భారతీయ రైల్వేలోని ఎయిర్ కండిషన్డ్ (AC) కోచ్లలో ప్రయాణించే ప్రయాణికులు జనవరి 2022 మరియు మే 2026 మధ్య కాలంలో ఏకంగా 1.27 కోట్లకు పైగా దుప్పట్లు, తువ్వాళ్లు (బెడ్రోల్ వస్తువులను) దొంగిలించినట్లు సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్' చేసిన దర్యాప్తులో వెల్లడైంది. దీనివల్ల లినెన్ కాంట్రాక్టర్లకు రూ. 104 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
దేశంలోని 18 రైల్వే జోన్లలో 16 జోన్ల పరిధిలోని 54 రైల్వే డివిజన్ల నుండి సేకరించిన ఆర్టీఐ సమాధానాల ప్రకారం.. 2022 -2025 మధ్య కాలంలో లినెన్ వస్తువుల దొంగతనాలు 56 శాతం పెరిగాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిలిపివేసిన బెడ్రోల్ సేవలను జనవరి 2022లో పూర్తిగా పునరుద్ధరించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: ట్రంప్, నెతన్యాహుతో పాటు 13 మంది టార్గెట్? ఇరాన్ రివెంజ్ లిస్ట్ కలకలం
సాధారణంగా ఏసీ కోచ్లలో ప్రయాణించే వారికి రెండు బెడ్షీట్లు, ఒక బ్లాంకెట్ (కంబళి), ఒక దిండు, దిండు కవర్ ఒక ఫేస్ టవల్ (ముఖం తుడుచుకునే తువ్వాలు) ఉన్న బెడ్రోల్ కిట్ను అందిస్తారు. దొంగిలించబడిన వస్తువుల సంఖ్యను లెక్కగడితే.. ప్రతి 1,000 మంది ప్రయాణికులలో ఒకరు ఒక వస్తువును దొంగిలించినట్లు అవుతుంది. అయితే, నాలుగేళ్ల కాలంలో దొంగిలించబడిన వస్తువులలో ఫేస్ టవల్స్ మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ మొత్తం నష్టం రైల్వే అధికారులకు, కాంట్రాక్టర్లకు పెద్ద ఆందోళనగా మారింది.
బడాబాబులు కొట్టేసిన వస్తువుల వివరాలు:
ఫేస్ టవల్స్: 46.54 లక్షలు
బెడ్షీట్లు: 41.13 లక్షలు
దిండు కవర్లు: 23.59 లక్షలు
బ్లాంకెట్లు (కంబళ్లు): 12.95 లక్షలు
దిండ్లు: 2.76 లక్షలు (ఇవి పరిమాణంలో పెద్దవిగా ఉండటం వల్ల తక్కువగా దొంగిలించబడ్డాయి).
ఎక్కువగా దొంగతనాలు జరిగిన ప్రాంతాలు:
ఆర్టీఐ నివేదిక ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఈ దొంగతనాలు చాలా ఎక్కువగా జరిగాయి:
బికనీర్: 25.76 లక్షల వస్తువులతో అగ్రస్థానంలో ఉంది.
రాంచీ: 9.31 లక్షలు
ఢిల్లీ: 8.21 లక్షలు
ముంబై: 8.17 లక్షలు
జోధ్పూర్: 8.09 లక్షలు
అహ్మదాబాద్: 6.94 లక్షలు
ఈ భారం ఎవరికి?
కోచ్ల లోపల లినెన్ వస్తువుల సంరక్షణ బాధ్యత అంతా బెడ్రోల్స్ పంపిణీ చేసే కాంట్రాక్ట్ ఏజెన్సీదేనని రైల్వే ప్రతినిధి తెలిపారు. వస్తువులు కనిపించకుండా పోతే, వాటి స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేసే ఆర్థిక భారం పూర్తిగా కాంట్రాక్టరే భరించాల్సి ఉంటుంది. ఈ నిరంతర దొంగతనాల వల్ల తలెత్తే కొరతను అధిగమించడానికి అదనపు లినెన్ సెట్లను ఏర్పాటు చేయడం కాంట్రాక్టర్లకు పెద్ద సవాలుగా మారిందని అధికారులు పేర్కొన్నారు. దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి : 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?


