Hyderabad Latest News
-
‘నారీశక్తి వందన్’.. మోదీకి వందనం
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు చందానగర్: మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. గురువారం చందానగర్లో నారీశక్తి వందన్ పాదయాత్రను మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ఓట్ల కోసం మాత్రమే కొన్ని పార్టీలు వాడుకున్నాయని, అమలు చేయడానికి ధైర్యం చూపిన ఏకై క నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని అన్నారు. అనంతరం చందానగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి బీహెచ్ఈఎల్ చౌరస్తా వరకు పాదయాత్రలో ఆయన ముందుకు సాగారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజిత్ కుమార్ సేనాపతి, జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ కార్పొరేటర్ గంగాధర్రెడ్డి, సీనియర్ నాయకులు కసిరెడ్డి భాస్కర్రెడ్డి, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
న్యూరో సర్జరీలో రోబోటిక్ మైక్రోస్కోప్ ప్రారంభం
సనత్నగర్: బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ న్యూరో సర్జరీలో అత్యాధునిక జైస్ కినెవో 900 రోబోబోటిక్ మైక్రోస్కోప్ను గురువారం ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఏవీ గురువారెడ్డి ప్రారంభించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆధునిక సాంకేతికతతో క్లిష్టమైన మెదడు, వెన్నెముక శస్త్ర చికిత్సల్లో భద్రత, ఖచ్చితత్వం, మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. ఇలాంటి ఆధునిక రోబోటిక్ మైక్రోస్కోప్ దేశవ్యాప్తంగా కొద్ది కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా వాస్క్యులర్ న్యూరో సర్జరీతోపాటు ట్యూమర్ ఫ్లోరసెన్స్ –ట్యూమర్ కణజాలాన్ని ఆరోగ్యకరమైన మెదడు కణజాలం నుంచి వేరు చేయడంలో సహాయపడుతుందన్నారు. సీనియర్ కన్సల్టెంట్, న్యూరో సర్జన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ నవీన్ మెహ్రోత్రా మాట్లాడుతూ 3డీ, 4కే విజువలైజేషన్తో శస్త్ర చికిత్స బృందం మొత్తం ప్రక్రియను అత్యంత సమర్ధవంతంగా నిర్వర్తించగలదని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యూరో ఫిజీషియన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సీహెచ్ గోపాల్, మోహన శశాంక్ దివి, డాక్టర్ వినోద్కుమార్, డాక్టర్ నివేదిత సాయిచంద్ర తదితరులు పాల్గొన్నారు. బేగంపేట కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ గురువారెడ్డి -
పెళ్లంటూ మోసగించి రూ.కోటి కాజేశాడు..
పంజగుట్ట: నెల్లూరుకు చెందిన నవాజ్ అనే వ్యక్తి మతం మారినట్లు బోగస్ సర్టిఫికెట్ చూపించి తనను మోసగించి పెళ్లి చేసుకుని, కోటి రూపాయల వరకు కాజేశాడని ఓ బాధితురాలు (26) ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూకట్పల్లికి చెందిన బాధితురాలు మాట్లాడుతూ తాను సాఫ్ట్వేర్ డవలపర్నని, కూకట్పల్లిలో తన ఇంటి కింద ఉన్న షాపులో నవాజ్ ట్రేడింగ్ సొల్యూషన్ ఆఫీస్ పెట్టుకుంటానని 2025 మే నెలలో వచ్చి పరిచయం చేసుకున్నాడని తెలిపింది. కొన్ని రోజులకే వివాహం చేసుకుంటానని తన వెంటపడ్డాడని పేర్కొంది. హిందువుగా మతం మారానని బోగస్ సర్టిఫికెట్ చూపించడంతో నమ్మి గత ఏడాది జూలైలో వివాహం చేసుకున్నట్లు చెప్పింది. వివాహమైనరోజే బేగంపేటకు తీసుకువెళ్లి తనకు జ్యూస్లో మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయాక నవాజ్ సోదరులతో సామూహిక అత్యాచారం చేయించాడని తెలిపింది. శంషాబాద్లో ఉన్న తమ ఫ్లాట్ అమ్ముకున్నాడని, తమ బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నాడని, మొత్తం కోటి రూపాయల వరకు మోసం చేశాడని బాధితురాలు పేర్కొంది. అతనికి అంతకు ముందే రెండు వివాహాలైనట్లు, పిల్లలు కూడా ఉన్నట్లు ఆ తర్వాత తెలిసిందన్నారు. గట్టిగా ప్రశ్నించగా, తన చెల్లిని కూడా ఇలానే గ్యాంగ్ రేప్ చేయిస్తానని, అమ్మను చంపి సహజ మరణంగా చిత్రీకరిస్తానని బెదిరించాడని తెలిపింది. దీంతో తాను కూకట్పల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, నిందితునిపై కేసు నమోదైందని పేర్కొంది. సనత్నగర్: యువతిని మోసగించిన కేసులో నవాజ్తోపాటు అతని సోదరులు ఇస్మాయిల్, లీలాపుద్దీన్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న స్నేహితులు షారూక్, మునావర్ల కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో నవాజ్ తల్లి, ఇతర కుటుంబ సభ్యుల పాత్రపై కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే రిమాండ్లో ఉన్న నవాజ్, ఇస్మాయిల్, లీలాపుద్దీన్లను కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీకి తీసుకున్న అనంతరం అన్ని కోణాల్లో పోలీసులు విచారించనున్నారు. బాధితురాలి తల్లి పేరుపై ఉన్న ఇంటిని నవాజ్ వేరొకరికి విక్రయించిన విషయంపై ఇప్పటికే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పోలీసులు లేఖ రాసినట్లు తెలిసింది. విలేకరుల సమావేశంలోబాధితురాలి ఆవేదన -
వైద్యుల నిర్లక్ష్యమే కారణం
మన్సూరాబాద్: వైద్యుల నిర్లక్ష్యంతోనే యువకుడు మృతి చెందాడంటూ అతడి బంధువులు, స్నేహితులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. రోగి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బలుపాల గ్రామానికి చెందిన చిక్కా నరేష్(38) కొంతకాలంగా కుంట్లూర్లోని నారాయణ కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. నరేష్కు భార్య సుభాషిణి, ఇద్దరు చిన్న పిల్లలున్నారు. గుండెలో నొప్పి వస్తోందంటూ అతడు ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ వైద్యులను ఆశ్రయించాడు. వైద్యులు పరీక్షించి గుండెకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు అతడు ఈ నెల 11న శస్త్రచికిత్స నిమిత్తం హాస్పిటల్లో చేరాడు. బుధవారం ఉదయం 8.30 గంటలకు వైద్యులు శస్త్రచికిత్సను ప్రారంభించారు. అయితే బుధవారం రాత్రి 9.30 గంటలకు నరేష్ మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు. కాగా, అనుభవంలేని జూనియర్ డాక్టర్లు శస్త్రచికిత్స చేయడం వల్లే నరేష్ మృతి చెందాడని ఆరోపిస్తూ అతడి బంధువులు, నారాయణ కాలేజీ సిబ్బంది పెద్ద ఎత్తున హాస్పిటల్కు చేరుకుని ఆందోళన చేశారు. అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో ఎల్బీనగర్ పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని బందోబస్తు చేపట్టారు. అదుపులేని రక్తస్రావం వల్లే.. నరేష్కు బెంటాల్ సర్జరీ పూర్తయినప్పటికీ, అదుపులేని రక్తస్రావం తలెత్తడంతో విషాదం జరిగిందని, వైద్యపరంగా ఉత్తమ చికిత్సను అందించామని వైద్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం, జూనియర్ డాక్టర్లతో సర్జరీ చేయించారనే ఆరోపణలో నిజం లేదని కామినేని హాస్పిటల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఆస్పత్రి వద్ద మృతుడి కుటుంబసభ్యుల ఆందోళన -
మోయ‘బడి’...
నాంపల్లి: విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన బడిలో పిల్లలు బరువుపనుల్లో నలిగిపోతున్నారు. ఆయాలు, సబార్డినేట్లు చేయాల్సిన పనులను విద్యార్థులకు అప్పగిస్తున్నారు రెడ్హిల్స్లోని సైఫాబాద్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో. ఉపాధ్యాయులే వీరి చేత వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా వాహనాల్లో వచ్చే ఆహార పదార్థాలను పిల్లలే పాఠశాల లోపలికి మోసుకొస్తున్నారు. అన్నం, గుడ్లు, పప్పు వంటి వాటిని లోనికి తెచ్చుకుని, ఎవరికివారే వడ్డించుకుంటున్నారు.నల్లా దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఈ వ్యవహారం కొన్ని నెలలుగా జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారి వివరణ.. నాంపల్లి మండల డిప్యూటీ ఈవో వీరలక్ష్మిని వివరణ కోరగా.. ఆ విషయం తన దృష్టికి రాలేదని, త్వరలోనే పాఠశాలను సందర్శించి విచారణ చేపడతానని చెప్పారు. విద్యార్థులతో పాఠశాలలో పనిచేయించడం తప్పేనని, విచారణలో ఆ విషయం తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. -
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు
మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మేడ్చల్ రూరల్ : రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తామని తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 252 జీవోలో..అవసరమైన మేరకు సవరణలు చేసి డీపీఆర్ఓలకు పంపిస్తామన్నారు. గురువారం శామీర్పేట్లో టీయూడబ్ల్యూజే రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ అధ్యక్షతన నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులకు జారీ చేసే అక్రెడిటేషన్ కార్డుల విషయంలో ఎలాంటి అపోహలు పడవద్దని, గతంలో కంటే మెరుగైన జీవోను ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. జర్నలిజంతో సంబంధం లేని వారికి అక్రెడిటేషన్లు జారీ కాకుండా యూనియన్ బాధ్యులు జాగ్రత్త వహించాలని సూచించారు. కమిటీ సభ్యులకు త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు. ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ సంఘం సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఏ మాజీద్ పాల్గొన్నారు. -
ఉస్మానియా మెడికో ఆత్మహత్య
మోతాదుకు మించి ఇంజెక్షన్లు ఇచ్చుకుని.. మాత్రలు వేసుకుని..అఫ్జల్గంజ్: ఉస్మానియా ఆస్పత్రి పీజీ విద్యార్థి కాట్రావత్ సురేష్ కుమార్ (26) బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. సీనియర్లు పెట్టిన పని ఒత్తిడి తట్టుకోలేక తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లిదండ్రులు, కుటుంబీకులు ఆరోపిస్తుండగా.. కోర్సుపై అతడికి ఆసక్తి లేకపోవడంతో ఒత్తిడికి గురై ప్రాణం తీసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న అఫ్జల్గంజ్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్నగర్ జడ్చర్లకు చెందిన సురేష్కు పీజీ నీట్ ద్వారా ఉస్మానియాలో సర్జరీ విభాగంలో సీటు వచ్చింది. దాదాపు పది నెలల క్రితం కోర్సులో చేరిన అతను ఆఖరి కౌన్సెలింగ్ వరకు కోర్సు మార్చుకోవడానికి ప్రయత్నించారు. మూడు రౌండ్లలోనూ అది సాధ్యం కాలేదు. నిబంధనల ప్రకారం కోర్సు మధ్యలో వదిలి వెళ్లాలంటే భారీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. హాస్టల్ గదిలో అచేతనంగా.. ఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురైన సురేష్ బుధవారం రాత్రి ఎక్కువ మోతాదులో మత్తు ఇంజెక్షన్లు, మాత్రలు వేసుకుని తన హాస్టల్ గదిలో ఉన్నారు. గురువారం ఉదయం ఆయన తల్లి, కుటుంబీకులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఇక్కడ ఉన్న సురేష్ స్నేహితులకు కుటుంబీకులు విషయం తెలిపారు. వాళ్లు వెళ్లి సురేష్ గది తలుపులు తెరిచి చూడగా అచేతనంగా పడి ఉన్నారు. ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సురేష్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. బంధువులు, సహచరుల ఆందోళన.. ఆస్పత్రి వద్ద సురేష్ కుటుంబీకులతో పాటు సహచర విద్యార్థులు నిరసనకు దిగారు. సీనియర్లు అతనితో ఎక్కువ పని గంటలు పని చేయించారని, సుదీర్ఘంగా డ్యూటీలు వేశారని, ఆ ఒత్తిడి తట్టుకోలేకే సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. అతడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకు మృతదేహానికి పోస్టుమార్టం పరీక్షలు చేయనీయమని అడ్డుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చచెప్పి, పోస్టుమార్టం పరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అందించారు. సురేష్ ఆత్మహత్యపై కుటుంబీకులు చేస్తున్న ఆరోపణల్నీ పరిగణనలోకి తీసుకున్నామని, కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని అధికారులు ప్రకటించారు. -
శభాష్ రాముడు
అంబర్పేట: అంబర్పేట పోలీసుస్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్కు యత్నించిన కరుడుగట్టిన నేరస్తుడు అబ్దుల్ మన్నన్ను పట్టించిన ఆర్మీ మాజీ జవాన్ రాముడిని కొత్వాల్ వీసీ సజ్జనర్ గురువారం సన్మానించారు. అంబర్పేట ఇరానీ హోటల్ బస్టాప్ వద్ద మంగళవారం రాముడు బస్సు దిగుతున్నారు. ఆ సమయంలో ఆయన మెడలోని బంగారు గొలుసు లాక్కుపోవడానికి మన్నన్ ప్రయత్నించగా రాముడు ప్రతిఘటించారు. తన వయస్సును కూడా లెక్కచేయకుండా అతడిని ఒడిసిపట్టుకున్నారు. డయల్–100 ద్వారా సమాచారం అందుకున్న అంబర్పేట పెట్రోలింగ్ సిబ్బంది నిమిషాల వ్యవధిలో అక్కడకు చేరుకుని మన్నన్ను అదుపులోకి తీసుకున్నారు. మల్లేపల్లికి చెందిన ఇతడిపై 31 పాత కేసులు ఉన్నాయి. అబ్దుల్ మన్నన్పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న ఇతడి అనుచరులు కోటేష్, మల్లేష్ కోసం గాలిస్తున్నారు. రాముడితోపాటు నిందితుడిని అదుపులోకి తీసుకోవడంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించిన ఎస్సై సురేష్, కానిస్టేబుళ్లు దినేష్రెడ్డి, భరత్ కుమార్లను కొత్వాల్ గురువారం బషీర్బాగ్లోని పాత కమిషనరేట్కు పిలిపించి సన్మానించారు. కార్యక్రమంలో ఐటీ సెల్ డీసీపీ సీహెచ్ రూపేష్ పాల్గొన్నారు. కరుడుగట్టిన నేరస్తుడినిపట్టించిన రిటైర్డ్ ఆర్మీ జవాను అభినందించిన సీపీ సజ్జనర్ -
అంతారాలు
ఒకవైపు ఉన్నత వర్గాలు.. మరోవైపు పేదలు సాక్షి, సిటీబ్యూరో నగరం విభిన్న అంశాల సమాహారం. ఏ రంగంలో చూసినా, ఏ అంశంలో చూసినా ఈ విషయమే తేటతెల్లమవుతుంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ‘సోషియో– ఎకనమిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయిమెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే–2024’ సైతం ఇదే అంశాన్ని వెల్లడించింది. నగరంలోని అసమానతలు, ఇతర ప్రాంతాల కంటే భిన్నమైనవని స్పష్టం చేసింది. సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. కులాలు, ఆదాయ స్థాయి, నివాస సదుపాయాల విషయంలో స్పష్టమైన అసమానతలు ఉన్నట్టు బయటపడింది. ఒకవైపు అధిక ఆదాయ వర్గాలు, మరోవైపు మౌలిక వసతుల కోసం పోరాడే వర్గాలున్న నగర భిన్న రూపం వెల్లడైంది. సర్వే మేరకు పట్టణ గృహాలు 20,17,409. బీసీల్లో ముస్లిం మైనార్టీలను, మైనార్టీయేతరుల వారీగానూ వివరాలు పొందుపర్చారు. ఎస్సీల గృహాలు 2,19,587, ఎస్టీల గృహాలు 55,017, ముస్లిం మైనార్టీలో బీసీల గృహాలు 3,65,578 ఉన్నాయి. కులాల వారీగా విభజన కులాల వారీగా చూస్తే బీసీలే అధికం. గృహాల పరంగా చూస్తే బీసీలు గృహాలు దాదాపు 29.58% ఉండగా, ఓసీ వర్గాలవి 38.68% ఉన్నాయి. ముస్లిం మైనారిటీలవి 25.40% వాటా కలిగి ఉండటం నగర ప్రత్యేకతను చూపుతోంది. ఎస్సీలు, ఎస్టీల గృహాలు వీరికంటే తక్కుగా ఉన్నాయి. కొన్ని వర్గాలకు చెందిన కుటుంబాలు అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్లలో నివసిస్తుండగా, మరికొన్ని వర్గాలు కనీస సౌకర్యాలు కూడా లేకుండా జీవిస్తున్నాయి. ఉన్నత వర్గాల్లో ఎక్కువ గదులతో విశాలమైన ఇళ్లు కనిపిస్తుండగా.. వెనుకబడిన వర్గాల్లో ఒకటి లేదా రెండు గదుల ఇళ్లలోనే జీవిస్తున్నాయి. పిల్లలు తక్కువే.. 0–5 ఏళ్ల చిన్నారులు జీహెచ్ఎంసీ జనాభాలో 6.8% మాత్రమే. దీనిని జనన రేటు తగ్గుతున్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. నగరంలో పక్కా ఇళ్ల సంఖ్య పెరిగినా, అద్దె ఇళ్లపై ఆధారపడే కుటుంబాలు కూడా గణనీయంగా ఉన్నట్టు సర్వే నివేదిక సూచించింది. జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి ఉన్నప్పటికీ, సమాన అవకాశాల విషయంలో ఇంకా పెద్ద సవాళ్లు ఉన్నాయని నివేదిక తేటతెల్లం చేసింది. కొన్ని కులాల యువతలో ఆంగ్ల మాధ్యమ విద్య ఎక్కువగా ఉండగా, మరికొన్ని వర్గాల్లో అది చాలా తక్కువగా ఉంది. కొందరికి సమకూరుతున్న సకల వసతులు మరికొందరి పరిస్థితి జీవన పోరాటం అభివృద్ధితో పాటు అసమానతలు సైతం.. కులాల వారీగా బీసీ జనాభే అధికం నగర పరిస్థితులపై సమగ్ర సర్వేలో వెల్లడి -
క్రైమ్ కథా చిత్రమ్!
సిటీలో బెంగళూరు పోలీసుల ఆపరేషన్ సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరు పోలీసులు నగరంలోని మాదాపూర్, కొండాపూర్ల్లో నిర్వహించిన ఆపరేషన్ ఓ ఆసక్తికరమైన కేసును వెలుగులోకి తెచ్చింది. అక్కడి సేగెహళ్లికి చెందిన వివాహితను మోసం చేసిన మహేష్ అనే వ్యక్తి దాదాపు కిలో బంగారం కాజేశాడు. ఏడాదిన్నర పాటు సాగిన ఈ క్రైమ్ కథలో ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి కూడా నిందితుడు. అతడినీ పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్లోని పేయింగ్ గెస్ట్ అకామిడేషన్పై దాడి చేసిన ప్రత్యేక బృందం మహేష్ను అరెస్టు చేసి, రెండు బ్యాంకులు, మరో ఫైనాన్స్ దుకాణం నుంచి రూ.85.6 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకుంది. ఇటీవల జరిగిన ఈ అరెస్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్యను వదిలి.. మహిళల్ని టార్గెట్ చేసి... నిజామాబాద్కు చెందిన పి.మహేష్ వివాహితుడు. కొన్నేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. నగరానికి వచ్చి మాదాపూర్లోని ఓ పేయింగ్ గెస్ట్ అకామిడేషన్లో నివసిస్తూ.. సోషల్మీడియా ప్లాట్ఫామ్స్లో వివాహిత మహిళల్ని టార్గెట్గా చేసుకుంటున్నాడు. వారిని బ్లాక్మెయిల్ చేసి అందినకాడికి దండుకుని విలాసాలకు ఖర్చు చేస్తాడు. ఏడాదిన్నర క్రితం ఇతడికి స్నాప్చాట్ ద్వారా బెంగళూరులోని సేగెహళ్లికి చెందిన మహిళతో (32) పరిచయమైంది. ఈమెతో చాటింగ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. తనను పూర్తిగా నమ్మిన ఆ వివాహిత నమ్మకాన్ని మహేష్ క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. బెంగళూరులోని పలుమార్లు ఆమె ఇంటికి వెళ్లాడు. స్థిరాస్తి వ్యాపారంలో నష్టాలు వచ్చాయని, నమ్మించి.. ఆమె నుంచి పలు దఫాల్లో దాదాపు కిలో బంగారం తీసుకున్నాడు. ఇందులో కొంత అమ్మేయగా 571 గ్రాముల్ని మాదాపూర్, కొండాపూర్ల్లోని రెండు బ్యాంకులు, ఓ ఫైనాన్స్ దుకాణంలో తాకట్టు పెట్టి జల్సాలకు వినియోగించాడు. భర్త నిలదీయడంతో.. ఇంట్లోని బంగారం కనిపించకపోయేసరికి భర్త నిలదీయడంతో బాధితురాలు మహేష్పై ఒత్తిడి చేసింది. వెంటనే ప్లేట్ ఫిరాయించిన అతగాడు తమ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ విషయాన్ని భర్తకు చెప్పడంతో పాటు మార్ఫింగ్ ఫొటోలు పంపిస్తానని బెదిరించడం మొదలెట్టాడు. ఈ విషయాన్ని తన భర్త దృష్టికి తీసుకువెళ్లింది. ఫిబ్రవరి 10న బెంగళూరులోని ఆర్కేపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల ఓ ప్రత్యేక బృందం నగరానికి వచ్చిన మహేష్ను అరెస్టు చేసి, సొత్తు రికవరీ చేసుకువెళ్లింది. దర్యాప్తులో భాగంగా సదరు మహిళను అనంతపురానికి చెందిన స్వామి అనే యువకుడు ఇలాగే మోసం చేసినట్లు తేలింది. అతడిని అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు పది తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. జైలుకు చేరే వరకు మహేష్, స్వామిలకు ఒకరి విషయం మరొకరికి తెలియకపోవడం విశేషం. మాదాపూర్లోని పీజీ అకామిడేషన్పై దాడి సేగెహళ్లి మహిళను ముంచిన మహేష్ మోసగాడిని అరెస్టు చేసిన ప్రత్యేక బృందం అనంతపురం వాసీ.. కటకటాల్లోకి.. -
ప్రమాదరహిత నగరంగా తీర్చిదిద్దాలి
సాక్షి, సిటీబ్యూరో: నగరాన్ని ప్రమాద రహిత నగరంగా తీర్చిదిద్దడంలో రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యుల పాత్ర అత్యంత కీలకమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో నిర్వహిస్తున్న ‘అరైవ్ – అలైవ్’ వారోత్సవాల్లో భాగంగా బుధవారం టీజీఐసీసీసీ ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రమాదంలో ఇంటి యజమాని మరణిస్తే ఆ కుటుంబం మొత్తం వీధిన పడుతుందని, అలా జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. వాహనదారులు భద్రతా నియమాలను ఒక పవిత్రమైన క్రతువులా పాటించాలని సూచించారు. ప్రతి కాలనీ, అపార్ట్మెంట్ అసోసియేషన్లు తమ ప్రాంగణాల్లో ’నో హెల్మెట్ – నో ఎంట్రీ’ బోర్డులను ఏర్పాటు చేసి కఠినంగా అమలు చేయాలన్నారు. స్థానిక ట్రాఫిక్ సమస్యలను వాట్సాప్ గ్రూపుల ద్వారా అధికారుల దృష్టికి తీసుకువస్తే, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి కేంద్ర ప్రభుత్వం నగదు పురస్కారంతో పాటు చట్టపరమైన రక్షణ కల్పిస్తోందని, కాబట్టి భయపడకుండా బాధితులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ జాయింట్ సీపీ డి.జోయల్ డేవిస్ మాట్లాడుతూ రోడ్డు భద్రత పోలీస్ శాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరితో రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అదనపు డీసీపీ రాములు, ఏసీపీలు, ఎస్.హెచ్.ఓలు పెద్ద సంఖ్యలో రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సుమారు 400 మంది కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చిన్నారులకు హెల్మెట్ల పంపిణీ అంతకుముందు, ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బుధవారం ’బాలల రహదారి భద్రతా దినం’ సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 అగ్రసేన్ కూడలిలో సీపీ సజ్జనర్ చిన్నారులకు హెల్మెట్ల పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే 4 ఏళ్లు పైబడిన పిల్లలందరికీ తప్పనిసరిగా హెల్మెట్ ధరింపజేయాలని వాహనదారులకు అవగాహన కల్పించారు. నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ -
మామూళ్లు వసూలు చేస్తే కఠిన చర్యలు
చార్మినార్: చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ బుధవారం సాయంత్రం చార్మినార్ నడిరోడ్డులో దుకాణదారులు, వీధి వ్యాపారుల సమక్షంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. చార్మినార్ కట్టడం ప్రాంగణంలో రోడ్డుపై కూర్చోబెట్టి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. చార్మినార్ పరిసరాల్లో మామూళ్లు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన వారిని పిలిపించి.. ఎలాంటి బెదిరింపులకు పాల్పడవద్దని కఠినంగా హెచ్చరించారు. తమ హెచ్చరికలను లెక్కచేయని వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నామన్నారు. ఇప్పటికే ఒకరిద్దరిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపామమన్నారు. ఇదే చివరి హెచ్చరిక అని.. వినకపోతే..రౌడీ షీట్లు తెరవడం, కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడం వంటి చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు తమతో పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్, చార్మినార్ ఎస్హెచ్ఓ రాంబాబు పాల్గొన్నారు. రౌడీషీటర్లతో చార్మినార్ జోన్ డీసీపీ -
ఇంటర్లో మైనారిటీ గురుకుల విద్యార్థుల ప్రతిభ భేష్
సాక్షి,సిటీబ్యూరో: ఇంటర్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గురుకులాల విద్యాసంస్థల సొసైటీల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులు 90 శాతం ఉత్తీర్ణతతో రెండవ స్థానాన్ని దక్కించుకున్నారని తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థల సొసైటీ (టెమ్రీస్) వైస్ చైర్మన్ ఫహీముద్దీన్ ఖురేషీ, కార్యదర్శి షఫీ ఉల్లా వెల్లడించారు. బుధవారం టెమ్రీస్ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 90 శాతం మంది, ప్రథమ సంవత్సరంలో 81 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో షమీమ్ నిఖత్ (జడ్చర్ల) 470 మార్కులు, బైపీసీ ద్వితీయ సంవత్సరంలో అయేషా బేగం (అసిఫ్ నగర్) 996 మార్కులు, సాధించారన్నారు. టెమ్రీస్ వైస్ చైర్మన్ ఫహీముద్దీన్ ఖురేషీ -
ఐఎఫ్ఎస్ వర్సెస్ ఐఆర్ఎస్
ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వివాదం ● బంజారాహిల్స్ పోలీసుల దర్యాప్తు బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డునెంబర్–10లోని ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్లో కుక్క పంచాయితీ చివరికి ఠాణాకు చేరింది. బాధిత మహిళా ఐఆర్ఎస్, పోలీసుల మాటల్లోనే పూర్తి వివరాలు.. ‘2016 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి ఎస్పీ సుతన్ సైఫాబాద్లోని అరణ్య భవన్లో విధులు నిర్వర్తిస్తూ.. ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్లో ఉంటున్నారు. ఇదే క్వార్టర్స్లో ఐఆర్ఎస్ అధికారి నితికాసింగ్ సైతం నివసిస్తున్నారు. సుతన్ క్వార్టర్స్లో న్యూసెన్స్ చేసేవారు. రెండు రోజుల క్రితం నితికాసింగ్ క్వార్టర్ వద్దకు వచ్చి హంగామా చేశారు. ఆమె పెంపుడు కుక్క తన ఇంటి వద్ద అపరిశుభ్రతకు కారణమైందని మండిపడ్డాడు. ఇంటి సిబ్బందితో పాటు పెంపుడు కుక్కపై దురుసుగా ప్రవర్తించారు. నితికాసింగ్ పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. మద్యం మత్తులో ఆమె ఇంటి వద్ద పూల కుండీని పగులగొట్టారు. సుతన్ న్యూసెన్స్ను తట్టుకోలేక బాధిత ఐఆర్ఎస్ అధికారిణి బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుతన్పై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు 75, 79, 324 (4), 351 (2), 352 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం’ అని పోలీసులు తెలిపారు. విచారణ నిమిత్తం బుధవారం సుతన్ను ఠాణాకు పిలిపించారు. ఆయనకు డ్రగ్ టెస్ట్ చేసి ఇంటి వద్ద విచారణ చేపట్టారు. సుతన్ ప్రవర్తన అసహజంగా ఉండటంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు గతంలో ఆయనను సెలవుపై పంపించినట్లు గుర్తించారు. ఇటీవల చికిత్స చేయించుకుని మళ్లీ విధుల్లో చేరారు. తాజాగా ఆయన మీద కేసు నమోదు కావడంతో అరణ్య భవన్ నుంచి దూలపల్లి అటవీ ప్రాంతానికి మంగళవారం బదిలీ చేశారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారికి చెందిన సుతన్ (33) అవివాహితుడని తేలింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు పేర్కొన్నారు. -
రూ.కోట్లల్లో సర్కారు సొమ్ము స్వాహా
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏజన్సీల మాయాజాలం ఒక్కటొక్కటిగా బయటపడుతోంది. లేని ఉద్యోగులను ఉన్నట్లుగా రికార్డుల్లో నమోదు చేసి ప్రభుత్వం నుంచి రూ.కోట్లలో దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై పలువురు ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా ఉస్మానియా ఆసుపత్రి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ● ఉస్మానియా ఆసుపత్రిలో ప్రభుత్వం అధికారికంగా నెలకు 787 మంది కార్మికులకు వేతనం చెల్లిస్తోందని, వాస్తవంగా పనిచేస్తున్నది సుమారుగా 400 మంది మాత్రమే ఉంటారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ● ఆరు నెలల క్రితం సిబ్బంది ఎంత మంది పనిచేస్తున్నారు. వారి వివరాలపై ఆరా తీయగా కొంత మంది ఏక కాలంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రిల్లో పనిచేస్తున్నట్లు వెలుగుచూసింది. దీంతో ఏజన్సీలను మందలించి, మరో మారు అలా జరగకుండా చూసుకోవాలని అధికారులు హెచ్చరించారు. ● అయితే ఈదందా ఇక్కడితో ఆగలేదని తాజాగా మరోమారు తేటతెల్లమైపోయింది. రాష్త్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికుల ఆధార్ కార్డులను శాలరీతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశించనపుడు వేలాది మంది రెండు అంత కంటే ఎక్కువ చోట్ల వేతనాలు పొందుతున్నట్లు గుర్తించారు. ● పేషెంట్ కేర్ కోసం ప్రైవేటు సంస్థల నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మ్యాన్ పవర్ను తీసుకుంటున్నారు. ఈ విధానంలో ప్రభుత్వం ఒక్కో బెడ్కు రూ.7,500 చెల్లిస్తోంది. వంద పడకలు ఉన్న ఆసుపత్రిలో 45 మంది సిబ్బందిని నియమించాలని నిబంధనలు పెట్టింది. ● ఇందులో సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్ కేర్ విభాగాల్లో సిబ్బంది పనిచేస్తారు. అయితే ఏజన్సీలు ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టిస్తున్నట్లు సమాచారం. తప్పుడు నివేదికలతో రూ.కోట్లలో సొమ్ము స్వాహా చేస్తున్నాయన్న ఆరపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే మరిన్ని అక్రమ బాగోతాలు వెలుగు చూస్తాయని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ● పనిచేస్తున్న కార్మికులకు సమయానికి వేతనాలు ఇవ్వడం లేదని, వేతన చెల్లింపుల్లోనూ కోతలు విధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిస్థితులను చక్కదిద్దాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏజెన్సీల మాయాజాలం ఒకే వ్యక్తి రెండు అంతకంటే ఎక్కువ చోట్ల పని చేస్తున్నట్లు లెక్కలు అక్రమాలపైప్రభుత్వానికి ఫిర్యాదులు -
నాలుగేళ్లు నిండితే హెల్మెట్ తప్పనిసరి
నగరంలో ‘అరైవ్–అలైవ్’ నిర్వహణ సాక్షి, సిటీబ్యూరో/విజయ్నగర్కాలనీ: ‘అరైవ్–అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా నగర పోలీసు విభాగం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. బుధవారం చిన్నారుల భద్రత, దానికి సంబంధించిన నిబంధనలపై నగర వ్యాప్తంగా అవగాహన కల్పించింది. వివిధ పాఠశాలలతో పాటు కూడళ్లలో శిబిరాలు నిర్వహించిన పోలీసులు చిన్నారులకు హెల్మెట్లు పంపిణీ చేయడంతో పాటు రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వారూ (పిలియన్ రైడర్) కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. తొమ్మిది నెలల నుంచి నాలుగేళ్ల మధ్య ఉన్న చిన్నారులను ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లాలంటే వారికి సేఫ్టీ హార్నెస్గా పిలిచే బెల్ట్ కచ్చితంగా ఉండాలి. నాలుగేళ్ల పై బడిన వారూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ‘అరైవ్–అలైవ్’లో భాగంగా ఈ విషయాన్ని నగర పోలీసులు ప్రచారం చేశారు. బుధవారం విజయ్నగర్కాలనీలోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్, కలెక్టర్ హరిచందన దాసరి పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు 30 హెల్మెట్లు, 200 వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులతో పోలీసులు అరైవ్–అలైవ్ ప్రతిజ్ఞ చేయించి హెల్మెట్లు అందజేశారు. -
‘ఏరోస్పేస్’ రంగంలో గత పదేళ్ళలో ఎంతో పురోగతి
చందానగర్: ఏరో స్పేస్ రంగం గత పదేళ్ళ కాలంలో ఎంతో పురోగతి సాధించిందని డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్, ఏరోనాటికల్ సోసైటీ ఆఫ్ ఇండియా(ఏఈఎస్ఐ) హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ రాజబాబు పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా క్యాంపస్లో రెండు రోజులపాటు నిర్వహించే 74వ వార్షిక సర్వసభ్య సమావేశం, జాతీయ సదస్సు సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ..ఏరో స్పేస్ రంగంలో మూడు అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అందులో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఉత్పత్తి, సర్టిఫికేషన్ అనేవన్నారు. ఈ నెల 17,18 తేదీలలో ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 74వ వార్షిక సర్వసభ్య సమావేశం, జాతీయ సదస్సును ఎస్కీ క్యాంపస్లో నిర్వహిస్తామన్నారు. సదస్సులో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు, నీతిఆయోగ్కు చెందిన డాక్టర్ వికె సారస్వత్, సీఎస్ఐఆర్ ప్రతినిధి డాక్టర్ ఎన్ కళైసెల్వి, డీఆర్డీఓ మాజీ చైర్మన్డాక్టర్ జి సతీష్రెడ్డి, డాక్టర్ ఎస్ సోమనాథ్ వంటి నిష్ణాతులు పాల్గొంటారని ఆయన వివరించారు. – డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్, ఏఈఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ రాజాబాబు -
‘గాంధీ’లో అమర్నాథ్ యాత్ర మెడికల్ సర్టిఫికెట్ల జారీ
ఈ నెల 18న ప్రారంభం.. ప్రతి శుక్రవారం వైద్యపరీక్షలు గాంధీ ఆస్పత్రి: అమర్నాథ్ యాత్రికులకు మెడికల్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత ప్రతి శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా సర్టిఫికెట్లు అందించేందుకు రంగం సిద్ధం చేసినట్లు గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి తెలిపారు. జూలై 3 నుంచి ఆగస్ట్ 28 వరకు అమర్నాథ్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. యాత్రికులు నిర్దేశిత మెడికల్ బోర్డు నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఫల్మనాలజీ, కార్డియాలజీ వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ, హారిక, గోపికృష్ణ, శ్రీనివాస్, నోడల్ ఆఫీసర్ యోగేందర్లతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. వివరాలకు గాంధీ ఆసుపత్రి ప్రధాన భవనం మొదటి అంతస్తులోని మెడికల్ రికార్డు సెక్షన్ (ఎంఆర్డీ)ను సంప్రదించాలి. -
వారసత్వ సంపదకు నిలయం తెలంగాణ
మంత్రి జూపల్లి కృష్ణారావు గోల్కొండ: అద్భుతమైన చారిత్రక కట్టడాలు వారసత్వ సంపదకు తెలంగాణ నిలయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన గోల్కొండ సమీపంలోని కుతుబ్షాహీ టూమ్స్, కఠొరా హౌస్తో పాటు ఖజానా బిల్డింగ్, గోల్కొండ కోట బస్టాప్ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం గోల్కొండ బడాబజార్లోని ఖజానా బిల్డింగ్ మ్యూజియంను సందర్శించారు. ఖజానా బిల్డింగ్లో ఉన్న విలువైన కళాఖండాలను పరిశీలించారు. హైదరాబాద్ను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మోహియుద్దీన్, టీజీడీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్రావు, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ కార్యాలయ డైరెక్టర్ కె.గణేష్రెడ్డి తదితరులున్నారు. కాగా.. మంత్రి జూపల్లి పర్యటనలో చిన్న అపశ్రుతి దొర్లింది. మంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని రెండు కార్లు ఢీకొన్నాయి. కార్ల వేగం అంతగా లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. -
హాయ్ బ్రదర్.. ఎట్లుంది మా హైదరాబాద్?
● విదేశీ పర్యాటకునితో మంత్రి జూపల్లి ముచ్చట ● చౌమొహల్లా ప్యాలెస్లో ఆసక్తికర సన్నివేశం సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక చౌమొహల్లా ప్యాలెస్లో బుధవారం ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్యాలెస్ సందర్శనకు వచ్చిన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు బ్రిటన్ నుంచి వచ్చిన ఓ విదేశీ పర్యాటకుడు తారసపడ్డారు. దీంతో మంత్రి అతడితో కాసేపు ముచ్చటించారు. హైదరాబాద్ పర్యటన ఎలా సాగుతోందని మంత్రి ఆయనను అడిగి తెలుసుకున్నారు. నగరంలో ఇంకా ఏయే ప్రదేశాలు చూశారని వాకబు చేయగా.. ఇప్పటికే తాము కుతుబ్షాహీ సమాధులను సందర్శించినట్టు ఆ పర్యాటకుడు బదులిచ్చారు. భాగ్యనగర ఆతిథ్యం ఎలా ఉంది? ఇక్కడి వంటకాలు నచ్చాయా? అని మంత్రి వాకబు చేశారు. పర్యాటకుల నుంచి లభించే సలహాలు, సూచనల ఆధారంగా రాష్ట్రంలోని చారిత్రక కట్టడాల వద్ద సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి పేర్కొన్నారు. -
తేమంటలు
ఉష్ణ తీవ్రత కంటే తేమ శాతంతోనే ఉక్కపోతసాక్షి, సిటీబ్యూరో గాలిలో తేమశాతం పెరిగితే.. అది ఉష్ణ తీవ్రత కంటే ఎక్కువ ప్రభావం చూపనుందా? ఉక్కపోతకు అసలు ప్రధాన కారణం తేమ శాతమేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు అవుననే వస్తున్నాయి. కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో గాలిలో పెరుగుతున్న తేమశాతంతో అసలు ఉష్ణోగ్రతల కంటే మన శరీరానికి తగిలే వేడి 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉంటోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పెరుగుతున్న ఉష్ణతాపానికి ‘ఉక్కపోత’ భరించలేని స్థాయికి చేరుకుంది. బుధవారం గరిష్టంగా 40.6, కనిష్టంగా 27.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజులుగా గరిష్ట 40 డిగ్రీల వరకు నమోదవుతున్నప్పటికీ.. పెరిగిన తేమశాతం కారణంగా అది 45 డిగ్రీల పైన ఉన్నట్లు ప్రభావం చూపుతోంది. చెమట పట్టినా అది గాలిలోకి ఆవిరి కాకపోవడంతో శరీరం చల్లబడటం లేదు. దీంతో నగర వాసులు నీరసం, విపరీతమైన ఉక్కపోతకు గురవుతున్నారు. గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే నగరంలో ఉష్ణోగ్రతల తీవ్రతతో పాటు ’ఉక్కపోత’ రికార్డు స్థాయిలో 60 నుంచి 70 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉష్ణోగ్రతలు పెరగడానికి సూర్యరశ్మి మాత్రమే కారణం కాదని, మానవ నిర్మితాలే ప్రధానమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పచ్చదనం కరువై.. వాస్తవంగా నగరం వేగంగా విస్తరించడంతో పచ్చదనం కరువైంది. ఎత్తయిన భవనాలు, తారు రోడ్లు పగటిపూట వేడిని పీల్చుకుని రాత్రివేళల్లో ఆ వేడిని వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి. దీంతో రాత్రిపూట కూడా ఉపశమనం లభించడం లేదు. మరోవైపు పెరిగిన వాహనాల సంఖ్యతో విడుదలయ్యే కార్బన్ డయాకై ్సడ్ వంటి వాయువులు వేడిని వాతావరణంలోనే బంధిస్తున్నాయి. గదుల లోపల చల్లదనం కోసం వాడే ఏసీలు, బయట వాతావరణంలోకి భారీగా వేడి గాలిని విడుదల చేస్తున్నాయి. ఇది చుట్టుపక్కల ప్రాంతాలను మరింత వేడెక్కిస్తోంది. ఉక్కపోత ఇలా.. మానవ శరీరం అనుభవించే అసలైన వేడిని రెండు పద్ధతుల ద్వారా లెక్కించవచ్చు. హీట్ ఇండెక్స్ అంటే అనిపించే ఉష్ణోగ్రత (అప్పరెంట్ టెంపరేచర్) అని కూడా అంటారు. గాలి ఉష్ణోగ్రత, గాలిలోని సాపేక్ష ఆర్ద్రత (రిలేటివ్ హ్యూమిడిటీ) రెండింటినీ కలిపి దీనిని లెక్కిస్తారు. ఉదాహరణకు బయట ఉష్ణోగ్రత 38 డిగ్రీలు ఉండి తేమ 60 శాతం ఉంటే హీట్ ఇండెక్స్ ప్రకారం మన శరీరానికి అది 47 డిగ్రీలుగా అనిపిస్తుంది. గాలిలో తేమశాతం ఇలా ఉంటే.. ఉష్ణోగ్రతల కంటే హీట్ ఇండెక్స్ అధికం అదనంగా 4 నుంచి 5 డిగ్రీల ఎక్కువ వేడి చెమట పట్టినా అది గాలిలోకి ఆవిరి కాని వైనం కాంక్రీట్ జంగిల్ ప్రభావం నిప్పుల కొలిమిని తలపిస్తున్న మహానగరం నగరంలో బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు (డిగ్రీల్లో) ప్రాంతం గరిష్టం కనిష్టం హైదరాబాద్ 40.6 27.4 హకీంపేట 40.8 25.2 దుండిగల్ 40.6 26.1 హయత్నగర్ 40.0 24.6 రాజేంద్రనగర్ 40.0 23.5 పటాన్చెరు 39.4 23.0 -
వజ్రాభరణాలు దోచాడు.. చెత్తకుప్పలో దాచాడు
● వాటి ఆచూకీ దొరకవద్దని ఇంటి పని మనిషి పన్నాగం ● రూ.14 లక్షల విలువైన డైమండ్ రింగ్, మరో నగ స్వాధీనం బంజారాహిల్స్: తాను పని చేస్తున్న ఇంట్లో రూ.14 లక్షల విలువైన వజ్రాభరణాలను అపహరించి.. వాటి ఆచూకీ దొరకవద్దనే ఉద్దేశంతో చెత్తకుప్పలో దాచిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ డీఐ ఎం.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డునెంబర్–25లో నివసించే అమీదుల్లాఖాన్, బేగం దంపతుల ఇంట్లో బోరబండ సైట్–3లో ఉంటున్న బిహార్కు చెందిన ఆనంద్కుమార్ ముక్యా (32) ఆరు నెలల క్రితం పనిలో చేరాడు. గత నెల 23న యజమాని ఇంట్లోని డైమండ్ రింగ్తో పాటు వజ్రాభరణాలు తస్కరించి పరారయ్యాడు. ఆనంద్కుమార్తో పాటు గుడ్డు అనే ఇద్దరు పని మనుషులపై బాధితులు అనుమానం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు అనుమానితులను తమదైన శైలిలో విచారించి.. బోరబండలోని ఆనంద్కుమార్ గదిలో సోదాలు చేయగా.. ఓ మూలకున్న చెత్త కుప్పలో రూ.14 లక్ష విలువైన డైమండ్ రింగ్తో పాటు మరో ఆభరణం పోలీసులకు లభించాయి. వజ్రాభరణాలను తానే చోరీ చేశానని.. తనపై అనుమానంతో పోలీసులు సోదాలు చేస్తే ఆభరణాలు దొరకవద్దనే ఉపాయంతో చెత్త కుప్పలో దాచినట్లు నిందితుడు వెల్లడించాడు. జూబ్లీహిల్స్ పోలీసులు ఆనంద్కుమార్ను రిమాండ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాఫికర్కు చెక్
మాసబ్ట్యాంక్– షేక్పేట్ మధ్య మోడల్ కారిడార్ సాక్షి, సిటీబ్యూరో/గోల్కొండ: మాసబ్ట్యాంక్– మెహిదీపట్నం– షేక్పేట్ ప్రధాన రహదారిని మోడల్ కారిడార్గా తీర్చిదిద్దేందుకు బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్, నగర సీపీ సజ్జనర్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. వీరి వెంట ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్ ఉన్నారు. అధికారులంతా బస్సులో ప్రయాణిస్తూ మార్గంమధ్యలోని బాటిల్ నెక్స్, వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు, ఆక్రమణలను పరిశీలించి తక్షణ పరిష్కార మార్గాలను సూచించారు. ఈ మార్గంలో రోడ్డు దాటే పాదచారుల భద్రతకు పెద్ద పీట వేస్తూ సరోజినీ దేవి కంటి ఆసుపత్రి, బృందావన్ కాలనీ రోడ్ నెం.1 వద్ద కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (ఎఫ్ఓబీ) నిర్మించాలని, షేక్పేట్ నాలా వద్ద పెలికాన్ సిగ్నల్, జీబ్రా క్రాసింగ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నానల్ నగర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు వీలుగా అక్కడ ఉన్న రోటరీ వెడల్పును తగ్గించి, రహదారిని విస్తరించాలని అధికారులను ఆదేశించారు. రేతిబౌలి నుంచి నానల్ నగర్ వరకు ఉన్న సెంట్రల్ మీడియన్ను, అడ్డంగా ఉన్న చెట్లను తొలగించి రోడ్డును వెడల్పు చేయనున్నారు. ఎన్ఎండీసీ, డెల్ స్టోర్ ప్రాంతాల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం భూసేకరణ చేపట్టి రహదారి విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. రహదారి మధ్యలో ఉన్న రామాలయం ఆర్చ్, బొడ్రాయి, షేక్పేట్ నాలా సమీపంలోని సమాధులను తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని కమిషనర్లు అధికారులను ఆదేశించారు. మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఎత్తు పరిమితి బారియర్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పా టు చేయనున్నారు. మెహిదీపట్నం వైపు ఉన్న ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ను తరలించి, పోచమ్మ బస్తీ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం.12కు నేరుగా వెళ్లేలా స్లిప్ రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. ప్రతి జోన్కూ రూ.20 కోట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ.. నగరంలోని ట్రాఫిక్ పనుల నిమిత్తం ప్రతి జోన్కు రూ.20 కోట్ల చొప్పున మొత్తం రూ.120 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. కేబీఆర్ పార్క్ వద్ద పెండింగ్లో ఉన్న పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జోనల్ కమిషనర్లు జి.ముకుందరెడ్డి, ప్రియాంక ఆలా, ట్రాఫిక్ డీసీపీ కాజల్, చీఫ్ సిటీ ప్లానర్ కె.శ్రీనివాస్, చీఫ్ ఇంజనీర్ రత్నాకర్, అదనపు డీసీపీ వేణుగోపాల్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి పాల్గొన్నారు. షేక్పేట్ బృందావన్ కాలనీ వద్ద మ్యాన్హోల్ను పరిశీలిస్తున్న సజ్జనర్, కర్ణన్ రోడ్డుతో పాటు అవసరమైన ఐల్యాండ్స్ సైతం విస్తరణ రెండో చోట్ల ఎఫ్ఓబీలు, ఒక ప్రాంతంలో పెలికాన్ సిగ్నల్ పోచమ్మబస్తీ నుంచి రోడ్ నెం.12కు స్లిప్ రోడ్డు నిర్మాణం క్షేత్ర స్థాయిలో పరిశీలించిన పోలీసు, బల్దియా కమిషనర్లు -
మీటరుకే ముచ్చెమటలు!
గ్రేటర్లో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమాసియా యుద్ధంతో గ్యాస్ కొరత తలెత్తి ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్కర్ల వినియోగం పెరిగింది. మరోవైపు బయట ఎండలు భగ్గుమంటున్నాయి. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు గిరగిరా తిరుగుతున్నాయి. దీంతో గ్రేటర్ పరిధి జిల్లాల్లో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదవుతోంది. నిరుడు ఇదే సమయంతో పోలిస్తే... రోజుకు సగటున 250 మెగావాట్ల పైగా అధిక డిమాండ్ ఉంటోంది. సాధారణంగా పగటి వేళ ఉండే ఈ పరిస్థితి.. ఉదయం 8 గంటలకే కనిపిస్తుండడం గమనార్హం. వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలతో అందరూ ఎలక్ట్రిక్ కుక్కర్లను ఆశ్రయిస్తున్నారు. దీనికితోడు గ్రేటర్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగి 1,86,369కు చేరుకుంది. రికార్డు స్థాయి డిమాండ్కు ఇది మరో కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇదంతా ఒక్కసారిగా జరగడంతో సబ్స్టేషన్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. పవర్ ట్రాన్స్ఫార్మర్లు, వీధుల్లోని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు హీటెక్కుతున్నాయి. ఫీడర్లు ట్రిప్పవుతుండటంతో సరఫరాలో తరచూ అంతరాయాలు తలెత్తుతున్నాయి. డీటీఆర్లు పేలుతున్న ఘటనలూ లేకపోలేదు. తేదీ 2025 2026 01 3563 3919 02 3574 3867 03 3523 3866 04 3469 3826 05 3202 3517 06 3753 3944 07 3768 3933 08 3768 3989 -
చోరీ బండి.. ఇదిగోనండి
30 జంక్షన్లలో ఏఎన్పీఆర్ కెమెరాలు సాక్షి, సిటీబ్యూరో సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం మూడు నెలల క్రితం చోరీ అయింది. బాధితుడి ఫిర్యాదుతో ఠాణాలో కేసు నమోదైంది. చోరీ చేసిన వ్యక్తి ఈ వాహనంపై గోల్కొండలో సంచరించాడు. విషయం పోలీసులకు తెలియకపోవడంతో వాహనం, చోరుడు చిక్కడం అరుదు.. నగరంలో ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. చోరీ వాహనాలకు, చోరులకు చెక్ చెప్పడం కోసం నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ ఆదేశాల మేరకు ఐటీ సెల్ ప్రత్యేక చర్యలు తీసుకుంది. రాజధానిలోని 30 జంక్షన్లలో ఉన్న ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్పీఆర్) పరిజ్ఞానంతో పని చేసే సీసీ కెమెరాలను వాడుతున్నారు. ఫలితంగా గడచిన రెండు నెలల్లో 12 చోరీ వాహనాలు దొరికాయి. ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం ఏర్పాటు చేసుకుంటే ఫలితాలు ఉండే అవకాశం ఉంది. నేరగాళ్లకు చెక్ చెప్పడానికే డీసీపీ సీహెచ్ రూపేష్ నేతృత్వంలోని ఐటీ సెల్ ఏఎన్పీఆర్ సిస్టంను సిద్ధం చేసింది. దీనికోసం కంట్రోల్ రూమ్లో సర్వర్ ఏర్పాటు చేసింది. సీసీటీఎన్ఎస్ డేటాతో అనుసంధానం.. ● సిటీలోని ఠాణాల్లో నమోదైన ఇతర కేసుల మాదిరిగానే వాహన చోరీల వివరాలూ ఎప్పటికప్పుడు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) అప్డేట్ అవుతాయి. ● ఈ వివరాలను సేకరిస్తున్న ఐటీ సెల్ ఏఎన్పీఆర్ సిస్టంతో పని చేసే కెమెరాలు అనుసంధానించి ఉన్న సర్వర్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఫలితంగా ఆ చోరీ వాహనంలో సదరు 30 జంక్షన్లలోని ఏ కెమెరా నుంచి ముందుకు వెళ్లినా సర్వర్లోని సాఫ్ట్వేర్ తక్షణం గుర్తిస్తుంది. ఈ సమాచారాన్ని పాప్అప్ రూపంలో కంట్రోల్ రూమ్లోని సిబ్బందికి అందిస్తుంది. ఆ రెండు ఠాణాలకు సమాచారం... ఇలా పాప్అప్ వచ్చిన వెంటనే కంట్రోల్ రూమ్ సిబ్బంది ఆ వివరాలను వాహనం చోరీపై కేసు నమోదైన, అది సంచరిస్తున్న పరిధిలోని ఠాణాలకు అందిస్తున్నారు. ఈ పోలీసుస్టేషన్లకు చెందిన బృందాలు ఆ వాహనం పదేపదే సంచరిస్తున్న ప్రాంతాల్లో మాటు వేసి పట్టుకుంటున్నారు. ఇలా గడిచిన రెండు నెలల్లో 12 వాహనాలు పట్టుకున్నారు. ఇక్కడ ఓ సమస్య ఉందని నిపుణులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో చోరీ వాహనంలో ఓ ప్రాంతంలో సంచరించిన చోరుడు మరోసారి రావడానికి సమయం పట్టవచ్చు. అప్పటికి నిఘా తగ్గి వాహనం దొరికే అవకాశాలు తగ్గుతాయని వివరిస్తున్నారు. ట్రాఫిక్ అధికారుల సమన్వయంతో.. ఈ సమస్యను ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని తీర్చవచ్చని సూచిస్తున్నారు. రోడ్డుపై సంచరిస్తున్న వాహనం ఓ జంక్షన్ దాటిన తర్వాత ముందుకు వెళ్లి మరో జంక్షన్ దాటాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కంట్రోల్ రూమ్ సిబ్బంది ఠాణాలతో పాటు వాహనం ప్రయాణిస్తున్న మార్గంలో ముందు ఉన్న జంక్షన్లలోని ట్రాఫిక్ సిబ్బందికీ సమాచారం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడంతో తక్షణం వాహనాన్ని పట్టుకునే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. చోరీ వాహనాలను చోరులు అమాయకులకు తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. ఈ కారణంగా వాహనాలు దొరికినా అత్యధిక కేసుల్లో చోరులు మాత్రం చిక్కట్లేదు. ఏఐ ద్వారా జనరేట్ చేసిన వాహనం 2 నెలల్లో దొరికిన 12 తస్కరణ వాహనాలు వీటి సర్వర్తో సీసీటీఎన్ఎస్ డేటా అనుసంధానం ‘అపహరణ వాహనాన్ని’ గుర్తించిన వెంటనే పాప్అప్ స్థానిక పోలీసులకు సమాచారమిస్తున్న ఐటీ సెల్ -
గోదాముల్లో అగ్ని కీలలు
జీడిమెట్ల, బహదూర్పల్లిలో భారీ ప్రమాదాలు జీడిమెట్ల/జగద్గిరిగుట్ట: నగరంలో గురువారం వేర్వేరు ప్రాంతాల్లో రెండు భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. జీడిమెట్లలోని రసాయన గోదాములో ఫ్యాబ్రికేషన్ పరిశ్రమతో పాటు మరో మూడు గోదాముల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. జగద్గిరిగుట్ట పరిధిలోని బహదూర్పల్లిలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డెకరేషన్ సామగ్రితో పాటు రెండు వాహనాలు బుగ్గి పాలయ్యాయి. సుమారు కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జీడిమెట్లలోని ఏస్వీకో ఆపరేటివ్ సొసైటీలో రాజేష్ అనే వ్యక్తి రసాయన గోదామును నడుపుతున్నాడు. గురువారం ఉదయం 7 గంటలకు గోదాములో రసాయనాలు, సాల్వెంట్లను కలుపుతుండగా మంటలు అంటుకున్నాయి. డ్రమ్ముల్లో రసాయనాలు ఉండటం, దానికి ఆనుకుని ఉన్న మరో రసాయన గోదాములో రసాయనాల నిల్వలు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మంటల తాకిడికి రెండు రసాయన గోదాములతో పాటు ఠాగూర్ కెమికల్స్కు చెందిన ఆర్ అండ్ డీ ల్యాబ్, ఇస్మాయిల్ అనే వ్యక్తికి చెందిన మెడికల్ వేస్ట్ గోదాము, హనుమాన్ ఫ్యాబ్రికేషన్ పరిశ్రమకు మంటలు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న జీడిమెట్ల, సనత్నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్ ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలిని కుత్బుల్లాపూర్ ఏసీపి బాలగంగిరెడ్డి, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నితిన్లు పర్యవేక్షించారు. ప్రమాదం చోటు చేసుకున్న గోదాముల వ్యూ రసాయనాల గోడౌన్లో ఎగిసిపడిన మంటలు కాలిపోయిన డెకరేషన్ ఈవెంట్స్ సామగ్రి దగ్ధమైన ఐదు వాహనాలు బహదూర్పల్లిలో రూ.కోటి, జీడిమెట్లలో రూ 30 లక్షల ఆస్తి నష్టం -
నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం..
మాదాపూర్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై గురువారం తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. హెచ్ఐవీ నివారణకు ప్రభుత్వం ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా టెస్టులు, స్క్రీనింగ్ నిర్వహిస్తోందన్నారు. ఎయిడ్స్ అంటే ఏమిటి? హెచ్ఐవీ అంటే ఏమిటి? విషయాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని సూచించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. – మాదాపూర్ -
ప్రాణాలతో బయటపడిన 45 మంది..
బహదూర్పల్లిలోని డెకరేషన్ ఈవెంట్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయగిరి కాలనీలో వెంకటేష్ అనే వ్యక్తి ఎస్వీఎన్ పేరిట డెకరేషన్ ఈవెంట్ గోదాం నడుపుతున్నాడు. గురువారం ఉదయం 6 గంటల సమయంలో గోదాం పక్కనే ఉన్న విద్యుత్ వైర్ల వద్ద షార్ట్ సర్క్యూట్ మంటలు చెలరేగాయి. డెకరేషన్ సామగ్రితో పాటు, కారు, టాటా ఏసీ వాహనం అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు కోటి రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. కాగా.. గోదాముకు ఆనుకొని ఉన్న గోకులం రెసిడెన్సీ భవనం రెండంతస్తుల వరకు మంటలు వ్యాపించి డోర్లు, కిటికీలు కాలి బూడిద అయ్యాయి. భవనంలోని 45 మంది వెనక నుంచి గ్రిల్స్ తొలగించుకొని బయటపడ్డారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గోదాముకు ఎవరో కావాలనే నిప్పు పెట్టారని యజమాని వెంకటేష్ ఆరోపించారు. మంటల్లో డెకరేషన్ ఈవెంట్స్ గోదాం -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
సాక్షి, సిటీబ్యూరో: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక– 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్, కలెక్టర్ హరి చందన దాసరితో కలిసి కలెక్టరేట్లో సమత కిచెన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిగా అయన ఆభివర్ణించారు.సమాజంలోని వృద్ధులు దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లను ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా ఆర్థిక చేయూత తో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ● రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు సమాజంలో అంతర్భాగమని, వారి గౌరవప్రద జీవనానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమత కిచెన్ కు ఎంపీ ల్యాడ్స్ నిధులను తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ● ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్యాసంస్థల్లో 10 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ ఈబీసీ, దివ్యాంగుల కోటాను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ నిరంతర సహాయక చర్యలతో పాటు, సమతా కిచెన్ వంటి ఉపాధి ఆధారిత కార్యక్రమాల ద్వారా స్థిరమైన జీవనోపాధిని కల్పించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ -
మిస్ తెలుగు యూఎస్ఏ పోటీల విజేత అమూల్య
సాక్షి, సిటీబ్యూరో: అమెరికాలో జరిగిన మిస్ తెలుగు యూఎస్ఏ–2026 అందాల పోటీల్లో తెలుగు యువతులు సందడిచేశారు. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ చార్లెస్ డబ్ల్యూఎస్సీమాన్ సెంటర్లో ఈ పోటీలు సందడిగా జరిగాయి. అల్వాల్కు చెందిన అమూల్య బల్మూరి విజేతగా నిలిచింది. తమ కూతురు విజేతగా నిలవడం ఎంతో గర్వకారణమని తల్లిదండ్రులు శ్రీనివాస్రావు, రమలు తెలిపారు. ఇక మహిమ రన్నరప్ టైటిల్ను గెలుచుకున్నారు. ప్రముఖ నటి లయ చేతులమీదుగా టైటిల్ అందుకున్నారు. గతంలో మిస్ ఫ్లోరిడా మెజెస్టిక్, ప్యూర్ ఇంటర్నేషనల్ అందాల పోటీల్లో కూడా మహిమ గుర్తింపు పొందారు. కిమ్స్ సన్షైన్లో స్పైన్ సూట్ టెక్నాలజీ సనత్నగర్: స్సైన్ సర్జరీలో అధునాత స్పైన్ నావిగేషన్, హైస్పీడ్ డ్రిల్స్, ఖచ్చితత్వంతో కూడిన సర్జరీ టెక్నాలజీని కిమ్స్ సైన్షైన్ హాస్పటల్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ ఏవీ గురువారెడ్డి తెలిపారు. బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పటల్లో గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నడుం నొప్పితో వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆపరేషన్ చేస్తారనే అపోహ వద్దని..అవసరమైన వారికి మాత్రమే నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఆపరేషన్ చేస్తామన్నారు. వచ్చే వారం నుంచి బేగంపేట కిమ్స్ సన్షైన్ హాస్పటల్లో ఉచిత స్కోలియోసిస్ క్లినిక్ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్పైన్ సర్జన్ డాక్టర్ ఆంజనేయులురెడ్డి, డాక్టర్ అనాగ్ చక్రవర్తి, డాక్టర్ దినకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాస్థాయి రెజ్లింగ్ పోటీలు ప్రారంభం సుల్తాన్బజార్: హైదరాబాద్ నగరం ఎంతో మంది కుస్తీవీరులను తయారుచేసి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పంపిందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం కోఠిలోని విక్టోరియా ప్లే గ్రౌండ్లో అండర్–17 డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీలను తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఒక ప్రణాళిక రూపొందించి కుస్తీ ఆటకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. అనంతరం అసోసియేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, సంతోష్ పహిల్వాన్లు మాట్లాడుతూ... ఈ పోటీల్లో దాదాపు 200 మంది పాల్గొంటున్నారన్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు ఈ నెల 13న జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో రెజ్లింగ్ డిస్ట్రిక్ట్ సభ్యులు అస్లాం పహిల్వాన్, ఖాలీద్ పహిల్వాన్ పాల్గొన్నారు. వినూత్న మార్పులకు సదస్సులు దోహదం అంతర్జాతీయ కాంక్రీట్ పేవ్మెంట్ సదస్సు ప్రారంభం సాక్షి,సిటీబ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనలో వినూత్న మార్పులకు అంతర్జాతీయ సదస్సులు దోహదపడతాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం నగరంలోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్లో 13వ అంతర్జాతీయ కాంక్రీట్ బ్లాక్ పేవ్మెంట్ సదస్సు నరెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ మౌలిక సదుపాయాల రంగానికి సరికొత్త దిశానిర్దేశం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంక్రీట్ బ్లాక్ టెక్నాలజీ కేవలం సౌందర్యం కోసమే కాకుండా, పర్యావరణ పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.. నిర్మాణ వ్యర్థాల నుంచి సేకరించిన కాంక్రీట్ అగ్రిగేట్లను 50 శాతం వరకు వినియోగించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను 30 శాతం వరకు తగ్గించవచ్చని నిపుణులు వెల్లడించారు. జర్మనీ, ఆస్ట్రియా, బ్రిటన్, కెనడా, అమెరికా వంటి దేశాల ఇంజనీర్లు, పరిశోధకులు, నిపుణులు పాల్గొన్నారు. -
‘నారాయణ అంటేనేచంద్రబాబు బినామీ’
● ప్రజాసంఘాలు, కుల సంఘాల నాయకులు పంజగుట్ట: తెలంగాణ ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు ఏర్పాటు చేసిన ట్రస్టులను కొందరు తమ లబ్ధి కోసం వినియోగించుకుంటున్నారని పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు ఆగ్రహంవ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ భవనాలు ఆంధ్రా కార్పొరేట్లకు బలికావొద్దు అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు, సినీ దర్శకుడు సయ్యద్ రఫీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి మాట్లాడుతూ .. తెలంగాణ వచ్చినా ఇంకా ఆంధ్రా పెత్తనమే నడుస్తోందన్నారు. కురుమ ఆత్మగౌవర భవనాన్ని నారాయణ కాలేజీ యాజమాన్యం లీజుకు తీసుకోవడం దారుణమైన చర్య అన్నారు. నారాయణ అంటేనే చంద్రబాబు బినామీ.. నారాయణ కాలేజీ చేసే అక్రమాలు అన్నీ..ఇన్నీ కాదని, ఈ కాలేజీలను తెలంగాణలో కాదు యావత్ భారతదేశంలో లేకుండా చెయ్యాలని పిలుపునిచ్చారు. నారాయణ తెలంగాణ ద్రోహి అని తెలంగాణ నుండి తరిమి కొట్టాలని కోరారు. వివిధ కుల సంఘాల నాయకులు గుండ్లపల్లి శ్రీనివాస్, గురునాధ్ కురుమ, శారదగౌడ్, పొల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్లు మాట్లాడారు. -
రెండేళ్లలో మరింత అభివృద్ధి చేస్తాం
గచ్చిబౌలి: కొండాపూర్ ఆస్పత్రిని వచ్చే రెండేళ్లలో మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ పేర్కొన్నారు. కొండాపూర్లోని జిల్లా స్థాయి ఆస్పత్రిలో గురువారం కూ.40.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణానికి, డయాగ్నస్టిక్స్హబ్కు శంకుస్థాపన చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటుతో నగరానికి వెళ్ళాల్సిన పనిలేకుండా ఇక్కడే అందుబాటులో వైద్య సేవలు వస్తాయన్నారు. ఈ ఆస్పత్రిలోని 16 విభాగాలను పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడిగాంధీ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వైద్య చికిత్సకు అవసరమయ్యే నాణ్యమైన వైద్యం అందించే దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆస్పత్రిని పరిశీలించి వైద్యసౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ కొండాపూర్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్కు శంకుస్థాపన -
చైన్ స్నాచర్గా మారిన మాజీ సైనికుడు
సికింద్రాబాద్: మాజీ సైనికుడు చైన్ స్నాచింగ్లకు పాల్పడి పోలీసులకు దొరికిపోయాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి ఐదు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ డీఎస్పీ జావెద్, ఇన్స్పెక్టర్ సాయీశ్వర్గౌడ్ తెలిపిన మేరకు.. ప్రకాశం జిల్లా గుడిమెట్టకు చెందిన అన్నపురెడ్డి శ్రీనివాస్రెడ్డి (51) మాజీ సైనికుడు. శ్రీనివాస్రెడ్డి నాగారంలో నివాసం ఉంటూ ఘట్కేసర్లోని ఒక ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. షేర్మార్కెట్లో పెట్టుబడుల ఫలితంగా నష్టపోయాడు. బెట్టింగ్లను ఆశ్రయించినా ఆశించిన ఫలితం దక్కలేదు. చివరకు రైలు ప్రయాణాల్లో మహిళలను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్లకు పాల్పడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈనెల 2, 3 తేదీల్లో ఉదయం వేళల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరే కాకతీయ ఎక్స్ప్రెస్రైలులో రెండు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. ఇద్దరు మహిళల మెడలోంచి మంగళసూత్రాలు, బంగారు గొలుసులను లాక్కొని లాలాగూడ, చర్లపల్లి ప్రాంతాల్లో రైలునుంచి దూకి పరారయ్యాడు. ఈనెల 9న మళ్లీ రైలు ఎక్కేందుకు వచ్చిన శ్రీనివాస్రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు -
టీడీఆర్లు స్వీకరించండి
– జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సాక్షి, సిటీబ్యూరో: కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించనున్న ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణాలతో ఆస్తులు కోల్పోయే వారు నష్టపరిహారంగా నగదుకు బదులు టీడీఆర్లను స్వచ్ఛందంగా స్వీకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. కేబీఆర్ పరిసరాల్లో చేపడుతున్న ప్రాజెక్టులతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, కేబీఆర్, ముగ్ధ జంక్షన్లు తదితర ప్రాంతాల్లో ఆస్తులు కోల్పోనున్న వారితో సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి సదరు ప్రాజెక్టులు అవసరమని వారికి వివరించారు. రహదారుల విస్తరణ పనుల గురించి సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్తులు కోల్పోయేవారు టీడీఆర్లను స్వీకరించాల్సిందిగా కోరారు. నగరాభివృద్ధి దృష్ట్యా ప్రజల సహకారం కావాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘బెస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్’ నగరంగా గుర్తింపు
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చందానగర్: దేశంలోనే హైదరాబాద్ ‘బెస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్’ నగరంగా గుర్తింపు పొందిందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. మంగళవారం నానక్రాంగూడలోని షరటాన్ హోటల్లో ఈపీటీఆర్ఐ, హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (హెచ్ఎంఎస్డబ్ల్యూ) సంయుక్తాధ్వర్యంలో ‘అర్బన్ సాలిడ్ వేస్ట్ గవర్నెన్స్ అండ్ కంప్లైంట్స్ అండర్ ఎస్డబ్ల్యూఎం రూల్స్–2026’ అంశంపై నిర్వహించిన వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు నగరంలో సేకరించే చెత్తను జవహర్నగర్లో డంపింగ్ చేస్తూ వచ్చామన్నారు. నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించడంతో కొత్తగా చెత్త డంపింగ్ కోసం ప్రభుత్వం కొత్త ప్రాంతాలను పరిశీలిస్తోందన్నారు. కార్యక్రమంలో రాంకీ సంస్థ చైర్మన్ గౌతం రెడ్డి పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదంలో షాపింగ్మాల్ బుగ్గి
కిస్మత్పూర్ కాళీమందిర్ ప్రాంతంలో ఘటన రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ కిస్మత్పూర్ కాళీమందిర్ ప్రాంతంలోని సిద్ధి వినాయక షాపింగ్ మాల్లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు అంతస్తులోని షాపింగ్ మాల్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. విషయం తెలుసుకున్న అత్తాపూర్, లంగర్ హౌస్ ఫైర్స్టేషన్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు మూడు గంటలపాటు శ్రమించారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చాయి. అర్ధరాత్రి ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం, ఆ సమయంలో మనుషులెవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రమాదంలో మాల్లోని వస్త్రాలన్నీ బుగ్గి అయ్యాయి. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ తెలిపారు. సైనికులు, గూఢాచారుల త్యాగాలను ప్రతిబింబించిన దురంధర్: రాంచందర్రావు సాక్షి, సిటీబ్యూరో: దేశ రక్షణకు సరిహద్దుల్లో పోరాడే సైనికులే కాకుండా, గూఢచారులు ఎంతటి త్యాగాలు చేస్తారో ధురంధర్–2 సినిమా స్పష్టంగా ప్రతిబింబించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సినిమాను వీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబాలను, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, దేశ భద్రత కోసం అనేక కష్టాలను ఎదుర్కొంటున్న గూఢచారుల నిజ జీవితాన్ని ఈ సినిమా మన కళ్లకు కట్టినట్లు తెలియజేస్తుందని తెలిపారు. ఈ చిత్రంలో డీమానిటైజేషన్ వెనుక ఉన్న కారణాలను స్పష్టంగా వివరించడమే కాకుండా, అప్పటి నిర్ణయం ఎంత సరైనదో మళ్లీ నిరూపించిందన్నారు. ఇన్స్టాలో పరిచయం.. బాలిక అదృశ్యం మేడిపల్లి: మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ బాలిక అదృశ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం... బోడుప్పల్ ఫ్రెండ్స్ కాలనీలో తల్లిదండ్రులతో కలిసి బాలిక ఉంటోంది. తల్లిదండ్రులు ఈ నెల 5వ తేదీన రాత్రి విధులకు వెళ్లారు. తెల్లవారుజామున వారు ఇంటికి వచ్చేసరికి కూతురు కనిపించలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. ఇన్స్టాగ్రామ్లో మణి అనే ఓ వ్యక్తితో తరచూ చాట్ చేస్తున్నట్లు గుర్తించామని, అదృశ్యం వెనుక అతడు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. ఆటో ఢీ కొని వృద్ధురాలి మృతి టిఫిన్ చేసి చెట్టు కింద కూర్చున్న కాసేపటికే ఘటన అల్వాల్: ఆటో ఢీ కొని ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కౌకూర్కు చెందిన కందూరి కనకమ్మ(80) అల్వాల్ వెస్ట్ వెంకటాపురం బ్రిడ్జి వద్ద టిఫిన్ చేసి అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చుంది. కాసేపటికే అటుగా వచ్చిన ఓ ఆటో ఆమెను ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వృద్ధురాలు మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 180 మంది ఉద్యోగులకు వైద్య పరీక్షలు సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కలెక్టరేట్లో మంగళవారం న్యూ టౌన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. 180 మంది ఉద్యోగులు రక్తపోటు, మధుమేహం, కంటి పరీక్షలు, రక్త పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ వెంకటాచారి, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ జ్యోతి, లా ఆఫీసర్ శ్రీధర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విజయలక్ష్మి, డా. చల్లా దేవి పాల్గొన్నారు. కల్తీ నిరోధంపై సీఎం నిర్ణయం హర్షణీయం పంజగుట్ట: ఆహార కల్తీని నియంత్రించేందుకు హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించడం హర్షణీయమని, ఆ పని త్వరగా చేయాలని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి చైర్మన్ డాక్టర్ పల్లెపాడు దామోదర్ అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణితో కలిసి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేక విభాగం లేకపోవడం వల్లే ఆహార కల్తీని నియంత్రించలేకపోతున్నారని పేర్కొన్నారు. దీంతో ప్రతిరోజు ఏదోఒకచోట కుళ్లిన మాంసం, కల్తీ పాలు, సీసంతో ఉన్న పసుపు లాంటివి ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విజయ పాలను రైతుల వద్ద సరైన రేటు ఇచ్చి కొనుగోలు చేసి ప్రతీ ఒక్కరికీ అందేలా చూడాలని సూచించారు. ఆహార కల్తీ అరికట్టేందుకు పూర్తిస్థాయి అధికారులను నియమించాలన్నారు. సమావేశంలో వివిధ సంఘాల నేతలు మామిడి భీమిరెడ్డి, ఎ.వి.రావ్, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. మంటల్లో సిద్ధి వినాయక షాపింగ్ మాల్ -
రూ.1,200 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా
ఖానామెట్లో హైడ్రా స్వాధీనం చేసుకున్న స్థలం గచ్చిబౌలి: ఐటీ కారిడార్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. బడా నిర్మాణ సంస్థల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడింది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లోని సర్వే నంబర్ 55లోని 8 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం హైడ్రా స్వాధీనం చేసుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. ఐటీ హబ్కి అత్యంత చేరువలో బడా రియల్ ఎస్టేట్ సంస్థలైన మీనాక్షి, వాసవి అధీనంలో ఉన్న 4.20 ఎకరాలతో కొలను మాధవరెడ్డి కూతురు సబితకు చెందిన 4 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇందులో తాత్కాలికంగా వేసిన షెడ్లను హైడ్రా తొలగించింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులను ఏర్పాటు చేశారు. భూమి విలువ మార్కెట్ ధర ప్రకారం రూ.1,200 కోట్లకు పైగా ఉంటుందని అధికారుల అంచనా. -
ఎయిర్పోర్టులో 14 కిలోల గంజాయి పట్టివేత
శంషాబాద్: బ్యాంకాక్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన 14 కిలోల గంజాయిని శంషాబాద్ ఎయిర్పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు... థాయ్ ఎయిర్వేస్ టీజీ–329 విమానంలో సోమవారం రాత్రి 12 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు సొదా మోసిన్ బహదూర్ అనే ప్రయాణికుడు చేరుకున్నాడు. అతడి కదలికలను అనుమానించిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 14 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఎయిర్పోర్ట్ ఇంటలిజెన్స్, కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం – ఇద్దరి అరెస్ట్.. రెస్క్యూహోమ్కు నలుగురు మహిళలు మలక్పేట: స్పా సెంటర్ ముసుగులో కొనసాగుతున్న వ్యభిచార కేంద్రంపై మలక్పేట పోలీసులు సోమవారంరాత్రి దాడి చేశారు. ఇద్దరిని అరెస్టు చేయగా, నలుగురు మహిళలను రెస్క్యూ హోమ్కు తరలించారు. మలక్పేట ఏసీపీ సుబ్బారామిరెడ్డి తెలిపిన వివరాలు.. దిల్సుఖ్నగర్ విద్యుత్నగర్లో నివాసముంటున్న నిఖిలేష్(27) మూసారంబాగ్ డివిజన్ పరిధిలోని దిల్సుఖ్నగర్ సర్వీస్ రోడ్లో కొంతకాలంగా డైమాండ్ స్పా సెంటర్ నిర్వహిస్తున్నాడు. అయితే అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు విశ్వనీయ సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ పిడమర్తి నరేష్ పోలీస్ సిబ్బందితో దాడి చేసి చిలుకలగూడకు చెందిన పవన్(29), నలుగురు మహిళలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిఖిలేష్, పవన్ను అరెస్ట్ చేయగా, మహిళలను రెస్క్యూ హోమ్కు తరలించారు. ఎస్ఐ సంజీవరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరాలు ఛేదించి.. రూ.1.59 కోట్లు రిఫండ్ సాక్షి, సిటీబ్యూరో: నగర సైబర్క్రైమ్ పోలీసులు మార్చిలో వివిధ కేసులను ఛేదించి బాధితులకు రూ.1.59 కోట్లు రిఫండ్ చేశారు. దీనికి అదనంగా జోనల్ సైబర్ సెల్స్ మరో రూ.95.99 లక్షలు రిఫండ్ చేశాయి. గత నెలలో సైబర్ ఠాణాలో 54 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, రాజస్థాన్ల్లో దాడులు చేసి 20 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరు ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, గేమింగ్, జాబ్ తదితర ఫ్రాడ్స్లో నిందితులు. గత నెలలో బాధితులు 23 ఆర్థిక సంబంధిత సైబర్ నేరాల్లో రూ.4.40 కోట్లు కోల్పోయారు. సాయిబాబాకు సనాతన ధర్మానికి సంబంధం లేదు – స్వచ్ఛ సనాతన వేదిక పంజగుట్ట: షిరిడీ సాయిబాబాకు సనాతన ధర్మానికి ఎలాంటి సంబంధం లేదని స్వచ్ఛ సనాతన వేదిక పేర్కొంది. శ్రీ షిరిడీ సంస్థాన్ వారు రాసిన సాయిబాబా సత్య చరిత్ర పుస్తకంలోని కొన్ని అంశాలపై ప్రశ్నలు అడిగిన తమపై అక్రమ కేసులు బనాయించి, పరువునష్టం దావా వేయడం ఎంతవరకు సబబని స్వచ్ఛ సనాతన వేదికలోని హిందూ జనశక్తి ప్రతినిధి లలిత్ కుమార్, శివశక్తి ప్రతినిధి కరుణాకర్ సుగుణ, భరత వర్ష ప్రతినిధి శివ, హైందవీ స్వరాజ్ భాస్కర్ ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చర్చకు తాము సిద్ధమని, ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ఫొటోలతో షిరిడీ, మహారాష్ట్రల్లో పోస్టర్లు వేయించారని, దాడులు చేయిస్తామని హెచ్చరించారని, ఇది భావప్రకటన స్వేచ్చపై దాడి చెయ్యడమేనని అన్నారు. తల్లి మందలించిందని బాలుడి అదృశ్యం శంషాబాద్ రూరల్: పాఠశాలకు వెళ్లని కొడుకును తల్లి మందలించింది. దీంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిన బాలుడు తిరిగిరాలేదు. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని పాల్మాకులకు చెందిన వరికుప్పల అరుణ కొడుకు అనిల్కుమార్ స్థానికంగా జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. వారం రోజులుగా బడి మానేసి వేరే పిల్లలతో కలిసి సమీపంలోని చెరువులో ఈతకు వెళ్తున్నాడు. విషయం తెలియడంతో తల్లి అతడిని మందలించింది. ఈ క్రమంలో ఈ నెల 5న ఉదయం అరుణ పనికి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చి చూడగా కొడుకు కనిపించలేదు. అతని కోసం అన్ని చోట్ల వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణ ఉద్యమకారుడు సుల్తాన్ ఆత్మహత్య
– డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకపోవడంతో కొంతకాలంగా మనస్తాపం బన్సీలాల్పేట్: బన్సీలాల్పేట్ బండమైసమ్మనగర్ నివాసి, తెలంగాణ ఉద్యమకారుడు అబ్దుల్ సుల్తాన్(65) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. గాంధీనగర్ ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్ కథనం ప్రకారం... సుల్తాన్ భార్య రేష్మా రేషన్ బియ్యం తేవడానికి షాపునకు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చి చూసే వరకు ఆయన ఉరేసుకొని ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు గాంధీనగర్ పోలీసులు వచ్చి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మంగళవారం రాత్రి బన్సీలాల్పేట్లో సుల్తాన్ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించండి – ఎంఎంసీ కమిషనర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశాలు సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణం, టీడీఆర్ దరఖాస్తులకు సంబంధించి జాప్యం లేకుండా నిర్ణీత వ్యవధుల్లో అనుమతులు జారీ చేయాలని ఎంఎంసీ కమిషనర్ టి.వినయ్కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశిచారు. మంగళవారం టౌన్ప్లానింగ్ విభాగం అధికారుతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్రమ నిర్మాణాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫుట్ఫాత్లు, నాలాలపై ఆక్రమణలను వెంటనే తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. వీటితోపాటు నివాస కాలనీల్లోని అక్రమ నిర్మాణాలు, సెల్లార్లు, రోడ్లను ఆక్రమించిన ర్యాంపులు, మొక్కలు లేని ప్లాంటర్ బాక్స్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. -
వృత్తులేవైనా.. ప్రవృత్తి ‘డ్రగ్స్’ విక్రయం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్–న్యూ) రెండు రోజులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో ఐదుగురు డ్రగ్స్ పెడ్లర్లు చిక్కారు. వీరి వృత్తులేమైనా డ్రగ్స్ విక్రయమే ప్రవృత్తిగా మారింది. వీరిని అరెస్టు చేసి రూ.63.65 లక్షల విలువైన ఐదు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. ఇన్స్పెక్టర్లు బి.వెంకట్, ఎస్.బాలస్వామిలతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విద్యార్థిపై మూడు కేసులు... బాలానగర్కు చెందిన సాయినిఖిల్ యాదవ్ బ్యాక్లాగ్స్ ఉండటంతో కొన్నాళ్లుగా ఇంటర్లోనే ఉండిపోయాడు. కాలేజీ రోజుల్లో చెడు స్నేహాల వల్ల సరదాగా డ్రగ్స్ వాడటం మొదలెట్టి బానిసగా మారాడు. ఆ ఖర్చుల కోసం తన కాలేజీలో సీనియర్, పెడ్లర్ అయిన ఆదిత్యకు సబ్–పెడ్లర్గా మారాడు. ఆరు నెలలుగా ఈ దందా చేస్తున్న ఇతడిపై ఇప్పటికే సనత్నగర్, జీడిమెట్లలో రెండు కేసులు ఉన్నాయి. సాయిని చిలకలగూడ పోలీసులతో కలిసి హెచ్–న్యూ బృందం అరెస్టు చేసి, 115 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకుంది. పరారీలో ఉన్న ఆదిత్య కోసం గాలిస్తోంది. పోలీసుల నిఘా తప్పించుకోవడానికి టెలిగ్రాం యాప్ ద్వారా సంప్రదింపులు జరిపే సాయి.. సరుకు డెలివరీ చేయడానికి వెళ్తున్నప్పుడు తన ఫోన్ కాకుండా వేరే వారిది తీసుకెళ్లేవాడు. ట్రాన్స్పోర్టర్ టు అంతర్రాష్ట్ర పెడ్లర్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన సింహాచలానికి సాయి, సైబు, సిద్ధార్థ్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. సూరారంలో ఉంటూ వెల్డర్గా పనిచేస్తున్నాడు. గతంలో గంజాయి, హష్ ఆయిల్ను ఒడిశా నుంచి ఆంధ్రాకు చేర్చే ట్రాన్స్పోర్టర్గా పనిచేశాడు. ఆపై అంతర్రాష్ట్ర పెడ్లర్గా మారి రెండు రాష్ట్రాల్లో సబ్–పెడ్లర్స్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఫోన్ వాడకుండా నేరుగా హష్ ఆయిల్ తయారీదారులను సంప్రదించి ఖరీదు చేస్తాడు. సంప్రదింపులకు ఇన్స్ట్రాగామ్, లావాదేవీలకు యూపీఐ వాడతాడు. ఇతడిపై ఇప్పటికే మూడు కేసులు ఉన్నాయి. కూకట్పల్లికి చెందిన వాలెట్ పార్కింగ్ డ్రైవర్ వేణు ఇదివరకు ఓ కేసులో జైలుకు వెళ్లాడు. అక్కడ సింహాచలంతో పరిచయమై సబ్–పెడ్లర్గా మారాడు. సింహాచల్, వేణులను పోలీసులు అరెస్టు చేసి 1.05 కేజీల హష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరిదీ అదే తరహా కథ... ఇంజాపూర్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి అక్షయ్ పటేల్ గ్రాడ్యుయేషన్ తర్వాత శానిటరీ వ్యాపారం చేసి నష్టపోయాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడానికి పలు సోషల్మీడియా యాప్స్ ద్వారా ఎక్స్టసీ, ఓజీ, ఎల్ఎస్డీ వంటి డ్రగ్స్ ఖరీదు చేస్తాడు. కొరియర్ ద్వారా వచ్చే వీటిని స్థానికంగా ఉన్న సబ్–పెడ్లర్స్కు విక్రయిస్తాడు. బైరామల్గూడకు చెందిన వ్యాపారి బి.ఆదిత్య వర్థన్ డ్రగ్స్కు బానిసగా మారి, డబ్బు కోసం అక్షయ్కు సబ్–పెడ్లర్ అవతారమెత్తాడు. ఈ ద్వయాన్ని అరెస్టు చేసిన పోలీసులు 363 ఎక్స్టసీ పిల్స్, 41 గ్రాముల ఓజీ, నాలుగు ఎల్ఎస్డీ బోల్ట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు ముఠాలకు సంబంధించి ఇప్పటి వరకు 15 మంది కస్టమర్లను గుర్తించారు. వీరిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే ఎక్కువ ఉన్నారు. -
ఏసీబీ వలలో ఏజీ వర్సిటీ డీన్
సీడ్స్ కంపెనీ లైసెన్స్ ఇచ్చేందుకు రూ.లక్ష డిమాండ్ రాజేంద్రనగర్: సీడ్స్ కంపెనీ లైసెన్స్ పేరిట లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ డీన్ గోవర్ధన్ మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ జి. శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం... సీడ్స్ కంపెనీ అనుమతి కోసం ఓ వ్యక్తి 2025 మార్చిలో దరఖాస్తు చేసుకున్నాడు. ఏప్రిల్లో అనుమతులను అందిస్తానని వర్సిటీ డీన్, అసోసియేట్ ప్రొఫెసర్ జి.గోవర్ధన్ ఆ వ్యక్తితో సంప్రదింపులు జరిపాడు. లక్ష రూపాయలు అందిస్తే అనుమతులు మంజూరు చేయిస్తానని చెప్పగా, ఆ వ్యక్తి 25 వేల రూపాయలను ఆన్ లైన్ పేమెంట్ చేశాడు. అనుమతులు మంజూరైన అనంతరం గోవర్ధన్ మిగిలిన డబ్బులు ఇవ్వాలని వేధిస్తుండటంతో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం సాయంత్రం గోవర్ధన్ తన కార్యాలయంలో డబ్బులను తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. -
వాటర్ ప్లాంట్లపై టాస్క్ఫోర్స్ దాడులు
● అనుమతులు లేకుండా ప్యాకెట్ల తయారీ ● నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదని గుర్తింపుఅంబర్పేట: నిర్దేశిత ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్న మూడు వాటర్ ప్లాంట్లపై మంగళవారం సికింద్రాబాద్ జోన్ టాస్క్ఫోర్స్, జీహెచ్ఎంసీ ఫుడ్సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ కథనం ప్రకారం.. అంబర్పేట బాపూనగర్లో సయ్యద్ జబ్బార్ జేఎన్ ఎంటర్ప్రైజెస్ పేరిట నిర్వహిస్తున్న ప్లాంట్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వాటర్ ప్యాకెట్లు తయారు చేస్తునట్లు గుర్తించారు. రూ.3 లక్షల విలువైన యంత్రాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మహ్మద్ నయీముద్దీన్ ఆక్వా ఓమెగా వాటర్ ప్లాంట్ను కనీస ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇతని వద్ద నుంచి రూ.2.80 లక్షలు విలువ చేసే యంత్రాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అంబర్పేట ప్రధాన రహదారిలో సయ్యద్ జునైద్ టీఏఐఏ ప్లస్ పేరుతో నీటి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. ఇతని వద్ద రూ.3.50 లక్షలు విలువ చేసే ప్యాకింగ్ యంత్రాలు, సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మూడు ప్లాంట్ల నుంచి నీటి నమూనాలను సేకరించారు. -
హైదరాబాద్
జేఎన్టీయూకు బాంబు బెదిరింపు – క్షుణ్నంగా తనిఖీ.. ఏమీ లేదని తేల్చిన పోలీసులు బాలానగర్: జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మంగళవారం బాంబు బెదిరింపు ఇ–మెయిల్ వచ్చింది. వర్సిటీ అధికారుల సమాచారం మేరకు కేపీహెచ్బీ పోలీసులు, బాంబుస్క్వాడ్ వచ్చి వర్సిటీ పరిపాలన భవనం, హాస్టల్స్, క్యాంపస్ అంతా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాంబుకు సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడా లభించకపోవడంతో ఆచార్యులు, విద్యార్థులందరూ ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీలు కొనసాగుతున్నంతసేపు వర్సిటీలో కొంత ఆందోళన వాతావరణం కనిపించింది. అనంతరం కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ డీఐ కేఎస్ రవి సైబర్ భద్రత, సైబర్ ముప్పుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ మాట్లాడుతూ బాంబు బెదిరింపు వదంతిని సృష్టించిన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నగరవ్యాప్తంగా హెచ్–న్యూ స్పెషల్ డ్రైవ్ మూడు ఠాణాల పరిధిలో మాటేసి దాడులు ఐదుగురు పెడ్లర్, సబ్ పెడ్లర్ల పట్టివేత రూ.63.65 లక్షల సరుకు స్వాధీనం -
ఐదు రోజుల్లో పెళ్లి.. అంతలోనే..
పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకొని.. ● కత్తితో గొంతు కోసుకుని యువకుడి ఆత్మహత్య ● ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్న పోలీసులు గచ్చిబౌలి: ప్రేమించిన యువతితో 16 రోజుల క్రితమే నిశ్చితార్థమైంది. మరో ఐదు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఆ యువకుడు కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ బాలరాజు చెప్పిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మెట్ల వెంకటకృష్ణ శ్రీసాయి (30) నగరంలోని కొండాపూర్లో ఉన్న మై హోం మంగళ ‘బి’ బ్లాక్లోని 301 ఫ్లాట్లో అద్దెకు ఉంటున్నాడు. స్థానికంగా యానిమేషన్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. మై హోం మంగళలోనే మరో బ్లాక్లో ఉండే యువతిని ప్రేమించాడు. మార్చి 22న వైజాగ్లో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 12న వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఈ క్రమంలో వెంకటకృష్ణ శ్రీసాయి.. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తమ్ముడు సాయి పవన్కల్యాణ్కు మధ్యాహ్నం 1.30 గంటలకు మెసేజ్ పెట్టాడు. విషయం తెలిసి.. కాబోయే భార్య వచ్చి ఎంత పిలిచినా డోర్ తెరవలేదు. మరో బ్లాక్లో నివాసం ఉంటున్న వెంకటకృష్ణ శ్రీసాయి సోదరుడు పవన్తో రూమ్మేట్ విజయ్ కలిసి గది తలుపు పగులగొట్టి చూడగా గొంతు కోసుకొని రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కన్న యువతి గుండెలవిసేలా విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది. ఫైనాన్స్లో రుణం తీసుకొని తిరిగి చెల్లించక పోవడంతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడినట్లు, పెళ్లి ఖర్చులకు ఇబ్బందులెదురయ్యాయని, ఈ క్రమంలోనే వెంకటకృష్ణ శ్రీసాయి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. -
గ్రంథాలయాలకు పూర్వవైభవం రావాలి
– హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ గన్ఫౌండ్రీ: ప్రస్తుత సాంకేతిక యుగంలో గ్రంథాలయాలకు వెళ్లే పాఠకుల సంఖ్య తగ్గుతోందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో సమాజసేవలో వంద వసంతాలు పూర్తి చేసుకున్న ప్రముఖ గ్రంథాలయాల అధ్యక్షులను ఘనంగా సత్కరించారు. గౌతమి ప్రాంతీయ గ్రంథాలయం (రాజమహేంద్రవరం) అధ్యక్షుడు డాక్టర్ ఎ. నారాయణరావు, శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయం కార్యదర్శి పి.ఉడయవర్లు, సారస్వత నికేతనం అధ్యక్షుడు మల్లికార్జున్రావులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు సంగీత విభావరి ఆహుతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఏపీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, కిన్నెర కార్యదర్శి మద్దాలి రఘురాం తదితరులు పాల్గొన్నారు. -
‘కల్తీ’ కేంద్రాలపై దాడి
మైలార్దేవ్పల్లి: కల్తీ మసాలాలు, ఉత్పత్తులు తయారు చేస్తున్న రెండు పరిశ్రమలపై హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీం, పుడ్ సేఫ్టీ అధికారులు, మైలార్దేవ్పల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. టాటానగర్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఫైన్ ట్రేడర్స్ పేరుతో స్నాక్స్ను అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్నారు. కెమికల్స్ వాడుతున్నారు. గడువు తేదీ ముగిసిన మిర్చి పౌడర్, కలర్స్ వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 40 వేల విలువ చేసే ముడి సరుకును స్వాధీనం చేసుకుని నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో హెచ్పాస్ట్ ఎస్ఐ అఖిల్, మైలార్దేవ్పల్లి ఎస్ఐ విశ్వనాథ్రెడ్డి పాల్గొన్నారు. కాటేదాన్లో... కాటేదాన్ పారిశ్రామికవాడలో సిల్వర్ మసాలా ప్రొడక్ట్స్ తయారీ పరిశ్రమపై దాడులు నిర్వహించారు. ఇక్కడ హానికరమైన రసాయన పదార్ధాలు, నాణ్యతలేని, అపరిశుభ్రమైన పదార్థాలతో మసాలాలు తయారు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి 40 వేల విలువ చేసే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. -
టూర్ ఠారెత్తే
పశ్చిమాసియా యుద్ధంతో నిలిచిపోయిన పర్యటనలు గ్రేటర్లో 75 శాతం బుకింగ్లు రద్దు సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమాసియా యుద్ధం కారణంగా పర్యాటక రంగం కుదేలైంది. హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే పర్యాటకులు, విదేశాల నుంచి నగర సందర్శనకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియని అనిశ్చితి దృష్ట్యా అంతర్జాతీయ ప్రయాణాలు భారీగా నిలిచిపోయాయి. నెల రోజుల వ్యవధిలో సుమారు 75 శాతం బుకింగ్లు రద్దయినట్లు గ్రేటర్లోని ట్రావెల్స్ సంస్థలు, ఏజెంట్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక రంగంలో కోవిడ్ నాటి పరిస్థితులు పునరావృతమైనట్లు చెబుతున్నారు. 3 వేల సంస్థలపై యుద్ధ ప్రభావం.. సాధారణంగా వేసవిలో ఏప్రిల్, మే నెలల్లో నగరం నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున విదేశాలకు వెళ్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలను సైతం సందర్శిస్తారు. ఈ వేసవి ఆరంభంతోనే యుద్ధం ప్రారంభం కావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పర్యాటక రంగంపై ఆధారపడి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సుమారు 3 వేల సంస్థలపై యుద్ధం ప్రభావం చూపినట్లు సికింద్రాబాద్కు చెందిన వాల్మీకి పర్యాటక సంస్థ ప్రతినిధి హరికిషన్ తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని చెప్పారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సాధారణ రోజుల్లో 20,000 మందికి పైగా విదేశాలకు రాకపోకలు సాగిస్తుండగా, గత నెల రోజులుగా ఆ సంఖ్య 50 శాతానికి పడిపోయినట్లు అంచనా. ఫ్లైట్స్ రద్దయితేనే రీఫండ్.. ప్రస్తుత పరిణాల దృష్ట్యా పశ్చిమాసియా వైపే కాకుండా ఇతర దేశాలకు వెళ్లే వాళ్లు సైతం తమ ప్రయాణాలను రద్దు చేసుకొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఎయిర్లైన్స్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నట్లు ట్రావెల్స్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఎయిర్లైన్స్ స్వయంగా ఫ్లైట్లను రద్దు చేసినప్పుడు మాత్రమే 100 శాతం టికెట్ డబ్బులు రీఫండ్ అవుతున్నాయి. ప్రయాణికులే టూర్ను రద్దు చేసుకుంటే టికెట్ చార్జీల్లో 5 శాతం నుంచి 50 శాతం వరకు పెనాల్టీల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు విమానయాన రంగంలో నెలకొన్న అనిశ్చితి వాతావరణాన్ని సొమ్ము చేసుకొనేందుకు ఎయిర్లైన్స్ పోటీపడుతున్నాయి. -
సీఎం ప్రజావాణికి మొర.. డబుల్ బెడ్రూం మంజూరు
లబ్ధిదారులకు పట్టా అందజేసిన చిన్నారెడ్డి లక్డీకాపూల్: సీఎం ప్రజావాణి చొరవతో జనార్దన్–పద్మజ దంపతులకు డబుల్ బెడ్రూమ్ మంజూరైంది. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ వేదికగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆ ఇంటి పట్టాను సీఎం ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ మేరకు చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంటలెక్చువల్స్ సెల్ అధ్యక్షుడు శ్యాంమోహన్లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. భువనగిరి జిల్లా మద్దూంపల్లికి చెందిన జనార్దన్ నాలుగు దశాబ్దాల క్రితం హైదరాబాద్కు వచ్చి ఖైరతాబాద్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల డబుల్ బెడ్రూమ్ కోసం సీఎం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోగా కూకట్పల్లిలోని కై త్లాపూర్లో కేటాయిస్తూ మేడ్చల్– మల్కాజిగిరి కలెక్టర్ మనుచౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మంగళవారం జరిగిన 212వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 505 దరఖాస్తులు అందాయి. కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్, అదనపు కలెక్టర్ సూర్యప్రకాష్, ఏసీపీ ఉమేందర్, ఎన్ఆర్ఐ సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ప్రవాసీ ప్రజావాణి సమన్వయకర్త బొజ్జా అమరేందర్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మ్యాచ్ ప్రిడిక్షన్ పేరుతో బెట్టింగ్ ఉచ్చు
ఐపీఎల్ వేళ అప్రమత్తంగా ఉండండి: కొత్వాల్ సాక్షి, సిటీబ్యూరో: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఆన్లైన్లో మ్యాచ్ ప్రిడిక్షన్ పేరుతో వల వేస్తున్న కొన్ని సంస్థలు సామాన్యులను ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చులోకి దింపుతున్నాయని నగర సీపీ సజ్జనర్ హెచ్చరించారు. మంగళవారం ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. ఐపీఎల్ను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో కొందరు మోసపూరిత ప్రకటనలతో ఆకర్షిస్తున్నారని తెలిపారు. కేవలం డబ్బు కోసం కొందరు అసత్య ప్రచారాలు చేస్తూ సామాన్యులను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. టాస్ ఎవరిది? మ్యాచ్ ఏ టీమ్ గెలుస్తుంది? అని ముందే చెబుతామంటూ చానెల్స్ను సబ్స్క్రైబ్ చేయించుకుని, బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారని, ఇలాంటి ఫేక్ ప్రిడిక్షన్ చానెళ్ల మాటలు నమ్మవద్దని సజ్జనర్ హితవు పలికారు. నెల రోజుల్లో 494 పెయిడ్ ప్రకటనలను, వాటిని ప్రచారం చేస్తున్న 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను హైదరాబాద్ సైబర్ క్రైౖ మ్ విభాగం బ్లాక్ చేయించిందని వివరించారు. నిఘా నిరంతరం కొనసాగుతుందని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ఐపీఎల్ డిజిటల్ టికెట్
● 13న రెండోమ్యాచ్ నుంచి అందుబాటు ● భద్రత కట్టుదిట్టం.. సీసీ కెమెరాలతో నిఘా ఉప్పల్: ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్లకు 2 వేల మందిపైగా బలగాలు, 430 సీసీ కెమెరాలతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు డీసీపీ కె.సురేష్కుమార్ తెలిపారు. హెచ్సీఏ, ఎస్ఆర్హెచ్, సర్వీస్ ప్రొవైడర్లతో సమావేశమై నిబంధనలను వివరించినట్లు పేర్కొన్నారు. డీసీపీ (ట్రాఫిక్) శ్రీనివాసులు, హెచ్సీఏ జాయింట్ సెక్రటరీ బస్వరాజ్, ట్రెజరర్ డా.అనిల్కుమార్తో కలిసి స్టేడియంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండోమ్యాచ్ (ఏప్రిల్ 13) నుంచి డిజిటల్ టికెట్లు అందించనున్నట్లు తెలిపారు. ఒకరు 4 టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. 5 అంబులెన్స్లు, 4 ఫైరింజన్లను సిద్ధం చేశామని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని వివరించారు. మహిళల భద్రతకు షీ టీంలను రంగంలోకి దింపుతున్నట్లు తెలిపారు. బ్లాక్లో టికెట్ల అమ్మకం, బెట్టింగ్ నిర్వాహకులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మ్యాచ్ తేదీల్లో మెట్రో రైల్, అర్టీసీ సర్వీసుల సమయాలను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్యాలరీలో ప్రతి సీటుకు నంబరు వేసినట్లు హెచ్సీఏ అధికారులు తెలిపారు. కాగా, ప్రతి సీట్కు నంబర్, రెండో మ్యాచ్ నుంచి డిజిటల్ టికెట్లు ఈసారి ప్రత్యేకత. గతంలో 2,800 మంది పోలీస్లను కేటాయించగా, ఈసారి 2 వేలకు కుదించారు. 360 సీసీ కెమెరాల సంఖ్యను 430కు పెంచారు. మ్యాచ్ తేదీల్లో ఉప్పల్, సికింద్రాబాద్ నుంచి స్టేడియం వైపు వచ్చే అన్ని దారులను మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు తెలిపారు. -
ఫ్లైఓవర్ పనులు వేగిరం
జయేష్ రంజన్ బంజారాహిల్స్: కేబీఆర్ పార్కు ఫ్లైఓవర్ పనులు మరింత వేగిరం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక అధికారి జయేష్ రంజన్ ఆదేశించారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు, రోడ్డునెంబర్–45 వరకు క్షేత్రస్థాయిలో ఫ్లైఓవర్ పనుల పురోగతిని జయేష్ రంజన్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్ గురువారం పరిశీలించారు. ప్రతి వారం పనుల పురోగతిని సమీక్షించాలన్నారు. ఎంఈఐఎల్ (మేఘా) సంస్థ అదనంగా మెషిన్, మ్యాన్పవర్ను సమకూర్చుకోవాలని ఆదేశించారు. -
సింగిల్ రైడర్
ఐటీ కారిడార్లో ట్రాఫిక్కు కారణం వీరేసాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఐటీ హబ్లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ ఆదేశాల మేరకు మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ పర్యవేక్షణలో సైబర్ టవర్స్ పరిసరాల్లో మార్నింగ్ పీక్ అవర్లో చేపట్టిన ఈ సర్వేలో పలు వాస్తవాలు వెల్లడయ్యాయి. అనర్థాలెన్నో.. కేవలం గంట వ్యవధిలోనే రోడ్డుకు నాలుగు వైపులా కలిపి 10,138 మంది సింగిల్ రైడర్లు (వాహనంలో ఒక్కరే ప్రయాణించేవారు) ప్రయాణించగా, డబుల్ రైడర్లు 3,584 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. డబుల్ రైడర్ల కంటే సింగిల్ రైడర్లు 6,554 అధికంగా ఉండటంతో వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరిగి తీవ్రమైన ట్రాఫిక్ జామ్లకు దారితీస్తోంది. సమయం వృథా కావడంతో పాటు అదనపు ఇంధన ఖర్చులు, ప్రమాదాల రిస్క్, శారీరక అలసట వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలతో పర్యావరణ కాలుష్యం పెరిగి ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ తెలిసీ.. అధిక శాతం మంది ఒంటరిగా ప్రయాణించడానికే మొగ్గు చూపడం ఆశ్చర్యకరమని, ఈ ధోరణి మారాల్సిన అవసరం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఐటీ ఉద్యోగులు, పౌరులు తమ ప్రయాణాల్లో చిన్నపాటి మార్పులు చేసుకుంటే.. ట్రాఫిక్ రహిత సైబరాబాద్ను నిర్మించవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీసుల ముఖ్య సూచనలివీ ● సాధ్యమైనంత వరకు రైడ్ షేరింగ్ పద్ధతిని పాటించాలి ● సహోద్యోగులు లేదా స్నేహితులతో కలిసి కార్ పూలింగ్ చేయాలి. ● పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగాన్ని పెంచాలి. ● పీక్ అవర్స్లో అత్యవసరమైతే తప్ప వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించాలి. ● పాఠశాల, కళాశాల వాహనాలు నడిచే రద్దీ సమయాల్లో ప్రయాణించకుండా ముందస్తు ప్రణాళిక చేసుకోవాలి. గంటలో 10,138 వాహనాలపై సింగిల్ రైడర్లు డబుల్ రైడర్లవి 3,584 సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సర్వేలో వెల్లడి -
హనుమహాన్
రామ్ లక్ష్మణ్ జానకి.. జై బోలో హనుమాన్కీ.. జై.. జై వీరమాన్.. జై బజరంగ్ దళ్.. నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. కాషాయ జెండాలతో కళకళలాడాయి. గురువారం బజరంగ్దళ్ ఆధ్వర్యంలో చేపట్టిన వీర హనుమాన్ విజయయాత్ర కన్నుల పండువగా సాగింది. గౌలిగూడ రామమందిర్ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. కోఠి ఆంధ్రా బ్యాంక్ చౌరస్తాలో వేలాది మంది భక్తులు సామూహిక హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. కోఠి ఉమెన్స్ కాలేజ్ చౌరస్తా, సుల్తాన్బజార్ చౌరస్తా, రామ్కోఠి, కాచిగూడ క్రాస్రోడ్, నారాయణగూడ క్రాస్రోడ్, అశోక్నగర్, బైబిల్ హౌస్, ప్యారడైజ్ మీదుగా తాడ్బండ్ హనుమాన్ దేవాలయానికి శోభాయాత్ర చేరుకుంది. గౌలిగూడ రాంమందిర్లో పోలీస్ కమిషనర్ సజ్జనార్ పూజలు చేశారు. – సుల్తాన్బజార్/అఫ్జల్గంజ్ -
ఐదుగురు యువకుల అరెస్టు
నిబంధనలకు విరుద్ధంగా బైక్పై ప్రయాణంలక్డీకాపూల్: ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి అత్యంత ప్రమాదకర రీతిలో ఒకే బైక్పై ఐదుగురు ప్రయాణించిన ఘటనలో ఐదుగురు యువకులను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నట్లు సైఫాబాద్ ఎస్హెచ్ఓ సీతయ్య తెలిపారు. గత నెల 29 అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ జంక్షన్ నుంచి సెక్రటేరియట్ వైపు పల్సర్ బైక్పై ఐదుగురు వ్యక్తులు అత్యంత నిర్లక్ష్యంగా ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది. దీంతో వడ్డీ అర్జున్, అరుపు రోహిత్, చింతకుంట అంజన్ కుమార్, సిద్ధం కౌశిక్, వల్లపు మురళిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
గ్రిడ్ వైపు అడుగులు
వంద శాతం పైపులైన్ గ్యాస్ సిటీకి సన్నాహాలునగరంలో ప్రస్తుతం పైపులైన్ గ్యాస్ ఇలా..సాక్షి, సిటీబ్యూరో గ్రేటర్ పరిధిలో సిలిండర్ల కొరత, డెలివరీ నిరీక్షణ పెరుగుతుండటంతో పైపులైన్ గ్యాస్ (పీఎన్జీ) వైపు అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీల విస్తరణతో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు గ్యాస్ గ్రిడ్గా మారేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పైపులైన్ వ్యవస్థ ఉన్న ప్రాంతాల్లో ప్రధాన నివాస ప్రాంతాలన్నింటినీ దీని పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలకు చమురు సంస్థలు చర్యలు చేపట్టాయి. తాజాగా వంట గ్యాస్ సంక్షోభంతో పైపులైన్ గ్యాస్కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగినట్లయింది. స్విచ్ వేస్తే చాలు అన్నంత సులభంగా అందే వంట గ్యాస్వైపు నివాసితుల ఆసక్తి పెరిగింది. ఎల్పీజీ సరఫరాలో అంతరాయాలను అధిగమించడానికి ప్రభుత్వాలు కూడా ‘గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ’ను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగానే వందశాతం పైపులైన్ గ్యాస్ సిటీగా మార్చే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. 250కిపైగా భారీ నివాస సముదాయాల్లో.. నగరంలో పైపులైన్న్ గ్యాస్ సరఫరా బాధ్యతలను ప్రధానంగా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఇది గెయిల్, హెచ్పీసీఎల్ సంయుక్త భాగస్వామ్యంతో కార్యకలాపాలు సాగిస్తోంది. దీంతో పాటు ఇండియా ఆయిల్ సైతం తన పరిధిని విస్తరిస్తోంది. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నగరంలోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కూకట్పల్లి, మణికొండ వంటి ఐటీ కారిడార్లతో పాటు శంషాబాద్ పరిసరాల్లో సుమారు 250కి పైగా పెద్ద నివాస సముదాయాల్లో పూర్తిస్థాయి గ్రిడ్ నెట్వర్క్ ఉంది. ఇండియన్ ఆయిల్ నగర శివార్లలోని కొత్త వెంచర్లు, అపార్ట్మెంట్లలో వేగంగా ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, మేడ్చల్ కారిడార్ విస్తరిస్తూ కనెక్షన్ల ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. మరికొన్ని ప్రైవేట్ సంస్థలు కొత్తగా వెలుస్తున్న టౌన్షిప్ల్లో సమీకృత గ్యాస్ గ్రిడ్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. విలాసం కాదు.. అత్యవసరం.. ప్రస్తుతం 80 శాతం కొత్త ప్రాజెక్టులు నేరుగా గ్యాస్ పైపులైన్ సౌకర్యంతోనే నిర్మాణాలు చేస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం ‘నేచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం ఆర్డర్ 2026’ ప్రకారం పైపులైన్ పనులకు అనుమతులను సులభతరం చేసింది. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు శివారులో కొత్తగా వెలుస్తున్న వెంచర్ల వరకు గ్యాస్ పైపులైన్ గ్రిడ్ విస్తరిస్తోంది. దీంతో హైదరాబాద్ వంటి గ్లోబల్ సిటీలో ’పైప్ గ్యాస్’ అనేది ఇప్పుడు విలాసం కాదు, అత్యవసరంగా మారింది. పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, గేటెడ్ కమ్యూనిటీలలో ’సెంట్రలైజ్డ్ గ్యాస్ బ్యాంక్’ల నుంచి నేరుగా పైపులైన్ మోడ్కు మారే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. సిలిండర్ల వేట దాటి పీఎన్జీ వైపు మొగ్గు వంటగదికి ‘పైపు ద్వారా గ్యాస్’కు భరోసా విస్తరణకు చమురు సంస్థల సన్నాహాలు సిద్ధమవుతున్న అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు సిలిండర్ల కొరతను అధిగమించేందుకు ప్రయత్నాలు -
భార్యను హత్య చేసిన మనస్తాపంతో భర్త ఆత్మహత్య
గచ్చిబౌలి: భార్యను హత్య చేసిన ఓ భర్త రిమాండ్ నుంచి వచ్చిన మూడు రోజులకే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. బావమరిదికి లొకేషన్ షేర్ చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు. ఎస్ఐ జగదీష్ తెలిపిన మేరకు.. ప్రకాశం జిల్లా కొరిదెనకు చెందిన రారాజు(33) ఇసుక, ఇటుక వ్యాపారం చేస్తున్నాడు. భార్య విజయ లక్ష్మీతో కలిసి మియాపూర్ పీఎస్ పరిధిలోని గోకుల్ ఫ్లాట్స్లో నివాసం ఉండేవారు. కుటంబ కలహాల నేపథ్యంలో రారాజు మద్యానికి బానిసగా మారి తరచూ భార్యతో గొడవపడేవాడు. గత డిసెంబర్ 23న గొడవ జరగడంతో విజయ లక్ష్మీ మెడ పట్టుకొని ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. విజయ లక్ష్మీ స్పృహతప్పి పడిపోవడంతో కేపీహెచ్బీలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి డాక్టర్లు ధృవీకరించారు. భార్య హత్య కేసులో రిమాండ్కు తరలించడంతో కంది జైలులో ఉన్నాడు. బెయిల్పై మార్చి 29న జైలు నుంచి విడుదల అయ్యాడు. భార్యను హత్య చేసిన ఘటనలో తీవ్ర మనస్తాపానికి గురైన రారాజు గురువారం సాయంత్రం బావమరిది శ్రీనివాస్ రావుకు ఫోన్ చేసి మీ నాన్న శివరావును తీసుకొని రావాలని ఫొటోలు, లొకేషన్ షేర్చేశాడు. నానక్రాంగూడ రోటరీ సమీపంలోని శ్మశానవాటికలో వేప చెట్టుకు తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించడంతో మృత దేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బావమరిదికి లొకేషన్ షేర్ చేసి బలవన్మరణం రాయదుర్గం పీఎస్లో కేసు నమోదు -
నేటి సీఎం ప్రజావాణి వాయిదా
లక్డికాపూల్ : మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్లో శుక్రవారం జరగాల్సిన సీఎం ప్రజావాణి కార్యక్రమం 7వ తేదీకి వాయిదా పడింది. గుడ్ ఫ్రైడే సందర్భంగా సీఎం ప్రజావాణి నిర్వహించడం లేదని దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి ఏడవ తేదీ మంగళవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ ఒక ప్రకటనలో తెలిపారు ‘ఆటిజం’పై తల్లిదండ్రుల్లో అవగాహన పెంచాలి ● స్పెషల్ చీఫ్ సెక్రటరి జయేష్ రంజన్ బంజారాహిల్స్: ఆటిజం ఉన్న చిన్నారులను ప్రాథమిక స్థాయిలోనే తల్లిదండ్రులు గుర్తించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర స్పెషల్ చీఫ్సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్వేలో స్వచ్ఛంద సంస్థలు, జీహెచ్ఎంసీ కలిసి.. ఆటిజం చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్ బోర్డును ఆయన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్తో కలిసి ప్రారంభించారు. జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ఆటిజం చిన్నారులకు అర్థమయ్యేవిధంగా కమ్యూనికేషన్ బోర్డులను పర్యాటక ప్రాంతాలు, పార్కులు, మాల్స్, బహిరంగ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. గ్రేటర్ కమిషనర్ కర్ణన్, కోర్ కిడ్స్ ఫౌండర్స్ డాక్టర్ నవీన, డాక్టర్ ప్రతిమ తదితరులు పాల్గొన్నారు. ● ట్యాంక్బండ్ శివ దంపతులనుసన్మానించిన జిల్లా కలెక్టర్ సాక్షి, సిటీబ్యూరో: ట్యాంక్ బండ్ శివ సేవా దక్పథం స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. గురువారం కలెక్టరేట్లో శివ దంపతులు మర్యాదపూర్వకంగా కలెక్టర్ను కలిశారు.ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పురుషులు, మహిళలు , వృద్ధులు, దాదాపు 140 మందికి పైగా ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిన వారిని కాపాడామని.. వారికి జీవిత విలువను చెబుతున్నామని వివరించారు. పలువురి మృతదేహాలు కూడా వెలికితీసి కుటుంబ సభ్యులకు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని సత్కరించారు. -
ఆహార అలవాట్ల వల్లే పోషకలోపాలు
రాయదుర్గం: మారుతున్న ఆహారపు అలవాట్లు పోషక లోపాలకు దారితీస్తున్నాయని సినీ నిటీ శ్రియా శరణ్ పేర్కొన్నారు. నగరంలోని నాలెడ్జి సిటీలో ఐటీసీ కోహినూర్లో శ్రియా శరణ్ గురువారం సందడి చేశారు. భారతదేశపు తొలి పోర్టిఫైడ్ ప్రోటీన్ ప్లస్ మల్టిగ్రేన్ ఆటా ‘మినార్’ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూఫోర్టిఫైడ్ ఆహారం ఈ లోపాలను తగ్గించి, ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ప్రజలంతా నాణ్యమైన వస్తువులను వినియోగించు కోవాలని సూచించారు. చెఫ్ సంజయ్తుమ్మ, డాక్టర్ ప్రభా అగర్వాల్,సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సినీనటి శ్రియా శరణ్ -
పాతకక్షలతో యువకుడిపై దాడి
మైలార్దేవ్పల్లి: పాతకక్షల నేపథ్యంలో ఓ యువకుడిపై ముగ్గురు కలిసి కత్తులు, గొడ్డలితో దాడిచేశారు. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన మేరకు.. శాసీ్త్రపురం అదీబా హోటల్ సమీపంలో మహ్మద్ ఫహాద్ (19) కార్మికుడిగా పని చేస్తూ నివాసం ఉంటున్నాడు. శాసీ్త్రపురం బీకేపురానికి చెందిన సయ్యద్ షాబాజ్తో ఫహాద్కు గొడవ జరిగి ఉంది. ఈ నేపఽఽథ్యంలో షాబాజ్ ఎలాగైనా ఫహాద్ను హత్య చేయాలని పథకం వేశాడు. ఈ విషయాన్ని తన స్నేహితులైన షానవాజ్ ఖాన్, రిజ్వాన్కు తెలిపాడు. గురువారం తెల్లవారుజామున అదీబా హోటల్ సమీపంలో మహ్మద్ ఫహద్ కోసం మాట వేసి ఉన్నారు. ఫహాద్ రాగానే అతడిపై కత్తితో పొడిచి, గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బాధితుడి తల వెనుక భాగం భుజంపై గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దాడికి ఉపయోగించిన గొడ్డలి, కత్తి, కొడవలిని స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దాడికి పాల్పడ్డ నిందితులు -
నెలాఖరులోగా పెండింగ్ పనులు పూర్తి
సాక్షి,సిటీ బ్యూరో : తాగునీరు, సీవరేజీ పనుల నాణ్యతలో జవాబుదారీతనం అవసరమని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో వివిధ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దన్నారు. ప్రతీ రీజియన్ లో ఇద్దరు క్వాలిటీ కంట్రోల్ అధికారులను నియమించి తనీఖీ చేసి, పనుల నాణ్యతపై సర్టిఫికేషన్ అందించే విధంగా నూతన పద్ధతిపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. గత ఆర్థిక సంవత్సరంలో అనుమతులు పొందిన పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని దానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. పెండెన్సీ లేకుండా ట్యాంకర్ల డెలివరీ ఈ వేసవిలో ట్యాంకర్ డెలివరీలో పెండెన్సీ లేకుండా చూసుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అదేశించారు. మంచినీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు దృష్టి సారించాలని సూచించారు. జేఎండీ మయాంక్ మిట్టల్, రీజియన్ల ఈడీలు పంకజ, సామ్రాట్ అశోక్, సంతోష్ పాల్గొన్నారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి -
భర్తకు అంత్యక్రియలు నిర్వహించిన భార్య
చాంద్రాయణగుట్ట: జీవితాంతం కలిసి ఉంటానంటూ అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసిన ఆ ఇల్లాలు భర్త చితికి తలకొరివి పెట్టింది. పాతబస్తీ అలియాబాద్కు చెందిన పోకాల్కర్ ప్రకాష్ రాజు గుండెపోటుతో మృతి చెందారు. వారికి నలుగురు కుమార్తెలు. వారికి వివాహాలు కూడా పూర్తయ్యాయి. కుమారులు లేకపోవడంతో నల్లవాగు హిందూ శ్మశాన వాటికలో భార్య పద్మ గురువారం భర్త అంత్యక్రియల ప్రక్రియ నిర్వహించింది. శంషాబాద్లోపేలిన సిలిండర్లు శంషాబాద్: శంషాబాద్ సర్కిల్లోని సాయినగర్ కాలనీలో కార్మికులు నివాసముంటున్న రేకుల గదుల్లోని మూడు సిలిండర్లు పేలి భారీ ఎత్తున మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. గురువారం కార్మికులంతా రోజువారీలాగే పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఎండవేడిమికి నిప్పంటుకుని ఓ గదిలో సిలిండర్ పేలింది. దాని ప్రభావం పక్కనే ఉన్న గదుల్లోని సిలిండర్లకు వ్యాపించడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఆర్జీఐఏ పోలీసులు ఫైరింజన్ రప్పించి మంటలు ఆర్పివేయించారు. -
పారా క్రీడలకు ప్రభుత్వ ప్రాధాన్యత
● తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గన్ఫౌండ్రీ: క్రీడల్లో వివక్షకు చోటు లేకుండా దివ్యాంగులు, బధిరుల క్రీడలకు సముచిత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. గురువారం ఎల్బీస్టేడియంలో 27వ జాతీయ సీనియర్ డెఫ్ స్పోర్ట్స్ చాంపియన్షిప్లో ప్రతిభ కనబర్చిన బ్యాడ్మింటన్ విజేతలను సన్మానించారు. ఇటీవల చండీఘఢ్లో నిర్వహించిన ఆల్ ఇండియా స్పోర్ట్స్ ఆఫ్ డెఫ్ అండ్ డంబ్ పోటీలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబర్చారు. బ్యాడ్మింటన్ విభాగంలో బి.గోపి అండర్–18 కేటగిరీలో రజత, కాంస్య పతకాలు సాధించగా, అండర్–16 విభాగంలో హాసిని రెడ్డి స్వర్ణ, రజత పతకాలు గెలుచుకున్నారు. జీతాలు మీరే చెల్లించండి● ప్రభుత్వాన్ని కోరనున్న కమిషనర్లు ! సాక్షి, సిటీబ్యూరో: క్యూర్ లోని మూడు కార్పొరేషన్లలో సీఎంసీ పరిస్థితి ఓ మేరకు బాగున్నా, మిగతా రెండు కార్పొరేషన్ల పరిస్థితి దారుణంగా మారింది. ఇక, అన్ని కార్పొరేషన్లకూ మాతృక అయిన జీహెచ్ఎంసీ నెత్తిన వేల కోట్ల అప్పుల భారం ఉంది. ఆ అప్పులు తాము చెల్లించలేమని, ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి వివిధ రూపాల్లో నిధులు రావాల్సి ఉన్నందున వాటిని జీహెచ్ఎంసీకి ఇచ్చే బదులు వాటితో జీహెచ్ఎంసీ అప్పులు చెల్లించాలని ఇప్పటికే కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మరోవైపు మూడు కార్పొరేషన్లకు ఆస్తులు, అప్పుల పంపకాలు పూర్తికాలేదు. ఇదిలా ఉండగా, కార్పొరేషన్ల విభజనతో జీహెచ్ఎంసీకి ఆదాయం వచ్చే సర్కిళ్లు తక్కువ..పనులు చేయాల్సిన సర్కిళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎంఎంసీ పరిస్థితి మరోలా ఉంది. ఉన్న మూడు కార్పొరేషన్లలో అత్యల్ప ఆదాయం ఉన్నది దానికే. ఏరియా ఎక్కువే ఉంది. చేయాల్సిన పనులు, కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. ఇవి చేసినా చేయకున్నా సిబ్బంది జీతాలు చెల్లింపులు తప్పవు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మిగతా స్థానిక సంస్థల మాదిరిగానే మూడు కార్పొరేషన్లలోని సిబ్బందికి కూడా ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తే మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. గతంలో జీహెచ్ఎంసీకి ఎక్కువ ఆదాయం ఉన్నందున సిబ్బంది జీతభత్యాలు కూడా చెల్లించేది. అదే విధానం కొనసాగుతోంది. అంతే కాదు, వివిధ ప్రాజెక్టులు కూడా పూర్తిచేసింది. కానీ..ప్రస్తుతం పరిస్థితి మారడంతో సిబ్బంది జీతాలు ప్రభుత్వమేచెల్లిస్తే మేలని కమిషనర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. -
నీటి సంపులో పడి చిన్నారి మృతి
మణికొండ: తల్లి పక్కనే నిద్రిస్తున్న ఓ చిన్నారి..తల్లి నిద్రలేచే సరికిఇంటి ముందే ఉన్న నీటి సంపులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని గండిపేటలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. మహారాష్ట్రకు చెందిన తేజస్ శ్రీకాంత్జాదవ్ తన తమ్ముడు, తల్లి, భార్య, 8 నెలల కుమారుడు సౌరబ్ జాదవ్తో కలిసి గండిపేట తహసీల్దార్ కార్యాలయం సమీపంలో నివాసముంటున్నారు. బుధవారం శంకర్, తల్లి ఉషతో కలిసి కూలీ పనికి వెల్లాడు. ఇంట్లో ఉన్న భార్య రాధిక.. కుమారుడితో కలిసి మధ్యాహ్నం ఇంట్లో నిద్రించింది. మధ్యాహ్నం 2గంటలకు శంకర్ ఇంటికి వచ్చి అన్నం పెట్టుకుంటుండటంతో శబ్దంతో నిద్ర మేల్కొన్న రాధిక.. కుమారుడు కనిపించకపోవటంతో చుట్టు పక్కల వెతికారు. ఇంటి ముందు నీటి సంప్ తెరచి ఉండటంతో అందులో చూడగా బాలుడు కనిపించాడు. వెంటనే బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్యకేసులో ఐదుగురి అరెస్ట్
మూసాపేట: తల్లి, ఇద్దరు పిల్లలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసులు అయిదుమందిని రిమాండ్కు తరలించారు. కూకట్పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. వరంగల్ జిల్లాకు చెందిన బోడ స్రవంతి (30), బోడ ప్రవీణ్ (32)లు మూసాపేటలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కార్తిక్ (12) కౌశిక్ (10). అయితే స్రవంతిని ప్రవీణ్ చాలాకాలంనుంచి వేధిస్తున్నాడు.ఈ క్రమంలో ప్రవీణ్ తన మేనత్త కూతురు మహేశ్వరిని 2024లో రెండవ వివాహం చేసుకున్నాడు. ఇందుకు ప్రవీణ్ తల్లిదండ్రులు కూడా సహకరించారు. ఇది భరించలేనిస్రవంతి పిల్లలను తీసుకుని తల్లి ఇంటికి వెళ్లి పంచాయితీ పెట్టింది. ఆ తరువాత ప్రవీణ్ పద్ధతిగా ఉంటానని చెప్పడంతో గత నెల 30న మూసాపేటకు వచ్చారు. అదే రోజు రాత్రి ఇద్దరికీ గొడవ జరిగింది. భర్త కొడుతున్నాడని, చంపుతానని బెదిరిస్తున్నాడంటూ వాయిస్ రికార్డు చేసి బంధువులకు, అన్నదమ్ములకు మెసేజ్ పంపింది. పిల్లలు కూడా మెసేజ్ పంపారు. అనంతరం స్రవంతి, ఇద్దరు కుమారులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి భర్త ప్రవీణ్, తండ్రి శంకర్ (64), తల్లి మణెమ్మ (48), రెండవ భార్య మహేశ్వరి (23), స్నేహితుడు అనిల్ (28)లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పిల్లలకు ఉరివేసి తాను ఉరివేసుకుందా లేదా అందరూ ఒకేసారి వేసుకున్నారా పోస్టుమార్టంలో తెలుస్తుందని పోలీసులు తెలిపారు. -
డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
● రూ. 3.61 లక్షల విలువైన సరుకు స్వాధీనం నాగోలు: డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఎల్బీనగర్ డీసీపీ డాక్టర్ అనురాధ తెలిపిన మేరకు.. టోలిచౌకి చెందిన జునైద్ రజా సిద్ధిఖీ(36), కోల్కతాకు చెందిన సునీల్ సుబ్బ అలియస్ జానీ(29)లు స్నేహతులు. వీరికి సన్సిటీకి చెందిన అన్నారీకి డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ అన్నారీకి సహాయం చేస్తూ డ్రగ్స్ విక్రయించేవారు. బుధవారం సాయంత్రం నాగోలు చౌరస్తాలో ఈ ఇద్దరూ అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు, నాగోలు పోలీసులు ఇద్దరినీ అందుపులోకి తీసుకుని వారి ద్విచక్రవాహనాన్ని తనిఖీ చేయగా 25.65 గ్రాముల నిషేధిత ఎండిఎంఏ డ్రగ్ను వారిని నుండి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. -
అపరిశుభ్ర వాతావరణంలో బేకరీ ఉత్పత్తులు
విజయనగర్కాలనీ: అనుమతులు లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో బేకరీ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఓ కేంద్రంపై టప్పాచబుత్ర పోలీసులతో పాటు టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం దాడి చేశారు. ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపిన మేరకు.. సయ్యద్ ఖదీర్ జిర్రాలో చాంద్ బేకరీ నిర్వహిస్తున్నాడు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ..... అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్న బేకరి ఉత్పత్తులు రూ.2.77 లక్షల విలువైనవి స్వాధీనం చేసుకున్నారు. దాడిలో గోల్కొండ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటేష్, ఎస్ఐలు అమ్జద్ షరీఫ్, కె.వెంకటరమణ పాల్గొన్నారు. -
రాష్ట్ర బడ్జెట్లో గ్రేటర్ నగరానికి కేటాయింపులు
మహా నగరంపై ‘కోట్ల’ జల్లు కురిసింది. బహుశా.. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్పై రాష్ట్ర ప్రభుత్వం కరుణ చూపించినట్లుగా కనిపించింది శుక్రవారం నాటి పద్దు. ఉపముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ‘రాజధాని’ నగరానికి ప్రాధాన్యమిచ్చారనే చెప్పవచ్చు. అన్ని శాఖలకూ నిధులు నిరాశపర్చని రీతిలోనే పద్దులో పొందుపర్చినట్లు కనిపిస్తోంది. కాకపోతే.. మూడు కార్పొరేషన్లు ఏర్పాటైనా.. అందుకునుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం గమనించదగిన అంశం. కాగా.. అటు మూసీ నుంచి మొదలుకొంటే.. ఇటు ఫోర్త్ సిటీ.. జలమండలి, మెట్రో, ఎంఎంటీఎస్ రెండో దశ, జలమండలి, ఉస్మానియా, టిమ్స్ ఆస్పత్రులు, నాలుగు పోలీస్ కమిషనరేట్లు, హెచ్ఎండీఏ తదితర శాఖలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కినట్లుగానే అర్థమవుతోంది. – సాక్షి, సిటీబ్యూరో టీ క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్) వరకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటైనా.. అందుకునుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. పూర్వ జీహెచ్ఎంసీ 650 చదరపు కిలోమీటర్ల పరిధితో 150 వార్డులుగా ఉన్నప్పుడు క్యూర్ వరకు కేటాయించిన రూ. 2,654 కోట్లనే ఒక్క రూపాయి కూడా పెంచకుండా.. తగ్గించకుండా పద్దులో ప్రతిపాదించారు. అవే నిధుల కేటాయింపులు వరుసగా ఇది మూడో సంవత్సరం. వాస్తవానికి ఆ మేరకు పనులు కూడా జరగలేదు. బహుశా, అందుకే ఈసారి కూడా అన్ని నిధుల్నే కేటాయించారు. కొత్తగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) ఏర్పాటు కావడంతో ప్రభుత్వం వాటికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని కార్పొరేషన్లు భావించాయి. వాటికి కానీ, జీహెచ్ఎంసీకి కానీ ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు చేయలేదు. క్యూర్ పరిధి వరకు హెచ్–సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)కింద మొత్తం రూ.2,654 కోట్లు కేటాయించారు. అంటే జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలన్నింటికీ కలిపిన కేటాయింపులు. హెచ్–సిటీ కింద ఫ్లై ఓవర్లు, అండర్పాస్లతో పాటు నాలాల అభివృద్ధి, రహదారుల విస్తరణ, ఆర్ఓబీ, ఆర్యూబీ, తదితర పనులుంటాయి. గత సంవత్సరం బడ్జెట్లో హెచ్–సిటీ పనుల కింద రూ.2,654 కోట్లతోపాటు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లుగా రూ.419 కోట్లు కేటాయించారు. ఈసారి ఎలాంటి గ్రాంట్లు లేవు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు రూ.500 కోట్లను రుణాల రూపంలో కేటాయించింది. వివిధ అభివృద్ధి పనులకు ఈ నిధులు వినియోగించనున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి డైరీఫామ్ వరకు ఎలివేటెడ్ పనులు కొనసాగుతున్నాయి. జేబీఎస్– శామీర్పేట్ వరకు త్వరలో ప్రారంభించనున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్– 12 నుంచి శిల్పా లేఅవుట్ వరకు మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేశారు. పలు చోట్ల రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. వీటి కోసం ఈ నిధులను విని యోగించనున్నారు. మరోవైపు ఓఆర్ఆర్ కోసం జైకా సంస్థ నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల దృష్ట్యా మరో రూ.200 కోట్లు కేటాయించారు. మూసీ మురిసేలా.. సీఎం రేవంత్ కలల ప్రాజెక్ట్ మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం రూ.1,500 కోట్ల పద్దును ప్రతిపాదించింది. గత బడ్జెట్తో పోలిస్తే ఇది రూ.400 కోట్లు ఎక్కువ. కొత్త బడ్జెట్లో కేటాయింపులను భూ సమీకరణ, నది చుట్టూ మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ), ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించనున్నారు. తొలి దశలో నగరంలో మూసీ ప్రవహించే 55 కి.మీ. మేర నదిని సుందరీకరించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో జోన్–1 కింద మొత్తం 21 కి.మీ. మేర సుందరీకరించనున్నారు. జోన్–1ఏలో హిమాయత్సాగర్ నుంచి గాంధీ సరోవర్ 9.8 కి.మీ., జోన్–1బీ కింద ఉస్మాన్సాగర్ నుంచి గాంధీ సరోవర్ 11.2 కి.మీ వరకు నదికి పునరుజ్జీవం కల్పించనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ.. నాలుగు పోలీసు కమిషనరేట్లకు కలిపి రూ.387 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ పోలీసు విభాగానికి రూ.310 కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత ఇటీవల కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కు రూ.40 కోట్ల పద్దును ప్రతిపాదించారు. ఇక, సైబరాబాద్కు రూ.20 కోట్లు, మల్కాజిగిరికి రూ.17 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. కాగా.. గ్రేటర్లో హైదరాబాద్, సైబరాబాద్లకు శాశ్వత కమిషనరేట్ భవనాలు ఉండగా.. మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీలకు లేవు. మల్కాజిగిరి కమిషనరేట్ భవనానికి ప్రభుత్వం కేవలం రూ.లక్ష కేటాయించి చేతులు దులుపుకొంది. ఫోర్త్ సిటీ కమిషనరేట్ బిల్డింగ్కు రూ.25 కోట్లను ప్రతిపాదించారు. ‘క్యూర్’ పరిధిలో పోలీసులకు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాలను సమకూర్చేందుకు ఈ– వెహికిల్స్ కోసం రూ.25 కోట్లు కేటాయించడం గమనార్హం ఎల్బీ నగర్, సనత్నగర్, అల్వాల్లో నిర్మాణంలో ఉన్న తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్) ఆస్పత్రులను ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించి 5 వేల బెడ్స్ అందుబాటులోకి తెస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఫలితంగా లక్షలాది మంది సామాన్య, పేద కుటుంబాలకు ప్రభుత్వ వైద్యం చేరువకానుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా పథకంతో హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న అత్యధిక శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మేలు జరగనుంది. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రి నిర్వహణకు భారీగా నిధులు కేటాయించారు. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి రూ.100 కోట్లు కేటార్చుుంచింది. హైదరాబాద్ మెట్రో రెండో దశ కోసం రూ.600 కోట్లు అందజేయనున్నారు. రైళ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, తదితర అవసరాల కోసం హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్)కు మరో రూ,500 కోట్లు రుణాల రూపంలో ఇవ్వనున్నారు. ప్రస్తుతం మెట్రో రెండో దశలో భాగంగా పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ.మార్గంలో రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ చేపట్టారు. 850 ఆస్తులకు రూ.600 కోట్లలో మరి కొంతమందికి పరిహారం అందజేయనున్నారు. మెట్రో టేకోవర్ చెల్లింపులపై బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఎంఎంటీఎస్ రెండో దశ కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించింది. రెండో దశలో నగర శివారు ప్రాంతాలను కలుపుతూ ఆరు మార్గాల్లో ఎంఎంటీఎస్ విస్తరణ చేపట్టారు. అప్పట్లో రూ.850 కోట్లతో ప్రణాళికలను రూపొందించారు. ప్రాజెక్టు జాప్యంతో ఇది రూ.1,150 కోట్లు దాటింది. రాష్ట్ర ప్రభుత్వం 1/3, రైల్వేశాఖ 1/4 చొప్పున నిధులు అందజేయాలి. ఈ మేరకు ఏటా బడ్జెట్లో ఎంఎంటీఎస్ కోసం కేటాయిస్తున్నారు. నగర శివారులో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించింది. రేడియల్ రోడ్ల నిర్మాణం, ఫ్యూచర్సిటీని నేరుగా ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించే గ్రీన్ పీల్డ్ జాతీయ రహదారి, భూగర్భ విద్యుత్ లైన్లు, పర్యవరణ అనుకూల స్మార్ట్ గ్రిడ్లతో ఈ నగరం సుస్థిర అభివృద్ధికి నిదర్శనంగా నిలవనుందని ప్రకటించింది. జలమండలి అభివద్ధి పనులు, సుంకిశాల ప్రాజెక్టుకు రూ.3,305 కోట్లు కేటాయించారు. అభివృద్ధి పనులకు తీసుకున్న రుణాల చెల్లింపునకు రూ.1,450 కోట్లు, సుంకిశాల ప్రాజెక్టు రుణం కింద రూ.1000 కోట్లు, నీటి రీయింబర్స్మెంట్కు రూ. 300 కోట్లు కేటాయించింది. రెండేళ్లుగా బడ్జెట్లో రూ.3,385 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ.380 కోట్లు తగ్గించింది. నిధుల కొరతతో సతమతమవుతున్న జలమండలికి కేటాయింపులు నిరాశ కలిగించగా.. మూసీ పునరుజ్జీవానికి కేటాయించిన రూ.1,500 కోట్లు పరోక్షంగా జలమండలి పరిధిలోని సివరేజ్ పనులకు తోడ్పడనుండటం కొంత ఉపశమనం. గ్రేటర్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుళ్ల ప్రస్తావన తీసుకురాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన రహదారుల వెంట గజిబిజిగా, ప్రమాదకరంగా మారిన ఓవర్ హెడ్లైన్ల స్థానంలో కొత్తగా భూగర్భ విద్యుత్ కేబుళ్లు ఏర్పాటు చేయాలని భావించింది. ఆ మేరకు రూ.1,5000 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచాన వేసింది. మూడు దశల్లో ఈ పనులు చేపట్టాలని భావించినప్పటికీ.. తాజా బడ్జెట్లో పైసా కూడా కేటాయించకపోవడం విస్మయం కలిగిస్తోంది. కాగా.. గృహజ్యోతి పథకానికి రూ.2080 కోట్లు కేటాయించడంతో గ్రేటర్ జిల్లాల్లో 11.5 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం ఉంది. 3 కార్పొరేషన్లకు రూ.2,654 కోట్లు ‘హెచ్–సిటీ’ సహా క్యూర్ వరకూ.. గత రెండేళ్లుగా ఇదే మాదిరిగా.. మూసీ ః రూ.1,500 కోట్లు మెట్రో రెండో దశకు రూ.600 కోట్లు రుణాల రూపంలో మరో రూ.500 కోట్లు హెచ్ఎండీఏకు రూ.500 కోట్లు పోలీసులకు రూ.387 కోట్లు ఎంఎంటీఎస్ రెండో దశకు రూ.50 కోట్లు ఉస్మానియా ఆస్పత్రి భవనానికి రూ.100 కోట్లు జలమండలికి రూ.3,305 కోట్లు ఎఫ్సీడీఏకు రూ.300 కోట్లు -
ఈద్ నమాజ్కు వేళాయే
విద్యుద్దీపాల వెలుగులో మక్కా మసీదు.. ప్రార్థనలు చేస్తున్న ముస్లింలునగరంలో ఈద్–ఉల్–ఫితర్ (రంజాన్) కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ముస్లింలు ఈద్ నమాజ్ చేసేందుకు పాతబస్తీ మీర్ ఆలం ఈద్గా, మక్కా మసీదు, మాదన్నపేట ఈద్గా, ఈద్గా ఉజాలే షా, కుత్బుల్లాపూర్, నార్సింగి, ఫస్ట్ లాన్సర్, పహాడీషరీఫ్ ఈద్గాలతో పాటు వివిధ మైదానాలు సిద్ధమయ్యాయి. పాతబస్తీతో పాటు ప్రధాన ఈద్గాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మీర్ ఆలం ఈద్గాకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. రంజాన్ మాసంలో చివరి శుక్రవారం (జుమ్మతుల్ విదా) సందర్బంగా మక్కా మసీదులో సామూహిక ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ సామూహిక ప్రార్థనలు జరిగాయి. – సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్ -
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
గన్ఫౌండ్రీ: కూచిపూడి, భరతనాట్య, జానపద నృత్యాలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో గ్లోబల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా మాట్లాడుతూ.. పండుగల ప్రాముఖ్యత, విలువలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం పలువురు నాట్య గురువులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సినీ నటుడు పృథ్వీ, వ్యాపారవేత్త ఎస్. రాజా, సంస్థ వ్యవస్థాపకులు లయన్ కేవీ రమణారావు పాల్గొన్నారు. -
భూ వివాదంతో మంత్రికి సంబంధం లేదు
మణికొండ: తమ ఉమ్మడి కుటుంబ భూ తగాదాతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి, ఆయన కుమారుడు హర్షవర్ధన్రెడ్డికి, వారి సంస్థకు ఎలాంటి సంబంధం లేదని.. తమకు రావాల్సిన పొలాన్ని కలుపుకుని తమ చిన్నాన్న కుటుంబీకులు ప్రహరీ నిర్మాణం చేసుకుంటూ వివాదం పెద్దది చేస్తున్నారని గండిపేట మండలం వట్టినాగుపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 259 యజమానులు అవినవ్షా, అక్షయ్షాలు పేర్కొన్నారు. తమ పొలంలో తిరిగి ప్రహరీ నిర్మిస్తున్నారన్నారని వివరించారు. శుక్రవారం వారు పొలం వద్దే మీడియాతో మాట్లాడారు. వట్టినాగులపల్లి సర్వేనెంబర్ 245, 259,260లలో షా కుటుంబంలోని నలుగురు అన్నదమ్ములకు 300 ఎకరాల భూమి ఉండేదని, అందులో కొంత భూమి విక్రయించారని.. 40 ఎకరాలు ఓఆర్ఆర్, కోకాపేట ట్రంపెట్ నిర్మాణానికి తీసుకున్నారన్నారు. మిగిలిన 160 ఎకరాల భూమిని అందరం కలిసి 2006లో దక్షిణ్ షెల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు డెవలప్మెంట్కు ఇచ్చామన్నారు. వారు జీవో 111 కారణంతో ఎలాంటి నిర్మాణం చేపట్టకపోవటంతో 2025లో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామన్నారు. ప్రస్తుతం సర్వేనెంబర్ 260లో ఉన్న 10 ఎకరాలతో పాటు 259లో ఉన్న 3.20 ఎకరాలను న్యూజెమ్ సంస్థకు డెవలప్మెంట్కు ఇచ్చామన్నారు. 259 సర్వే నెంబర్లోని 3.20 ఎకరాల భూమి విషయంలోనే వివాదం ఉందని, అందులో తమకు భూమి ఉందని తాము, లేదని తమ చిన్నాన్న సతీష్షాల మధ్య వివాదం నడుస్తోందన్నారు. తమ భూమిని 2025లో ఏడీ సర్వే నిర్వహించి వారు చూపించిన హద్దులను తమ చిన్నాన్న సతీష్షా అంగీకరించటం లేద న్నారు. ఈ వివాదంలోకి మంత్రిని ఎందుకు లాగుతున్నారనే విషయం తమకు తెలియద న్నారు. ఇదిలా ఉండగా మొత్తం భూమి తమ పేర్లపై 40 సంవత్సరాల క్రితమే రిజిస్ట్రేషన్ అయిందని, అయినా తమకు భూమి ఉందని తమ దాయాదులు వస్తున్నారని మరో భూ యజమాని పల్లవిషా అన్నారు. రెవెన్యూ అధికారులే పరిష్కరించాలి వట్టినాగులపల్లి భూ యజమానులు అవినవ్ షా, అక్షయషా -
కోర్టు ఆదేశాలను భేఖాతరు చేస్తూ ఆక్రమణకు యత్నం
సాక్షి, సిటీబ్యూరో: భూ వివాదానికి సంబంధించి న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తూ అతిక్రమణ, ఆస్తి నష్టం, ప్రాణహాని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ శ్రీనాథ్ స్పిన్నర్స్ మేనేజర్ నగేష్ సుతారి మేడ్చల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు నమోదైన ఎఫ్ఐఆర్లోని అంశాల ప్రకారం. మేడ్చల్ ఐడీఏలోని సర్వే నంబరు 859లో 3 ఎకరాలు స్థలం ఉంది. సదరు ఆస్తిపై మేడ్చల్ న్యాయస్థానంలో కేసు ఉంది. ఈ స్థలంలో 2001 నుంచి శ్రీనాథ్ స్పిన్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యకలాపాలను సాగిస్తున్నామని, ఈ క్రమంలో ఈనెల 1న రాత్రి 11.40 గంటలకు మంతెన రవి వర్మ రాజు, మంతెన నాగజ్యోతి, రాములు గౌడ్, ఈ సాంబయ్య, ఈ సందీప్ రాజ్, వారి అనుచరులు పథకం ప్రకారం తమ ప్రాంగణంలోకి చొరబడ్డారని నగేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లు, ద్విచక్ర వాహనాలు, కార్లతో వచ్చి ఫ్యాక్టరీ గేట్లను, ప్రహారీ గోడలను పగులగొట్టి ప్రాంగణంలోకి దౌర్జన్యంగా ప్రవేశించారన్నారు. ఆస్తికి నష్టం కలిగించడంతో పాటు మిల్లులో ఉన్న కార్మికులపై దాడులకు దిగారని ఆరోపించారు. ఈ దాడిలోకార్మికుడు రంజన్ మల్లిక్కు తీవ్ర గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత సదరు దుండగులు సంఘటనా స్థలం నుంచి పారిపోయారన్నారు. జేసీబీ (ఏపీ01పీ131), టిప్పర్ (టీఎస్08యూఎల్2449), ద్విచక్ర వాహనాలు (టీఎస్07ఎఫ్యూ4486, టీజీ153200)లను ఘటనా స్థలంలోనే వదిలేసి వెళ్లారన్నారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాతో అగ్ని ప్రమాదం సృష్టించాలనే దురుద్దేశంతో వచ్చినట్లు కనిపిస్తోందని నగేష్ ఆరోపించారు. 2001, 2021, 2022 సంవత్సరాలలో కూడా రాములు గౌడ్, సాంబయ్య, సందీప్ రాజ్లు అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేశారన్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు తమకు రక్షణకల్పించాలని నగేష్ కోరారు. జేసీబీలు, టిప్పర్లతో అర్ధరాత్రి చొరబడిన దుండగులు మేడ్చల్ ఠాణాలో ఫిర్యాదు చేసిన శ్రీనాథ్ స్పిన్సర్స్ మేనేజర్ నగేష్ -
‘గాంధీ’కి మరో నాలుగు ఫ్రీజర్ బాక్సులు
గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి అదనంగా మరో నాలుగు ఫ్రీజర్ బాక్సులు వచ్చాయి. తెలంగాణ వైద్యవిద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) నుంచి ఇవి గాంధీ మార్చురీకి శుక్రవారం చేరుకున్నాయి. గాంధీ’లో పనిచేయని ఫ్రీజర్లు శీర్షికతో ఇటీవల ‘సాక్షి’ ప్రచురించిన కఽథనానికి వైద్యమంత్రితోపాటు ఉన్నతాధికారులు స్పందించారు. గాంధీ మార్చురీలో 70 మృతదేహాలను భద్రపర్చేందుకు ఫ్రీజరు బాక్సులు ఉండగా, వీటిలో 44 పనిచేయకపోవడంతో కుళ్లిన మృతదేహాలు తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండటంతో వైద్యులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఫ్రీజర్ల కాల పరిమితి ముగిసిందని, మరమ్మత్తులకు కూడా పనికిరావని ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది.దీంతో స్పందించిన ప్రభుత్వం అదనపు ఫ్రీజర్ బాక్సులు గాంధీ ఆస్పత్రికి పంపింది. -
24 నుంచి ఓయూలో అంతర్జాతీయ సదస్సు
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ మహిళా సదస్సు నిర్వహిస్తున్నట్లు వీసీ ప్రొ.కుమార్, సదస్సు కన్వీనర్ ప్రొ.విజ్జులత తెలిపారు. సదస్సుకు ప్రముఖ సినీనటి, రాజకీయ నాయకురాలు గౌతమి తడిమల్ల హాజరవుతారన్నారు. శుక్రవారం ఓయూ అతిథి గృహాంలో సదస్సు వివరాలను వెల్లడించారు. వర్సిటీ క్యాంపస్లోని ఠాగూర్ ఆడిటోరియంలో 24న ప్రారంభ సదస్సుకు రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. మహిళా శక్తి–సుస్థిరత అనే అంశం జరిగే సదస్సులో దేశ విదేశాలకు చెందిన 250 మంది పరిశోధన పత్రాలను సమర్పిస్తుండగా, 1200 మంది మహిళా ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. రూ.1000 కోట్ల కేటాయింపుపై వీసీ హర్షం ఓయూకు గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన రూ.1000 కోట్లను రాష్ట్ర బడ్జెట్లో కేటాయించడం పట్ల ఉస్మానియా వీసీ ప్రొ.కుమార్ హర్షం వ్యక్తం చేశారు. మౌలిక వసతుల అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులను మంజురు చేశారన్నారు. -
16 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
● రూ.3,200 కోట్ల విలువైన భూమి చుట్టూ ఫెన్సింగ్ గచ్చిబౌలి: శేరిలింగంపల్లి టీఎన్జీఓకాలనీలో 16 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. హెచ్ఎండీఏ లే అవుట్లో 10 ఎకరాల ముసాయికుంట, నాలుగు ఎకరాలు గ్రీన్ బెల్ట్ ఏరియా, ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన రెండు ఎకరాలు.. ఇలా మొత్తం 16 ఎకరాలు కబ్జా అవుతోందని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా.. భూమి విలువ రూ.3,200 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం భూమిని కాపాడి ఫెన్సింగ్ వేశారు. అనంతరం ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. -
ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలి
● హైడ్రా కమిషనర్ రంగనాథ్ సాక్షి, సిటీబ్యూరో: ‘ఎంతో కష్టపడి చదువుకుని గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పలు శాఖల్లో అధికారులుగా మీరు విధులు నిర్వహించనున్నారు. మీరే మీ విభాగాల్లో ప్రత్యేకతను చాటాలి. అధికారులపై ప్రజలకు నమ్మకం కలిగేలా మీ చర్యలుండాలి. ప్రజాప్రయోజనమే లక్ష్యంగా పనిచేయాలి. మీ విభాగాల్లో ఎవరికి వారు కొత్త చరిత్రను సృష్టించాలి’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. గ్రూప్–1 కేడర్కు ఎంపికై న ఉద్యోగుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డా.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో హైడ్రా కమిషనర్ మాట్లాడారు. సమాజ ప్రయోజనాలు కోరి మంచి చట్టాలు రూపొందించుకున్నాం. అవి పేపరు మీద అన్నీ ఉంటాయి. కానీ, వాటిని అమలు చేయకపోతే ప్రయోజనం లేదని ఆయన స్పష్టం చేశారు. -
అనుమానంతో వేధించి.. ఆత్మహత్యకు ప్రేరేపించి..
చిలకలగూడ : యువతిని అనుమానంతో వేధించి ఆత్మహత్యకు కారణమైన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితకృష్ణమూర్తి తెలిపిన మేరకు.. కోటేశ్వరరావు కుటుంబం సికింద్రాబాద్ శ్రీనివాసనగర్లో నివాసముంటోంది. ఈయన కూతురు జెనిమా (19) ఇంటర్ చదువుతోంది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జగదీష్ (22) రాంనగర్లోని ఓ బుక్షాప్లో పనిచేస్తున్నాడు.సోషల్ మీడియా ద్వారా యువతికి పరిచయమయ్యాడు. ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల జెనిమా ప్రవర్తనపై అనుమానం పెంచుకొని మానసికంగా వేధించసాగాడు. బెదిరించేందుకు యువకుడి ఆత్మహత్యాయత్నం యువతిని బెదిరించేందుకు జగదీష్ ఈనెల 14న కొద్ది మోతాదులో పురుగుల మందు తాగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. మార్చి 17న ఉదయం జెనిమా ఇంటికి వెళ్లి తీవ్ర వాగ్వాదానికి దిగి వెళ్లిపోయాడు. దీంతో జెనిమా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఉరి వేసుకునేందుకు సీలింగ్ ఫ్యానుకు కట్టిన చున్నీ ఫొటోను జగదీష్ స్నేహితుడు శ్యామ్కు వాట్సప్ ద్వారా పంపించింది. శ్యామ్ అందించిన సమాచారం మేరకు జగదీష్తోపాటు కుటుంబసభ్యులు వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది.గాంధీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ క్రమంలో జగదీష్ అక్కడి నుంచి పరారయ్యాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం నిందితుడు జగదీష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మృతురాలి కాళ్లకు అయితే గాయాలు ఆస్పత్రికి తరలిస్తుండగా అయ్యాయని పోలీసులు తెలిపారు.యువతి ఆత్మహత్య కేసులో నిందితుడి అరెస్ట్ -
అక్రమ సిలిండర్
● 1,073కు పైగా సిలిండర్లు సీజ్ ● ఒక వినియోగదారుకు ఒకటే కనెక్షన్ ● నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ● రంగంలోకి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ గ్రేటర్లో ‘ఎల్పీజీ’పై మెరుపు దాడులు సాక్షి, సిటీబ్యూరో: నగర పరిధిలో గ్యాస్ సిలిండర్ల అక్రమ చలామణిపై పౌరసరఫరాల శాఖ సీరియస్గా దృష్టి పెట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో కొన్ని రోజులుగా తనిఖీలు ముమ్మరం చేసింది. గృహావసరాల సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్న ముఠాల గుట్టు రట్టు చేస్తోంది. మరోవైపు హోటళ్లలో సరైన పత్రాలు లేని అక్రమ ఖాళీ వాణిజ్య సిలిండర్లపై సైతం కొరడా ఝుళిపిస్తోంది. శ్రీనగర్ కాలనీ, మలక్పేట్, దిల్సుఖ్నగర్, చార్మినార్, జియాగూడ, అబిడ్స్, నార్సింగి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, బాలానగర్, షాపూర్నగర్, సూరారం, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీలు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లపై దాడులు జరిపి సుమారు 1,073కుపైగా సిలిండర్లను సీజ్ చేసింది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద 308కి పైగా కేసులు నమోదు చేసింది. రీఫిల్లింగ్ చేస్తున్న కమర్శియల్, చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకుంది. నిబంధనలు కఠినతరం.. గ్యాస్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు నిబంధనలను కఠినతరం చేశారు. ఒక వినియోగదారుడికిఒకే కనెక్షన్్ మాత్రమే ఉండాలి. ఒకే పేరు మీద వేర్వేరు కంపెనీల కనెక్షన్లు ఉండటం నిబంధనలకు విరుద్ధం. అలాంటి కనెక్షన్లను తక్షణమే గుర్తించి బ్లాక్ చేస్తున్నారు. మరోవైపు పైపులైన్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు పాత ఎల్పీజీ కనెక్షన్ను వెంటనే సరెండర్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే (పైప్డ్ గ్యాస్) వాడుతున్న వారు సుమారు 20 వేలకు పైగా తమ పాత కనెక్షన్లను సరెండర్ చేయలేదని గుర్తించారు. అక్రమ ఖాళీ సిలిండర్లున్నా సీజ్ హోటళ్లు, హాస్టళ్లలో గృహ వినియోగ సిలిండర్ల వినియోగం చట్టరీత్యా నేరం. తనిఖీ సమయంలో ఇతర కంపెనీలకు చెందిన ఖాళీ సిలిండర్లు కనిపించినా, వాటికి సరైన ఆధారాలు చూపకపోతే అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. హోటల్ కిచెన్లలో కమర్షియల్ సిలిండర్లు మాత్రమే ఉండాలని, డొమెస్టిక్ సిలిండర్లు లభ్యమైతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మా పరిస్థితి ఏంటి? హోటల్ యజమానులు ప్రభుత్వ చర్యలపై హోటల్ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. కమర్షియల్ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోందని వారు వాపోతున్నారు. ఈ తరుణంలో అధికారులు దాడులు చేస్తూ సిలిండర్లను సీజ్ చేయడం వల్ల వ్యాపారాలు మూతపడే స్థితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో సిలిండర్ల దందాను అరికట్టేందుకు, సామాన్య గృహ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గ్రేటర్ పరిధిలో దాడులు ఇలా.. జిల్లా సిలిండర్ల కేసులు సీజ్ హైదరాబాద్ 643 233 రంగారెడ్డి 250 45 మేడ్చల్–మల్కాజిగిరి 180 30 -
మూగబంధం.. ప్రాణప్రదం
పెంపుడు జంతువులపై ఎనలేని మమకారంనగర శివారు మీర్పేట్ పరిధి వెంకటాద్రి కాలనీకి చెందిన డిగ్రీ విద్యార్థిని హిమబిందుకు పెట్స్ అంటే ప్రాణం. బంధువుల నుంచి మూడు పిల్లులను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. కుటుంబ సభ్యుల కంటే ఆమెకు మార్జాలంపైనే మక్కువ. అంతలా ప్రేమించే పిల్లి ఇటీవల రోడ్డుపై మృతి చెంది కనిపించింది. షాక్కు గురైన హిమబిందు మానసిక ఒత్తిడికి గురైంది. గురువారం బెడ్రూంలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది ● వనస్థలిపురానికి చెందిన శాంభవి దేవి మగ పెర్షియన్ పిల్లిని పెంచుకుంటోంది. ఇటీవల అది అనారోగ్యం బారిన పడటంతో పెట్ క్లినిక్కు తీసుకెళ్లింది. డాక్టర్ పరీక్షించి మూడుసార్లు సర్జరీలు చేశాడు. అయినా.. పిల్లి ఆరోగ్యం మెరుగవ్వకపోవడంతో శాంభవి కుంగిపోయింది. మళ్లీ డాక్టర్ సంప్రదించగా.. అసభ్యకర పదజాలంతో దూషించాడని చైతన్యపురి ఠాణాలో ఆమె ఫిర్యాదు చేసింది. ఇలా.. పిల్లులు, శునకాలు, కుందేళ్లు, పావురాలు, చిలుకలు.. కావేవీ అనుబంధాలకు అనర్హం అన్నట్టుగా మారింది నగరంలోని ప్రస్తుతం పెట్ లవర్స్ పరిస్థితి. మానవ సంబంధాల కంటే పెంపుడు జంతువుల పైనే మమకారం పెంచుకుంటున్నారు. జంతువుల మీద ప్రేమలు, ఆప్యాయతలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రేమగా పెంచుకునే పెట్స్ అనారోగ్యానికి గురైనా హైరానా పడిపోతున్నారు. మానసిక ఒత్తిడి, భావోద్వేగాలకు గురవుతున్నారు. ఇక, అల్లారుముద్దుగా పెంచుకునే పెంపుడు జంతువులు మరణిస్తే.. తట్టుకోలేక ఏకంగా ఆత్మహత్య చేసుకునే స్థాయికి బంధాలు చేరాయి. – సాక్షి, సిటీబ్యూరో బంధాల కోసం వెతుకులాట.. మానవ సంబంధాలు దారి మళ్లుతున్నాయి. పని ఒత్తిడి, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, ప్రైవసీ.. కారణాలమైనా మహా నగరంలో అనుబంధాలు మృగ్యమవుతున్నాయి. ఆప్యాయంగా పలకరించే వాళ్లే కరువైపోయారు. దీంతో అనుబంధాలను ఎతుక్కునే పరిస్థితి దాపురించింది. ఈ క్రమంలోనే పెంపుడు జంతువులతోనే మమకారం పెనవేసుకుంటోంది. ఇంట్లో మాట్లాడేవాళ్లే లేకపోవడంతో పెట్స్తోనే జీవితం గడిపే పరిస్థితి ఏర్పడింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న అరుదైన ఆఫ్రికన్ గ్రే చిలుక తప్పిపోవడంతో హైరానా పడిపోయిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫైర్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు.. మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించి తప్పిపోయిన చిలుకను క్షేమంగా యజమానికి అప్పగించిన సంఘటన ఇటీవల బంజారాహిల్స్లో జరిగింది. మానసిక ఒత్తిడి దూరం.. మానసిక అలసట, దుఃఖం లేదా ఒంటరితనంతో ఉండే వ్యక్తులు జంతువులతో ఎక్కువగా మమేకమవుతున్నారు. మానసిక స్థితిని నియంత్రించుకోవడానికి, బంధాలపై నమ్మకాన్ని తిరిగి పెంపొందించుకోవడానికి పెంపుడు జంతువులు సహాయపడతాయని పలు అధ్యయనాల్లోనూ తేలింది. పెట్స్ ఓ స్టేటస్ సింబల్ మారంది. స్థానిక జాతులు కాకుండా ప్రపంచ దేశాల నుంచి అరుదైన జంతువులను తీసుకొచ్చి పెంచుకోవడం కొత్త ఫ్యాషన్గా మారింది ఇంటిలో వాటి కోసం ప్రత్యేకంగా గదులు, ఆడుకునేందుకు వార్డ్రోబ్లు, ప్రత్యేకంగా పెట్ పార్క్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇగ్వానాలు, షుగర్ గ్లైడర్లు, బర్మీస్ కొండచిలువ, బాల్ పైథాన్లు, నక్షత్ర తాబేలు వంటి జంతువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రేమాప్యాయతలు కనబరుస్తున్న పెట్ లవర్స్ వీటికి అనారోగ్యం వస్తే తట్టుకోలేని వైనం పెంపుడు పిల్లి మృతిని తట్టుకోలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య తాజాగా నగర శివారు మీర్పేట్లో విషాద ఘటన కుక్క ఆరోగ్యం మెరుగవ్వలేదని వైద్యుడిపై ఇటీవల కేసు గ్రేటర్ పరిధిలో చోటుచేసుకుంటున్న పలు ఉదంతాలు -
ఊహల పల్లకిలో..
● రాష్ట్ర బడ్జెట్పై జలమండలి భారీ ఆశలు ● క్యూర్ వాటర్, సీవరేజీ మాస్టర్ ప్లాన్ ● కేటాయింపులు సరే.. నిధుల విడుదల అంతంతే ఇస్తారా రూ.6,500 కోట్లు! మురిపించేనా.. ఉసూరుమనిపించేనా? రాష్ట్ర ప్రభుత్వం కరుణిస్తేనే మూడు కార్పొరేషన్ల మనుగడ సాక్షి, సిటీబ్యూరో: మహానగర దాహార్తిని తీర్చే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజీ బోర్డు (జలమండలి) రాష్ట్ర బడ్జెట్– 2026–2027పై ఆశలు పెట్టుకుంది. జలమండలి పరిధి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్ )వరకు విస్తరించడంతో బాధ్యతలు రెట్టింపయ్యాయి. దీంతో ఈసారి అవసరమైన నిధుల కోసం బడ్జెట్లో ప్రధానంగా నాలుగైదు అంశాలపై దృష్టి సారించి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. క్యూర్ వాటర్, సీవరేజ్ మాస్టర్ ప్లాన్లు, గోదావరి ఫేజ్–2, 3, సుంకిశాల ఇన్టెక్ వెల్, ఎస్టీపీల నిర్మాణ పనులకు నిధులు అవశ్యమని భావిస్తోంది. ప్రభుత్వం బడ్జెట్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో జలమండలి రూ.6,500 కోట్ల వరకు కావాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అందులో ప్రస్తుతం పెరిగిన అవసరాల దృష్ట్యా ఈసారి రూ.5వేల కోట్ల వరకు నిధులు కేటాయింపు ఉండవచ్చని జలమండలి భావిస్తోంది. సీవరేజ్ పనులకు ‘బూస్ట్‘ లభించేనా? సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మూసీ పునరుజ్జీవ పథకానికి అనుబంధంగా సీవరేజ్ పనులకు ఈ బడ్జెట్లో ‘బూస్ట్‘ లభించే అవకాశం ఉనట్లు తెలుస్తోంది, నగరం చుట్టూ మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా మూసీ ప్రక్షాళనకు ఊతమివ్వచ్చని జలమండలి ఆశిస్తోంది. గత మూడేళ్లలో బడ్జెట్ కేటాయింపులు భారీగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో నిధుల విడుదల ఆశించిన స్థాయిలో లేకుండాపోయింది. గతంలో కేటాయించిన నిధుల్లో దాదాపు 40 నుంచి 50 శాతం వరకే సకాలంలో విడుదలవుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర బడ్జెట్పై క్యూర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లు భారీ ఆశలే పెట్టుకున్నాయి. క్యూర్ పరిధిలోని 27 స్థానిక సంస్థల్నీ దృష్టిలో ఉంచుకొని గత జనవరి 31 జరిగిన పాలకమండలి సమావేశంలో రూ.11,460 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీ నిధులు ఇస్తారనే నమ్మకంతోనే ఆమోదం తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల అంచనాతోనే ఆ బడ్జెట్కు ఆమోదం తెలిపారు. పాత జీహెచ్ఎంసీ పరిధి వరకు రూ.9,200 కోట్లు, విలీనమైన 27 స్థానిక సంస్థల పరిధిలో పనులకు రూ.2,260 కోట్లతో, మొత్తం రూ.11,460 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపారు. హెచ్– సిటీ ప్రాజెక్ట్ కింద పలు ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు తదితర నిర్మాణాల కోసం, రూ.7,032 కోట్లు.. 7.60 లక్షల వీధిదీపాలకు రూ.1,341.60 కోట్లు, సీఆర్ఎంపీ కింద 1045 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్వహణకు రూ.3,145 కోట్ల పనులకు ప్రభుత్వం పాలనపరమైన ఆమోదం తెలిపినప్పటికీ నిధులు కావాల్సి ఉంది. ఇవి దీర్ఘకాలిక పనులు కావడంతో ఏడాది కాలానికై నా రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.3,100 కోట్లు అందవచ్చనే ఆశతోనే బడ్జెట్ను ఆమోదించారు. మారిన నగర ముఖ చిత్రం.. మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు కాకముందే, విలీనమైన 27 స్థానిక సంస్థలను దృష్టిలో ఉంచుకొని, ఒకే కార్పొరేషన్గా ఆ బడ్జెట్ను ఆమోదించారు. ప్రస్తుతం మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటైనందున మౌలిక సదుపాయాలకు మరిన్ని నిధులవసరం. రెండు కొత్త కార్పొరేషన్లు తమకు ప్రత్యేకంగా బడ్జెట్ను రూపొందించుకోవాల్సి ఉంది. జీహెచ్ఎంసీ పరిధి మారినందున దాని బడ్జెట్నూ సవరించాల్సి ఉంటుంది మూడు కార్పొరేషన్లుగా రూపాంతరం చెందకముందు రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.400 కోట్లు గ్రాంట్స్, క్యాపిటల్ గ్రాంట్స్గా రూ.3,100 కోట్లు ఇవ్వగలదని భావించారు. కానీ కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుతో నగర ముఖచిత్రమే మారినందున మరిన్ని నిధులు అవసరమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు నిధులు కేటాయిస్తుందన్నది చూడాలి. బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించనిదే జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలు మనుగడ సాగించలేని పరిస్థితి. గత మూడేళ్లలో ఇలా.. ఆర్థిక సంవత్సరం ప్రతిపాదన బడ్జెట్ కేటాయింపు (రూ. కోట్లలో) 2025-2026 5,500 3,385 2024-2025 5,650 3,385 2023-2024 5,937 1,960 -
ఆహార కల్తీని అరికడదాం
87126 61212కు ఫోన్ చేయండి అబిడ్స్: నగరంలో ఆహార భద్రతను పటిష్టం చేయడానికి, కల్తీని అరికట్టడానికి హైదరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో (హెచ్–ఫాస్ట్) ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. గురువారం న్యూ ఉస్మాన్గంజ్ రోడ్డులోని పాత బేగంబజార్ పోలీస్స్టేషన్ భవనంలో ఈ టీమ్ కార్యాలయాన్ని ఐపీఎస్ అధికారి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రారంభోత్సవం చేశారు. జంట నగరాల్లో ఆహార కల్తీని నిరోధించేందుకు కొత్వాల్ వీసీ సజ్జనర్ నేతృత్వంలో, ఫుడ్ సేఫ్టీ అధికారుల సమన్వయంతో హెచ్–ఫాస్ట్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆహార కల్తీకి పాల్పడితే 87126 61212కు ఫిర్యాదు చేయవచ్చు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు రంజిత్కుమార్ గౌడ్, అంజయ్య, సబ్ ఇన్స్పెక్టర్లు రమ్య, అభిలాష్, అఖిల్, కృష్ణ పాల్గొన్నారు. -
ఆర్జీఐఏ సిబ్బంది ఉత్తమ సేవలకు మరోసారి అవార్డు
శంషాబాద్: విమానాశ్రయంలో సిబ్బంది అందించే ఉత్తమ సేవలకు గాను ఆర్జీఐఏ మరోసారి అవార్డును దక్కించుకుంది. ‘స్కైట్రాక్’ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణికుల ద్వారా చెక్ ఇన్, భద్రత, ఇమిగ్రేషన్ తదితర అంశాల్లో ప్రయాణికుల అనుభవాన్ని క్రోడీకరించి ఈ అవార్డును అందజేస్తారు. ఈ మేరకు 2026 ‘బెస్ట్ ఎయిర్పోర్టు స్టాఫ్ ఇన్ ఇండియా, సౌత్ ఏషియా ’ అవార్డును లండన్లో నిర్వహించిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పోలో అందజేసినట్లు ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఆర్జీఐఏ ప్రయాణంలో ఈ అవార్డును అందుకోవడం ఐదోసారి అని తెలిపారు. -
ఇక చెల్లింపులే కీలకం!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో మొదటి దశ స్వాధీన ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో చర్చలు,సమీక్షలు, కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసిన హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఈ ప్రక్రియను ఎలాంటి జాప్యానికి తావు లేకుండా మరో 10 రోజుల్లో పూర్తిచేసే విధంగా ముందుకు సాగుతోంది.మరోవైపు మెట్రో టోకోవర్తో పాటు రెండోదశ నిర్మాణం కోసం భూసేకరణ, మౌలికసదుపాయాలు, తదితర అవసరాల కోసం ఈ బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మెట్రో టేకోవర్ పురోగతిని సమీక్షించారు. బకాయీల చెల్లింపుతో పాటు, వివిధ అంశాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా టేకోవర్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవసరమైన దిశానిర్దేశాన్ని సూచించారు.మరోసారి మంత్రిమండలిలోనూ టేకోవర్ పైన విస్తృతమైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో స్వాధీనం దృష్ట్యా చెల్లించవలసిన రూ.13000 కోట్ల రుణాల కోసం 3 శాతం వడ్డీపైన నిధులను అందజేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ)ఇప్పటికే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ మేరకు హెచ్ఎంఆర్ఎల్తో ఒప్పందం కూడా ఖరారైంది.ఎల్అండ్టీకి ఇవ్వాల్సిన రూ.2000 కోట్ల బకాయీలను మాత్రం ప్రభుత్వమే చెల్లించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో మెట్రో ప్రాజెక్టుకు ప్రభుత్వం కేటాయించనున్న నిధులతో ఇది స్పష్టం కానుంది. ఈ రెండు ఆర్ధిక అంశాలు ఒక కొలిక్కి వస్తే ఎల్అండ్టీ వైదొలగడంతో పాటు మూడు కారిడార్లలోని 69.2 కి.మీ.మెట్రో మొదటి దశ ప్రాజెక్టు సర్కార్ స్వాధీనంలోకి రానుంది.అలాగే మెట్రో రైళ్ల నిర్వహణపై ఫ్రాన్స్కు చెందిన కియోలిస్ సంస్థతో ఏర్పాటు చేసుకొన్న ఒప్పందం ఈ ఏడాది నవంబర్తో ముగియనున్న దృష్ట్యా మరో ఏడాది పాటు ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగనున్నప్పటికీ రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల సదుపాయాలు, సమయపాలన, తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. దశలవారీగా టేకోవర్.... ● మెట్రో రెండో దశ డీపీఆర్లపై కేంద్రం పలు సందేహాలు లేవనెత్తడంతో మొదటి దశ చర్చనీయాంశమైంది. మొదటి దశ కారిడార్లలోంచి రెండోదశ కారిడార్లకు ప్రయాణికుల రాకపోకలు కొనసాగనున్న దృష్ట్యా టిక్కెట్లపైన ఆదాయం పంపకాలు, విద్యుత్ ఖర్చులు, తదితర అంశాలపై ఎల్అండ్టీ నుంచి స్పష్టత రావలసి ఉందని కేంద్రం సూచించింది. ● ఈ క్రమంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించి, నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, సుమారు రూ.6000 కోట్ల నష్టాలతో ప్రాజెక్టును నడిపించవలసి వస్తుందని ఎల్అండ్టీ కేంద్రానికి తెలిపింది.అదే సమయంలో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగనున్నట్లు వెల్లడించింది. ● గతేడాది సెప్టెంబర్లో ఎల్అండ్టీ తన వైఖరిని వెల్లడించడంతో ప్రభుత్వం ఆ సంస్థతో చర్చలు జరిపింది. ప్రాజెక్టు నుంచి తప్పించుకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎల్అండ్టీ మరోసారి స్పష్టం చేసింది. ● దీంతో మెట్రో మొదటిదశను స్వాధీనం చేసుకొనేందుకు ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేయడమే కాకుండా కార్యాచరణ చేపట్టింది. ఎల్అండ్టీతో వివిధ స్థాయిల్లో చర్చలు జరిపిన అనంతరం మొత్తం రూ.15000 కోట్ల రుణాలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కన్సల్టెన్సీల ఏర్పాటు... ● అనంతరం ఆర్ధిక అంశాలపైన ఐడీబీఐ క్యాపిటల్, సాంకేతిక అంశాలపైన ఢిల్లీ మెట్రోరైల్ మూడు నెలల పాటు అధ్యయనం చేసి నివేదికలను అందజేశాయి. ● ఈ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం వల్ల రెండో దశకు ఉన్న ఆటంకాలు తొలగడంతో పాటు ఎల్అండ్టీ సంస్థకు ప్రభుత్వం లీజుకు ఇచ్చిన 269 ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వం చేతికి రానుంది. ● అలాగే 5 మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న మాల్స్ను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ● ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి హైదరాబాద్ మెట్రోరైల్ కార్పొరేషన్ (హెచ్ఎంఆర్ఎల్) నిర్వహణలో కొనసాగనుంది. చివరి అంకానికి చేరుకున్న మెట్రో టేకోవర్ మరో 10 రోజుల్లో సర్కార్ స్వాధీనంలోకి... బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం -
సంప్రదాయాలతోనే సమతుల్యత
మణికొండ: ప్రకృతి, పండగలు, సంప్రదాయాలు ఆచరించినపుడే జీవితంలో సమతుల్యత సాధ్యమని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. గురువారం ఉగాది పండగను పురస్కరించుకుని కోకాపేట నియోపోలీస్లోని పీఠంలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. ఉదయం 9గంటల నుంచి శ్రీశారదా చంద్రమౌళీశ్వర ఆరాధన, సంగీత విహారి, పంచాంగ ఆవిష్కరణ, పంచాంగ శ్రవణం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే విశాఖలో ఉన్న పీఠం మాదిరిగానే కోకాపేటలోను ఏర్పాటు చేయాలని నిర్ణయించి పనులను కొనసాగిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలు సుబిక్షంగా ఉండి, అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం రెండు రాష్ట్రాల ప్రజలకు సంపూర్ణంగా ఉంటుందన్నారు. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. పంచాంగం, నక్షత్రాలు, గ్రహణాలు వంటి అంశాలు మూఢనమ్మకాలు కావని, వాటిపై మన రుషులు పరిశోధనలు చేసి వాటిని మనకు అందించారన్నారు. వాటి ఆదారంగానే సముద్రపు అలల మార్పు, జంతువుల ప్రవర్తన, చెట్లు చిగురించటం లాంటివి సృష్టిలో ఎన్నో జరుగుతున్నాయన్నారు. ఈ సంవత్సరం గురువు అధిపతి కాబట్టి అంతా బాగుంటుందని, ప్రతి రోజు ఉదయం సూర్యారాధన చేసే వారికి మరింతగా బాగుంటుందన్నారు. జూలై నెల నుంచి ఇక్కడే ఉండి పీఠం రాజశ్యామల అమ్మవారి దేవాలయ నిర్మాణ పనులను చూసుకుంటానన్నారు. కార్యక్రమంలో పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్కుమార్, జస్టిస్ రామకృష్ణారెడ్డి, పట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్రావు, ఎన్సీఎల్టీ న్యాయ సభ్యుడు జస్టిస్ బద్రీనాథ్, మాజీ న్యాయమూర్తి మఠం వెంకటరమణ, హరియాణ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మురళీధర్రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, డీఆర్డీఏ మాజీ చైర్మెన్ సతీష్రెడ్డి, మాజీ డీజీపీ అంజనీకుమార్, గజల్ గాయకుడు శ్రీనివాస్లతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. విశాఖ శ్రీశారదా పీఠాధిపతిస్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి -
మణికొండ వేదకుమార్కు అరుదైన గుర్తింపు
ఇంటాక్ న్యూఢిల్లీ గవర్నింగ్ కౌన్సిల్కు నాలుగోసారి ఎన్నిక హిమాయత్నగర్: డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ మణికొండ వేదకుమార్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్, కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్), న్యూఢిల్లీ గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో నాలుగోసారి ఎన్నికై నట్లు డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ సెక్రెటరి కట్టా ప్రభాకర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వేదకుమార్ అర్బన్, రీజనల్ ప్లానర్, అంకితభావంతో పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ఇంటాక్ చరిత్రలోనే అత్యధిక ఓట్లు సాధించడం ఆయన నిబద్ధత, విశ్వసనీయత, వారసత్వ సంరక్షణలో చేసిన విశిష్ట సేవలను ప్రతిబింబిస్తోందని అన్నారు. -
డీపీతో టోపీ!
నగర వ్యాపారి ఫొటో వాట్సాప్ డీపీగా వినియోగం సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ మహిళా వ్యాపారి ఫొటోను వాట్సాప్ డిస్ప్లే పిక్చర్గా (డీపీ) ఏర్పాటు చేసుకున్న సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంటెంట్కు టోకరా వేశారు. ఆమె పంపినట్లుగా సందేశం పంపి రూ.1.2 కోట్లు కాజేశారు. మరో రూ.18 లక్షలు స్వాహా చేయడానికి ప్రయత్నించగా... విషయం సదరు వ్యాపారికి తెలిసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బంజారాహిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే సదరు సంస్థకు దేశ వ్యాప్తంగా క్లైంట్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు ఖాతాల్లోకి వీరి ఖాతా నుంచి లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. యజమానురాలి నుంచి వచ్చే మౌఖిక ఆదేశాలు, సందేశాల ఆధారంగా అక్కడ అకౌంటెంట్ ఈ లావాదేవీలు చేస్తూ ఉంటారు. దీన్నే సైబర్ కేటుగాళ్లు క్యాష్ చేసుకున్నారు. ఇంటర్నెట్ ద్వారా ఈ సంస్థ యజమానురాలితో పాటు ఇతర ఉద్యోగుల వివరాలను సంగ్రహించారు. నెట్ నుంచే సంగ్రహించిన యజమానురాలి ఫొటోను తమ వాట్సాప్ నెంబర్కు డీపీగా పెట్టారు. ఈ నెంబర్ నుంచి ఈ ఈ నెల 13 మధ్యాహ్నం 3.30 గంటలకు అకౌంటెంట్కు ఓ సందేశం పంపారు. అందులో పొందుపరిచిన బ్యాంకు ఖాతాకు రూ.1.2 కోట్లు బదిలీ చేయమంటూ ఆ సందేశంలో ఉంది. తమకు సందేశం వచ్చింది కొత్త నెంబర్ నుంచే అయినప్పటికీ... డీపీగా యజమానురాలి ఫొటోనే ఉండటంతో అకౌంటెంట్ నమ్మాడు. అది తన యజమానురాలికి చెందిన మరో నెంబర్గా భావించాడు. తరచు ఆమె నుంచి ఇలాంటి సందేశాలు రావడం, నగదు బదిలీలు జరగడం మామూలే కావడంతో ఆ సందేశంలో ఉన్న ఢిల్లీకి చెందిన సంస్థ బ్యాంకు ఖాతాకు రూ.1.2 కోట్లు బదిలీ చేశాడు. ఆ రోజు తన యజమానురాలు హైదరాబాద్లో లేకపోవడంతో ఈ వివరాలను తన రికార్డుల్లో పొందుపరిచినా.. ప్రత్యేకించి ఆమె దృష్టికి తీసుకువెళ్లలేదు. ఒకసారి తమ పథకం పారడంతో సైబర్ నేరగాళ్లు మళ్లీ రెచ్చిపోయారు. ఈ సంస్థ నుంచి మరికొంత దోచుకోవాలని భావించారు. ఇందులో భాగంగా మంగళవారం అదే వాట్సాప్ నెంబర్ నుంచి అకౌంటెంట్కు మరో సందేశం పంపారు. ఈసారి తమిళనాడులో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీ ఖాతాకు రూ.18 లక్షలు బదిలీ చేయాలని అందులో పొందుపరిచారు. తన యజమానురాలి ఫొటో డీపీగా ఉన్న కొత్త వాట్సాప్ నెంబర్ నుంచి మరో సందేశం రావడం, అందులో మరో రాష్ట్రంలోని బ్యాంకు ఖాతా వివరాలు ఉండటంతో అకౌంటెంట్ అనుమానించాడు. అందుబాటులో ఉన్న యజమానురాలి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లారు. దీంతో జరిగిన విషయం గుర్తించిన ఆమె నగర సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇన్పర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) యాక్ట్లోని 66సీ, 66 డీ, భారతీయ న్యాయ సంహితలోని (బీఎన్ఎస్) 318 (4), 319(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించడానికి వాళ్లు వినియోగించిన సెల్ఫోన్ నెంబర్తో పాటు నగదు బదిలీ అయిన బ్యాంకు ఖాతా వివరాలను విశ్లేషిస్తున్నారు. ఆ నెంబర్ వినియోగించి ఆమె అకౌంటెంట్కు సందేశం ఢిల్లీకి చెందిన బ్యాంక్ ఖాతాలోకి నగదు బదిలీకి ఆదేశం రూ.1.2 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు, కేసు నమోదు -
నిర్లక్ష్యపు నిప్పు
జూబ్లీహిల్స్లో భారీ అగ్ని ప్రమాదం బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–36లోని మెట్రోస్టేషన్ సమీపంలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ భవనంలో రెండు నెలల క్రితం వరకు మంగళగౌరీ అనే వస్త్ర దుకాణం కొనసాగింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా షోరూం ముందు భాగంలో గోపురం డెకరేషన్ను, ఎదురుగా ఫుట్పాత్పై ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. షాపు మూసివేసిన తర్వాత ఎవరూ రాకపోవడంతో గోపురం డెకరేషన్ను తొలగించాలని భవన యజమాని టీవీ సురేష్కుమార్ నిర్ణయించి సిరాజ్ అనే కాంట్రాక్టర్కు అప్పగించారు. కొబ్బరి నార అంటుకుని.. ఉదయం 11 గంటల వేళ గోపురం డెకరేషన్కు వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు రావడంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కోసం ఏర్పాటుచేసిన కొబ్బరినార అంటుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెల్డింగ్ చేస్తున్న వారితో పాటు మిగతా కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, హైడ్రా రంగంలోకి దిగి మూడు ఫైరింజన్లతో మంటలను రెండు గంటల పాటు శ్రమించి అదుపులోకి తీసుకువచ్చాయి. రెండు గంటల పాటు ఈ రోడ్డంతా స్తంభించిపోయింది. భవన యజమాని నిర్లక్ష్యం కారణంగానే.. ఈ బిల్డింగ్లో మంగళగౌరీ వస్త్ర దుకాణాన్ని రెండు నెలల క్రితమే మూసివేశారు. ప్రస్తుతం అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. బిల్డింగ్పై యజమాని టీవీ సురేష్కుమార్ ఒక అంతస్తును అక్రమంగా నిర్మించడంతో పాటు సెట్బ్యాక్లో ఒకవైపు జనరేటర్ ఏర్పాటు చేసి, ఇంకోవైపు గదులు నిర్మించారు. దీంతో ఫైర్తో పాటు హైడ్రా సిబ్బంది పైకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భవన యజమాని నిర్లక్ష్యం కారణంగానే అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని జూబ్లీహిల్స్ పోలీసులు భావిస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకున్నా అక్రమ నిర్మాణాలతో పాటు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. భారీగా ఆస్తినష్టం సంభవించిందని అంటున్నారు. అద్దాలు పగులగొట్టుకుని.. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు భవనం అద్దాలు పగులగొట్టుకుని బయటికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఉదయం 11.30 గంటల సమయంలో వీరంతా గ్రౌండ్ ఫ్లోర్లో పని చేస్తుండగా, ప్రధాన ద్వారం వద్ద ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో పక్కనే ఉన్న అద్దాలను పగులగొట్టుకుని వీరు బయటకు పరుగులుతీశారు. స్క్రాప్ గోదాంలో మరో ఘటన.. జీడిమెట్ల: నగరంలో గురువారం మరో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జీడిమెట్ల ఏస్వీ కోఆపరేటివ్ సొసైటీలోని స్క్రాప్ గోదాంలో భారీ ఎత్తున మంటలు అంటుకున్నాయి. మహ్మద్, ఇస్మాయిల్ అనే వ్యక్తులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ కవర్లు, అట్టపెట్టెలు, మెడికల్ వ్యర్థాలు తీసుకువచ్చి గోదాంలో డంప్ చేసి విక్రయిస్తుంటారు. సాయంత్రం 6 గంటలకు గోదాంలో కూలీలు పనులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన కూలీలు బయటికి పరుగులు తీశారు. జీడిమెట్ల ఫైర్ సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. అనుమతులు లేని గోదాంపై పోలీసులు కేసు నమోదు చేశారు. హంగులతో బెంగ వినియోగదారులను ఆకట్టుకొనేందుకు వ్యాపార సంస్థలు చేసే హంగూ ఆర్భాటాలు, ప్రత్యేక అలంకరణలు అగ్ని ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. వస్త్ర దుకాణాలు, వివిధ రకాల షోరూమ్లు భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి ఈ తరహా అలంకరణలకు పాల్పడుతున్నాయి. ఈ తరహా అగ్ని ప్రమాదాలపై జీహెచ్ఎంసీ, హైడ్రా తదితర విభాగాల అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం. తాజాగా గురువారం జూబ్లీహిల్స్లోని మంగళగౌరి వస్త్ర దుకాణం వద్ద జరిగిన ప్రమాదానికి సెట్టింగే కారణమని అధికారులు తేల్చారు. మొదట సెట్టింగ్కు మంటలు అంటుకొని ఆ తర్వాత షోరూమ్లోకి వ్యాపించడంతో భవనం దగ్ధమైంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా అలంకరణలు ఏర్పాటు చేస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. గోపురం డెకరేషన్కు వెల్డింగ్ చేస్తుండగా ఘటన వాణిజ్య భవనంలో ఎగిసిపడిన మంటలు అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది సహాయక చర్యలు ప్రాణం నష్టం జరగకపోవడంతో ఉపశమనం -
ముహూర్తం ఖరారు
సాక్షి, సిటీబ్యూరో: ఏడాదిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వెయ్యి పడకల సామర్థ్యమున్న సనత్నగర్ టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ప్రారంభోత్సవానికి మార్గం సుగమమైంది. వచ్చే నెల 19న దీనిని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఓపీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, ఇన్ వార్డులు, టెస్టింగ్ ల్యాబ్లు సిద్ధమవుతున్నాయి. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ట్యాబ్ టెక్నిషియన్లు, ఇతర సిబ్బందిని 3 నెలల డిప్యుటేషన్పై నియమించారు. గాంధీ, ఉస్మానియా, వనస్థలిపురం ప్రాంతీయ ఆసుపత్రి, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి 40 మంది సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉగాది రోజు నుంచి వైద్య సేవలు షురూ కానున్నాయి. గాంధీ, ఉస్మానియాలకు ఉపశమనం సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గనుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. వెయ్యి పడకల సామర్థ్యం, అత్యాధునిక శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉగాది నుంచి టిమ్స్లో మొదలవుతున్నాయి. నిత్యం నగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు 2,500 నుంచి 3 వేల ఓపీ ఉంటోంది. రోగుల తాకిడితో సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా వైద్య సేవల్లో నాణ్యత తగ్గే ప్రమాదం ఉంటుందని అభిప్రాయం ఉంది. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పిస్తే మెరుగైన వైద్య సేవలకు అవకాశం ఉంటుంది. గుండె చికిత్సలు సులువు సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రి గుండె శస్త్రచికిత్సలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవనుంది. రోగులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హార్ట్ ఆపరేషన్స్ కోసం క్యాత్ ల్యాబ్, అవయవ మార్పిడికి ప్రత్యేకంగా రూపొందించిన 16 ఆపరేషన్ థియేటర్లు, సీటీస్కాన్, ఎంఆర్ఐ, డిజిటల్ ఎక్స్రే, ఇతర అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రారంభం నాటికి 100 శాతం పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. సనత్నగర్ టిమ్స్ 19న ప్రారంభం ఉగాది రోజు నుంచే ఓపీ, ఐపీ, ఓటీ సేవలు డిప్యుటేషన్పై 40 మంది సిబ్బంది -
దొంగ తెలివి
పోలీసులు పట్టుకుంటున్నారు జాగ్రత్త సాక్షి, సిటీబ్యూరో: బతుకుదెరువు కోసం నేపాల్ నుంచి నగరానికి వస్తున్న కొందరు ఇక్కడ నేరాలు చేయడానికే మకాం వేస్తున్నారు. ఓ టార్గెట్ను ఎంపిక చేసుకుని, అవకాశం కోసం ఎదురుచూసి మరీ పంజా విసురుతున్నారు. ఈ ముఠాల్లోని కీలక సభ్యులు తమ లక్ష్యం ఏమిటన్నది నేపాల్లో ఉంటున్న తమ కుటుంబీకులకు చెబుతూ, ఎప్పటికప్పుడు వారి నుంచి అప్డేట్స్ తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్లో ఉన్న నందగిరిహిల్స్లో నివసించే ప్రముఖ వ్యాపారి రవీంద్రశర్మ ఇంట్లో ఈ నెల 5న భారీ చోరీ చేసిన నేపాలీ గ్యాంగ్ విచారణలో దీనికి సంబంధించిన కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న భూపేందర్ సాహి అలియాస్ భువన్ను ఫోన్లో అతడి భార్య పంపిన యూట్యూబ్ లింక్ ఉండటాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. నగరంలో ఉన్న తన భర్త భారీ నేరానికి స్కెచ్ వేస్తున్న విషయం తెలిసిన నేపాల్లోని భువన్ భార్య ఇక్కడ జరిగే నేపాలీ సంబంధిత నేరాలు, వాటిలో అరెస్టులు తదితరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. ఈ వార్తల్ని నేపాల్లో యూట్యూబ్ చానెళ్లు ప్రసారం చేస్తున్నాయి. నేరం పకడ్బందీగా చేయాలని సూచిస్తూ.. గత నవంబర్ 16న కార్ఖానా పోలీసుస్టేషన్ పరిధిలోని గన్రాక్ ఎన్క్లేవ్లో ఓ నేపాలీ గ్యాంగ్ భారీ చోరీ చేసింది. ఈ ముఠాలోని ఐదుగురిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దీనిపై గత డిసెంబర్ 8న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇది నేపాల్లో ఓ యూట్యూబ్ ఛానల్లో ప్రసారమైంది. దీని లింకునే వాట్సాప్ ద్వారా భువన్ భార్య గత నెల్లో అతడికి పంపి... నేరం జాగ్రత్తగా చేయాలని, హైదరాబాద్ పోలీసులు నేరగాళ్లను పట్టుకుంటున్నారని హెచ్చరించింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఇతడి ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఈ లింకు కనిపించింది. జూబ్లీహిల్స్ చోరీ కేసులో నిందితులైన జీవన్, కృష్ణ చాంద్ 2023లో మియాపూర్ పరిధిలో మరికొందరితో కలిసి నేరం చేసినట్లు తేలింది. ఆ ఏడాది అక్టోబర్ 15న రాకేష్ విశ్వనాథ్ తన కుటుంబంతో కలిసి కరీంనగర్లో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. అదే రోజు రాత్రి ఆ ఇంటి వాచ్మెన్గా ఉన్న నవీన్తో పాటు మరో వ్యక్తి రూ.80 లక్షల విలువైన సొత్తు ఎత్తుకుపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి దిగిన సైబరాబాద్ ఎస్ఓటీ టీమ్ నవీన్ సహా ముఠాను పట్టుకోగా... ఈ నేరం వెనుక జీవన్, కృష్ణ చాంద్ ప్రమేయం ఉన్నట్లు తేలింది. మరికొన్ని ఠాణాల్లోనూ కేసులు.. జూబ్లీహిల్స్ చోరీ కేసులో నిందితులపై నగరంలోని మరికొన్ని ఠాణాల్లోనూ కేసులు ఉన్నాయి. దీంతో ఆయా అధికారులు పీటీ వారెంట్లుపై అరెస్టు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. రవీంద్ర శర్మ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్న భువన్ ఈ నెల 3న కృష్ణ, కమల్లను నగరానికి రప్పించాడు. వీళ్లు లక్డీకపూల్లోని ఓ లాడ్జిలో బస చేశారు. దర్యాప్తులో ఈ విషయాలు గుర్తించిన అధికారులు సదరు లాడ్జి నుంచి రికార్డులతో పాటు ఈ ద్వయం దాఖలు చేసిన గుర్తింపు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5 రాత్రి రవీంద్రశర్మ కుటుంబం ఫంక్షన్కు వెళ్లడంతో అదే రోజు నేరం చేయాలని నిర్ణయించిన భువన్... కృష్ణ, కమల్ వేర్వేరుగా బయలుదేరి క్యాబ్స్లో నందగిరిహిల్స్కు చేరుకున్నారు. ఆ క్యాబ్ డ్రైవర్లను గుర్తించిన పోలీసులు వారి వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు చెల్లింపులకు సంబఽందించిన ఆధారాలూ సేకరించారు. మరోపక్క ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గత డిసెంబర్లో నేపాలీ గ్యాంగ్ అరెస్టు అక్కడ యూ ట్యూబ్ చానెళ్లలో ప్రసారమైన నగర నేర వార్తలు లింక్ను భర్తకు షేర్ చేసిన నిందితుడి భార్య జూబ్లీహిల్స్ చోరీ కేసులో వెలుగులోకి కీలకాంశాలు -
మెట్రోకు రుణాలిస్తాం
● సంసిద్ధత వ్యక్తంచేసిన ఐఆర్ఎఫ్ఆర్సీ ● వడ్డీ రేటు తగ్గింపునకు సంప్రదింపులు సాక్షి, సిటీబ్యూరో: మెట్రోకు రుణాలు ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్ఆర్సీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోరైల్ సంస్థకు, ఐఆర్ఎఫ్ఆర్సీకి మధ్య ప్రాథమికంగా అవగాహన ఏర్పడినట్లు సమాచారం. ఐఆర్ఎఫ్సీ అందజేసే రుణాలకు వడ్డీరేటుపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అతి తక్కువ వడ్డీ రేటుకు రుణాలిచ్చే భారతీయ ఆర్థిక సంస్థల్లో ఒకటైన ఐఆర్ఎఫ్సీ నుంచి 3 శాతం వడ్డీకి రుణాలను తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు 3 నుంచి 4 శాతం మధ్య వడ్డీరేటుపై బేరసారాలు కొనసాగుతున్నాయన్నారు. మెట్రో టేకోవర్లో భాగంగా మొత్తం రూ.15 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం చెల్లించాల్సిన విషయం తెలిసిందే. ఇందులో రూ.2 వేల కోట్లు ఎల్అండ్టీ బకాయిల చెల్లింపు కావడం గమనార్హం. కాగా.. 2017 నవంబర్ 28న ప్రధాని మోదీ.. మియాపూర్–ఎల్బీనగర్ రూట్లో మెట్రో సేవలను ప్రారంభించారు. ఆ తర్వాత దీని నిర్వహణలో ఎల్అండ్టీ చేతులెత్తేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం టేకోవర్ చేసిన విషయం విదితమే. -
ఫలితం పదిపోకుండా..
గ్రేటర్ పరిధిలో టెన్త్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం సాక్షి, సిటీబ్యూరో: మహా హైదరాబాద్ పరిధిలో పది ఫలితాల్లో వెనుకబాటుకు చెక్ పెట్టేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. గడిచిన నాలుగేళ్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విద్యా సంవత్సరం ‘వంద శాతం ఉత్తీర్ణత’ లక్ష్యంగా ‘టార్గెట్.. టెన్త్’ పేరుతో విద్యాశాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర గ్రామీణ జిల్లాలు ఫలితాల్లో దూసుకుపోతుంటే, అత్యాధునిక వసతులున్న నగర పరిధిలోని జిల్లాలు మాత్రం వెనుకబడి ఉండటంపై ఆయా యంత్రాంగాలు సీరియస్గా తీసుకున్నాయి. మూడు విభాగాలుగా.. పదో తరగతిలో వంద శాతం ఫలితాల సాధన కోసం విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా వారిని మూడు విభాగాలుగా విభజించి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. పాస్ మార్కులు సాధించడంలో ఇబ్బంది పడే వెనుకబడిన విద్యార్థులకు కనీస అభ్యసన సామగ్రితో పాటు శిక్షణ, సగటు మార్కులతో ఉత్తీర్ణులయ్యే వారిని పై తరగతికి చేర్చేలా ప్రోత్సాహం, ప్రతిభావంతులైన విద్యార్థులకు 10/10 జీపీఏ సాధించేలా ఉన్నత స్థాయి ప్రశ్నపత్రాలతో సాధనకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఉదయం, సాయంత్రం వేళ్లలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతోపాటు గత నాలుగేళ్ల ప్రశ్నపత్రాల విశ్లేషణ, నూతన పరీక్ష విధానంపై అవగాహన కల్పిస్తోంది. జిల్లా 2025 2024 2023 2022 హైదరాబాద్ 88.53 86.76 80.92 79.63 రంగారెడ్డి 87.84 91.01 87.35 90.04 మేడ్చల్–మల్కాజిగిరి 90.76 89.61 90.72 86.31 గత ఏడాది ఇవీ స్థానాలు.. మహా హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు పదో తరగతిలో నాలుగేళ్ల నుంచి వెనుకబాటు తప్పడం లేదు. గతేడాది రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ 30 వ స్థానం, మేడ్చల్–మల్కాజిగిరి 28 వ, రంగారెడ్డి జిల్లా 31వ స్థానానికి దిగజారాయి. -
రాష్ట్రం నుంచి ఇద్దరు,ముగ్గురు ఒలింపియన్లు
బంజారాహిల్స్: తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ (టీఆర్ఏ) ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా నిర్వహించిన స్పోర్ట్స్ షూటింగ్ లీడర్షిప్ కాన్క్లేవ్–2026 విజయవంతంగా ముగిసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని టీఆర్ఏ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. మాజీ ఎంపీ, క్రీడా సలహాదారు జితేందర్రెడ్డి మాట్లాడుతూ... 2032 నాటికి తెలంగాణ నుంచి కనీసం ఇద్దరు, ముగ్గురు ఒలింపియన్లు తయారుచేయగలమనే విశ్వాసం వ్యక్తం చేశారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు కాలికేష్ నారాయణ్సింగ్ మాట్లాడుతూ... మౌలిక వసతుల మెరుగుదల, శాసీ్త్రయ కోచింగ్, ఏఐ ఆధారిత విశ్లేషణపై దృష్టి పెట్టాలని సూచించారు. టీఆర్ఏ అధ్యక్షుడు అమిత్ సంఘి మట్లాడుతూ.. షూటింగ్ క్రీడ ప్రశాంతంగా కనిపించినా అత్యధిక ఒత్తిడి, క్రమశిక్షణ, ఏకాగ్రత అవసరమయ్యే క్రీడ అని పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేష్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డైరెక్టర్, ఎండీ సోనిబాలదేవి తదితర ప్రముఖులు హాజరయ్యారు. -
కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టురట్టు
సాక్షి, సిటీబ్యూరో : జేజే ఫుడ్స్ పేరుతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎస్ మఖ్తా రైల్వే గేట్ సమీపంలోని ఓ ఇంటిపైన నిర్వహించిన దాడుల్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటపడింది.అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, ఆరోగ్యానికి హానికరమైన రీతిలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ తనిఖీల్లో ఆబిడ్స్కు చెందిన జసాని ఇల్యాన్ (21)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘జేజే ఫుడ్స్’ పేరుతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ వ్యాపారం చేస్తున్నాడు.ఈ పేస్ట్ను బహిరంగంగా ప్లాస్టిక్ టబ్బులలో ఉంచడం వల్ల దుమ్ము, ధూళి, ఈగలు వచ్చి చేరాయి. అలాగే ఈ జేజే ఫుడ్స్ కాలం చెల్లిన ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ను కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఈ కల్తీ పేస్ట్ను హోటళ్లు, కిరాణా షాపులకు సరఫరా చేస్తున్నాడు. ఈ తనిఖీల్లో పోలీసులు మొత్తం 4000 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం లేక్ పోలీసులకు అప్పగించారు. ఈ తనిఖీల్లో ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి.రాఘవేందర్, ఎస్ఐ జి. శ్రీకాంత్, లేక్ పోలీస్స్టేషన్ ఎస్ఐ ఎన్. శివ శంకర్,తదితరులు ఉన్నారు. -
త్వరలో అంబేడ్కర్ టవర్ నిర్మాణం
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కవాడిగూడ: లోయర్ ట్యాంక్బండ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవనం స్థానంలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అంబేడ్కర్ టవర్ నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అంబేడ్కర్ టవర్ నిర్మిస్తామని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి వదిలేశారని ఆరోపించారు. గురువారం లోయర్ ట్యాంక్ బండ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవనాన్ని వివిధ దళిత సంఘాల విజ్ఞప్తి మేరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుతోపాటు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వీలైనంత త్వరగా అంబేడ్కర్ టవర్ను నిర్మించే బాధ్యత సాంఘిక సంక్షేమ మంత్రిగా తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంబేడ్కర్ టవర్ నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజలు దళిత సంఘాలు భాగస్వాములై పూర్తి స్థాయిలో సహకరించలని మంత్రి కోరారు. -
నిరుద్యోగులను పట్టించుకోని రేవంత్రెడ్డి
ఖైరతాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల కృషితో ముఖ్యమంత్రి అయి ఇప్పుడు నిరుద్యోగులను మర్చిపోయారని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. గురువారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డీఎస్పీ, 40వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తా నిరుద్యోగం లేకుండా చేస్తా అని చెప్పారు.. కానీ ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారని, ఎంతో మంది జీవితాలు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లిపోయానన్నారు. ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు డీఎస్సీ వేసే వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ర్యాగ అరుణ్కుమార్, నీల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కొక్కరిపై ఒక్కోలా.. ఏఐ ప్రభావం
ఖైరతాబాద్: భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రభావం ప్రతి ఒక్కరిపై వేర్వేరుగా ఉంటుందని, అందుకు అనుగుణంగా విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని టీఆర్అండ్బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్రాజ్ అన్నారు. గురువారం ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో క్యాంపస్ టు కేపబిలిటీ కాన్క్లేవ్–2026 పేరుతో రక్షణ, ఏరోస్పేస్లో విద్య, పరిశ్రమల మధ్య అంతరాన్ని ఎలా తగ్గించాలనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వికాస్ రాజ్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యంతో సమాజానికి ఎలా ఉపయోగపడగలమనే విధంగా ఆలోచించాలన్నారు. మిధాని సీఎండీ ఎస్వీఎస్.నారాయణ మూర్తి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్టారెడ్డి, ఐఈఐ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ రమణానాయక్, గౌరవ కార్యదర్శి మర్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
కార్గోలో ఇన్నొవేటివ్ ఎయిర్పోర్టుగా ఆర్జీఐఏకు అవార్డు
శంషాబాద్: ఎయిర్ కార్గో ఇండియా విభాగంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో విభాగానికి ఇన్నోవేటివ్ ఎయిర్పోర్టుగా అవార్డు దక్కినట్లు ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి. షిప్పింగ్ ట్రాన్స్పోర్టు ఎవియేషన్ ట్రేడ్ (ఎస్టీఏటీ) పబ్లిషింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ అవార్డు దక్కిందని తెలిపారు. ఎయిర్ కార్గోలో జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేక మైలురాళ్లు దాటిందన్నారు. దేశంలో మొదటి సారిగా ఎయిర్సైడ్ టెంపరేచర్ కంట్రోల్ రిఫర్ ట్రక్, అన్ బ్రోకెన్ కోల్డ్ చైన్, ఫ్లైట్ ఇన్పర్మేషన్ డిస్ప్లే కేంద్రం, త్వరిత గతిన రక్షణ చర్యలు సంబంధిత అంశాల్లో జీఎంఆర్ కార్గో అందిస్తున్న సేవలకుగాను ఈ గుర్తింపు దక్కిందన్నారు. -
విశ్వాసం చూపిన శునకం
రామంతాపూర్ : యజమాని మరణించడంతో ఓ పెంపుడు శునకం అతని భౌతికకాయం వద్దే ఉండిపోయింది. అక్కడక్కడే తిరుగుతూ అతనిపై తనకున్న విశ్వాసాన్ని చాటుకుంది. రామంతాపూర్ నెహ్రూనగర్కు చెందిన మాజీ రైల్వే ఉద్యోగి ముత్తినేని లక్ష్మయ్య (93) బుధవారం సాయంత్రం రైల్వే ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన పార్థివ దేహాన్ని ఇంటి ముందు ఫ్రీజర్లో ఉంచినప్పటినుంచీ గురువారం సాయంత్రం అంతిమయాత్ర నిర్వహించే వరకు ఫ్రీజర్ చుట్టూ పెంపుడు శునకం తిరుగుతూ విశ్వాసం చాటుకుంది. తినడానికి ఆహారం పెట్టినా కనీసం అటువైపు కూడా చూడకుండా భౌతికకాయం వద్దే పడుకుంది. అంత్యక్రియలకు హాజరైన వారు ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయారు. -
అనుమానం రాకుండా మైనర్ల వినియోగం!
సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రా–ఒడిశా బోర్డర్ సహా ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి ఉత్పత్తి చేసి, నగరానికి సరఫరా చేసే ముఠాలు తెలివి మీరుతున్నాయి. ఈ రవాణాపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మైనర్లను క్యారియర్లుగా వినియోగిస్తున్నాయి. చార్మినార్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన ముఠాతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం ఏడుగురిని అరెస్టు చేయగా వీరిలో ముగ్గురు బాలురు ఉన్నారని అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు ప్రకటించారు. వీరి నుంచి రూ.16 లక్షల విలువైన 23 కేజీల గంజాయి, వాహనం, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఒడిశాలోని మల్కాన్గిరికి చెందిన కిషోర్ తక్రి అక్కడ గంజాయి పండించే వారి నుంచి సరుకు సేకరించి నగరానికి అక్రమ రవాణా చేసి విక్రయిస్తుంటాడు. రెండు మూడేళ్లుగా ఈ దందా చేస్తున్న ఇతడిని 2024, 2025ల్లో ఒడిశాలోని మోటు పోలీసులు పట్టుకున్నారు. గంజాయి ప్యాకెట్లు తీసుకువస్తుండగా అనుమానించిన అధికారులు తనిఖీ చేసి అరెస్టు చేశారు. దీంతో పోలీసులు అనుమానించని పంథాలో సరుకు రవాణా చేయాలని ఇతగాడు నిర్ణయించుకున్నాడు. దీనికోసం మల్కాన్గిరితో పాటు కోరాపుట్కు చెందిన మైనర్లను ఎంచుకున్నాడు. వీరిని ఒక్కో ట్రిప్నకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. రెండుమూడు రోజులు సాగే ఈ ప్రయాణంలో వారికి అయ్యే ఖర్చంతా కిషోరే భరిస్తాడు. తాను అప్పగించిన గంజాయి నింపిన బ్యాగ్స్ లేదా బాక్సుల్ని హైదరాబాద్ వరకు తీసుకువచ్చి అప్పగించడమే వీరి పని. బస్సు, రైళ్లల్లో వీరితో కలిసే, కొద్దిదూరంలో ఉంటూ ప్రయాణించే ఇతడు పోలీసులకు అనుమానం రాకుండా చూసుకుంటున్నాడు. ఒడిశాకు చెందిన ఇంద్ర మాది, సంజయ్ వద్ద కిలో గంజాయి రూ.4 వేలకు ఖరీదు చేస్తున్న కిషోర్ దాన్ని ధూల్పేట్కు చెందిన శంకర్ సింగ్కు రూ.ఏడు వేలు చొప్పున విక్రయిస్తున్నాడు. గతంలో కొన్నిసార్లు ఇలానే ఖరీదు చేసిన శంకర్ ఆ సరుకును స్థానికంగా ఉన్న పెడ్లర్స్కు మరింత రేటుకు విక్రయిస్తున్నాడు. తాజాగా ధూల్పేట్కు చెందిన వినయ్ సింగ్ తనకు 23 కేజీలు కావాలంటూ శంకర్కు చెప్పాడు. దీంతో ఫోన్ పే ద్వారా రూ.1.40 లక్షలు కిషోర్కు చెల్లించి ఆర్డర్ ఇచ్చాడు. కిషోర్ ఈ గంజాయిని అక్కడే ఉండే బలరాం నుంచి ఖరీదు చేసి 11 ప్యాకెట్లుగా పార్శిల్ చేశాడు. దీన్ని బంధువులైన మహిళలు పన్మతి తక్రి, లక్ష్మి తక్రిలతో పాటు ముగ్గురు మైనర్లకు అప్పగించాడు. వీరిని ఓ కుటుంబం మారిదిగా పేర్కొంటూ ప్రైవేట్ బస్సులో హైదరాబాద్ బయలుదేరాడు. ఈ సరుకు తీసుకోవడానికి శంకర్ ఎంజీబీఎస్ సమీపంలోకి వచ్చాడు. ఈ దందాపై చార్మినార్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ ఎస్.సైదాబాబు నేతృత్వంలో ఎస్సైలు కె.రామారావు, ఎం.మహేష్, ఎం.మధు, కె.స్వామి, కానిస్టేబుల్ హరీష్ కుమార్ వలపన్ని ఏడుగురినీ పట్టుకున్నారు. వీరితో పాటు స్వాధీనం చేసుకున్న సరుకునూ తదుపరి చర్యల నిమిత్తం అఫ్జల్గంజ్ పోలీసులకు అప్పగించారు. వీరి విచారణలో వినయ్ సింగ్ పేరు వెలుగులోకి రావడంతో అతడి కోసం గాలిస్తున్నారు. వెలుగులోకి గంజాయిస్మగ్లర్ల కొత్త ఎత్తులు ప్యాకెట్లు మోసేందుకు బాలుర వినియోగం రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు చెల్లింపు ఏడుగురిని అరెస్టు చేసిన చార్మినార్ టాస్క్ఫోర్స్ -
జలమండలి..చలో బస్తీ
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల తాగునీరు, మురుగునీటి సమస్యల సత్వరమే పరిష్కారమే లక్ష్యంగా జలమండలి సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టనుంది. ‘బస్తీ బాట’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ప్రారంభించనుంది. మేనేజింగ్ డైరెక్టర్ నుంచి వార్డు స్థాయి మేనేజర్ల వరకూ బస్తీబాట పట్టనున్నారు. జల మండలి పరిధిలోని బస్తీ, కాలనీల్లో మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు తాగునీరు, సీవరేజీ సమస్యలు గుర్తిస్తారు. ప్రజలతో మాట్లాడి తాత్కాలిక సమస్యలు తక్షణమే పరిష్కరిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అధికారులు యథావిధిగా కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారు.పర్యటనలో ప్రాధాన్య అంశాలివే..మురుగునీటి సమస్య: మ్యాన్హోల్స్ పరిస్థితి, పైపులైన్ లీకేజీలు, ఓవర్ఫ్లో, డీసిల్టింగ్ పనుల పర్యవేక్షణ.తాగునీటి సరఫరా: నీటి వృథా, లీకేజీలు, లో–ప్రెషర్ సమస్యలు, మోటార్ల అక్రమ బిగింపును అరికట్టడం. నీటి నాణ్యతను స్వయంగా పరిశీలించడం.అవగాహన: భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, ఇంజక్షన్ బోర్వెల్స్ ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం. బస్తీబాట పర్యటన తీరును పరిశీలించేందుకు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్, జాయింట్ ఎండీ, డైరెక్టర్లు, రీజియన్ ఈడీలు, డైరెక్టర్ (ఆపరేషన్)లు, జోన్ సీజీఎం, జనరల్ మేనేజర్లు, సర్కిల్ డీజీఎంలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు.రోజువారీ నివేదికప్రతి వార్డు మేనేజర్ పర్యటన రోజువారీ కార్యక్రమానికి సంబంధించిన నివేదికను ఆన్లైన్ యాప్లో సర్కిల్ డీజీఎంలకు పంపిస్తారు. సర్కిల్ డీజీఎంలు సర్కిల్ వారీగా జోన్లకు, జోన్్ నుంచి రీజియన్కు, రీజియన్ నుంచి కేంద్ర కార్యాలయానికి ఆన్లైన్ నివేదికలు సమర్పిస్తారు. వీటిపై ప్రతి వారం శనివారం సమీక్ష సమేవేశం నిర్వహిస్తారు.మెరుగైన సేవల కోసమే..నగర వాసులకు తాగునీరు, సీవరేజీ సమస్యలు లేకుండా మరింత మెరుగైన సేవలందించేందుకు బస్తీబాట చేపడుతున్నాం. క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటాం.– అశోక్ రెడ్డి, జలమండలి ఎండీ -
విలువల విద్యతో దేశ సమగ్రత
కుత్బుల్లాపూర్: విలువలతో కూడిన విద్య, నైతికత దేశ సమగ్రతకు తోడ్పాటునందిస్తాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. జీడిమెట్లలో బీడీఎల్ ఆధ్వర్యంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ కేంద్రం భవన నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్తో పాటు రెడ్క్రాస్, ఎన్సీసీ వంటి సంస్థలతో భాగస్వామ్యం చేసుకుంటూ దేశ బలోపేతానికి పాటుపడాలని సూచించారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ కేంద్రానికి బాడెన్ పావెల్ మెమోరియల్ హాల్ నామకరణం చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.దానకిషోర్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ బీఎస్శర్మ, బీడీఎల్ డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ గాయత్రి ప్రసాద్, జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) విజయేందర్ రెడ్డి, ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్ కుమారి పాల్గొన్నారు. -
మూసీ భూ సేకరణలో న్యాయం చేస్తాం
రైతులకు ఆర్డీఓ హామీశాస్త్రిపురం: మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం సేకరించే భూములకు సంబంధించి ప్రతి రైతుకూ న్యాయం చేస్తామని రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డి అన్నారు. గురువారం హైదర్గూడలో మూసీ డెవలప్మెంట్ గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాము కోల్పోయిన భూములకు నష్ట పరిహారంగా భూములే ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. వ్యవసాయ భూముల్లో కాయగూరలు, ఆకుకూరలు పండించుకుంటున్నామని, తమకు న్యాయం చేయాలని ఆర్డీవో వెంకట్రెడ్డికి రైతులు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన.. ప్రతి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
సమాంతర ప్రగతి సాధ్యమా?
సాక్షి, సిటీబ్యూరో : క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్) పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రజలందరికీ సమాన అభివృద్ధి, సమాన సదుపాయాల కోసమే ఉమ్మడి జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించినట్లు ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ, అది సాధ్యమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మూడు కార్పొరేషన్ల ఆదాయం, చేయాల్సిన పనుల్లో ఎంతో వ్యత్యాసం ఉండటమే ఇందుకు కారణం.ఉమ్మడి జీహెచ్ఎంసీలోనూ కొన్ని జోన్లలో ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ ఆదాయం ఉంది. కానీ, ఎక్కువ పరిధి ఉన్నందున.. ఆదాయం లేని ప్రాంతాల్లో సైతం మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటైనందున ఎక్కడి ఆదాయాన్ని అక్కడే వినియోగించాల్సి ఉంటుంది.జీహెచ్ఎంసీలో..జీహెచ్ఎంసీకి అత్యధిక ఆదాయ వనరు ఆస్తిపన్ను. చార్మినార్ జోన్లో ఈ ఆర్థిక సంవత్సర ఆస్తిపన్ను డిమాండ్ రూ.534 కోట్లు కాగా, గత నెలాఖరు వరకు వసూలైంది కేవలం రూ. 53 కోట్లు మాత్రమే. అదే తరుణంలో శేరిలింగంపల్లి జోన్ డిమాండ్ రూ.675 కోట్లు కాగా, వసూలైంది రూ.306 కోట్లు. ప్రస్తుతం చార్మినార్ జోన్ జీహెచ్ఎంసీలో ఉండగా, శేరిలింగంపల్లి ఎంఎంసీలో ఉండటం తెలిసిందే. గతంలోఉమ్మడి జీహెచ్ఎంసీలో చార్మినార్ జోన్లో సైతం ఇదేతీరున ఆదాయం ఉన్నా, మిగతా జోన్ల మాదిరిగానే పనులు చేసేవారు.వచ్చిన ఆదాయాన్నే అన్ని జోన్లకూ వినియోగించేవారు. ప్రస్తుతం చార్మినార్ జోన్లో పనులు చేయాలన్నా జీహెచ్ఎంసీ పరిధిలోని ఆదాయాన్నే పంచినా జీహెచ్ఎంసీలో ఎక్కువ ఆస్తిపన్ను వసూలయ్యేది ఖైరతాబాద్ జోన్లో మాత్రమే. మిగతా జోన్లలో అంతంతమాత్రమే. ఆ జోన్ల అవసరాలకే అవి సరిపోవు. ఖైరతాబాద్ జోన్లో ఆస్తిపన్ను ద్వారా రూ.330 కోట్లు రాగా, మిగతా జోన్లలో రూ. 100 కోట్ల లోపునే ఉంది. డిమాండ్ దృష్ట్యా చూస్తే ఖైరతాబాద్ జోన్లోనూ వసూలు అంతంతమాత్రమే అని చెప్పక తప్పదు. చార్మినార్ జోన్లో మరీ తక్కువగా ఉన్నందున ఆ జోన్లో పనులు చేయకుండా ఉంటారా ? ఉంటే అక్కడి ప్రజాప్రతినిధులు ఊరుకుంటారా? ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే.ఎంఎంసీలోనూ..ఎంఎంసీలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. అక్కడి మూడు జోన్లలో మల్కాజిగిరి ఆస్తిపన్ను డిమాండ్ రూ.899 కోట్లు కాగా, వసూలైంది మాత్రం రూ.131 కోట్లే. ఈ కార్పొరేషన్లోని మూడు జోన్లలోనూ ఎక్కువశాతం ఆస్తిపన్ను వసూలైంది ఉప్పల్జోన్లో మాత్రమే. మిగతా జోన్లతో పోలిస్తే ఈ జోన్లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాల పనులు ఎక్కువగా ఉన్నాయి.సీఎంసీ బెటర్మూడు కార్పొరేషన్లలోనూ సైబరాబాదే బెటర్. డిమాండ్లో ఎక్కువశాతం ఆస్తిపన్ను వసూలైంది కూడా అక్కడే. అంతేకాదు, ఇప్పటికే ఫ్లై ఓవర్లు, రహదారులు, జంక్షన్లతో సహ ఎక్కువ సదుపాయాలున్నది ఇక్కడే కావడం తెలిసిందే. బహుళ అంతస్తుల నిర్మాణాలు, వాణిజ్య సముదాయాల డిమాండ్ కూడా ఇక్కడే ఎక్కువ కావడంతో భవిష్యత్లోనూ దీనికి నష్టమేం ఉండదు.జీహెచ్ఎంసీకి కష్టంజీహెచ్ఎంసీ లోని గోల్కొండ జోన్లోనూ ఆస్తిపన్ను డిమాండ్ రూ. వెయ్యికోట్లకు పైగా ఉన్నప్పటికీ, వసూలైంది కేవలం రూ.97 కోట్లుమాత్రమే. ఈ నేపథ్యంలో క్యూర్ వరకు సమానాభివృద్ధి సాధ్యమేనా? అంటే, ప్రభుత్వం నిధుల ఆసరా ఇవ్వనిది మాత్రం అసాధ్యమంటున్నారు మున్సిపల్ వ్యవహారాల నిపుణులు. -
ముంచుకొస్తోంది గడువు
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో మొదటి దశ స్వాధీన గడువు ముంచుకొస్తోంది. దీంతో రుణాల చెల్లింపునకు అవసరమైన నిధుల సేకరణపై అధికారులు దృష్టి సారించారు. వివిధ అంశాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికలను అందజేసేందుకు ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీలు కూడా కార్యాచరణను వేగవంతం చేశాయి. నిధుల సమీకరణకు అందుబాటులో ఉన్న మార్గాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్కమిటీకి నివేదికను త్వరలో అందజేయనున్నారు. ఒప్పందం ప్రకారం ఎల్అండ్టీ సంస్థకు రూ.2 వేల కోట్లు చెల్లించాలి. మరో రూ.13 వేల కోట్ల బ్యాంకు రుణాలను ప్రభుత్వం చెల్లించాలి. మార్చి 31లోపు యాజమాన్య బదిలీని పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. దీంతో నిర్ణీత గడువులోపే చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేసి మెట్రో యాజమాన్యం నుంచి వైదొలిగేందుకు తమకు వెసులుబాటు కల్పించాలని ఎల్అండ్టీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలో నిధుల సేకరణే ప్రధాన లక్ష్యంగా అధికార యంత్రాంగం కార్యాచరణ వేగవంతం చేసింది. నిరంతర సంప్రదింపులు సమావేశాలతో బేగంపేట్లోని హెచ్ఎఆర్ఎంఎల్ కార్యాలయంలో హడావుడి నెలకొంది.కన్సల్టెన్సీల అధ్యయనం తుది దశకుమెట్రోరైల్ స్వాధీన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ సంస్థల అధ్యయనం తుదిదశకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలు, హెచ్ఎంఆర్ఎల్ ఆస్తులు, అప్పులు అంశాలపై ఐడీబీఐ అధ్యయనం కొనసాగిస్తుండగా, మూడు కారిడార్లలో రైళ్ల నిర్వహణ, సాంకేతిక వ్యవస్థలు, ఇంధన వ్యయం, సిబ్బంది, తదితర అంశాలపై ఢిల్లీ మెట్రోరైల్ అధ్యయనం చేపట్టింది. ప్రస్తుతం ఈ రెండు సంస్థల నివేదికల ఆధారంగా స్వాధీన ప్రక్రియ సాగనుంది.‘మెట్రోరైల్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం కేటాయించిన సుమారు 249 ఎకరాల భూములు, మాల్స్ తదితర ఆస్తుల విక్రయంతో రుణాలు చెల్లించేందుకు అవకాశం ఉంది. మరోవైపు మొదటి దశ టేకోవర్ పూర్తయితే తప్ప రెండోదశకు కేంద్రం నుంచి అనుమతి, ఆర్థిక సహాయం లభించే అవకాశం లేదు. ఒప్పందం ప్రకారం ఎల్అండ్టీకి రూ.2 వేల కోట్లు చెల్లించి రూ.13 వేల కోట్ల బ్యాంకు రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే అవకాశం ఉంది. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
– రూ.28 లక్షల సొత్తు స్వాధీనం.. బంజారాహిల్స్: నగరంలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడ్డ ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నగర పోలీసు కమిషనర్ టాస్క్ఫోర్స్ (గోల్కొండ జోన్), బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దర్యాప్తులో భాగంగా వారిని అరెస్టు చేసి రూ.28 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తంజీమ్ జాకీర్ అలీ (30), మొహమ్మద్ సద్దాం (32), షానవాజ్ అలియాస్ షానవాజ్ ఖాన్ (29)లు స్నేహితులు. గతంలో ఉత్తరప్రదేశ్లో బట్టల దుకాణంలో పనిచేసే తంజీమ్ అలీ, సద్దాంలకు ఆదాయం సరిపోకపోవడంతో హైదరాబాద్లో చెఫ్గా పనిచేస్తున్న షానవాజ్ఖాన్ సహాయంతో నగరానికి వచ్చారు. వీరు తలాబ్కట్టలో నివాసం ఉంటున్నారు. నగరంలో దొంగతనాలు చేయాలని పథకం వేశారు. తొలుత తుకారాంగేట్ పరిధిలో ఒక బైక్ను దొంగిలించారు. ఆపై ఐరన్రాడ్లు, స్క్రూడ్రైవర్ల సహాయంతో బంజారాహిల్స్, ఎస్ఆర్నగర్, డబీర్పురా పోలీస్స్టేషన్ల పరిధిలో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగిలించిన సొత్తును కొంత తమ నివాసంలో దాచి, మరికొంత భాగాన్ని విక్రయించడానికి యూపీలోని తమ బంధువు రిజ్వాన్కు పంపేవారు. ఫిబ్రవరి 18న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వారిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 160.84 గ్రాముల బంగారు ఆభరణాలు, 666 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.3,28,000 నగదు, ీ ద్విచక్ర వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, ఇమిటేషన్ జ్యువెలరీని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ.28,61,732 ఉంటుందని పోలీసులు తెలిపారు. -
కళాశాల భవనంపైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
రాజేంద్రనగర్: కళాశాల మూడో అంతస్తు నుంచి దూకిన ఓ విద్యార్థిని గురువారం ఆత్మహత్య చేసుకుంది. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన మేరకు..శివరాంపల్లి పోలీసు అకాడమీ కాలనీకి చెందిన శైలేష్ కుమార్ తివారీ కుమార్తె (17) భవానీకాలనీలోని శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయి. గురువారం పరీక్ష రాసిన అనంతరం ఆమె మూడో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి దూకేందుకు యత్నించగా రోడ్డుపై వెళుతున్న వారు దీనిని గమనించి కేకలు వేస్తూ వద్దని వారించినా వినకుండా దూకేసింది. విద్యార్థినికి తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. కాగా విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
త్వరలో ‘టాటా–అంబేడ్కర్ శిక్షణ కేంద్రం’
బంజారాహిల్స్: ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలకు దీటుగా అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులు పోటీ పడుతున్నారని, రానున్న రోజుల్లో ‘టాటా–అంబేడ్కర్ శిక్షణ కేంద్రం’ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వైస్ చాన్సలర్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. టీసీఎస్ అయాన్ భాగస్వామ్య కంపెనీల ద్వారా ఎంపికై న 64 మందికి గురువారం విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని సీఎస్టీడీ భవనం ఆడిటోరియంలో జాబ్ ఆఫర్ లెటర్లను అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ... దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలకు దీటుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పోటీపడుతుందన్నారు. ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)తో కలిసి ఓ ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాన్ని ‘టాటా–అంబేడ్కర్’ పేరిట ఏర్పాటు చేయాలనే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అకడమిక్ డైరెక్టర్ పుష్ప చక్రపాణి, ఓఎస్డీ రవీంద్రనాథ్ సోలమన్ పాల్గొన్నారు. -
జీసీసీ జాబ్స్.. సిటీ వైబ్స్
దేశంలోని 20 శాతం జీసీసీలు భాగ్యనగరంలోనే.. ● ఫ్రెషర్లకు భారీగా ఉద్యోగావకాశాలు.. వేతనాలూ ఎక్కువే ● ప్రొడక్ట్ మేనేజ్మెంట్, డేటా సైన్స్, డేటా ఇంజినీరింగ్ విభాగాల్లో అవకాశాలు మెరుగైన మౌలిక వసతులు, నిపుణుల లభ్యత ప్రధాన కారణం సాక్షి, సిటీబ్యూరో: బహుళజాతి సంస్థల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(జీసీసీ)ల కొలువులకు హైదరాబాద్ నెలవుగా మారుతోంది. బహుళజాతి సంస్థలు తమ జీసీసీల ఏర్పాటుకు నగరాన్నే ఎంచుకుంటున్నాయి. గతంలో సామూహిక ప్రాంగణ నియామకాలకు దూరంగా ఉన్న జీసీసీలు ఇప్పుడు క్రమంగా క్యాంపస్ రిక్రూట్మెంట్ ర్యాలీలు చేపడుతున్నాయి. ప్రతిభ, నైపుణ్యమే కొలమానాలుగా ఫ్రెషర్లకు కూడా భారీ వేతనాలు అందిస్తున్నాయి. 2025–2026లో నగరంలో ప్రాంగణ నియామకాల్లో పాల్గొన్న జీసీసీల సంఖ్య దాదాపు 300 శాతం పెరిగింది. క్యాంపస్ రిక్రూట్మెంట్లలో చెల్లించే దాని కంటే జీసీసీ నియామకాల్లో వార్షిక వేతనాలు మెరుగ్గా ఉంటున్నాయి. సగటున రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షలను అందిస్తున్నాయి. దేశంలో 1,800పైగా జీసీసీలు ప్రస్తుతం దేశంలో 1,800పైగా జీసీసీలు ఉండగా.. వీటిల్లో సుమారు 21.6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కృత్రిమ మేధ(ఏఐ), ఇంజినీరింగ్, పరిశోధన, అభివృద్ధి, డిజిటల్ నైపుణ్యాలకు భారత్ కేంద్రంగా ఉండటంతో 2030 నాటికి జీసీసీల సంఖ్య 2,400లకు, ఉద్యోగుల సంఖ్య 28 లక్షల నుంచి 30 లక్షలకు చేరుతుందని అంచనా. హైదరాబాద్ హాట్ ఫేవరేట్.. జీసీసీలకు హైదరాబాద్ హాట్ ఫేవరేట్గా మారింది. దేశవ్యాప్తంగా జీసీసీల్లో 20 శాతానికిపైగా మన నగరంలోనే ఏర్పాటయ్యాయి. గ్రేటర్లో 355కుపైగా జీసీసీలు ఉన్నాయి. వీటిల్లో 3 లక్షలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత 12 నెలల్లో 35–50 జీసీసీలు నగరంలో కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఎవర్నార్త్ హెల్త్ సర్వీసెస్, ఓప్టమ్ గ్లోబల్, అలైన్ టెక్నాలజీస్, హనీవెల్, బార్క్లెస్, హెచ్ఎస్బీసీ వంటి సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్లపై దృష్టిసారించాయి. సత్తానే ప్రామాణికం.. గతంలో జీసీసీ కేంద్రాలకు సీఈఓ, సీఐఓలుగా ఆయా కంపెనీల కేంద్ర కార్యాలయాల నుంచిగానీ, ఆ కంపెనీల సొంత దేశాలకు చెందిన వారినిగానీ నియమించటం ఆనవాయితీ. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. తన, మన అనే తేడా కాకుండా, సత్తా ఉన్నవారినే జీసీసీల్లో ఉన్నత స్థానాలకు ఎంపిక చేసే సంప్రదాయం మొదలైంది. ప్రొడక్ట్ మేనేజ్మెంట్, జెనరేటివ్ ఏఐ. ఏఐ/ఎంఎల్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ నైపుణ్యాలు ఉన్నవారికి పెద్దపీట వేస్తున్నాయి. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, మానవ వనరులు ఉండటం, తక్కువ జీవన వ్యయం, అనుకూల ప్రభుత్వ విధానాల కారణంగా ఆయా సంస్థలు నగరానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. -
వైభవం.. క్రీడోత్సవం
రాయదుర్గం: 4వ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 బుధవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. పోటీల ప్రారంభం సందర్భంగా డీజీపీ శివధర్రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను అధికారికంగా ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా డీజీపీ గన్ఫైర్ చేసి గాలిలోకి బెలూన్లను ఎగురవేశారు.అనంతరం యంగ్ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. వ్యాయామం నిత్యజీవితంలో భాగం కావాలి గ్లోబల్ సమ్మిట్, అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు, గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల బందోబస్తు, సమ్మక్క సారక్క జాతర వంటి కీలక బాధ్యతలను పోలీసులు అత్యంత నిబద్ధతతో నిర్వహించారని డీజీపీ శివధర్రెడ్డి కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వారిలో నూతనోత్సహాన్ని నింపుతుందన్నారు. క్రీడలు మనలోని నాయకత్వ లక్షణాలను తట్టిలేపడంతోపాటు టీమ్ స్పిరిట్, ఐకమత్యాన్ని పెంచుతాయన్నారు. మహిళా పోలీసుల ప్రాతినిథ్యం ప్రతి విభాగంలోనూ పెరగాలని ప్రతిభతోపాటు నాయకత్వ లక్షణాలను చాటుకోవాలని సూచించారు. సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 2,532 మంది క్రీడాకారులు పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. ఇందులో 300 మంది మహిళా క్రీడాకారులు ఉండడం విశేషమన్నారు. వచ్చే నెలలో సైబరాబాద్ వేదికగా జరుగనున్న అఖిల భారత పోలీస్ ఫుట్బాల్ పోటీలు జరుగుతాయన్నారు. మొత్తం 31 క్రీడా విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. అనంతరం అంతర్జాతీయ వేదికలపై రాణించిన కృష్ణారావు, సంజీవకుమార్, గోపాలకృష్ణ, ఎండీబాబా, అవెను గోపాల్ జయరామ్, లావణ్య తదితర క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. ప్రత్యేక ఆకర్షణగా పోలీస్ ఎక్స్పో పోలీస్ వెల్ఫేర్ అండ్ వెల్నెస్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎక్స్పోను డీజీపీ సతీమణి హేమ శివధర్రెడ్డి ప్రారంభించారు. పోలీసులకు ఉపయోగపడే ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, శారీరక వ్యాయామం, క్రీడా పరికరాలు, వివిధ ఉత్పత్తులు స్టాల్స్ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ జట్లు ఘనంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్ ముఖ్యఅతిథిగా హాజరైన డీజీపీ శివధర్రెడ్డి 33 జిల్లాల నుంచి పాల్గొంటున్న 2,532 మంది క్రీడాకారులు -
స్టార్ట్ .. యాక్షన్ మళ్లీ 100 రోజుల ప్లాన్
మళ్లీ ‘100 రోజుల ప్లాన్’● వివిధ సమస్యల పరిష్కారమే లక్ష్యం ● ప్రజల భాగస్వామ్యంతో.. 3 కార్పొరేషన్ల పరిధిలో కార్యక్రమాలు ● ఈ నెల 23 నుంచి ప్రారంభం సాక్షి, సిటీబ్యూరో గత ప్రభుత్వాల హయాంలో జీహెచ్ఎంసీలో అమలు చేసిన 100 డేస్ యాక్షన్ప్లాన్కు ప్రస్తుత సర్కారు సిద్ధమైంది. మున్సిపల్ పాలన మరింత సమర్థంగా ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్లనుంది. కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) వరకు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు రోజువారీ ప్రణాళికలు రూపొందించాల్సిందిగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లకు సూచించారు. ఈమేరకు మెమో జారీ చేశారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రజలకు సదుపాయాలు మెరుగుపరచాలనే తలంపుతో ప్రభుత్వం ఇందుకు సిద్ధమైంది. ముగ్గురు కమిషనర్ల నుంచి అందిన ప్రణాళికలతో ప్రభుత్వం యాక్షన్ప్లాన్ ఖరారు చేయనుంది. ఈ నెల 23 నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పారిశుద్ధ్యానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అత్యంత ప్రాధాన్యమివ్వడంతో యాక్షన్ ప్లాన్లో ఈ అంశానికి ప్రాముఖ్యత ఇవ్వనున్నారు. దీంతో పాటు దోమల నివారణ, రోడ్లు, మౌలిక వసతులకు ప్రాధాన్యమివ్వనున్నట్లు సమాచారం. గతంలో ఇలా.. గతంలో కాంగ్రెస్ హయాంలో కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రెండు దఫాలు 100 డేస్ యాక్షన్ప్లాన్లో భాగంగా రూ. 500 కోట్ల మేర పనులు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2015, 2016, 2023లలోనూ 100 డేస్ యాక్షన్ప్లాన్ అమలు చేశారు. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎస్ రామకృష్ణారావుప్రస్తుతం కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు కావడంతో వికేంద్రీకరణతో ప్రజలకు సదుపాయాలు మెరుగుపడతాయని చెప్పాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అందుకు 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఉపకరించగలదని భావిస్తోంది. ఇది నాణేనికి ఓవైపు కాగా, వేసవి ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో సైతం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా మున్సిపోల్స్ విజయంతో అదే ఊపుతో మూడు కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించాలనే తలంపుతో ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆలోగా ప్రజలకు కొత్త కార్పొరేషన్లలో పాలన కనిపించాలంటే సరైన యాక్షన్ ప్లాన్ అవసరమని, దీన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో 2016 జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్ పేరిట మరో కార్యక్రమాన్ని నిర్వహించింది. మంత్రులు ప్యాట్రన్లుగా, గవర్నర్ ఐఏఎస్, ఐపీస్ అధికారులు, ఆయా ప్రభుత్వ విభాగాల హెచ్ఓడీలు మెంటార్లుగా నగరాన్ని 425 లొకేషన్లుగా విభజించి కొన్ని రోజులపాటు నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, గవర్నర్ నరసింహన్లు సైతం స్వచ్ఛ హైదరాబాద్లో పాల్గొన్నారు. ప్రజల్నీ భాగస్వాములను చేశారు. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు నగర పరిశుభ్రతపై ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎస్కు వివరించారు. చెత్త సేకరణ విధానం, పరిశుభ్రతా చర్యలు, ప్రజా ఆరోగ్య పరిరక్షణపై తీసుకుంటున్న చర్యలను సీఎస్ సమగ్రంగా పరిశీలించారు. మున్సిపల్ విభాగం ప్రభుత్వంలో కీలకమని, ప్రజల అవసరాలకు తగినట్లుగా బాధ్యతలు నిర్వర్తించాలని, అధికారులు విధులలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. చెత్త సేకరణ (డ్రై, వెట్ వేస్ట్), ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్య పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలో 4500 స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్నాయని, 18 వేల 557 మంది శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నారని తెలిపారు. నగర పరిధిలో రోజుకు 7,800 టన్నుల మేరకు గార్బేజ్ సేకరణ చేస్తున్నామన్నారు. -
బుద్ధం శరణం గచ్ఛామి!
ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ థాయ్లాండ్తో పాటు భారత్కు చెందిన బౌద్ధ భిక్షువులు చేపట్టిన చరిత్రాత్మక మూడో దమ్మ పాదయాత్ర బుధవారం నగరంలోని ఐమ్యాక్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు చేరుకుంది. బుద్ధుడు బోధించిన శాంతి, కరుణ సందేశాలను చాటిచెప్పే లక్ష్యంతో సాగుతున్న ఈ పాదయాత్ర కర్ణాటకలోని సిద్ధార్థ బుద్ధ విహార్ నుంచి ప్రారంభమైంది. మార్చి 1న నాగార్జున సాగర్లోని బుద్ధ వనాన్ని చేరుకుంటుంది. ఈ సందర్భంగా బౌద్ధ భిక్షువులు అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం హుస్సేన్ సాగర్లోని బుద్ధుడి విగ్రహాన్ని సందర్శించారు. -
విద్యుత్ డిమాండ్ ౖపైపెకి..
● ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వినియోగంలోకి.. ● ఒత్తిడి తట్టుకోలేక తరచూ ట్రిప్పవుతున్న ఫీడర్లు పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలతో ఉక్కపోతసాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు చలితో వణికిపోయిన నగరవాసులు.. ప్రస్తుతం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరికి లోనవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోతతో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను మళ్లీ వినియోగంలోకి తీసుకొస్తున్నారు. ఫలితంగా విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగి.. ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఒత్తిడితో ట్రిప్పవుతున్నాయి. అనధికారిక ‘కోత’లకు కారణమవుతున్నాయి. ఉదయం ఇంట్లోని కరెంట్ మోటార్లు, వాటర్ గీజర్లు, మిక్సీలు, ఎలక్ట్రిక్ స్టవ్లన్నీ ఒకే సమయంలో పని చేస్తుండటమే ఇందుకు కారణం. ఈసారి 5 వేల మెగావాట్లు దాటుతుందా..? గత ఏడాది ఫిబ్రవరిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 3,512 మెగావాట్ల వినియోగం (72 మిలియన్ యూనిట్లు) నమోదు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 6న 3509 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డు అయింది. 2025 ఏప్రిల్ 24న రికార్డు స్థాయిలో 4,190 మెగావాట్లు (89.54 మిలియన్ యూనిట్లు) నమోదు కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 5000 మెగావాట్లకు చేరుకోనున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి మించి లోడును ఎదుర్కొంటున్న 11కేవీ, 33 కేవీ ఫీడర్లపై ప్రత్యేక దృష్టిసారించారు. రంగారెడ్డి జోన్లో 965 అదనపు డీటీఆర్లు, మేడ్చల్ జోన్లో 626 డీటీఆర్లు, మెట్రో జోన్లో 297 డీటీఆర్లను ఏర్పాటు చేస్తున్నారు. -
గాయం నుంచి జాతీయ వేదికకు
సనత్నగర్: మోకాలి గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన కబడ్డీ జాతీయ క్రీడాకారిణి రమావత్ నందినిని బేగంపేట కిమ్స్ సన్ షైన్ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కుషాల్, డాక్టర్ ఆదర్శ్ అన్నపరెడ్డి తదితరుల నేతృత్వంలో బుధవారం సన్మానించారు. ఆటగాళ్లకు గాయాలైతే కెరీర్ ఆగిపోకుండా, సరైన వైద్యం అందించి ముందడుగు వేసేలా సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ల బృందం కృషి చేస్తోందని ఈ సందర్భంగా డాక్టర్ ఏవీ గురువారెడ్డి తెలిపారు. 2022లో నందిని కుడి మోకాలిలో ఏసీఎల్ లిగ్మెంట్కు గాయమైంది. దీంతో కిమ్స్ సైన్షైన్ షోల్డర్ అండ్ స్పోర్ట్స్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ను సంప్రదించారు. ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్స తర్వాత కొన్ని నెలల్లోనే ఆమె మైదానంలోకి దిగగా 2024లో మళ్లీ గాయమైంది. ఈసారి మెనిస్కస్ దెబ్బతింది. డాక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలో డాక్టర్ల బృందం సర్జరీ, రిహాబిలిటేషన్ అందించడంతో మూడు నెలల్లోనే కోలుకుంది. 72వ సీనియర్ నేషనల్ ఉమెన్స్ కబడ్డీ చాంపియన్షిప్కు ఎంపికై ందని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. దీంతో డాక్టర్ ఏవీ గురువారెడ్డి నేతృత్వంలో నందినిని సత్కరించారు. క్రీడాకారులకు గాయాలకు సరైన నిపుణుల పర్యవేక్షణలో వైద్యం అందిస్తే కేరీర్కు ఇబ్బంది ఉండదని తెలుసుకోవాలన్నారు. భారత కబడ్డీ మాజీ క్రీడాకారుడు డీఎస్పీ వేణుగోపాల్, తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్రెడ్డి, సీఎస్ఎస్హెచ్ క్లినికల్ హెడ్ డాక్టర్ సుమన్ తడగొండ, హైదరాబాద్ క్రికెట్ అకాడమీ, రంజీ టీం సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ రాజేష్, సెంటర్ ఫర్ స్పైన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్ ఫౌండర్ సీఈవో, పుల్లెల గోపీచంద్ అకాడమీ నరేష్కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో అనుభవాలను పంచుకున్నారు. ● ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్సతో పునరాగమనం ● కబడ్డీ స్టార్ నందినిని సన్మానించిన కిమ్స్ సన్షైన్ -
బదిలీలలెన్నో
● ఒకేసారి సుమారు 96 మందికి స్థానచలనం ● అవినీతి ఆరోపణలున్నవారికి ప్రాధాన్యతా పోస్టింగ్లు ● అధికారుల తీరుపై విమర్శలు నగర విద్యాశాఖలో భారీ ప్రక్షాళనసాక్షి, సిటీబ్యూరో: నగర విద్యాశాఖలో భారీగా బదిలీలు జరిగాయి. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల నుంచి జూనియర్ అసిస్టెంట్ల వరకు స్థాన చలనం కలిగింది. విద్యాశాఖలో ఒకేసారి సుమారు 96 మందిని బదిలీ చేయడం కలకలం సృష్టించింది. మొత్తమ్మీద 12 మంది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు (డిప్యూటీ ఈవో), 24 మంది డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (డిప్యూటీ ఐవోఎస్)లు, 60 జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయ సంఘాల విమర్శలు.. విద్యాశాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు బదిలీల ద్వారా ప్రాధాన్యతా పోస్టింగ్లు, ఎలాంటి మచ్చలేకుండా ఏడాదిలోపు బాధ్యతలు చేపట్టిన వారికి ప్రాధాన్యం లేని ప్రాంతాలకు బదిలీలు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. జిల్లా విద్యాశాఖలో చోటుచేసుకున్న అవినీతి ఆరోపణలపై నేపథ్యంలోనే బదిలీలు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంటూనే ఆరోపణలున్న అధికారులకు ప్రాధాన్యతగల మండలాల్లో పోస్టింగ్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. కోరుకున్న ప్రాంతానికి పోస్టింగ్లు ప్రక్షాళన పేరుతో జరిగిన బదిలీల ప్రక్రియలోనూ ఆమ్యామ్యాలు కొనసాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లు అధికంగా ఉన్న మండలాలు, కార్యాలయాలోని కీలక సెక్షన్లలో పోస్టింగ్లకు భారీగానే ‘డిమాండ్’ పలికినట్లు తెలుస్తోంది. డిప్యూటీ ఈవో స్థాయి పోస్టుల నుంచి కీలక ఫైళ్లు చూసే అసిస్టెంట్ల వరకు అనుకూలమైన చోట పోస్టింగ్లకు కొందరి పైరవీలు ఫలించినట్లు సమాచారం. మచ్చుకు కొన్ని ఘటనలు.. ఇటీవల బండ్లగూడ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఒకరు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఈ ఘటనలో కేవలం ఒక అసిస్టెంట్తో పాటు పైస్థాయి అధికారుల ప్రమేయం కూడా ఉందనే అనుమానంతో విచారణ కొనసాగుతోంది. ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు పునరుద్ధరణ, అగ్నిమాపక భద్రత, భవన సామర్థ్యం వంటి నిబంధనల్లో లోపాలున్నా, వాటిని సరిదిద్దకుండా ’మామూళ్ల’తో ఫైళ్లు క్లియర్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రిటైర్ అయిన ఉపాధ్యాయుల పెన్షన్ ఫైళ్ల క్లియర్, సర్వీస్ రిజిస్టర్లలో ఎంట్రీలు చేయడానికి కొందరు అసిస్టెంట్లు వేలల్లో డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. డబ్బులు ఇవ్వని వారి ఫైళ్లను నెలల తరబడి పక్కన పెట్టడం ద్వారా వారిని వేధిస్తున్న ఉదంతాలు గతంలో అనేకం వెలుగులోకి వచ్చాయి. -
నుమాయిష్ ఓ బ్రాండ్
అబిడ్స్: నగరంలో నిర్వహించే నుమాయిష్ ఓ బ్రాండ్ అని, చార్మినార్, గోల్కొండ, హైదరాబాద్ బిర్యానీ మాదిరిగానే ప్రపంచ వ్యాప్తంగా నాంపల్లి ఎగ్జిబిషన్కు ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర టూరిజం, ఎకై ్సజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు వారి ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఎగ్జిబిషన్ ఒక నిలయంగా మారిందన్నారు. గురువారం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. హైదరాబాద్ సిటీ కాస్మో పాలిటన్ సిటీగా మారిందన్నారు. భారతదేశంలోని అన్ని భాషల ప్రజలు కలిసి మెలిసి ఉండి వ్యాపారాలు, పారిశ్రామిక ప్రదర్శనలు చేసేందుకు ఎగ్జిబిషన్ ఎంతో దోహద పడుతుందన్నారు. నుమాయిష్ను 20 లక్షల మంది సందర్శించడం గొప్ప విషయమని, ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నుమాయిష్లో సాంస్కృతిక, పర్యాటకాన్ని కూడా ప్రమోట్ చేయాలని సూచించారు. ● నుమాయిష్ నుంచి వచ్చే దాదాపు రూ.30 కోట్ల ఆదాయాన్ని విద్యావ్యాప్తి కోసం వెచ్చి స్తుండటం అభినందనీయమన్నారు. అనంతరం ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సుఖేష్రెడ్డి స్వాగతోపన్యాసం చేయగా కార్యదర్శి బీఎన్ రాజేశ్వర్ నివేదిక సమర్పించారు. బహు మతుల ప్రధానోత్సవ సబ్ కమిటీ సలహాదారుడు హరినాథ్రెడ్డి వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి డాక్టర్ సంజీవ్కుమార్, కన్వీనర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతో పాటు పలు శాఖల అధికారులు, స్టాల్ హోల్డర్లకు మంత్రి బహుమతులు అందజేశారు. -
కార్మిక దళం.. ఉద్యమ గళం
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం నగరంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు తదితర ప్రాంతాల్లో ఆటోసేవలు స్తంభించాయి. మరోవైపు వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపం నుంచి ఇందిరాపార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయంటూ నినాదాలు చేశారు. ఆటో మీటర్ చార్జీలను పెంచాలని, రవాణాశాఖ కొత్తగా ప్రవేశపెట్టిన సారథి పోర్టల్ను రద్దు చేయాలని ఆటో సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆటో, ట్రాన్స్పోర్ట్ సంఘాల జేఏసీ నాయకులు బి.వెంకటేశం, ఎ. సత్తిరెడ్డి, లారీ సంఘం నాయకులు రాజేందర్ రెడ్డి, భిక్షపతి యాదవ్, సీహెచ్ జంగయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. – సాక్షి, సిటీబ్యూరో -
‘మొండికుంట’కు హైడ్రా ఫెన్సింగ్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) గురువారం మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలో భారీ ఆపరేషన్ చేపట్టింది. మొండికుంట చెరువులో అక్రమంగా వెలిసిన వందలాది తాత్కాలిక షెడ్లు, పదుల సంఖ్యలో ఉన్న దుకాణాల ను తొలగించింది. ఈ చెరువుతో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమణలు తొలగించిన అధికారులు మొత్తం 11 ఎకరాలకు కంచె వేశారు. దీని మార్కెట్ విలువ రూ.2200 కోట్ల వరకు ఉంటుందని అధికారులు ప్రకటించారు. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నం.53లో ఉన్న మొండికుంటతో పాటు సర్వే నం.55లోని ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించారు. దీనిపై స్థానికులు ప్రజావాణి ద్వారా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. ఫలితంగా దాదాపు 11 ఎకరాలు కబ్జాకు గురైనట్టు తేలింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆలయాన్ని హద్దుగా చూపించిన కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడినట్టు అధికారులు నిర్ధారించారు. ఆలయం హద్దుగా పలు షాపులు, మెకానిక్ షెడ్లు, ఐరన్ అండ్ స్టీల్ షాపు ఇలా పలు రకాల దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇలా 30కి పైగా ఉన్న షాపుల ద్వారా కబ్జా చేసిన వాళ్లు నెలకు రూ.లక్షల్లో అద్దెలు వసూలు చేస్తున్నారు. మొండికుంటతో పాటు అక్కడ ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలపై గత నెల 31న హైడ్రా విచారణ చేపట్టింది. రెవెన్యూ అధికారులతో పాటు కబ్జాలకు పాల్పడిన వారు కూడా ఈ సమవేశంలో పాల్గొన్నారు. వారి సమక్షంలోనే ఆక్రమణలు జరిగినట్టు రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ చిత్రాలను పరిశీలించిగా ఇదే నిర్థారణ అయింది. ఇదే విషయాన్ని అధికారులు కబ్జాదారులకు తెలిపారు. వారికి కొంత సమయమిచ్చిన హైడ్రా గురువారం ఆక్రమణలను తొలగించే పనిని చేపట్టింది. వందల సంఖ్యలో ఉన్న తాత్కాలిక షెడ్లను భారీ బందోబస్తు మధ్య హైడ్రా తొలగించింది. మొత్తం 11 ఎకరాల్లో ఉన్న నిర్మాణాల తొలగింపు దీని మార్కెట్ విలువ దాదాపు రూ.2200 కోట్లు మాదాపూర్ హైటెక్స్ సమీపంలో భారీ ఆపరేషన్ -
సమాజంలో బాధ్యతగా మెలగాలి
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్ మణికొండ: సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలిగాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ అన్నారు. గురువారం సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ ఆ విర్భావ దినోత్సవం సందర్భంగా నార్సింగి సైకిల్ట్రాక్ వద్ద యువతకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించటంతో పాటు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసు శాఖ అనేక భద్రతా చర్యలు, సామాజిక బాధ్యతలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా గాయకులు పాడిన పలు పాటలకు యువకులతో పాటు కమీషనర్ సైతం స్టెప్పులేశారు. అనంతరం యువకులతోతో కలిసి సైక్లింగ్ చేశారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్ శ్రీనివాస్, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, సీఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సాయి మనోహర్, ఏడీసీపీలు, ఏసీపీలు, పోలీసు సిబ్బంది, యువకులు పాల్గొన్నారు. -
యూట్యూబ్లో చూసి..చోరీ చేసి..!
