గౌహతి: అస్సాం రాష్ట్రంలో ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకునే (బహుభార్యాత్వం) సంస్కృతికి వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. బహుభార్యాత్వాన్ని అవలంబించే వ్యక్తులకు ఇకపై ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవని, అలాగే ఈ పద్ధతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసు నుండి శాశ్వతంగా తొలగిస్తామని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదనలు ప్రవేశపెట్టింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి జయంత మల్లా బారువా మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు కేవలం అర్హులకు చేరడమే కాకుండా, సమాజంలో సమగ్రత, నైతిక విలువలను పెంపొందించేలా ఉండాలని స్పష్టం చేశారు. మహిళా సాధికారత, లింగ న్యాయాన్ని పెంపొందించే లక్ష్యంతో.. ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునే ఏ పురుషుడు కూడా ఇకపై ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు అర్హుడు కాడని ఆయన ప్రకటించారు.
ఈ కొత్త విధానంలో భాగంగా 'అస్సాం సర్వీసెస్ (డిసిప్లిన్ అండ్ అప్పీల్) రూల్స్, 1964' కు సవరణలు చేయాలని బడ్జెట్ ప్రతిపాదించింది. దీని ప్రకారం, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకుంటే, చట్టప్రకారం వారిని ఉద్యోగం నుండి నేరుగా తొలగిస్తారు.
సమాజంలో బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని పెంపొందించడానికి, ఏదైనా క్రిమినల్ చట్టం కింద నేరస్థుడిగా తేలిన వ్యక్తికి కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంక్షేమ పథకాల ప్రయోజనాలను నిలిపివేయాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.


