న్యూఢిల్లీ: పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు జరిపిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు ప్రవర్తించిన తీరు కేంద్రమంత్రి అమిత్ షా ఆదేశాలతోనే జరిగిందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. అమిత్ షా రాజీనామా చేయాలని గురువారం డిమాండ్ చేశారు.
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో విలేకరులతో దీప్కే మాట్లాడుతూ.. “నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన దాడి, రక్తం కారేలా చేయడం అమిత్ షా ఆదేశాలు లేకుండా జరిగి ఉండదు” అని అన్నారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా నిరసనకారులపై తీసుకున్న చర్యలకు షానే బాధ్యుడని ఆరోపిస్తూ ఆయన రాజీనామా కోరిన నేపథ్యంలో దీప్కే సైతం ఇదే డిమాండ్ చేశారు. తాను కూడా రాహుల్ గాంధీ అభిప్రాయాన్నే సమర్థిస్తున్నానని చెప్పారు. “ఆయన (షా) రాజీనామా చేయాలని నేను కూడా భావిస్తున్నాను” అని అన్నారు.
సీజేపీ విదేశీ నిధులు పొందుతోందన్న ఆరోపణలను దీప్కే కొట్టిపారేశారు. “హోంశాఖ బాధ్యతలు షా వద్ద ఉన్న సమయంలోనే మాకు విదేశీ నిధులు వస్తున్నాయంటే అది కూడా ఆయన వైఫల్యమే. అప్పుడు మీరు ఎలాంటి చాణక్యులు? అలాంటప్పుడు షా కూడా రాజీనామా చేయాలి” అని చురకలు అంటించారు.
బీజేపీలో చేరాలని ఒత్తిడి
నిరసనకారులపై చర్యలు తీసుకోవడానికి కారణం చూపించేందుకే ఢిల్లీ పోలీసులు రాళ్లదాడిని సృష్టించారని దిప్కే ఆరోపించారు. “రాళ్లదాడికి ఢిల్లీ పోలీసులు ప్రణాళిక వేశారు. బీజేపీ గూండాలు వచ్చి రాళ్లు విసిరారు. దానికి విద్యార్థులనే బాధ్యుల్ని చేశారు” అని ఆయన అన్నారు. బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చేందుకు తనను, తన కుటుంబాన్ని బెదిరించారని దిప్కే ఆరోపించారు. “నన్ను బెదిరించారు. బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చేందుకు నా తల్లిదండ్రులను కూడా బెదిరించారు. పార్టీలో చేరండి లేకపోతే పరిణామాలు ఎదుర్కోండి అని చెప్పారు” అని అన్నారు.
ఆరోపణలను ఖండించిన బీజేపీ
దిప్కేపై బీజేపీ నేత కేశవ్ ఉపాధ్యే విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ మార్గంలో నడవాలనుకుంటే దీప్కే కాంగ్రెస్లో చేరాలని అన్నారు. “అతను ఒక నిరసన ఉద్యమానికి ముఖచిత్రం. ప్రశ్నపత్ర లీకుల నిరోధక బిల్లు తీసుకురావడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను అంగీకరించడం ద్వారా అతని డిమాండ్లను అంగీకరించింది బీజేపీ ప్రభుత్వమే. దాన్ని గౌరవించాల్సింది పోయి రాజకీయాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ మార్గాన్ని అనుసరించాలనుకుంటే కాంగ్రెస్లో చేరాలి” అని అన్నారు.


