కృత్రిమ మేధతో సృష్టించిన తీర్పును ఆధారంగా చేసుకుని తీర్పునివ్వడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో కేసుల విచారణ సందర్భంగా కృత్రిమ మేధ(ఏఐ) సృష్టించిన కల్పిత తీర్పు కాపీలను ఆధారంగాచేసుకుని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్(ఎన్సీఎల్టీ) ఇటీవల ఒక తీర్పు ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం విస్మయం వ్యక్తంచేసింది. న్యాయస్థానాల్లో ఇలాంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏఐ సష్టించిన తప్పుడు తీర్పులను న్యాయవాదులు కోర్టుల ముందుంచడం వృత్తిపరమైన దు్రష్పవర్తన కిందకే వస్తుందని తేల్చిచెప్పమంది.
అలాగే, వాటిపై ఆధారపడి న్యాయమూర్తులు నిర్ణయాలు తీసుకోవడం తీవ్రమైన తప్పిదమని, అటువంటి తీర్పులు చట్టం దృష్టిలో ఏమాత్రం చెల్లవని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా కృత్రిమమేధ సృష్టించిన తీర్పు కాపీని ఎన్సీఎల్టీ వాస్తవమైన తీర్పుగా భావించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటివి చేయడమంటే చట్టానికి మిౖథెల్ ఐసోసైనేట్(సైనేడ్)ను ఇచ్చినట్లు అవుతుంది. ఇవి చట్టం, న్యాయవ్యవస్థలోకి చొరబడితే ఇవి చొరబడినట్లుకూడా ఎవరూ కనిపెట్టలేరు.
గుర్తించడానికి వీల్లేకుండా అదృశ్యంగా, అంతర్గతంగా ఉంటూ అత్యంత దారుణాలకు కారణమవుతాయి. ఇవి న్యాయవ్యవస్థను కలుషితం చేయడమేకాదు యావత్ న్యాయవ్యవస్థ అంకితభావంలోని ఆత్మను చంపేస్తాయి’’అని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ‘‘అసలు ఇలాంటి తీర్పు నిజంగా ఉందో లేదో సరిచూసుకోకుండా న్యాయవాదులు తమ కేసుల పత్రాలకు వీటిని జతచేయడం అత్యంత బాధ్యతారాహిత్యం. ఇలాంటి వాటిని కోర్టులు ఏమాత్రం ఉపేక్షించకూడదు. ఇలాంటి కల్పిత, ఊహాత్మక, ఊహాజనిత తీర్పు కాపీలను వాస్తవమైనవిగా భావించి న్యాయమూర్తి సైతం తీర్పు చెబితే అక్కడ సైతం న్యాయవితరణ లోపించినట్లే భావించాలి. కోర్టుల దృష్టిలో ఇలాంటి తీర్పులు అసలు తీర్పులే కావు. ఇలాంటి కల్పిత తీర్పు కాపీలు న్యాయవ్యవస్థలో చొరబడితే న్యాయవ్యవస్థ పవిత్రతకు భంగం వాటిల్లుతుంది’’అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
మార్గదర్శకాలు రూపొందించండి
న్యాయ నిర్ణయ ప్రక్రియ పవిత్రతను కాపాడేందుకు, తప్పుల తడకగా ఉన్న కల్పిత తీర్పుల ఆధారంగా ముంబైలోని ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఉనికిలో లేని ఏఐ కల్పిత తీర్పులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించే న్యాయవాదులపై తీసుకునే క్రమశిక్షణా చర్యలతో సహా కచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది.


