కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టురట్టు
సాక్షి, సిటీబ్యూరో : జేజే ఫుడ్స్ పేరుతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎస్ మఖ్తా రైల్వే గేట్ సమీపంలోని ఓ ఇంటిపైన నిర్వహించిన దాడుల్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటపడింది.అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, ఆరోగ్యానికి హానికరమైన రీతిలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ తనిఖీల్లో ఆబిడ్స్కు చెందిన జసాని ఇల్యాన్ (21)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘జేజే ఫుడ్స్’ పేరుతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ వ్యాపారం చేస్తున్నాడు.ఈ పేస్ట్ను బహిరంగంగా ప్లాస్టిక్ టబ్బులలో ఉంచడం వల్ల దుమ్ము, ధూళి, ఈగలు వచ్చి చేరాయి. అలాగే ఈ జేజే ఫుడ్స్ కాలం చెల్లిన ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ను కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఈ కల్తీ పేస్ట్ను హోటళ్లు, కిరాణా షాపులకు సరఫరా చేస్తున్నాడు. ఈ తనిఖీల్లో పోలీసులు మొత్తం 4000 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం లేక్ పోలీసులకు అప్పగించారు. ఈ తనిఖీల్లో ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి.రాఘవేందర్, ఎస్ఐ జి. శ్రీకాంత్, లేక్ పోలీస్స్టేషన్ ఎస్ఐ ఎన్. శివ శంకర్,తదితరులు ఉన్నారు.


