నోయిడా ఎయిర్‌పోర్ట్‌: భూములిచ్చిన దాతలకు తొలి విమాన యోగం.. | Women Farmers Take Inaugural Flight from Noida Airport | Sakshi
Sakshi News home page

నోయిడా ఎయిర్‌పోర్ట్‌: భూములిచ్చిన దాతలకు తొలి విమాన యోగం..

Jun 15 2026 8:33 AM | Updated on Jun 15 2026 8:33 AM

Women Farmers Take Inaugural Flight from Noida Airport

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో నిర్మించిన ప్రతిష్టాత్మక ‘నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం’ సోమవారం (జెవార్ ఎయిర్‌పోర్ట్) చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. ఈ విమానాశ్రయం కోసం తమ భూములను త్యాగం చేసిన స్థానిక రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు తమ జీవితంలోనే మొదటిసారి విమానమెక్కి గగన విహారం చేశారు. వాణిజ్య కార్యకలాపాల ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ తొలి విమానంలో లక్నోకు ప్రయాణమైన మహిళల ముఖాల్లో ఆనందం కినిపించింది.

భావోద్వేగంలో మహిళా రైతులు
‘మేము విమానం ఎక్కుతామని ఎప్పుడూ అస్సలు ఊహించలేదు’ అంటూ మిథిలేష్, బబ్లీ, పింకీ అనే మహిళా రైతులు అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. తమ జీవితాల్లోకి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని తీసుకువచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తొలి విమానం స్థానిక రైతులను తీసుకుని లక్నో వెళ్లగా, మొదటి అధికారిక వాణిజ్య విమానం బెంగళూరుకు సర్వీస్ ప్రారంభించింది. ఈ విమానాశ్రయం కేవలం ప్రయాణ సాధనంగానే కాకుండా, తమ సొంత భూముల్లో నిర్మితమైన గగన తలాన్ని తామే స్వయంగా చూసేలా చేసి,పలువురు అన్నదాతల కళ్లల్లో ఆనంద బాష్పాలు నింపింది.

1.2 కోట్ల మంది ప్రయాణ సామర్థ్యం
యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ప్రస్తుతం పూర్తయిన మొదటి దశలో ఒక రన్‌వే, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌ను నిర్మించారు. ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికులను చేరవేసే సామర్థ్యంతో సిద్ధమైన ఈ విమానాశ్రయానికి ఈ ఏడాది మార్చిలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి ఏరోడ్రోమ్ లైసెన్స్ లభించింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ప్రాంతాల ప్రజలకు  మెరుగైన రవాణా సదుపాయం చేరువయ్యింది.

లక్ష మందికి ఉపాధి అవకాశాలు
మొత్తం నాలుగు దశల్లో, సుమారు 1,334 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని విస్తరించనున్నారు. భవిష్యత్తులో 5 రన్‌వేలతో ఏటా 22.5 కోట్ల మంది ప్రయాణించేలా దీని తుది బ్లూప్రింట్‌ను సిద్ధం చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, హాస్పిటాలిటీ, పారిశ్రామిక రంగాలలో సుమారు లక్ష మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని, భారీగా పెట్టుబడులు తరలివస్తాయని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

ఇది కూడా చదవండి: ఒక్క రీల్‌కు రూ. 80 లక్షలు.. షాకిస్తున్న సమయ్ రైనా!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement