పత్తికి జై.. ఆరుతడికి సై! | Cotton sowing has reached 46. 33 lakh acres in Telangana | Sakshi
Sakshi News home page

పత్తికి జై.. ఆరుతడికి సై!

Aug 1 2026 5:40 AM | Updated on Aug 1 2026 5:40 AM

Cotton sowing has reached 46. 33 lakh acres in Telangana

వానాకాలం సాగులో తెల్లబంగారానిదే హవా 

82.65 లక్షల ఎకరాల్లో పంటల సాగు.. సాధారణ విస్తీర్ణంలో 62 శాతం 

46.33 లక్షల ఎకరాల్లో పత్తి.. సాధారణ సాగులో 98 శాతం పూర్తి 

వరిసాగు 20.46 లక్షల ఎకరాలే.. ఇంకా నాట్ల దశలోనే 

మొక్కజొన్న 76 శాతం.. కంది 81 శాతం.. పెసర 98 శాతం 

రిజర్వాయర్లలో 322.61 టీఎంసీలు.. గతేడాది కంటే 378.60 టీఎంసీలు తక్కువ 

రెండు రోజులుగా ఎడతెరపిలేని వర్షాలతో చేరుతున్న నీరు

సాక్షిప్రతినిధి, వరంగల్‌: తెలంగాణలో వానాకాలం–2026 సాగు జోరందుకుంది. పత్తి సాగు దాదాపు లక్ష్యాన్ని చేరుకోగా.. వరిసాగు మాత్రం ఇంకా నాట్ల దశలోనే ఉంది. వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 82,65,736 ఎకరాల్లో సాగు పూర్త యింది. రాష్ట్ర వానాకాలం సీజన్‌ సాధారణ సాగు విస్తీర్ణం 1,32,38,446 ఎకరాలు కాగా.. ఇప్పటివరకు అందులో 62 శాతం సాగు పూర్తయింది. ప్రధానంగా పత్తి, పెసర సాగు సాధారణ విస్తీర్ణంలో 98 శాతానికి చేరడం గమనార్హం. 

లక్ష్యం దిశగా పత్తి.. చురుగ్గా వరినాట్లు 
పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 47,41,541 ఎకరాలు. ఇప్పటికే 46,33,634 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. దీంతో సాధారణ విస్తీర్ణంలో ఏకంగా 98 శాతం సాగు పూర్తయింది. అంటే పత్తి సాగు దాదాపు లక్ష్యాన్ని చేరినట్లే. రాష్ట్రంలో ఇప్పటివరకు సాగైన మొత్తం 82.65 లక్షల ఎకరాల్లో పత్తి విస్తీర్ణమే 46.33 లక్షల ఎకరాలు కావడం విశేషం. దీంతో వానాకాలం సాగులో ‘తెల్ల బంగారం’ఆధిపత్యం స్పష్టమవుతోంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 65,95,645 ఎకరాలు కాగా 20,46,184 ఎకరాల్లో వరి సాగైంది. అంటే సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే ఇప్పటివరకు 31 శాతం మాత్రమే సాగు పూర్తయింది. అయితే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు మళ్లీ వరినాట్లపై దృష్టి సారించారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వరి నారుమడులు పోయగా, నాట్లు వేసే పనులు చురుగ్గా సాగనున్నాయి.  

ఆరుతడి సాగు... పప్పు దినుసుల జోరు... 
పత్తి తర్వాత ఇతర ఆరుతడి పంటల్లోనూ సాగు పురోగతి కనిపిస్తోంది. ముఖ్యంగా కంది, మొక్కజొన్న, పెసర సాగు గణనీయంగా జరిగింది. ఆరుతడి పంటల్లో పెసర సాగు 98 శాతంతో దాదాపు సాధారణ విస్తీర్ణాన్ని చేరింది. కంది సాగు 81 శాతం, మొక్కజొన్న 76 శాతానికి చేరాయి. జొన్న సాగు 57 శాతంగా ఉండగా.. మినుము సాగు మాత్రం 47 శాతానికే పరిమితమైంది. కంది, పెసర వంటి పప్పుధాన్యాల సాగు కూడా ఆశించిన స్థాయిలో కొనసాగుతోంది. తక్కువ వ్యవధిలో చేతికి వచ్చే పంటలు కావడం, వర్షాధార ప్రాంతాలకు అనుకూలంగా ఉండటంతో రైతులు వీటి సాగుపై దృష్టి సారిస్తున్నారు. 

ఊరటనిచ్చిన వర్షాలు..  
వానాకాలం సాగుకు కీలకమైన వర్షపాతం ఈసారి లోటులోనే కొనసాగుతోంది. జూన్‌ 1 నుంచి సాధారణంగా 353.5 మి.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. గురువారం ఉదయం 8.30 గంటల వరకు 340.2 మి.మీ. వర్షం కురిసింది. దీంతో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 11 శాతం లోటుగా నమోదైంది. అయితే తెలంగాణ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ రిపోర్టు ప్రకారం ఈ లోటు పరిధి ‘సాధారణ’ కేటగిరీలోనే ఉంది. 

పెరుగుతున్న నీటిమట్టం 
రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతున్న సమయంలో రిజర్వాయర్లలో నీటి నిల్వలు మాత్రం గతేడాదితో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉన్నాయి. ప్రధాన రిజర్వాయర్లన్నింటినీ కలిపి 322.61 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి రిజర్వాయర్లలో 701.21 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తాజాగా వ్యవసాయశాఖ నివేదిక స్పష్టం చేసింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి 378.60 టీఎంసీల మేర నీటి నిల్వ తక్కువగా ఉంది. కాగా రిజర్వాయర్లలో నీటి నిల్వ తగ్గినప్పటికీ.. భూగర్భజలాల పరిస్థితి ప్రస్తుతానికి కొంత మెరుగ్గానే ఉంది.

సగటు భూగర్భజల మట్టం 9.46 మీటర్ల లోతులో ఉండగా, జిల్లాల వారీగా చూస్తే ఖమ్మంలో అత్యల్పంగా 5.46 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు అందుబాటులో ఉన్నాయి. అంటే అక్కడ భూగర్భజల మట్టం రాష్ట్ర సగటుతో పోలిస్తే పైకి ఉంది. మరోవైపు మెదక్, వికారాబాద్‌ జిల్లాల్లో అత్యధికంగా 13.30 మీటర్ల లోతులో భూగర్భజలాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలు మరింత లోతులో ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్లలో గణనీయంగా నీటి మట్టం పెరుగుతుందని, భూగర్భజలాలు కూడా పైకి వచ్చే అవకాశం ఉందని అధికారులు గురువారం ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement