ఔట్సోర్సింగ్లో ఉద్యోగులే కాదు... ఏజెన్సీలూ నకిలీవే
అక్రమాలపై ‘సాక్షి’ వరుస కథనాలతో అధికారుల్లో చలనం
ఏజెన్సీలపై ఆడిట్ చేయాలని నిర్ణయం
ప్రత్యేకంగా రాష్ట్రస్థాయిలో కమిటీ ఏర్పాటు
విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి...
ప్రాథమిక పరిశీలనలో 40 వేల మంది నకిలీల గుర్తింపు
ఇందులో 24 వేల మంది ఉద్యోగుల జాడే లేదు
రికార్డుల్లో ఉన్నా ఎక్కడ పనిచేస్తున్నారో స్పష్టత కరువు
రెండేసి చోట్ల వేతనాలు పొందుతున్న 5,000 మంది
10 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులనిచ్చిన సంస్థ ఇప్పుడు లేనేలేదు
లోతుగా విచారణ చేస్తున్న ఆర్థిక శాఖ
నేరుగా చెల్లింపులు చేసే అంశంపై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున నకిలీలు వెలుగులోకి వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 4.8లక్షల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నట్లు ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతుండగా ఇందులో దాదాపు 10 శాతం ఉద్యోగులు నకిలీలే ఉన్నారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపులు, వారికి అందించాల్సిన ఈఎస్ఐ, ఈపీఎఫ్ తదితర బెనిఫిట్ల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్న తీరుపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది.
దీంతో స్పందించిన ప్రభుత్వం ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఔట్సోర్సింగ్ ఏజెన్సీల తీగలాగుతోంది. ఇప్పటికే సేకరించిన సమాచారం మేరకు విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో ఆర్థిక శాఖ మరింత లోతుగా విచారణ చేస్తోంది. ఈ ఏజెన్సీలు ఎవరివి? ఎప్పుడు ఇవి ప్రారంభం అయ్యాయి? వీటి వెనకున్న వారెవరు? అన్న కోణంలో దర్యాప్తు చేస్తోంది.
జాడలేని వారెందరో...
ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కేవలం కార్యాలయాల్లోనే కాకుండా క్షేత్ర స్థాయిలోనూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వ శాఖల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే వారి సంఖ్యకు సమానంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే వీరంతా ఎక్కడెక్కడ ఏయే పోస్టుల్లో ఉన్నారనేది తేల్చేందుకు ఆర్థిఖ శాఖ వ్యూహాత్మక పరిశీలన చేపడుతోంది. ఉద్యోగుల అధార్, పాన్ వివరాలను కూడా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో దాదాపు 5వేల మంది ఉద్యోగులు రెండేసి చోట్ల వేతనాలు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వేతన చెల్లింపులు ప్రభుత్వం నేరుగా చేయకపోవడం, ప్రభుత్వ శాఖలు ఏజెన్సీలకు గంపగుత్తగా నిధులు ఇస్తుండగా... వాటిని వేరువేరు పద్ధతుల్లో చెల్లింపులు చేస్తుండడంతో ఇలాంటి అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా తేల్చారు.
మరోవైపు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వారిలో 24వేల మంది ఉద్యోగుల జాడ లేదు. రికార్డులో ఉన్నప్పటికీ వారు ఎక్కడ పనిచేస్తున్నారో స్పష్టత లేదు. అదేవిధంగా మరికొందరు దీర్ఘకాల గైర్హాజరుతో ఉన్నట్లు గుర్తించారు. వారికి సంబంధించి ప్రభుత్వం వేతన నిధులు ఇస్తున్నప్పటికీ వాటిని వెనక్కు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. ఇలా పలు రకాలు నకీలు ఉద్యోగులు ఉన్నట్లు ఆర్థిక శాఖ గుర్తించింది. ప్రస్తుతం ఏజెన్సీల ఆడిట్ ప్రక్రియ కొనసాగుతోంది. విభిన్న రకాలుగా పూర్తిస్థాయి పరిశీలన చేపడితే పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
బోగస్ ఏజెన్సీలూ ఉన్నాయి...
తొలుత నకిలీ ఉద్యోగులు ఉంటారని అధికారులు ప్రాథమికంగా అంచనా వేయగా... మరో కొత్త కోణం వెలుగు చూసింది. ఉద్యోగులతో పాటు ఏజెన్సీలు కూడా నకిలీవి ఉన్నట్లు తేలింది. కేవలం ఒక (జ్యోతి కంప్యూటర్ సర్విసెస్) కంపెనీ ఏకంగా ప్రభుత్వానికి 10వేల మంది ఉద్యోగులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో అందించినట్లు రికార్డు ఉంది. ప్రస్తుతం ఆడిట్ ప్రక్రియలో భాగంగా సదరు సంస్థకు నోటీసు ఇచ్చేందుకు అధికారులు ప్రయతి్నంచినా ఫలితం లేదు. ఎందుకంటే అలాంటి సంస్థ జాడ దొరకలేదు. ఇది మాజీ ప్రజాప్రతినిధికి చెందినదిగా సమాచారం. ఇలాంటి ఏజెన్సీలు పదుల సంఖ్యలో ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ దిశలోనూ పరిశీలన చేస్తున్నారు.
ఇక నేరుగా చెల్లింపులు...
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపులను క్రమ పద్ధతిలో చేపట్టాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. గంపగుత్తగా నిధులు ఇచ్చే బదులు డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రన్స్ఫర్) పద్ధతిలో చెల్లిస్తే ప్రభుత్వానికి లాభం చేకూరడంతో పాటు ఉద్యోగులకు సకాలంలో చెల్లింపులు జరుగుతాయని, దీంతో అవకతవకలకు తావుఉండదనే అభిప్రాయంతో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, కళ్యాణలక్ష్మి సాయం ఇస్తున్న తరహాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా నేరుగా చెల్లింపులు చేసే అంశంపై అధ్యయనం చేస్తున్నారు.
ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులే కాకుండా ప్రభుత్వానికి అనుబంధంగా స్వయం ప్రతిపత్తి సంస్థల్లోని ఉద్యోగులకు కూడా ఆర్థిక శాఖ నుంచే నేరుగా చెల్లింపుల చేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గంపగుత్త చెల్లింపులు ఉండొద్దని నిర్ణయించిన ఆర్థిక శాఖ...సరళీకరణ పద్ధతిలో చెల్లింపులకు వ్యూహాన్ని తయారు చేస్తోంది ప్రస్తుతం ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఆడిట్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెలాఖరు కల్లా ఆడిట్ ప్రక్రియ పూర్తి కానుందని తెలుస్తోంది. అనంతరం కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు అవకాశం ఉంటుంది.


