టీసీఎస్‌ కేసు.. జైల్లో ప్రసవ వేదన భరించలేనిది! | TCS Case: Court Grants Bail to Pregnant Accused Cites Lord Krishnas Birth | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ కేసు.. జైల్లో ప్రసవ వేదన భరించలేనిది!

Jul 10 2026 10:15 AM | Updated on Jul 10 2026 10:47 AM

TCS Case: Court Grants Bail to Pregnant Accused Cites Lord Krishnas Birth

నాసిక్‌ టీసీఎస్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితురాలిగా అభియోగాలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్‌కు నాసిక్‌ లోకల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. జైలులోనే బిడ్డకు జన్మనివ్వాల్సి రావడం ఏ మహిళకైనా తీవ్రమైన వేదనతో కూడుకున్నదన్న కోర్టు.. ఈ సందర్భంగా శ్రీకృష్ణ జనన ప్రస్తావన తేస్తూ కీలక వ్యాఖ్యలు గమనార్హం. 

మహారాష్ట్రలోని నాసిక్‌ టీసీఎస్‌ కార్యాలయంలో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలకు సంబంధించిన కేసులో నిదా ఖాన్‌ నిందితురాలిగా ఉంది. ఈ కేసులో అరెస్టుల పర్వం మొదలయ్యాక ఆమె పరారయ్యింది. అయితే.. దాదాపు 25 రోజుల తర్వాత మే 7న ఆమెను ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఓ అద్దె ఇంటి నుంచి పోలీసులు అరెస్టు చేశారు. 

అయితే పరారీలో ఉన్న టైంలో తాను గర్భంతో ఉన్నానని.. ముందస్తు బెయిల్‌ కావాలని ఆమె వేసిన పిటిషన్‌ను నాసిక్‌ రోడ్‌ కోర్టు కొట్టేసింది. తాజాగా.. మరోసారి ఆమె గర్భధారణను ప్రధాన కారణంగా చూపిస్తూ బెయిల్‌ పిటిషన్‌ వేయగా.. జులై 6న బెయిల్‌ మంజూరు చేసింది. కోర్టు రూ.75 వేల వ్యక్తిగత బాండ్‌తో పాటు అదే మొత్తానికి ఒక పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది.

నిదా ఖాన్‌ బెయిల్‌ వాదనను పోలీసులు, బాధితుల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. లైంగిక దాడి, బలవంతపు మత మార్పిడి ఆరోపణలకు సంబంధించి దర్యాప్తులో తగిన ఆధారాలు లభించాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిదా ఖాన్‌ తరఫు న్యాయవాది రాహుల్‌ కస్లీవాల్‌ మాత్రం ఆమె నిర్దోషి అని, తప్పుడు కేసులో ఇరికించారని కోర్టుకు తెలిపారు. ఆమె ఉన్నత విద్యావంతురాలని, టీసీఎస్‌లో అసోసియేట్‌గా పనిచేసిందని పేర్కొన్నారు.

జైలులో ప్రసవం వేదన భరించలేనిది..
బెయిల్‌ తీర్పు సందర్భంగా అదనపు సెషన్స్‌ జడ్జి కేజీ జోషి తన ఉత్తర్వుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. “శ్రీకృష్ణుడి జననం జైల్లో జరిగింది. అలాంటి పరిస్థితుల మాదిరిగా ఓ బిడ్డకు జైలులో జన్మనివ్వాల్సి రావడం వల్ల కలిగే మానసిక వేదన, సామాజిక కళంకం ఏ మహిళకైనా తట్టుకోలేనిది. కాబట్టి పుట్టబోయే బిడ్డ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. అలాంటి బాధాకర పరిస్థితులను నివారించేందుకు న్యాయ విచక్షణను ఉపయోగించడం సముచితమని కోర్టు భావిస్తోంది అంటూ తీర్పు ఇచ్చారు. అంతేకాకుండా.. దర్యాప్తు పూర్తయి చార్జిషీట్‌ దాఖలైన నేపథ్యంలో ఆమెను జైలులో కొనసాగించడం వల్ల ప్రత్యేక ప్రయోజనం లేదని న్యాయస్థానం పేర్కొంది.

టీసీఎస్‌ కేసులో ఆరోపణలు ఏమిటి?
నాసిక్‌లోని టీసీఎస్‌ యూనిట్‌లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు, మత మార్పిడికి ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలపై పోలీసులు మొత్తం తొమ్మిది కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిదా ఖాన్‌కు సంబంధించిన కేసులో.. మతపరమైన విషయాలతో ప్రభావితం చేయడం, బురఖా, మత గ్రంథాలు ఇవ్వడం, బాధితురాలి మొబైల్‌లో కొన్ని అప్లికేషన్లు ఇన్‌స్టాల్‌ చేయడం, నమాజ్‌ నేర్పించడం, హిజాబ్‌ ధరించే విధానం వివరించడం వంటి ఆరోపణలు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లతో పాటు.. బాధితురాలు దళితురాలు కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.

టీసీఎస్‌ వివరణ
ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత టీసీఎస్‌.. వేధింపులు, బలవంతపు చర్యల విషయంలో తమ సంస్థకు జీరో టాలరెన్స్‌ విధానం(ఉపేక్షించేది లేదని) ఉందని స్పష్టం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను సస్పెండ్‌ చేసినట్లు తెలిపింది.

శ్రీకృష్ణుడు దేవకి–వసుదేవులకు మధుర కారాగారంలో జన్మించాడు. కంసుడి నుంచి రక్షించేందుకు వసుదేవుడు ఆయనను గోకులానికి తీసుకెళ్లగా.. నందుడు, యశోద దంపతులు పెంచి పెద్ద చేశారు. అందుకే శ్రీకృష్ణుడిని జన్మనిచ్చిన తల్లి పేరుతో దేవకీనందనుడు, పెంచిన తల్లి–తండ్రుల పేర్లతో యశోదానందనుడు, నందలాలా అని కూడా పిలుస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement