భోపాల్ : నీట్ లీకేజీపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన చేపట్టింది. ఈ నిరసనల్లో విద్యార్థులను అరెస్టు చేసి తరలిస్తున్న పోలీసు వాహనం ముందు అరచేతిని చాచి నిలిచిన ఓ యువతి ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి దృశ్యాలను గుర్తు చేసే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆందోళనకారులు వాహనాలతో ముఖ్యమంత్రి నివాసానికి బయల్దేరారు. అప్పుడే ఓ లేడీ సింగం ఆందోళనకారుల వాహనం ముందుకు కదలకుండా ఎదురెళ్లి అడ్డుగా నిలబడ్డారు. ప్రస్తుతం ఆ లేడీ సింగం ఎవరనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
మధ్యప్రదేశ్లో పెసర పంటను 100 శాతం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, ఎరువుల ఈ-టోకెన్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు రాజధాని భోపాల్లో భారీ ఆందోళన చేపట్టారు. నర్మదాపురం, హర్దా, సీహోర్ జిల్లాల నుంచి ట్రాక్టర్లతో తరలివచ్చిన రైతులు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ క్రమంలో సీఎం నివాసానికి సమీపంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను ఛేదించి ప్రైవేట్ స్కూల్ బస్సులో ముందుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. అప్పుడే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) మౌనిక శుక్లా రైతులతో ముందుకు కదులుతున్న బస్సుకు ఎదురెళ్లి నిలువరించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ ఘటనపై ఏసీపీ మౌనిక శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. ‘రైతులు నగరంలోకి ప్రవేశించకుండా ఆపడమే మా విధి. బస్సు ముందుకు కదలకుండా నేను చేయాల్సిన పనిని చేశాను. రైతుల మార్చ్ను అడ్డుకోవడానికి పోలీసులు అదనపు బారికేడింగ్గా రోడ్డుపై స్కూల్ బస్సులను అడ్డుగా పెట్టారు. రైతులు బస్సులను నెట్టి బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించారు. బస్సు ముందుకు కదులుతుండటాన్ని చూసిన వెంటనే, నిరసనకారులను ఆపడం నా బాధ్యత కావడంతో సహజంగానే దాని ముందు నిలబడ్డాను. నేను బస్సు ముందు నిలబడటాన్ని చూసిన రైతులు బస్సు నుంచి దిగిపోయారు.
తన చర్య అసాధారణమైనది కాదని పేర్కొంటూ, శాంతిభద్రతల నిర్వహణలో తనకున్న సుదీర్ఘ అనుభవంతో ఎలాంటి పరిస్థితినైనా ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని చెప్పారు. నిరసనకారులు బస్సును కదపకుండా ఆపడానికి అక్కడికక్కడే బస్సు ముందు నిలబడాలని నిర్ణయించుకున్నాను. నాకు భయం అనిపించలేదు. చేయాల్సిన పని చేశాను
నిరసనకారులు నేరస్థులు కాదని పేర్కొంటూ, ఎలాంటి నిరసననైనా ఎదుర్కొనేటప్పుడు పోలీసులు సంయమనం పాటించాలి. మనం సంయమనంతో వ్యవహరించాలి. నిరసనకారులు నేరస్థులు కాదు. వారు కూడా తమ డిమాండ్లను లేవనెత్తుతున్న పౌరులే. అయితే, అల్లర్లు సృష్టించడానికి కొందరు సంఘవిద్రోహ శక్తులు నిరసనకారుల్లోకి చొరబడే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఆ సమయంలో రైతు నిరసనకారులకు నాయకత్వం వహించే వ్యక్తి ఎవరూ లేరని, పెద్ద సంఖ్యలో ప్రజలు రాష్ట్ర రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటమే నా బాధ్యత. శాంతిభద్రతలను కాపాడటమే తన ఏకైక లక్ష్యమని పునరుద్ఘాటించారు.
ఢిల్లీలో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనల గురించి ప్రస్తావిస్తూ.. ‘ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంది. అయితే అది చట్ట పరిధిలో, సామాన్య ప్రజల జీవితాలకు అంతరాయం కలగకుండా శాంతియుతంగా జరగాలి’ అని ఆమె పేర్కొన్నారు.


