సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకూ పెరుగుతుండటంతో అధికారులు శుక్రవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఈ ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రంకల్లా 48 అడుగులకు చేరొచ్చని భావిస్తున్నారు.
9.30 లక్షల క్యూసెక్కుల వరద విడుదల
గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో దిగువకు సుమారు 9.30 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
మరో రెండ్రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. నది ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
అధికారులు అప్రమత్తం
భద్రాచలం పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ, విపత్తు నిర్వహణ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు గోదావరి వైపు వెళ్లొద్దని, ప్రమాదకర ప్రాంతాల్లో సంచరించవద్దని సూచించారు.


