25న పండరీపూర్లో వార్షిక ఆషాఢ ఏకాదశి ఉత్సవాలు
మహారాష్ట్ర నలుమూలలు, పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు, వార్కరీల రాక
ఈ నేపథ్యంలో 23 నుంచి 29 వరకూ పండరీపూర్ వెళ్లే అన్ని వాహనాలకూ చార్జీల మినహాయింపు
‘ఆషాఢ ఏకాదశి పాస్’తో టోల్ ఫ్రీగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం ప్రకటన
సాక్షి ముంబై: ఆషాఢ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పుణ్యక్షేత్రమైన పండరీపూర్కు వెళ్లే భక్తుల వాహనాలకు టోల్ ఫ్రీ సౌకర్యం కల్పించింది. దీంతో ఉత్సవాలకు రాకపోకలు సాగించే భక్తులకు ఎంతో ఊరట లభించింది. ఈ సౌకర్యం సొంత వాహనాల్లో వెళ్లే భక్తులతోపాటు టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు, అద్దె కార్లు, ఇతర పికప్ వాహనాలు సహా గ్రూపు బుకింగ్ చేసుకున్న మహరాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ (ఎమ్మెస్సార్టీసీ) బస్సులకు కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ముందు నుంచి ముగిసేవరకూ..
ఈ నెల 25న పండరీపూర్లో ఆషాఢ ఏకాదశి (Ashadi Ekadashi) ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల నుంచి భక్తులు పల్లకీలతో సహా కాలినడకన పక్షం రోజుల ముందే పండరీపూర్కు బయలుదేరతారు. ఏకాదశికి ముందు లేదా అదేరోజున అక్కడికి చేరుకుంటారు. కొందరు భక్తులు సొంత వాహనాల్లో మరికొందరు అద్దె వాహనాల్లో వస్తారు. దీంతో పండరీపూర్ సుమారు వారం రోజులపాటు భక్తులతో కిటకిటలాడుతుంది. ఉత్సవాలకు మూడు రోజుల ముందు నుంచి ముగిసేవరకు అంటే ఈ నెల 29 వరకు అన్ని రకాల వాహనాలకు టోల్ ఫ్రీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
పాస్ ఇలా పొందాలి...
అయితే ఈ సౌకర్యాన్ని పొందాలనుకునేవారు కొ న్ని నియమ, నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్ప ష్టం చేసింది. పండరీపూర్ వెళ్లే వాహనాలు ‘ఆషాఢి ఏకాదశి–2026’ అనే స్టిక్కర్ లేదా పాస్ కోసం ముందుగా స్ధానిక పోలీసు స్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రాఫిక్ ఫోలీసు శాఖ లేదా ప్రాంతీయ రవాణా కార్యాలయం అనమతి పొందాలి. ఈ స్టిక్కర్ లేదా పాస్ను వాహనం విండ్ షీల్డ్ (అద్దం ముందు భాగం) పై అతికించాలి. గ్రూపు బుకింగ్ చేసుకునే బస్సులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. అప్పుడే టోల్ నాకాల మీదుగా ఉచితంగా ఒకసారి వెళ్లి , తిరిగి రావడానికి (వన్ టైం) వీలుంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
చదవండి: బీజేపీ నాయకులపై రాజ్ఠాక్రే ధ్వజం
అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలి
ఇదిలాఉండగా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షం (Mumbai Rains) కారణంగా అనేక చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో ఉత్సవాలకు ముందే మరమ్మతులు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వాహనాల్లో వెళ్లే వారితోపాటు పల్లకీలతో కాలిబాటన వెళ్లే భక్తులు మార్గమధ్యంలో ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు, ఏర్పాట్లు చేయాలని సూచించింది. వాహనాలను క్రమబద్దీకరించేందుకు మార్గమధ్యలో ట్రాఫిక్ పోలీసులను నియమించాలని, రోడ్డు ప్రమాదానికి గురైన, రిపేర్లతో ఆగిపోయిన వాహనాలను తరలించేందుకు టోవింగ్ వ్యాన్లు అందుబాటులో ఉంచాలని స్ధానిక పోలీసు స్టేషన్లకు సూచించింది.


