దిస్పూర్: అస్సాంలో వరద పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారాయి. ఎగువ ప్రాంతాల్లో క్లౌడ్బరస్ట్ కారణంగా సంభవించిన వరదలతో రాష్ట్రం అతలాకుతలమైంది. బుధవారం నాటి వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 21కి చేరింది. ఏడాది వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మొత్తం 31కి పెరిగింది. రాష్ట్రంలోని మొత్తం 16 జిల్లాల్లో దాదాపు 5,64,600 మందికి పైగా ప్రజలు ఈ వరదల బారిన పడ్డారు. శివసాగర్ జిల్లాలో గత 24 గంటల్లో 13 మంది ప్రాణాలు కోల్పోగా, చరైడియోలో ఐదుగురు, గోలాఘాట్లో ఇద్దరు, జోర్హాట్లో ఒకరు మరణించారు.
44 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 872 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. అత్యధికంగా శివసాగర్లో 3,59,535 మంది, జోర్హాట్లో 87,662 మంది, చరైడియోలో 72,646 మంది వరద ప్రభావానికి గురయ్యారు. బాధితుల సహాయార్థం 71 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయగా, వాటిలో 12,284 మంది ఆశ్రయం పొందుతున్నారు. వీరితో పాటు 202 రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు కూడా పనిచేస్తున్నాయి.
పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ నేరుగా రంగంలోకి దిగారు. చరైడియో, నజిరా, శివసాగర్, సోనారి, జోర్హాట్ మరియు ట్యోక్ తదితర అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలు, సహాయ శిబిరాలను సందర్శించి సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. వాయుసేన, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా సహాయక, రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.
వరద నీరు రైలు పట్టాలను ముంచెత్తడంతో వరుసగా రెండో రోజు కూడా రైలు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. శివసాగర్ జిల్లాలోని సిమలుగురి ప్రాంతంలో తీవ్రమైన వరద కారణంగా సిమలుగురి-నమ్టియాలి, సిమలుగురి-సెలెంఘాట్ మార్గాల్లో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఈశాన్య సరిహద్దు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి కపింజల్ కిషోర్ శర్మ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, ఈ ప్రత్యేక రైళ్లు శుక్రవారం వరకు అందుబాటులో ఉంటాయన్నారు తెలిపారు.
ఇది కూడా చదవండి: బాండీ బీచ్ హైదరాబాదీ ‘హీరో’కు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం!


