న్యూఢిల్లీ: హోం మంత్రి అమిత్షానుద్దేశిస్తూ లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ అనుచిత వ్యాఖ్యలుచేశారంటూ ఆయనపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ గురువారం సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. ఈ మేరకు ఆ నోటీస్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఠాకూర్ అందజేశారు. ‘అమిత్ షానుద్దేశించి రాహుల్ జూలై 29 తేదీన అమర్యాదగా మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలుచేసి సభా మర్యాదలను ఉల్లంఘించారు.
విద్యార్థులతో సంభాషణను గుర్తుచేస్తూ ‘విద్యార్థులు’,‘మూర్ఖులు’,‘అంధభక్తులు’ అనే పదాలు వాడారు. చివరి రెండు పదాలు రాజకీయ ప్రత్యర్థులను, ప్రభుత్వ మద్దతుదారులనుద్దేశించి వాడారు. సభలో ఇలాంటి పదాల వినియోగాన్ని లోక్సభ సెక్రటేరియట్ నియమావళిలోని 352(3), (7), 353 నిబంధనల ప్రకారం ఏనాడో నిషేధించారు. దారుణమైన ఆరోపణలు చేసిన రాహుల్గాంధీ వెంటనే లోక్సభకు, అమిత్ షాకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. రాహుల్ అమర్యాదకర వైఖరి అంశాన్ని సభాహక్కుల ఉల్లంఘన కమిటీకి సిఫార్సు చేసి సమగ్ర దర్యాప్తు తర్వాత ఆయనపై తగు చర్యలు తీసుకోవాలి’’ అని తన మూడు పేజీల నోటీస్లో అనురాగ్ ఠాకూర్ కోరారు.


