సాక్షి, ఢిల్లీ : పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముందస్తు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పనులు ప్రారంభించిన ప్రాజెక్టులకు, పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కేంద్ర ప్రభుత్వం ఒక సాధారణ మెమోరాండమ్ (OM) ద్వారా పోస్ట్-ఫాక్టో (ముందు పని తరువాత అనుమతి) కుదరదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం జారీ చేసిన 2021 ఆఫీస్ మెమోరాండమ్ను రద్దు చేసింది.
ఫాస్ట్ ఫ్యాక్టో పర్యావరణ అనుమతుల కోసం ఆఫీస్ మెమోరాండం మాత్రమే సరిపోదని తెలిపింది. ఎట్టిపరిస్థితుల్లో నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని పేర్కొంది. చట్టబద్ధ నోటిఫికేషన్ ద్వారా అవసరమైతే పోస్ట్-ఫాక్టో (తర్వాతి దశలో) పర్యావరణ అనుమతులు ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన నోటిఫికేషన్ జారీ చేసి పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతుల వ్యవస్థను అమలు చేసే అవకాశం ఉంది.
ఈ కేసు వివరాలు
2006 నాటి పర్యావరణ ప్రభావ అంచనా నిబంధనల ప్రకారం ఏ ప్రాజెక్టు ప్రారంభించాలన్నా ముందస్తు పర్యావరణ అనుమతి తప్పనిసరిగా ఉండేది. అయితే, ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా పనులు ప్రారంభించిన కంపెనీలు/ప్రాజెక్టులకు, తదనంతరం (పోస్ట్-ఫాక్టో) అనుమతులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2017లో ఒక నోటిఫికేషన్, 2021లో ఒక ఆఫీస్ మెమోరాండమ్ (OM) జారీ చేసింది.
"వనశక్తి" అనే పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం — చట్టబద్ధమైన పర్యావరణ నిబంధనలను కేవలం కార్యాలయ ఉత్తర్వుల (OM) ద్వారా సవరించడం చెల్లదని, ఇది పర్యావరణ చట్టాల ఆశయానికి విరుద్ధమని పేర్కొంటూ 2021 OMను కొట్టివేసింది. అయితే, ఇప్పటికే గత అనుమతుల ఆధారంగా మొదలైన ప్రాజెక్టులు దెబ్బతినకుండా పాత అనుమతులను సమర్థించింది.


