సాక్షి,హైదరాబాద్: మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ కేసు నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన, కొద్దిసేపటి క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. అయితే, ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన సందర్భంగా లైంగిక వేధింపుల ఆరోపణలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.
ఇదిలా ఉంటే, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. తదుపరి తీర్పును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
మరోవైపు, ఈ కేసు దర్యాప్తులో భాగంగా డీసీపీ లావణ్య నాయక్ పోలీస్ అకాడమీకి చేరుకున్నారు. అక్కడ బాధితురాలైన మహిళా ట్రైనీ ఐపీఎస్ నుంచి డీసీపీ లావణ్య నాయక్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు.


