మోదీ మంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌.. కంగనా లైట్‌: అభిజిత్‌ దీప్కే | Modi Is a Great Influencer Not PM: CJP Abhijit Deepke Sharp Jibe | Sakshi
Sakshi News home page

మోదీ మంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌.. కంగనా లైట్‌: అభిజిత్‌ దీప్కే

Jul 30 2026 1:13 PM | Updated on Jul 30 2026 1:27 PM

Modi Is a Great Influencer Not PM: CJP Abhijit Deepke Sharp Jibe

ప్రధాని నరేంద్ర మోదీపై కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ మాంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌ అంటూ ప్రశంసలు గుప్పించారు.  ఇక్కడే మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై జరిగిన ఆందోళనలు, కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా నేపథ్యంతో.. దీప్కే సెటైరిక్‌ వ్యాఖ్యలే చేశారు.

రాజకీయ నేతగా కంటే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా బాగా రాణిస్తున్నారని వ్యాఖ్యానిస్తూ.. ప్రధాని పదవి నుంచి తప్పుకుని ఆ రంగంలో కొనసాగాలంటూ వ్యంగ్యంగా సూచించారు. ఢిల్లీ నిరసనలు, అనారోగ్యం నుంచి కోలుకున్నాక తన స్వస్థలమైన మహారాష్ట్రకు తిరిగి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన దీప్కే.. ప్రధాని మోదీ మంచి ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పని చేస్తున్నారని, అయితే దేశ పాలన బాధ్యతలను మరొకరికి అప్పగించాలని వ్యాఖ్యానించారు.

"మోదీ ఇప్పుడు ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారాలి. ఆ పని ఆయన చాలా బాగా చేస్తున్నారు. ప్రధాని పదవి వదిలి ఇంకొక నాయకుడు దేశాన్ని నడిపే అవకాశం ఇవ్వాలి" అని అన్నారు. నీట్‌ ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించినప్పటికీ.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు గుర్తించి వేధిస్తున్నాయని దీప్కే ఆరోపించారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టడం వెంటనే ఆపాలని, లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

పేపర్‌ లీక్‌ కేసుల కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించారని గుర్తుచేసిన దీప్కే.. అయితే మొదటి విచారణకే సీబీఐ న్యాయవాది హాజరు కాకపోవడంతో కేసు వాయిదా పడిందని ఎద్దేవా చేశారు. మాటలకు, చేతలకు పొంతన ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

అదే నిజమైతే హోం మంత్రి ఫెయిల్‌ అయినట్లే!
పెల్లెట్‌ గన్స్‌ వాడడం నా కళ్లారా చూశా. చాలా మంది కళ్లు పోయాయి. బిహార్‌లో ఏకంగా ఏకే47 ఎక్కుపెట్టారు. కసబ్‌లాంటి ఉగ్రవాదులపై ఎక్కుపెట్టాల్సిన ఏకే-47ను విద్యార్థులపై గురి పెట్టారు. బీజేపీలోకి రమ్మని నన్ను బెదిరిస్తున్నారు. అమిత్‌ షా చెప్పడం వల్లే పెల్లెట్‌ గన్స్‌ వాడి ఉండొచ్చు. ఢిల్లీ పోలీసులు అమిత్‌షాకే రిపోర్ట్‌ చేస్తారు. ఇది అమిత్‌ షాకు తెలియదంటే హోం మంత్రిగా ఆయన ఫెయిల్‌ అయినట్లే!. 

'ఆగ్రహం ఇంకా చల్లారలేదు'
కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసినా.. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఉన్న ఆగ్రహం ఏమాత్రం తగ్గలేదని దీప్కే అన్నారు. ఆగ్రహం వ్యక్తిగతంగా మంత్రి మీద కాదని, ప్రభుత్వ వైఖరిపైనేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం యువత మనోభావాలను అర్థం చేసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. విద్యార్థులపై వేధింపులు కొనసాగితే ఉద్యమం మరింత పెద్ద ఎత్తున తిరిగి ప్రారంభిస్తామని దీప్కే స్పష్టం చేశారు. "ఈ విద్యార్థులు ఉగ్రవాదులు కాదు. దేశ భవిష్యత్తు. భవిష్యత్తును ఇలా ఇబ్బంది పెడితే.. అవసరమైతే ఈ ప్రభుత్వాన్నే మార్చే స్థాయిలో ఉద్యమం చేస్తాం" అని హెచ్చరించారు.

పెల్లెట్‌ గన్స్‌.. చర్యలు తీసుకోవాలి
జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన నిరసనల సందర్భంగా విద్యార్థులపై పెల్లెట్‌ గన్స్‌ వినియోగించిన ఘటనపై కూడా దీప్కే స్పందించారు. ఆదేశాలు ఇచ్చింది ఎవరైనా సరే.. అది కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అయినా, మరెవరైనా అయినా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రధాన్‌కు సన్మానం చేయడంపై.. 
ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అనంతరం పార్లమెంట్‌లో ఆయనకు బీజేపీ సభ్యులు సన్మానం చేయడాన్ని కూడా దీప్కే తప్పుబట్టారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో రాజీనామా చేసిన మంత్రిని సత్కరించడం సరికాదని వ్యాఖ్యానించారు.

కంగనా.. లైట్‌
నీట్‌ ఉద్యమంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన దీప్కే.. ఆమెను "పార్ట్‌టైమ్‌ రాజకీయ నాయకురాలు"గా అభివర్ణించారు. తాను సీరియస్‌ రాజకీయ నాయకుల వ్యాఖ్యలకే స్పందిస్తానని చెప్పి ఆమె విమర్శలను తేలికగా కొట్టిపారేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement