లోక్ అదాలత్‌కు జ్ఞానవాపి, మథుర.. ‘సుప్రీం’ కీలక నిర్ణయం! | Supreme Court Refers Key Religious Disputes to Special Lok Adalat | Sakshi
Sakshi News home page

లోక్ అదాలత్‌కు జ్ఞానవాపి, మథుర.. ‘సుప్రీం’ కీలక నిర్ణయం!

Jul 13 2026 10:24 AM | Updated on Jul 13 2026 10:26 AM

Supreme Court Refers Key Religious Disputes to Special Lok Adalat

న్యూఢిల్లీ: దేశంలో వివాదాస్పదంగా మారిన జ్ఞానవాపి మసీదు, మథుర శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు, సంభాల్ హరిహర మందిరం-మసీదు కేసులను సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్ అదాలత్‌కు బదిలీ చేసింది. సుదీర్ఘ కోర్టు వ్యాజ్యాల కంటే చర్చల ద్వారా సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనేందుకు ఆగస్టు 21 నుంచి 23 వరకు సుప్రీంకోర్టు ప్రాంగణంలో ‘సమాధాన్ సమారోహ్‌’ పేరిట ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇరుపక్షాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

గత ఏప్రిల్ 21 నుంచే కింది కోర్టుల్లో ముందస్తు రాజీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జూలై 14న వారణాసిలో జ్ఞానవాపి కేసుపై ముందస్తు విచారణ జరగనుంది. కాగా మథుర వివాదంలో జూలై 5న జరిగిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు విఫలం కావడంతో, సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని ప్రత్యేక లోక్ అదాలత్ పరిధిలోకి తెచ్చింది.

మొఘల్ కాలంలో ఆలయాలను కూల్చివేసి ఈ మసీదులను నిర్మించారంటూ హిందూ పక్షాలు కోర్టులను ఆశ్రయించగా, 1991 నాటి ఆరాధనా స్థలాల చట్టం ప్రకారం ఈ పిటిషన్లు చెల్లవని ముస్లిం పక్షాలు వాదిస్తున్నాయి. గత ఏడాది సంభాల్‌ మసీదు సర్వే ఉద్రిక్తతలకు దారితీసి, పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూడు వివాదాల్లోని చట్టపరమైన అంశాలను సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement