సాక్షి, తాడేపల్లి: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఇటీవల సర్జరీ జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ త్వరగా కోలుకోవాలంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.
Wishing @PawanKalyan Garu a speedy and complete recovery following his surgery. Get well soon!
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2026
ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఎక్స్ పోస్ట్లో పేర్కొంది. శుక్రవారం ఉదయం సడెన్గా పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్న ఆయన తన వ్యక్తిగత వైద్యుల సలహాతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శనివారం సాయింత్రం శస్త్రచికిత్స చేశారు.
వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఇదే విషయాన్ని పవన్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ తెలిపారు. 2018లో పవన్ కల్యాణ్ కంటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో హైదరాబాద్లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. పవన్ ఎడమ కంట్లో కురుపు ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్సతో తొలగించారు. రంగస్థలం మూవీ సక్సెస్ మీట్లో ఈ విషయాన్ని పవన్ వెల్లడించారు.



