న్యూఢిల్లీ: ఒక వ్యక్తికి చెందిన పౌరసత్వ నిర్ధారణ అనేది రాజ్యాంగపరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమని, అందువల్ల ఈ ప్రక్రియ తప్పనిసరిగా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, హేతుబద్ధంగా సాగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసోంలోని వివిధ ‘ఫారినర్స్ ట్రిబ్యునళ్లు’ 27 మందిని విదేశీయులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పులను గతంలో గౌహతి హైకోర్టు సమర్థించింది. అయితే ఆ హైకోర్టు ఉత్తర్వులను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పక్కన పెట్టింది.
బాధితులు దాఖలు చేసిన 27 అప్పీళ్లను స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం వీటిపై నిష్పక్షపాతంగా సరికొత్త విచారణ జరపాలని సదరు ట్రిబ్యునళ్లకు కేసులను రిమాండ్ చేసింది. పౌరసత్వాన్ని తిరస్కరించే ప్రక్రియలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని కోర్టు పేర్కొంది. అదే సమయంలో చట్ట విరుద్ధంగా ఎవరూ భారత పౌరసత్వం పొందకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ధర్మాసనం గుర్తుచేసింది.
దేశ భద్రత, సరిహద్దుల అంశాల నెపంతో ప్రాథమిక న్యాయ ప్రక్రియను విస్మరించలేమని స్పష్టం చేసింది. అయితే, ఈ 27 కేసులలోని ఆధారాలు, పత్రాల యోగ్యతలపై తాము ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదని, ట్రిబ్యునళ్లే వీటిని స్వతంత్రంగా పరిశీలించాలని కోర్టు స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: 14 దేశాల దెబ్బకు డ్రాగన్ మైండ్ బ్లాక్!


