మోదీపై వ్యాఖ్యల వివాదం.. ఎవరీ రుచికా సింగ్‌? | PM Modi Remarks Row: Who is Ruchika Singh? What Case She May Face? | Sakshi
Sakshi News home page

మోదీపై వ్యాఖ్యల వివాదం.. ఎవరీ రుచికా సింగ్‌?

Jul 31 2026 7:56 AM | Updated on Jul 31 2026 8:40 AM

PM Modi Remarks Row: Who is Ruchika Singh? What Case She May Face?

ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో నీట్‌ నిరసనల సందర్భంగా రెచ్చిపోయిన యువతికి పెద్ద షాక్‌ తగిలింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆమెపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘రాజ్యాంగ పదవి గౌరవాన్ని ఆమె వ్యాఖ్యలు దెబ్బతీశాయని.. ప్రజా శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని’’ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

కాక్రోచ్‌ పార్టీ నిరసనల్లో పాల్గొన్న ఆ యువతి.. జూలై 23-24 తేదీల మధ్య ఈ వీడియో తీసినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోదీపై అభ్యంతరకర భాష ఉపయోగించింది. మోదీని గద్దె దిగిపోవాలని.. యువత ఆ పని చేయాలంటూ అసభ్య పదజాలంతో దూషించింది. ఆ సమయంలో కొందరు ఆందోళనకారులు ఆమెను సెల్‌ఫోన్లతో వీడియోలు తీసిన మరింత రెచ్చిగొట్టినట్లు కనిపించింది. అవి విపరీతంగా వైరల్‌ కావడంతో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్వచ్చందంగా ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు.

జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు
సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్‌ చందేల్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలై 29న నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్‌ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 352, 353(1), 356(1) కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా అవమానించడం ద్వారా ప్రజా శాంతికి భంగం కలిగించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, పరువునష్టం వంటి అంశాలపై అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదులో.. సదరు యువతి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, ద్వేషాన్ని వ్యాప్తి చేసి ప్రజా శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు.. ఆ వీడియోలో ఆమె ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును కూడా ప్రస్తావించడం గమనార్హం. 

ఎవరీ అమ్మాయి?.. 
జంతర్‌ మంతర్‌ నిరసనల్లో ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన యువతిని నోయిడాకు చెందిన రుచికా సింగ్‌గా గుర్తించారు. 25 ఏళ్ల రుచిక.. విద్యార్హతలు ఏంటో స్పష్టత లేదు. అయితే ఆమె మోడల్‌గా, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణిస్తున్నట్లు సమాచారం. విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలు, విద్యార్థుల సమస్యలపై జరిగిన ఈ నిరసనలో భాగంగా ఆమె.. ఇలా అభ్యంతరక వ్యాఖ్యలతో దేశ ప్రధానిని తిట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

ఢిల్లీ పోలీసులకు బదిలీ
జంతర్‌ మంతర్‌ ప్రాంతం ఢిల్లీ పోలీసుల పరిధిలో ఉండటంతో నోయిడాలో నమోదైన జీరో ఎఫ్‌ఐఆర్‌ను ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసును ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఐఎఫ్‌ఎస్‌ఓ (Intelligence Fusion and Strategic Operations) పరిశీలిస్తోంది. నిరసనకు సంబంధించిన వీడియోలు, సోషల్‌ మీడియా పోస్టులను పోలీసులు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆమెను అరెస్ట్‌ చేశారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

సోషల్‌ మీడియా ఖాతాలకు నోటీసులు
ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు సోషల్‌ మీడియా ఖాతాలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అభ్యంతరకరమైన, పరువునష్టం కలిగించే కంటెంట్‌ను షేర్‌ చేశారన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎక్స్‌ (X) వేదికకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి సంబంధిత పోస్టులను తొలగించడం లేదంటే వాటి యాక్సెస్‌ను నిలిపివేయడం, దర్యాప్తు కోసం ఎలక్ట్రానిక్‌ రికార్డులను భద్రపరచాలని కోరినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement