సరస్సులు మాయం, రిజర్వాయర్లు ఖాళీ | Bengaluru Water Crisis: Tech Capital Entirely At The Mercy Of Cauvery River | Sakshi
Sakshi News home page

సరస్సులు మాయం, రిజర్వాయర్లు ఖాళీ

Jul 13 2026 2:42 PM | Updated on Jul 13 2026 2:48 PM

Bengaluru Water Crisis: Tech Capital Entirely At The Mercy Of Cauvery River

దేశంలోని ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై వంటి ప్రధాన నగరాలు భారీ వర్షాలతో జలమయమై, వరదలతో అతలాకుతలమవుతుంటే, దేశ ఐటీ రాజధాని బెంగళూరు మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. తీవ్రమైన వర్షపాత లేమి, కరవు కోరల్లో చిక్కుకున్న ఈ మెట్రో నగరం భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక జలాశయాలు ఎండిపోవడంతో, కోట్లాది మంది జనాభా ఉన్న ఈ సిలికాన్ వ్యాలీ కేవలం ఒక్క కావేరి నదిపైనే ఆధారపడాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడింది. అసలు బెంగళూరును వేధిస్తున్న ఈ నీటి సంక్షోభం వెనుక ఉన్న అసలు నిజాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పడిపోతున్న వర్షపాతం.. 
ప్రస్తుత గణాంకాల ప్రకారం.. జూన్ 1 నుండి జూలై 9 మధ్య కాలంలో బెంగళూరు నగరంలో ఏకంగా 35 శాతం వర్షపాత లోటు నమోదైంది. అలాగే కర్ణాటక దక్షిణ అంతర్గత ప్రాంతంలో కూడా 24 శాతం తక్కువ వర్షపాతం రికార్డయ్యింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు ముంచెత్తుతున్నా, బెంగళూరులో మాత్రం ఆశించిన స్థాయిలో వానలు పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

మూడు నెలలకే నీళ్లు.. అధికారుల లెక్కలివే
నగరంలో వర్షాలు లేకపోయినా, బెంగళూరు జలమండలి మాత్రం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది. ప్రస్తుతం నగరానికి రాబోయే మూడు నుండి నాలుగు నెలల వరకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని భరోసా ఇస్తోంది. అయితే, అంతర్గతంగా భూగర్భ జలాలు భారీగా పడిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో అప్పుడే తీవ్రమైన నీటి ఎద్దడి మొదలైన విషయాన్ని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు.

600 మీటర్ల లిఫ్టింగ్.. 
బెంగళూరు నగరానికి అసలు నీరు ఎక్కడి నుండి వస్తుందనేది ఒక పెద్ద ఇంజనీరింగ్ అద్భుతం. నగరం సముద్ర మట్టానికి సుమారు 900 మీటర్ల ఎత్తులో ఉంది. కావేరి నది నుండి తోరకదానహళ్లి పంపింగ్ స్టేషన్ ద్వారా నీటిని సేకరించి, దాదాపు 500 నుండి 600 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసి పైప్‌లైన్ల ద్వారా నగరానికి తరలిస్తారు. ఇది దేశంలోనే అత్యంత ఎక్కువ విద్యుత్, వ్యయంతో కూడిన నీటి సరఫరా వ్యవస్థగా నిలిచింది.

ప్రధాన సరస్సులు ఖాళీ.. 
ఒకప్పుడు బెంగళూరు దాహాన్ని తీర్చిన అర్కావతి నదిపై నిర్మించిన చారిత్రక హెసరఘట్ట సరస్సు, తిప్పగొండనహళ్లి జలాశయాలు ఇప్పుడు మూలనపడ్డాయి. విపరీతమైన పట్టణీకరణ, అక్రమ ఆక్రమణలు, కాలుష్యం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఈ జలాశయాలకు నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల స్థానిక వనరులు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి.

సాగు నీటికే పరిమితమైన మంచనబేలె డ్యామ్
బెంగళూరుకు సమీపంలో, సుమారు 40 కిలోమీటర్ల దూరంలో అర్కావతి నదిపైనే ఉన్న మరొక రిజర్వాయర్ ‘మంచనబేలె’. అయితే, ఇది కేవలం నగరానికి ఒక అనుబంధ వనరుగా మాత్రమే ఉంది. దీనిలోని నీటిని తాగునీటి అవసరాల కంటే ఎక్కువగా చుట్టుపక్కల ప్రాంతాల వ్యవసాయ సాగు అవసరాల కోసమే ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. దీంతో తాగునీటి కోసం కావేరి వైపు చూడక తప్పడం లేదు.

రోజుకు 1500 మిలియన్ లీటర్లు
బెంగళూరు జలమండలి లెక్కల ప్రకారం.. నగరంలోని సుమారు 1.4 నుండి 1.5 కోట్ల మంది ప్రజల కోసం ప్రతిరోజూ 1,450 నుండి 1,500 మిలియన్ లీటర్ల శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఈ పంపిణీ నగరం మొత్తం సమానంగా లేదు. వారు నివసించే ప్రాంతాన్ని బట్టి నీటి లభ్యత మారుతోంది. ముంబై లాంటి నగరాలకు స్థానిక రిజర్వాయర్లు ఉన్నట్లు బెంగళూరుకు లేకపోవడమే ఇక్కడి అసలు సమస్య. కావేరి బేసిన్‌లో వర్షాలు పడితేనే ఐటీ రాజధాని గొంతు తడుస్తుంది.. లేదంటే ప్రమాద ఘంటికలు తప్పవు!

ఇది కూడా చదవండి: 14 దేశాల దెబ్బకు డ్రాగన్ మైండ్ బ్లాక్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement