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వరికుప్పల రమేష్, కోశాధికారి రమేష్ వైట్లలతో పాటు కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. -
కొకై న్ తరలిస్తూ ఇద్దరు యువకులు..
మణికొండ: డ్రగ్స్తో ఇద్దరు వ్యక్తులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. రాజమండ్రికి చెందిన శ్రీనివాస్(46), గోవాకు చెందిన విజయ్లు పుప్పాలగూడలోని గోల్డెన్ టెంపుల్ వద్ద డ్రగ్స్తో సంచరిస్తున్నారనే సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ జరపగా వారి వద్ద ఏడు గ్రాముల కొకై న్ లబించింది. ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా శ్రీనివాస్ డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. దాంతో వారిద్దరితో పాటు లబించిన కొకై న్, రెండు సెల్ ఫోన్లను నార్సింగి పోలీసులకు అప్పగించారు. వారు ఎవరికి కొకై న్ సరఫరా చేసేందుకు వచ్చారు..ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారం నడిపిస్తున్నారు, వీరితో పాటు వారి గ్యాంగ్లో మరెంత మంది ఉన్నారనే కోణంలో ఎస్ఓటీ పోలీసులతో పాటు నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హై హై.. రైజింగ్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో రియల్ఎస్టేట్ మందగించిందని చెబుతున్నప్పటికీ.. జీహెచ్ఎంసీ పరిధిలో గడచిన (2025) సంవత్సరంలో హైరైజ్ (బహుళ అంతస్తుల) భవనాలు పెరిగాయి. అంతకుముందు 2024 సంవత్సరంలో జీహెచ్ఎంసీ నుంచి 69 హై రైజ్ భవనాలకు అనుమతులివ్వగా, 2025లో 103 బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులిచ్చారు. ఇతర భవన నిర్మాణ అనుమతులు మాత్రం కొంత తగ్గాయి. 2024లో 11,855 భవన నిర్మాణ అనుమతులు జారీ కాగా, 2025లో 11,166 భవన నిర్మాణ అనుమతులు జారీ అయ్యాయి. ఇవి తగ్గినప్పటికీ, హైరైజ్ భవన నిర్మాణ అనుమతులు, లే ఔట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ పెరగడంతో టౌన్ప్లానింగ్ విభాగం ఆదాయం పెరిగింది. 2024లో రూ.1,114.24 కోట్ల ఆదాయం రాగా, 2025లో రూ. 1,272.36 కోట్ల ఆదాయం లభించింది. గత సంవత్సరం మార్చినుంచి అమల్లోకి వచ్చిన ఏఐ ఆధారిత బిల్డ్ నౌ అప్లికేషన్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు.. ముఖ్యంగా భారీ భవంతులవి త్వరితంగా ఇవ్వడం సాధ్యమైందని అధికారులు పేర్కొన్నారు. 2024లో కేవలం 12 లేఔట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు అనుమతులివ్వగా 2025లో 30 లేఔట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు అనుమతులిచ్చారు. ఇక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు 2024లో 2,125 జారీ కాగా, 2025లో 2,401 జారీ అయ్యాయి. భూసేకరణ పనులు.. భవన నిర్మాణ అనుమతులతో పాటు టౌన్ప్లానింగ్ విభాగం వివిధ ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణలు కూడా పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. వీటిలో ట్రాఫిక్ రద్దీ సమస్యను పరిష్కరించే జంక్షన్ ఇంప్రూవ్మెంట్ల నుంచి హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)ప్రాజెక్ట్ కింద వివిధ ఫ్లై ఓవర్లు, ఆర్ఓబీలు, ఆర్యూబీల నిర్మాణాలకు అవసరమైన స్థల సేకరణ చేసినట్లు తెలిపింది. వీటితో పాటు గోషామహల్లో నిర్మించనున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనానికి అప్రోచ్, లింక్రోడ్లకు ప్రాధాన్యమిచ్చి భూసేకరణల ప్రతిపాదనలు త్వరితగతిన పూర్తి చేసినట్లు పేర్కొంది. రహదారుల విస్తరణకు.. ప్రధాన రహదారుల మార్గాల్లో రోడ్డు వెడల్పు, అభివృద్ధి పనులకు 2024లో ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. ఈ పనులు త్వరితగతిన జరిగేందుకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియ జరుగుతోందని తెలిపింది. నాలుగు ప్రధాన రహదారులకు సంబంధించి 696 ఆస్తులకుగాను 134 ఆస్తుల సేకరణ పూర్తి కాగా.. మిగతా ఆస్తుల సేకరణ పనులు పురోగతిలో ఉన్నట్లు పేర్కొంది. జంక్షన్ల పనులు.. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.233 కోట్లతో 90 జంక్షన్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించగా, 74 జంక్షన్లలో పనులు చేసేందుకు ప్లాన్లను ఆమోదించారు. జీహెచ్ఎంసీ పరిధిలో పెరిగిన హైరైజ్ భవనాలు 2025లో 103 బహుళ అంతస్తులకు అనుమతులు ఆశాజనకంగా టౌన్ప్లానింగ్ ఆదాయం -
ప్రతిష్టకు ఎగనామం
● మల్కాజిగిరిగా మారిన రాచకొండ కమిషనరేట్ ● గ్లోబల్ సిటీ అంటూ ఇలా పెట్టడంపై అభ్యంతరం ● సికింద్రాబాద్ పేరుతోనే కొనసాగించాలనే అభిప్రాయం ● కొత్తవాటి మధ్య సిబ్బంది విభజన సైతం ఇబ్బందే ● ప్రస్తుతానికి తాత్కాలికంగా పనులు చేసుకోనున్న పోలీస్ బాస్లుసాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ మాదిరిగానే పరిపాలన సౌలభ్యం కోసం రాజధానిలోని మూడు పోలీసు కమిషనరేట్లను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్త జోన్లు, డివిజన్లు, పోలీసుస్టేషన్లు... పరిధులతో రూపురేఖలు మార్చింది. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధులు మారగా... రాచకొండ స్థానంలో మల్కాజిగిరి కమిషనరేట్ వచ్చింది. ఈ పేరుపైనే అనేక విమర్శలు వస్తున్నాయి. మరోపక్క మేడ్చల్ పోలీసుస్టేషన్ను సైబరాబాద్ కమిషనరేట్లో కలపడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఉండటం, మల్కాజిగిరి పేరుతో కమిషనరేట్ ఏర్పాటు చేస్తున్నప్పుడు మేడ్చల్ను సైబరాబాద్లో చేర్చడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు ఈ కమిషనరేట్లలో అధికారికంగా నేటి (శుక్రవారం) నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అప్పట్లోనే అనేక విమర్శలు.. ఒకప్పుడు హైదరాబాద్ కమిషనరేట్ మాత్రమే ఉండేది. 2002లో సైబరాబాద్ కమిషనరేట్కు రూపమిచ్చిచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం 2016లో సైబరాబాద్ను విడగొడుతూ నల్లగొండలోని కొన్ని ప్రాంతాలను కలిపి మరో కమిషనరేట్ ఏర్పాటు చేసింది. తొలినాళ్లల్లో దీన్ని సైబరాబాద్ ఈస్ట్ అన్నా..ఆపై రాచకొండగా మార్చారు. దీనికి ఆ పేరు పెట్టడంపై అప్పట్లో అనేక విమర్శలు సైతం వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్. రాచకొండల్లో ఉన్న ప్రాంతాలతో ఏర్పడిన కొత్త కమిషనరేట్కు మల్కాజిగిరి అని పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జగమెరిగిన సికింద్రాబాదే మేలు.. దేశంలోనే కాదు.. ప్రపంచం పటంలోనే హైదరాబాద్తో పాటు సికింద్రాబాద్ పేరు సుపరిచితమే. రైల్వేస్టేషన్, మహంకాళి దేవాలయం, పరేడ్ గ్రౌండ్స్, కంటోన్మెంట్ బోర్డు, బైసన్ పోలో, జింఖానా గ్రౌండ్స్ ఉండటం దీనికి ప్రధాన కారణం. మరోపక్క సికింద్రాబాద్కు బ్రిటిషర్ల కాలం నుంచీ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కొత్తగా ఏర్పడిన కమిషనరేట్లో ఈ ప్రాంతాలు కూడా ఉన్నాయి. దీంతో సికింద్రాబాద్ పేరు ఖరారు చేస్తే ఉత్తమం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బృహత్ జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించి గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్, గ్రేటర్ సైబరాబాద్గా మార్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే విషయం గమనార్హం. సిబ్బంది విషయంలోనే ఇబ్బందులు.. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ మధ్య సిబ్బంది విభజన విషయంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదికన కేటాయించుకుని, భవిష్యత్తులో తుది చర్యలు తీసుకోనున్నారు. ఇలా విస్తరించి ఉండటంతో... హైదరాబాద్, సైబరాబాద్ మొత్తం చార్మినార్ జోన్లో భాగం. రాచకొండ మాత్రం చార్మినార్ జోన్తో పాటు యాదాద్రిలోనూ విస్తరించి ఉంది. ఈ కమిషనరేట్ మల్కాజిగిరిగా మారే వరకు యాదాద్రి ప్రాంతం కూడా ఇందులో భాగంగానే ఉండేది. దీంతో ఈ కమిషనరేట్లో రెండు జోన్లు ఉండేవి. పునర్వ్యవస్థీకరణ తర్వాత రాచకొండలోని కొన్ని ప్రాంతాలు మల్కాజిగిరిలో, కొన్ని హైదరాబాద్లో వచ్చి కలిశాయి. దీంతో ఇక్కడి సిబ్బంది సాంకేతికంగా హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లలో పని చేస్తున్నా... వారి నియంత్రణ అధికారం మాత్రం చార్మినార్, యాదాద్రి జోన్లకు సంబంధించిన డీఐజీలకే ఉంటుంది. దీంతో భవిష్యత్తులో వీరికి పదోన్నతులు కల్పించాలంటే ఈ రెండు జోన్లకు చెందిన డీఐజీలకు జాబితా పంపి, దాని ఆధారంగానే ముందుకు వెళ్లాల్సి ఉండటంతో సీనియారిటీ జాబితా తయారీలో సాకేంతిక ఇబ్బందులు వస్తాయి. సైబరాబాద్లో కలుస్తున్న ‘జిల్లా’.. మల్కాజిగిరి కమిషనరేట్లోనూ ఇలాగే హైదరాబాద్, యాదాద్రి జోన్లకు ఎంపికై న వాళ్లు ఉన్నారు. మరోపక్క సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లోకి పటాన్చెరు, అమీన్పూర్, ఆర్సీపురం తదితర ప్రాంతాలను తీసుకువచ్చి కలిపారు. కానిస్టేబుల్ స్థాయి అధికారుల రిక్రూట్మెంట్ రెవెన్యూ జిల్లా, యూనిట్ స్థాయిలో జరుగుతుంది. ప్రస్తుతం సైబరాబాద్లో పని చేస్తున్న కానిస్టేబుళ్లు భౌగోళికంగా ఆ కమిషనరేట్కు చెందిన స్థానికులు అవుతారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన వాళ్లు అమీన్పూర్, పటాన్చెరువు, ఆర్సీపురం ఠాణాల్లో పని చేస్తూ ఉంటారు. ఈ కారణంగా వీరి సీనియారిటీ జాబితా తయారీ, పదోన్నతులు సైతం చార్మినార్ జోన్తో పాటు సంగారెడ్డిలకు పంపాల్సి ఉంటుంది. ఈ సాంకేతిక కారణాలను అధిగమించాలంటే జోన్లను పునర్వవస్థీకరించాల్సి ఉంది. ఆ మేరకు ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపి ఆ మొత్తం పొంది రాష్ట్రపతి ద్వారా ఉత్తర్వులు వెలువడాలి. దీనికి సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బంది విభజన చేసుకోనున్నారు. -
ఫ్యూచర్ సిటీలోనే కమిషనరేట్!
మూడు జోన్లు, 22 ఠాణాలతో దీని స్వరూపం ● 30– 40 ఎకరాల స్థలాన్వేషణలో యంత్రాంగం ● నాలుగు నెలల తర్వాత ఫ్యూచర్కు కొత్త పోలీసు బాస్? ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్కు తొలి కమిషనర్గా జి.సుధీర్బాబును నియమించింది. ఇప్పటివరకు రాచకొండ కమిషనర్గా ఉన్న ఈయన ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భారత్ ఫ్యూచర్ సిటీకి పోలీసు బాస్గా నియమించారనే ప్రచారం జరుగుతోంది. మరో 3–4 నెలల్లో సుధీర్ బాబు పదవీకాలం ముగియనుంది. దీంతో ఫ్యూచర్ సిటీకి కొత్త పోలీసు బాస్ నియామకం అనివార్యం. ఒకవేళ రిటైర్మెంట్ తర్వాత కూడా సుధీర్ బాబునే కమిషనర్గా కొనసాగిస్తే.. పదవీ విరమణ తర్వాత కూడా పోలీసు కమిషనర్గా కొనసాగిన తొలి కమిషనర్గా సుధీర్ బాబు రికార్డ్ సృష్టించినట్లవుతుందనే ప్రచారం జరుగుతోంది. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను పునర్ వ్యవస్థీకరించడంతో రాజధానిలో శాంతి భద్రతలను కాపాడటం, పోలీసింగ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చడం, సమర్థమైన పర్యవేక్షణ అనివార్యమైన నేపథ్యంలో గ్రేటర్ పోలీసు విభాగాన్ని కూడా పునర్విభజించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లు ఉండగా.. కొత్తగా ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్ను ఏర్పాటు చేశారు. సైబరాబాద్, రాచకొండలోని పలు శాంతి భధ్రతలు, ట్రాఫిక్ జోన్లను వేరు చేసి.. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కు బదలాయించారు. దీంతో ప్రస్తుతం ఈ కొత్త కమిషనరేట్ పరిధిలో శంషాబాద్, రాజేంద్రనగర్, మహేశ్వరం లా అండ్ ఆర్డర్ జోన్ల పరిధిలోని 22 ఠాణాలు, మాదాపూర్, ఎల్బీనగర్ ట్రాఫిక్ జోన్ల పరిధిలోని నాలుగు పీఎస్లతో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ స్వరూపం ఉంటుంది. ప్రస్తుతం రంగారెడ్డి కలెక్టరేట్లో ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాత్కాలిక కాలం పాటు ఇక్కడి నుంచే కమిషనరేట్ కార్యకలాపాలు సాగించనుంది. త్వరలోనే ప్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) పరిధిలో కమిషనరేట్కు స్థలం కేటాయించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే 30– 40 ఎకరాల స్థలం కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. కొత్త కమిషనరేట్ ఎందుకంటే? ఔటర్ రింగ్ రోడ్ వరకూ జీహెచ్ఎంసీ విస్తరణ తర్వాత గ్రేటర్ పరిధి పెరిగిపోయింది. దీనికి తోడు ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరం అవసరమని భావించింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారి మధ్యలో ముచ్చర్ల ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు పలు బహుళ జాతి సంస్థలతో ఒప్పందం చేసుకుంది. దీంతో అంతర్జాతీయ పెట్టుబడులు, కంపెనీలకు శాంతిభద్రతలు, పెట్టుబడులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో కొత్తగా ఫ్యూచర్ సిటీ పరిధి వరకు పోలీసు కమిషనరేట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే సైబరాబాద్, రాచకొండలోని పలు ప్రాంతాలను వేరు చేసి కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ను ఏర్పాటు చేశారు. ఠాణాలివీ జోన్లు (3): శంషాబాద్, రాజేంద్రనగర్, మహేశ్వరం డివిజన్లు (6): శంషాబాద్, షాద్నగర్, చేవెళ్ల, నార్సింగి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ఠాణాలు (22): కొత్తూరు, నందిగామ, ఆమన్గల్, తలకొండపల్లి, కడ్తాల్, శంషాబాద్/పెద్దషాపూర్, షాద్నగర్ టౌన్, కేశంపేట, కొందుర్గ్, చౌదరిగూడెం, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, మోకిల, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ, కందుకూరు, మహేశ్వరం, మాడ్గుల. ఠాణాలివీ జోన్లు (3): శంషాబాద్, రాజేంద్రనగర్, మహేశ్వరం డివిజన్లు (6): శంషాబాద్, షాద్నగర్, చేవెళ్ల, నార్సింగి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ఠాణాలు (22): కొత్తూరు, నందిగామ, ఆమన్గల్, తలకొండపల్లి, కడ్తాల్, శంషాబాద్/పెద్దషాపూర్, షాద్నగర్ టౌన్, కేశంపేట, కొందుర్గ్, చౌదరిగూడెం, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, మోకిల, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ, కందుకూరు, మహేశ్వరం, మాడ్గుల -
న్యూ జోష్
● 2025కు వీడ్కోలు.. 2026కు స్వాగతం ● నగరంలో వెల్లువెత్తిన నూతనోత్సాహం కాల గమనంలో మరో ఏడాది కనుమరుగైపోయింది. నూతన వత్సరానికి నగరం స్వాగతం పలికింది. బుధవారం అర్ధరాత్రి నుంచి న్యూ ఇయర్ వేడుకల సంబరాలు అంబరాన్నంటేలా సాగాయి. యూత్ ఫుల్ జోష్తో ఆనంద సాగరంలో మునిగితేలింది. నగర వ్యాప్తంగా పలు రిసార్టులు, క్లబ్బులు, కేఫ్లు, ఆడిటోరియంలు కిటకిటలాడాయి. సినీ సెలబ్రిటీలు సిటిజనులతో కలిసి ఆటాపాటలతో సందడి చేశారు. తరలివచ్చిన టాప్ డీజేలు, బ్యాండ్స్, స్టాండప్ కమెడియన్స్.. వినోదాన్ని పంచారు. సాగర్ రోడ్లోని జీఎస్ఆర్ కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో సినీ నేపథ్య గాయని సునీత, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్లు సంగీతం హోరులో ఓలలాడించారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ యూత్ని ఉర్రూతలూగించారు. తాజా సంగీత సంచలనం, గాయకుడు రామ్ మిరియాల కూడా ఇదే ఈవెంట్లో తన గానంతో అలరించారు. మాదాపూర్లోని క్వేక్ ఎరీనాలో నిర్వహిస్తున్న న్యూఇయర్ పార్టీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ హోస్ట్గా ఫీస్ట్ని రక్తికట్టించారు. గచ్చిబౌలిలోని ప్రిజ్మ్ క్లబ్ అండ్ కిచెన్ కార్యక్రమంలో సిటీకి చెందిన టాప్ బ్యాండ్ క్యాప్రిసియో సంగీత ప్రియులకు వీనుల విందు పంచింది. దీనికి ముంబై నుంచి వచ్చిన టాప్ లేడీ డీజే పరోమా జోరు తోడైంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని కిండ్డమ్ క్లబ్లో జరిగిన ఈవెంట్లో ముంబై డీజే అలీ మర్చంట్కు తోడుగా కయీలు సంగీతం ఆకట్టుకుంది. ఈ ఒరవడి నగరవ్యాప్తంగా కొనసాగింది. – సాక్షి, సిటీబ్యూరోహైటెక్స్లో సన్నీ లియోన్ కంట్రీ క్లబ్లో సినీ నటి ప్రజ్ఞానయన్ -
ముసాయిదా బడ్జెట్కు ఓకే
రూ.11,460 కోట్ల ప్రతిపాదనలకు స్టాండింగ్ కమిటీ ఆమోదంసాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కోసం రూపొందించిన రూ.11,460 కోట్ల ముసాయిదా బడ్జెట్కు స్టాండింగ్ కమిటీ సమావేశం పచ్చజెండా ఊపింది. సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం రాబోయే ఆర్థిక సంవత్సరానికి(2026–27) సంబంధించిన ఈ బడ్జెట్ను ఆమోదించింది. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనలకు అనుగుణంగా త్వరలోనే పాలకమండలి సర్వసభ్య సమావేశంలోనూ దీనికి ఆమోదముద్ర వేసి, ప్రభుత్వానికి సమాచార నిమిత్తం పంపనున్నారు. మొత్తం బడ్జెట్లో పాత జీహెచ్ఎంసీకి రూ.9,200 కోట్లు కేటాయించగా, విలీనమైన 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు మిగతా రూ.2,260 కోట్లను విడిగా కేటాయించారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ.8,880 కోట్లు కేటాయించగా, రివైజ్డ్ చేసి రూ.9వేల కోట్లకు అప్పట్లో పెంచారు. అయితే గత అక్టోబర్ వరకు కేవలం రూ.4,020 కోట్లు ఖర్చు కావడం గమనార్హం. కార్పొరేటర్లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్ల బడ్జెట్ కేటాయించినప్పటికీ, ప్రస్తుత పాలకమండలి గడువు నెలన్నరలోపునే ముగిసిపోనుండటంతో ఎన్ని నిధులు ఖర్చు అవుతాయో వేచి చూడాల్సిందే. ఇతర ముఖ్యాంశాలు.. ● జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ఏఐ ఆధారిత సొల్యూషన్ల అమలు, నిర్వహణ కోసం మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్ ఎంపికకుగాను ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లు పిలిచేందుకు ఆమోదం. ఇందులో ఏఐ చాట్బాట్, ఆటోమేటెడ్ ఫారమ్ ఫిల్లింగ్ సొల్యూషన్లు ఉన్నాయి. ● చందానగర్ సర్కిల్లోని ఇజ్జత్నగర్ బీసీ వైకుంఠధామంలో దహన యూనిట్ ఏర్పాటు, పూజా మండపం, దింపుడు కల్లం, గ్యాలరీలు, మరుగుదొడ్లు, కలప నిల్వ గది, ఇంకుడుగుంత, ఇతర పనులకు ఆమోదం ● జాంబాగ్ వార్డు పరిధిలో 94 నెంబర్ బస్స్టాప్ దగ్గర విజయ డెయిరీ నుంచి యూనివర్సల్ బుక్స్టోర్ వరకు, ఈఎన్టీ ఆసుపత్రి క్యాంపస్ వెలుపల బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ● వాహనదారులు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించేందుకు తార్నాక జంక్షన్లో సర్వజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎస్సార్ కింద హెల్మెట్ శిల్పం ఏర్పాటుకు అనుమతి. వివిధ సంస్థల సీఎస్సార్ పనులకు గ్రీన్సిగ్నల్. ఇప్పటికే చేస్తున్నవాటి పొడిగింపునకు ఓకే ● దోమల్గూడలోని హైదరాబాద్ స్టడీ సర్కిల్ లీజు గడువు పొడిగింపునకు అనుమతి ● మాసబ్ ట్యాంక్లోని చాచా నెహ్రూ పార్క్ స్పోర్ట్స్’ ప్లే గ్రౌండ్ను అనధికారికంగా ఆక్రమించి, 33 ఏళ్లుగా లీజు చెల్లించని స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్పై చర్యలు తీసుకునేందుకు సుముఖత ● ఎన్బీటీ నగర్ మల్టీపర్పస్ భవనం పేరును ఎన్బీటీ నగర్ కన్వెన్షన్ హాల్గా మార్చేందుకు అనుమతి ● డాక్టర్ ఏఎస్ రావు నగర్లోని జై జవాన్ కాలనీ(ఎక్స్–సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్) వద్ద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్(10) దుకాణాలు/యూనిట్ల టెండర్ కమ్ ఓపెన్ పబ్లిక్ వేలం నిర్వహణకు ఆమోదం లాస్ట్ టూర్.. బడ్జెట్పై ప్రత్యేక సమావేశం ముగిశాక, 22 అంశాలపై స్టాండింగ్ కమిటీ చర్చించింది. పదవీకాలం గడచిపోతుండటంతో స్టడీ టూర్ పేరిట కార్పొరేటర్లు అహ్మదాబాద్, చంఢీగఢ్ నగరాలను చుట్టివచ్చే అంశంతోపాటు ఇతర అంశాలకు ఓకే చెప్పింది. కార్పొరేటర్ల స్టడీ టూర్ కోసం జీహెచ్ఎంసీ దాదాపు రూ.1.50 కోట్లు ఖర్చు చేయనుంది. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. త్వరలో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ముందుకు.. ఎవరేమనుకున్నా స్టడీ టూర్లకూ రెడీ! -
పారిశుధ్యంపై ఫోకస్ పెంచాలి
జోనల్, డిప్యూటీ కమిషనర్లకు కర్ణన్ ఆదేశం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో పారిశుధ్యాన్ని మరింతగా మెరుగుపరచడానికి జోనల్, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. సోమవారం ప్రారంభమైన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా తొలిరోజు నగరవ్యాప్తంగా ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిల క్లీనింగ్పై దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షించారు. కిస్మత్పూర్, నార్సింగి, సన్సిటీలలో కర్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రభావవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. రానున్న రోజుల్లో ఫ్లై ఓవర్లు, రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ మీడియన్లు, చెరువులు, నాలాలు, ఫుట్పాత్లు, పార్కులు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం పక్కాగా చేపట్టాలన్నారు. -
ఓ బాట‘సారీ’!
నగర రహదారులపై పాదచారికి నరకమేసాక్షి, సిటీబ్యూరో: ‘పెడస్ట్రియన్ ఈజ్ కింగ్ ఆఫ్ ది రోడ్’ (పాదచారే రహదారికి రారాజు)... ఈ అంతర్జాతీయ నానుడి రాజధాని నగరంలో మాత్రం అమలుకావట్లేదు. ఈ సిటీ పెడస్ట్రియన్కు ఏమాత్రం సేఫ్ కాదని ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలు, కనిపించని మౌలిక వసతులే స్పష్టం చేస్తున్నాయి. నగరంలో ప్రతి ఏడాదీ రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో పాదచారులది రెండో స్థానం. ఈ ఏడాది మృత్యువాతపడిన వారి సంఖ్య 294గా ఉండగా.. వీరిలో పాదచారులే 105 మంది. అంటే.. 35.71 శాతం అన్నమాట. ఈ పరిస్థితి తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రతి ఏడాదీ పదుల సంఖ్యలో... నగర ట్రాఫిక్ పోలీసులు ఏటా ప్రమాదాలపై విశ్లేషణ నిర్వహిస్తారు. ప్రమాదాలకు కారణమ వుతున్న వాహనాలు, బాధితులుగా/మృతులుగా మారుతున్న వారు ఎవరెవరు అనేది గణాంకాల ప్రకారం జాబితాలు రూపొందిస్తుంటారు. ఈ ఏడాది పోలీసు రికార్డుల ప్రకారం 2,679 రోడ్డు ప్రమాదాలు జరగ్గా... వీటిలో పాదచారులకు సంబంధించినవి 837 ఉన్నాయి. మొత్తం యాక్సిడెంట్స్లో 294 మంది చనిపోగా.... వీరిలో పాదచారులు 105 మంది ఉన్నారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారు తున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులు తొలిస్థానంలో ఉండగా... రెండోస్థానం పాదచారులదే. ఈ పెడస్ట్రియన్ యాక్సిడెంట్స్తో అత్యధికం ఇన్నర్ రింగ్ రోడ్లో జరిగినవే కావడం గమనార్హం. ఈ దుస్థితికి కారణాలు అనేకం... రాజధానిలో ఉన్న రహదారులపై పాదచారులు భద్రంగా తిరిగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. పురాతన నగరమైన పాతబస్తీలోనే కాదు... ఇటీవలే రూపుదిద్దుకుని, నానాటికీ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోనూ ఇవి మచ్చుకై నా కనిపించవు. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలోనూ పాదచారులకు సరైన ప్రాధ్యానం లభించట్లేదు. ప్రణాళిక లోపం కారణంగా నగర ఫుట్పాత్ల్లో సగం ఆక్రమణకు గురికాగా... మిగిలిన చోట్ల అనేక అడ్డంకులు వస్తున్నాయి. జంక్షన్స్ వద్ద పెడస్ట్రియన్స్ క్రాసింగ్ కోసం ప్రత్యేకమైన చర్యలు లేవు. కీలక ప్రాంతాల్లో కనీసం రెండడుగుల వెడల్పుతో ఫుట్పాత్ ఏర్పాటు చేయాలని, దీనికి బారికేడింగ్, అవసరమైన ప్రాంతాల్లో క్రాస్ చేసేందుకు ఓపెనింగ్స్తో కూడిన ప్రతిపాదనలకు పూర్తిస్థాయిలో అమ లు కావట్లేదు. పెలికాన్ సిగ్నల్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఇప్పటికీ అవరమైన సంఖ్యలో కనిపించవు. ఇది పెడస్ట్రియన్ ఫ్రెండ్లీ సిటీ కాదు నగరంలో రోడ్డు భద్రత, పాదచారుల హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు అనేకం ఉన్నాయి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో 50 శాతం పైగా పాదచారులు ఉంటున్నారు. సిటీలో చూసుకున్నా పరిస్థితి దాదాపు ఇలానే ఉంది. దీనికి ప్రధాన కారణం రోడ్డు వినియోగం విషయంలో పాదచారుడికి అతి తక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే. ఇక్కడ ఏ ప్రాంతంలోనూ సరైన ఫుట్పాత్స్, పెడస్ట్రియన్ క్రాసింగ్స్తో పాటు జంక్షన్స్లోనూ అవసరమైన వసతులు లేవు. సబ్–వేల ఏర్పాటుకూ అనేక ఇబ్బందులు, భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయి. పాదచారుల భద్రత కోసం అవసరమైన ప్రతి ప్రాంతంలోనూ పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి. ఉన్న మౌలిక వసతుల్ని సైతం వినియోగించకుండా అడ్డదిడ్డంగా రోడ్డు దాటే పాదచారులకు సైతం జరిమానా విధించాలి. సింగపూర్లో ఇలా ఎవరైనా దాటితే భారత కరెన్సీ ప్రకారం మొదటిసారి రూ.20 వేలు, రెండోసారైతే రూ. 25 వేలు జరిమానాతో పాటు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు. మౌలిక వసతులతో పాటు ఇలాంటి కఠినమైన చట్టాలు సైతం రావాలి. – రహదారి భద్రత నిపుణులు అబిడ్స్లో ఫుట్పాత్ ఇలా..ఇవీ గణాంకాలు: 2023 2024 2025 మొత్తం ప్రమాదాలు 2548 3,058 2679 పాదచారులవి 906 974 837 మొత్తం మృతులు 335 301 294 వీరిలో పాదచారులు 137 118 105 మొత్తం క్షతగాత్రులు 2596 3393 2950 వీరిలో పాదచారులు 813 919 788 (2025 డేటా ఈ నెల 20 వరకు) ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత ఈ ఏడాది చనిపోయిన వారి సంఖ్య 105 మొత్తం మృతుల్లో ఇది ఏకంగా 35 శాతం పట్టనట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగాలు -
సెల్ఫోన్ల కంటే పుస్తకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
కవాడిగూడ: నేటితరం యువత సెల్ఫోన్ల కంటే పుస్తకాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం బుక్ఫెయిర్ ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో సెల్ఫోన్లు, సినిమాలకు దూరంగా ఉంటూ యువత పెద్ద ఎత్తున పుస్తక ప్రదర్శనకు రావడం సమాజంలోని మేథో అంతర్మధనానికి నిదర్శనం అని పేర్కొన్నారు. రాజ్యాంగం అందరికి అందుబాటులో ఉండాలని, వేదికలపై మహిళా ప్రాతినిధ్యం పెరగాలన్నారు. పుస్తకాలు కేవలం సమాచారం కోసం కాకుండా, మనిషిలో స్వతంత్ర ఆలోచనలు రేకిత్తించే సాధనాలుగా ఉండాలని ఆయన సూచించారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ విశ్వ విద్యాలయాల పరిశోధన పత్రాలను ప్రజలకు చేరువ చేయాలని అన్నారు. విద్య, సాంఘిక సంక్షేమ శాఖలను పుస్తక ప్రదర్శనలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ వీసీ సూర్య ధనుంజయ్, సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తి తదితరులు మాట్లాడారు. బుక్ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రమా మెల్కొటే, ప్రధాన కార్యదర్శి ఆర్.వాసు, ఉపాధ్యక్షులు బాల్రెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యువతకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్రెడ్డి సూచన -
బుక్ ఫేర్ వెల్..
చివరి రోజు పోటెత్తిన సందర్శకులు ఈ సారి భారీగా తరలివచ్చిన పుస్తక ప్రియులు కిక్కిరిసిన స్టాళ్లు సాక్షి, సిటీబ్యూరో: పుస్తకప్రియులను, సందర్శకులను కట్టిపడేసిన హైదరాబాద్ 38వ పుస్తక ప్రదర్శన సోమవారం ముగిసింది. చివరి రోజు కూడా సందర్శకులు భారీగా తరలివచ్చారు. పిల్లలు, పెద్దలు, యువతీ యువకులు ఉత్సాహంగా పుస్తక మహోత్సవంలో భాగస్వాములయ్యారు. నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. గతేడాది కంటే ఈసారి ఎక్కువ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చినట్లు బుక్ఫెయిర్ కమిటీ నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు. 11 రోజుల్లో కనీసం 15 లక్షల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు అంచనా. వరుస సెలవులు కూడా పుస్తక ప్రదర్శనకు బాగా కలిసి వచ్చాయి. దీంతో బుక్ఫెయిర్ సందర్శకులతో కళకళలాడింది. స్టాళ్లు కిక్కిరిసిపోయాయి. నవలలు, కథల పుస్తకాలకు ఆదరణ చరిత్ర, సంస్కృతి గ్రంథాలతో పాటు నవలలు, కథల పుస్తకాలకు పాఠకులు బ్రహ్మరథం పట్టారు. ఆధ్యాత్మిక రంగానికి చెందిన పుస్తకాలు కూడా బాగానే అమ్ముడైనట్లు పలు ప్రచురణ సంస్థలు తెలిపాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలతో ఈ సంవత్సరం 365 స్టాళ్లను ఏర్పాటు చేశారు. రచయితలకు ప్రోత్సాహకంగా ప్రత్యేకంగా కొన్ని స్టాళ్లను కేటాయించారు. అన్ని రకాల పుస్తకాలతో పాటు వ్యక్తిత్వ వికాస గ్రంథాలు, పోటీ పరీక్షలకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్కు కూడా ఆదరణ కనిపించింది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల విద్యార్ధులు, యువత పెద్ద సంఖ్యలో ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈసారి వందకు పైగా కొత్త పుస్తకాలను ఆవిష్కరించారు. నవతరం రచయితలు తమ రచనలను పాఠకులకు పరిచయం చేశారు. హైదరాబాద్ సాంస్కృతిక జీవితంలో భాగంగా ప్రతి ఏడాది వందలాది పుస్తక ప్రచురణ సంస్థలు, లక్షలకొద్దీ పుస్తకాలతో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన మరోసారి అదరహో అనిపించింది. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను ప్రేక్షకుల ను అలరించాయి. నచ్చిన పుస్తకాలపైన నిర్వహించిన ప్రసంగాలు సాహిత్య పరిమళాలను గుబాళించాయి. ఈ ఏడాది పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రముఖ కవి అందెశ్రీ పేరు పెట్టారు. అనిశెట్టి రజిత, కొంపెల్లి వెంకట్గౌడ్ల స్మారకార్థం ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసి సాహిత్య రంగానికి వారు అందజేసిన సేవలను గుర్తుచేశారు. -
టచ్ అండ్ గో.. ఈజీ జర్నీ!
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల ప్రయాణ సౌకర్యాలను విస్తృతపర్చడం, నాణ్యంగా, సత్వరంగా అందించడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(హుమ్టా) కసరత్తు చేస్తోంది. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించడంతోపాటు లాస్ట్మైల్ కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చేందుకు సమగ్ర రవాణా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఈ దిశగా పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఉన్న ఎంఎంటీఎస్, సిటీబస్, మెట్రో సేవలను సమన్వయం చేస్తూ సమగ్ర రవాణా సదుపాయాలను కల్పించేందుకు హెచ్ఎండీఏ అనుబంధ హుమ్టా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే, మెట్రో అధికారులతో ఇటీవల బస్భవన్లో సమావేశం ఏర్పాటు చేసింది. ఆ మూడు సంస్థల అధికారులు పాల్గొని పలు సూచనలు అందజేశారు. ఈ మేరకు హుమ్టా ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. మలక్పేట్ ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచి మలక్పేట్ మెట్రోస్టేషన్ వరకు ప్రయాణికులు తేలిగ్గా రాకపోకలు సాగించేందుకు దక్షిణ మధ్య రైల్వే స్కైవాక్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఇదే తరహాలో మరిన్ని చోట్ల ఎంఎంటీఎస్, మెట్రోస్టేషన్ల మధ్య స్కైవాక్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ప్రయాణికులకు సీమ్లెస్ జర్నీ సదుపాయం అందుబాటులోకి రావడమే కాకుండా మెట్రో నుంచి ఎంఎంటీఎస్కు తేలిగ్గా మారేందుకు అవకాశం లభిస్తుంది. అధికారులు అవసరమైన చోట సిటీ బస్సులను కూడా ఏర్పాటు చేయనున్నారు. టచ్ అండ్ గో ఇలా... ● నగరంలో 51 ఎంఎంటీఎస్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతిరోజు 88 సర్వీసులు నడుస్తున్నాయి. కానీ, ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీ, డిమాండ్ మేరకు అవి అందుబాటులో లేకపోవడం వల్ల ప్రయాణికులు ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తున్నారు. గతంలో రోజుకు 121 సర్వీసులు నడిచేవి. సుమారు 1.4 లక్షల మంది ప్రయాణించేవారు. ఇప్పుడు బాగా తగ్గారు. రోజుకు 60 వేల మంది మాత్రమే ప్రయాణిస్తున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో ఎంఎంటీఎస్ సర్వీసులతోపాటు ప్రయాణికుల సంఖ్యను కూడా పెంచేందుకు హుమ్టా ప్రణాళికలు సిద్ధం చేసింది. ● 51 ఎంఎంటీఎస్ స్టేషన్లలో 29 స్టేషన్లకు మాత్రమే సిటీ బస్సుల సదుపాయం ఉంది. అయితే ఈ స్టేషన్లు బస్టాపు నుంచి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్నాయి. ● మరో 13 స్టేషన్లు మాత్రం బస్టాపు నుంచి కనీసం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రయాణికులు ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచి బస్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. ● రెండు కిలోమీటర్ల దూరానికి ఆటోవాలాలు కనీసం రూ.50 పైనే వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఎంఎంటీఎస్ నుంచి సిటీబస్సుకు మారేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ● ఈ రూట్లలో సిటీ బస్సులను ఎంఎంటీఎస్ స్టేషన్ మీదుగా నడిపితే ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. రెండు రకాల రవాణా సదుపాయాలను సద్వినియోగం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ● హైటెక్సిటీ, చందానగర్, నేచర్ క్యూర్ హాస్పిటల్, లింగంపల్లి, ఉందానగర్, నెక్లెస్రోడ్డు, సంజీవయ్య పార్కు, ఫలక్నుమా, యాకుత్పురా, గౌడవెల్లి, మేడ్చల్, మనోహరాబాద్, కూచవరం స్టేషన్లకు సిటీబస్సులతో కనెక్టివిటీని ఏర్పాటు చేయాలి. ● ఇప్పటికే సిటీ బస్సులకు అందుబాటులో ఉన్న ఎంఎంటీఎస్ స్టేషన్లకు ట్రిప్పులను పెంచాలి. స్కైవాక్తో అనుసంధానం... ● మిగతా ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి సమీపంలోని మెట్రోస్టేషన్లకు రాకపోకలు సాగించేందుకు వీలుగా స్కైవాక్లను ఏర్పాటు చేయాలి. మలక్పేట్ స్టేషన్ పునరాభివృద్ధిలో భాగంగా రైల్వే అధికారులు స్కైవాక్ నిర్మాణం చేపట్టారు. ● నాంపల్లి స్టేషన్ రీడెవలప్మెంట్లో భాగంగా నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి మెట్రో వరకు స్కైవాక్ అందుబాటులోకి రానుంది. ● సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఈస్ట్, వెస్ట్ సికింద్రాబాద్ మెట్రో స్టేషన్లు, రేతిఫైల్, గురుద్వారా బస్టాపులను కలుపుతూ స్కైవాక్ నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. ● కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి నారాయణగూడ మెట్రోకు స్కైవాక్తో అనుసంధానం చేయాలి. ● లక్డీకాపూల్, బేగంపేట్, భరత్నగర్ ఎంఎంటీఎస్ స్టేషన్లకు కూడా మెట్రో స్టేషన్లను అనుసంధానం చేయాలని అధికారులు సూచించారు. ఎంఎంటీఎస్– సిటీబస్, మెట్రోల మధ్య కనెక్టివిటీకి చర్యలు మెట్రో స్టేషన్లకు సమీపంలో ఉన్నచోట స్కైవాక్లు సమగ్ర రవాణా అభివృద్ధికి హుమ్టా ప్రత్యేక కార్యాచరణ -
ట్రావెల్ బ్యాగులో కుక్కి..గోదావరిలో పారవేసి..
మల్లాపూర్: ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి నగదు, బంగారం, కోసం ఒంటరిగా ఉంటున్న ఇంటి యజమానురాలిని దారుణంగా హత్య చేశాడు. ఆపై ఇద్దరు స్నేహితుల సహాయంతో మృతదేహాన్ని గోదావరి నదిలో పారవేసిన సంఘటన నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..మల్లాపూర్ బాబానగర్కు చెందిన సూరెడ్డి సుజాత (65) కనిపించడం లేదని బంధువుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాచారం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పెరవెల్లి మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన మద్దు అంజిబాబు డ్రైవర్గా పని చేస్తున్నాడు. రెండు నెలల క్రితం అతను మల్లాపూర్ బాబానగర్లో సూరెడ్డి సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. ఒంటరిగా ఉంటున్న యజమానురాలి వద్ద పెద్ద మొత్తంలో బంగారం, నగదు ఉన్నట్లు గుర్తించిన అతను వాటిని కాజేసేందుకు కుట్ర పన్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 19న ఆమె గొంతు నులిమి హత్య చేసి నగదు, బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ట్రావెల్ బ్యాగ్లో మృతదేహాన్ని భద్రపరిచాడు. స్నేహితుల సహాయంతో గోదావరి నదిలో పారవేత.. తన స్నేహితులైన కోనసీమ జిల్లాకు చెందిన నక్కటి యువరాజు, నూకల దుర్గా రావు సహాయంతో సుజాత మృతదేహాన్ని కారులో కోనసీమ జిల్లా పరిధిలోని గోదావరి నదికి తీసుకెళ్లి కృష్ణలంక వద్ద నదిలో మృతదేహాన్ని పారవేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు.. సూరెడ్డి సుజాత మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేపట్టిన నాచారం పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా ఇంట్లో అద్దెకు ఉంటున్న మడ్డు అంజి బాబు హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా రాజోలు మండలం, పొదులాడ జంక్షన్ వద్ద అతడిని అదుపులోకి తీసుకుని, 4 బంగారు గాజులు, బంగారు గొలుసు, రెండు చెవి దిద్దులను స్వాఽధీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో నక్కటి యువరాజు, నూకల దుర్గారావులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణలో డీసీపీ శ్రీధర్ ఏసీపీ చక్రపాణి సూచనలతో నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ హత్య కేసును చేధించారు. సీసీ కెమెరాలు, సెల్ఫోన్ టవర్ సిగ్నల్ ఆధారంగానిందితుల గుర్తింపు -
రహదారుల్నీ వదలట్లేదు!
సాక్షి, సిటీబ్యూరో: ఖాళీ జాగాలే కాదు... రోడ్డును కూడా వదలకుండా ఎక్కడికక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయి. ఇక ఆ రోడ్డుకు డెడ్ ఎండ్ ఉంటే పరిస్థితి మరింత దారుణం. ఎదుటి వారికీ దాన్ని వినియోగించుకునే హక్కు ఉందని మర్చిపోతున్నారు. ఇలాంటి అనేక సమస్యలపై నగర వాసులు హైడ్రాను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తున్నారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం నిర్వహించిన ప్రజావాణి ద్వారా మొత్తం 44 ఫిర్యాదులు అందాయి. వనస్థలిపురం సాహెబ్నగర్లోని శ్రీ వీరాంజనేయ కాలనీలో 18 అడుగుల రహదారిని అక్కడ ప్లాట్లు ఉన్న వారు కబ్జా చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. స్పష్టంగా రోడ్డు వేసి, కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసినా... కబ్జా చేసి ఫెన్సింగ్ వేశారని, స్థానిక అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. శేరిలింగంపల్లి మండలం, కొండాపూర్ విలేజ్లోని శ్రీ రాంనగర్ కాలనీలో సర్వే నం.202లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ 1.20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేయడమే కాకుండా.. తమ ఇళ్లకు దారి లేకుండా మూసేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. మచ్చబొల్లారంలోని సూర్యనగర్ బస్టాప్ వద్ద 30 అడుగుల రోడ్డును ఏడు అడుగుల మేర కబ్జా చేసేశారని, దీంతో అక్కడ బస్సుల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని బాలాజీ ఎన్క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మహేశ్వరం మండలం, శ్రీనగర్ విలేజ్లోని సర్వే నం. 249, 248ల్లో కచ్చా రోడ్డు ఉంటే దానిని బ్లాక్ చేసి ఆ మార్గాన్ని మూసేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ మండలం ఇన్నర్ రింగురోడ్డులోని ఉప్పరపల్లిలో ఉన్న పీఎంఆర్ అపార్టుమెంట్కు చేరువలో రహదారులను ఆక్రమించి కొందరు నిర్మాణాలు చేపడుతున్నారని, దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని పీఎంఆర్ అపార్ట్మెంట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. మహేశ్వరం మండలం సర్దార్ నగర్లో హెచ్ఎండీఏ అనుమతి పొందిన లే–ఔట్లోని ప్లాట్లు రావిర్యాల చెరువులో మునిగిపోతున్నాయని, వెంటనే ఆ చెరువు ఎఫ్టీఎల్ను నిర్థారించి తమ ప్లాట్లను కాపాడాలని స్థానికులు కోరారు. ఈ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న కమిషనర్ ఏవీ రంగనాథ్ అవసరమైన చర్యలు తీసుకోవాలని, క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సిటీలో ఎక్కడికక్కడ ఆక్రమణలు ప్రజావాణి ద్వారా హైడ్రాకు 44 ఫిర్యాదులు -
నవ వధువు మృతి
రాజేంద్రనగర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ నవ వధువు మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన లక్ష్మయ్య కుమార్తె ఐశ్వర్య (22) రాజేంద్రనగర్ జన చైతన్య వెంచర్–2లో నివాసముండే రాజు నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. రాజు ఓ నిర్మాణ భవనంలో పని చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం ఐశ్వర్య జూబ్లీహిల్స్లోని అమ్మగారింటికి వెళ్లింది. ఆదివారం జూబ్లీహిల్స్కు వెళ్లిన రాజు రాత్రి అక్కడే ఉండి సోమవారం ఉదయం భార్యను తీసుకుని రాజేంద్రనగర్లోని ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఆమె ఇంట్లో వంట చేస్తూ ఫిట్స్ రావడంతో కిందపడింది. రాజు అంబులెన్స్లో ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. భర్తే హత్య చేశాడు... తన కుమార్తె ఐశ్వర్యను భర్త రాజు హత్య చేశాడని ఆరోపిస్తూ తండ్రి లక్ష్మయ్య, అన్న వెంకటేశ్ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లైన రెండు రోజుల నుంచే అదనపు కట్నం కోసం తిట్టి కొట్టేవాడని ఐశ్వర్య తనతో చెప్పిందని లక్ష్మయ్య బోరున విలపించాడు. తాను అంధుడనినని కట్నం ఇచ్చుకోలేనని బిడ్డను సముదాయించి పంపించానన్నారు. బిడ్డను చంపుతాడని అనుకోలేదని నిందితున్ని కఠినంగా శిక్షించాలని కోరాడు. ఐశ్వర్య మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ తెలిపారు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో ఎలాంటి గాయాలు లేవని.. సహజ మరణంగా వెల్లడించారన్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అర్హులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు వచ్చే విధంగా జీఓలో సవరింపులు చేపట్టాలని కోరుతూ టీయూ డబ్ల్యూ జే (ఐజేయూ) బృందం సమాచార శాఖ కమిషనర్ కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం సచివాలయం లోని ఐ అండ్ పీఆర్ కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్ ప్రియాంకను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేష్, హెచ్ యూజే అధ్యక్షుడు శిగా శంకర్, మేడ్చల్ అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీమ్ పాషా, మేడ్చల్ కార్యదర్శి వెంకట్ రాం రెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మేకల సత్యనారాయణ సమస్యను ఆమెకు వివరించారు. గ్రేటర్ పరిధిలోని అర్బన్ మండలాల్లో ప్రధాన పత్రికల్లో నలుగురు నుంచి ఐదుగురు జర్నలిస్టులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. నూతన జీవో 252 ద్వారా ఒక పత్రికకు మండలానికి ఒకే అక్రిడిటేషన్ పొందే అవకాశం ఉందని తెలిపారు. జర్నలిస్టుల పరిస్థితిని గుర్తించి జీవోలో సవరణలు చేసి న్యాయం చేయాలని కోరారు. దీనిపై కమిషన్ ప్రియాంక సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే మంత్రితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
చైనా మాంజా విక్రేతల అరెస్ట్
చాంద్రాయణగుట్ట: నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న ఇద్దరు యువకులను ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ కె.నాగేంద్ర ప్రసాద్ వర్మ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..ఉప్పుగూడ అశోక్నగర్కు చెందిన కందాడి ఉదయ్ కిరణ్, శివగంగానగర్కు చెందిన పిట్టల సుమిత్, అక్రమంగా చైనా సింథటిక్ నైలాన్ గ్లాస్ కోటెడ్ మంజా (చైనా మాంజా)లను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి 24 మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. చైనా మంజాను నిషేధించారని, దీని కారణంగా ప్రజలు, చిన్న పిల్లలు, పక్షులు, జంతువుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుందని, పర్యావరణానికి హాని కలిగిస్తుందని పోలీసులు తెలిపారు. ఎవరూ చైనా మాంజాను కొనడం విక్రయించడం చేయరాదన్నారు. -
పల్లెలు సాహితీ మల్లెలు
– ఎమ్మెల్సీ డాక్టర్ గోరటి వెంకన్న ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణలోని ప్రతీపల్లె పద సాహిత్యాలు, భజన కీర్తనలతో విరాజిల్లుతోందని శాసనమండలి సభ్యుడు, ప్రముఖ వాగ్గేయకారుడు డాక్టర్ గోరటి వెంకన్న అన్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా తెలుగు శాఖ ‘తెలంగాణ పద సాహిత్యం – సమాలోచన‘ అనే అంశంపై సోమవారం నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. తెలంగాణలోని సబ్బండ వర్గాల సాంస్కృతిక విశేషాలు, తాత్విక విషయాలపై, పద కవుల సాహిత్యంపై లోతైన విశ్లేషణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ పి.భాస్కరయోగి కీలకోపన్యాసం చేస్తూ విస్మరణకు గురైన ఎందరో పదకవులపై విస్తృత పరిశోధనలు జరగడం, ఆ దిశలో జాతీయ సదస్సు నిర్వహించడం అభినందనీయని పేర్కొన్నారు. తెలుగుశాఖ అధ్యక్షుడు ఆచార్య సాగి కమలాకర శర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య వెలుదండ నిత్యానందరావు, తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రథమ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.కాశీం, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ఆచార్య సైయద తలత్ సుల్తానా ప్రసంగించారు. తెలంగాణ పద సాహిత్యంపై పలువురు ప్రామాణికమైన పరిశోధన పత్రాలను సమర్పించారు. సదస్సులో తెలుగు పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షులు డాక్టర్ ఏలే విజయలక్ష్మి, తెలుగుశాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.రఘు, ఆచార్య విస్తాలి శంకర్రావు, డాక్టర్ పి.సి.వెంకటేశ్వర్లు, డాక్టర్ బాణాల భుజంగరెడ్డి, డాక్టర్ యువ శ్రీ,, డా. ఇమ్మిడి మహేందర్, అవుసుల భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
న్యూ ఇయర్.. ప్లీజ్ హియర్!
ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు ● నేటి నుంచే నగరంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ● క్షేత్రస్థాయి అధికారులతో సీపీ సజ్జనర్ వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఇయర్ వచ్చెనని, సంబరాలు తెచ్చెనని రోడ్లపై హంగామా సృష్టించారో.. హద్దు మీరి ప్రవర్తించారో.. జర జాగ్రత్త! పోలీసులు చూస్తున్నారు.. నిఘా నేత్రం కనిపెడుతోంది! నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. నేటి నుంచి న్యూ ఇయర్ రోజు వరకు తాగి వాహనాలు నడిపే వారిపై నగర వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బంజారాహిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(టీజీఐసీసీసీ)లో మంగళవారం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల బందోబస్తుపై సీపీ సజ్జనర్ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు. హాట్ స్పాట్లు, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించాలని, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ 31న రాత్రి నగర వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని, ఇందుకోసం 7 ప్లటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నామని చెప్పారు. పట్టుబడితే రూ.పదివేల జరిమానా.. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతోపాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలుశిక్ష తప్పదని సీపీ హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేసే అవకాశం కూడా ఉందన్నారు. పార్టీలకు వెళ్లేవారు ముందుగానే ’డెసిగ్నేటెడ్ డ్రైవర్’ను ఏర్పాటు చేసుకోవాలని లేదా క్యాబ్లను ఆశ్రయించాలని సూచించారు. యువత రోడ్లపై రేసింగ్లు, వీలింగ్లు, ర్యాష్ డ్రైవింగ్కు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మఫ్టీలో 15 షీ టీమ్స్ నిఘా... డిసెంబర్ 31 రాత్రి పబ్లు, త్రీస్టార్, ఆపై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలకు అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతి ఉంటుందని సీపీ స్పష్టం చేశారు. శబ్ద కాలుష్య నిబంధనలు కచ్చితంగా పాటించాలని, డెసిబెల్స్ పరిమితి దాటితే సౌండ్ సిస్టమ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈవెంట్లలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు తావిచ్చినా యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని, అలాంటి వారి లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. వేడుకల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రద్దీ ప్రాంతాలు, పార్టీ వెన్యూలు, జంక్షన్లలో మఫ్టీలో 15 షీ టీమ్స్ను ఉంచుతామని వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు సీపీ(క్రైమ్స్) ఎం.శ్రీనివాసులు, వివిధ విభాగాల డీసీపీలు ఎన్.శ్వేత, రక్షితాకృష్ణమూర్తి, శ్రీ రూపేష్, ఆర్. వెంకటేశ్వర్లు, వి.అరవింద్బాబు, లావణ్య నాయక్ జాదవ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఎగ్జిబిషన్కు ఏర్పాట్లు చకచకా
జనవరి 1న ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి అబిడ్స్: ఎగ్జిబిషన్(నుమాయిష్)కు వేళ అయింది. ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. భద్రతా చర్యలకు నిర్వాహకులు కసరత్తు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ఆర్.సుఖేష్రెడ్డి మంగళవారం ఇక్కడ వివరాలు వెల్లడించారు. 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన శాల(నుమాయిష్) జనవరి 1వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 15న ముగుస్తుందని తెలిపారు. ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు సమక్షంలో ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందన్నారు. ఎగ్జిబిషన్ మైదానంలో స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు అనేకమంది దరఖాస్తు చేసుకోగా, అందులో నుంచి స్టాళ్ల కేటాయింపు దాదాపు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎగ్జిబిషన్ను దాదాపు 25 లక్షల మందికిపైగా సందర్శకులు సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్కు వచ్చే సందర్శకులకు మూడంచెల రక్షణ ఏర్పాటు చేస్తున్నామని, ప్రధాన ద్వారాలైన గాంధీ భవన్, అజంతా గేట్, మాలకుంట గేట్ల ద్వారా ఎగ్జిబిషన్లోకి ప్రవేశించేవారిని మెటల్ డిటెక్టర్ల సహాయంతో తనిఖీలు చేయనున్నట్లు చెప్పారు. అంతర్గత భద్రత కోసం సబ్ కమిటీ, సీసీ కెమెరాలు, వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమ్యూజ్మెంట్ పార్క్లో సందర్శకులను కనువిందు చేసేందుకు ఈసారి ప్రత్యేకంగా రైడ్లు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు. ఎగ్జిబిషన్ మైదానంలో 1.50 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు వాటర్ ట్యాంక్లు, ఫైర్కు సంబంధించిన 76 హైడ్రెంట్ వాల్స్ను సిద్ధంగా ఉంచామన్నారు. సందర్శకుల కోసం ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ప్రత్యేక రైలు
నాంపల్లి: నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి అజ్మీర్లోని హజరత్ ఖాజా మొహినుద్దీన్ చిస్తీ షరీఫ్ దర్గాకు బయలుదేరిన స్పెషల్ రైలును నాంపల్లి ఎమ్మెల్యే మహ్మద్ మాజీద్ హుస్సేన్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఆయన భక్తులకు వీడ్కోలు పలికారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని భక్తులను కోరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను నాంపల్లి నుంచి నడుపుతోందని తెలిపారు. అజ్మీర్లోని దర్గాకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వేకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఔటర్ టు ట్రిపుల్..16 గ్రీన్ఫీల్డ్ రోడ్లు
సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర పట్టణ ప్రజా రవాణా ప్రణాళిక(కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్)లో భాగంగా ఔటర్ రింగ్రోడ్డు(ఓఆర్ఆర్) నుంచి రీజినల్ రింగ్రోడ్డు(ఆర్ఆర్ఆర్) వరకు రహదారుల విస్తరణకు హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. ఓఆర్ఆర్–ఆర్ఆర్ఆర్ మధ్యన వివిధ ప్రాంతాల్లో మొత్తం 16 గ్రీన్ఫీల్డ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు 41 కి.మీ. మేర నిర్మించనున్న మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ రోడ్డుతోపాటు బుద్వేల్ నుంచి కోస్గి వరకు సుమారు 81 కి.మీ. మేర నిర్మించనున్న రెండో గ్రీన్ఫీల్డ్ రోడ్డు డీపీఆర్ కోసం అధికారులు కసరత్తు చేపట్టారు. ఇప్పటికే ఈ మార్గాల్లో భూసేకరణకు హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండింటితోపాటు మరో 14 చోట్ల ఈ తరహా రోడ్లు అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ మీదుగా నేరుగా ట్రిపుల్ ఆర్ వరకు చేరుకొనే విధంగా ఈ రహదారుల నిర్మాణం ఉంటుందని అధికారులు అంటున్నారు. మహానగరం అభివృద్ధి, విస్తరణకు అనుగుణంగా దశలవారీగా రోడ్ల నిర్మాణంపై హెచ్ఎండీఏ దృష్టి సారించింది. ఈ మేరకు తెలంగాణ రైజింగ్–47 నివేదికలోనూ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు భారీ టౌన్షిప్ల ఏర్పాటుకు కూడా హెచ్ఎండీఏ యోచిస్తోంది. అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా టౌన్షిప్లను నిర్మించనుంది. 2047 నాటికి రీజినల్ రింగ్రోడ్డు చుట్టూ సుమారు 3.5 లక్షల ఇళ్లను నిర్మించి ప్రతి ఒక్కరికీ గృహవసతి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇందులో భాగంగానే రహదారుల విస్తరణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. రెండో రోడ్డుకు త్వరలో డీపీఆర్... ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బుద్వేల్ నుంచి రీజినల్ రింగ్రోడ్డు వెలుపల ఉన్న కోస్గి వరకు నిర్మించనున్న రెండో గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు త్వరలోనే డీపీఆర్ తయారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. టీజీఐఐసీ పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ దీన్ని 167వ జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. హైదరాబాద్ మహానగరాన్ని 7,250 చ.కి.మీ. నుంచి సుమారు 10,050 చ.కి.మీ. వరకు ప్రభుత్వం ఇప్పటికే విస్తరించిన సంగతి తెలిసిందే. దీంతో 11 జిల్లాలకు హెచ్ఎండీఏ కార్యకలాపాలు పెరిగాయి. ఇందుకు అనుగుణంగానే పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా హెచ్ఎండీఏ ముందుకు సాగుతోంది. సమగ్ర మాస్టర్ప్లాన్–2050లో భాంగా ఆర్థికాభివృద్ధి, సమగ్ర పట్టణ ప్రజారవాణా వ్యవస్థ, జలవనరులు, అడవుల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ మూడు ప్రణాళికలు తుదిదశకు చేరుకున్నాయి. పారిశ్రామిక కేంద్రాలు, లాజిస్టిక్ హబ్స్ నెలకొల్పే ప్రాంతాలకు గ్రీన్ఫీల్డ్ రోడ్ల మీదుగా తేలిగ్గా రాకపోకలు సాగించడానికి వీలవుతుంది. టీజీఐఐసీకి చెందిన పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ రెండో గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మించనున్నారు. ఈ మేరకు బుద్వేల్ నుంచి చందన్వెల్లి, పేరారం, గూడూరు, దోర్నాలపల్లి, దోమ తదితర ప్రాంతాల మీదుగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం వరకు దీన్ని నిర్మించనున్నారు. సుమారు 81 కి.మీ. మేర ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్డులో హెచ్ఎండీఏ పరిధి 52 కి.మీ.వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఈ రోడ్డు నిర్మాణానికి కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా మరికొందరు రైతులు పరిహారాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని డీపీఆర్పై ముందుకు వెళ్లనున్నట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ కార్యాచరణ ప్రణాళిక పారిశ్రామిక ప్రాంతాలకు అనుసంధానం మౌలిక సదుపాయాలు, టౌన్షిప్ల అభివృద్ధి రెండో గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు త్వరలో డీపీఆర్ రూపకల్పన -
ఇదే‘నయా’ జీహెచ్ఎంసీ..!
నయా జీహెచ్ఎంసీలో ● ఒక్కో సెగ్మెంట్లో 2, 3 సర్కిళ్లు ● ఒక్కో సర్కిల్లో 4–6 వార్డులు ● మొత్తం 60 సర్కిళ్లు.. 12 జోన్లు అసెంబ్లీ నియోజకవర్గ పరిధే వార్డు హద్దు సాక్షి, సిటీబ్యూరో జీహెచ్ఎంసీలో వార్డుల (కార్పొరేటర్ డివిజన్ల) డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయింది. జీహెచ్ఎంసీ 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. రాజకీయంగా, పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవకుండా ఒక వార్డును పూర్తిగా ఒకే అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ వార్డులు 150 నుంచి 300 వరకు పెరగడంతో ప్రస్తుతమున్న 30 సర్కిళ్ల సంఖ్య 60కి చేరింది. 6 జోన్లను 12 జోన్లకు పెంచారు. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు సర్కిళ్లు, మరికొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడు సర్కిళ్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక వార్డులు ఒక్కో సర్కిల్లో 4 నుంచి 6 వరకు ఉన్నట్లు తెలిపారు. నాలాలు, రైల్వేట్రాక్, రహదారులు వంటి వాటిని సైతం ఒకే వార్డు పరిధిలో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే వాటిపైనా పలు ఫిర్యాదులు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కొన్ని వార్డుల్లో జనాభా ఎక్కువగా, కొన్నింట తక్కువగా ఉన్నట్లు అధికారులు అంగీకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధితో పెరిగిన ఇళ్ల నిర్మాణాలు, పెరగబోయే జనాభాను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇదీ స్థూలంగా.. మారిన జీహెచ్ఎంసీ ముఖచిత్రం. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, తాజాగా అవి 26కు పెరగనున్నాయి. ఇవి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నాయి. -
రన్వేపై మొరాయించిన విమానం
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ విమానం మొరాయించింది. మంగళవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఇండిగో 6ఈ–1465 విమానంలో మొత్తం 175 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ సిద్ధమైన విమానం రన్వై పైకి వెళ్లగానే మొరాయించింది. దీంతో తిరిగి దానిని ట్యాక్సివే వద్దకు తీసుకొచ్చారు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తర్వాత మూడు గంటలు ఆలస్యంగా విమానం ఇక్కడి ఉంచి దుబాయ్కి బయలుదేరింది. ప్రతికూల వాతావరణంతో.. హైదరాబాద్ నుంచి మంగళవారం వారణాసి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఐఎక్స్ –2746 విమానం రద్దు అయింది. అప్పటికే విమానంలోకి 148 మంది ప్రయాణికులు ఎక్కి కూర్చున్నారు. అయితే వారణాసిలో ప్రతికూల వాతావరణం ఉందని, అక్కడికి వెళ్లేందుకు అవకాశం లేదని సమాచారం అందడంతో విమానాన్ని రద్దు చేసి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి. కాగా, హైదరాబాద్–పాట్నా, హైదరాబాద్–వారణాసి మధ్యన నడిచే రెండు అరైవల్, రెండు డిపార్చర్ విమానాలను ఇండిగో ఎయిర్లైన్స్ రద్దు చేసింది. ఇందుకు నిర్వహణపరమైన సమస్యలతోపాటు ప్రతికూల వాతావరణం కూడా కారణమని ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి. -
భారతీయ భాషలు మేధో సంపదకు పునాదులు
హిమాయత్నగర్: భారతీయ భాషలు దేశ మేధో సంపదకు పునాదులని జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి అన్నారు. భారతీయ భాషలు, సాహిత్యం, బోధనా శాస్త్రం, అనువాద అధ్యయనాలు, భాషా సాంకేతికతలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ఆవరణలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, భారతీయ భాషా సమితి, విద్యా భారతి ఉన్నత శిక్షా సంస్థాన్ సహకారంతో మంగళవారం నిర్వహించిన రెండు రోజుల జాతీయ సెమినార్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాతృభాషల ఆధారిత విద్య విమర్శనాత్మక ఆలోచనను పెంపొందిస్తుందన్నారు. ఉన్నత విద్యలో భాషా సమానత్వం లేకపోతే సామాజిక అసమానతలు పెరుగుతాయని హెచ్చరించారు. భాషా సాంకేతికతలు, పరిశోధన, అనువాదం, బహుభాషావాదం పరస్పరం అనుసంధానమై ఉంటాయన్నారు. యువత తమ భాషా వారసత్వాన్ని గ్లోబల్ జ్ఞానంతో కలిపి ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా పండితులు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనగా, 100కు పైగా పరిశోధనా పత్రాలు సమర్పించారు. అనంతరం పరిశోధన పత్రాలు సమర్పించిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సమ్మక్క సారలమ్మ విశ్వవిద్యాలయం వీసీ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ వేదుల శాంతి తదితరులు పాల్గొన్నారు. -
సందడే.. సందడి
● హైదరాబాద్ బుక్ ఫెయిర్కు విశేష స్పందన ● ఒకవైపు పుస్తకావిష్కరణలు ● మరోవైపు పుస్తక సమీక్షలు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న 38వ బుక్ ఫెయిర్ మంగళవారం ఐదో రోజు సందడిగా సాగింది. ఒక వైపు కొంపల్లి వెంకట్ గౌడ్ వేదికపై పుస్తకావిష్కరణలు మరోవైపు అనిశెట్టి రజిత వేదికపై చర్చ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తకాల భవిష్యత్తు గ్రంథాలయాల పాత్ర అనే అంశంపై చర్చ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, ఉస్మానియా యూనివర్సిటీ గ్రంథాలయ శాస్త్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు, ఓయూ గ్రంథాలయ అధికారి డాక్టర్ ఎస్. యాదగిరి పాల్గొన్నారు. డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ... సమాజంలోని అజ్ఞానం అనే చీకట్లు తొలగించే జ్ఞాన దీపాలు గ్రంథాలయాలకు విడదీయరాని సంబంధం ఉందన్నారు. ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ... మానవ నాగరికత బుక్ కల్చర్ నుంచి రీల్స్ షాట్స్ వంటి లుక్ కల్చర్ వైపు మారుతుందని సోషల్ మీడియా ప్రభావంతో విదార్థుల్లో ఏకాగ్రత తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. –కవాడిగూడ -
పంచవటి కాలనీలో హిట్ అండ్ రన్
మణికొండ: పిల్లలను స్కూల్ నుంచి తీసుకుని వచ్చేందుకు స్కూటీపై వెళుతున్న ఓ మహిళను ఇన్నోవా కారు ఢీ కొట్టి వెళ్లిపోయిన సంఘటన మణికొండ సర్కిల్ పరిధిలోని పంచవటి కాలనీలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కాలనీకి చెందిన భవానీ అనే మహిళ తమ పిల్లలను స్కూల్ నుంచి తీసుకుని వచ్చేందుకు స్కూటీపై కాలనీలోని 9బి వద్ద రోడ్డు దాటుతుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఆమెను ఢీ కొట్టింది. దాంతో ఆమె కింద పడి తీవ్ర గాయాలు కావడంతో కాలనీ వాసులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఇన్నోవా కారు ఆగకుండా వెళ్లి పోయిందని, ఇందుకు సంబందించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయినట్లు తెలిపారు. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్రిప్టో కరెన్సీ పేరుతో టోకరా – దృష్టి మరల్చి రూ.కోటితో పరారీ బంజారాహిల్స్: నగదుకు బదులుగా క్రిప్టో కరెన్సీ ఇస్తానంటూ నమ్మించి దష్టి మరల్చి రూ.కోటి నగదుతో ఉడాయించిన ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. మెహెదీపట్నం ప్రాంతానికి చెందిన ఉమర్ అనే వ్యాపారవేత్తకు బంజారా శాలిబండ ప్రాంతానికి చెందిన ఎత్తెషామ్ ఆన్ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తామని నమ్మబలికాడు. దీంతో అతడి మాటలు నమ్మిన ఉమర్ సోమవారం సాయంత్రం రోడ్ నెంబర్ 1 లోని తాజ్ దక్కన్ హోటల్ కు వచ్చాడు.. రూ. కోటి కి బదులుగా క్రిప్టో కరెన్సీ ఇస్తామని చెప్పడంతో నగదు అప్పగించాడు. కొన్ని నిమిషాల్లోనే క్రిప్టో కరెన్సీ వస్తుందంటూ దృష్టి మరల్చిన నిందితుడు అక్కడి నుంచి ఉడాయించాడు. ఎంతసేపు గడిచినా ఎతేశ్యామ్ వెనక్కి రాకపోవడం, అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. లైంగికదాడి కేసులో 20 ఏళ్ల జైలు మణికొండ: లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షేక్పేట వినోదనగర్ కాలనీలో నివసించే కురుకుంట రవి (38) మేసీ్త్రగా పనిచేసేవాడు. 2018లో నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని అలకాపూర్ టౌన్ షిప్లో లైంగికదాడికి పాల్పడ్డాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఎల్బీనగర్లోని జిల్లా 13వ అదనపు జడ్జి మంగళవారం దోషిగా నిర్దారించి 20 ఏళ్ల కఠిన జైలు శిక్షతో పాటు రూ. 5వేల జరిమానా విధించింది. అప్పట్లో సీఐగా పనిచేస్తూ కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన జీవీ రమణ గౌడ్ ప్రస్తుతం నార్సింగి ఏసీపీగా పనిచేస్తున్నారు. సాక్ష్యాలు అందించడంలో కానిస్టేబుళ్లు అంజిలప్ప, జ్యోతి ఎంతో కృషి చేశారని సీఐ తెలిపారు. భార్య విడాకుల నోటీసు పంపిందని.. – మనస్తాపంతో భర్త ఆత్మహత్య ఘట్కేసర్: భార్య నుంచి విడాకుల నోటీస్ రావడంతో మనస్తాపానికి లోనైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సం ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎదులాబాద్ ప్రాంతానికి చెందిన గట్టుపల్లి వెంకటేశ్ (40)కు, కీసరకు చెందిన మౌనిక అలియాస్ విజయలక్ష్మితో 2019లో వివాహం జరిగింది. మౌనిక తల్లి కీసరలోని గురుకుల్లో స్వీపర్గా పనిచేస్తోంది. తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో మౌనిక ఆమెకు బదులుగా విధులు నిర్వహిస్తూ కీసరలో భర్తతో కలిసి ఉంటోంది. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వెంకటేశ్ విడాకులు ఇవ్వకపోవడంతో లాయర్ ద్వారా మౌనిక నోటీసు పంపింది. దీంతో మనస్తాపానికి లోనైన వెంకటేష్ మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.స్కూటీని ఢీ కొట్టిన కారు -
మాట మార్చి.. నిధులు ఏమార్చి!
● ఆరు స్వీపర్లని ఒకసారి.. రెండని మరోసారి ఆర్టీఐ కింద సమాధానం ● పీసీబీలో రూ.కోటి గోల్మాల్! మెకానికల్ రోడ్ స్వీపర్ వాహనాల కొనుగోళ్లలో అక్రమాలు సాక్షి, సిటీబ్యూరో: రోడ్లు శుభ్రం చేసే యంత్రాల పేరిట కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) నిధులు ఊడ్చేసింది. స్వీపింగ్ వాహనాల కొనుగోళ్లపై బాధ్యతారాహిత్యంగా స్వీపింగ్ ఆన్సర్ ఇచ్చింది. జాతీయ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం(ఎన్సీఏపీ) కింద హైదరాబాద్, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాలను కేంద్రం ఎంపిక చేసింది. గాలి కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టింది. రాజధాని నగరంలో వాయునాణ్యతను పెంపొందించడానికి రూ.614 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలోనే రహదారులపై ఉన్న దుమ్ము, ధూళి, చెత్తను శుభ్రం చేయడానికి మెకానికల్ రోడ్ స్వీపర్(ఎంఆర్ఎస్) వాహనాలను కొనుగోలు చేయాలని పీసీబీ అధికారులు నిర్ణయించారు. అయితే వాయుకాలుష్య నియంత్రణ, గాలి నాణ్యత పెంపొందించడానికి ఏ రకమైన చర్యలు తీసుకున్నారని ఆర్టీఐ కింద ఓ వ్యక్తి అడగ్గా రహదారులను శుభ్రం చేయడానికి 6 ఎంఆర్ఎస్ వాహనాలు కొనుగోలు చేశామని సమాధానం ఇచ్చారు. పదిరోజుల వ్యవధిలో మరోసారి సంబంధిత వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు, ఇతర వివరాలు కావాలని అడగ్గా ఆరు కాదు, రెండు వాహనాలే కొన్నామని మాట మార్చారు. ఒకదానిని పటాన్చెరు, మరోదానిని జీడిమెట్ల ఐలాకు అప్పగించామని చెప్పారు. కొల్లగొట్టింది రూ.కోటిపైనే..? పీసీబీ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం 11.9 టన్నుల సామర్థ్యం కలిగిన ఒక్కో వాహనం సుమారు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ధర పలుకుతుంది. ఆరు వాహనాలకు సుమారు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్లు వరకు వెచ్చించి ఉండొచ్చని సమాచారం. ఇప్పుడు ఉన్నపళంగా నాలుగు వాహనాలు లేవంటే, వాటికి వెచ్చించిన సుమారు రూ.కోటికిపైగా ఏమయ్యాయనే ప్రశ్న తలెత్తుతోంది. 2021 ఆగస్టులో రెండు వాహనాలను కొనుగోలు చేసినట్లు, వీటిని పటాన్చెరు, జీడిమెట్ల ఐలా కమిషనర్లకు అప్పగించినట్లు చూపిస్తున్నారే తప్ప, ఎన్ని నిధులు వెచ్చించారనే సమాచారం, వాహనాల రిజిస్ట్రేషన్ నెంబరు, ఇతర వివరాలేవీ పీసీబీ కార్యాలయంలో అందుబాటులో లేవు. రూ.50 లక్షలకు నో టెండర్? కాలుష్యనియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇటీవల తెలంగాణ పీసీబీ సుమారు రూ.50 లక్షలు కేటాయించింది. నిబంధనల ప్రకారం రూ.5 లక్షల కంటే ఎక్కువ కాంట్రాక్టు ఇచ్చే సమయంలో ఓపెన్ టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఎల్–1 (తక్కువ ధర) కోడ్ చేసిన వారికి పనులు అప్పగించాలి. అయితే నిబంధనలను పక్కన పెట్టి నిధులు కేటాయించడంపై ఆంతర్యమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయమై ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ పై నుంచి ఒత్తిడి ఉందని, అందుకే టెండర్ లేకుండా ఇవ్వాల్సి వచ్చిందని, ఇందులో తమకేం సంబంధం లేదని పేర్కొన్నారు. గతంలోనూ ఓ సంస్థకు ఇలాగే రూ.25 లక్షలు నామినేషన్ పద్ధతిలో కేటాయించడం విశేషం. అయితే దీని వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరనేది అంతుచిక్కడంలేదని సిబ్బంది అంటున్నారు. -
మహిళలకు అండగా తెలంగాణ మహిళా కమిషన్
సాక్షి, సిటీబ్యూరో: మహిళా కమిషన్ మహిళలకు అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. మంగళవారం హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘నారీ న్యాయ్: హియర్ హర్ ఔట్‘ అనే బహిరంగ విచారణ కార్యక్రమంలో ఉద్యోగ, గృహ హింస వేధింపులు, వివక్ష, ఆర్థిక, సైబర్ క్రై మ్ తదితర సమస్యలపై బాధిత మహిళలనుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మహిళల ఆవేదనను విని వారికి న్యాయం చేకూరేలా, త్వరితగతిన అవసరమైన చర్యలు చేపట్టేందుకే ‘నారీ న్యాయ్: హెయిర్ హర్ ఔట్‘ పేరుతో బహిరంగ విచారణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గృహ హింసపై అత్యధిక ఫిర్యాదులు అందాయని, ఆయా ఫిర్యాదుల్లో నిందితులు ఎన్ఆర్ఐలు ఉన్నందున కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది పైగా మహిళల ఫిర్యాదులను అందజేశారు. బాధితుల సమస్యలు విని తగు పరిష్కారాలు సూచిస్తూ సంబంధిత శాఖల నుంచి చర్యలు, పెండింగ్ ఫిర్యాదులపై నివేదికలు కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కదిరవన్ పలని, ఉమెన్ సెఫ్టీ డీసీపీలు డా.లావణ్య, టి.ఉషా రాణి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజ, సభ్యులతో పాటు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ తనిఖీ
సాక్షి, సిటీ బ్యూరో : రాబోయే వేసవి నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లలో భాగంగా జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ మంగళవారం మియాపూర్ సెక్షన్ పరిధిలోని మయూరి నగర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ట్యాంకర్ ఫిల్లింగ్ పాయింట్లు, ప్రస్తుత ట్యాంకర్ డిమాండ్తో పాటు రాబోయే వేసవి కాలంలో ఉండే డిమాండ్పై అధికారులతో చర్చించి, అవసరమైన సూచనలు చేశారు. ప్రజా ఫిర్యాదులు, మెట్రో కస్టమర్ కేర్కు వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బల్క్ వాటర్ సప్లై కనెక్షన్ కోసం దరఖాస్తు చేసిన మియాపూర్ లోని నాగార్జున ఎన్క్లేవ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సీజీఎంలు కిరణ్ కుమార్, శ్రీనివాస రెడ్డిలతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సింగరేణి సంస్థకు కార్మికులే బలం
నాంపల్లి: సింగరేణి సంస్థ బలం కేవలం ఉత్పత్తిలో కాదని, తరతరాల శ్రమ, క్రమశిక్షణ, పరస్పర నమ్మకంతో పనిచేస్తున్న కార్మికులేనని ఇన్ఛార్జి సీఎండీ డి.కృష్ణ భాస్కర్ అన్నారు. మంగళవారం సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెడ్హిల్స్లోని సింగరేణి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్మికుల భద్రత, సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి ప్రధాన ప్రాధాన్యతలని స్పష్టం చేశారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను మరింత మెరుగుపరచడం, పని పరిస్థితులను మరింత సురక్షితంగా చేయడమే లక్ష్యమన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది ఎన్నో వాతావరణ ప్రతికూలతలు, సాంకేతిక సవాళ్లు, మార్కెట్ మార్పులు ఉన్నప్పటికీ భద్రత ప్రమాణాలను పాటిస్తూ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ముందుకు సాగామన్నారు. ఈ ప్రయత్నంలో ప్రతి గని కార్మికుడు, సూపర్వైజర్, అధికారి చూపిన చొరవను ఆయన ప్రశంసించారు. రానున్న సింగరేణి భవిష్యత్పై అందరం ప్రశ్నించుకోవాలని, వాటికి సమాధానాలు వెతుక్కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ దిశలోనే ఉత్పత్తి సామర్థ్యం, సంస్థ స్థిరత్వం, భవిష్యత్తు అవకాశాల కోసం మన అనుభవం, సామర్థ్యంతో రాణించే ఇతర రంగాలపైనా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఇవి ఇంకా ఆలోచన దశలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తును నిర్లక్ష్యం చేయకుండా ముందే సిద్ధమవ్వాలన్న భావనతోనే ప్రయత్నాలు సాగిస్తున్నామని వివరించారు. ఇంధన రంగంలో వస్తున్న మార్పులను గమనిస్తూ పునరుత్పాదక శక్తి వంటి రంగాల్లో సింగరేణి ఏ పాత్ర పోషించగలదో అన్న దానిపై కూడా ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. సామాజిక బాధ్యతల్లో భాగంగా పరిసర ప్రాంతాల అభివృద్ధి, విద్య, ఉపాధి అవకాశాల విషయంలో సింగరేణి తనవంతు పాత్రను కొనసాగిస్తోందన్నారు. సింగరేణిలో మహిళా శక్తి పెరుగుతున్న తీరు, గనుల్లో, ఆపరేషన్లో, రక్షణ బృందాల్లో మహిళల భాగస్వామ్యం సింగరేణి పరిణితికి గొప్ప సూచికగా అభివర్ణించారు. రెస్క్యూ జట్టు, గనుల నిర్వహణకు జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపులతో స్ఫూర్తి పొందుతూ మన పనితీరును మరింతగా మెరుగు పరచుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్మెంట్) బి.వెంకన్న, అడ్వైజర్ ఫారెస్ట్రీ మోహన్ పరిగెన్, జీఎం ( కో ఆర్డినేషన్ ) టి.శ్రీనివాసన్ పాల్గొన్నారు. -
ఒంటరికి జంటగా..
● జంతువులకు తోడు కల్పించేందుకు జూ అధికారుల ప్రయత్నాలు నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువుల సాహచర్యం కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వన్యప్రాణుల సంతతిని పెంచేందుకు.. సాంగత్యం పంచుకునేలా ఇతర ప్రాంతాల్లోని జూలలో ఉన్న ఆడ, మగ జంతువులను ఇక్కడి జూకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా జంతువుల సంతానోత్పత్తి పెరగడంతో పాటు విరహ వేదనతో పిచ్చిగా ప్రవర్తిస్తున్న జంతువులను మచ్చిక చేసుకోవాలని భావిస్తున్నారు. అలాగే తోడులేక ఒంటరిగా ఉన్న కొన్ని వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నట్లు గుర్తించిన యంత్రాంగం ఈ దిశగా ఆలోచన చేసింది. బబ్లీ అనే జిరాఫీ మరణంతో సన్నీ అనే మగ జిరాఫీ ఒంటరిగా మిగిలిపోయింది. దీనికి తోడుగా ఆడ జిరాఫీని తీసుకురావడానికి జూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే మైసూర్ జూలోని ఆడ జిరాఫీని హైదరాబాద్కు తీసుకువస్తున్నట్లు జూ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ హకీం తెలిపారు. హమడ్రియాస్ బబూన్.. ఒక రకమైన కోతి ఇది. దీనికి ఆడ తోడును మైసూర్ జూ నుంచి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మగ దేవాంగ పిల్లికి ఆడ దేవాంగ పిల్లిని తీసుకువచ్చేందుకు సైతం ఇతర జూలను సంప్రదిస్తున్నారు. గ్రేటర్ రియా అనే మగ పక్షికి తిరువనంతపురం ఆడ పక్షిని తీసుకురావడానికి చర్చలు జరుపుతున్నారు. కోతి జాతికి చెందిన ఆడ మకాక్ తోడు కోసం త్రిపుర రాష్ట్రం అగర్తలా జూ నుంచి మగ మకాక్ను తీసుకువస్తామని జూ క్యూరేటర్ జె.వసంత పేర్కొన్నారు. – సాక్షి, సిటీబూరో -
పొద్దున్నే కుమ్మేస్తోంది
సాక్షి, సిటీబ్యూరో: ఒకవైపు చలితో గజగజ వణుకుతున్న నగరవాసిని మరోవైపు గాలి కాలుష్యం కమ్మేస్తోంది. తెల్లవారుజామున గ్రేటర్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంటోంది. అసలే శీతాకాలం.. ఆపై వాయు కాలుష్యం నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చలిగాలులు, తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా వాహన, పారిశ్రామిక, ధూళి వంటి గాలి కాలుష్య కారకాలు ‘మితస్థాయి’ నుంచి ‘అనారోగ్య స్థాయికి’ చేరుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా సాయంత్రం వేళల్లో పీఎం 2.5 స్థాయిలు విపరీతంగా పెరుగుతున్నాయి. నగరంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు 163గా ఉన్న ఏక్యూఐ.. మర్నాడు ఉదయం 4 గంటలకు 278కు పెరిగింది. అంటే కేవలం 12 గంటల వ్యవధిలోనే నగరంలో వాయు నాణ్యత దాదాపు రెట్టింపు స్థాయిలో పడిపోయింది. మధ్యాహ్నం సమయంలో నగరంలో గాలి నాణ్యత కాస్త మెరుగ్గానే ఉంటున్నా.. రాత్రి 11 గంటల నుంచి క్రమంగా క్షీణిస్తోంది. ప్రధానంగా అమీన్పూర్, ఆసిఫ్నగర్, బంజారాహిల్స్, బొల్లారం పారిశ్రామిక ప్రాంతం, సెంట్రల్ యూనివర్సిటీ, కాప్రా, కోకాపేట, కొంపల్లి, కోఠి, కూకట్పల్లి తదితర ప్రాంతాలలో గాలి నాణ్యత మరీ తక్కువగా నమోదవుతోంది. పిల్లలు, వృద్ధులపై ప్రభావం.. గాలి కాలుష్యం పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దగ్గు, ఆస్తమా, అలర్జీ, ఇతరత్రా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రధానంగా పిల్లలు, వృద్ధులు ఆరుబయట తిరగకుండా ఉండాలి. పూర్తిగా సూర్యోదయం వచ్చిన తర్వాతే వాకింగ్, జాగింగ్ వంటి చేయడం ఉత్తమం. మాస్క్ లేకుండా ఔట్డోర్ వ్యాయామం చేయకూడదు. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే ఎన్–95 మాస్క్ ధరించాలి. నియంత్రణకు ఏం చేయాలంటే? కాలుష్య సవాళ్లను నియంత్రించాలంటే పట్టణ ప్రణాళిక విభాగం, విధానాల అమలు కీలకం. ప్రభుత్వ, ప్రైవేట్రంగ సంస్థలతో పాటు పౌరుల సహకారం అత్యవసరం. భూ ఉపరితలాన్ని చల్లదనంగా ఉంచేందుకు గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం, పచ్చదనంతో కూడిన ఇంటి పైకప్పులు, భవన నిర్మాణాల్లో హరిత ఉత్పత్తుల వినియోగం తప్పనిసరి చేసేలా నిబంధనల సవరణలు చేపట్టాలి. వీటితో పాటు కాలుష్యం వెదజల్లే కాలం చెల్లిన వాహనాలకు స్వస్తి పలకాలి. ట్రాఫిక్ నియంత్రణ, క్రమబద్ధీకరణ వ్యూహాలను అమలు చేయాలి. తెల్లవారుజామున భారీగా గాలి కాలుష్యం వణికిస్తున్న చలి.. పడిపోతున్న వాయు నాణ్యత 12 గంటల వ్యవధిలోనే రెండింతల పెరుగుదల నగరంలోని పలు ప్రాంతాల్లో క్రమంగా క్షీణదశకు.. -
దూసుకొచ్చిన మృత్యువు
స్కూటీని ఢీకొన్న కారు.. ఇద్దరి దుర్మరణం కీసర: కీసర సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇంటర్ చదివే విద్యార్థినితో పాటు ఆమె చిన్నాన్న అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి– భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన పసుపుల కృష్ణ (38), కూతురు వరుసయ్యే పురాని జ్యోత్స్న (16)ను తీసుకుని ద్విచక్ర వాహనంపై గురువారం రాత్రి బయలుదేరాడు. కుషాయిగూడ నుంచి కీసర మీదుగా మల్యాలకు వెళ్తుండగా ఓఆర్ఆర్ దాటిన తర్వాత నీలంరెడ్డి గెస్ట్హౌజ్ సమీపంలో ఎదురుగా వేగంగా దూసుకువచ్చిన కారు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో కృష్ణ, జ్యోత్స్న అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణ ఎడమకాలు తుంటి ఎముక విరిగిపోయి కారు బ్యానెట్ డోర్ లోపలున్న ఇంజిన్లో ఇరుక్కుపోయిందంటే ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జ్యోత్స్న చీర్యాల చౌరస్తాలోని ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి నాలుగేళ్ల క్రితమే ఓ ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. జ్యోత్స్నకు కృష్ణ వరుసకు చిన్నాన్న అవుతాడని, అతడు భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తుంటాడని వారు చెప్పారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్కు స్వల్పంగా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆ 103 ఎకరాలు సర్కారువే
సాలార్జంగ్ వారసులకు సుప్రీం షాక్● గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్ భూములపై కీలక తీర్పు ● హైకోర్టు, కింది కోర్టుల ఉత్తర్వులను కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం ● జాగీర్ల రద్దుతోనే ఆ భూములు ప్రభుత్వ పరమయ్యాయని స్పష్టీకరణ ● 8 వారాల్లోగా ‘రిజర్వ్ ఫారెస్ట్’ నోటిఫికేషన్ పూర్తి చేయాలని సీఎస్కు ఆదేశంసాక్షి, న్యూఢిల్లీ: రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్లో ఉన్న అత్యంత విలువైన 102 ఎకరాల భూమిపై సాలార్జంగ్ వారసుల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ భూమి ప్రైవేటు ఆస్తి (అరాజీ–మక్తా) కాదని, అది పూర్తిగా ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు గతంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, జిల్లా కోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులను పక్కన పెడుతూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అసలు వివాదం ఏమిటంటే? రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం సాహెబ్నగర్ కలాన్ గ్రామంలోని సర్వే నం. 201/1లో ఉన్న 102 ఎకరాల భూమిపై మీర్ జాఫర్ అలీఖాన్ (సాలార్జంగ్–3 వారసులు) తదితరులు హక్కులు కోరుతూ వచ్చారు. 1832 నాటి కొనుగోలు పత్రాల ఆధారంగా తమ స్వార్జిత ఆస్తి అని, జాగీర్ల రద్దు చట్టం దీనికి వర్తించదని వారు వాదించారు. 2014లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ వీరి వాదనతో ఏకీభవిస్తూ, ఈ భూమిని అటవీ నోటిఫికేషన్ నుంచి మినహాయించాలని ఆదేశించారు. దీనిని జిల్లా కోర్టు, హైకోర్టు కూడా సమర్థించాయి. దీనిని సవాలు చేస్తూ తెలంగాణ అటవీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు జాగీర్ల రద్దుతోనే సర్కారు పరం: 1949లో జాగీర్ల రద్దు రెగ్యులేషన్ వచ్చినప్పుడే సదరు భూములు ప్రభుత్వంలో అంతర్భాగమయ్యాయని కోర్టు స్పష్టం చేసింది. 1953లోనే రెవెన్యూ బోర్డు ఈ భూమిని అటవీ శాఖకు బదలాయించిందని, అప్పటి నుంచి అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధీనంలోనే ఉందని పేర్కొంది. ఆ పత్రాలు చెల్లవు: సాలార్జంగ్ వారసులు చూపించిన 1954 నాటి జాగీర్ అడ్మినిస్ట్రేటర్ లేఖలు, ఇతర పత్రాలు నమ్మదగ్గవిగా లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం జిరాక్స్ కాపీల ఆధారంగా, అసలు రికార్డులను సరిగా పరిశీలించకుండా కింది కోర్టులు తీర్పునివ్వడం సరికాదని తప్పుబట్టింది. అధికారులు పరిధి దాటారు: టైటిల్ (యాజమాన్య హక్కుల) వివాదాలను తేల్చే అధికారం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంటుందని, సమ్మరీ ఎంకై ్వరీ చేసే ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్కు ఆ అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ తన పరిధిని అతిక్రమించి ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని మండిపడింది. అటవీ శాఖ నిర్లక్ష్యం: ఈ కేసులో సరైన సమయంలో సరైన అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో అటవీ శాఖ అధికారులు అలసత్వం ప్రదర్శించారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మరో అప్పీల్ కూడా కొట్టివేత ఇదే భూమిపై హక్కులు కోరుతూ ఆగా సయ్యద్ నయీమతుల్లా షుసీ్త్ర దాఖలు చేసిన మరో పిటిషన్ను (సివిల్ అప్పీల్ నం. 9997/2025) కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ భూమి ప్రభుత్వానిదేనని తేల్చినందున, ఇతరుల వాదనలకు ఆస్కారం లేదని తేల్చిచెప్పింది. 8 వారాల్లోగా పూర్తి చేయండి.. నగరాల్లో పచ్చదనం రోజురోజుకూ తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేసింది. ఈ 102 ఎకరాల భూమిని ’రిజర్వ్ ఫారెస్ట్’గా ప్రకటిస్తూ, తెలంగాణ ఫారెస్ట్ చట్టంలోని సెక్షన్ 15 కింద పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ ప్రక్రియను 8 వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు కంప్లయన్స్ రిపోర్ట్ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని స్పష్టం చేసింది.


