సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఇవాళ్టి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ ముగిసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) విచారణ కోసం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కేటీఆర్తో పాటు అరవింద్కుమార్, బీఎల్ఎన్ రెడ్డి రూ.లక్ష పూచీకత్తు సమర్పించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై విచారణ కొనసాగుతోంది. ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహిస్తే రాజకీయ కక్షతో నేరంగా చిత్రీకరిస్తున్నారని కేటీఆర్ ఖండిస్తున్న సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్ను ఏ1గా పేర్కొంటూ 77 పేజీల ఛార్జ్షీట్ను మార్చి 23న దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లో మొత్తం 14 మంది సాక్షులను ఏసీబీ ప్రస్తావించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏసీబీ కోర్టు వచ్చే నెల(ఆగస్టు) 25కి వాయిదా వేసింది.
ఐదుగురిపై అభియోగాలు
ఈ కేసులో కేటీఆర్ సహా ఐదుగురిపై అభియోగాలు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో) సంస్థ ప్రతినిధి అల్బెర్టోకు సైతం కోర్టు సమన్లు జారీ చేసింది. మే 14న ఏసీబీ కోర్టు ఛార్జ్షీట్ను విచారణకు స్వీకరించింది.
అనుమతులు లేకుండానే..
ఏసీబీ ఛార్జ్షీట్ ప్రకారం.. ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించి అవసరమైన అనుమతులు పొందకుండానే నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించింది. కేబినెట్, ఆర్థిక శాఖ, న్యాయశాఖ అనుమతులు లేకుండా ముందుకు వెళ్లారని పేర్కొంది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ)పై సంతకం జరిగేలా కేటీఆర్ వ్యవహరించారని ఏసీబీ ఆరోపించింది. హెచ్ఎండీఏ నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించారని, ప్రభుత్వంపై సుమారు రూ.600 కోట్ల భారం పడిందని ఛార్జ్షీట్లో పేర్కొన్నట్లు తెలిపింది.
ప్రజాధనం దుర్వినియోగం ఆరోపణలు
ఫార్ములా ఈ రేసు కోసం రూ.75.88 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఏసీబీ ఆరోపించింది. క్విడ్ప్రోకో అంశంతో పాటు ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారాన్ని కూడా ఛార్జ్షీట్లో ప్రస్తావించింది. బీఆర్ఎస్కు వచ్చిన రూ.44 కోట్ల విరాళాల అంశాన్ని కూడా ఏసీబీ తన అభియోగాల్లో పేర్కొన్నట్లు సమాచారం.
రాజకీయంగా ప్రాధాన్యం
ఫార్ములా ఈ-రేసు కేసు తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఈ వ్యవహారంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఇదొక లొట్ట పీసు కేసు అని అభివర్ణించారు. ఎలాంటి అవినీతి జరగలేదని.. ఎలాంటి రహస్య ఒప్పందాలు, లావాదేవీలు లేవని చెప్పారాయన. ఇప్పుడు.. నాంపల్లి కోర్టు విచారణ నేపథ్యంలో కేసు తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.


