ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
ఎన్నారై నుంచి రూ.71 లక్షలు స్వాహా
సాక్షి, హైదరాబాద్: పాత నాణేలను భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తామంటూ ఇన్స్ట్రాగామ్ ద్వారా ప్రచారం చేసిన ఓ ముఠా నగరానికి చెందిన ప్రవాస భారతీయురాలి నుంచి రూ.71.8 లక్షలు కాజేసింది.
అమెరికాలో నివసిస్తున్న ఓ మహిళ (73) జనవరిలో ఇన్స్టాలో.. పురాతన నాణేలు కొంటామనే ప్రకటన చూశారు. 1947 జార్జ్–6 కింగ్ ఎంపరర్ నాణెం ఫొటో, ఓ ఫోన్ నంబర్ను కేటుగాళ్లు పోస్టు చేశారు. నాణెం విలువ రూ.27 లక్షలుగా పేర్కొన్నారు. దీంతో ఎన్నారై మహిళ తన వద్ద ఉన్న మూడు 1947 జార్జ్–6 నాణేలు, రెండు 20 పైసల ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‘ నాణేల ఫొటోలు పంపారు.
మోసగాళ్లు ఒక్కో 1947 నాణెం విలువ రూ.27 లక్షలుగా, ఒక్కో 20 పైసల నాణెం విలువ రూ.12 లక్షలుగా ఖరారు చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. రకరకాల పేర్లతో పలు దఫాలుగా రూ.71,80,950 వసూలు చేసినా వేధింపులు ఆపలేదు. దీంతో ఆమె నగరానికి చెందిన వ్యక్తికి జీపీఏ ఇచ్చి సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేయించడంతో కేసు నమోదైంది.


