ముంబై: మహారాష్ట్ర భీవండిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోజు (శుక్రవారం) ఉదయం శిథిలావస్థకు చెందిన ఓ భవనం మరమ్మత్తులు చేస్తున్న సమయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో వివరాలు తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.
భీవండి నిజంపూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలోని ఈ పురాతన భవనం శిథిలావస్థకు చేరుకుందని గతంలోనే మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ పట్టించుకోకుండా భవన నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో భవనం కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు.
ఘటనా వివరాలు తెలుసుకున్న వెంటనే భీవండి ఫైర్ సిబ్బంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు భారీ యంత్రాల సహాయంతో సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఇద్దరి మృతదేహాలు వెలికితీశామని అధికారులు పేర్కొన్నారు.


