ఢిల్లీ: రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం.. కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అదనంగా వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రబీ సీజన్కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నులు (బియ్యం రూపంలో) పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సవరించిన వరి కొనుగోలు అంచనా బియ్యం రూపంలో 43 లక్షల మెట్రిక్ టన్నులు (LMT)గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ నుంచి అదనపు బియ్యం సేకరణకు కేంద్రం నిర్ణయంపై కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. కిషన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల మేలు కోసం, బీజేపీ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు.
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26కు సంబంధించి, సీజన్ ప్రారంభానికి ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (52 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం) సేకరించాలని సంయుక్తంగా నిర్ణయించారు. తెలంగాణలో ఈసారి ధాన్యం ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని, తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి 8 జూలైనాడు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమై.. తెలంగాణ నుంచి బియ్యం సేకరణ పరిమాణాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశాం.
మా విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం, బియ్యం సేకరణ లక్ష్యాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు (అంటే 64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి సమానం) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు 8 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కిషన్రెడ్డి కోరారు.