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్లో ఉన్న నందగిరిహిల్స్లో నివసించే ప్రముఖ వ్యాపారి రవీంద్రశర్మ ఇంట్లో ఈ నెల 5న భారీ చోరీ చేసిన నేపాలీ గ్యాంగ్ విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆద్యంతం పక్కా పథకం ప్రకారం వ్యవహరించిన ఈ ముఠా రవీంద్ర ఇంట్లో ఉన్న లాకర్ ఎలా పగులకొట్టాలనే అంశాన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసింది. అందులో పేర్కొన్నట్లే రాడ్లు వినియోగించి పగులకొట్టడంతో పాటు అందులో ఉన్న రూ.1.2 కోట్ల సొత్తు, సొమ్ము ఎత్తుకుపోయింది. ఈ గ్యాంగ్లోని నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. కీలకంగా వ్యవహరించిన భార్యభర్తలు.. నేపాల్కు చెందిన జీవన్ చాంద్, తన భార్య బీమ్లాతో కలిసి కొన్నేళ్లుగా నగరంలో నివసిస్తున్నాడు. గతంలో పని మనిషిగా చేరి ఆ ఇంట్లోనే చోరీలు చేసిన చరిత్ర ఇతడికి ఉంది. నేపాల్కు చెందిన భూపేందర్ సాహి అలియాస్ భువన్ను నగరానికి పిలిపించే జీవన్... కోకాపేటకు చెందిన మదన్ ఖత్రి ద్వారా రవీంద్ర శర్మ ఇంట్లో గత నెల 18న పని మనిషిగా చేరుస్తాడు. నేపాల్ నుంచి వచ్చి నవీ ముంబైలో నివసిస్తున్న లలిత్ బహదూర్ వద్ద ఉంటున్న నేపాలీలు కృష్ణ కాంత్, కమల్ చాంద్లతో భువన్కు పరిచయం ఉంటుంది. జీవన్, బీమ్లా సూచనల మేరకు రవీంద్ర శర్మ ఇంటిని రెక్కీ చేసిన భువన్ చోరీ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయాన్ని కృష్ణ, కమల్లకు చెప్పి ఇంటితో పాటు పరిసరాలను వీడియో తీసి షేర్ చేస్తాడు. ఈ వీడియోలో వారింట్లో ఉన్న లాకర్ను చిత్రీకరిస్తాడు. లక్డీకపూల్లోని లాడ్జిలో మకాం.. రవీంద్ర శర్మ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్న భువన్ ఈ నెల 3న కృష్ణ, కమల్లను నగరానికి రప్పించాడు. లక్డీకపూల్లోని ఓ లాడ్జిలో బస చేసిన ఈ ద్వయం విషయాన్ని జీవన్కు చెప్పింది. తనపై అనుమానం రాకుండా ఆ వెంటనే అతగాడు నేపాల్ వెళ్లిపోయాడు. అక్కడకు వచ్చాక సొత్తు పంచుకుందామని వీరికి చెప్పాడు. ఈ నెల 5 రాత్రి రవీంద్రశర్మ కుటుంబం ఫంక్షన్కు వెళ్లడంతో అదే రోజు నేరం చేయాలని నిర్ణయించుకుంటారు. భువన్ నుంచి సమాచారం అందుకున్న కృష్ణ, కమల్ వేర్వేరుగా బయలుదేరి నందగిరిహిల్స్కు చేరుకుని భువన్ను కలుస్తారు. రెండు క్యాబ్లు మారి అక్కడకు వస్తారు. మార్గమధ్యంలో రవీంద్ర ఇంట్లో ఉన్న లాకర్ లాంటి వాటిని ఎలా పగులకొట్టాలో యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు. చికెన్లో సాధ్యం కాక జ్యూస్లో.. ఆ సమయంలో రవీంద్ర ఇంట్లో ఉన్న వాచ్మెన్తో పాటు అతడి భార్యకు మత్తుమందు ఇవ్వాలని ఈ త్రయం పథకం వేస్తుంది. కొన్ని మత్తు మాత్రలు సంగ్రహించిన వీళ్లు తొలుత చికెన్లో కలిపి ఇవ్వాలని భావిస్తారు. దీనికోసం ఆ సమీపంలోని ఓ దుకాణాకి వెళ్లే ముగ్గురూ చికెన్ కొంటారు. దుకాణదారుడికి చెల్లించడానికి తమ వద్ద సొమ్ము లేకపోవడంతో దుకాణంలో స్కానర్ను ఫొటో తీసే భువన్ దాన్ని లలిత్కు పంపగా అతడు చెల్లిస్తాడు. చివరకు జ్యూస్లో కలిపిన మత్తు మందు ఇస్తారు. నేరం చేసిన తర్వాత భువన్ ఒకవైపు, మిగిలిన ఇద్దరూ మరో వైపు పారిపోయి నవీ ముంబై చేరతారు. దీనిపై సమాచారం అందుకున్న బీమ్లా సైతం నేపాల్ పారిపోతుంది. ఇలా పారిపోయే ప్రయత్నాల్లో నందగిరిహిల్స్లోనే భువన్ ఫోన్ పడిపోయింది. ఇటీవల జూబ్లీహిల్స్లోనేరం చేసిన గ్యాంగ్ స్కానర్ ఇచ్చిన క్లూ ఆధారంగా కేసు కొలిక్కి పోలీసుల దర్యాప్తులోవెలుగులోకి కీలకాంశాలు ఈ ఫోన్ స్వాధీనం చేసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు అందులో ఉన్న స్కానర్ ఫొటో ఆధారంగా లలిత్ ఆచూకీ కనిపెడతారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కథ మొత్తం బయటకు వస్తుంది. దీంతో నేపాల్ సరిహద్దుల్లో కాపుకాసిన నగర అధికారులు ఎస్ఎస్బీ సహకారంతో నిందితులను పట్టుకుంటుంది. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న జీవన్, బీమ్లా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వీళ్లు ప్రస్తుతం నేపాల్లో ఉండటంతో ఇక్కడకు రప్పించే మార్గాలను అన్వేషిస్తున్నారు. లలిత్ను పట్టుకోగా గుట్టురట్టు... -
బ్రహ్మోత్సవం.. భక్తగణం
నేటి నుంచి కీసరగుట్టలో ఉత్సవాలు ప్రఖ్యాత శైవక్షేత్రం కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 వరకు ఆరు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల జాతరకు సుమారు ఐదారు లక్షల మంది యాత్రికులు వస్తారని అంచనా. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు ఆలయ చైర్మన్ తటాకం వెంకటేష్ తెలిపారు. ఇప్పటికే 50 వేల లడ్డూ ప్రసాదాలను సిద్ధంగా ఉంచామని ఆయన పేర్కొన్నారు. – కీసర -
పంపకాలు అప్పుడే తిప్పలు
జీహెచ్ఎంసీ నుంచి సీఎంసీ, ఎంఎంసీకి నిధులుసాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నుంచి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లకు రూ.500 కోట్లు వాటి ఖాతాలకు జమ చేయనున్నారు. ఉమ్మడి జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగిశాక మూడు కార్పొరేషన్ల ఏర్పాటు అనంతరం గురువారం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు కార్పొరేషన్లకూ స్పెషలాఫీసరైన జయేశ్రంజన్ వరుసగా సీఎంసీ, ఎంఎంసీ, జీహెచ్ఎంసీ అధికారులతో స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో రూ.500 కోట్ల వంతున రెండు కార్పొరేషన్లకు ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా అవసరమైన పనులు, ఇతరత్రా నిర్మాణ పనులు చేసేందుకు ఈ నిర్ణయించారు. పంపిణీకి టాస్క్ఫోర్స్ కమిటీ అప్పులు, ఆస్తులు, సిబ్బంది పంపిణీకి సంబంధించి సీజీజీ నేతృత్వంలో టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు స్పెషల్ ఆఫీసర్ జయేశ్ రంజన్ తెలిపారు. స్టాండింగ్ కమిటీ సమావేశానంతరం ఆయన మాట్లాడుతూ.. అనుభజ్ఞులైన టాస్క్ఫోర్స్ కమిటీ సిఫార్సులకనుగుణంగా అప్పులు, ఆస్తుల పంపినీకి తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. టాస్క్ఫోర్స్ కమిటీ అధ్యయనానికి దాదాపు పది రోజుల సమయం పడుతుందన్నారు. ప్రజల అవసరాలకనుగుణంగా కార్యాచరణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఆమోదించిన అంశాలు రెండు కార్పొరేషన్లకు రూ. 500 కోట్ల వంతున కేటాయింపుతో పాటు కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పునర్వ్యవస్థీకరణ, సైబరాబాద్, మల్కాజిగిరి, గ్రేటర్ హైదరాబాద్గా మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు, శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగింపు, ప్రతి కార్పొరేషన్కు ప్రత్యేక కార్పొరేట్ హోదా, చట్టబద్ధ హక్కులు, సైబరాబాద్, మల్కాజిగిరి, కార్పొరేషన్లకు సిబ్బంది కేటాయింపు. ఆకాంక్షలకనుగుణంగా.. టీ క్యూర్లోని మూడు కార్పొరేషన్లు ప్రజల ఆకాంక్షల కనుగుణంగా పనిచేయాలని స్టాండింగ్ కమిటీ సమావేశంలో అధికారులను జయేశ్ రంజన్ ఆదేశించారు. ఆరు నెలల్లో సర్కిల్, వార్డు స్థాయిలో స్పష్టమైన మార్పులు కనిపించాలన్నారు. కార్పొరేషన్ల మధ్య పోటీ నిర్వహించనున్నట్లు తెలిపారు. బల్దియాపై మొత్తం రూ.4,877 కోట్ల రుణభారం సాక్షి, సిటీబ్యూరో: కొత్త కార్పొరేషన్లు అవతరించి కుదురుకోక ముందే నెత్తిన భారం పడనుంది. ఇప్పటివరకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు ఉన్న రూ.4,877 కోట్ల అప్పులను పరిధుల వారీగా పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నగర శివార్లలోని 27 పట్టణ, స్థానిక సంస్థలను జీహెచ్ంఎసీలో విలీనం చేసిన తర్వాత హైదరాబాద్ మహానగరాన్ని జీహెచ్ఎంసీ, సైబరాబాద్ నగరపాలక సంస్థ (సీఎంసీ), మల్కాజిగిరి నగరపాలక సంస్థ (ఎంఎంసీ) మూడు కార్పొరేషన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం మహానగర పరిధి 2,054 చదరపు కిలోమీటర్లు (చ.కి.మీ.), 300 వార్డులకు విస్తరించింది. దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించింది. మౌలికం కోసం రుణాలు.. గ్రేటర్లో రహదారులు, ఫ్లైఓవర్లు, అండర్పాస్లు వంటి మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, నీటి కాలువల ప్రాజెక్ట్లు తదితర అభివృద్ధి పనుల కోసం నిధుల అవసరమయ్యాయి. వ్యూహాత్మక రహదారి అభివద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ), సమగ్ర రోడ్డు నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ), నీటి కాలువ ప్రాజెక్టులు ఇతర పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఎక్కువగా రుణాలను సమీకరించింది. ఇందుకోసం మున్సిపల్ బాండ్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీఐ), హడ్కో వంటి వివిధ మార్గాల ద్వారా రూ.4,877 కోట్ల రుణాలను తీసుకుంది. తాజాగా గ్రేటర్ మూడు నగరపాలక సంస్థలుగా విభజన జరగడంతో ఈ రుణ మొత్తాన్ని ఎవరు భరిస్తారనే ప్రశ్న తలెత్తింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా అభివృద్ధి పనులు జరిగిన ప్రాంతాన్ని బట్టి రుణ విభజన, చెల్లింపుల బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించింది. అప్పులతో పాటు ఆయా కార్పొరేషన్ల పరిధిలోని ఆస్తులను కూడా సంబంధిత బల్దియాకే అప్పగించేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. సమావేశంలో కర్ణన్, జయేశ్రంజన్ అప్పులు, ఆస్తుల పంపిణీకి టాస్క్ఫోర్స్ కమిటీ స్పెషల్ ఆఫీసర్ జయేశ్రంజన్ స్పష్టీకరణ మూడు కార్పొరేషన్ల స్టాండింగ్ కమిటీ సమావేశాలు మూడు కార్పొరేషన్ల మధ్య అప్పుల విభజన అభివృద్ధి పనుల ప్రాంతాన్ని బట్టి పంపకాలు విధాన ప్రక్రియను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం శానిటేషన్, వెటర్నరీ విభాగాల్లో ఉద్యోగుల కొరత -
ఆదాయంహైరైజ్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నుంచే బహుళ అంతస్తుల భవనాలు, లే అవుట్లు, నిర్మాణ రంగ అనుమతులు లభించనుండటంతో.. కొత్తగా అవతరించిన మున్సిపల్ కార్పొరేషన్లు, హెచ్ఎండీఏ మధ్య డెలిగేషన్ ఆఫ్ వపర్స్ (అధికారాల బదిలీ)లో స్పష్టత వచ్చినట్లయింది. ఓటర్ వరకు విస్తరిత మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పది అంతస్తుల భవనాల వరకు మున్సిపల్ కార్పొరేషన్ల నుంచే అనుమతులను అందజేస్తారు. పదకొండో అంతస్తు నుంచి నిర్మించే వాటికి హెచ్ఎండీఏ నుంచి అనుమతులను పొందాల్సి ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ట్రిబుల్ ఆర్ వరకు లే అవుట్ అనుమతులను కూడా హెచ్ఎండీఏ నుంచే అందజేస్తారు. ప్రస్తుతం రీజినల్ రింగ్ రోడ్డు వరకు రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లు తదితర ప్రాజెక్టులను హెచ్ఎండీఏ చేపట్టింది. ఆ రెండింటితో ఏటా రూ.1200 కోట్లు.. హెచ్ఎండీఏ ప్రణాళికా విభాగం ఇచ్చే నిర్మాణ అనుమతులు, లే అవుట్ల ద్వారానే ఏటా రూ.1200 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. భూములు, సొంత లే అవుట్ల విక్రయంతో వచ్చే రాబడీ కీలకమే. ఈ రెండు ఆదాయ మార్గాలను దృష్టిలో ఉంచుకొనే నగరంలో ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లైఓవర్లు, గ్రీన్ఫీల్డ్ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఈ ఆదాయ మార్గాలనే బ్యాంకు రుణాలను చెల్లించేందుకు గ్యారంటీలుగా చూపుతూ రూ.30 వేల కోట్ల రుణాల సేకరణకు చర్యలు చేపట్టింది. కొత్త ప్రాజెక్టులు ఇవే.. బుద్వేల్ ఇంటర్చేంజ్ ట్రంపెట్ రోడ్డుకు రూ.488 కోట్లతో ప్రణాళికలకు రూపకల్పన. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని ఐసీసీసీ నుంచి శిల్పా లేఅవుట్ వరకు రూ.1656 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్. శంకర్పల్లి రోడ్లోని ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు 3.57 కి.మీ పొడవున పైపులైన్ రోడ్డు అభివృద్ధికి రూ.110 కోట్లు. నానక్రామ్గూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్ఆర్కు ఎడమవైపున రహదారి విస్తరణ చేపట్టనున్నారు. 75 మీటర్ల రైట్ ఆఫ్ వేత్ (ఆర్ఓడబ్ల్యూ)తో రూ.26.50 కోట్లతో చేపట్టనున్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు రూ.1,650 కోట్లతో చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులు కొనసాగుతున్నాయి. జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు రూ.2,500 కోట్లతో చేపట్టనున్న స్టీల్ బ్రిడ్జి ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులతో భారీ నిధులు అధికారాల బదిలీతో మరింత బలోపేతం బాండ్ల రూపంలో రూ.30 వేల కోట్ల సేకరణ నగరాభివృద్ధిలో హెచ్ఎండీఏది కీలకం -
ఆస్తిపన్నులోనే చెత్త చార్జీలు
సాక్షి, సిటీబ్యూరో: పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. మూడు కార్పొరేషన్ల విభజనతో పాటే పారిశుద్ధ్యం మెరుగయ్యేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. స్వచ్ఛ ఆటోల పనితీరు సవ్యంగా ఉండేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించింది. చెత్త నిర్వహణ పేరిట పేదలపై భారం ఉండకుండానూ శ్రద్ధ తీసుకుంది. మురికివాడల్లో 500 చదరపు అడుగుల విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణంతో ఉన్న నివాస గృహాల నుంచి ఎలాంటి చార్జీ తీసుకోరాదని నిర్ణయించింది. చెత్త సేకరణ చార్జీలను ఆస్తిపన్నులో కలపాలని భావిస్తోంది. మార్గదర్శకాలిలా.. ● వార్డులోని అన్ని ప్రాంతాల్లో వందశాతం ఇళ్ల నుంచి చెత్త సేకరణ జరగాలి. నిర్ణీత సమయాలు పాటించాలి. చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ల వద్ద వ్యర్థాలు తూకం వేయాలి. ● అన్ని చెత్తసేకరణ ఆటోలకూ జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ అమలు చేయాలి. ● కొత్తగా వినియోగించే వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఉండాలి. పాత వాటిని రీట్రోఫిట్ చేయాలి. ● గార్బేజ్ వల్నరబుల్ ప్రాంతాలు (జీవీపీ), హాట్స్పాట్లలో ఏడాది వరకు డంపర్బిన్లు ఉంచాలి. ఈ ప్రాంతాల్లో చెత్త తరలింపు పనులు నగరంలో చెత్త నిర్వహణ పనులు చేస్తున్న రాంకీ సంస్థ చేయాలి. సదరు ప్రాంతాల్లో చెత్త వేయకుండా ఉండేందుకు సెల్ఫ్హెల్ప్ గ్రూపుల మహిళ ద్వారా అవగాహన కల్పించాలి. అందుకు వారికి తగిన ప్రోత్సాహకాలివ్వాలి. ఇళ్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో హోమ్ కంపోస్టింగ్ ప్రోత్సహించాలి. ఇళ్లలోనే తడి–పొడి వేరు చేసేందుకూ ప్రోత్సాహకాలివ్వాలి. ● కొత్త విలీన ప్రాంతాల్లో , చెత్త సేకరణ సవ్యంగా జరగని ప్రాంతాల్లో రాంకీ ద్వారా వాహనాలు సమకూర్చాలి. ● బల్క్ వేస్ట్ తరలింపు రాంకీ ద్వారా జరగాలి. ● పారిశుద్ధ్యం మెరుగయ్యేందుకు బాగా పనిచేసే స్వచ్ఛ ఆటో కార్మికులకు ప్రోత్సాహకాలు. పనిచేయని వారికి పెనాల్టీల విధింపు. ● వీటితోపాటు నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల తరలింపునకు మార్గదర్శకాలు సూచించింది. వీటి అమలు కోసం రెండు వారాల్లో తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పెషలాఫీసర్ జయేశ్రంజన్ సూచించారు. పేదలకు మినహాయింపు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కొత్త మార్గదర్శకాలు జారీ -
72 ఏళ్ల వృద్ధురాలికి..అరుదైన శస్త్రచికిత్స
రాంగోపాల్పేట్: మిట్రల్ వాల్వ్ లీకేజీ సమస్యతో బాధపడుతున్న ఓ 72 ఏళ్ల వృద్ధురాలికి అరుదైన మినిమల్ ఇన్వేసిస్ చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు సికింద్రాబాద్ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు. బుధవారం ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రమోద్కుమార్ ఈ వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలు శ్వాస, అలసట సమస్యలతో బాధపడుతుంది. పరిస్థితి విషమించి గుండె వైఫల్యంతో మెడికవర్ ఆస్పత్రికి వచ్చారు. మిట్రల్ వాల్వ్లో తీవ్రమైన లీకేజ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో విదేశాల్లోనే చేసే మినిమల్ ఇన్వేసిస్ చికిత్స చేయాలని నిర్ణయించి విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం వృద్ధురాలు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ భుయార్, డాక్టర్ ఎన్ శివప్రసాద్ నాయుడు, అమరేందర్ కుమార్ సింగ్, డాక్టర్ వరుణ్ గౌతమ్, డాక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
ఓటెత్తిన పట్టణం
రంగారెడ్డిలో 78.99 శాతం, మేడ్చల్లో 83.99 శాతం పోలింగ్ సాక్షి, సిటీబ్యూరో: నగర శివారులోని 9 మున్సిపాలిటీల్లో 194 వార్డులకు జరిగిన ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ స్వల్ప సంఘటనలు మినహాయించి ఎలాంటి వివాదాలు తలెత్తలేదు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలోని ఐదో వార్డులో ఒక పార్టీ అభ్యర్థి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వెండి నాణేలు పంపిణీ చేయగా, అవి నకిలీ అని తేలటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. రావల్కోల్లో ఓ పార్టీ అభ్యర్థికి సంబంధించిన బంధువు అల్లరితో తలెత్తిన వివాదం పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో స్వల్ప ఉద్రిక్త సంఘటనలు మినహా ఎలాంటి వివాదాలు తలెత్తలేదు. మేడ్చల్–మల్కాజిగిరిలో 83.99, రంగారెడ్డి జిల్లాలో 78.99 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని ఎన్నికల అధికారులతోపాటు ఆయా జిల్లాల కలెక్టర్లు మనుచౌదరి, నారాయణరెడ్డి పర్యవేక్షించారు. బ్యాలెట్ బాక్సులను పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. 106 టేబుళ్ల అధికారులు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల కల్లా ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నెల 16న చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. స్ట్రాంగ్రూమ్లకు బ్యాలెట్ బాక్స్లు రేపు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు మధ్యాహ్నం 2 కల్లా ఫలితాలు 16న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక -
పెళ్లన్నాడు.. రూ.35 లక్షలు కొల్లగొట్టాడు
● యువతిని నమ్మించిమోసగించిన సైబర్ నేరగాడు ● పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్ మ్యాట్రిమోనీలో గుర్తు తెలియని వ్యక్తితో ఆ యువతికి పరిచయమైంది. రోజూ ఫోన్లో జరిపిన చాటింగ్లు పెళ్లి వరకు వెళ్లాయి. జాతకాలు కలవలేదని తల్లిదండ్రులు నిరాకరించినా ససేమిరా అన్నారు. సీన్ కట్ చేస్తే.. సైబర్ నేరస్తుడి వలలో చిక్కుకున్న ఆ యువతి ఏకంగా రూ.35 లక్షలు మోసపోయింది. మల్కాజిగిరి సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. వివరాలు ఇలా.. కమిషనరేట్ పరిధిలోని ఓ యువతి మ్యాట్రిమోనియల్ ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంది. సైబర్ నేరస్తుడు (40) ఆమె ప్రొఫైల్ను యాక్సెప్ట్ చేసి, తాను బాగా చదువుకున్నానని, వ్యాపారవేత్తనని పరిచయం పెంచుకున్నాడు. తక్కువకాలంలోనే వారి మధ్య చనువు ఏర్పడింది. ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. చాటింగ్లు చేసుకునేవారు. పథకం ప్రకారం సైబర్ కేటుగాడు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. దీన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు.. జాతకాలు సరిచూపించి అనుకూలంగా లేవని పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించారు. అయినప్పటికీ బాధితురాలు నిందితుడితో టచ్లోనే ఉంది. ఆమె తన వలలో పడిపోయిందని నిర్ణయించుకున్న నిందితుడు.. వ్యాపారాలను విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఆమె కోసం వజ్రాలు తీసుకున్నానని నమ్మించాడు. వ్యాపార విస్తరణకు డబ్బు కావాలని కోరాడు. దీంతో యువతి సొమ్మును నిందితుడు సూచించిన ఖాతాలకు బదిలీ చేసింది. ఇంకా కావాలనడంతో.. కుటుంబ సభ్యులతో పాటు ఆమె బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి మరీ బదిలీ చేసింది. తర్వాత నిందితుడు స్పందించలేదు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. -
హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ షురూ
సాక్షి, సిటీబ్యూరో: 23వ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ (అర్బన్రైజ్ కప్) బుధవారం అట్టహాసంగా ఆరంభమైంది. దేశవ్యాప్తంగా 300 మందికిపై క్రీడాకారులు పోటీపడుతున్న ఈ టోర్నమెంట్ను హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ (హెచ్ఓటీఏ) నిర్వహిస్తోంది. జూబ్లిహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్, ఫిల్మ్నగర్ క్లబ్, జిహెచ్ఎంసీ టెన్నిస్ కోర్టుల్లో బుధవారం సింగిల్స్, డబుల్స్ మ్యాచ్లు మొదలయ్యాయి. జేహెచ్ఐసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన పురుషుల 55 ప్లస్ సింగిల్సలో నంద్యాల నరసింహారెడ్డి శుభారంభం చేశారు. రాజారామ్ మోహన్ రాయ్పై 9–2తో నరసింహారెడ్డి గెలుపొందారు. మెన్స్ 60 ప్లస్ సింగిల్స్లో గంగాధర్ 9–5తో వెంకట రత్నంపై విజయం సాధించాడు. ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో అన్ని విభాగాల్లో ఫైనల్స్ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. -
ఉదయం స్నాచింగ్... మధ్యాహ్నం అరెస్ట్
గన్ఫౌండ్రీ: నగరంలో మరో చైన్ స్నాచింగ్ ఉదంతం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం అబిడ్స్ పరిధిలో ఒంటి మహిళ మెడ నుంచి బంగారం గొలుసులాక్కువెళ్లాడు.. దీన్ని సవాల్గా తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు కేవలం ఆరు గంటల్లో నిందితుడిని పట్టుకున్నారు. అబిడ్స్ చాపల్ రోడ్డులోని ఓ హాస్టల్లో నివసిస్తున్న శిరీష (24) ఆ సమీపంలోని మల్లారెడ్డి హాస్పిటల్లో నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం నైట్ డ్యూటీ చేసిన ఈమె విధులు ముగించుకుని బుధవారం ఉదయం హాస్టల్కు వెళ్తున్నారు. అదే సమయంలో బైక్పై ఆమె వెనుక వైపు నుంచి వచ్చిన ఓ దొంగ పంజా విసిరాడు. శిరీష గమనించే లోపే ఆమె మెడలో ఉన్న 2.5 తులాల బంగారు గొలుసును లాక్కున్నాడు.బాధితురాలు అతడిని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఈ పెనుగులాటలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ స్నాచర్ కోసం టాస్క్ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. స్నాచింగ్ జరిగిన ప్రాంతం నుంచి మొదలు పెట్టిన టాస్క్ఫోర్స్ అధికారులు నిందితుడు వచ్చిన, వెళ్లిన మార్గాల్లో ఉన్న 40 సీసీ కెమెరాల్లో ఫీడ్ అధ్యయనం చేశారు. అలా వచ్చిన సమాచారం ఆధారంగా ముందకువెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే ఇతడి తొలి నేరమని, గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదని తెలుస్తోంది. కేవలం తనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, పెరిగిన పసిడి ధరల నేపథ్యంలోనే ఈ స్నాచింగ్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా నిందితుడు సల్మాన్ పాషా యాకుత్పుర ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తేలింది. -
ఆటోల్లో ‘ఆపత్కాల బృందాలు’
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నిలక బందోబస్తు విధుల్లో స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు ఓ భాగం. తాత్కాలిక ప్రాతిపదికన గస్తీ విధుల కోసం వీటిని ఏర్పాటు చేస్తారు. ఎక్కడా శాంతిభద్రతల సమస్య, ఘర్షణలు, ఆందోళనలు తలెత్తితే వెంటనే రంగంలోకి దిగి అదుపు చేయడం, ఆందోళనకారుల్ని ముందస్తు అరెస్టు చేయడం వీరి విధి. ఇప్పటి వరకు ఈ రెండు రకాలైన బృందాలను కారు, సుమో తదితర వాహనాలు కేటాయించే వారు. వీటివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయని గమనించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.రమేష్ తొలిసారిగా ట్రాలీ ఆటోలు కేటాయించారు. ఈ కమిషనరేట్ పరిఽధిలో పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ బృందాలు ఆటోల్లోనే గస్తీ, బందోబస్తు నిర్వహించాయి. ఈ వాహనాల్లో తిరగడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు వీరికి స్పష్టంగా కనిపిస్తాయి. అక్కడి పరిస్థితుల్ని పక్కాగా అంచనా వేయవచ్చు. ఈ బృందాల వెంట ఉండే లాఠీలు, స్టోర్ గార్డ్, హెడ్ గార్డ్లతో పాటు రైట్ గేట్ మొత్తాన్ని తరలించడమూ తేలిక. అత్యవసరం అయినప్పుడు వాటిలో నుంచి దిగటానికీ సమయం పట్టదు. అవసరమైతే ఆందోళనకారుల్ని తమ ఆటోలోనే తీసుకుని మరో ప్రాంతానికి తరలించవచ్చు. ఈ కారణాల వల్ల సైబరాబాద్ సీపీ ఈ రెండు తరహాలైన బృందాలకు ట్రాలీ ఆటోలు కేటాయించారు. ఎన్నికల విధుల్లో స్ట్రైకింగ్,స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లు తొలిసారిగా ఆటోలను కేటాయించిన సైబరాబాద్ సీపీ -
మూసీలో ముందడుగు
● నిర్వాసితులకు టీడీఆర్ రూపంలో పరిహారం ● తొలిదశలో 21 కి.మీ. మేర సుందరీకరణ పనులు ● ఫేజ్–1 ఏలో హిమాయత్ సాగర్– గాంధీ సరోవర్ ● ఫేజ్–1 బీలో ఉస్మాన్సాగర్– గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి 55 ఎకరాల భూ సమీకరణకు సర్కారు నిర్ణయం సాక్షి, సిటీబ్యూరో: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ మూసీ అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిన భూ సమీకరణకు మార్గం సుగమమైంది. నది సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ ప్రక్రియను ప్రారంభించింది. హైదరాబాద్ జిల్లాలోని గోల్కొండ మండలం, రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలో సుమారు 55 ఎకరాల భూములను సేకరించనుంది. ఈమేరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) నోటిఫికేషన్ను విడుదల చేసింది. భూ నిర్వాసితులకు భూ బదలాయింపు హక్కు (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్–టీడీఆర్) రూపంలో పరిహారం అందించాలని నిర్ణయించారు. పట్టా భూములకు టీడీఆర్ సర్టిఫికెట్ల ● సుందరీకరణలో సీఎం రేవంత్ లక్ష్యానికి అనుగుణంగా.. బాపూఘాట్ ప్రాంతాన్ని గాంధీ సరోవర్గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలి దశలో జంట జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ల నుంచి బాపూఘాట్ వరకు అభివృద్ధి చేయనున్నారు. ఫేజ్–1ఏలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కి.మీ, ఫేజ్–1బీలో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ చేపట్టి.. నదికి రెండు వైపులా మొత్తం 21 కి.మీ. మేర అభివృద్ధి చేయనున్నారు. పరీవాహక ప్రాంతంలో సరైన రెవెన్యూ పత్రాలు, పట్టా భూములున్న వారికి టీడీఆర్ సర్టిఫికెట్లను అందజేయనున్నారు. సుందరీకరణ ఇలా.. ఘన, జల వ్యర్థాలతో నిండిపోయిన నదిని మొదట శుభ్రం చేస్తారు. 2 మీటర్ల లోతు వ్యర్థాలు, పూడిక తీస్తారు. ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తారు. చుట్టూ మురుగునీటి శుద్ది కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను మళ్లించి.. 24/7 నదిలో పారేలా సుందరీకరిస్తారు. నడక మార్గాలు, సైకిల్ ట్రాక్లు, భూగర్భ జలాల రీచార్జ్ కోసం పార్క్లు, వర్షపు తోటలు, గ్రీన్రూఫ్లు, బ్యాటరీ వాహనాలు, ఎలక్ట్రిక్ రిక్షాలు వంటివి ఉంటాయి. నైట్ ఎకానమీలో భాగంగా అమ్యూజ్మెంట్పార్క్, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్స్ వాటర్ స్పోర్ట్స్, వీధి వర్తకుల వ్యాపార సముదాయాలు, వంతెనలు, వినోద కేంద్రాలు, రెస్టారెంట్లు, క్రీడా సౌకర్యాలు, వాణిజ్య, రిటైల్ స్థలాలను అభివృద్ది చేస్తారు. -
రూ.వెయ్యి కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్.. అక్కడ స్థలం విలువ గజం రూ.2 లక్షలు.. అలాంటి ప్రాంతంలో పార్కును 150 గజాల మేర కబ్జా చేశాడో ప్రబుద్ధుడు. అలాగే హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్కు చేరువలోని ఖానామెట్ ప్రాంతం.. అక్కడ ఎకరం రూ.200 కోట్లు. ఐదెకరాల వెలమ సంఘానికి గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమి విలువ రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా. ఆ కేటాయింపులపై కొంతమంది అభ్యంతరం చెప్పడంంతో కోర్టు స్టే ఇచ్చింది. ఇదే అదునుగా ఆక్రమణల పర్వానికి తెరదీశారు. కబ్జారాయుళ్లు ఈ రెండు కబ్జాలపై హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులు అందాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో హైడ్రా అధికారులు పరిశీలించారు. కబ్జాలను నిర్థారించుకుని బుధవారం ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ వేశారు. ఇలా మొత్తం రూ.1,003 కోట్ల ప్రభుత్వ ఆస్తిని హైడ్రా కాపాడింది. కబ్జా చేసిన కిరాయిదారుడు.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి ఔట్గేటు ఎదురుగా రెండెకరాల మేర పార్కు ఉంది. అక్కడ ఓ ఇంటిని కిరాయికి తీసుకుని లేడీస్ హాస్టల్ నడుపుతున్న వ్యక్తి కన్ను ఆ పార్కు స్థలంపై పడింది. ఇంకేముంది.. 150 గజాల మేర పార్కును ఆక్రమించాడు. కాంపౌండ్ దాటి పార్కులోకి 50 గజాల మేర జరిగి పాత భవనానికి ఆనుకుని మరో నిర్మాణం చేపట్టాడు. ఒక్కో అంతస్తులో గదులు నిర్మించాడు. ఇంటి యజమాని కూడా ఈ కబ్జాలపై మౌనంగా ఉన్నాడు. పార్కు వైపు గేటు పెట్టి 100 గజాల మేర ఫార్మ్హౌస్ మాదిరి సొంత పార్కును అభివృద్ధి చేసుకుని వాడుకుంటున్నాడు. అక్కడ చుట్టుపక్కల నివాసితులు అభ్యంతరం వ్యక్తంచేశారు. హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు కూడా చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో హైడ్రా పరిశీలించింది. పార్కులోకి 50 గజాల మేర జరిగి నిర్మాణం చేపట్టినట్లు నిర్థారించుకుంది. మరో 100 గజాల మేర హద్దులు వేసుకుని ఆక్రమణ చేసినట్టు స్పష్టం చేసుకుంది. ఈ మేరకు బుధవారం మూడంతస్తుల నిర్మాణాన్ని తొలగించారు. పార్కు కబ్జా ప్రయత్నాలకు ఫుల్స్టాఫ్ పెట్టి ఫెన్సింగ్ వేశారు. కబ్జాకు పాల్పడిన వారిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఖానామెట్లో ఐదెకరాలు.. హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు సమీపంలోని ఖానామెట్లో ఆల్ ఇండియా వెలమ సంఘానికి ఐదెకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలం చుట్టూ ప్రీకాస్ట్ వాల్లో ప్రహరీ నిర్మిస్తుండగానే, కుల సంఘాలకు స్థలాలు కేటాయించడంపై కొంతమంది కోర్టుకెక్కడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఇదే అదునుగా ఆ స్థలాన్ని వెనుక వైపు నుంచి అక్కడ ఉన్న స్థానికులు మట్టిపోస్తూ కబ్జా చేస్తున్నారని, అదేమని అడిగితే వాచ్మెన్పై దాడి చేస్తున్నారని ఆ సంఘం ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కోర్టు తీర్పును బట్టి నిర్ణయం ఉంటుంది. ఈ లోగా అక్కడి స్థలం కబ్జాకు గురికాకుండా చూడాలని హైడ్రాను కోరారు. ఈ మేరకు పరిశీలించి ఐదెకరాల మేర ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటుచేసింది. జూబ్లీహిల్స్లో పార్కు స్థలం,ఖానామెట్లో ఐదెకరాల ప్రభుత్వ భూమికి రక్షణ -
సీఎం నివాసం ముట్టడికి యత్నం
బంజారాహిల్స్: బంజారాల ఆరాధ్యదైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠను హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో బుధవారం ‘చలో సీఎం రేవంత్రెడ్డి ఇంటి ముట్టడి’ కార్యక్రమం నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి బంజారా సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకుని వాహనాల్లో స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సంఘం జాతీయ అధ్యక్షుడు కొర్ర మోతీలాల్నాయక్, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సక్రిబాయిలు మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని నల్లమల అటవీ ప్రాంతమైన నాగర్కర్నూల్ జిల్లా మద్దిమడుగు ప్రాంతంలో ప్రతిష్టించడం అంటే లంబాడీలను అవమానపరిచినట్లేనన్నారు. ప్రభుత్వానికి లంబాడీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే నగరంలో గానీ, నగర పరిసర ప్రాంతాల్లో గానీ విగ్రహంతో పాటు సేవాలాల్ మందిరం నిర్మించాలన్నారు. సేవాలాల్ బంజారా సంఘం నేతల అరెస్టు -
నేపాల్లో స్కెచ్.. జూబ్లీహిల్స్లో అమలు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లోని నందగిరి హిల్స్లో ప్రముఖ పారిశ్రామికవేత్త రవీంద్ర శర్మ నివాసంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో నేపాలి గ్యాంగ్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. చోరీ ప్లాన్ నేపాల్ లో వేయగా అమలు జూబ్లీహిల్స్ లో జరిగింది. స్కెచ్ వేసిన జీవన్ చాంద్ 2021 అక్టోబర్ 16న ఖైరతాబాద్లోనిహిల్స్ కాలనీలో యజ్ఞ అగర్వాల్ అనే వ్యాపారవేత్త ఇంట్లో రూ.80 లక్షలు విలువచేసే వజ్రాభరణాలు దొంగిలించి పరారయ్యాడు. అప్పటినుంచి సైఫాబాద్ పోలీసులు ఈ దొంగ కోసం వెతుకుతుండగా ఇంకా పరారీ లోనే ఉన్నాడు. జీవన్ మధ్యలో ఒకసారి హైదరాబాదుకు వచ్చి మరో దొంగతనం చేసి పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యాడు. తాజాగా నందగిరిహిల్స్లో రవీంద్ర శర్మ నివాసంలో దొంగతనానికి నేపాల్లోనే జీవన్ పక్కా స్కెచ్ వేసి భూపేంద్ర షాహి అనే వ్యక్తిని వంట మనిషిగా పెట్టించాడు. రెండు వారాల వ్యవధిలోనే భూపేంద్ర షాహి తన అనుచరుడు నేపాల్ కు చెందిన కృష్ణ చాంద్, రమేష్ తో కలిసి రెక్కీ నిర్వహించి గత శుక్రవారం రూ.1.30కోట్ల విలువచేసే వజ్రాలు దొంగిలించి పరారయ్యాడు. భూపేంద్రశాహి, కృష్ణ చాంద్ ఇద్దరూ కలిసి ముంబైలో నేపాల్కు చెందిన తమ స్నేహితులు లలిత్, కిషన్ సాయి వద్ద ఆశ్రయం పొందారు. దొంగతనం చేసిన సమయంలో అక్కడ పడిపోయిన సెల్ఫోన్ ఆధారంగా పోలీసులు వీరి జాడ కనిపెట్టారు. భూపేంద్ర షాహి, కృష్ణ చాంద్ ఇద్దరు నేపాల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్లో రమేష్ పరారీలో ఉన్నాడు. భూపేంద్ర షాహిని వంట మనిషిగా మాట్లాడిన మదన్ లాల్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు నేపాల్ బార్డర్ దాటకముందే హైదరాబాద్ పోలీసులకు చిక్కారు ప్రధాన నిందితుడు జీవన్ ను హైదరాబాదుకు రప్పించేందుకు పోలీసులు ఇంటర్ పోల్ ను ఆశ్రయించాలని నిర్ణయించారు. మొత్తానికి జూబ్లీహిల్స్ లో జరిగిన దొంగతనం వల్ల 2021 లో సైఫాబాద్ లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడు బయటపడ్డాడు. పరారీలో ప్రధాన నిందితుడు.. గతంలో నగరంలోనూ చోరీ మరో ఇద్దరి రిమాండ్ -
‘ముద్ర రుణం’ పేరిట మోసం
సాక్షి, సిటీబ్యూరో: ‘ముద్రా లోన్ సర్వీసెస్’ పేరుతో రుణాలు ఇస్తామంటూ ఎర వేసి మోసాలకు పాల్పడుతూ ఢిల్లీలో స్థిరపడిన ఐదుగురు రాష్ట్ర వాసుల్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీళ్లు లోన్ ఆఫీసర్లుగా నటిస్తూ టోకరా వేశారని డీసీపీ వి.అరవింద్బాబు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఈ స్కామ్కు పాల్పడే సూత్రధారులు తెలుగు వారిని మోసం చేయడానికి వీరిని వినియోగించుకున్నట్లు ఆయన వివరించారు. ఫేస్బుక్ ప్రెండ్స్తో జట్టుకట్టి.. వరంగల్ జిల్లాకు చెందిన బోచు అరుణ్, గడ్డం భరత్, సామర్ల తిరుపతి, వెల్పుగొండ తరుణ్, చుక్క శ్యామ్ స్నేహితులు. వీళ్లు తమ చదువును మధ్యలోనే ఆపేసి కూలీ పనులు ప్రారంభించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఫేస్బుక్ ప్రకటనల ద్వారా పరిచయమైన ఢిల్లీ వాసి రాహుల్తో జట్టుకట్టారు. అతడి ద్వారా ఢిల్లీ, కోల్కతాల్లో ఉన్న అక్రమ కాల్ సెంటర్లలో చేరారు. కిట్టు అనే మేనేజర్ వీరికి కొన్నాళ్లు కోల్కతాలో వసతి కల్పించి, మోసం చేసే విధానంపై శిక్షణ ఇచ్చాడు. సూత్రధారులు ముద్రా లోన్లు, ఇతర రుణాల పేరుతో సోషల్మీడియాలో ప్రకటన ఇచ్చేవారు. ఎటువంటి వడ్డీ, ముందస్తు చెల్లింపులు లేకుండానే మంజూరు చేస్తామని నమ్మించారు. ఆసక్తి చూపిన వారి డేటాను సేకరించి, రాష్ట్రాల వారీగా విభజించి, తెలుగు డేటాను ఈ ఐదుగురికీ ఇచ్చేవాడు. వీరిలో ఒక్కోక్కరూ ప్రతిరోజూ 180 నుంచి 200 కాల్స్ చేస్తూ బాధితులను నమ్మించే వారు. ఆపై ప్రాసెసింగ్ ఫీజు, టీడీఎస్, ఇన్కమ్ టాక్స్ చార్జీల పేరుతో డబ్బులు వసూలు చేసేవారు. అలా దోచుకున్న మొత్తం నుంచి ఈ నిందితులకు 30 శాతం కమీషన్ లభించేది. ఇన్స్ట్రాగామ్లో లోన్ ప్రకటన చూసి.. నగరానికి చెందిన ఓ మహిళ (36) గత ఏడాది నవంబర్ 6న ఇన్స్ట్రాగామ్లో లోన్ ప్రకటన చూసి ఆసక్తి చూపారు. మరుసటి రోజు ఆమెకు ఓ ఫోన్ వచ్చింది. ‘ముద్రా లోన్ సర్వీసెస్’ అధికారి కిలా పవనర్ కుమార్గా పరిచయం చేసుకున్న మోసగాడు... ఆమె పేరు మీద రూ.3 లక్షల రుణం మంజూరైందని చెప్పాడు. ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు అవసరం లేదని నమ్మించి, అర్హత కోసం ఆధార్, పాన్కార్డ్ వివరాలు తీసుకున్నాడు. ఆపై ఇన్సూరెన్స్ ఛార్జీల పేరుతో రూ.7,200, టీడీఎస్ పేరుతో రూ.15 వేలు డిమాండ్ చేశాడు. ఇలా రకరకాల పేర్లు చెప్పి రూ.1,08,274 వసూలు చేశాడు. దీంతో బాధితురాలు తనకు లోన్ వద్దని... ఇప్పటికి ఇచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వాలని కోరగా, క్యాన్సిలేషన్ ఫీజు పేరుతో మరింత మొత్తం డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఇన్స్పెక్టర్ పి.శివచంద్ర నేతృత్వంలోని బృందం ఐదుగురినీ అరెస్టు చేసింది. వీరి నుంచి ఎనిమిది ఫోన్లు, పది సిమ్కార్డులు స్వాధీనం చేసుకుంది. సైబర్ సూత్రధారుల దందా గుట్టురట్టు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు -
గల్లీగల్లీలో గస్తీ
● సైబరాబాద్లో విజిబుల్ పోలీసింగ్ సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసులు విజిబుల్ పోలిసింగ్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడంతో పాటు అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చేతిలో లాఠీలతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గురువారం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) హరికృష్ణా రెడ్డి సిబ్బందితో కలిసి 9 ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. అలాగే జన సమర్దం అధికంగా ఉన్న ప్రాంతాలు, అలీజాపూర్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెయిన్ బో విస్టా జంక్షన్ వద్ద సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. అలాగే ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. నిరంతర పెట్రోలింగ్, వాహన తనిఖీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తామని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్ రెడ్డి ప్రజలకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం విజిబుల్ పోలీసింగ్ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు -
చంద్రహాస్పై మరో కేసు
బంజారాహిల్స్: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు సినీహీరో చంద్రహాస్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కె.వెంకటేశ్వరరెడ్డి తెలిపిన మేరకు.. చంద్రహాస్ హీరోగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వారం క్రితం జూబ్లీహిల్స్లోని దస్పల్లా హోటల్లో నిర్వహించారు. వేడుకల్లో చంద్రహాస్ అసభ్య పదజాలంతో పాటపాడాడు. దీంతో చంద్రహాస్ ఉపయోగించిన భాష సరికాదని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ నితీష్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని చంద్రహాస్ కోసం గాలింపు చేపట్టారు. మాదాపూర్ పీఎస్లో కూడా ఇతనిపై కేసు నమోదైంది. 12.7 తులాల బంగారు నగలు చోరీవిజయనగర్కాలనీ: ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో దొంగలు 12.7 తులాల బంగారు నగలు చోరీచేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఆసిఫ్నగర్ హుడా కాలనీలో నివాసముండే ప్రభాకర్ రెడ్డి (58) గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్థానిక విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కు వెళ్లాడు. ఓ గంట తరువాత తిరిగి ఇంటికి రాగా 2వ ఫ్లోర్లోని ఇంటి తాళం ధ్వంసమై ఉంది. లోపలకు వెళ్లి చూడగా అల్మార పగులగొట్టి అందులోని 12.7 తులాల బంగారును దొంగలు చోరీ చేసినట్లు గుర్తించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాంకేతిక సమస్య.. విమానం ఆలస్యం శంషాబాద్: బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఓ విమానం సాంకేతిక కారణాలవల్ల రెండుగంటలు ఆలస్యంగా బయలుదేరింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్రాంక్ఫర్ట్కు బయలుదేరేందుకు లుఫ్తాన్సా ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ప్రయాణికులు ఎక్కికూర్చున్నారు. గురువారం తెల్లవారు జామున 3.40 గంటలకు టేకాఫ్ తీసుకునే సమయంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మరమ్మతుల అనంతరం రెండుగంటలు ఆలస్యంగా బయలుదేరింది. మత్తులో ఉన్న ప్రయాణికుడి దించివేత శంషాబాద్: మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడిని విమానంలోంచి దించివేసిన సంఘటన ఎయిర్పోర్టులో చోటు చేసుకుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం ఢిల్లీకి వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడు మద్యం మత్తులో స్పృహ లేకుండా ఉండిపోయాడు. దీంతో ఎయిర్లైన్స్ అధికారులు కిందికి దించివేశారు. లిఫ్ట్ అడిగి చోరీకి యత్నం లంగర్హౌస్: ఓ యువకుడు ద్విచక్రవాహనదారుడిని లిఫ్ట్ అడిగి చోరీకి యత్నించాడు.ఈ సంఘటన లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మొయినాబాద్లో నివాసముందే రాము గురువారం ఉదయం గుడిమల్కాపూర్ నుంచి ఇంటికి బయల్దేరాడు. సంగం వద్ద బీహార్కు చెందిన యువకుడు లిఫ్ట్ ఇవ్వాలని ఆపాడు. ట్రాఫిక్ పోలీసులు తన ద్విచక్ర వాహనాన్ని లాక్కున్నారని, తాను అత్యవసరంగా వెళ్లాలని రామును కోరాడు.దీంతో రాము అతనికి లిఫ్ట్ ఇచ్చాడు. ఆ తరువాత వెనుక కూర్చున్న యువకుడు రాము జేబు కట్ చేసి డబ్బు చోరీచేయబోయాడు.గమనించిన రాము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని స్థానికుల సహకారంతో పోలీసులకు అప్పగించబోయాడు. ఈ క్రమంలో ఆ దొంగ.. రాము కాళ్లు , చేతులు రక్తం వచ్చేలా కొరికి పరారయ్యాడు. దీంతో స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆటోను ఢీ కొట్టిన టిప్పర్ ● ఆటోలో ఏడుగురు విద్యార్థులు ● పాఠశాలకు వెళుతుండగా ప్రమాదం జియాగూడ: విద్యార్థులను పాఠశాలను తీసుకెళుతున్న ఓ ఆటోను ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థితోపాటు ఆటో డ్రైవర్ గాయపడ్డాడు. కుల్సుంపురా ఇన్స్పెక్టర్ రాములు తెలిపిన మేరకు.. జియాగూడకు చెందిన సందీప్ (35) గురువారం ఉదయం జియాగూడ నుండి అత్తాపూర్లోని శ్రీ చైతన్య స్కూల్కు చెందిన ఏడుగురు విద్యార్థులను ఆటోలో తీసుకువెళుతున్నాడు. ఈ క్రమంలో పాత బస్తీకి చెందిన షఫీ వేగంగా టిప్పర్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆటోను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థితోపాటు, డ్రైవర్ సందీప్ గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధిక పనిగంటలతో అధ్యాపకుల్లో ఒత్తిడి సాక్షి,సిటీ బ్యూరో: ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాలలో బోధన, మానిటరింగ్ పేరుతో అధిక పని గంటల విధానం తొలగించాలని తెలంగాణ రెసిడెన్నియల్ డిగ్రీ కాలేజ్ ఎంపవరింగ్ అసోసియోషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ తట్ల సాంబలక్ష్మి, డాక్టర్ రమాదేవి డిమాండ్ చేశారు. ఉదయం 8.45 నుండి సాయంత్రం 5 గంటలు విధులు నిర్వహించడంతోపాటు పాటు వారానికి రెండు నుండి మూడు నైట్ డ్యూటీలు చేయాల్సి వస్తోందన్నారు. రాత్రి డ్యూటీ చేసిన రోజు అధ్యాపకులు ఉదయం నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు నిర్విరామంగా కళాశాలలోనే ఉంటున్నారన్నారు. దీంతో 28 గంటలు ఏకధాటిగా కళాశాలలో పనిచేయడం వల్ల మానసిక ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమన్నారు. -
ఇంటర్ బోర్డు ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన
గన్ఫౌండ్రీ : ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు రజనీకాంత్ మాట్లాడుతూ... కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థుల నుంచి ప్రత్యేకంగా నగదు వసూలు చేసి వాటిని ఇంటర్ బోర్డు అధికారులకు అందజేసి మాస్ కాపీయింగ్కి పాల్పడ్డారని ఆరోపించారు. సీసీ కెమెరాలు సైతం పనిచేయకుండా చేసి చిట్టీలు పెట్టి మరి పరీక్షలు రాయించారని మండిపడ్డారు. అనంతరం ఇంటర్ బోర్డు అధికారికి వినతి పత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, సహాయ కార్యదర్శి మమత, జిల్లా కార్యదర్శి అశోక్రెడ్డి, పాల్గొన్నారు. -
తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి జాతీయ అక్రిడిటేషన్
● వైద్య సేవా ప్రమాణాల మెరుగుదలకు మరింత కృషి ● సూపరింటెండెంట్ డాక్టర్ శైలజా మూర్తి సాక్షి, సిటీబ్యూరో: తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఏబీహెచ్) గుర్తింపు లభించింది. నాణ్యమైన వైద్యసేవలు, రోగి ఆరోగ్య భద్రతను నిర్ధారించే దిశగా ఆసుపత్రి చేస్తున్న నిరంతర కృషికి ఇదో మైలురాయిగా నిలువనుంది. అధునాతన క్రిటికల్ కేర్ సేవలు, మాడ్యులర్ సూపర్ స్పెషాలిటీ ఆపరేషన్ థియేటర్లు, పూర్తిస్థాయి క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు, వివిధ రకాల చికిత్సలు తార్నాక ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. ఈ సదుపాయాలు రోగులకు ప్రత్యేక వైద్య సేవలను అందించడానికి సహాయపడుతున్నాయి. ఆసుపత్రి విద్యా, శిక్షణ కార్యక్రమాలను కూడా విస్తరించింది. 100 సీట్ల బీఎస్సీ నర్సింగ్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, శస్త్రచికిత్స, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్లలో డీఎన్బీ పీజీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎన్ఏబీహెచ్ గుర్తింపు లభించడం పట్ల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ మూర్తి, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ పి. శ్రీనివాస్ , ఇతర వైద్య బృందాన్ని ఆర్టీసీ సీఎండీ నాగిరెడ్డి అభినందించారు. వైద్యుల సమష్టి కృషి, పట్టుదల, అత్యుత్తమైన ఆరోగ్య సేవల్ని సాధించాలనే అచంచలమైన సంకల్పానికి ఇది నిదర్శనమని కొనియాడారు. టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు, అర్హులైన వారి కుటుంబ సభ్యులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రతిష్టాత్మకమైన ఎన్ఏబీహెచ్ సర్టిఫికేషన్ దక్కడం సంతోషంగా ఉందని, ఇది అందరి కృషితోనే సాధ్యమైందని సూపరింటెండెంట్ శైలజామూర్తి పేర్కొన్నారు. మెరుగైన వైద్య సేవలు, నాణ్యత ప్రమాణాలకు ఇది ఒక గుర్తింపుగా నిలుస్తుందన్నారు. -
నల్ల చెరువు ఆక్రమణలను త్వరలోనే తొలగిస్తాం
● హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉప్పల్: రూ.20 కోట్లతో నల్ల చెరువును అభివృద్ధి చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఈ మేరకు గురువారం ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జి పరమేశ్వర్ రెడ్డి తో కలిసి నల్ల చెరువును సందర్శించారు. నల్ల చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులను ఏకకాలంలో సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. చెరువు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు కబ్జాకు గురైనట్లు గుర్తించామని. త్వరలోనే వాటిని తొలగించి నల్ల చెరువును రక్షిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంజయ్య, లింగంపల్లి రామకృష్ణ, తుమ్మల దేవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేషనల్ డ్రోన్ ఇన్నొవేషన్ ఛాలెంజ్లో సార్క్స్ హవా
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ స్థాయిలో గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన నిడార్ 2026 నేషనల్ డ్రోన్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో నగరానికి చెందిన సార్క్స్ (సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్స్పీడీషన్) బృందం టాప్–5లో నిలిచి సత్తా చాటింది. నగరంలోని గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కి చెందిన ఈ బృందం ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం రూపొందించిన వారి డ్రోన్ పరిష్కారం, విపత్తుల సమయంలో ప్రాణాలను రక్షించే సాంకేతికత ఎలా ఉండాలనే ప్రయత్నానికి దేశ వ్యాప్తంగా ఆదరణ లభించింది. ముగిసిన జాతీయ బాక్సింగ్ పోటీలు బొల్లారం : బొల్లారంలోని ఎల్ఆర్ఎంజీ గ్రౌండ్లో నిర్వహించిన ఓపెన్ నేషనల్ బాక్సింగ్ అండ్ సిలంబం (కర్రసాము) పోటీలు గురువారం ముగిశాయి. పోటీల్లో హరియాణ, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జట్లు పాల్గొన్నాయి. మొత్తం 200కిపైగా బాలబాలికలు బాక్సింగ్ పోటీల్లో, 50 మంది సిలంబం పోటీల్లో పాల్గొన్నారు. తమిళనాడు జట్టు విజయం సాధించగా..తెలంగాణ ద్వితీయస్థానం, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం దక్కించుకున్నాయి. బ్లూ వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ నరసింహన్ కన్నన్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. బ్లూ వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నవీన్ రాజ్, ఉపాధ్యక్షుడు జి. అరవింద్ పాల్గొన్నారు. సంతోష్నగర్: కంచన్బాగ్ డీఆర్డీఎల్ ప్రధాన రహదారిపై గురువారం కారు టైర్ ఊడిపోవడంతో అదుపుతప్పి డివైడర్ మీదుగా పల్టీ కొట్టి రోడ్డుపై పడి అటుగా వచ్చిన మరో కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రోడ్డుపై చోటు చేసుకోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్నాక్స్ సెంటర్లోకి దూసుకెళ్లిన రెడిమిక్స్ వాహనం మియాపూర్: మియాపూర్ జేపీఎన్నగర్ కాలనీలో స్నాక్స్ సెంటర్లోకి రెడిమిక్స్ మిషన్ వాహనం దూసుకెళ్లింది.స్థానికులు తెలిపిన మేరకు.. గురువారం జేసీబీ వాహనానికి మిని రెడిమిక్స్ మిషన్ వాహనాన్ని వెనక భాగంలో తగిలించుకొని వెళుతున్నారు. ఈ క్రమంలో హుక్ ఊడిపోవడంతో రెడిమిక్స్ మిషన్ స్నాక్స్ సెంటర్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో లోపల ముగ్గురు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ప్రమాదం జరగలేదు. -
హాస్టల్, హోటల్లో అగ్ని ప్రమాదాలు
ముషీరాబాద్ గాంధీనగర్లోని ఓ హాస్టల్, బంజారాహిల్స్లోని ఓ హోటల్లో గురువారం అగ్ని ప్రమాదాలు జరిగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎక్కడా ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిక్కడపల్లి : గాంధీనగర్లో సుధామ పీజీ ఉమెన్స్ హాస్టల్లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం జరిగినప్పడు హాస్టల్లో మ్గుగురు విద్యార్థులు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అర్పి వేశారు. ప్రమాదం జరిగినపుడు మొదటి ఫ్లోర్లో ఉన్న ఇద్దరు విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. రెండో అంతస్తు మంటల్లో చిక్కుకున్న ఓ విద్యార్థిని ఇద్దరు యువకులు సాహసోపేతంగా బయటికి తీసుకొచ్చి రక్షించారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో విద్యార్థినుల సర్టిఫికెట్లు మొత్తం కాలిపోయాయి. అగ్ని ప్రమాదం గీజర్ వల్లే జరిగిందని సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ జోగుల నర్సయ్య, చిక్కడపల్లి ఏసీపీ రమేష్కుమార్ తెలిపారు. యువతిని కాపాడిన ఆంజనేయులు, అరుణ్లను పోలీసులు అభినందించారు. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ముఠాగోపాల్ పరిశీలించారు. హోటల్లో .. బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్–3లోని లెవెంట్ హోటల్లో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చిమ్నీలో నుంచి ఒక్కసారిగా పొగలు, మంటలు రావడంతో స్థానికులు భయాభ్రాంతులకు గురయ్యారు. హోటల్లో ఉన్న వారంతా బయటకు పరుగులు తీశారు.అగ్నిమాపక సిబ్బంది గంటపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. కొంత ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా నాంపల్లి ఘటనతోనైనా అధికారులు మేల్కొనలేదు. బంజారాహిల్స్లో అగ్ని ప్రమాదం జరిగిన లెవెంట్ హోటల్కు ఫైర్ సేఫిటీ లేదని అధికారులు గుర్తించారు. ఎంట్రీ సరిగా లేదు. కిచెన్ పరిస్థితి భయానకంగా ఉంది. -
ఇంటిలిజెంట్ అడుగు..
నగరంలో అమలవుతున్న ‘ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్’ ● కొత్త విధానంతో భవిష్యత్తులో సమస్యలకు అవకాశం ● దీంతో కేసుల విచారణపై ఏ ప్రభావమూ పడకుండాపోలీసుల కార్యాచరణ ● ప్రత్యేకంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఏర్పాటు ● త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు విధానం (ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్) అమలవుతోంది. మొత్తం తొమ్మిది రకాలైన నేరాల్లో బాధితులుగా మారిన వారికి ఈ విధానం వర్తింపజేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. న్యాయస్థానంలో ట్రయల్పై ప్రభావం లేకుండా ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బాధితుల ఇళ్ల వద్ద నమోదు చేసే ఎఫ్ఐఆర్ల కోసం ప్రత్యేకంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే దీన్ని అమలులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కేసుకు ‘పునాది’ ఫిర్యాదే... ఏ కేసు అయినా బాధితుడి ఫిర్యాదు ఆధారంగానే నమోదవుతుంది. కేసు డైరీలు, అభియోపత్రాలకు సైతం ఫిర్యాదే పునాది. ఫిర్యాదు ఎంత పటిష్టంగా ఉంటే బాధితులకు అంత మేలు. చాలా మంది అన్యాయాన్ని పోలీసులకు వివరంగా చెప్పినా.. ఆ స్థాయిలో రాసివ్వలేరు. ఈ సందర్భాల్లో వారు ఠాణాకు వస్తే పూర్తిస్థాయిలో వినే సీనియర్ రైటర్లు, ఎస్సైలు, ఇన్స్పెక్టర్లు తగిన సలహాలు, సూచనలిస్తారు. పకడ్బందీ ఫిర్యాదుకు సహకరిస్తారు. గస్తీ సిబ్బందికే ఆ బాధ్యతలు.. ప్రస్తుతానికి నగర పోలీసులు ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ వంటి ఘటనల్లో ‘ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్’ అమలు చేస్తున్నారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. అనుభవం, నైపుణ్యమూ తక్కువే.. ఇప్పటి కానిస్టేబుళ్లు విద్యాధికులే అధికం. ఫిర్యాదు రూపొందించడం, కేసు నమోదుతో అనుభవం, నైపుణ్యం సైతం అవసరం. గస్తీ సిబ్బందిలో అత్యధికులు కొత్త కానిస్టేబుళ్లే ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారికి ఈ అంశాలపై పట్టు లేకపోవడం, బాధితులు అంత పక్కాగా ఫిర్యాదు రాసి ఇవ్వలేకపోయే అవకాశం ఉంది. దీని ప్రభావం ఇప్పుడు కేసు నమోదుపై లేకపోయినా.. భవిష్యత్తులో కేసు విచారణ సందర్భంలో కచ్చితంగా ఉంటుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అందులోని లోపాల కారణంగా కేసులు వీగిపోయి, తప్పు చేసిన నిందితులూ బయటకు వచ్చేసే ప్రమాదం లేకపోలేదు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు ఏఐపై దృష్టి పెట్టారు. -
మార్కుల వేట.. అక్రమాల బాట
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ యథేచ్ఛగా సాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులకు గరిష్ట మార్కులు తెప్పించేందుకు అక్రమ మార్గాలను ఎంచుకున్నాయి. నిఘా నుంచి తప్పించుకునేందుకు యాజమాన్యాలు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఉద్దేశపూర్వకంగా ఆపేస్తుండగా, మరికొన్ని చోట్ల కెమెరా కంటికి ఆనని రీతిలో విద్యార్థులను కూర్చోబెట్టి తతంగాన్ని నడిపిస్తున్నాయి. ల్యాబ్ అసిస్టెంట్లు స్వయంగా రీడింగ్స్ రాసివ్వడం, సైగల ద్వారా సమాధానాలు చెప్పడం, రికార్డులు అందిస్తూ రాయించడం వంటి దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమారు 65 శాతం మంది ఎగ్జామినర్లు ప్రైవేట్ రంగం వారే కావడంతో పరస్పర అవగాహనతో ఈ వ్యవహారం సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు విద్యార్థులకు జంబ్లింగ్ విధానం అమలవుతోంది. విద్యార్థులు తమ సొంత కళాశాలల్లో కాకుండా ఇతర కళాశాలలకు వెళ్లి పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లోని ల్యాబ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అన్ని జిల్లాల పరీక్ష కేంద్రాలను సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సంబంధిత విద్యాధికారికి సమాచారం అందించి నిమిషాల వ్యవధిలోనే ఫ్లయింగ్ స్క్వాడ్ను అక్కడికి పంపించేలా చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలకు అడ్డంగా దొరికి.. నగరంలోని కొన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు స్వయంగా సిబ్బందే సమాధానాలు చెప్పడం, ల్యాబ్ అసిస్టెంట్లు రికార్డులను పక్కన పెట్టుకుని రాపిస్తుండటం వంటి దృశ్యాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిఘాతో బయటపడ్డాయి. దీనిపై స్పందించిన ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘించిన 14 మంది ఎగ్జామినర్లు, ల్యాబ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించి బ్లాక్ లిస్టులో పెట్టింది. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే కాలేజీల గుర్తింపును రద్దు చేస్తామని బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే విద్యార్ధులతోపాటు సిబ్బందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అక్రమాలను అరికట్టేందుకు తనిఖీలను ముమ్మరం చేయనున్నట్లు అధికారులు చెప్పారు. కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో మాస్ కాపీయింగ్ పట్టుబడ్డ 14 మంది ఎగ్జామినర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాయాజాలం -
అపాయింట్మెంట్ లేకుండానే అందుబాటులో ఉంటా
మధ్యాహ్నం 2 తర్వాత నన్ను కలవవచ్చు: సీపీ సజ్జనర్ సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి సమస్య, సందేహం, ఫిర్యాదు ఉన్నా ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా నేరుగా తనను కలవవచ్చని నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ గురువారం ప్రకటించారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల తర్వాత బంజారాహిల్స్లోని ఐసీసీసీ భవనంలో తాను అందుబాటులో ఉంటానన్నారు. శుక్రవారం పాతబస్తీ చెత్తబజార్లోని కొత్వాల్ హౌస్కు రావాల్సి ఉంటుందని ఆయన వివరించారు. సీపీ సార్.. నేనూ పోలీసింగ్ చేస్తా.. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో గురువారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన షీల్డ్–2026 కార్యక్రమానికి నగర సీపీ సజ్జనర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ కొలువుదీరిన రోబోతో ఆయన సరదాగా ఇలా కరచాలనం చేశారు. తానూ పోలీసింగ్ చేస్తానని ఆ రోబో అన్నట్లు ఉంది కదూ ఈ చిత్రాన్ని చూస్తే! -
అల.. ప్రచార పురంలో..
శివారు మున్సిపాలిటీల్లో రంజుగా రాజకీయం సాక్షి, రంగారెడ్డిజిల్లా: నగర శివారులోని మున్సిపాలిటీల ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. రంగారెడ్డి జిల్లాలోని మెజారిటీ స్థానాల కై వసమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు అభ్యర్థుల గెలుపునకు ప్రచారం ముమ్మరం చేశారు. ఉదయం ఇంటింటా ప్రచారం చేసి, మధ్యాహ్నం పట్టణ కేంద్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం కుల సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, కార్మిక సంఘాలతో భేటీ అవుతున్నారు. గురువారం చేవెళ్లలో డీసీసీ చీఫ్ చల్లా నరసింహారెడ్డి అధ్యక్షతన మాజీ ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి భీంభరత్ సన్నాహక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ కో ఆర్డినేటర్ల నియామకం బలమైన అభ్యర్థులను బరిలోకి దించిన అధికార పార్టీ తాజాగా ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో ఆర్డినేటర్ను నియమించింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కోఆర్డినేటర్గా వి.జగదీశ్వర్గౌడ్, చేవెళ్లకు ఎన్.భూపతిరెడ్డి, మొయినాబాద్కు ఎంఏ ఫయీం, శంకర్పల్లికి బొంతు శ్రీదేవి, షాద్నగర్కు టి.ప్రకాష్గౌడ్, ఆమనగల్లు మున్సిపాలిటీకి పి.విజయారెడ్డిని ఇన్చార్జిలుగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అనుచరుల గెలుపు కోసం బీఆర్ఎస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇప్పటికే మున్సిపాలిటీల వారీగా ఇన్చార్జిలను నియమించింది. వీరంతా ప్రచార రంగంలోకి దిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో అన్నీ తానై వ్యవహరిస్తుండగా, మాజీమంత్రి సబితారెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాద్నగర్లో, మరో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆమనగల్లులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు నాలుగు రోజులే ఉండటంతో అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రచారం ముమ్మరం చేశాయి. తాయిలాలకు తెరలేపారు.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇల్లిల్లూ తిరుగుతున్నారు. బీజేపీ తరఫున మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ తరఫున డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్రెడ్డి గురువారం మూడు చింతలపల్లి, ఎల్లంపేట, అలియాబాద్ మున్సిపాలిటీల పరిధుల్లో ప్రచారం సాగించారు. గెలుపే ధ్యేయంగా పార్టీల వ్యూహం ఇన్చార్జిలను నియమించిన బీఆర్ఎస్ తాజాగా కాంగ్రెస్ జాబితా ప్రకటన రంగంలోకి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు -
చూపు ప్రసాదించారు
మూణ్నెల్ల శిశువుకు వెలుగులు ● చెక్ రిపబ్లిక్ పసికందు కళ్లకు శస్త్రచికిత్స ● విజయవంతంగా చేసిన ఎల్వీ ప్రసాద్ వైద్యులు బంజారాహిల్స్: పుట్టుకతోనే చూపులేని పసికందుకు నగరంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల వెలుగులు ప్రసాదించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన ఇమాద్ అనే మూడు నెలల పసివాడు ‘పీటర్స్ అనోమలీ’ అనే అరుదైన కంటి సమస్యతో బాధపడుతున్నాడు. కనుపాపలు పూర్తిగా తెల్లబడి చూపు లేకుండాపోయింది. ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల కల్లం అంజిరెడ్డి క్యాంపస్ వైద్యులు బాలుడిని పరిశీలించి.. రెండు కళ్లకూ ‘కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్న్’ (నల్ల గుడ్డు మార్పిడి శస్త్ర చికిత్స) విజయవంతంగా నిర్వహించారు. ఎడమ కన్ను మరింత క్లిష్టంగా ఉండడంతో అందులో గ్లకోమా (కంటి ఒత్తిడి) సమస్య కూడా ఉంది. దీనిని అదుపు చేసేందుకు ‘ట్రాన్స్స్కెరల్ సైక్లో ఫోటోకోగ్యులేషన్’ అనే పద్ధతిని, మందులను ఉపయోగించారు. శస్త్ర చికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న శిశువులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. బాలుడు వస్తువులను గుర్తుపట్టడం, చూపును స్థిరంగా ఉంచడం వంటి సానుకూల లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలకు చెందిన పీడియాట్రిక్ కార్నియా నిపుణులు డాక్టర్ మురళీధర్ రామప్ప మాట్లాడుతూ.. పీటర్స్ అనోమలీ వంటి క్లిష్టమైన సమస్యల్లో ఫలితాలను కచ్చితంగా చెప్పలేమన్నారు. సరైన సమయంలో శస్త్ర చికిత్స చేయడం, నిరంతర పర్యవేక్షణ ద్వారా చూపు వచ్చే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు ఆనందాన్ని పంచుకుంటూ.. బిడ్డ మొదటిసారి తమను చూస్తూ కళ్లల్లో కళ్లు పెట్టి నవ్వినప్పుడు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేమన్నారు. -
రెండు కొత్త పైపులైన్లు
● మంజీరా పథకానికి గ్రీన్సిగ్నల్ ● వారం రోజుల్లో గండిపేటకు ఆమోదం ● తాగునీటి వృథా కట్టడికి చర్యలు సాక్షి, సిటీబ్యూరో మహానగర దాహార్తిని తీర్చే మంజీరా, గండిపేట నీటి సరఫరా పథకాల పురాతన ప్రధాన పైపులైన్లకు ప్రత్యామ్నాయంగా మరో రెండింటిని ఏర్పాటు చేసేందుకు జలమండలి సిద్ధమైంది. దశాబ్దాల కాలం నాటి ప్రధాన పైపులైన్లు శిథిలావస్థకు చేరి తరచూ పగిలిపోవడం, 30 శాతం నీరు లీకేజీలతో వృథా అవుతోంది. సమస్య శాశ్వత పరిష్కారానికి పైపులైన్లను ఆధునికీకరించడంతో పాటు పాతలైన్ల వెంట సమాంతరంగా కొత్తవాటిని నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు (డీపీఆర్) నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. సీఎం నుంచి మంజీరా పైపులైన్ పథకానికి గ్రీన్సిగ్నల్ లభించగా, మరో వారం రోజుల్లో గండిపేట (ఉస్మాన్ సాగర్) పథకం రెండో పైపులైన్కు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. తరచూ అంతరాయం.. మంజీరా నీటి సరఫరా ప్రధాన పైపులైన్ దెబ్బతింది. నెలలో కనీసం రెండు మూడుసార్లు షట్డౌన్ (నీటి సరఫరా నిలిపివేత) తప్పడం లేదు. మరమ్మతుల కారణంగా సనత్ నగర్, ఖైరతాబాద్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, కార్వాన్, నాంపల్లి, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, పటాన్చెరుు, ఆర్సీపురం, రాజేంద్రనగర్, మహేశ్వరం, కుత్బుల్లాపుర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాపై కనీసం 24 నుంచి 72 గంటల వరకు ప్రభావం పడుతోంది. శాశ్వత పరిష్కారం కోసం ప్రధాన పైపులైన్ మరమ్మతులు, సమాంతరంగా రెండో పైపులైన్ వేసేందుకు జలమండలి సిద్ధమైంది. త్వరలో టెండర్లు పిలవనుంది. కాండూట్ మార్గంలో గ్రావిటీ ద్వారా.. వందేళ్ల క్రితం గండిపేట (ఉస్మాన్సాగర్) జలాశయం నుంచి ఆసిఫ్నగర్ వరకు నేచురల్ స్లోప్తో రాతి కాలువ (కాండూట్) మార్గం ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. కాగా.. పైపులైన్ లీకేజీలతో వృథాగా నేల పాలవుతోంది. 45 ప్రాంతాల్లో లీకేజీలతో 8 నుంచి 10 ఎంజీడీలు మాత్రమే వినియోగదారులకు సరఫరా చేరుతున్నాయి. శాశ్వత పరిష్కారం కోసం గండిపేట జలాశయం నుంచి ఆసిఫ్నగర్ రిజర్వాయర్ వరకు మరో పైపులైన్ ఏర్పాటుకు జలమండలి సిద్ధమైంది. ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించింది. రెండు మూడు రోజుల్లో గ్రీన్ సిగ్నల్ లభించనుందని సమాచారం. గండిపేట తాగునీటి పథకం మంజీరా.. -
బాధలు తట్టుకోలేక బలవన్మరణం
వేర్వేరుచోట్ల ఐదుగురి ఆత్మహత్యఇంట్లో గొడవలతో వివాహిత.. కీసర: ఇంట్లో గొడవల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కీసర పోలీసులు తెలిపిన మేరకు.. తమిళనాడుకు చెందిన కార్తీక్, భార్య సుభాషిణి (30), ఇద్దరు పిల్లలతో కలిసి కీసరలో నివసిస్తున్నారు. కొంత కాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం కార్తీక్ తల్లికి సుభాషిణికి మధ్య గొడవ జరిగింది. ఇంట్లో గొడవ జరుగుతోందని భర్తకు ఫోన్ చేసినా రాలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సుభాషిణి తన సోదరుడికి మెసేజ్ పంపింది. సోదరుడు వచ్చేలోపు ఇంట్లో ఉరివేసుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పని ఒత్తిడితో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మియాపూర్ : పని ఒత్తిడి తట్టుకోలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మియాపూర్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ తెలిపిన మేరకు.. ఉండ్రు సతీష్(31) దంపతులు మియాపూర్ బీకే ఎన్క్లేవ్ కాలనీలో నివాసముంటున్నారు. వీరితోపాటు సతీష్ తమ్ముడు వెంకటకృష్ణ కూడా ఉంటున్నాడు. సతీష్ గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సంక్రాంతి పండుగకు భార్య ఊరికి వెళ్లింది. బుధవారం ఉదయం 9 గంటలైనా సతీష్ బెడ్ రూమ్ తలుపులు తీయకపోవడంతో తమ్ముడు వెంకటకృష్ణ తలుపు తట్టినా స్పందించలేదు. దీంతో తలుపులు బద్దలు కొట్టి వెళ్లి చూడగా సతీష్ ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించాడు. మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పని ఒత్తిడి కారణంగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. భవనం పైనుంచి దూకి మహిళ.. కేపీహెచ్బీకాలనీ: ఓ మహిళ తాను పనిచేసే ల్యాబ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన శ్రీనివాసులు, అనిత భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కూతురు ఉంది. ఐదేళ్ల క్రితం వీరికి వివాహమైంది. బాచుపల్లి ప్రాంతలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాసులు ఫార్మా కంపెనీలో పని చేస్తుండగా అనిత (23) కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతంలోని సీబీసీఐడీ కాలనీలోని ల్యాబ్లో పనిచేస్తోంది. బుధవారం మధ్యాహ్నం సమయంలో ల్యాబ్ భవనం మూడో అంతస్తు నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు గమనించి వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. కేపీహెచ్బీ పోలీసులు భర్త శ్రీనివాసులును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనిత తల్లిదండ్రులు వచ్చిన తరువాత ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. రోజూ తమకు ఎదురయ్యే బాధలు తట్టుకోలేక ఐదుగురు వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. కీసర పోలీస్ స్టేషన్పరిధిలో వివాహిత, మియాపూర్ పీఎస్పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి, నిరుద్యోగి, కూకట్పల్లి పరిధిలో యువకుడు, కేపీహెచ్బీ పరిధిలో ఓ మహిళ బలవన్మరణం చెందారు. గడ్డిమందు తాగి యువకుడు.. మియాపూర్: కడప జిల్లా, బద్వేల్కు చెందిన వెంకటేష్ (30) ఉద్యోగం కోసం ఈ నెల 3న మియాపూర్కు వచ్చాడు. అదే రోజు రాత్రి 10.30 గంటలకు మియాపూర్ మాతృశ్రీనగర్ కాలనీలోని బొమ్మరిల్లు సమీపంలో గడ్డి మందు తాగాడు. ఆ తరువాత అతనే స్వయంగా 108 కు ఫోన్ చేసి చెప్పాడు. సిబ్బంది వచ్చి శ్రావణీ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం మాదాపూర్లోని ఆస్పత్రి మెయిన్ బ్రాంచ్కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడు బావమరిది వెంకటసుబ్బయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
ఇక చరిత్రలోనే..
● కాలగర్భంలో కలిసిపోనున్న మూడు వారసత్వ కట్టడాలు ● ఎంజీబీఎస్– ఫలక్నుమా వరకు మెట్రో పనులు చకచకా చార్మినార్: దారుషిఫాలోని ఓల్డ్ ఎంసీహెచ్ భవనం.. శాలిబండ క్లాక్ టవర్.. అలియాబాద్ సరాయ్.. ఈ మూడు వారసత్వ (హెరిటేజ్) కట్టడాలు కాలగర్భంలో కలవనున్నాయా? వీటి స్థానంలో మెట్రో స్టేషన్లు ఆవిర్భవించనున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఔను అనే వస్తున్నాయి. పాతబస్తీలో మెట్రో రైలు పరుగులు తీయడానికి అవసరమైన ఏర్పాట్లు చకచకా జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు విస్తరణతో పాటు ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో స్టేషన్ల కోసం ఇప్పటికే స్థలాలను ఎంపిక చేశారు. ఇందులో ఈ మూడు హెరిటేజ్ కట్టడాలను తొలగించి వాటి స్థానంలో మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. ఈ వారసత్వ కట్టడాల చరిత్రను ఒకసారి అవలోకనం చేస్తే.. అలియాబాద్ సరాయ్.. శాలిబండ నుంచి ఫలక్నుమా వెళ్లే ప్రధాన రోడ్డులో షంషీర్గంజ్ కన్నా ముందు అలియాబాద్ సరాయ్ చారిత్రక ప్రాంతం ఉంది. హెరిటేజ్ కట్టడమైన అలియాబాద్ సరాయ్లో ప్రస్తుతం వివిధ రకాల వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మరో మెట్రో స్టేషన్ రానుంది. నిజాం కాలంలో నగరానికి ఉన్న 13 దర్వాజాల్లో అలియాబాద్ కూడా ఒకటి. ఈ దర్వాజా పక్కనే యాత్రికుల సౌకర్యార్థ్యం విశ్రాంతి గదులను నిర్మించారు. కుతుబ్ షాహీల కాలంలో నగరానికి వచ్చే యాత్రికులు రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకోవడం కోసం చార్మినార్ నుంచి 2.5 కిలో మీటర్ల దూరంలో అలియాబాద్ సరాయ్ను నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ మెకానిక్, టైలర్, గార్మెంట్స్.. ఇలా దాదాపు 60 దుకాణాల వరకు కొనసాగుతున్నాయి.చార్మినార్ నుంచి చాంద్రాయణగుట్టకు వెళ్లే ప్రధాన రహదారిలో శాలిబండ ఏరియా ఉంది. ఈ ఏరియా క్లాక్ టవర్ పేరుతో ఫేమస్. ఇక్కడే మరో మెట్రో స్టేషన్ ఏర్పడనుంది. రాజా రాయ్ రాయన్స్ బహదూర్, రాజా చందూలాల్.. వీరిరువురు కుతుబ్ షాహీల కాలంలో రెవెన్యూ, అడ్మినిష్ట్రేషన్ పనులు చూసేవారు. శాలిబండ వద్ద రాజా రాయ్ రాయన్స్ ప్యాలెస్ ఉండేది. అప్పటి స్థానికుల సౌకర్యార్థం సమయం తెలియడం కోసం 1904లో యురోపియన్ స్టైల్లో ఈ క్లాక్ టవర్ నిర్మితమైంది. నలువైపులా గడియారాలను ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, రోమన్ భాషల్లో గంటల శబ్దంతో నిర్మించారు. 18వ శతాబ్దంలో మిలిటరీ క్వార్టర్స్ ఉండగా.. 19వ శతాబ్దానికల్లా నగరం విస్తరించడంతో నివాస ప్రాంతంగా రూపాంతరం చెందింది. ఎంజీబీఎస్ నుంచి మొదలయ్యే మెట్రో రైలుకు మొదటి మెట్రో స్టేషన్గా దారుషిఫాలోని పాత బల్దియా కార్యాలయాన్ని ఎంపిక చేశారు. జీహెచ్ఎంసీ ఏర్పాటుకు ముందు ఎంసీహెచ్ (మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్)గా ఉండేది. ఎంసీహెచ్ ప్రధాన కార్యాలయం దారుషిఫాలో ఉండేది. కౌన్సిల్ సమావేశాలు ఇక్కడే జరిగేవి. జీహెచ్ఎంసీ ఏర్పడిన అనంతరం ఈ భవనాన్ని కులీకుతుబ్ షా నగరాభివృద్ది సంస్థ(కుడా)కు అప్పగించారు. పాతబస్తీ అభివృద్ది కోసం ప్రత్యేకంగా ఏర్పడిన కుడా భవనం స్థలంలో ఇప్పుడు మెట్రో స్టేషన్ రానుంది. ఈ భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా కుడా అధికారులకు నోటీసులు జారీ చేశారు. -
దాసారం బస్తీలో ఉద్రిక్తత
సనత్నగర్: దాసారం బస్తీ గుడిసెలకు సంబంధించి కోర్టు స్టే ఆర్డర్ వచ్చిన కొద్దిరోజులకే కొందరు వ్యక్తులు అక్కడి గుడిసెవాసులపై దాడులకు తెగబడ్డారు. దీంతో తమపై దాడి చేసినందుకు నిరసగా ఇద్దరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దాసారం బస్తీ గుడిసెవాసులకు మద్దతుగా కోర్టులో స్టే ఆర్డర్ పత్రాలను ఇటీవల ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ వారికి అందజేశారు. అయితే కొందరు బయటి వ్యక్తులు బుధవారం తెల్లవారుజామున గుడిసెవాసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. తమను ఇక్కడ బతకనివ్వరా..? అంటూ ఇద్దరు వ్యక్తులు ఏకంగా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేయగా నీళ్లు పోసి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం అందరూ కలిసి ఆందోళనకు దిగారు. ఎస్సార్నగర్ పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే వారు దాదాపు గంటల పాటు గుడిసెల ముందు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని.. బలవంతంగా ఖాళీ చేయించుకునేందుకు కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపించారు. విషయం తెలుసుకున్న సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి అక్కడికి చేరుకుని గుడిసెవాసులను పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గుడిసెవాసుల జోలికి వెళ్లవద్దని ఇటీవల కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన కాపీని ఇన్స్పెక్టర్కు ఎమ్మెల్యే అందజేశారు. గుడిసెవాసులపై రాళ్ల దాడి పెట్రోల్ పోసుకుని ఇద్దరి ఆత్మహత్యాయత్నం -
అన్ని స్థాయిల్లో ప్రక్షాళన
● ఔట్సోర్సింగ్ ఆపరేటర్లకూ బదిలీలు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధి విస్తరణ అవసరాలకనుగుణంగా అధికారులు, సిబ్బంది బదిలీలు చేపట్టిన కమిషనర్ ఆర్వీ కర్ణన్.. ప్రక్షాళన చర్యలకూ శ్రీకారం చుట్టారు. దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అడిషనల్ కమిషనర్లు సహా జాయింట్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, సీనియర్.. జూనియర్.. రికార్డు అసిస్టెంట్ల వరకు భారీ స్థాయిలో బదిలీ చేశారు. అంతేకాదు.. చివరకు ఔట్సోర్సింగ్పై పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను సైతం మూకుమ్ముడిగా బదిలీ చేశారు. జీహెచ్ఎంసీలోని చాలా విభాగాల్లో అధికారుల కంటే ఈ ఆపరేటర్ల ప్రభావమే ఎక్కువ. ఫైళ్లన్నీ ఈ–ఆఫీస్లోనే నడుస్తుండటంతో అవకాశాల్ని ఆసరా చేసుకొని ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడటం గతంలో ఎన్నో సందర్భాల్లో బయటపడింది. కొందరు అధికారుల డిజిటల్ కీలు సైతం ఆపరేటర్ల వద్దే ఉంటాయి. ఆఫీసర్లు చేయాల్సిన పనుల్ని వీరే చేస్తారు. బర్త్, డెత్ సర్టిఫికెట్లు, టెండరు నోటిఫికేషన్లను సైతం జారీ చేసే ఆపరేటర్లున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని.. అలవాటు పడిన స్థానంలో కంటే వేరే ప్రాంతానికి బదిలీచేస్తే.. కొంతకాలమైనా అక్రమాలు ఆగవచ్చనే తలంపుతో వందల సంఖ్యలో ఆపరేటర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు.


