లోక్‌సభలో మళ్లీ రగడ  | Parliament passed a bill criminalising insult to national song Vande Mataram | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో మళ్లీ రగడ 

Jul 31 2026 5:10 AM | Updated on Jul 31 2026 5:10 AM

Parliament passed a bill criminalising insult to national song Vande Mataram

విద్యార్థులపై పోలీసుల దాష్టీకం, రామాలయ విరాళాల చోరీపై విపక్షాల ఆందోళన 

హోంమంత్రి అమిత్‌ షా ప్రకటన చేయాలని విపక్షాల పట్టు 

గందరగోళం మధ్యే ‘వందేమాతరం’ బిల్లుకు ఆమోదం

సాక్షి, న్యూఢిల్లీ: గత రెండ్రోజులుగా కాస్తంత ప్రశాంత వాతావరణం కన్పించిన పార్లమెంట్‌లో గురువారం మళ్లీ విపక్షాల నిరసనహోరు మొదలైంది. చలో సంసద్‌ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై పోలీసుల కర్కశ చర్య, అయోధ్య రామాలయ విరాళాల చోరీ ఆరోపణలపై చర్చ జరపాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభలో నిరసన వ్యక్తం చేయడంతో సభా కార్యక్రమాలు దాదాపు స్తంభించాయి. 

పలుమార్లు వాయిదాలు పడ్డ సభలో తీవ్ర గందరగోళం మధ్యే ప్రభుత్వం జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) (వందేమాతరం) బిల్లును ఆమోదించింది. బుధవారం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమికి చెందిన ఎంపీలు తమ స్థానాల్లో నిలబడి నినాదాలు చేశారు. విద్యార్థులపై జరిగిన పోలీసు అతి చర్యపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సభలో ప్రకటన చేయాలని, ఆ అంశంపై వెంటనే చర్చకు అవకాశం కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. 

అయోధ్య రామాలయంలో కోట్ల కొలదీ విరాళాలు చోరీ అయిన ఉదంతంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సమాజ్‌వాదీ పార్టీ సహా విపక్ష పార్టీల సభ్యులు పట్టుబట్టాయి. దీంతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే స్పీకర్‌ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమయ్యాక వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు పార్లమెంటరీ పత్రాలు సభ ముందుంచిన తర్వాత విపక్ష సభ్యులు తిరిగి నినాదాలు కొనసాగించారు. దీంతో సభను 3:30 గంటల వరకు వాయిదా వేశారు. 

మకర్‌ ద్వార్‌ వద్ద ప్రతిపక్ష నిరసనలు.. 
అయోధ్య రామాలయంలో భారీ స్థాయిలో విరాళాలు చోరీకి గురైన ఘటనపై మకరద్వారం ముందు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఒక విరాళాల పెట్టెను ఏర్పాటు చేసి అందులో కరెన్సీ నోట్లను విరాళమిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ‘చందా చోరులారా..గద్దె వీడండి’అంటూ ప్లకార్డులు, నినాదాలతో ఆందోళన కొనసాగించారు. మంత్రి అమిత్‌ షా సభకు హాజరై ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. ‘అమిత్‌ షా ఇంకా ఎంతకాలం ప్రజలకు సమాధానం చెప్పకుండా దాక్కుంటారు?. ఆయన పార్లమెంట్‌లో ఎందుకు కనిపించడం లేదు?’అని విపక్ష నేతలు ప్రశ్నించారు. 

డీఎంకే అభ్యంతరం.. 
మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత లోక్‌సభ తిరిగి సమావేశమయ్యాక జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు– 2026ను ప్రవేశపెట్టారు. జాతీయ గేయం వందేమాతరంను కించపరిచినా, గేయాన్ని పాడే సమయంలో ఉద్దేశపూర్వకంగా ఆటంకపరిచినా, మరే విధంగా గేయం పవిత్రత, ప్రతిష్టను మంటగలిపేలా దుస్సాహసం చేసినా ఆ చర్యలన్నింటినీ ఇకపై తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తూ శిక్షలు విధించేలా జాతీయ గేయంపై బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 

జాతీయ గీతం జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను జాతీయ గేయం వందేమాతరానికి కల్పించే ఉద్దేశ్యంతోనే ఈ బిల్లును తెచ్చినట్లు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు. వెంటనే డీఎంకే సభ్యురాలు కె కనిమొళి లేచి నిలబడి అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘జాతీయవాదం ముసుగులో హిందుత్వ ఎజెండాను మోదీ సర్కార్‌ ముందుకు తెస్తోంది. ఇది సమాఖ్య విధానానికి పూర్తిగా వ్యతిరేకం. జాతీయవాదాన్ని బలవంతంగా రుద్దకూడదు. 

వందేమాతరం పూర్తి గేయం దేశ లౌకికవిధానానికి విభిన్నంగా సాగుతుంది. అందుకే జాతినిర్మాతలు ఆనాడు గేయంలోని తొలి రెండు చరణాలనే తీసుకున్నారు. ఇప్పుడు మొత్తం ఆరు చరణాలను కచ్చితంగా పాడాల్సిందేనని మీరు బలవంతం చేస్తూ దేశాన్ని ఏకధృవంగా మారుస్తున్నారు’’అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే సమయంలో డీఎంకే సభ్యుడు ఎ.రాజా కొన్ని ప్రతులను చించి అధికార సభ్యుల వైపు వెదజల్లారు. ‘‘1950 జనవరి 24వ తేదీన రాజ్యాంగసభ కేవలం రెండు చరణాలనే జాతీయ గేయంగా ఎంచుకుంది. నాటి సభ నిర్ణయాన్ని కాలరాస్తూ మోదీ సర్కార్‌ కొత్త నిర్ణయం ఎలా తీసుకుంటుంది. 

ఇది రాజ్యాంగవిరుద్ధం’’అని ఎ.రాజా ఆగ్రహం వ్యక్తంచేశారు. బంకిం చంద్ర ఛటర్జీ రచించిన పూర్తి చరణాలను ఆనాడు రాజ్యాంగసభ ఆమోదించిందని మోదీ సర్కార్‌ అవాస్తవాలను ఈ బిల్లులో పొందుపరిచిందని ఎ.రాజా ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని టీఎంసీ సభ్యుడు సౌగత రాయ్‌ సైతం తప్పుబట్టారు. మత స్వేచ్ఛ అనే రాజ్యాంగబద్ధ హక్కును కొత్త బిల్లుతో మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఇలా విపక్షసభ్యుల నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో అధికార కూటమి సభ్యులు ఈ బిల్లును ఆమోదించారు. తర్వాత లోక్‌సభ శుక్రవారానికి వాయిదాపడింది. ఇప్పటికే రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. దీంతో ఈ సవరణ బిల్లు ఇకపై చట్టంగా అమల్లోకి రావడానికి మార్గం సుగమమైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement