జెన్‌జీ నిరసనలపై మౌనం వీడిన రాఘవ్‌ చద్దా | Raghav Chadha Breaks Silence On NEET Row, Questioning Was My Job Then, Solving Problems Is My Duty Now | Sakshi
Sakshi News home page

జెన్‌జీ నీట్‌ నిరసనలపై మౌనం వీడిన రాఘవ్‌ చద్దా

Jul 31 2026 10:48 AM | Updated on Jul 31 2026 11:15 AM

My Role Has Changed Raghav Chadha Breaks Silence on NEET Row

రాఘవ్‌ చద్దా.. గతంలో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రతీ అంశంపైనా ప్రశ్నించారనే పేరుంది. ప్రత్యేకించి జెన్‌జీకి కనెక్ట్‌ అయ్యే ప్రతీ అంశంపైనా ఆయన నిలదీశారు. ఈ క్రమంలో ఆయన గురించి నెట్టింట కూడా పెద్ద చర్చ జరిగింది. ఆ క్రేజ్‌తో ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగింది. అయితే ఆ మధ్య ఆయన బీజేపీలో చేరిపోయారు. ఆ తర్వాత ఎందుకనో సైలెంట్‌ అయిపోయారు..

న్యూఢిల్లీ: నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనలు.. జెన్‌జీ పోరాటంపై ఆయన ఎక్కడా స్పందించింది లేదు. ఇన్నాళ్లుగా మౌనంగా ఉన్న రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా తొలిసారి స్పందించారు. గతంలో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన.. ఇప్పుడు తన పాత్ర మారిందని, అందుకే కేవలం రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా పరిష్కారాల కోసం పనిచేస్తున్నానని తెలిపారు.

పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో రాఘవ్‌ చద్దా కాస్త ఘాటుగా ప్రసంగించారు. పేపర్‌ లీక్‌ల వంటి సమస్యలను మీడియా ముందు చేసే ప్రకటనలతో పరిష్కరించలేమని.. బలమైన వ్యవస్థాగత మార్పులు అవసరమని అన్నారు.

‘అందుకే ఇన్నాళ్లు మాట్లాడలేదు’
నీట్‌ పేపర్‌ లీక్‌ అంశంపై తాను ఎందుకు స్పందించలేదని చాలామంది ప్రశ్నించారని చద్దా చెప్పారు. “నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై ప్రశ్నలు అడగడం నా బాధ్యత. ఆ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాను. ఇప్పుడు నా పాత్ర మారింది. అధికార పక్షంలో ఉన్నందున ప్రశ్నలు వేయడం కంటే పరిష్కారాలు చూపించడం నా బాధ్యత” అని ఆయన వ్యాఖ్యానించారు. మీడియా హెడ్లైన్ల కోసం మాట్లాడాల్సిన అవసరం లేదని.. సమస్యకు పరిష్కారం దొరికే సమయంలోనే స్పందించాలని తాను నిర్ణయించుకున్నానని తెలిపారు.

జెన్‌జీ బాధ న్యాయమే.. 
నీట్‌ అభ్యర్థులు, ఆందోళన చేస్తున్న విద్యార్థుల ఆవేదనను చద్దా సమర్థించారు. “మీ కోపం న్యాయమే.. మీ భావోద్వేగాలు న్యాయమే.. మీ బాధ కూడా న్యాయమే” అని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. నీట్‌ పరీక్ష అనేది కేవలం ఒక పరీక్ష కాదని.. లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు అది ఒక మార్గమని అన్నారు. కోటా, ఢిల్లీ వంటి నగరాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు కుటుంబాలకు దూరంగా ఉంటారని, తల్లిదండ్రులు కోచింగ్‌ కోసం భారీగా ఖర్చు చేస్తారని గుర్తుచేశారు.

గతంలో యువత గొంతుకగా గుర్తింపు
రాఘవ్‌ చద్దా గతంలో ప్రతిపక్ష నేతగా పార్లమెంట్‌లో పలు అంశాలపై దూకుడుగా మాట్లాడిన నేతగా గుర్తింపు పొందారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం, యువతకు సంబంధించిన అంశాలను ప్రస్తావించడం ద్వారా సోషల్‌ మీడియాలోనూ ఆయనకు ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ ఏర్పడింది. అయితే రాజకీయ పరిణామాలు మారడంతో ఆయన వైఖరిలోనూ మార్పు కనిపిస్తోందనే చర్చ మొదలైంది. గతంలో ప్రశ్నించే గొంతుకగా ఉన్న ఆయన.. ప్రస్తుతం వ్యవస్థలో భాగంగా పరిష్కారాలపై దృష్టి పెడుతున్నానని చెబుతున్నారు.

‘పేపర్‌ లీక్‌ ఒక దీర్ఘకాలిక వ్యాధి’
పేపర్‌ లీక్‌లను రాజకీయ కోణంలో చూడకూడదని చద్దా అన్నారు. ఇది దేశాన్ని వేధిస్తున్న దీర్ఘకాలిక సమస్య అని, ఏ రాష్ట్రంలో జరిగినా.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. “జవాబుదారీతనం, నైతికత రాజకీయాలకు మించి ఉండాలి” అని అన్నారు.

కేంద్ర చర్యలకు మద్దతు
నీట్‌ వివాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించిందని చద్దా తెలిపారు. విద్యార్థులు తమ సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఉంచినప్పుడు ఆయన ఒక సంరక్షకుడిలా స్పందించారని అన్నారు. నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో దర్యాప్తు వేగంగా జరిగిందని, కేవలం 75 రోజుల్లోనే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో నీట్‌ పరీక్షలను ఓఎంఆర్‌ షీట్లకు బదులుగా కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

మాజీ పార్టీ ఆప్‌పై విమర్శలు
పేపర్‌ లీక్‌లపై మాట్లాడిన చద్దా తన మాజీ పార్టీ ఆమ్‌ ఆద్మీ పార్టీని కూడా విమర్శించారు. పంజాబ్‌ ఫార్మసీ ఆఫీసర్‌ నియామక పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయని ప్రస్తావించారు. బ్లూటూత్‌ పరికరాల ద్వారా కొందరు అభ్యర్థులకు సహాయం చేశారని, మోసపూరిత పరీక్షల కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.13 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. అలాగే కాంగ్రెస్‌ పాలిత కర్ణాటకలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ ప్రశ్నపత్రం లీక్‌ ఘటనను కూడా ప్రస్తావించారు.

‘విద్యార్థులు మాట్లాడారు.. ప్రభుత్వం విన్నది’ 
పేపర్‌ లీక్‌లను అరికట్టేందుకు తీసుకొచ్చిన కొత్త చట్టం దేశ పరీక్షా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువస్తుందని రాఘవ్‌ చద్దా అన్నారు. యువతలో నమ్మకాన్ని తిరిగి తీసుకురావడం, కష్టపడి చదివే విద్యార్థులకు న్యాయం చేయడం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గతంలో ప్రశ్నలతో ముందుకు వచ్చిన రాఘవ్‌ చద్దా.. ఇప్పుడు పరిష్కారాల రాజకీయాలపై దృష్టి పెడుతున్నానని చెప్పడం.. జెన్‌జీ తరం ఆందోళనల మధ్య ఆయన రాజకీయ ప్రయాణంపై మరోసారి చర్చకు దారితీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement