హర్యానాలోని గురుగ్రామ్లో గతరాత్రి హైటెన్షన్ ఎన్కౌంటర్ జరిగింది. ఓ వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులకు పాల్పడి తప్పించుకునేందుకు ప్రయత్నించిన గ్యాంగ్స్టర్లను పోలీసులు మట్టుబెట్టారు. సుశాంత్ లోక్ ఫేజ్-2 ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మృతి చెందగా.. మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా గాయాలపాలయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుశాంత్ లోక్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ ప్రముఖ వ్యాపారవేత్తకు కొంతకాలంగా దీపక్నందల్ గ్యాంగ్ నుంచి బెదిరింపు సందేశాలు వస్తున్నాయి. అయితే ఆయన వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో.. బుధవారం రాత్రి కొందరు దుండగులు ఆయన నివాసంపై కాల్పులకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కాల్పుల సమాచారం అందుకున్న క్రైమ్ బ్రాంచ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. దీంతో ఆ గ్యాంగ్ పారిపోయే ప్రయత్నం చేసింది. ఈలోపు.. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ స్కార్పియో వాహనంలో నిందితులు ఆయుధాలతో ఉన్నట్లు గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అలా చాలా దూరం చేజ్ చేసుకుంటూ వెళ్లారు.
లొంగిపోకుండా కాల్పులు..
పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ.. నిందితులు ఆధునిక ఆయుధాలతో కాల్పులు ప్రారంభించారని అధికారులు తెలిపారు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు నిందితులకు బుల్లెట్ గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ నలుగురు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మరో నిందితుడు చికిత్స పొందుతున్నాడు.
విదేశాల్లో ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్న గ్యాంగ్స్టర్ దీపక్ నందల్కు చెందిన షూటర్లుగా వీరిని పోలీసులు గుర్తించారు. నందల్ గ్యాంగ్ హరియాణా, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడుతున్న నేర ముఠాగా పోలీసుల రికార్డుల్లో ఉన్నట్లు సమాచారం. వ్యాపారవేత్తలు, ప్రముఖులను టార్గెట్ చేసి బెదిరింపు సందేశాలు పంపడం, డబ్బులు డిమాండ్ చేయడం వంటి కార్యకలాపాల్లో ఈ గ్యాంగ్ సభ్యుల ప్రమేయంపై దర్యాప్తు జరుగుతోంది. విదేశాల నుంచి ఆపరేషన్లు నడుపుతూ స్థానిక షూటర్ల ద్వారా దాడులు చేయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్కౌంటర్ అనంతరం నిందితుల నేర చరిత్ర, గ్యాంగ్ నెట్వర్క్, ఆయుధాల సరఫరా మార్గాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
#WATCH | Gurugram, Haryana: Visuals from Sushant Lok in Gurugram where four shooters of the foreign-based Deepak Nandal gang were killed and one was injured during a police encounter.
The miscreants had arrived to open fire at the residence of SGT University founder's son over… pic.twitter.com/nOsa9J1Jhh— ANI (@ANI) July 10, 2026
పోలీసులకు కూడా గాయాలు
ఎన్కౌంటర్లో ముగ్గురు క్రైమ్ బ్రాంచ్ సిబ్బందికి తూటా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన అనంతరం ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించాయి. స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, నిందితుల నేర చరిత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటు గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
భయపెట్టే గ్యాంగ్లకు చెక్
ప్రజల్లో భయాందోళనలు సృష్టించే నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని గురుగ్రామ్ పోలీసులు స్పష్టం చేశారు. వ్యాపారవేత్తల నుంచి బెదిరింపుల ద్వారా డబ్బులు వసూలు చేసే గ్యాంగ్లపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.


