భారతదేశంలో ఇన్ఫ్లుయెన్సర్ ఎకానమీ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా స్టాండ్ అప్ కమెడియన్లు ఈ రంగంలో తిరుగులేని రారాజులుగా ఎదుగుతూ, సంపాదన పరంగా మిగిలిన వారందరినీ వెనక్కి నెట్టేస్తున్నారు. కేవలం డిజిటల్ వినోదానికే పరిమితం కాకుండా, బ్రాండ్ విలువను అమాంతం పెంచేస్తూ వాణిజ్యపరంగా అత్యంత డిమాండ్ ఉన్న క్రియేటర్లుగా మారుతున్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమలో వినిపిస్తున్న కొన్ని నమ్మశక్యం కాని సంపాదన గణాంకాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి.
ఒక్క ఇన్స్టా రీల్కు రూ. 80 లక్షల రేంజ్
పరిశ్రమ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రముఖ స్టాండ్ అప్ కమెడియన్ సమయ్ రైనా ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధిక సంపాదన కలిగిన కామెడీ క్రియేటర్గా అవతరించారు. ఆయన ఒకే ఒక్క బ్రాండెడ్ ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఏకంగా రూ. 70 లక్షల నుండి రూ. 80 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్లో అత్యధిక కమర్షియల్ వాల్యూ ఉన్న టాప్ క్రియేటర్లలో ఆయన ఒకరిగా నిలిచారు.
స్టోరీలు, స్టాటిక్ పోస్టులకు కూడా లక్షల్లోనే డిమాండ్
ఇన్స్టాగ్రామ్లో 10 మిలియన్లకు (కోటి మందికి) పైగా ఫాలోవర్లను కలిగిన సమయ్ రైనా సోషల్ మీడియా రేట్లు పరిశ్రమను ఆశ్చర్యపరుస్తున్నాయి. కేవలం ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేయడానికి ఆయన రూ. 20 లక్షలకు పైగా వసూలు చేస్తుండగా, ఒక సాధారణ స్టాటిక్ పోస్ట్ కోసం రూ. 25 లక్షల నుండి రూ. 35 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. దీనిని బట్టి క్రియేటర్ల మార్కెట్ విలువ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రముఖ గ్లోబల్ బ్రాండ్లతో భాగస్వామ్యం
ప్రస్తుతం ప్రకటనకర్తలు కేవలం రీచ్ మాత్రమే కాకుండా, ప్రేక్షకులతో బలమైన కనెక్షన్, కల్చరల్ రెలవెన్స్ అందించగల కామెడీ క్రియేటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. సమయ్ రైనా ప్రస్తుతం బోల్డ్ కేర్, కేఎఫ్సీ, ఫ్లిప్కార్ట్, టిండర్, బోట్ వంటి అగ్రశ్రేణి బ్రాండ్లతో భాగస్వామ్యం కలిగి ఉన్నారు. ఇది ఆయనకున్న మార్కెట్ క్రేజ్కు నిదర్శనంగా నిలుస్తున్నది.
యూట్యూబ్ రికార్డులను తిరగరాసిన 'స్టిల్ అలైవ్'
గత ఏప్రిల్ నెలలో సమయ్ రైనా విడుదల చేసిన ‘స్టిల్ అలైవ్’ అనే స్టాండ్-అప్ స్పెషల్ యూట్యూబ్లో సంచలనం సృష్టించింది. చిన్నతనంలో బుల్లీయింగ్, కశ్మీరీ పండిట్ గుర్తింపు, మానసిక ఆరోగ్యం, ఆయన కెరీర్లో ఎదుర్కొన్న అతిపెద్ద వివాదాల తాలూకు పరిణామాల వంటి సున్నితమైన అంశాలపై ఇందులో చర్చించారు. ఈ వీడియోకు యూట్యూబ్లో 63 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఒకే అప్లోడ్పై వచ్చిన వ్యూస్ ఆధారంగా, ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన ఫుల్-లెంగ్త్ స్టాండ్-అప్ కామెడీ స్పెషల్గా ఇది రికార్డు సృష్టించింది. ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ వివాదం తర్వాత కూడా ప్రేక్షకులు ఆయనను ఎంతగా ఆదరిస్తున్నారో ఈ విజయం నిరూపించింది.
రేసులో దూసుకుపోతున్న ప్రాంతీయ కమెడియన్లు
ఈ భారీ సంపాదన కేవలం జాతీయ స్థాయి స్టార్లకే పరిమితం కాలేదు, ప్రాంతీయ క్రియేటర్లు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. మరాఠీ కమెడియన్ ప్రణిత్ మోరే దేశంలోనే అత్యధిక సంపాదన కలిగిన ప్రాంతీయ కామెడీ క్రియేటర్లలో ఒకరిగా నిలిచారు. ఇటీవలే ఆయన ‘రూ. 370 బిరియాని’ వివాదంతో వార్తల్లో నిలిచారు. ఇన్స్టాగ్రామ్లో సుమారు 30 లక్షల (3 మిలియన్) ఫాలోవర్లు ఉన్న మోరే, ఒక స్టోరీకి రూ. 2.5 లక్షలకు పైగా, స్టాటిక్ పోస్ట్కు రూ. 4 నుంచి 5 లక్షలు, అలాగే ఒక బ్రాండెడ్ రీల్ కోసం రూ. 13-14 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు. వీరితో పాటు అభిషేక్ ఉపమన్యు, అనుభవ్ సింగ్ బస్సీ, డానిష్ సైత్ వంటి ప్రముఖులు కూడా బ్రాండ్ పార్ట్నర్షిప్లలో టాప్ రేట్లు అందుకుంటున్నారు.
మారుతున్న కామెడీ బిజినెస్ రూపురేఖలు
గడిచిన ఐదేళ్లలో కామెడీ బిజినెస్లో ఊహించని మార్పులు వచ్చాయని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రేక్షకులు ఇప్పుడు చిన్న క్లబ్ పెర్ఫార్మెన్స్ల నుండి పెద్ద పెద్ద అరీనా షోల వరకు లైవ్ కామెడీ షోలను చూసేందుకు భారీగా డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్నారు. దీనివల్ల క్రియేటర్లు కేవలం డిజిటల్ ప్లాట్ఫారమ్లపైనే ఆధారపడటం తగ్గింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, యూరప్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న భారతీయ సంతతి ప్రేక్షకుల ఆదరణ కారణంగా గ్లోబల్ టూర్లు వీరికి భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ తరహా పెద్ద టూర్ల ప్లానింగ్ సాధారణంగా 8 నెలల నుండి ఏడాది ముందే జరిగిపోతుందని ఇండస్ట్రీ నిపుణులు తెలిపారు.
ఇది కూడా చదవండి: భూమిపై ఆఖరి చెట్టు.. గగుర్పాటు కలిగించే రెస్క్యూ ఆపరేషన్!


